కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1923—వంద సంవత్సరాల క్రితం

1923—వంద సంవత్సరాల క్రితం

“1923వ సంవత్సరంలో ఏదో చిన్న ఆశ కనిపిస్తుంది. కష్టాల చీకట్లో ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగు రాబోతుందని చెప్పడం మనకు దొరికిన గొప్ప అవకాశం” అని ద వాచ్‌ టవర్‌ జనవరి 1, 1923 చెప్పింది. అయితే, ఆ సంవత్సరం కేవలం బయటివాళ్లకే కాదు బైబిలు విద్యార్థులకు (యెహోవాసాక్షుల్ని ఇంతకుముందు అలా పిలిచేవాళ్లు) కూడా చాలా ప్రోత్సాహంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ల మీటింగ్స్‌లో, సమావేశాల్లో, ప్రకటన పనిలో మార్పులు వచ్చాయి. దానివల్ల వాళ్ల మధ్యున్న ఐక్యత ఇంకా ఎక్కువ పెరిగింది.

మీటింగ్స్‌ ఐక్యం చేశాయి

లేఖనాలతో, పాట సంఖ్యలతో ఉన్న క్యాలెండర్‌

ఈ సంవత్సరంలో, సంస్థ మీటింగ్స్‌ విషయంలో కొన్ని మార్పులు చేసింది. బైబిలు విద్యార్థులు ప్రార్థన చేయడానికి, పాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి ఒక చోట కలుసుకొని మీటింగ్‌ జరుపుకునేవాళ్లు. ఆ మీటింగ్‌లో ఏ లేఖనం గురించైతే మాట్లాడుకుంటారో, అదే లేఖనం గురించిన వివరణ ద వాచ్‌ టవర్‌లో రావడం మొదలైంది. దాంతోపాటు బైబిలు విద్యార్థులు ఒక క్యాలెండర్‌ కూడా తయారు చేసుకున్నారు. దానిలో, ప్రతీవారం మీటింగ్‌లో ఏ లేఖనం గురించి చర్చించాలో అలాగే వాళ్ల వ్యక్తిగత అధ్యయనంలో, కుటుంబ ఆరాధనలో ఏ పాట పాడాలో ఉండేవి.

బైబిలు విద్యార్థులు, ప్రీచింగ్‌లో వాళ్లకు ఎదురైన అనుభవం గానీ, యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పాలనుకునే కారణాలు గానీ, ఒక పాట పాడడం గానీ, ప్రార్థన గానీ అలాంటి మీటింగ్స్‌లో చేసేవాళ్లు. ఇవా బర్నే అనే సిస్టర్‌ 1923లో బాప్తిస్మం తీసుకుంది. అప్పుడు ఆమెకు 15 ఏళ్లు. ఆమె ఇలా గుర్తు చేసుకుంటుంది: “మీటింగ్‌లో ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే, వాళ్లు లేచి నిలబడి ‘ప్రభువు నాకు చేసిన మేలుకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను’ అని మొదలుపెట్టేవాళ్లు.” కొంతమంది బ్రదర్స్‌ అలా చెప్పడానికి చాలా ఇష్టపడేవాళ్లు. అలాంటి ఒక పెద్ద వయసు బ్రదర్‌ గురించి సిస్టర్‌ ఇవా ఇలా చెప్పింది: “బ్రదర్‌ గాడ్వెన్‌ మాట్లాడడం మొదలుపెడితే ఇక ఆపేవాడు కాదు. అప్పుడు ఆ మీటింగ్‌ నిర్వహించే బ్రదర్‌ ఇబ్బందిపడడం చూసి బ్రదర్‌ గాడ్వెన్‌ వాళ్ల భార్య కింద నుండి ఆయన కోట్‌ లాగేది. వెంటనే ఆయన అర్థం చేసుకొని మాట్లాడడం ఆపేసి కూర్చునేవారు.”

నెలకొకసారి ప్రతీ సంఘంవాళ్లు ఒక ప్రత్యేక మీటింగ్‌ జరుపుకునేవాళ్లు. ఆ మీటింగ్‌ గురించి ద వాచ్‌ టవర్‌ ఏప్రిల్‌ 1, 1923 ఇలా చెప్పింది: “మీటింగ్‌లో సగం టైమంతా, ప్రీచింగ్‌లో వాళ్లకు ఎదురైన అనుభవాల గురించి చెప్పడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఇచ్చేవాళ్లు. . . . ఇలాంటి మీటింగ్స్‌ వల్ల బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఒకరికొకరు ఇంకా దగ్గరౌతారు.”

కెనడాలోని, వ్యాన్‌కోవర్‌లో ఉంటున్న ఛార్లెస్‌ మార్టిన్‌ అనే బ్రదర్‌ ఉదాహరణ చూడండి. ఆయనకు అప్పుడు 19 ఏళ్లు. అలాగే ఆయన ఒక క్లాస్‌ వర్కర్‌ (ప్రచారకుడు). ఆ మీటింగ్స్‌ తనకెంత సహాయం చేశాయో గుర్తుచేసుకుంటూ ఆయనిలా చెప్పాడు: “ఇంటింటి పరిచర్య ఎలా చేయాలో నేను ఇక్కడే నేర్చుకున్నాను. బ్రదర్స్‌-సిస్టర్స్‌ వాళ్లకు ఎదురైన అనుభవాలు చెప్పేవాళ్లు. వాటిని విని ఇంటింటి పరిచర్య ఎలా చేయాలో, వ్యతిరేకత వచ్చినా ఎలా జవాబివ్వాలో నేను నేర్చుకున్నాను.”

ప్రీచింగ్‌ ఐక్యం చేసింది

1923, మే 1 బులెటిన్‌

ఏయే రోజుల్లో ప్రీచింగ్‌ చేయాలో (సర్వీస్‌ డేస్‌ని) సంస్థ నిర్ణయించింది. దానివల్ల ఐక్యత ఇంకా పెరిగింది. ద వాచ్‌ టవర్‌ ఏప్రిల్‌ 1, 1923 దానిగురించి ఇలా చెప్పింది: “1923, మే 1 మంగళవారం, పరిచర్య చేసే రోజుగా నిర్ణయించబడింది. . . . , అలాగే, ప్రతీ నెల మొదటి మంగళవారం పరిచర్య చేసే రోజుగా ఉంటుంది. . . . ఆరోజు సంఘంలోని ప్రతీఒక్కరు ప్రీచింగ్‌లో ఎంతోకొంత భాగం వహించాలి. అలా ప్రీచింగ్‌ మనల్ని ఐక్యం చేస్తుంది.”

యౌవనులు కూడా ప్రీచింగ్‌ చేశారు. హ్యాజెల్‌ బర్‌ఫోర్డ్‌ అనే సిస్టర్‌, తనకు 16 ఏళ్లున్నప్పుడు ఏం జరిగిందో గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పింది: “ఈజీగా గుర్తుపెట్టుకునేలా బులెటిన్‌లో ఇప్పటిలాగే ‘ఇలా మాట్లాడవచ్చు’ అనే భాగాలు ఉండేవి. a నేను, మా తాతయ్య కలిసి ఎంతో ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేసేవాళ్లం. కానీ నేను ప్రీచింగ్‌ చేయడం చూసి ఒక పెద్ద వయసు బ్రదర్‌ అభ్యంతరపడ్డాడు. ఎందుకంటే, యెహోవాను స్తుతించడంలో భాగంగా ‘యువతీయువకులు’ ప్రీచింగ్‌ చేయకూడదేమో అని అప్పట్లో కొంతమంది అనుకునేవాళ్లు. ఎందుకంటే, దానిగురించి అప్పట్లో అంత అవగాహన లేదు.” (కీర్త. 148:12, 13) అయినా, సిస్టర్‌ హ్యాజెల్‌ తన ప్రీచింగ్‌ని ఆపలేదు. ఇంకా ఉత్సాహంగా చేసింది. తర్వాత ఆమె గిలియడ్‌ పాఠశాల రెండవ తరగతికి హాజరై, పనామాలో మిషనరీగా సేవ చేసింది. కొంతకాలానికి, యౌవనులు ప్రీచింగ్‌ చేసే విషయంలో ఆ బ్రదర్స్‌ కూడా తమ ఆలోచనను మార్చుకున్నారు.

సమావేశాలు ఐక్యం చేశాయి

సమావేశాలు అందరూ దగ్గరవ్వడానికి బాగా సహాయం చేశాయి. ఆ సమావేశాల్లో కూడా పరిచర్య చేయడానికి ప్రత్యేకంగా కొన్ని రోజులు ఉండేవి. కెనడాలోని విన్నిపెగ్‌లో జరిగిన సమావేశాన్నే తీసుకోండి. అక్కడ, మార్చి 31న జరిగిన సమావేశానికి వచ్చిన వాళ్లందరూ ప్రీచింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. అలా ప్రీచింగ్‌ చేయడం వల్ల మంచి ఫలితమే వచ్చింది. ఆ తర్వాత, ఆగస్టు 5న విన్నిపెగ్‌లో జరిగిన ఇంకో సమావేశానికి ఇంచుమించు 7,000 మంది హాజరయ్యారు. కెనడాలో జరిగిన సమావేశాలన్నిటిలో ఆ సంఖ్య చరిత్ర సృష్టించింది. ఎందుకంటే, అప్పటివరకు సమావేశాలకు అన్ని వేలమంది ఎప్పుడూ రాలేదు.

1923, ఆగస్టు 18-26 వరకు కాలిఫోర్నియాలోని, లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన సమావేశం యెహోవా ప్రజలందరికీ గుర్తుండిపోయింది. ఆ సమావేశానికి కాస్త ముందు వారాల్లో దానిగురించి ప్రకటనలు వార్తా పత్రికల్లో వచ్చాయి. బైబిలు విద్యార్థులైతే, ఐదు లక్షల కన్నా ఎక్కువ హ్యాండ్‌బిల్స్‌ పంచిపెట్టారు. పబ్లిక్‌ వాహనాల మీద, వాళ్ల సొంత కార్ల మీద బ్యానర్లు అతికించుకున్నారు.

1923 లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశం

ఆగస్టు 25, శనివారం రోజున బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ “గొర్రెలు-మేకలు” అనే ప్రసంగం ఇచ్చారు. అందులో “గొర్రెలు” అంటే సరైన హృదయస్థితి గలవాళ్లని, వాళ్లు పరదైసు భూమ్మీద జీవిస్తారని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఇంకో ప్రసంగం ఇచ్చి, “ఒక హెచ్చరిక” అనే తీర్మానాన్ని చదివారు. ఆ తీర్మానం క్రైస్తవమత సామ్రాజ్యపు బోధలు తప్పని అలాగే యథార్థ హృదయం గలవాళ్లు ‘మహాబబులోనుతో’ తెగతెంపులు చేసుకొని, దాన్నుండి బయటికొచ్చేయాలని చెప్పారు. (ప్రక. 18:2, 4) ఆ తర్వాత, బైబిలు విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఆ తీర్మానం ఉన్న కొన్ని లక్షల కరపత్రాల్ని పంచిపెట్టారు.

“ఇలాంటి మీటింగ్స్‌ వల్ల బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఒకరికొకరు ఇంకా దగ్గరౌతారు”

సమావేశం చివరి రోజున దాదాపు 30,000 మంది హాజరయ్యారు. ఆరోజు బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌, “దేశాలన్నీ హార్‌మెగిద్దోన్‌ వైపు అడుగులు వేస్తున్నాయి. కానీ ఇప్పుడు బ్రతికివున్న లక్షలమంది ఎప్పటికీ చనిపోరు” అనే అంశంతో బహిరంగ ప్రసంగాన్ని ఇచ్చారు. దానిని వినడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించి, బైబిలు విద్యార్థులు లాస్‌ ఏంజిల్స్‌లో, కొత్తగా నిర్మించిన స్టేడియం అద్దెకు తీసుకున్నారు. అంతేకాదు, అందరూ వినడానికి సౌకర్యంగా ఉండేలా లౌడ్‌ స్పీకర్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. అది అప్పుడే వచ్చిన కొత్త టెక్నాలజీ. చాలామంది ఆ కార్యక్రమాన్ని రేడియో ద్వారా కూడా విన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రీచింగ్‌ ఊపందుకుంది

1923వ సంవత్సరంలో ఆఫ్రికా, యూరప్‌, ఇండియా, దక్షిణ అమెరికాల్లో ప్రీచింగ్‌ ఊపందుకుంది. ఇండియాలో, బ్రదర్‌ ఏ.జె. జోసఫ్‌ తన భార్యని, ఆరుగురు పిల్లల్ని చూసుకుంటూనే హిందీ, మళయాలం, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో మన ప్రచురణల్ని తయారు చేయడానికి సహాయం చేశారు.

కుటుంబంతో బ్రదర్‌ విలియం ఆర్‌. బ్రౌన్‌

సియర్రా లియోన్‌లో, ఆల్‌ఫ్రెడ్‌ జోసఫ్‌ అలాగే లియోనార్డ్‌ బ్లాక్‌మెన్‌ అనే బైబిలు విద్యార్థులు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయానికి సహాయం కోరుతూ ఉత్తరం రాశారు. దానికి జవాబు 1923, ఏప్రిల్‌ 14న వచ్చింది. దానిగురించి ఆల్‌ఫ్రెడ్‌ ఇలా చెప్పాడు: “ఒకరోజు శనివారం రాత్రి నాకు అనుకోకుండా ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘ప్రీచింగ్‌ చేసేవాళ్లు కావాలని వాచ్‌ టవర్‌ సొసైటీకి ఉత్తరం రాసింది మీరేనా?’ అని అడిగారు. దానికి నేను ‘అవును’ అని జవాబిచ్చాను. అప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి ‘అందుకే వాళ్లు నన్ను పంపించారు’ అని చెప్పాడు.” అలా ఫోన్లో మాట్లాడింది బ్రదర్‌ విలియం ఆర్‌. బ్రౌన్‌. ఆయన తన భార్యయైన ఆంటోనియా, తన ఇద్దరు కూతుళ్లు లూసీ, లూయిస్‌తో కలిసి కరీబియన్‌ నుండి ఆ రోజే వచ్చారు. అయితే, వాళ్లని కలుసుకోవడానికి బ్రదర్స్‌ ఎక్కువ టైం వెయిట్‌ చేయాల్సిన అవసరం రాలేదు.

ఆల్‌ఫ్రెడ్‌ ఇంకా ఇలా చెప్పాడు: “ఆ తర్వాతి రోజు ఉదయాన్నే నేను, లియోనార్డ్‌ ప్రతీవారంలాగే బైబిలు గురించి మాట్లాడుకుంటున్నాం. ఉన్నట్టుండి బాగా పొడుగ్గా ఉన్న ఒకతను మా గుమ్మం దగ్గర కనిపించాడు. ఆయన ఎవరో కాదు, బ్రదర్‌ బ్రౌన్‌! ఆయన సత్యం గురించి ఎంత ఉత్సాహంగా ఉన్నాడంటే, ఆ తర్వాతి రోజే బహిరంగ ప్రసంగాన్ని ఇవ్వాలనుకున్నాడు.” ఇంకా నెల కూడా గడవకముందే, ఆయన తెచ్చుకున్న ప్రచురణలన్నీ ప్రీచింగ్‌లో ఇచ్చేశాడు. ఆ తర్వాత, ఆయనకు 5,000 కన్నా ఎక్కువ పుస్తకాలు మళ్లీ పంపించారు. కానీ అవి కూడా అయిపోయి, ఇంకా ఎక్కువ పుస్తకాలు అవసరమయ్యాయి. అన్ని పుస్తకాలు ఇచ్చినా ఆయన్ని ఎవ్వరూ పుస్తకాలు అమ్మే వ్యక్తి అని పిలవలేదు గానీ, అందరూ ఆయన్ని బైబిల్‌ బ్రౌన్‌ అనేవాళ్లు. ఎందుకంటే, ఆయన యెహోవా సేవను ఉత్సాహంగా చేసేవాడు, ప్రసంగాల్లో ఎక్కువ లేఖనాలు ఉపయోగించేవాడు.

1920లలో మ్యాగ్డిబర్గ్‌ బెతెల్‌

జర్మనీలోని, బర్మెన్‌ నగరంలో ఉంటున్న మన బ్రాంచి ఆఫీస్‌ చాలా చిన్నదైపోవడంతో బ్రదర్స్‌ ఇంకో చోటుకు మారాలనుకున్నారు. దానికితోడు, ఫ్రాన్స్‌ ఆ నగరాన్ని ఆక్రమించుకోవడానికి కాచుకు కూర్చుందని వాళ్ల చెవిన పడింది. అప్పుడు బైబిలు విద్యార్థులు మ్యాగ్డిబర్గ్‌లో ఉన్న ఒక బిల్డింగ్‌కి మారాలనుకున్నారు. అది మన ప్రచురణల్ని ప్రింట్‌ చేయడానికి కూడా అనువుగా ఉంది. బ్రదర్స్‌ ప్రింటింగ్‌ పనిముట్లను, వాళ్ల సామాన్లను సర్దుకొని, మ్యాగ్డిబర్గ్‌లో ఉన్న కొత్త బెతెల్‌కి జూన్‌ 19న వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాతి రోజే, ఫ్రాన్స్‌ బర్మెన్‌ని తన గుప్పిట్లోకి తీసుకున్నట్టు న్యూస్‌పేపర్లలో వచ్చింది. ఇదంతా జరగకముందే వాళ్లు కొత్త బెతెల్‌కి వెళ్లేలా సహాయం చేసినందుకు, వాళ్లను కాపాడినందుకు బ్రదర్స్‌ యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పారు.

జార్జ్‌ యంగ్‌తో పాటు శారా ఫెర్గసన్‌ (కుడివైపు) అలాగే ఆమె సహోదరి

జార్జ్‌ యంగ్‌ అనే బ్రదర్‌ మంచివార్త ప్రకటించడానికి చాలా ప్రాంతాలకు కాళ్లు అరిగేలా తిరిగాడు. ఆయన బ్రెజిల్‌లో కొత్త బ్రాంచి పెట్టి, పోర్చుగీస్‌ భాషలో ద వాచ్‌ టవర్‌ని ప్రచురించడం మొదలుపెట్టాడు. ఆయన ఈ పనిలో ఎంతగా దూసుకెళ్లాడంటే, కొద్ది నెలల్లోనే 7,000 కన్నా ఎక్కువ ప్రచురణల్ని ఆయన పంచిపెట్టాడు. ఆయన బ్రెజిల్‌కి రావడం వల్ల వచ్చిన మంచి ఫలితాన్ని, శారా ఫెర్గసన్‌ అనుభవంలో తెలుసుకోవచ్చు. ఆమె 1899 నుండి ద వాచ్‌ టవర్‌ని చదువుతుంది. కానీ బాప్తిస్మం తీసుకోవడానికి ముందడుగు వేయలేకపోయింది. అయితే, బ్రదర్‌ యంగ్‌ అక్కడికి వచ్చిన కొన్ని నెలలకే శారా, ఆమె నలుగురు పిల్లలు బాప్తిస్మం తీసుకున్నారు.

“అలుపెరగకుండా ముందుకు సాగుదాం”

మీటింగ్స్‌లో, ప్రీచింగ్‌లో, సమావేశాల్లో చేసిన మార్పులవల్ల బైబిలు విద్యార్థులు ఎలా ఐక్యమయ్యారో సంవత్సరం చివర్లో, అంటే 1923లో ద వాచ్‌ టవర్‌ డిసెంబరు 15 సంచికలో ప్రస్తావించారు. దానిలో ఇలా ఉంది: “సంఘంలోని ప్రతీఒక్కరి విశ్వాసం ఇంకా బలపడింది. . . . ఇంకొన్ని రోజులే ఉన్నాయి. మనందరం 1924వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి యెహోవా సేవలో అలుపెరగకుండా ముందుకు సాగుదాం.”

1924వ సంవత్సరం కూడా ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో సాగింది. బెతెల్‌లో ఉంటున్న బ్రదర్స్‌, స్టేటెన్‌ ద్వీపంలో ఉన్న ఒక స్థలం మీద ఎన్నో నెలలుగా పనిచేస్తున్నారు. అది మన బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయానికి చాలా దగ్గర్లో ఉంది. ఆ స్థలంలో జరుగుతున్న పనులన్నీ 1924 తొలినాళ్లలోనే పూర్తి అయ్యాయి. దానివల్ల ముందెప్పటికన్నా గొప్ప స్థాయిలో ప్రీచింగ్‌ జరిగింది. బ్రదర్స్‌-సిస్టర్స్‌ మధ్య ఐక్యత కూడా ఇంకా పెరిగింది.

స్టేటెన్‌ ద్వీపంలో నిర్మాణపని చేస్తున్నవాళ్లు

a ఇప్పుడు మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌ అని పిలుస్తున్నాం.