కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 15

యెహోవా ఎప్పుడూ యోసేపును మర్చిపోలేదు

యెహోవా ఎప్పుడూ యోసేపును మర్చిపోలేదు

యోసేపు జైల్లో ఉన్నప్పుడు, ఐగుప్తు రాజైన ఫరోకు కొన్ని కలలు వచ్చాయి. ఎవ్వరూ వాటి అర్థం చెప్పలేకపోయారు. యోసేపు ఆ కలలకు అర్థాన్ని చెప్పగలడని ఫరో సేవకుల్లో ఒకరు అతనితో అన్నారు. వెంటనే యోసేపును తీసుకుని రమ్మని ఫరో సేవకులను పంపిస్తాడు.

ఫరో ఇలా అడుగుతాడు: ‘నువ్వు నా కలలకు అర్థం చెప్పగలవా?’ యోసేపు ఫరోతో ఇలా అన్నాడు: ‘ఐగుప్తులో ఏడు సంవత్సరాలు బాగా పంటలు పండుతాయి, తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది. కరువులో ప్రజలకు తినడానికి ఆహారం ఉండేలా, పండిన పంటను దాచిపెట్టడానికి తెలివైన వాళ్లను ఒకర్ని చూసి పెట్టండి.’ అప్పుడు ఫరో ఇలా అన్నాడు: ‘నేను నిన్నే పెడతాను! ఐగుప్తులో నా తర్వాత స్థానంలో నువ్వే ఉండాలి!’ ఫరో కలల అర్థాన్ని యోసేపు ఎలా చెప్పాడు? యెహోవా సహాయంతో చెప్పగలిగాడు.

అప్పటినుండి ఏడు సంవత్సరాల వరకు యోసేపు ఆహారాన్ని నిల్వచేశాడు. ఆ తర్వాత, యోసేపు చెప్పినట్లే భూమంతా కరువు వచ్చింది. ప్రజలు అన్నిచోట్ల నుండి ఆహారం కొనడానికి యోసేపు దగ్గరకు వచ్చారు. అతని నాన్న యాకోబు ఐగుప్తులో ఆహారం ఉందని విని తన పదిమంది కొడుకులను ఆహారం కొనడానికి అక్కడకు పంపిస్తాడు.

యాకోబు కొడుకులు యోసేపు దగ్గరకు వెళ్లినప్పుడు, ఆయన వెంటనే వాళ్లను గుర్తుపడతాడు. కానీ అతను యోసేపు అని వాళ్లు తెలుసుకోలేకపోతారు. చిన్నప్పుడు యోసేపుకు కలలో వచ్చినట్లే వాళ్లు ఆయనకు వంగి నమస్కారం చేస్తారు. వాళ్లలో ఇంకా కోపం, కుళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని యోసేపు అనుకున్నాడు. ఆయన వాళ్లతో, ‘మీరు గూఢచారులు. మా దేశంలో ఎక్కడ దాడి చేయవచ్చో తెలుసుకోవడానికి వచ్చారు’ అని అంటాడు. వాళ్లు, ‘కాదు! మేము కనాను నుండి వచ్చిన 12 మంది అన్నదమ్ములం. ఒక తమ్ముడు చనిపోయాడు, చిన్న తమ్ముడు నాన్న దగ్గర ఉన్నాడు’ అని అన్నారు. అందుకు యోసేపు, ‘మీ చిన్న తమ్ముడిని నా దగ్గరకు తీసుకువస్తేనే నేను మిమ్మల్ని నమ్ముతాను’ అని చెప్పాడు. అప్పుడు వాళ్లు వాళ్ల నాన్న దగ్గరకు తిరిగి ఇంటికి బయలుదేరారు.

ఇంట్లో ఆహారం అయిపోగానే యాకోబు తన కొడుకులను మళ్లీ ఐగుప్తుకు పంపిస్తాడు. ఈసారి వాళ్లు చిన్న తమ్ముడు బెన్యామీనును వాళ్లతో తీసుకువెళ్లారు. అన్నలు మారారో లేదో తెలుసుకోవడానికి యోసేపు ఒక వెండి గిన్నెను బెన్యామీను ధాన్యం సంచిలో దాచిపెట్టి, వాళ్లు దాన్ని దొంగతనం చేశారని అంటాడు. యోసేపు పనివాళ్లకు ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికినప్పుడు అతని అన్నలు భయపడిపోతారు. బెన్యామీనుకు కాకుండా తమకు ఆ శిక్ష వేయమని యోసేపును బ్రతిమాలారు.

వాళ్ల అన్నలు మారారని యోసేపుకు ఇప్పుడు అర్థమైంది. యోసేపు తనను తాను ఆపుకోలేకపోయాడు. వెంటనే ఏడ్చేశాడు, ఆయన వాళ్లతో, ‘నేను మీ సహోదరుడు యోసేపును, నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడా?’ అని అడిగాడు. అప్పుడు అతని సహోదరులు చాలా ఆశ్చర్యపోయారు. అతను ఇంకా ఇలా అన్నాడు: ‘మీరు నాకు చేసిన దాని గురించి బాధపడవద్దు. మీ ప్రాణాలు కాపాడడానికి యెహోవా నన్ను ఇక్కడికి పంపించాడు. మీరు త్వరగా వెళ్లి నాన్నను ఇక్కడకు తీసుకురండి.’

వాళ్లు ఆ మంచి వార్తను వాళ్ల నాన్నకు చెప్పి అతనిని ఐగుప్తుకు తీసుకురావడానికి ఇంటికి వెళ్లారు. చాలా సంవత్సరాల తర్వాత యోసేపు, వాళ్ల నాన్న చివరికి కలుసుకున్నారు.

“మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమించకపోతే, మీ పరలోక తండ్రి కూడా మీ పాపాల్ని క్షమించడు.”—మత్తయి 6:15