కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 36

యెఫ్తా ఇచ్చిన మాట

యెఫ్తా ఇచ్చిన మాట

ఇశ్రాయేలీయులు మళ్లీ యెహోవాను విడిచిపెట్టి అబద్ధ దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టారు. అమ్మోనీయులు వచ్చి దాడి చేసి ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసినప్పుడు ఆ అబద్ధ దేవుళ్లు వాళ్లకు ఏ సహాయం చేయలేదు. చాలా సంవత్సరాలు ఇశ్రాయేలీయులు కష్టాలు పడ్డారు. చివరికి వాళ్లు యెహోవాతో ఇలా అన్నారు: ‘మేము పాపం చేశాము. దయచేసి మమ్మల్ని మా శత్రువుల నుండి కాపాడు.’ ఆ ఇశ్రాయేలీయులు వాళ్ల విగ్రహాలన్నిటినీ తీసి పడేసి మళ్లీ యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టారు. వాళ్లు బాధపడుతుంటే యెహోవా చూడలేకపోయాడు.

యెఫ్తా అనే ఒక యోధుడు అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి ఎన్నుకోబడ్డాడు. ఆయన యెహోవాతో ‘నువ్వు మాకు యుద్ధంలో గెలవడానికి సహాయం చేస్తే నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, నా ఇంట్లోనుండి నాకు ఎదురుగా నన్ను కలుసుకోవడానికి ఎవరు ముందు వస్తే వాళ్లను నీకు ఇచ్చేస్తాను’ అని చెప్పాడు. యెహోవా యెఫ్తా ప్రార్థన విని యుద్ధంలో గెలవడానికి సహాయం చేశాడు.

యెఫ్తా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆయనను కలవడానికి ముందు ఆయన ఒక్కగానొక్క కూతురు ఎదురు వచ్చింది. ఆమె డాన్స్‌ చేస్తూ తంబుర వాయిస్తూ ఉంది. అప్పుడు యెఫ్తా ఏమి చేస్తాడు? ఆయన చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ‘అయ్యో నా తల్లీ, నువ్వు నా గుండె పగిలేలా చేశావు. నేను యెహోవాకు మాట ఇచ్చాను. అది నిలబెట్టుకోవాలంటే నేను నిన్ను షిలోహు గుడారంలో సేవ చేయడానికి పంపించేయాలి’ అని చెప్పాడు. కానీ అతని కూతురు, ‘నాన్న, నువ్వు యెహోవాకు మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. అయితే నేను ఒకటి అడుగుతాను, నా స్నేహితురాళ్లతో కలిసి రెండు నెలలు కొండలకు వెళ్లి కొంత సమయం గడిపి వస్తాను. తర్వాత వెళ్తాను’ అని అతనితో చెప్పింది. యెఫ్తా కూతురు ఆమె జీవితమంతా గుడారంలో నమ్మకంగా సేవ చేసింది. ప్రతి సంవత్సరం ఆమె స్నేహితురాళ్లు ఆమెను చూడడానికి షిలోహుకు వెళ్లేవాళ్లు.

“తండ్రిని గానీ, తల్లిని గానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి నా శిష్యుడిగా ఉండే అర్హత లేదు.”—మత్తయి 10:37