కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆశాభంగాలు ఎదురైనా చివరివరకు నమ్మకంగా ఉన్నాడు

ఆశాభంగాలు ఎదురైనా చివరివరకు నమ్మకంగా ఉన్నాడు

వారి విశ్వాసాన్ని అనుసరించండి

ఆశాభంగాలు ఎదురైనా చివరివరకు నమ్మకంగా ఉన్నాడు

షిలోహులోని ప్రజలు పడుతున్న దుఃఖాన్ని చూసి సమూయేలు కూడా ఎంతో దుఃఖపడ్డాడు. ఆ పట్టణమంతా శోక సముద్రంలో మునిగిపోయినట్లే ఉంది. తమ తండ్రులు, భర్తలు, కుమారులు, అన్నదమ్ముళ్లు ఇక ఇంటికి రారని విలపిస్తున్న స్త్రీల, పిల్లల ఏడుపులు ఎన్నో ఇళ్లల్లో నుండి వినిపిస్తున్నాయి. ఇశ్రాయేలీయులు ఒక యుద్ధంలో 4,000 మంది సైనికులను పోగొట్టుకున్న కొంతకాలానికే ఫిలిష్తీయుల చేతిలో చిత్తుగా ఓడిపోయి దాదాపు 30,000 మంది సైనికులను పోగొట్టుకున్నారని మాత్రమే మనకు తెలుసు.—1 సమూయేలు 4:1, 2, 10.

వాళ్ల మీదకు విరుచుకుపడిన విపత్తుల్లో అది ఒకటి మాత్రమే. ప్రధాన యాజకుడైన ఏలీకి హొఫ్నీ, ఫీనెహాసు అనే ఇద్దరు చెడ్డ కుమారులున్నారు, వాళ్లు పరిశుద్ధ నిబంధన మందసంతోపాటు షిలోహులో నుండి బయటకు వచ్చారు. ఈ అమూల్యమైన పెట్టె సాధారణంగా గుడారంలాంటి మందిరంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది, అది యెహోవా దేవుని సన్నిధికి సూచనగా ఉండేది. మందసం తమ మధ్యవుంటే తమకు విజయం కలుగుతుందని ప్రజలు మూర్ఖంగా అనుకుంటూ దాన్ని యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. కానీ, ఫిలిష్తీయులు ఆ మందసాన్ని పట్టుకొని హొఫ్నీని, ఫీనెహాసును చంపేశారు.—1 సమూయేలు 4:3-11.

శతాబ్దాలుగా మందసం షిలోహులోవున్న మందిరంలో ఉండడం వల్ల ఆ మందిరానికి ఘనత వచ్చింది. అది ఇప్పుడు లేకుండా పోయింది. అది విన్న 98 ఏళ్ల ఏలీ తను కూర్చున్న పీఠం మీద నుండి వెనక్కిపడి చనిపోయాడు. అదే రోజు తన భర్తను కోల్పోయిన ఆయన కోడలు కూడా ప్రసవిస్తూ చనిపోయింది. చనిపోకముందు ఆమె, “ప్రభావం ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెను” అంది. నిజంగానే, షిలోహుకు ముందున్న ఘనత ఇక ఎప్పటికీ రాదు.—1 సమూయేలు 4:12-22.

సమూయేలు తీవ్రమైన ఈ ఆశాభంగాలను ఎలా తట్టుకున్నాడు? ఆయనకు యెహోవా సంరక్షణను, ఆమోదాన్ని కోల్పోయిన ప్రజలకు సహాయం చేయడమనే సవాలును ఎదుర్కొనేంత గట్టి విశ్వాసం ఉందా? మనందరికీ కొన్నిసార్లు మన విశ్వాసానికి సవాలుగా నిలిచే కష్టాలు, ఆశాభంగాలు ఎదురవుతాయి కాబట్టి సమూయేలు నుండి మనమేమి నేర్చుకోవచ్చో చూద్దాం.

ఆయన ‘నీతికార్యాలు జరిగించాడు’

బైబిలు వృత్తాంతం ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక సమూయేలు గురించి మాట్లాడకుండా పరిశుద్ధ మందసం గురించి మాట్లాడుతూ మందసాన్ని పట్టుకున్నందుకు ఫిలిష్తీయులు ఎలా బాధలుపడ్డారో, వాళ్లు దాన్ని బలవంతంగా ఎలా తిరిగి ఇచ్చేయాల్సి వచ్చిందో తెలియజేస్తుంది. బైబిలు మళ్లీ సమూయేలు గురించి ప్రస్తావించేసరికి దాదాపు 20 ఏళ్లు గడిచిపోయాయి. (1 సమూయేలు 7:2) ఆ సంవత్సరాల్లో ఆయనేమి చేశాడు? దాని గురించి బైబిల్లో ఉంది.

పై సంఘటనలు జరగడానికి ముందే, “సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడియాయెను [‘వెల్లడౌతూ వచ్చింది,’ NW]” అని తెలుస్తోంది. (1 సమూయేలు 3:21) ఆ సంఘటనలు జరిగిన తర్వాతి కాలంలో సమూయేలు ప్రజలకు న్యాయం తీర్చడానికి, వాళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ప్రతీ సంవత్సరం ఇశ్రాయేలులోని మూడు పట్టణాలను సందర్శించి ఆ తర్వాత తన సొంత ఊరు అయిన రామాకు తిరిగి వచ్చేవాడని బైబిలు తెలియజేస్తోంది. (1 సమూయేలు 7:15-17) సమూయేలు ఎప్పుడూ ఖాళీగా ఉండేవాడు కాదు, కాబట్టి ఆ 20 ఏళ్లలో కూడా ఆయన ఎంతో సేవచేసి ఉంటాడని అర్థమౌతోంది.

ఏలీ కుమారుల అనైతికత, మోసం వల్ల ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయింది. దాంతో చాలామంది విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారనిపిస్తోంది. అయితే, రెండు దశాబ్దాలు కృషి చేసిన తర్వాత సమూయేలు ప్రజలకు ఈ సందేశం ఇచ్చాడు, ‘మీ పూర్ణ హృదయంతో యెహోవావైపు మళ్లితే, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, పట్టుదలతో యెహోవావైపు మీ హృదయాలను తిప్పి ఆయనను సేవిస్తే, ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మల్ని విడిపిస్తాడు.’—1 సమూయేలు 7:3.

‘ఫిలిష్తీయుల చేయి’ ప్రజలకు భారంగా తయారైంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు సైన్యం ఘోరంగా ఓడిపోవడంతో వాళ్లను అణగద్రొక్కినా తమను శిక్షించే వాళ్లు ఎవరూ ఉండరని ఫిలిష్తీయులు అనుకున్నారు. కానీ యెహోవావైపు తిరిగితేనే పరిస్థితి చక్కబడుతుందని సమూయేలు ఇశ్రాయేలీయులకు హామీ ఇచ్చాడు. వాళ్లలా చేయడానికి ఇష్టపడ్డారా? వాళ్లు తమ విగ్రహాలను తీసేసి, ‘యెహోవాను మాత్రమే సేవించడం’ మొదలుపెట్టారు. అది చూసి సమూయేలు చాలా సంతోషించాడు. ఆయన యెరూషలేముకు ఉత్తరాన పర్వతప్రాంతంలోవున్న మిస్పా అనే పట్టణంలో సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ సమావేశమైన ఇశ్రాయేలీయులు ఉపవాసముండి, విగ్రహారాధనకు సంబంధించి ఎన్నో పాపాలు చేసినందుకు పశ్చాత్తాపపడ్డారు.—1 సమూయేలు 7:4-6.

అయితే, ఇశ్రాయేలీయులు సమావేశమయ్యారని ఫిలిష్తీయులు తెలుసుకుని వాళ్ల మీద దండెత్తడానికి మంచి అవకాశం దొరికిందని అనుకున్నారు. వాళ్లు ఆ యెహోవా ఆరాధకులను నాశనం చేయడానికి తమ సైన్యాన్ని మిస్పాకు పంపారు. రాబోతున్న ప్రమాదం గురించి ఇశ్రాయేలీయులకు తెలిసింది. వాళ్లు భయపడిపోయి, తమ కోసం ప్రార్థన చేయమని సమూయేలును అడిగారు. ఆయన ప్రార్థన చేసి బలి కూడా అర్పించాడు. ఆ పరిశుద్ధ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఫిలిష్తీయుల సైన్యం మిస్పా దగ్గరకు వచ్చింది. అప్పుడు యెహోవా సమూయేలు ప్రార్థనకు జవాబిచ్చాడు. దాంతో యెహోవా ఉరుముల శబ్దంతో తన కోపాన్ని వెళ్లగక్కాడు. ఆయన ఆ రోజున, ‘ఫిలిష్తీయుల వద్ద ఒక భయంకరమైన ఉరుమును కలిగించడంతో’ వాళ్లు గందరగోళంలో పడిపోయారు.—1 సమూయేలు 7:7-10 పరిశుద్ధ బైబిల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ఆ ఫిలిష్తీయులు, ఉరుముల శబ్దాలకు భయపడిపోయి తల్లి చాటున దాక్కునే చిన్నపిల్లల్లా ఉండేవాళ్లని మనం అనుకోవాలా? కాదు, వాళ్లు శరీర ధారుడ్యమున్న, యుద్ధంలో రాటుదేలిన సైనికులు. కాబట్టి ఆ ఉరుము ఇంతకుముందు వాళ్లు విన్న ఉరుములాంటిది కాకపోవచ్చు. ఈ ‘భయంకర ఉరుము’ వల్ల వచ్చిన భీకరమైన శబ్దానికి వాళ్లు భయపడ్డారా? ఆ శబ్దం నిర్మలమైన నీలాకాశం నుండి వచ్చిందా? లేదా ఆ పర్వతప్రాంతంలో అది ప్రతిధ్వనించిందా? ఏదేమైనా అది ఫిలిష్తీయులను గడగడలాడించింది. వాళ్లు పూర్తి గందరగోళంలో పడి, అంతవరకు తాము హింసించిన ఇశ్రాయేలీయులకు తామే ఎరగా మారారు. మిస్పా నుండి దూసుకొచ్చిన ఇశ్రాయేలు పురుషులు వాళ్లను ఓడించి యెరూషలేముకు నైరుతి దిక్కున ఎన్నో మైళ్ల వరకు వాళ్లను తరుముకుంటూ వెళ్లారు.—1 సమూయేలు 7:11.

ఆ యుద్ధం దేవుని ప్రజలకు ఓ మైలురాయి లాంటిది. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న ఆ తర్వాతి కాలమంతట్లో ఫిలిష్తీయులు పారిపోతూనే ఉన్నారు. దేవుని ప్రజలు ఒక్కో పట్టణాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు.—1 సమూయేలు 7:13, 14.

చాలా శతాబ్దాల తర్వాత అపొస్తలుడైన పౌలు, ‘నీతికార్యాలను జరిగించిన’ నమ్మకమైన న్యాయాధిపతుల గురించి, ప్రవక్తల గురించి మాట్లాడుతున్నప్పుడు సమూయేలు పేరు కూడా ప్రస్తావించాడు. (హెబ్రీయులు 11:32, 33) దేవుని దృష్టికి మంచిది, సరైనది చేసేలా సమూయేలు ప్రజలకు సహాయం చేశాడు. ఆశాభంగాలు ఎదురైనా ఓర్పుగా యెహోవా మీద ఆధారపడి, తన పనిలో చివరివరకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టే ఆయన తన నియామకాన్ని సమర్థవంతంగా నెరవేర్చగలిగాడు. అంతేకాదు, ఆయన కృతజ్ఞతా స్ఫూర్తిని కూడా కనబర్చాడు. మిస్పా దగ్గర విజయం సాధించిన తర్వాత, యెహోవా తన ప్రజలకు సహాయం చేసిన దానికి గుర్తుగా సమూయేలు ఒక రాయిని ప్రతిష్ఠించాడు.—1 సమూయేలు 7:12.

మీరు కూడా ‘నీతికార్యాలను జరిగించాలని’ అనుకుంటున్నారా? అలాగైతే, మీరు సమూయేలు చూపించిన ఓర్పు, వినయం, కృతజ్ఞతా స్ఫూర్తి గురించి తెలుసుకోవడం మంచిది. మనలో ఎవరికి మాత్రం ఆ లక్షణాలు అవసరంలేదు? సమూయేలు యౌవనంలో ఉన్నప్పుడే అలాంటి లక్షణాలను అలవర్చుకుని వాటిని చూపించడం మంచిదైంది, ఎందుకంటే ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన మరెన్నో ఆశాభంగాలు ఎదురయ్యాయి.

‘నీ కుమారులు నీ ప్రవర్తనలాంటి ప్రవర్తనగలవాళ్లు కాదు’

బైబిల్లో సమూయేలు ప్రస్తావన మళ్లీ వచ్చేసరికి ఆయన ‘వృద్ధుడయ్యాడు.’ ఆ సమయానికల్లా సమూయేలుకు ఎదిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు. యోవేలు, అబీయా అనే వీళ్లకు, న్యాయం తీర్చే పనిలో తనకు సహాయం చేసే బాధ్యత అప్పగించాడు. అయితే విచారకరంగా వాళ్లు సమూయేలు నమ్మకాన్ని వమ్ము చేశారు. సమూయేలు నిజాయితీపరుడూ నీతిమంతుడూ అయినా ఆయన కుమారులు మాత్రం న్యాయాన్ని వక్రీకరిస్తూ లంచాలు తీసుకుంటూ తమకున్న అధికారాన్ని స్వార్థానికి వాడుకున్నారు.—1 సమూయేలు 8:1-3.

ఒకరోజు, ఇశ్రాయేలు పెద్దలు వృద్ధ ప్రవక్తయైన సమూయేలు దగ్గరకు వచ్చి, ‘నీ కుమారులు నీ ప్రవర్తనలాంటి ప్రవర్తనగలవాళ్లు కాదు’ అని ఫిర్యాదు చేశారు. (1 సమూయేలు 8:4, 5) ఆయనకు ఆ విషయం ముందే తెలుసా? దాని గురించి వృత్తాంతం చెప్పడం లేదు. అయితే, సమూయేలు ఏలీలా నిందార్హుడైన తండ్రి మాత్రం కాదు. ఏలీ తన కుమారుల చెడు ప్రవర్తనను సరిదిద్దకుండా, దేవుని కన్నా వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినందుకు యెహోవా ఆయనను గద్దించి, శిక్షించాడు. (1 సమూయేలు 2:27-29) యెహోవాకు సమూయేలులో అలాంటి తప్పు ఎప్పుడూ కనబడలేదు.

సమూయేలు తన కుమారుల చెడు ప్రవర్తన గురించి తెలుసుకున్న తర్వాత అనుభవించిన తీవ్రమైన అవమానం, ఆందోళన లేదా ఆశాభంగం గురించి వృత్తాంతం తెలియజేయడం లేదు. అయితే, ఆయనకు కలిగిన భావాలను చాలామంది తల్లిదండ్రులు అర్థం చేసుకోగలుగుతారు. మనమున్న కష్టకాలాల్లో తల్లిదండ్రుల అధికారాన్ని ధిక్కరించడం, క్రమశిక్షణను పట్టించుకోకపోవడం సర్వసాధారణమైపోయింది. (2 తిమోతి 3:1-5) అలాంటి మానసిక క్షోభను అనుభవిస్తున్న తల్లిదండ్రులు సమూయేలు ఉదాహరణ నుండి కాస్త ఓదార్పును, నిర్దేశాన్ని పొందవచ్చు. ఆయన తన కుమారులు చెడు మార్గంలో వెళ్లడం చూసి తను కూడా చెడు మార్గంలో వెళ్లాలని అస్సలు అనుకోలేదు. మాటలుగానీ, క్రమశిక్షణగానీ మార్చలేని కఠిన హృదయాలను మార్చడానికి తల్లిదండ్రుల మంచి ప్రవర్తన ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. సమూయేలులా, తమ సొంత తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి సంతోషపర్చే అవకాశం తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది.

“మాకు ఒక రాజును నియమించు”

సమూయేలు కుమారులు తమ అత్యాశ, స్వార్థం వల్ల ఎంతటి ఘోరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో ఊహించి ఉండకపోవచ్చు. ఇశ్రాయేలు పెద్దలు, ‘సకలజనుల్లా మాకు ఒక రాజును నియమించు’ అని సమూయేలును అడుగుతూ వచ్చారు. వాళ్లలా అడిగినప్పుడు, వాళ్లు తనని తిరస్కరిస్తున్నట్లు సమూయేలుకు అనిపించిందా? ఎంతైనా, ఆయన దశాబ్దాలుగా యెహోవా పక్షాన వాళ్లకు న్యాయం తీరుస్తూ వచ్చాడు. ఇప్పుడు వాళ్లకు సమూయేలులాంటి ఒక సామాన్య ప్రవక్త కాదుగానీ న్యాయాధిపతిగా ఉండడానికి ఒక రాజు కావాల్సివచ్చింది. తమ చుట్టుపక్కల రాజ్యాలకు రాజులున్నారు కాబట్టి తమకు కూడా ఒక రాజు కావాలనుకున్నారు! దానికి సమూయేలు ఎలా స్పందించాడు? అది ఆయన “దృష్టికి ప్రతికూలముగా ఉండెను” అని మనం చదువుతాం.—1 సమూయేలు 8:5, 6.

సమూయేలు ప్రార్థనలో యెహోవాకు ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు ఆయనెలా స్పందించాడో చూడండి, ‘జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించు. వారు నిన్ను విసర్జించలేదుగానీ తమను ఏలకుండా నన్నే విసర్జించారు.’ ఆ మాటలు సమూయేలును ఎంతో ఓదార్చి ఉంటాయి. కానీ ఆ ప్రజలు సర్వశక్తిమంతుడైన యెహోవాను ఎంత ఘోరంగా అవమానించారో! యెహోవా తన ప్రవక్తతో, మానవుడు వాళ్లమీద రాజుగా ఉంటే ఎంతో గొప్ప మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఇశ్రాయేలీయులను హెచ్చరించమన్నాడు. సమూయేలు అలా హెచ్చరించడానికి చూసినప్పుడు వాళ్లు, ‘అలా కాదు, మాకు ఒక రాజు కావాలి’ అని పట్టుబట్టారు. సమూయేలు ఎప్పుడూ యెహోవా చెప్పింది చేసినట్లే ఇప్పుడు కూడా ఆయన చెప్పినట్లు వెళ్లి, ఆయన ఎన్నుకున్న రాజును అభిషేకించాడు.—1 సమూయేలు 8:7-20.

అయితే, సమూయేలు ఆయన చెప్పింది అయిష్టంగా, చేయాలికదా అన్నట్లు చేశాడా? తనకు ఆశాభంగం ఎదురైనందుకు మనసులో కోపం పెంచుకున్నాడా? అలాంటి పరిస్థితిలో చాలామంది అలాగే చేస్తారు కానీ సమూయేలు మాత్రం అలా చేయలేదు. ఆయన సౌలును అభిషేకించి, ఆయన యెహోవా స్వయంగా ఎన్నుకున్న వ్యక్తి అని అంగీకరించాడు. కొత్త రాజును ఆహ్వానిస్తున్నానని, ఆయనకు లోబడివుంటానని చూపించడానికి సమూయేలు ఆయనను ముద్దుపెట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రజలతో ఇలా అన్నాడు, ‘యెహోవా ఏర్పరచుకున్న వ్యక్తిని మీరు చూశారా? జనులందరిలో అతనిలాంటివాళ్లు ఒక్కరూ లేరు.’—1 సమూయేలు 10:1, 24.

సమూయేలు, యెహోవా ఎన్నుకున్న వ్యక్తిలోవున్న మంచి లక్షణాలకే ప్రాధాన్యత ఇచ్చాడు గానీ లోపాలకు కాదు. తన విషయంలో కూడా, దేవునిపట్ల నమ్మకంగా ఉండడానికే ప్రాధాన్యతనిచ్చాడు గానీ నిలకడలేని ప్రజల ఆమోదానికి కాదు. (1 సమూయేలు 12:1-4) అంతేకాదు, సమూయేలు తనకివ్వబడిన నియామకాన్ని నమ్మకంగా నెరవేరుస్తూ, దేవుని ప్రజలకు ఆధ్యాత్మిక ప్రమాదాలు ఎందుకు ఎదురయ్యాయో వాళ్లకు ఉపదేశిస్తూ యెహోవాకు నమ్మకంగా ఉండమని వాళ్లను ప్రోత్సహించాడు. ఆయన చెప్పింది వాళ్ల హృదయాలకు చేరింది కాబట్టి వాళ్లు తమ కోసం ప్రార్థన చేయమని ఆయనను వేడుకున్నారు. ఆయన వాళ్లకిలా చక్కగా సమాధానమిచ్చాడు, ‘నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానేస్తే యెహోవాకు విరోధంగా పాపం చేసినవాణ్ణవుతాను. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్ఠమైన చక్కని మార్గాన్ని మీకు బోధిస్తాను.’—1 సమూయేలు 12:21-24.

ఏదైనా ఒక స్థానానికి లేదా పదవికి మరొకరు నియమించబడినప్పుడు మీకు ఆశాభంగం కలిగిందా? సమూయేలును ఆదర్శంగా తీసుకుని, మనం మన మనసులో ఎప్పుడూ అసూయ గానీ ద్వేషం గానీ పెట్టుకోకూడదని గుర్తుంచుకోవాలి. తన నమ్మకమైన సేవకుల్లో ప్రతీ ఒక్కరూ చేయడానికి దేవుని దగ్గర ప్రతిఫలదాయకమైన, సంతృప్తినిచ్చే పని ఎంతో ఉంది.

‘సౌలు గురించి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు?’

సమూయేలు, సౌలులో మంచి లక్షణాలను చూడడం సబబే, ఎందుకంటే ఆయన నిజంగానే అసాధారణమైన వ్యక్తి. ఆయన మంచి పొడుగరి, అందగాడు. అంతేకాదు ఆయన ధైర్యవంతుడు, తెలివైనవాడేకాక మొదట్లో వినయంగా, అణకువగా ఉన్నాడు. (1 సమూయేలు 10:22, 23, 27) ఆయనకు ఆ లక్షణాలతోపాటు, తన జీవిత గమనాన్ని నిర్దేశించుకుని సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా ఉంది. అది దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతి. (ద్వితీయోపదేశకాండము 30:19) ఆయన ఆ బహుమతిని సరిగ్గా ఉపయోగించుకున్నాడా?

విచారకరమైన విషయమేమిటంటే, సాధారణంగా ఒక వ్యక్తికి అధికారం చేతికొస్తే ఆయనలో వినయం లేకుండా పోతుంది. సౌలు కొంతకాలానికే అహంకారిగా మారాడు. సమూయేలు ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ఆయన లోబడలేదు. ఒకసారి సౌలు అసహనంతో, సమూయేలు మాత్రమే అర్పించగలిగే దహనబలిని తను అర్పించాడు. దాంతో సమూయేలు సౌలును గట్టిగా గద్దించాల్సివచ్చింది, అంతేకాదు సౌలు కుటుంబంలోని వాళ్లు రాజులు కారని కూడా సమూయేలు ముందే చెప్పాడు. సమూయేలు తనను గద్దించినప్పుడు ఆయన తన తప్పు తెలుసుకునే బదులు అవిధేయత చూపిస్తూ ఇంకా ఘోరమైన చెడ్డపనులు చేశాడు.—1 సమూయేలు 13:8, 9, 13, 14.

అమాలేకీయులతో యుద్ధం చేయమని యెహోవా సమూయేలు ద్వారా సౌలుకు చెప్పాడు. అంతేకాదు, అమాలేకీయుల దుష్ట రాజైన అగగును హతం చేయమని కూడా చెప్పాడు. అయితే, సౌలు అగగును చంపకుండా, యుద్ధంలో శత్రువుల నుండి స్వాధీనం చేసుకున్న వాటిని నాశనం చేయకపోవడమే కాక వాటిలో మంచివి ఉంచుకున్నాడు. సమూయేలు సౌలును సరిదిద్దడానికి వచ్చినప్పుడు సౌలు తనెంత మారిపోయాడో చూపించుకున్నాడు. వినయంతో గద్దింపును స్వీకరించాల్సిందిపోయి తన తప్పు ఏమీ లేదని వాదించాడు, సాకులు చెప్పాడు, తను చేసిన పనులను సమర్థించుకున్నాడు, విషయాన్ని పక్కకు మళ్లించాడు, ప్రజల మీద తప్పు మోపడానికి ప్రయత్నించాడు. యుద్ధంలో శత్రువుల నుండి స్వాధీనం చేసుకున్న వాటిలో కొన్ని మంచి వాటిని యెహోవాకు బలి అర్పించడానికి ఉంచానని చెప్పడం ద్వారా సౌలు గద్దింపును నిర్లక్ష్యంగా పెడచెవినపెట్టినప్పుడు సమూయేలు చాలామందికి సుపరిచితమైన ఈ మాటలు అన్నాడు, ‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞ గైకొనడం శ్రేష్ఠం.’ సమూయేలు ధైర్యంగా సౌలును గద్దించి, సౌలు చేతుల్లోవున్న రాజ్యాధికారం ఆయన కన్నా మంచి వ్యక్తి చేతుల్లోకి వెళ్తుందన్న యెహోవా నిర్ణయాన్ని తెలియజేశాడు.—1 సమూయేలు 15:1-33.

సౌలు చేసిన తప్పులకు సమూయేలు ఎంతో బాధపడ్డాడు. రాత్రంతా ఏడుస్తూ ఆ విషయం గురించి యెహోవాకు ప్రార్థించాడు. అంతేకాదు, సౌలు గురించి విలపించాడు. సౌలుకు ఎంతో సామర్థ్యం ఉందని, ఆయనలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని సమూయేలు గ్రహించాడు, కానీ ఇప్పుడు ఆయన ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఒకప్పుడు తనకు తెలిసిన వ్యక్తి మారిపోయాడు, ఆయనలో ఉన్న మంచి లక్షణాలన్నీ పోయాయి, ఆయన యెహోవాకు ఎదురుతిరిగాడు. సమూయేలు మళ్లీ సౌలు ముఖాన్ని చూడడానికి ఇష్టపడలేదు. అయితే, సరిగ్గా సమయానికి యెహోవా సమూయేలును మృదువుగా ఇలా గద్దించాడు, ‘ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీవు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపు, బేత్లెహేమీయుడైన యెష్షయి వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమిస్తున్నాను.’—1 సమూయేలు 15:34, 35; 16:1.

యెహోవా చేయాలనుకున్నది, అన్నివేళలా నమ్మకంగా ఉండని అపరిపూర్ణ మానవుల మీద ఆధారపడివుండదు. ఒక వ్యక్తి నమ్మకద్రోహిగా మారితే, యెహోవా తను చేయాలనుకున్నది చేయడానికి మరో వ్యక్తిని ఉపయోగించుకుంటాడు. కాబట్టి వృద్ధుడైన సమూయేలు సౌలు గురించి ఇక దుఃఖించడం మానేశాడు. యెహోవా చెప్పినట్లు సమూయేలు బేత్లెహేములోని యెష్షయి ఇంటికి వెళ్లి, అక్కడ ఆయన కుమారుల్లో చాలామందిని చూశాడు. వాళ్లంతా అందగాళ్లే. కానీ మొదటి నుండి యెహోవా సమూయేలుకు ఇలా గుర్తుచేశాడు, ‘అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్యపెట్టవద్దు, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుష్యులు పైరూపాన్ని లక్ష్యపెడతారు గానీ యెహోవా హృదయాలను లక్ష్యపెడతాడు.’ (1 సమూయేలు 16:7) చివరికి, సమూయేలు యెష్షయి చిన్న కుమారుడైన దావీదును కలిశాడు, ఈయనే యెహోవా ఎన్నుకున్న వ్యక్తి!

యెహోవా సౌలు స్థానంలో దావీదును ఎన్నుకోవడం ఎంత సరైనదో సమూయేలు తను చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు మరింత బాగా అర్థం చేసుకోగలిగాడు. సౌలు దావీదు మీద అసూయ పెంచుకుని ఆయనను చంపాలని చూశాడు, అంతేకాదు సౌలు మతభ్రష్టుడయ్యాడు. అయితే, దావీదు ధైర్యం, విధేయత, విశ్వాసం, నమ్మకం వంటి ఎన్నో మంచి లక్షణాలను చూపించాడు. సమూయేలు చివరి దశలో ఆయన విశ్వాసం మరింత పెరిగింది. నిరుత్సాహపరిచే ఏ సమస్యనైనా లేదా ఏ పరిస్థితినైనా యెహోవా సరిచేయగలడని లేదా దాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చగలడని ఆయన తెలుసుకున్నాడు. సమూయేలు దాదాపు ఒక శతాబ్దంపాటు ఎన్నో మంచి లక్షణాలు చూపించి, మంచి పేరు సంపాదించుకుని చివరకు చనిపోయాడు. ఈ నమ్మకమైన వ్యక్తి చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎంతో దుఃఖించారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు! ఇప్పటికీ, యెహోవా సేవకులు, ‘విశ్వాసం విషయంలో నేను సమూయేలులా ఉంటానా?’ అని ప్రశ్నించుకోవడం మంచిది. (w11-E 01/01)

[17వ పేజీలోని చిత్రం]

తమ వాళ్లు చనిపోవడంతో కలిగిన తీవ్రమైన దుఃఖాన్ని, ఆశాభంగాన్ని తట్టుకోడానికి సమూయేలు తన ప్రజలకు ఎలా సహాయం చేశాడు?

[18వ పేజీలోని చిత్రం]

తన కుమారులు చెడ్డవాళ్లుగా మారినందుకు కలిగిన ఆశాభంగాన్ని సమూయేలు ఎలా తట్టుకున్నాడు?