కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 53

యెహోయాదా చూపించిన ధైర్యం

యెహోయాదా చూపించిన ధైర్యం

యెజెబెలుకు ఒక కూతురు ఉంది, ఆమె పేరు అతల్యా. ఆమె తన తల్లిలానే దుష్టురాలు. అతల్యాకు యూదా రాజుతో పెళ్లి అయింది. ఆమె భర్త చనిపోయాక, ఆమె కొడుకు పరిపాలించడం మొదలుపెట్టాడు. కాని కొడుకు చనిపోయాక పరిపాలనను ఆమె తన చేతుల్లోకి తీసుకుంది. తర్వాత రాజవంశం మొత్తాన్ని నాశనం చేయడానికి ఆమె బదులు పరిపాలించగలిగే వాళ్లందరినీ చంపేసింది. తన సొంత మనవళ్లను కూడా చంపేసింది. అందరికి ఆమె అంటే చాలా భయం.

ప్రధాన యాజకుడైన యెహోయాదాకు, అతని భార్య యెహోషెబకు అతల్యా చేసే పనులు చాలా చెడ్డవని తెలుసు. వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఉన్నా వాళ్లు అతల్యా మనవడు ఒకడిని కాపాడారు. ఆ బాబు పేరు యోవాషు. అతన్ని వాళ్లు ఆలయంలో పెంచారు.

యోవాషుకు ఏడు సంవత్సరాలప్పుడు, యెహోయాదా అధిపతులందరినీ, లేవీయులందరినీ పిలిచి వాళ్లతో ఇలా అన్నాడు: ‘ఆలయ ద్వారాలకు కాపలా ఉండి ఎవ్వరినీ లోపలికి రానివ్వకండి.’ యెహోయాదా యోవాషును యూదాకు రాజుగా చేసి, అతని తలపై కిరీటం పెడతాడు. యూదా ప్రజలు ఇలా అరిచారు: ‘రాజు చాలా సంవత్సరాలు బ్రతకాలి!’

అతల్యా రాణి ప్రజల అరుపుల్ని విని వెంటనే ఆలయానికి వచ్చింది. కొత్త రాజును చూసి ఇలా అరిచింది: ‘కుట్ర! కుట్ర!’ అప్పుడు అధిపతులు ఆ చెడ్డ రాణిని పట్టుకుని తీసుకెళ్లి చంపేశారు. కానీ ఆమె వల్ల దేశంపై వచ్చిన చెడు ప్రభావం విషయమేంటి?

యెహోవాతో ఒక ఒప్పందం చేసుకునేలా దేశానికి యెహోయాదా సహాయం చేస్తాడు. దాని ప్రకారం వాళ్లు యెహోవాను మాత్రమే ఆరాధిస్తామని ఒప్పుకున్నారు. వాళ్లతో యెహోయాదా బయలు ఆలయాన్ని పడగొట్టించి, విగ్రహాల్ని పగలగొట్టేలా చేస్తాడు. ఆలయంలో ప్రజలు మళ్లీ ఆరాధించేలా ఆయన యాజకులను, లేవీయులను ఆలయంలో పని చేయడానికి నియమిస్తాడు. అపవిత్రమైన వాళ్లెవ్వరూ లోపలికి రాకుండా ఆలయానికి కాపలాగా కొంతమందిని నియమిస్తాడు. తర్వాత యెహోయాదా, అధిపతులు యోవాషును రాజభవనానికి తీసుకెళ్లి సింహాసనంపై కూర్చోపెడతారు. యూదా ప్రజలందరూ సంతోషించారు. దుష్ట అతల్యా నుండి, బయలు ఆరాధన నుండి బయటపడి ఇప్పుడు వాళ్లు యెహోవాను ఆరాధించగలరు. యెహోయాదా చూపించిన ధైర్యం వల్ల ఎంతోమంది సహాయం పొందారు, కదా?

“శరీరాన్ని చంపినా ప్రాణాన్ని చంపలేని వాళ్లకు భయపడకండి. కానీ ప్రాణాన్ని, శరీరాన్ని గెహెన్నాలో నాశనం చేయగలిగే వ్యక్తికే భయపడండి.”—మత్తయి 10:28