లెసన్ 26
12 మంది గూఢచారులు
ఇశ్రాయేలీయులు సీనాయి కొండ దగ్గర నుండి బయల్దేరి పారాను అరణ్యం గుండా ప్రయాణిస్తూ కాదేషు అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: ‘ప్రతీ గోత్రం నుండి ఒకరిని మొత్తం 12 మందిని కనాను దేశాన్ని రహస్యంగా చూడడానికి పంపించు. ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులకు నేను ఇస్తాను.’ అలా వేరే దేశాలను రహస్యంగా చూడడానికి వెళ్లేవాళ్లను గూఢచారులు అంటారు. మోషే 12 మంది గూఢచారులను ఏర్పాటుచేసి వాళ్లతో ఇలా చెప్పాడు: ‘మీరు కనానుకు వెళ్లి, ఆహారం పండించడానికి ఆ ప్రాంతం ఎలా ఉందో చూసి రండి. అక్కడ ఉండే ప్రజలు బలంగా ఉన్నారో, బలహీనంగా ఉన్నారో, గుడారాల్లో నివసిస్తున్నారో, పట్టణాల్లో నివసిస్తున్నారో చూసి రండి.’ ఆ 12 మందిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు, వాళ్లంతా కనానుకు బయల్దేరారు.
వాళ్లు 40 రోజుల తర్వాత, అంజూర పండ్లను, దానిమ్మ కాయలను, ద్రాక్ష కాయలను తీసుకుని వస్తారు. వాళ్లు ఇలా చెప్తారు: ‘అది మంచి దేశం, కానీ ఆ ప్రజలు చాలా బలంగలవాళ్లు, వాళ్ల పట్టణాల చుట్టూ గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి.’ కాలేబు ఇలా అంటాడు: ‘మనం వాళ్లను ఓడించవచ్చు. ఇప్పుడే మనం వెళ్దాం!’ కాలేబు అలా ఎందుకు అన్నాడో మీకు తెలుసా? ఎందుకంటే కాలేబుకు, యెహోషువకు యెహోవా మీద నమ్మకం ఉంది. కానీ మిగిలిన పది మంది ఇలా అన్నారు: ‘వద్దు! ఆ ప్రజలు చాలా పెద్దగా, రాక్షసుల్లా ఉన్నారు! మేము వాళ్ల పక్కన మిడతల్లా కనిపిస్తున్నాం.’
ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. వాళ్లు పేచీలు పెడుతూ ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: ‘మనం వేరే నాయకుడిని ఎన్నుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్లిపోదాం. మనం
ఆ దేశానికి వెళ్లి వాళ్ల చేతుల్లో ఎందుకు చచ్చిపోవాలి?’ యెహోషువ కాలేబు ఇలా అన్నారు: ‘యెహోవాకు అవిధేయత చూపించకండి, ఆయన మనలను కాపాడతాడు, భయపడకండి.’ కానీ ఇశ్రాయేలీయులు వినలేదు. వాళ్లు యెహోషువ కాలేబులను చంపాలని కూడా అనుకున్నారు.యెహోవా ఏమి చేశాడు? ఆయన మోషేతో ఇలా చెప్పాడు: ‘నేను ఇశ్రాయేలీయుల కోసం అన్నీ చేశాను, కానీ వాళ్లు ఇంకా నా మాటకు లోబడట్లేదు. కాబట్టి వాళ్లు 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే ఉంటారు, ఇక్కడే చచ్చిపోతారు. నేను వాళ్లకు ఇస్తానన్న దేశంలో వాళ్ల పిల్లలు, యెహోషువ, కాలేబు మాత్రమే ఉంటారు.’
“మీరెందుకు ఇంత భయపడుతున్నారు? మీకు కొంచెం విశ్వాసమే ఉంది.”—మత్తయి 8:26