కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

115వ అధ్యాయం

యేసు చివరి పస్కాను ఆచరించే సమయం దగ్గరపడింది

యేసు చివరి పస్కాను ఆచరించే సమయం దగ్గరపడింది

మత్తయి 26:1-5, 14-19 మార్కు 14:1, 2, 10-16 లూకా 22:1-13

  • యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూదా డబ్బు తీసుకున్నాడు

  • ఇద్దరు అపొస్తలులు పస్కా ఏర్పాట్లు చూసుకున్నారు

యేసు ఒలీవల కొండ మీద తన భవిష్యత్‌ ప్రత్యక్షత గురించి, వ్యవస్థ ముగింపు గురించి అపొస్తలులు అడిగిన ప్రశ్నకు జవాబివ్వడం పూర్తయింది.

నీసాను 11 మంగళవారం రోజున యేసు తీరిక లేకుండా గడిపాడు. రాత్రికి ఆయన, ఆయన అపొస్తలులు బేతనియకు తిరిగెళ్తున్నారు. బహుశా ఆ సమయంలో యేసు వాళ్లకు ఇలా చెప్పివుంటాడు: “ఇక రెండు రోజుల్లో పస్కా పండుగ వస్తుందని, మానవ కుమారుణ్ణి కొయ్య మీద శిక్షించడానికి ఆయన్ని శత్రువుల చేతికి అప్పగిస్తారని మీకు తెలుసు.”—మత్తయి 26:2.

మంగళవారం రోజున ఆయన మతనాయకుల్ని అందరిముందు ఖండించాడు, వాళ్ల చెడుతనాన్ని బయటపెట్టాడు. దాంతో వాళ్లు ఆయన్ని చంపాలని చూశారు. అందుకే నీసాను 12 బుధవారం రోజున యేసు ఎవ్వరికీ కనిపించకుండా తన అపొస్తలులతోనే ఉండివుంటాడు. తర్వాతి రోజు సాయంత్రం సూర్యాస్తమయంతో మొదలయ్యే నీసాను 14న తన అపొస్తలులతో కలిసి పస్కా ఆచరించడానికి ఏ ఆటంకం రాకూడదని ఆయన అలా చేశాడు.

కానీ ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు మాత్రం పస్కా పండుగ దగ్గరపడుతున్నా ఆయన్ని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారు. వాళ్లు ప్రధానయాజకుడైన కయప ఇంటి ఆవరణలో కలుసుకున్నారు. ఎందుకు? యేసు తమ చెడుతనాన్ని బయటపెడుతున్నందుకు వాళ్లు చాలా కోపంగా ఉన్నారు. వాళ్లంతా కలిసి “యేసును కుయుక్తితో బంధించి చంపడానికి” కుట్ర పన్నుతున్నారు. మరి వాళ్లు ఎప్పుడు, ఎలా ఆయన్ని పట్టుకుంటారు? “పండుగ సమయంలో వద్దు, లేదంటే ప్రజల్లో అలజడి రేగుతుంది” అని వాళ్లు అనుకున్నారు. (మత్తయి 26:4, 5) చాలామంది ప్రజలు యేసును నమ్ముతున్నారు కాబట్టి వాళ్లు ప్రజలకు భయపడ్డారు.

ఈలోపు ఒకతను ఆ మతనాయకుల్ని కలవడానికి వచ్చాడు. అతను మరెవరో కాదు, యేసు అపొస్తలుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా. తన యజమానికి నమ్మకద్రోహం చేసేలా సాతాను అతన్ని ప్రేరేపించాడు. యూదా ఆ మతనాయకుల్ని ఇలా అడిగాడు: “ఆయన్ని మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు?” (మత్తయి 26:15) వాళ్లు సంతోషించి, “అతనికి వెండి నాణేలు ఇస్తామని చెప్పారు.” (లూకా 22:5) ఎన్ని? 30 వెండి నాణేలు. అప్పట్లో ఒక దాసుని ఖరీదు 30 షెకెల్‌లు. (నిర్గమకాండం 21:32) ఆ మతనాయకులు యేసును ఎంత హీనంగా, విలువలేని వాడిగా చూస్తున్నారో దాన్నిబట్టి అర్థమౌతుంది. యూదా ఇక అప్పటినుండి, “చుట్టూ జనం లేనప్పుడు యేసును వాళ్లకు అప్పగించడానికి సరైన అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు.”—లూకా 22:6.

బుధవారం సూర్యాస్తమయంతో నీసాను 13 మొదలైంది. యేసు రాత్రివేళ బేతనియలో ఉండడం అది ఆరో రోజు, ఆఖరి రోజు కూడా. తర్వాతి రోజు, పస్కాకు సంబంధించిన చివరి ఏర్పాట్లు చేయాలి. ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి, దాన్ని వధించి, నీసాను 14 మొదలైన తర్వాత దాన్ని పూర్తిగా కాల్చాలి. మరి వాళ్లు పస్కా భోజనం ఎక్కడ చేస్తారు? దాన్ని ఎవరు సిద్ధం చేస్తారు? ఆ వివరాలేమీ యేసు అపొస్తలులకు చెప్పలేదు. అందుకే, యూదా ఆ వివరాల్ని ముఖ్య యాజకులకు చెప్పలేకపోయాడు.

బహుశా గురువారం మధ్యాహ్నం, పేతురు యోహానులను బేతనియ నుండి పంపిస్తూ యేసు ఇలా చెప్పాడు: “మీరు వెళ్లి, మనం తినడానికి పస్కా భోజనం సిద్ధం చేయండి.” అప్పుడు వాళ్లు, “మమ్మల్ని ఎక్కడ సిద్ధం చేయమంటావు?” అని అడిగారు. ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు నగరంలో అడుగుపెట్టినప్పుడు, నీళ్లకుండ మోసుకెళ్తున్న ఒకతను మీకు ఎదురౌతాడు. అతను వెళ్లే ఇంటికి మీరూ అతని వెనక వెళ్లండి. వెళ్లాక, ఆ ఇంటి యజమానితో, ‘“నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి గది ఎక్కడుంది?” అని బోధకుడు నిన్ను అడుగుతున్నాడు’ అని చెప్పండి. అప్పుడతను కావాల్సిన వస్తువులన్నీ ఉన్న పెద్ద మేడగది చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి.”—లూకా 22:8-12.

ఆ ఇంటి యజమాని ఖచ్చితంగా యేసు శిష్యుడే అయ్యుంటాడు. పస్కా కోసం యేసు తన ఇంటిని అడిగితే బాగుండని అతను ఎదురుచూస్తుండవచ్చు. పేతురు యోహానులు యెరూషలేముకు వెళ్లగానే, అంతా యేసు చెప్పినట్లే జరగడం చూశారు. దాంతో వాళ్లు గొర్రెపిల్లను సిద్ధం చేశారు, అలాగే యేసుకు, 12 మంది అపొస్తలులకు అంటే మొత్తం 13 మందికి సరిపోయేలా పస్కా భోజన ఏర్పాట్లు చేశారు.