కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

42వ కథ

గాడిద మాట్లాడడం

గాడిద మాట్లాడడం

మీరు ఎప్పుడైనా గాడిద మాట్లాడడాన్ని విన్నారా? ‘లేదు, జంతువులు మాట్లాడలేవు’ అని మీరు అనవచ్చు. అయితే అలా మాట్లాడిన ఒక గాడిద గురించి బైబిలు చెబుతోంది. అది ఎలా జరిగిందో చూద్దాం.

ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలీయులంటే భయపడ్డాడు. కాబట్టి అతను ఇశ్రాయేలీయులను శపించమని చెప్పి బిలాము అనే ఒక తెలివైన వ్యక్తికి కబురు పంపించాడు. బాలాకు బిలాముకు ఎక్కువ డబ్బు ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు. కాబట్టి బిలాము తన గాడిద ఎక్కి బాలాకును కలవడానికి బయలుదేరాడు.

తన ప్రజలను బిలాము శపించడం యెహోవాకు ఇష్టంలేదు. కాబట్టి ఆయన బిలామును ఆపడానికి ఒక పెద్ద ఖడ్గం పట్టుకొని దారిలో నిలబడమని ఒక దూతను పంపించాడు. బిలాము ఆ దూతను చూడలేకపోయాడు కానీ అతని గాడిద మాత్రం చూసింది. గాడిద దూతను తప్పించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించి, చివరకు అలా చేయలేక దారిలోనే కూర్చుండి పోయింది. బిలాముకు చాలా కోపం వచ్చి తన గాడిదను కర్రతో కొట్టాడు.

అప్పుడు యెహోవా, బిలాము తన గాడిద మాట్లాడడాన్ని వినేలా చేశాడు. ‘నేను నిన్ను ఏమి చేశానని నువ్వు నన్ను కొడుతున్నావు?’ అని గాడిద అడిగింది.

‘నేను ఒక మూర్ఖుడిలా కనిపించేలా చేశావు. నా దగ్గర ఖడ్గం ఉంటే నిన్ను చంపి ఉండేవాడిని!’ అని బిలాము అన్నాడు.

‘నేను ముందు ఎప్పుడైనా ఇలా చేశానా?’ అని గాడిద అడిగింది.

‘లేదు’ అన్నాడు బిలాము.

అప్పుడు యెహోవా, దారిలో ఖడ్గం పట్టుకొని నిలబడివున్న దూత బిలాముకు కనిపించేలా చేశాడు. దూత బిలాముతో, ‘నువ్వు నీ గాడిదను ఎందుకు కొట్టావు? నువ్వు ఇశ్రాయేలీయులను శపించడానికి వెళ్ళకూడదు కాబట్టే నేను నీ మార్గాన్ని అడ్డుకోవడానికి వచ్చాను. నీ గాడిద నా దగ్గరనుండి వెళ్ళకపోతే నేను నిన్ను చంపి ఉండేవాడిని. కానీ నీ గాడిదను మాత్రం నేను చంపేవాడిని కాదు’ అని అన్నాడు.

‘నేను పాపము చేశాను. నువ్వు దారిలో నిలబడి ఉన్నావని నాకు తెలియదు’ అని బిలాము అన్నాడు. ఆ తర్వాత దూత బిలామును వెళ్ళనిచ్చాడు. బిలాము బాలాకును కలవడానికి వెళ్ళాడు. అప్పటికి కూడా అతను ఇశ్రాయేలీయులను శపించడానికి ప్రయత్నించాడు. అయితే దానికి బదులు అతను వాళ్ళను మూడుసార్లు దీవించేలా యెహోవా చేశాడు.