కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లూకా సువార్తలోని ముఖ్యాంశాలు

లూకా సువార్తలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

లూకా సువార్తలోని ముఖ్యాంశాలు

మత్తయి సువార్త ముఖ్యంగా యూదుల కోసం రాయబడితే, మార్కు సువార్త యూదేతరుల కోసం రాయబడిందనే విషయం తెలిసిందే. అయితే, లూకా సువార్త అన్ని జనాంగాల కోసం రాయబడింది. సా.శ. 56-58 మధ్యకాలంలో రాయబడిన లూకా సువార్త యేసు జీవితం, పరిచర్య గురించి సవివరంగా వివరిస్తుంది.

ఒక వైద్యుడు ఎలాగైతే శ్రద్ధగా, జాగ్రత్తగా పరిశీలిస్తాడో అలాగే లూకా “అన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొని” రాశాడు. తన సువార్తలో సా.శ.పూ. 3 నుండి సా.శ. 33కు మధ్యకాలంలోని సంఘటనలను అంటే మొత్తం 35 సంవత్సరాల చరిత్రను రాశాడు. (లూకా 1:​1-​3) లూకా సువార్తలో ఉన్న దాదాపు 60 శాతం వివరాలు వేరే సువార్తల్లో లేవు.

తొలి పరిచర్య

(లూకా 1:⁠1-9:​62)

లూకా ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను, యేసుల జననం గురించిన వివరాలు తెలియజేసిన తర్వాత, యోహాను తన పరిచర్యను తిబెరికైసరు ఏలుబడిలో పదిహేనవ సంవత్సరం అంటే సా.శ. 29 సంవత్సరంలోని వసంత రుతువులో ప్రారంభించాడని రాశాడు. (లూకా 3:​1, 2) ఆ సంవత్సరం శరదృతువులో యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చాడు. (లూకా 3:​21, 22) సా.శ. 30కల్లా యేసు ‘గలిలయకు తిరిగి వెళ్లి వారి సమాజమందిరాలలో బోధించడం’ ప్రారంభించాడు.​—⁠లూకా 4:​14, 15.

యేసు గలిలయలో తన మొదటి ప్రకటనా పర్యటనను ప్రారంభించాడు. ఆయన జనసమూహములతో, “నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను” అని చెప్పాడు. (లూకా 4:​43) ఆయన సీమోను అనే జాలరిని, ఇతరులను తనతోపాటు తీసుకువెళ్లాడు. ‘ఇప్పటినుండి మీరు మనుష్యులను పట్టువారై యుందురు’ అని ఆయన వారితో చెప్పాడు. (లూకా 5:​1-11; మత్త. 4:​18, 19) యేసు గలిలయలో తన రెండవ ప్రకటనా పర్యటనను చేస్తుండగా 12 మంది అపొస్తలులు ఆయనతోపాటే ఉన్నారు. (లూకా 8:⁠1, 2) మూడవ పర్యటనలో ఆయన ఆ 12 మందిని, “దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును” పంపించాడు.​—⁠లూకా 9:​1, 2.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​35​—⁠మరియ గర్భం ధరించడంలో ఆమె అండము ఉపయోగించబడిందా? మరియకు పుట్టే బిడ్డ, దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆమె పూర్వికులైన అబ్రాహాము, యూదా, దావీదుల వంశంలోనే జన్మించాలంటే ఆమె గర్భం దాల్చడానికి ఆమె అండమే ఉపయోగించబడాలి. (ఆది. 22:​15, 18; 49:​10; 2 సమూ. 7:​8, 16) అయితే దేవుని కుమారుని పరిపూర్ణ జీవాన్ని పరలోకం నుండి భూమిపైనున్న మరియ గర్భంలోకి మార్చి ఆమె గర్భం దాల్చేలా చేయడానికి యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగించాడు. (మత్త. 1:​18) మరియ అండంలో ఎలాంటి అపరిపూర్ణతైనా ఉంటే అది తుడిచివేయడానికి, గర్భంలో పెరుగుతున్న శిశువుకు ఎలాంటి లోపం లేకుండా కాపాడడానికి పరిశుద్ధాత్మ సహాయం చేసిందనిపిస్తోంది.

1:​62​—⁠జెకర్యా మాట్లాడే సామర్థ్యంతోపాటు వినికిడి శక్తిని కూడా కోల్పోయాడా? లేదు. ఆయన మాట్లాడే సామర్థ్యాన్ని మాత్రమే కోల్పోయాడు. ఇతరులు జెకర్యాను వాళ్ల బిడ్డకు ఏ పేరు పెట్టాలనుకుంటున్నాడో “సంజ్ఞలుచేసి” అడిగారు. ఆయన చెవిటివాడనే ఉద్దేశంతో వారలా చేయలేదు. తన భార్య తమ బిడ్డకు ఏ పేరు పెట్టాలో చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా వినేవుంటాడు. బహుశా జెకర్యా అభిప్రాయమేమిటో తెలుసుకోవడానికి ఇతరులు అలా సంజ్ఞ చేసి​ఉంటారు. ఆయన మాట్లాడే సామర్థ్యాన్ని మాత్రమే తిరిగి పొందాడనే విషయాన్నిబట్టి జెకర్యా వినికిడి శక్తిని కోల్పోలేదని అర్థమౌతోంది.​—⁠లూకా 1:​13, 18-20, 60-64.

2:​1, 2​—⁠“మొదటి ప్రజాసంఖ్య” గురించిన ప్రస్తావన యేసు ఎప్పుడు పుట్టాడో తెలుసుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది? కైసరు ఔగుస్తు ఏలుబడిలో ఒకటికన్నా ఎక్కువసార్లు ప్రజాసంఖ్య లెక్కించబడింది. మొదటిసారి దానియేలు 11:20లోని మాటలు నెరవేరేలా సా.శ.పూ. 2లో లెక్కవేయబడితే, రెండవసారి సా.శ. 6లో లేదా 7లో లెక్కవేయబడింది. (అపొ. 5:​37) రెండు సందర్భాల్లో కురేనియు సిరియాలో అధిపతిగా ఉన్నాడు, అంటే ఆయన రెండుసార్లు అధిపతిగా పనిచేసివుంటాడు. లూకా మొదటి ప్రజాసంఖ్య గురించి ప్రస్తావించాడు కాబట్టి యేసు సా.శ.పూ. 2లో పుట్టాడని చెప్పవచ్చు.

2:​35​—⁠మరియ హృదయంలోకి చొచ్చుకొనిపోయే “ఒక ఖడ్గము” ఏమిటి? యేసును మెస్సీయగా అనేకమంది నిరాకరించినప్పుడు మరియకు కలిగే దుఃఖాన్ని, ఆయన ఎంతో బాధననుభవించి చనిపోయినప్పుడు ఆమెకు కలిగిన ఆవేదనను ఆ ఖడ్గం సూచిస్తోంది.​—⁠యోహా. 19:​25.

9:​27, 28​—⁠యేసు తాను రాజ్య మహిమతో రావడాన్ని చూసేంతవరకు తన శిష్యుల్లో కొందరు “మరణము రుచిచూడరని” వారికి వాగ్దానం చేసిన “ఆరు దినములైన” తర్వాత రూపాంతరం జరిగిందని మత్తయి, మార్కు రాస్తే, “యెనిమిది దినములైన” తర్వాత జరిగిందని లూకా ఎందుకు చెప్పాడు? (మత్త. 17:⁠1; మార్కు 9:⁠2) లూకా బహుశా రెండు అదనపు దినాలను అంటే వాగ్దానం చేసిన రోజును, యేసు రూపాంతరం చెందిన రోజును కలుపుకుని అలా చెప్పివుంటాడు.

9:​49, 50​—⁠ఒక వ్యక్తి తన అనుచరుడు కాకపోయినా, దయ్యాలను వెళ్లగొడుతుంటే యేసు అతణ్ణి ఎందుకు ఆపలేదు? యేసు అతణ్ణి ఎందుకు ఆపలేదంటే క్రైస్తవ సంఘం అప్పటికింకా స్థాపించబడలేదు. అందుకే ఆ వ్యక్తి యేసు పేరుపై విశ్వాసముంచి దయ్యాలను వెళ్లగొట్టడానికి యేసు అనుచరుడు కానవసరం లేదు.​—⁠మార్కు 9:​38-40.

మనకు పాఠాలు:

1:​32, 33; 2:​19, 51. మరియ ప్రవచనాలను నెరవేర్చిన సంఘటనలను, మాటలను హృదయంలో భద్రపరచుకుంది. యేసు “ఈ యుగసమాప్తి” గురించి ప్రవచించిన మాటలను మనం కూడా హృదయాల్లో భద్రపరచుకొని, నేడు జరుగుతున్నవాటిని ఆయన చెప్పిన విషయాలతో పోల్చిచూస్తున్నామా?​—⁠మత్త. 24:⁠3.

2:​37. మనం ఎడతెగక యెహోవాను ఆరాధించాలని, “ప్రార్థనయందు పట్టుదల కలిగి” ఉండాలని, క్రైస్తవ కూటాలకు ‘సమాజంగా కూడుట’ మానుకోకూడదని అన్నా మాదిరి మనకు బోధిస్తోంది.​—⁠రోమా. 12:​12; హెబ్రీ. 10:​24, 25.

2:​41-50. యోసేపు దేవుని ఆరాధనకు ప్రథమ స్థానం ఇవ్వడంతోపాటు తన కుటుంబ భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీర్చాడు. ఈ విషయాల్లో ఆయన కుటుంబ పెద్దలకు ఒక చక్కని మాదిరినుంచాడు.

4:⁠4. మనం అనుదినం ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించాలి.

6:​40. దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి తన విద్యార్థులకు సరైన మాదిరినుంచాలి. తాను ప్రకటించేవాటికి అనుగుణంగా ఆయన జీవించాలి.

8:⁠15. ‘వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి’ అంటే మనం ముందు దానిని అర్థం చేసుకుని, దాని విలువను గ్రహించి, దానిని ధ్యానించాలి. బైబిలును, బైబిలు ఆధారిత సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాల్సిన అవసరం ఉంది.

యేసు తదుపరి పరిచర్య

(లూకా 10:1-24:​53)

యేసు తనకన్నా ముందు 70 మందిని యూదయలోని నగరాలకు, ప్రాంతాలకు పంపించాడు. (లూకా 10:⁠1) ఆయన “బోధించుచు పట్టణములలోను గ్రామములలోను” సంచారం చేశాడు.​—⁠లూకా 13:​22.

సా.శ. 33వ సంవత్సరం పస్కా పండుగకు ఐదు రోజుల ముందు యేసు గాడిదపిల్లపై యెరూషలేములోకి ప్రవేశిస్తాడు. ఆయన తన శిష్యులతో, “మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దలచేతను ప్రధాన యాజకుల​చేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యము” అని చెప్పిన మాటలు నెరవేరే సమయం వచ్చింది.​—⁠లూకా 9:​22, 44.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

10:​18​—⁠యేసు 70 మంది శిష్యులతో, “సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని” అని చెప్పిన మాటలకున్న భావమేమిటి? సాతాను అప్పటికే పరలోకం నుండి పడద్రోయబడ్డాడని యేసు ఇక్కడ చెప్పడంలేదు. క్రీస్తు 1914లో పరలోక రాజుగా ఆసీనుడైన కొంతకాలానికి గానీ అది జరగలేదు. (ప్రక. 12:​1-10) విషయం ఇది అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, బహుశా యేసు భవిష్యత్తులో జరగబోయే సంఘటనను అప్పటికే జరిగినట్లుగా చెప్పడం ద్వారా అది తప్పకుండా నెరవేరుతుందని ఆయన నొక్కిచెబుతుండవచ్చు.

14:​26​—⁠క్రీస్తు అనుచరులు ఏ భావంతో తమ బంధువులను ‘ద్వేషించాలి?’ బైబిలు ‘ద్వేషించడం’ గురించి మాట్లాడుతున్నప్పుడు, అది ఒక వ్యక్తి లేదా వస్తువు కన్నా మరో వ్యక్తిని లేక వస్తువును తక్కువగా ప్రేమించడాన్ని సూచిస్తుంది. (ఆది. 29:​30, 31) క్రైస్తవులు తమ బంధువులను ‘ద్వేషించాలి’ అని అన్నప్పుడు వారు తమ బంధువులను క్రీస్తుకన్నా తక్కువగా ప్రేమించాలి అని అర్థం.​—⁠మత్త. 10:​37.

17:​34-37​—⁠“గద్దలు” ఎవరిని సూచిస్తున్నాయి, అవి ఏ “పీనుగు” చుట్టూ పోగవుతాయి? ‘కొనిపోబడువారు’ లేదా రక్షించబడినవారు దూరదృష్టి ఉన్న గద్దలతో పోల్చబడ్డారు. వారు పోగయ్యే “పీనుగు” అదృశ్యంగా పరిపాలిస్తున్న నిజమైన క్రీస్తు మరియు యెహోవా వారికి అందించే ఆధ్యాత్మిక ఆహారం.​—⁠మత్త. 24:​28.

22:⁠44​—⁠యేసు ఎందుకు అంత వేదనను అనుభవించాడు? దానికి చాలా కారణాలున్నాయి. యేసు తాను నేరస్థునిగా చనిపోవడం యెహోవా దేవుణ్ణి, ఆయన నామాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అని ఆందోళన చెందాడు. అంతేకాక, తన నిత్య జీవితం, పూర్తి మానవజాతి భవిష్యత్తు తాను నమ్మకంగా ఉండడంపైనే ఆధారపడివుందని యేసుకు బాగా తెలుసు.

23:​44​—⁠మూడుగంటలపాటు ఉన్న చీకటి సూర్యగ్రహణం వల్ల కలిగిందా? లేదు. అమావాస్య ఉన్నప్పుడే సూర్య​గ్రహణం వస్తుంది కానీ పౌర్ణమి ఉన్నప్పుడు కాదు. పస్కా పండుగ కూడా పౌర్ణమి ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి, యేసు మరణించినప్పుడు కమ్ముకున్న చీకటి దేవుడు చేసిన అద్భుతమే.

మనకు పాఠాలు:

11:​1-4. ఈ వచనాల్లోని నిర్దేశాలు, 18 నెలల ముందు కొండమీది ప్రసంగంలో ఇవ్వబడిన మాదిరి ప్రార్థనలోని కాస్త భిన్నమైన మాటలతో పోల్చినప్పుడు, మనం ఏవో కొన్ని పదాలను పదేపదే వల్లిస్తూ ప్రార్థనలు చేయకూడదని స్పష్టంగా అర్థమవుతుంది.​—⁠మత్త. 6:​9-13.

11:​5, 13. యెహోవా మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నా, మనం పట్టుదలతో ప్రార్థించాలి.​—⁠1 యోహా. 5:​14.

11:​27, 28. దేవుని చిత్తాన్ని నమ్మకంగా చేయడం ద్వారానే నిజమైన సంతోషం లభిస్తుంది కానీ బంధుత్వాలవల్ల, ధన సంపాదనవల్ల కాదు.

11:​41. మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే అది ప్రేమతో, హృదయపూర్వకంగా ఇవ్వాలి.

12:​47, 48. పెద్ద బాధ్యతలు ఉండి వాటిని నిర్వర్తించలేని వ్యక్తి, తన బాధ్యతలు ఏమిటో తెలియని లేదా అర్థం చేసుకోలేని వ్యక్తికన్నా ఎక్కువ నిందార్హుడు.

14:​28, 29. మనకు ఉన్నంతలో జీవించడం జ్ఞానయుక్తం.

22:​36-38. ఆత్మరక్షణ కోసం కత్తులను తీసుకువెళ్లాలని యేసు తన శిష్యులకు చెప్పలేదు. యేసు అప్పగించబడిన రాత్రి, శిష్యుల దగ్గర కత్తులు ఉండడం వల్ల ఆయన వారికి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పగలిగాడు. అదేమిటంటే, “కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.”​—⁠మత్త. 26:​52.

[31వ పేజీలోని చిత్రం]

యోసేపు ఒక కుటుంబ పెద్దగా చక్కని మాదిరినుంచాడు

[32వ పేజీలోని చిత్రం]

లూకా యేసు జీవితం, పరిచర్య గురించి సవివరంగా రాశాడు