కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు ఏమి చేస్తాడు?

దేవుడు ఏమి చేస్తాడు?

మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీ మంచి స్నేహితుడు మీకు సహాయం చేయడానికి ఏమైనా చేస్తే బాగుండు అని మీరు కోరుకుంటారు. దాన్ని మనసులో ఉంచుకుని కొంతమంది దేవుడు వాళ్లకోసం ఎలాంటి సహాయం చేయట్లేదు కాబట్టి ఆయన వాళ్లకు స్నేహితుడు కాదు అంటారు. కానీ నిజానికి దేవుడు మన ప్రయోజనం కోసం ఇప్పటికే చాలా పనులు చేశాడు, అంతేకాదు మనకు ఇప్పుడున్న సమస్యలన్నిటి విషయంలో, బాధలు అన్నిటి విషయంలో త్వరలోనే చర్యలు తీసుకుంటాడు. దేవుడు ఏమి చేస్తాడు?

దుష్టత్వం అంతా తీసేస్తాడు

దేవుడు దుష్టత్వాన్ని దాన్ని వేర్లతో తీసేస్తాడు. దాని మూలం గురించి మాట్లాడుతూ బైబిలు ఇలా అంటుంది: “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది.” (1 యోహాను 5:19) ఆ ‘దుష్టుడు’ మరెవరో కాదు, “ఈ లోక పరిపాలకుడు” అని యేసు పిలిచిన అపవాది అయిన సాతానే. (యోహాను 12:31) మానవజాతిపైన సాతాను ప్రభావమే భూమ్మీద ఉన్న ఈ దుఃఖకరమైన పరిస్థితులకు మూల కారణం. మరి దేవుడు ఏమి చేస్తాడు?

యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా త్వరలోనే చర్య తీసుకుంటాడు, ఆయనను ఉపయోగించి “మరణాన్ని కలుగజేసే సామర్థ్యం ఉన్నవాణ్ణి, అంటే అపవాదిని” నాశనం చేస్తాడు. (హెబ్రీయులు 2:14; 1 యోహాను 3:8) నిజానికి, తాను అంతం అవడానికి ముందు “తనకు కొంచెం సమయమే ఉందని” అపవాదికి తెలుసు అని బైబిలు చూపిస్తుంది. (ప్రకటన 12:12) దేవుడు దుష్టత్వాన్ని, దుష్టత్వాన్ని కలుగజేసే వాళ్లందర్నీ పూర్తిగా తీసేస్తాడు.—కీర్తన 37:9; సామెతలు 2:22.

భూమిని పరదైసుగా మారుస్తాడు

భూమ్మీద దుష్టత్వాన్ని పూర్తిగా తీసేసిన తర్వాత, మనుషులు, భూమి గురించి తనకున్న శాశ్వత సంకల్పాన్ని నెరవేర్చడానికి మన సృష్టికర్త చర్యలు తీసుకుంటాడు. మనం దేని కోసం ఎదురు చూడవచ్చు?

శాశ్వతమైన శాంతి, భద్రత. “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.

పుష్కలమైన, ఆరోగ్యకరమైన ఆహారం. “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడుచుండును.”—కీర్తన 72:16.

మంచి ఇళ్లు, సంతృప్తినిచ్చే పని. “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. . . . నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.”—యెషయా 65:21, 22.

అలాంటి పరిస్థితులను మీరు చూడాలని కోరుకుంటున్నారా? అవి త్వరలోనే మీకు రోజూ ఎదురయ్యే అనుభవాలు అవుతాయి.

అనారోగ్యాన్ని, మరణాన్ని లేకుండా చేస్తాడు

ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పాడవుతుంది, చివరికి చనిపోతున్నారు, కానీ త్వరలోనే ఈ పరిస్థితి మారుతుంది. దేవుడు త్వరలోనే యేసు విమోచన క్రయధన బలివల్ల వచ్చే ప్రయోజనాలను అమలులోకి తీసుకువస్తాడు. అప్పుడు “ఆయన [యేసు] మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం” పొందుతారు. (యోహాను 3:16) దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

అనారోగ్యం నిర్మూలం అవుతుంది. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.”—యెషయా 33:24.

మరణం ఇంక మనుషుల్ని బాధపెట్టదు. “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.”—యెషయా 25:8.

మనుషులు శాశ్వతకాలం జీవిస్తారు. “దేవుడు ఇచ్చే బహుమానం మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా శాశ్వత జీవితం.”—రోమీయులు 6:23.

చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారు. “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు పునరుత్థానం” చేస్తాడు. (అపొస్తలుల కార్యాలు 24:15) దేవుడు ఇచ్చిన బహుమతియైన విమోచన క్రయధనం వల్ల చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారు.

దేవుడు వీటన్నిటిని ఎలా నెరవేరుస్తాడు?

ఏ లోపంలేని ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు

భూమి విషయంలో, మనుషుల విషయంలో దేవుడు తన సంకల్పాన్ని క్రీస్తుయేసును పరిపాలకునిగా నియమించిన ఒక పరలోక ప్రభుత్వం ద్వారా నెరవేరుస్తాడు. (కీర్తన 110:1, 2) యేసు తన అనుచరులకు “పరలోకంలో ఉన్న మా తండ్రీ, . . . నీ రాజ్యం రావాలి” అని ప్రార్థన చేయమని చెప్పిన ప్రభుత్వం లేదా రాజ్యం ఇదే.—మత్తయి 6:9, 10.

దేవుని రాజ్యం భూమిని పరిపాలిస్తుంది, భూమ్మీద ఉన్న నొప్పులు, బాధలు అన్నిటిని పూర్తిగా తీసేస్తుంది. ఈ రాజ్యం ఇప్పటి వరకు మనుషులు చూడనంత గొప్పది! అందుకే యేసు తన భూపరిచర్యలో “రాజ్యం గురించిన మంచివార్త” ప్రకటిస్తూ ఎంతో శ్రమించాడు, శిష్యులను కూడా అలాగే చేయమని చెప్పాడు.—మత్తయి 4:23; 24:14.

తాను సృష్టించిన మనుషుల మీద ఉన్న ఎంతో ప్రేమతో యెహోవా దేవుడు వాళ్లకు ఈ అద్భుతమైన వాటన్నిటిని చేస్తానని మాటిచ్చాడు. అది మీరు దేవున్ని తెలుసుకునేలా, ఆయనకు దగ్గరయ్యేలా చేయడం లేదా? ఆయన్ని తెలుసుకుని, ఆయనకు దగ్గరవ్వడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? తర్వాత ఆర్టికల్‌ దాన్ని వివరిస్తుంది.

దేవుడు ఏమి చేస్తాడు? దేవుడు అనారోగ్యాన్ని, మరణాన్ని తీసేస్తాడు, మనుషులందరినీ ఆయన ప్రభుత్వం ద్వారా ఐక్యం చేస్తాడు, భూమిని పరదైసుగా మారుస్తాడు