కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ‘క్రీస్తును’ ఎందుకు అనుసరించాలి?

మనం ‘క్రీస్తును’ ఎందుకు అనుసరించాలి?

మనం ‘క్రీస్తును’ ఎందుకు అనుసరించాలి?

“ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని . . . నన్ను వెంబడింపవలెను [‘వెంబడిస్తూ ఉండాలి,’ NW].”—లూకా 9:23.

1, 2. మనం ‘క్రీస్తును’ అనుసరించడానికిగల కారణాలను తెలుసుకోవడం ఎందుకు చాలా అవసరం?

మీరు యౌవనస్థులైతే లేదా సత్యంపట్ల ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపిస్తున్నవారైతే తన ఆరాధకుల మధ్య మిమ్మల్ని చూసి యెహోవా ఎంత సంతోషిస్తాడు! బైబిలు అధ్యయనం చేస్తూ, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరౌతూ, దేవుని వాక్యంలోని ప్రాణాన్ని రక్షించే సత్యాన్ని మరింత తెలుసుకుంటున్న ఈ సమయంలో మీరు యేసు ఇచ్చిన ఆహ్వానం విషయంలో తీవ్రంగా ఆలోచించాలి. ఆయన ఇలా అన్నాడు: “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను [‘వెంబడిస్తూ ఉండాలి,’ NW].” (లూకా 9:23) మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని తన అనుచరులుకమ్మని యేసు మీకు చెబుతున్నాడు. కాబట్టి, ‘క్రీస్తును’ ఎందుకు అనుసరించాలో తెలుసుకోవడం ఎంతో అవసరం.—మత్త. 16:13-16.

2 మనం ఇప్పటికే యేసుక్రీస్తు అడుగుజాడలను అనుసరిస్తున్నట్లయితే, ఏమి చేయాలి? మనం ఆయనను అనుకరించడంలో “అంతకంతకు అభివృద్ధి నొందవలెను” అని పౌలు ప్రోత్సహించాడు. (1 థెస్స. 4:1, 2) మనం ఇటీవల సత్యంలోకి వచ్చినా లేదా సత్యంలోకి వచ్చి ఎన్నో ఏళ్లు గడిచినా క్రీస్తును అనుసరించడానికిగల కారణాల గురించి ఆలోచిస్తే పౌలు ఇచ్చిన ప్రోత్సాహాన్ని అన్వయించుకోగలుగుతాం. అలా మన దైనందిన జీవితంలో ఆయనను మరింత ఎక్కువగా అనుసరించగలుగుతాం. మనం క్రీస్తును అనుసరించడానికిగల ఐదు కారణాలను చూద్దాం.

యెహోవాకు మరింత దగ్గరవడానికి . . .

3. మనం ఏ రెండు మార్గాల ద్వారా యెహోవాను తెలుసుకోవచ్చు?

3 అపొస్తలుడైన పౌలు “అరేయొపగు మధ్య నిలిచి” ఏథెన్సువారితో మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నాడు: ‘ఒకవేళ తనను తడవులాడి కనుగొందురేమోయని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.’ (అపొ. 17:22, 26, 27) కాబట్టి, మనం దేవుణ్ణి వెదకి ఆయనను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, సృష్టిని గమనించినప్పుడు దేవుని లక్షణాల గురించి, ఆయన సామర్థ్యాల గురించి ఎంతో తెలుసుకుంటాం. అంతేకాక, ఆయన సృష్టికార్యాల గురించి కృతజ్ఞతతో ధ్యానిస్తే సృష్టికర్త గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. (రోమా. 1:20) యెహోవా తన వాక్యమైన బైబిల్లో తన గురించి ఎన్నో విషయాలు తెలియజేశాడు. (2 తిమో. 3:16, 17) మనం ఎంత ఎక్కువగా ‘ఆయన కార్యాలను, క్రియలను ధ్యానిస్తే’ అంత ఎక్కువగా ఆయన గురించి తెలుసుకుంటాం.—కీర్త. 77:12.

4. క్రీస్తును అనుసరించడం ద్వారా మనం ఎలా యెహోవాకు మరింత దగ్గరౌతాం?

4 క్రీస్తును అనుసరించడం ద్వారా కూడ మనం యెహోవాకు మరింత దగ్గరకావచ్చు. “లోకము పుట్టకమునుపు” తన తండ్రితో ఉన్నప్పుడు యేసుకున్న మహిమ గురించి ఒక్కసారి ఆలోచించండి. (యోహా. 17:5) ఆయన “దేవుని సృష్టికి ఆది.” (ప్రక. 3:14) ‘సర్వసృష్టికి ఆదిసంభూతుడిగా’ ఆయన తన తండ్రి అయిన యెహోవాతో కోటానుకోట్ల సంవత్సరాలు గడిపాడు. మానవునిగా భూమ్మీదకు రాకముందు ఆయన తన తండ్రితో సమయం గడపడం మాత్రమే కాక సర్వశక్తుడైన దేవుని సహచరుడిగా ఉంటూ సంతోషంగా ఆయనతో కలిసి పనిచేశాడు. దేవునితో మరెవ్వరికీ లేనంత దగ్గరి సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. యేసు తన తండ్రి భావాలను, ప్రధాన లక్షణాలను గుర్తిస్తూ ఆయన పనితీరును గమనించడమేకాక తన తండ్రి గురించి తెలుసుకున్నవన్నీ ఆకళింపుచేసుకొని ఆయనను అనుసరించాడు. అలా విధేయుడైన ఈ కుమారుడు తన తండ్రిలా తయారయ్యాడు. ఆయన ఎంతగా తన తండ్రిలా తయారయ్యాడంటే “ఆయన అదృశ్యదేవుని స్వరూపి” అని బైబిలు చెబుతోంది. (కొలొ. 1:15) క్రీస్తును ఎక్కువగా అనుసరించడం ద్వారా మనం యెహోవాకు మరింత దగ్గరౌతాం.

యెహోవాను మరింత ఎక్కువగా అనుకరించేందుకు . . .

5. మనం ఏమి చేస్తే యెహోవాను మరింత ఎక్కువగా అనుకరించగలుగుతాం? ఎందుకు?

5 మనం ‘దేవుని స్వరూపంలో, ఆయన పోలికచొప్పున’ సృష్టించబడ్డాం కాబట్టి మనం దేవుని ప్రధాన లక్షణాలను చూపించగలుగుతాం. (ఆది. 1:26) “ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ప్రోత్సహించాడు. (ఎఫె. 5:1) క్రీస్తును అనుసరిస్తే మనం పరలోక తండ్రిని అనుకరించగలుగుతాం. ఎందుకంటే, యేసులా దేవుని ఆలోచనను, భావాలను, వ్యక్తిత్వాన్ని కనబరచినవారు ఎవరూ లేరు. అంతేకాక ఆయనంత స్పష్టంగా యెహోవా గురించి మరెవ్వరూ బోధించలేరు. యేసు భూమ్మీదున్నప్పుడు యెహోవా నామాన్ని మాత్రమే కాక, ఆయన వ్యక్తిత్వాన్ని కూడ తెలియజేశాడు. (మత్తయి 11:27 చదవండి.) యేసు తన మాటల ద్వారా, చేతల ద్వారా, తన బోధల ద్వారా, మాదిరి ద్వారా దేవుని వ్యక్తిత్వాన్ని తెలియజేశాడు.

6. యేసు బోధలు యెహోవా గురించి ఏమి తెలియజేస్తున్నాయి?

6 దేవుని నియమాలు ఏమిటో, దేవుడు తన ఆరాధకులను ఎలా పరిగణిస్తున్నాడో యేసు తన బోధల ద్వారా వివరించాడు. (మత్త. 22:36-40; లూకా 12:6, 7; 15:4-7) ఉదాహరణకు, పది ఆజ్ఞల్లో “వ్యభిచరింపకూడదు” అనే ఒకానొక ఆజ్ఞ చెప్పిన తర్వాత, ఒక వ్యక్తి ఆ తప్పు చేయకముందు ఆయన హృదయంలో పుట్టే చెడు ఆలోచనను దేవుడు ఎలా దృష్టిస్తాడో యేసు వివరించాడు. ఆయన ఇలా చెప్పాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (నిర్గ. 20:14; మత్త. 5:27, 28) ధర్మశాస్త్రంలోని ఓ నియమాన్ని, “నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుము” అనే ఆజ్ఞగా పరిసయ్యులు వక్రీకరించారని యేసు చెప్పిన తర్వాత, ఆయన యెహోవా ఆలోచనను ఈ మాటల్లో చెప్పాడు: “మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి.” (మత్త. 5:43, 44; నిర్గ. 23:4; లేవీ. 19:18) దేవుని తలంపులను, భావాలను, నియమాలను తెలుసుకుంటే మనం ఆయనను మరింత ఎక్కువగా అనుకరించగలుగుతాం.

7, 8. యేసు మాదిరి నుండి మనం యెహోవా గురించి ఏమి తెలుసుకోవచ్చు?

7 అంతేకాక, యేసు తన మాదిరి ద్వారా తన తండ్రి ఎలాంటివాడో చూపించాడు. యేసు అవసరంలోవున్నవారిపట్ల కనికరాన్ని, బాధలు అనుభవిస్తున్నవారిపట్ల సానుభూతిని, చిన్నపిల్లలను గద్దించిన తన శిష్యులపట్ల కోపాన్ని చూపించాడని సువార్త పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలుసుకుంటాం. ఆయన తండ్రి కూడా అలాంటి భావాలనే చూపిస్తాడని మనకు అనిపించడంలేదా? (మార్కు 1:40-42; 10:13, 14; యోహా. 11:32-35) యేసు చేసిన పనులు దేవుని ప్రధాన లక్షణాలను ఎలా తెలియజేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తు చేసిన అద్భుతాలు ఆయనకు అపారశక్తి ఉందని చూపించడంలేదా? అయినా, ఆయన ఎన్నడూ తన శక్తిని స్వలాభానికో ఇతరులకు హానిచేయడానికో ఉపయోగించలేదు. (లూకా 4:1-4) ఆయన దురాశాపరులైన వర్తకులను ఆలయం నుండి వెళ్లగొట్టిన వృత్తాంతాన్ని చదివినప్పుడు ఆయన న్యాయవంతుడనే విషయం మనకు స్పష్టమవడంలేదా? (మార్కు 11:15-17; యోహా. 2:13-16) ప్రజల హృదయాల్లో ముద్రవేసేలా ఆయన చేసిన బోధలు, ఆయన పలికిన దయగల మాటలు, జ్ఞానంలో ఆయన “సొలొమోను కంటే గొప్పవాడు” అని చూపించాయి. (మత్త. 12:42) ఇతరుల కోసం తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడం ద్వారా యేసు చూపించిన ప్రేమ బైబిల్లో ఎంతో చక్కగా వర్ణించబడింది. ఆయనకన్నా “ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు” అని అక్కడ చెప్పబడింది.—యోహా. 15:13.

8 దేవుని కుమారుడు తన మాటల్లో, చేతల్లో యెహోవాను ఎంత పరిపూర్ణంగా అనుకరించాడంటే, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని ఆయన చెప్పగలిగాడు. (యోహాను 14:9-11 చదవండి.) కాబట్టి, క్రీస్తును అనుసరిస్తే మనం యెహోవాను అనుకరించినట్లౌతుంది.

యేసు యెహోవా అభిషిక్తుడు కాబట్టి . . .

9. యేసు ఎప్పుడు, ఎలా దేవుని అభిషిక్తుడయ్యాడు?

9 సా.శ. 29వ సంవత్సరంలోని శరదృతువులో ముప్పైఏళ్ల యేసు బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు వెళ్లినప్పుడు ఏమి జరిగిందో గమనించండి. “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.” అప్పుడు ఆయన క్రీస్తు లేదా మెస్సీయ అయ్యాడు. “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను” అని చెప్పడం ద్వారా తాను ఏర్పరచుకున్న అభిషిక్తుడు యేసే అని యెహోవా తెలియజేశాడు. (మత్త. 3:13-17) క్రీస్తును అనుసరించడానికి మనకు ఇంతకన్నా గొప్ప కారణం ఇంకేమి కావాలి?

10, 11. (ఎ) “క్రీస్తు” అనే బిరుదు యేసు విషయంలో ఏయే విధాలుగా ఉపయోగించబడింది? (బి) మనం ఎందుకు యేసుక్రీస్తును తప్పక అనుసరించాలి?

10 బైబిల్లో, “క్రీస్తు” అనే బిరుదు యేసు విషయంలో అనేక విధాలుగా అంటే యేసుక్రీస్తు, క్రీస్తుయేసు, క్రీస్తు అని ఉపయోగించబడింది. యేసే స్వయంగా “యేసుక్రీస్తు” అనే మాటను ఉపయోగించాడు. ఆయన తన తండ్రికి చేసిన ప్రార్థనలో ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహా. 17:3) యేసు అనే పేరు తర్వాత క్రీస్తు అనే బిరుదు వస్తే (“యేసుక్రీస్తు”) ఆయన దేవునిచేత పంపించబడి అభిషిక్తుడయ్యాడని స్పష్టంగా అది తెలియజేస్తుంది. యేసుకు ముందు క్రీస్తు అనే బిరుదు వస్తే (“క్రీస్తుయేసు”) అది ఆయనకు కాక ఆయనకున్న స్థానానికి లేదా అధికారానికి ప్రాధాన్యత ఇవ్వబడింది అని సూచిస్తుంది. (2 కొరిం. 4:6) అంతేకాక, కేవలం “క్రీస్తు” అని ఉన్నా అది మెస్సీయగా యేసుకున్న అధికారాన్నే నొక్కిచెబుతుంది.—అపొ. 5:42.

11 “క్రీస్తు” అనే బిరుదు యేసు విషయంలో ఎలా ఉపయోగించబడినా, అది ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని నొక్కిచెబుతోంది. దేవుని కుమారుడు మానవుడిగా భూమ్మీదకు వచ్చి తన తండ్రి చిత్తాన్ని తెలియజేసినప్పటికీ ఆయన ఓ మామూలు వ్యక్తి లేదా కేవలం ఓ ప్రవక్త కాదు. ఆయన యెహోవా అభిషిక్తుడు. కాబట్టి మనం ఈ అభిషిక్తుణ్ణి తప్పక అనుసరించాలి.

రక్షణకు యేసే మార్గం కాబట్టి . . .

12. యేసు తన మరణానికి కొన్ని గంటల ముందు అపొస్తలుడైన తోమాతో ఏ ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడు?

12 మెస్సీయను అనుసరిస్తూ ఉండడానికి మరో ప్రాముఖ్యమైన కారణాన్ని యేసు తన మరణానికి కొన్ని గంటల ముందు తన నమ్మకమైన అపొస్తలులతో చెప్పిన మాటల్లో చూడవచ్చు. తాను వెళ్లి స్థలం ఏర్పరుస్తానని యేసు చెప్పినప్పుడు తోమా ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు యేసు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని జవాబిచ్చాడు. (యోహా. 14:1-6) యేసు నమ్మకమైన తన 11 మంది అపొస్తలులతో ఆ మాటలు అన్నాడు. పరలోకంలో స్థలమేర్పరచే విషయంలో ఆయన వారికి వాగ్దానం చేసినా, భూమ్మీద నిత్యం జీవించే అవకాశమున్నవారికి కూడ ఆ మాటలు ప్రాముఖ్యమైనవే. (ప్రక. 7:9, 10; 21:1-4) ఎలా?

13. యేసు ఏ విధంగా మనకు ‘మార్గంగా’ ఉన్నాడు?

13 యేసుక్రీస్తు మనకు “మార్గము.” అంటే, మనం ఆయన ద్వారానే దేవుణ్ణి సమీపించగలుగుతాం. ప్రార్థన విషయంలో ఇది నిజం. ఎందుకంటే మనం ఆయన ద్వారా ప్రార్థిస్తేనే దేవుడు తన చిత్తానికి అనుగుణంగా మనం ఏది అడిగినా ఇస్తాడనే హామీ ఇవ్వబడింది. (యోహా. 15:16) మరో విధంగా కూడ యేసు మనకు ‘మార్గంగా’ ఉన్నాడు. పాపం వల్ల మానవులు దేవునికి దూరమయ్యారు. (యెష. 59:2) యేసు ‘అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును’ ఇచ్చాడు. (మత్త. 20:28) ఆ కారణంగా, “యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును” అని బైబిలు చెబుతోంది. (1 యోహా. 1:7) ఆ విధంగా మానవులు దేవునితో సమాధానపడేందుకు దేవుని కుమారుడు మార్గాన్ని తెరిచాడు. (రోమా. 5:8-10) యేసు పట్ల విశ్వాసముంచి ఆయనకు లోబడడం ద్వారా మనం దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు.—యోహా. 3:36.

14. యేసు ఏ విధంగా ‘సత్యముగా’ ఉన్నాడు?

14 యేసు ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడి దానికి అనుగుణంగా జీవించాడు. అంతేకాక మెస్సీయ గురించి రాయబడిన అనేక ప్రవచనాలు ఆయన విషయంలో నెరవేరాయి. కాబట్టి ఆయనే “సత్యము.” “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 కొరిం. 1:20) “రాబోవుచున్న మేలుల ఛాయగల” మోషే ధర్మశాస్త్రం క్రీస్తుయేసు విషయంలో వాస్తవం రూపం దాల్చింది. (హెబ్రీ. 10:1; కొలొ. 2:17) ప్రవచనాలన్నీ యేసునే సూచించాయి. యెహోవా ఉద్దేశాలు నెరవేర్చడంలో ఆయనకున్న ప్రాముఖ్యమైన పాత్రను అవి తెలియజేశాయి. (ప్రక. 19:10) దేవుడు మనకోసం ఉద్దేశించినవి నెరవేరడం చూడాలంటే మనం మెస్సీయను అనుసరించాలి.

15. యేసు ఏ విధంగా ‘జీవంగా’ ఉన్నాడు?

15 యేసు మానవజాతిని తన రక్తంతో కొన్నాడు. అంతేకాక దేవుడు మన “ప్రభువైన క్రీస్తుయేసు” ద్వారా నిత్యజీవమనే బహుమానాన్ని ఇస్తాడు కాబట్టి, యేసు ‘జీవంగా’ ఉన్నాడు. (రోమా. 6:23) మరణించిన వారికి కూడ యేసు ‘జీవంగా’ ఉన్నాడు. (యోహా. 5:28, 29) అంతేకాక, యేసు తన వెయ్యేండ్ల పరిపాలనలో ప్రధాన యాజకుడిగా ఏమి చేస్తాడో ఒకసారి ఆలోచించండి. అంతెందుకు, ఆయన తన రాజ్యంలో భూమ్మీదున్న వారిని పాపమరణాల నుండి శాశ్వతంగా విముక్తి కల్పిస్తాడు!—హెబ్రీ. 9:11, 12, 28.

16. మనం యేసును ఎందుకు అనుసరిస్తాం?

16 తోమాకు యేసు ఇచ్చిన జవాబు మనకు ఎంతో ప్రాముఖ్యమైనది. యేసే మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారా లోకం రక్షించబడేలా దేవుడు ఆయనను పంపించాడు. (యోహా. 3:17) ఆయన ద్వారా తప్ప మరెవ్వరి ద్వారా కూడ దేవుణ్ణి సమీపించలేం. బైబిల్లో స్పష్టంగా ఇలా చెప్పబడింది: “ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.” (అపొ. 4:12) కాబట్టి, గతంలో మనకు ఏమి బోధించబడినా యేసును నమ్మి, ఆయనను అనుసరించి జీవం పొందడం జ్ఞానయుక్తం.—యోహా. 20:31.

క్రీస్తు మాట వినమని మనకు ఆజ్ఞాపించబడింది కాబట్టి . . .

17. దేవుని కుమారుని మాట వినడం ఎందుకు ప్రాముఖ్యం?

17 యేసు రూపాంతరం చెందడాన్ని పేతురు, యోహాను, యాకోబులు చూశారు. వారప్పుడు పరలోకంలో నుండి ఓ స్వరం ఇలా చెప్పడం విన్నారు: “ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు; ఈయన మాట వినుడి.” (లూకా 9:28, 29, 35) కాబట్టి, మెస్సీయ మాట వినమని ఇవ్వబడిన ఆజ్ఞకు లోబడడం ఎంతో ప్రాముఖ్యం.—అపొస్తలుల కార్యములు 3:22, 23 చదవండి.

18. యేసుక్రీస్తు చెప్పేది మనం ఎలా వినవచ్చు?

18 యేసు మాట వినాలంటే ‘యేసువైపు చూస్తూ ఆయనను తలంచుకోవాలి.’ (హెబ్రీ. 12:1-3) కాబట్టి, మనం ఆయన గురించి బైబిల్లో, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురించిన సాహిత్యాల్లో చదువుతున్న విషయాలను, కూటాల్లో ఆయన గురించి చెప్పబడే విషయాలను “ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి.” (హెబ్రీ. 2:1, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; మత్త. 24:45) ఆయన గొర్రెలముగా ఆయన చెప్పేది విని అనుసరించడానికి మనం ఎల్లప్పుడూ ఉత్సాహం చూపిద్దాం.—యోహా. 10:27.

19. క్రీస్తును అనుసరిస్తూ ఉండాలంటే మనం ఏమి చేయాలి?

19 మనకు ఎన్ని కష్టాలు ఎదురైనా క్రీస్తును అనుసరిస్తూ ఉండగలమా? “క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమల[తో]” మనం నేర్చుకునే విషయాలను పాటించడం ద్వారా ‘హితవాక్యప్రమాణమును గైకొంటాం.’ అలా చేస్తే మనం ఆయనను అనుసరిస్తూ ఉండగలం.—2 తిమో. 1:13.

మీరేమి నేర్చుకున్నారు?

• ‘క్రీస్తును’ అనుసరిస్తే మనం ఎలా యెహోవాకు మరింత దగ్గరౌతాం?

• యేసును అనుసరిస్తే మనమెలా యెహోవాను అనుకరించినట్లౌతుంది?

• యేసు ‘మార్గము, సత్యము, జీవము’ అని ఎలా చెప్పవచ్చు?

• మనం యెహోవా అభిషిక్తుని మాట ఎందుకు వినాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[29వ పేజీలోని చిత్రం]

యేసు బోధలు యెహోవా అద్భుతమైన ఆలోచనను ప్రతిబింబించాయి

[30వ పేజీలోని చిత్రం]

యెహోవా అభిషిక్తుణ్ణి మనం నమ్మకంగా అనుసరించాలి

[32వ పేజీలోని చిత్రం]

‘ఈయన నా కుమారుడు, ఈయన మాట వినుడి’ అని యెహోవా ప్రకటించాడు