కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఆదికాండము 6:3లో మనమిలా చదువుతాం: “నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.” అంటే, మానవుల ఆయుష్షును యెహోవా 120 సంవత్సరాలకు పరిమితం చేస్తున్నాడా? రాబోయే జలప్రళయం గురించి నోవహు అంతకాలం ప్రకటించాడా?

కాదు అనేదే ఆ రెండు ప్రశ్నలకు జవాబు.

నోవహు జలప్రళయానికి ముందు చాలామంది ప్రజలు వందల సంవత్సరాలు జీవించారు. జలప్రళయం వచ్చేటప్పటికి నోవహుకు 600 ఏళ్లు, మొత్తం కలిపి ఆయన 950 ఏళ్లు జీవించాడు. (ఆది. 7:6; 9:29) అంతేకాక, జలప్రళయం తర్వాత పుట్టిన వారిలో కూడా కొందరు 120 కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవించారు. ఉదాహరణకు, అర్పక్షదు 438 ఏళ్లు, షేలహు 433 ఏళ్లు జీవించారు. (ఆది. 11:10-15) అయితే, మోషే కాలానికి వచ్చేసరికి ప్రజల సగటు ఆయుష్షు 70 లేదా 80 సంవత్సరాలకు తగ్గిపోయింది. (కీర్త. 90:10) కాబట్టి ఆదికాండము 6:3లో యెహోవా మానవుల అత్యధిక లేదా సగటు ఆయుష్షును 120 సంవత్సరాలకు పరిమితం చేయడం లేదు.

మరైతే ఆ వచనంలో, 120 సంవత్సరాల తర్వాత రాబోయే నాశనం గురించి ఇతరులను హెచ్చరించమని దేవుడు నోవహుకు చెప్పాడా? లేదు. అనేక సందర్భాల్లో యెహోవా నోవహుతో మాట్లాడాడు. ఆ అధ్యాయంలోని 13వ వచనంలో, “దేవుడు నోవహుతో—సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది” అని చెప్పడాన్ని చదువుతాం. ఆ తర్వాతి సంవత్సరాల్లో, నోవహు ఓడను నిర్మించే గొప్ప పనిని పూర్తిచేశాడు. అప్పుడు, ‘యెహోవా—నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి’ అని “నోవహుతో చెప్పెను.” (ఆది. 6:13; 7:1, 4) అలాగే, యెహోవా కొన్ని విషయాల గురించి నోవహుకు చెప్పిన ఇతర సందర్భాలు కూడా ఉన్నాయి.—ఆది. 8:15-17; 9:1, 8, 17.

దానికి భిన్నంగా, ఆదికాండము 6:3లో నోవహు పేరు ప్రస్తావించబడలేదు లేదా దేవుడు ఆయనతో మాట్లాడినట్లు చెప్పబడలేదు. ఆ మాటలు కేవలం దేవుని సంకల్పానికి లేదా నిర్ణయానికి సంబంధించిన ప్రకటన అని చెప్పవచ్చు. (ఆదికాండము 8:21 పోల్చండి.) గమనించదగిన విషయమేమిటంటే, ఆదాము సృష్టించబడడానికి చాలాకాలం ముందు జరిగిన సంఘటనలకు సంబంధించిన వృత్తాంతంలో “దేవుడు . . . పలికెను” వంటి మాటలను మనం చూస్తాం. (ఆది. 1:6, 9, 14, 15, 20, 24) అప్పటికింకా భూమ్మీద మానవుడు సృష్టించబడలేదు కాబట్టి, యెహోవా ఆ మాటలను వారితో చెప్పడంలేదని అర్థమౌతోంది.

కాబట్టి, ఆదికాండము 6:3 లోని మాటలు, భూమ్మీది దుష్ట వ్యవస్థను అంతం చేయాలనే దేవుని నిర్ణయాన్ని సూచిస్తున్నాయన్న ముగింపుకు మనం రావచ్చు. ఇంకా 120 సంవత్సరాలకు అలా చేస్తానని యెహోవా తన తీర్పును ప్రకటించాడు. కానీ, దాని గురించి నోవహుకు అప్పుడు తెలియదు. మరి, దేవుడు కాల పరిమితిని ఎందుకు పెట్టాడు? ఎందుకు వేచివున్నాడు?

దానికి గల కారణాలను అపొస్తలుడైన పేతురు చెప్పాడు. ఆయనిలా రాశాడు: “దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా. . . ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.” (1 పేతు. 3:19, 20) దేవుడు 120 సంవత్సరాల గురించి నిర్ణయించినప్పుడు ఇంకా జరగాల్సినవి కొన్ని ఉన్నాయి. అలా నిర్ణయించిన దాదాపు 20 సంవత్సరాలకు నోవహుకు పిల్లలు పుట్టారు. (ఆది. 5:32; 7:6) వారి ముగ్గురు కుమారులు పెద్దవారై, వివాహాలు చేసుకున్నారు. దానితో నోవహు కుటుంబంలోని వారి సంఖ్య ‘ఎనిమిదికి’ పెరిగింది. అప్పుడు వారు ఓడను కట్టాల్సివుంది. అయితే ఓడ పరిమాణాన్ని, నోవహు కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి చూస్తే అది అంత త్వరగా అయ్యే పని కాదు. అవును, 120 సంవత్సరాలపాటు దేవుడు దీర్ఘశాంతం చూపించినందువల్ల అవన్నీ జరగడం సాధ్యమైంది, ఎనిమిది మంది నమ్మకస్థులైన మానవులు “నీటిద్వారా రక్షణపొంద[డం]” కూడా సాధ్యమైంది.

జలప్రళయం రాబోతుందని యెహోవా నోవహుకు ఏ సంవత్సరంలో చెప్పాడో బైబిలు తెలియజేయడం లేదు. కానీ, నోవహుకు కుమారులు పుట్టి, వారు పెద్దవారై, వివాహాలు చేసుకున్న సమయం నుండి జలప్రళయం వచ్చేవరకు దాదాపు 40 లేదా 50 ఏళ్లు మిగిలివుండవచ్చు. అప్పుడు యెహోవా, ‘నా సన్నిధిని సమస్త శరీరుల అంతము వచ్చియున్నది’ అని నోవహుతో చెప్పాడు. అంతేకాక, పెద్ద ఓడను నిర్మించాలని, దానిలోకి నోవహు ఆయన కుటుంబం వెళ్లాలని కూడా చెప్పాడు. (ఆది. 6:13-18) తర్వాతి దశాబ్దాల్లో, నోవహు నీతిగా జీవించే విషయంలో మాదిరి ఉంచాడు. అంతేగాక, “నీతిని ప్రకటించిన” వ్యక్తిగా ఆయన, అప్పుడున్న భక్తిహీనులను అంతం చేయాలనే దేవుని నిర్ణయం గురించి హెచ్చరించాడు. అంతం ఏ సంవత్సరంలో వస్తుందనేది నోవహుకు ఎంతోకాలం ముందుగా తెలియకపోయినా, అది ఖచ్చితంగా వస్తుందని మాత్రం ఆయనకు తెలుసు. అది నిజంగానే వచ్చిందని మీకూ తెలుసు.—2 పేతు. 2:5.