“అంత్యదినములు” అంటే ఏమిటి?
“అంత్యదినములు” అంటే ఏమిటి?
మీ భవిష్యత్తు, మీ ప్రియమైనవారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మీరు ఆలోచిస్తారా? ప్రపంచంలో జరిగే సంఘటనలు తమ జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు అనేకమంది సమాచార మాధ్యమాలు చెప్పేవాటిని ఎంతో శ్రద్ధగా వింటారు. కానీ, దేవుని ప్రేరేపిత వాక్యానికి అవధానమివ్వడం ద్వారా మనకు సరైన అంతర్దృష్టి లభిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నవాటి గురించేకాక, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో కూడా బైబిలు చాలాకాలం క్రితమే తెలియజేసింది.
ఉదాహరణకు, యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి విస్తృతంగా ప్రకటించాడు. (లూకా 4:43) సహజంగానే, ఆయన చెప్పేదాన్ని విన్నవారు ఆ అద్భుతమైన రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. నిజానికి, యేసు అన్యాయంగా చంపబడడానికి మూడు రోజుల ముందు, ఆయన శిష్యులు ఆయనను, “ఇవి ఎప్పుడు జరుగును? [రాజ్యాధికారంలో] నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి” అని అడిగారు. (మత్తయి 24:3) దేవుని రాజ్యం భూమిని పూర్తిగా తన అధీనంలోకి తీసుకునే ఖచ్చితమైన సమయం యెహోవా దేవునికే తెలుసని యేసు వారితో చెప్పాడు. (మత్తయి 24:36; మార్కు 13:32) అయితే, క్రీస్తు రాజ్యాధికారంలో పరిపాలిస్తున్నాడని సూచిస్తూ, భూమిపై జరిగే కొన్ని పరిణామాల గురించి యేసు, మరితరులు ముందుగానే తెలియజేశారు.
మనం ఈ విధానపు “అంత్యదినములలో” జీవిస్తున్నామని సూచించే ప్రత్యక్ష సాక్ష్యాలను పరిశీలించేముందు, పరలోకంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన గురించి మనం సంక్షిప్తంగా పరిశీలిద్దాం. (2 తిమోతి 3:1) యేసుక్రీస్తు పరలోకంలో 1914వ సంవత్సరంలో రాజయ్యాడు. * (దానియేలు 7:13, 14) యేసు రాజ్యాధికారం పొందిన వెంటనే, ఆయన చర్య తీసుకున్నాడు. “పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము” చేశారని బైబిలు మనకు చెబుతోంది. (ప్రకటన 12:7) పరలోక స్థానంలో ఉన్న “ప్రధానదూతయైన మిఖాయేలు” యేసుక్రీస్తే. * (యూదా 9; 1 థెస్సలొనీకయులు 4:16) ఆ ఘటసర్పము అపవాదియైన సాతాను. యుద్ధంలో, సాతానుకు దయ్యాలని పిలువబడే దేవదూతలైన అతని దుష్ట అనుచరులకు ఏమి జరిగింది? వారు యుద్ధంలో ఓడిపోయి “పడద్రోయబడిరి,” అంటే పరలోకం నుండి భూమ్మీదికి పడద్రోయబడ్డారు. (ప్రకటన 12:9) ఆ కారణంగా, ‘పరలోకము, పరలోకనివాసులు’ అంటే నమ్మకంగా ఉన్న దేవుని ఆత్మకుమారులు సంతోషించారు. అయితే, మానవులు మాత్రం అలాంటి సంతోషాన్ని పొందలేదు. ఎందుకంటే, “భూమీ . . . మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని” బైబిలు ప్రవచించింది.—ప్రకటన 12:12.
సాతాను క్రోధంతో భూమ్మీద నివసించేవారిపైకి శ్రమను అంటే కష్టాలను, బాధలను తెచ్చాడు. కానీ, ఆ శ్రమ “సమయము కొంచెమే” అంటే అది కొంతకాలమే ఉంటుంది. బైబిలు ఆ సమయాన్ని “అంత్యదినములు” అని పిలుస్తోంది. అపవాదికి భూమిపై ఉన్న ప్రభావం త్వరలోనే పూర్తిగా తీసివేయబడుతుందనే విషయాన్నిబట్టి మనం సంతోషించవచ్చు. అయితే, మనం అంత్యదినములలో జీవిస్తున్నామనడానికి రుజువులేమిటి?
[అధస్సూచీలు]
^ పేరా 4 మరింత సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 218-19 పేజీలను చూడండి.
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
COVER: Foreground: © Chris Stowers/Panos Pictures; background: FAROOQ NAEEM/AFP/Getty Images