కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యోహాను 11:35 చెబుతున్నట్లు, లాజరును పునరుత్థానం చేసే ముందు యేసు ఎందుకు కన్నీళ్లు విడిచాడు?

మన ప్రియమైన వాళ్లు చనిపోయినప్పుడు, వాళ్లు ఇక లేరనే బాధతో సహజంగానే మనం కన్నీళ్ల పర్యంతం అవుతాం. లాజరును యేసు ఎంతగానో ప్రేమించినప్పటికీ, యేసు కన్నీళ్లు పెట్టుకుంది లాజరు చనిపోయినందుకు కాదు. ఆ సందర్భం సూచిస్తున్నట్లు, లాజరు మరణం వల్ల దుఃఖంలో మునిగిపోయిన బంధుమిత్రుల పట్ల కనికరంతో యేసు కంటతడి పెట్టుకున్నాడు.—యోహా. 11:36.

లాజరు అనారోగ్యం పాలయ్యాడని విన్న యేసు, వెంటనే అతణ్ణి బాగుచేయడానికి అతని ఇంటికి బయల్దేరలేదు. ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “అతడు [లాజరు] రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే యింక రెండు దినములు నిలిచెను.” (యోహా. 11:6) యేసు ఎందుకు ఆలస్యం చేశాడు? అందుకు ఒక కారణం ఉంది. యేసు ఇలా అన్నాడు: “యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినది.” (యోహా. 11:4) ఈ లేఖనం చూపిస్తున్నట్లుగా ఆ వ్యాధి లాజరు “మరణము కొరకు వచ్చినది కాదు.” యేసు, లాజరు మరణాన్ని “దేవుని మహిమకొరకు” ఉపయోగించాలనుకున్నాడు. ఎలా? సమాధిలోవున్న తన ప్రియ స్నేహితుణ్ణి పునరుత్థానం చేయడం ద్వారా యేసు ఒక గొప్ప అద్భుతం చేయనున్నాడు.

ఆ సందర్భంలో యేసు తన శిష్యులతో మాట్లాడుతూ మరణాన్ని నిద్రతో పోల్చాడు. అందుకే ఆయన తన శిష్యులతో “[లాజరును] మేలుకొలుప వెళ్లుచున్నానని” అన్నాడు. (యోహా. 11:11) ఒక తల్లి కునుకు తీస్తున్న తన పిల్లవాడిని లేపినంత సులభంగా, చనిపోయిన లాజరును యేసు బ్రతికించగలడు. కాబట్టి, కేవలం లాజరు మరణాన్ని బట్టి బాధపడడానికి యేసుకు ఏ కారణమూ లేదు.

మరైతే, యేసు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? దానికి లేఖన సందర్భమే జవాబిస్తోంది. యేసు, లాజరు సహోదరియైన మరియను కలిసినప్పుడు ఆమె, అక్కడున్న ఇతరులు ఏడవడం చూసి ‘కలవరపడి ఆత్మలో మూలిగాడు.’ వాళ్ల బాధను చూసి యేసు ‘ఆత్మలో మూలిగేంతగా’ నొచ్చుకున్నాడు. తన ప్రియమైన స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోవడం యేసును ఎంతగానో కలతపెట్టింది.—యోహా. 11:33, 35.

రాబోయే నూతనలోకంలో, చనిపోయిన మన ప్రియమైన వాళ్లను తిరిగి బ్రతికించి, వాళ్లు మంచి ఆరోగ్యంతో జీవించేలా చేసే శక్తి, సామర్థ్యం యేసుకు ఉన్నాయని ఈ వృత్తాంతం చూపిస్తోంది. అంతేకాక, ఆదాము నుండి వచ్చిన మరణం వల్ల తమ ప్రియమైన వాళ్లను కోల్పోయిన వ్యక్తుల పట్ల యేసుకు సహానుభూతి ఉందని కూడా ఈ వృత్తాంతం చూపిస్తోంది. తమ ప్రియమైన వాళ్లు చనిపోవడం వల్ల బాధలో ఉన్న వ్యక్తుల పట్ల కనికరం చూపించాలని కూడా ఈ వృత్తాంతం మనకు నేర్పిస్తోంది.

లాజరును పునరుత్థానం చేయబోతున్నాననే విషయం యేసుకు తెలుసు. అయినా, తన స్నేహితుల మీద ప్రేమతో, కనికరంతో యేసు కంటతడి పెట్టుకున్నాడు. అదే విధంగా, మన సహానుభూతి ‘ఏడ్చువారితో ఏడ్చేలా’ చేయవచ్చు. (రోమా.12:16) అలా ఏడ్చినంత మాత్రాన పునరుత్థాన నిరీక్షణ మీద నమ్మకం లేదని కాదు. లాజరును తాను పునరుత్థానం చేయబోతున్నానని తెలిసినా యేసు బాధలో ఉన్న వాళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకోవడం ద్వారా ఇతరుల పట్ల సానుభూతి చూపించి ఎంత చక్కని ఆదర్శం ఉంచాడో కదా!