కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

32వ కథ

పది తెగుళ్ళు

పది తెగుళ్ళు

ఇక్కడున్న చిత్రాలను చూడండి. వాటిలో ప్రతీది యెహోవా ఐగుప్తుపైకి రప్పించిన ఒక్కొక్క తెగులును చూపిస్తోంది. మొదటి చిత్రంలో అహరోను తన కర్రతో నైలునదిని కొట్టడాన్ని చూడవచ్చు. ఆయన అలా కొట్టగానే నీరు రక్తంగా మారింది. చేపలు చనిపోవడంతో నది కంపు కొట్టింది.

తర్వాత, యెహోవా నైలు నది నుండి కప్పలు పైకి వచ్చేలా చేశాడు. ఎక్కడ చూసినా అవే—పొయ్యిల దగ్గర, రొట్టెలు కాల్చుకునే పెంకలమీద, పడకలమీద—ఎక్కడ చూసినా అవే. కప్పలు చచ్చిపోయినప్పుడు ఐగుప్తీయులు వాటిని కుప్పలు కుప్పలుగా పోగు చేశారు. దేశమంతా దుర్వాసనతో నిండిపోయింది.

ఆ తర్వాత అహరోను తన కర్రతో నేలను కొట్టాడు. ధూళంతా పేలుగా మారింది. అవి గాలిలో ఎగురుతూ కుట్టే చిన్న పేలు. ఆ పేలు ఐగుప్తు దేశం మీదికి వచ్చిన మూడవ తెగులు.

తర్వాత వచ్చిన తెగుళ్ళు కేవలం ఐగుప్తీయుల మీదికే వచ్చాయి గానీ ఇశ్రాయేలీయుల మీదికి రాలేదు. నాలుగవ తెగులులో ఐగుప్తీయుల ఇళ్ళు పెద్ద ఈగలతో నిండిపోయాయి. ఐదవ తెగులు జంతువుల మీదికి వచ్చింది. ఐగుప్తీయుల పశువులు, గొర్రెలు, మేకలు ఎన్నో చచ్చిపోయాయి.

ఆ తర్వాత మోషే అహరోనులు కొంత బూడిదను తీసుకొని గాల్లోకి విసిరారు. అది జంతువులకు, ప్రజలకు పుండ్లు వచ్చేలా చేసింది. అది ఆరవ తెగులు.

ఆ తర్వాత మోషే తన చేతిని ఆకాశము వైపుకు ఎత్తగానే యెహోవా ఉరుములను వడగండ్లను పంపాడు. అది ఐగుప్తులో అంతకుముందెన్నడూ రానంత గొప్ప వడగండ్ల తుఫాను.

ఎనిమిదవ తెగులు పెద్ద గుంపులుగా వచ్చి పడిన మిడతలు. అంతకుముందు లేదా ఆ తర్వాత ఎప్పుడూ అన్ని మిడతలు రాలేదు. వడగండ్లవల్ల నాశనం కాకుండా మిగిలిన వాటినన్నిటిని అవి తినేశాయి.

తొమ్మిదవ తెగులు చీకటి. మూడురోజులు దేశాన్నంతటిని గాఢాంధకారం కమ్ముకుంది. కానీ ఇశ్రాయేలీయులు నివసించే చోట మాత్రం వెలుగు ప్రకాశించింది.

చివరగా, దేవుడు తన ప్రజలకు తమ ద్వారబంధాలపై గొర్రెపిల్ల రక్తాన్ని లేక మేకపిల్ల రక్తాన్ని చల్లమన్నాడు. ఆ తర్వాత దేవదూత ఐగుప్తు దేశమంతటా సంచరించాడు. దేవదూత ద్వారబంధంపై రక్తాన్ని చూసినప్పుడు ఆ ఇంట్లో ఎవరినీ చంపలేదు. ద్వారబంధాలపై రక్తంలేని ఇళ్ళలో మనుష్యులలోను, జంతువులలోను తొలి సంతానాన్ని దేవదూత చంపేశాడు. అదే పదవ తెగులు.

ఆ చివరి తెగులు తర్వాత ఫరో ఇశ్రాయేలీయులను పొమ్మన్నాడు. దేవుని ప్రజలు వెళ్ళడానికి పూర్తిగా సిద్ధపడి, ఆ రాత్రే ఐగుప్తునుండి బయలుదేరారు.