కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

52వ కథ

గిద్యోను, అతని 300 మంది పురుషులు

గిద్యోను, అతని 300 మంది పురుషులు

ఇక్కడ ఏమి జరుగుతుందో చూస్తున్నారా? వాళ్ళంతా ఇశ్రాయేలు యుద్ధ యోధులు. క్రిందకు వంగిన పురుషులు నీళ్ళు త్రాగుతున్నారు. వాళ్ళ దగ్గర నిలబడివున్న వ్యక్తి న్యాయాధిపతియైన గిద్యోను. ఆయన వాళ్ళు నీళ్ళు ఎలా త్రాగుతున్నారో గమనిస్తున్నాడు.

ఆ పురుషులు వేర్వేరు పద్ధతుల్లో నీళ్ళు ఎలా త్రాగుతున్నారో గమనించండి. కొంతమంది తమ ముఖాలను నీళ్ళవరకు పెట్టారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన చుట్టూ జరిగేవాటిని గమనించడానికి వీలుగా నీళ్ళను చేతిలోకి తీసుకొని త్రాగుతున్నాడు. అలా చేయడం ప్రాముఖ్యం, ఎందుకంటే నీళ్ళు త్రాగేటప్పుడు తమ చుట్టూ జరుగుతున్నవాటిని గమనించే పురుషులను మాత్రమే ఎన్నుకోమని యెహోవా గిద్యోనుకు చెప్పాడు. మిగతావాళ్ళను ఇంటికి పంపించమని దేవుడు చెప్పాడు. ఎందుకో చూద్దాం.

ఇశ్రాయేలీయులు మళ్ళీ చాలా కష్టాల్లో చిక్కుకున్నారు. దానికి కారణం వాళ్ళు యెహోవాకు విధేయత చూపించకపోవడమే. మిద్యానీయులు వాళ్ళపై ఆధిపత్యం సంపాదించుకొని వాళ్ళను బాధించడం ప్రారంభించారు. కాబట్టి తమకు సహాయం చేయమని ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టుకున్నారు, యెహోవా వాళ్ళ మొర విన్నాడు.

యెహోవా గిద్యోనుతో సైన్యాన్ని సమకూర్చమని చెప్పినప్పుడు గిద్యోను 32,000 మంది యోధులను సమకూర్చాడు. అయితే ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఉన్న సైన్యంలో 1,35,000 మంది పురుషులు ఉన్నారు. అయినా యెహోవా గిద్యోనుతో ‘నీకు చాలామంది పురుషులున్నారు’ అని అన్నాడు. యెహోవా అలా ఎందుకు అన్నాడు?

ఎందుకంటే ఒకవేళ ఇశ్రాయేలీయులు యుద్ధాన్ని జయిస్తే, వాళ్ళు తమకై తామే జయించామని అనుకోవచ్చు. యుద్ధంలో జయించడానికి తమకు యెహోవా సహాయం అవసరం లేదని వాళ్ళు అనుకోవచ్చు. అందుకే యెహోవా గిద్యోనుతో, ‘యుద్ధం చేయడానికి భయపడే వాళ్ళందరినీ ఇళ్ళకు వెళ్ళమని చెప్పు’ అన్నాడు. గిద్యోను అలా చెప్పినప్పుడు, 22,000 మంది వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన దగ్గర 1,35,000 మందితో పోరాడడానికి కేవలం 10,000 మంది మాత్రమే మిగిలారు.

అయితే, వినండి! యెహోవా మళ్ళీ గిద్యోనుతో ‘నీ దగ్గర ఇంకా ఎక్కువమందే ఉన్నారు’ అన్నాడు. కాబట్టి వాళ్ళందరిని నీళ్ళు త్రాగడానికి వాగు దగ్గరకు తీసుకెళ్ళి, నీళ్ళవరకూ ముఖం పెట్టి త్రాగేవారిని ఇంటికి పంపించమని యెహోవా గిద్యోనుకు చెప్పాడు. ‘నీళ్ళు త్రాగుతున్నప్పుడు తమ చుట్టూ జరుగుతున్నవాటిని గమనించే 300 మంది పురుషులతోనే నేను నీకు విజయాన్ని కలుగజేస్తాను’ అని యెహోవా వాగ్దానం చేశాడు.

యుద్ధం చేసే సమయం వచ్చింది. గిద్యోను తన 300 మంది పురుషులను మూడు గుంపులుగా ఏర్పాటు చేశాడు. ఆయన వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బూరను, లోపల దివిటీగల ఒక కుండను ఇచ్చాడు. దాదాపు మధ్యరాత్రి అయినప్పుడు వాళ్ళంతా శత్రు సైన్య శిబిరాన్ని చుట్టుముట్టారు. తర్వాత వాళ్ళంతా ఒకేసారి బూరలను ఊది, కుండలను పగులగొట్టి ‘యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము!’ అని కేకలు వేశారు. శత్రు సైనికులు లేచినప్పుడు వాళ్ళు కలవరపడి భయపడ్డారు. వాళ్ళంతా పరుగెత్తడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు యుద్ధాన్ని జయించారు.