కంటెంట్‌కు వెళ్లు

భద్రమైన ఓ భవిష్యత్తు—మీరు దానినెలా కనుగొనగలరు

భద్రమైన ఓ భవిష్యత్తు—మీరు దానినెలా కనుగొనగలరు

భద్రమైన ఓ భవిష్యత్తుమీరు దానినెలా కనుగొనగలరు

1. మీ కొరకు మీ ప్రియమైన వారి కొరకు ఎలాంటి భద్రత కావాలని మీరు ఇష్టపడతారు?

అన్ని రంగాల్లోని ప్రజలకు భద్రత కావాలని నిజంగానే కోరికగా ఉంది. మీ కొరకు మీ ప్రియమైనవారి కొరకు మీరు తప్పకుండా కోరుకునేది అదే. ఒక అనిశ్చిత సమయంలో—భవిష్యత్‌ కాలంలో రానున్న మంచి పరిస్థితులను గూర్చిన వాగ్దానాన్ని మించినదాన్నే ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడూ మనకు ఎదురయ్యే కొన్ని అగత్య జీవిత సమస్యలున్నాయి. మనకు ఇప్పుడూ నిజమైన భద్రతనిచ్చేది, రానున్న సంవత్సరాల్లోనూ ఆ భద్రతను శాశ్వతంగా నిలిపేది మనకు అవసరం. అలాంటి భద్రత సాధ్యమేనా?

2. (ఎ) భద్రతను గూర్చి బైబిలు యెషయా 32:17లో ఏమి చెబుతుంది? (బి) అలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఆకర్షిస్తాయా?

2 అది సాధ్యమని నమ్మే అన్ని జాతుల ప్రజలు భూమి మీది అన్ని ప్రాంతాల్లోను నివసిస్తున్నారు. వారికి ఆసక్తిని కలిగించే భద్రతను వర్ణిస్తూ “నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు” అని ప్రేరేపిత దేవుని ప్రవక్త చాలా కాలం క్రితమే వ్రాశాడు. (యెషయా 32:17) * ప్రస్తుత లోకం సంక్షోభంతో నిండి ఉన్నప్పటికీ భూమి మీది అన్ని ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే శాంతియుతమైన భద్రతను అనుభవించనారంభించారు, మరింత ఉజ్జ్వలమైన భవిష్యత్తు కొరకు ఎదురు చూసేందుకు వారికి కారణముంది. మీరు కూడా అలాంటి ప్రయోజనాలను వారితో పాటు పంచుకోవచ్చు.

3. మానవజాతి భద్రతకు కారణం కాగలదనే బైబిలు వాగ్దానం మరేదైనా ఉందా? (ప్రకటన 21:4, 5)

3 ‘ప్రజలను భయపెట్టేవారెవరూ లేని’ కాలం అంటే నేరం అంతమయ్యే కాలం, ఒకరి ఆస్తికీ ప్రాణానికీ కలిగే ప్రమాదం అంతమయ్యే కాలం కొరకు—ఈ వ్యక్తులు ఎదురు చూసే కాలం ఇప్పుడు అతి సమీపంగా ఉంది. (మీకా 4:4) “దేశములో . . . . సస్య సమృద్ధి కలుగును” కనుక ఇక ఆకలి ఉండని రోజును ఇప్పుడు జీవిస్తున్న అనేకులు చూస్తారని నమ్మేందుకు వారికి గట్టి కారణముంది. (కీర్తన 72:16) ‘దేవుడు తానే వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను’ అనే వాగ్దాన నెరవేర్పును తామూ చూడాలని వారు ఎదురు చూస్తున్నారు. (ప్రకటన 21:3, 4) అలాంటి విషయాలు తప్పకుండా సంభవిస్తాయని అంత నిశ్చయతను వారెలా కలిగి ఉండగలరు? ఎందుకంటే ఈ వాగ్దానాలు దేవుని సొంత వాక్యమైన బైబిలులో కనుగొనబడుతున్నాయి.

4. బైబిలులోని విషయాలను వ్రాయడానికి మానవులు ఉపయోగించబడగా, అవి దేవుని నుండి వచ్చినవెలా అవుతాయి? (2 తిమోతి 3:16, 17)

4 మన భవిష్యత్తును గూర్చి బైబిలు చెబుతున్న విషయాలు కేవలం చరిత్ర పోకడలను వ్యాఖ్యానించడానికి మానవుడు చేసిన ప్రయత్నాల వల్ల కలిగిన ఫలితాల ఆధారమైనవి కావు. మానవులు వ్రాయడానికి ఉపయోగించబడ్డారు, కాని వారి మనస్సులు దేవుని ఆత్మచే నడిపించబడ్డాయి. కనుక సందేశం దేవుని నుండి వచ్చినదే. “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని . . . ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి” అని బైబిలే దాని సమాచార మూలాన్ని గూర్చి చెబుతుంది. (2 పేతురు 1:20, 21) దేవుడు దీనినెలా చేయగలడో అర్థం చేసుకోవడం నేడు మనకు అంత కష్టంగా ఉండకూడదు. మనుష్యులు కూడా అనంత అంతరిక్షంలో ప్రయాణం చేస్తూ భూమిమీదికి సందేశాలను పంపారు, అవి ఎంతో స్పష్టంగా వినిపించాయి. పరలోకంలో ఉన్న దేవుడు తనకు అనుగుణ్యంగా ఉండే నమ్మకస్థులైన మానవులకు మరింత మహోన్నతమైన రీతిలో తన సందేశాలను అందించగల్గి ఉండడా? నిశ్చయంగా! భద్రమైన ఓ భవిష్యత్తును మీరెలా కనుగొనగలరు అనే దాని గూర్చి బైబిలు ఏమి చెబుతుందో పరిశీలించమని మేము మిమ్మల్ని మరి మంచి కారణంతోనే ఆహ్వానిస్తున్నాము.

నిజమైన సహాయం ఎక్కడ కనుగొనవచ్చు

5. డబ్బు మరియు వస్తుసంపదల ఎడల ఎలాంటి వాస్తవిక దృష్టి కలిగివుండాలని బైబిలు మనలను ప్రోత్సహిస్తుంది? (ప్రసంగి 7:12)

5 జీవితాన్ని వాస్తవికంగా చూసేందుకు బైబిలు మనకు సహాయం చేస్తుంది. మన శాశ్వత క్షేమం దృష్ట్యా, శాశ్వతంగా నిలిచే దానిలో విశ్వాసముంచమని అది మనకు బోధిస్తుంది. నేడు లక్షలాది మంది వ్యక్తులు వస్తుసంపదలపై నమ్మకం ఉంచుతున్నారు. బైబిలు డబ్బు విలువను, వస్తుసంపదల విలువను గుర్తిస్తున్నప్పటికీ ఇవి జీవితంలోని పెద్ద విషయాలు కావని చూపిస్తుంది. ‘ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనే’ తిరస్కరించలేని సత్యాన్ని అది చెబుతుంది. (లూకా 12:15) వస్తు సంపద కూడా దాని మూల్యాన్ని కోల్పోతుంది. అది దొంగిలించబడవచ్చు లేదా నాశనం చేయబడవచ్చు. ఒకడు డబ్బును దొంగిలించే ప్రయత్నంలో డబ్బు సొంతదారుని జీవాన్ని అపాయంలో పడవేయవచ్చు. నిజమైన భద్రత మరెక్కడో ఉంది. ఎక్కడ?

6. భవిష్యత్తు కొరకైన మన నిరీక్షణలనన్నింటినీ మానవ నాయకులు వాగ్దానం చేసే దానిపై ఉంచుకోవడం సహేతుకం ఎందుకు కాదు?

6 మానవ నాయకులు వాగ్దానం చేసే దానిపైనే భవిష్యత్తు కొరకైన తమ నిరీక్షణలనన్నింటినీ ఉంచుకునే ప్రజలున్నారు. కానీ మీరూ మీ నిరీక్షణలను మానవులు చేసే వాగ్దానాలపైనే ఉంచాలా? వ్యక్తిగతంగా నాయకులు నిజాయితీపరులా లేక సమర్థులా అనే ప్రశ్న వేయకుండానే వారందరూ చనిపోతారనే విషయాన్ని మనకు గుర్తు చేస్తూ, ఈ విషయం యొక్క ముఖ్యాంశానికి బైబిలు వెళ్తుంది. అది జ్ఞానపూర్వకంగా ఇలా హెచ్చరిస్తుంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.” (కీర్తన 146:3, 4) కనుక, మానవ నాయకులు మహా అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే మానవజాతి యొక్క కొన్ని విషయాలను ప్రభావితం చేయగలరు. దీర్ఘకాల భద్రత విషయానికి వస్తే, తమ కొరకు తాము కల్పించుకోగల భద్రతకన్నా ఎక్కువ భద్రతను వారు మీకివ్వలేరు.

7. నిజానికి మనకు దీర్ఘకాల భద్రతను ఎవరు ఇవ్వగలరు, ఎందుకని? (అపొస్తలుల కార్యములు 17:28) (బి) మనం ఆ భద్రతను ఆనందంగా అనుభవించాలంటే మనం ఏమి చేయవలసిన అవసరముంది?

7 అయితే దానినివ్వగల్గేవారు ఒకరున్నారు. ఆయన భూమ్యాకాశముల సృష్టికర్త. ఈ భూమి రూపొందక ముందే, ఆయన ఉనికిలో ఉన్నాడు; ఈ ఇరవయ్యవ శతాబ్దం గతించి ఎంతో కాలం గడిచినా ఆయన ఉనికి కొనసాగుతుంది. “యుగయుగములు నీవే దేవుడవు” అని కీర్తన 90:2 ఆయనతో అంటుంది. జీవానికి ఆయనే మూలం, జీవ కోటిని పోషించే శక్తిని భూమికిచ్చింది ఆయనే. కనుక, మన ఇప్పటి క్షేమమూ మరియు భవిష్యత్తు కొరకైన మన ఉత్తరాపేక్షలూ ఆయనపై ఆధారపడి ఉన్నాయి. అందుకే మనం ఏ విధమైన నిజమైన భద్రతనైన ఆనందంగా అనుభవించాలంటే ఆయనతో మనకు మంచి సంబంధం అవసరం.

8. (ఎ) దేవుడు ఎలాంటి వ్యక్తులకోసం చూస్తున్నాడు? (బి) కనుక, ఆ అర్హతను పొందేందుకు వ్యక్తిగతంగా మనం ఏమి చేయడానికి సిద్ధంగా ఉండాలి? (మత్తయి 7:21-23)

8 దీని భావం, కావలసిందల్లా, ఒకడు ఏదో ఒక మతానికి చెందినవాడై ఉండాలన్నదేనా? అలా అనుకోవడం పొరపాటవుతుంది. దేవుడు తనతో మంచి సంబంధాన్ని కలిగి ఉండేందుకు అనుమతించేది ఒక ప్రత్యేక తరహా ప్రజలను. ఎలాంటి ప్రజలను? వారిని గురించి, ‘యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుదురు. . . . తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను’ అని బైబిలు వర్ణిస్తుంది. (యోహాను 4:23, 24) మీరు దేవున్ని ‘సత్యముతో’ ఆరాధించే వ్యక్తేనా? మీ నమ్మకాలు ‘సత్యదేవుడు’ చెప్పిన వాటికి పూర్తిగా అనుగుణ్యంగా ఉన్నాయా అని చూసుకునేందుకు, దేవుని వాక్యపు వెలుగులో మీ నమ్మకాలను పరిశీలించుకున్నారా? (కీర్తన 31:5) మీరు అలా చేసేందుకు సిద్ధమేనా? సత్యానికి అనుగుణ్యంగా లేని బోధలూ, ఆచారాలూ ఎవరికీ శాశ్వత ప్రయోజనాలను ఇవ్వవు. ఉన్న వాస్తవాలను ప్రజలు నిర్లక్ష్యం చేసేందుకు అలాంటి బోధలు కారణమౌతాయి; అవి ప్రజలను తప్పుదోవలో నడిపిస్తాయి. ఒక వ్యక్తి సత్యాన్ని తెలుసుకోవాలని నిజంగా కోరుకుని, సత్యానికి అనుగుణ్యంగా తన జీవితాన్ని మార్చుకునేందుకు అవసరమైన సవరింపులు చేసుకోవడానికి సిద్ధపడినట్లైతే మాత్రమే నిజమైన భద్రత వల్ల కలిగే సంతుష్టిని అనుభవించగలుగుతాడు. అత్యంత ప్రాముఖ్యమైన సత్యాల్లో ఒకటి దేవున్ని గుర్తించడమే.

9, 10. (ఎ) దేవుని వ్యక్తిగత నామమేమిటి? (బి) దేవుని నామమేమిటన్నది ఒక స్నేహితునికి నిరూపించేందుకు మీరే లేఖనాన్ని ఉపయోగిస్తారు? (సి) ఆ నామాన్ని మరుగు చేసేందుకు కొందరు అనువాదకులు ఎలా ప్రయత్నం చేశారు? (కీర్తన 110:1)

9 ఆయన వ్యక్తిగత నామమేమిటో మీకు తెలుసా? “దేవుడు” లేక “ప్రభువు” కాదు. అవి బిరుదులు. “శ్రీ”, “రాజు” వంటి బిరుదులు మాత్రమే. అయితే, “యెహోవా అనే నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు” అని కీర్తన 83:18 చెబుతుంది. ఇది దేవునికి మానవులు పెట్టిన పేరు కాదు. దేవుడు తనను గూర్చి తానే ఇలా అన్నాడు: “నేను యెహోవాను, అదే నా నామము.” (యెషయా 42:8) ఆదిమ హెబ్రీ లేఖనాలను అనువదించిన కొన్ని తర్జుమాలు ఆ పేరును “యాహ్‌వే” అని అనువదించాయి. ఇతర తర్జుమాలు కేవలం “ప్రభువు” అనే పదాన్ని ఉపయోగించాయి, అయితే ఈ ప్రత్యేక సందర్భాల్లో అవి తమ అనువాదంలో ఉన్నదానికన్నా మూలభాషా పాఠ్యాంశంలో ఇంకా ఎక్కువగా ఏదో ఉందని సూచిస్తూ ఆ పదం ఇక్కడ చూపించబడినట్లుగా ముద్దక్షరాల్లో ముద్రించబడింది.

10 ఉదాహరణకు, హెబ్రీ లేఖనాల నుండి ఎత్తివ్రాయబడిన మత్తయి 22:43, 44 వచనాలను మీ సొంత బైబిలులో ఎందుకు చూడకూడదు. అదిలా ఉంది: “నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.” ఈ ఒక్క వచనంలోనే ప్రభువు అనే పదాన్ని రెండుచోట్ల ఎలా విభిన్న రీతుల్లో ఉపయోగించారో గమనించండి. మొదటిసారి ముద్దక్షరాల్లోను, రెండవసారి మామూలు అక్షరాల్లోను వ్రాయబడింది. అయినప్పటికీ, హెబ్రీ లేఖనాల్లో కీర్తన 110:1 నందున్న ఈ వచనాన్ని BSI పరిశుద్ధ గ్రంథం (రెఫరెన్సులు గలది) దేనినీ మరుగుచేయ ప్రయత్నించక, “నా ప్రభువునుగూర్చి యెహోవా సెలవిచ్చిన వాక్కు—నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము!” అని అనువదించింది.

11. (ఎ) దేవుని నామాన్ని తెలుసుకోవడం మరియు దానిని ఉపయోగించడం నిజంగా ప్రాముఖ్యమా? (అపొస్తలుల కార్యములు 15:14) (బి) మనం యెహోవాను ప్రేమిస్తున్నట్లైతే మనం వ్యక్తిగతంగా ఆ నామాన్ని ఎలా ఉపయోగించాలి? (యెషయా 43:10)

11 దేవుని వ్యక్తిగత నామాన్ని ఉపయోగించకుండా ఉండడం ద్వారా బైబిలును మరింతమందికి అంగీకరించదగినదిగా చేస్తున్నామని కొందరు అనువాదకులు అనుకోవచ్చు. కానీ మూలభాషా పాఠ్యాంశంలో మరే పేరు కన్నా మరీ తరచుగా కనిపించే ఈ పేరును మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నందున వారు అనువాదకుల స్థానంలో నిజాయితీగా ఉన్నారా? తన నామాన్ని ప్రజలు తెలుసుకోవాలని సత్యదేవుడు కోరుకుంటున్నాడు. తాను అప్పటి వరకూ ప్రాచీన ఐగుప్తు పరిపాలకునిని ఎందుకు వదిలిపెట్టాడో అతనికి చెప్పమని దేవుడు తన సేవకుడైన మోషేకు చెప్పినప్పుడు ఏమి కోరుకుంటున్నాడో స్పష్టం చేశాడు. దేవుడు అతనిని ఎందుకు వదిలిపెట్టాడు? “నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని” అని దేవుడు చెప్పాడు. (నిర్గమకాండము 9:16) దేవుని నామాన్ని ఉపయోగించడమూ, మరి గౌరవపూర్వకంగా ఆయన నామాన్ని ఉపయోగించడమూ మనకు ప్రాముఖ్యమైన విషయం. మరి మనం సత్యాన్ని ప్రేమిస్తున్నట్లైతే, అద్వితీయ సత్యదేవుడైన యెహోవా ఆరాధికులమని మన గురించి మనం తెలియజేసుకోవడానికి వెనుకంజ వేయం.

12. ఆరాధనలో విగ్రహాలను ఉపయోగించడాన్ని దేవుడు ఎలా దృష్టిస్తాడు? (కీర్తన 115:3-8; ద్వితీయోపదేశకాండము 7:25)

12 అయితే, దేవుడు అంగీకరించని విషయంతో ఆయన నామాన్ని ముడిపెట్టకుండా మనం జాగ్రత్తపడాలి. “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలె”నని గుర్తుంచుకోండి. (యోహాను 4:24) “దేవుడు ఆత్మ” అనే వాస్తవాన్ని మనం గుణగ్రహిస్తున్నట్లయితే, మనం ఆయనను “ఆత్మతో” ఆరాధిస్తున్నట్లయితే, అంటే, ఆత్మీయమైన మార్గాల్లో ఆరాధిస్తున్నట్లయితే, దేవునికి ప్రాతినిధ్యం వహించేందుకు మనం భౌతిక వస్తువులను ఉపయోగించం. యోహాను 1:18 ప్రకారం ‘ఏ మానవుడూ ఎన్నడూ దేవున్ని చూడలేదు’ కనుక ఆయనను చిత్రీకరించే పటాన్నిగానీ చెక్కబడిన ప్రతిరూపాన్ని గానీ చేయడం అసాధ్యం. చూడలేని లేదా వినలేని లేదా మాట్లాడలేని, తన ముందు నిలబడి తనను ఆరాధించేవారికి సహాయం చేసేందుకు కనీసం ఒక వ్రేలు కూడా కదపలేని ప్రతిమ సజీవుడైన దేవునికి ఎన్నటికీ సరైన విధంగా ప్రాతినిధ్యం వహించలేదు. అయితే, కొన్ని ప్రతిమలు దేవునికి ప్రాతినిధ్యం వహించేందుకు చేయబడినవి కాదన్నది నిజమే. కానీ ప్రశ్న ఏమిటంటే, అవి మతభక్తి చూపించవలసిన వస్తువులా? దేవుడు పది ఆజ్ఞలను ఇచ్చినప్పుడు అలాంటి ఉద్దేశం కోసం విగ్రహాలను చేయకూడదని చెప్పాడు. ఆయన ఇలా ఆజ్ఞాపించాడు: “నీ కొరకు నీవు చెక్కిన విగ్రహాన్ని లేదా దేని రూపాన్ని చేసుకోకూడదు . . . నీవు వాటి ముందు సాగిలపడకూడదు లేదా వాటికి సేవ చేయకూడదు.” (నిర్గమకాండము 20:4, 5, కాథోలిక్‌ జెరూసలేమ్‌ బైబిల్‌) మనం యెహోవా అంగీకరించని వస్తువులను ఉపయోగించే బదులు, దేవుడు నిజంగా ఏమై ఉన్నాడో తెలుసుకునేందుకు సత్యం ఎడల మనకు గల ప్రేమ మనకు సహాయపడుతుంది.

13. (ఎ) యెహోవా ఎలాంటి దేవుడు? (బి) ఆయన గుణాల్లో ముఖ్యంగా ఏవి మీకు ఆకర్షణీయంగా ఉన్నాయి?

13 ఆయన గుణాలు నీతిని ప్రేమించే ప్రతి ఒక్కరి నమ్మకాన్ని గెలుచుకునేటటువంటివి. సర్వశక్తి, ఏ మానవుని జ్ఞానానికన్నా మించిన జ్ఞానం వంటి అటువంటి ఆ గుణాల్లో కొన్ని ఆయన భౌతిక సృష్టి క్రియల్లో నిదర్శనమౌతున్నాయి. సూర్యాస్తమయాల్లోని సౌందర్యం, పక్షుల తీయని కిలకిలరావాలు, పుష్పాల సుగంధం, మీరు ఆస్వాదించే అనేక రుచులు, అన్నీ మానవజాతి ఎడల దేవునికి గల ప్రేమను ప్రతిబింబిస్తున్నాయని మీరు ఒప్పుకోరా? అయితే బైబిలు దేవునిని గూర్చి మరెక్కువగా చెబుతూ ఇంకా ఎక్కువగా తెలియజేస్తోంది. సరైనదానికి యెహోవా మద్దతునిస్తాడని, ఆయన సానుభూతిగలవాడని, ఇతరులను పరిగణించే వాడని కూడా వెల్లడి చేస్తుంది. ‘యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులగా ఎంచడు’ అని ఆయనను గూర్చి వర్ణిస్తుంది. (నిర్గమకాండము 34:6, 7) ప్రాచీన ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు అనేక శతాబ్దాలు ఎలా వ్యవహరించాడో బైబిలు మనకు చెబుతుంది, ఆయన వ్యవహారాలు ఆ గుణాలను స్పష్టంగా కనబరచాయి. “దేవుడు పక్షపాతి కాడని . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని కూడా ఆ లిఖిత వృత్తాంతం నిరూపిస్తుంది. (అపొస్తలుల కార్యములు 10:34, 35) అన్నిజాతుల ప్రజలు తనతో మంచి సంబంధాన్ని కలిగి ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. అది సాధ్యమయ్యేలా ఆయన దయాపూర్వకంగా ఏర్పాటు చేశాడు.

14. ఒక వ్యక్తి తన నమ్మకాన్ని నిజంగా యెహోవా మీద ఉంచినప్పుడు అతని జీవితమెలా ప్రభావితమౌతుంది? (సామెతలు 3:5, 6)

14 సత్యదేవుని ప్రశంసనీయమైన అనేక గుణాల ఎడల ఒక వ్యక్తి మెప్పుదలను పెంపొందించుకుంటున్న కొలది ఏమి జరుగుతుంది? దేవుని “నామము” అతనికి మరింత అర్థవంతమైనదిగా అవుతుంది. అతడు దేవుని విధానం ప్రకారం పనులను చేస్తూ తన నమ్మకాన్ని యెహోవా మీద ఉంచుతాడు, దాని ఫలితంగా అతడు సురక్షితత్వాన్ని అనుభవిస్తాడు. సామెతలు 18:10 చెబుతున్నట్లు, “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.”

15. (ఎ) మన భవిష్యత్తు యెహోవాపై ఎందుకు ఆధారపడి ఉంది? (బి) ప్రతి వ్యక్తి ఏ గంభీరమైన తీర్మానాన్ని ఎదుర్కుంటాడు? (ద్వితీయోపదేశకాండము 30:19, 20)

15 ఆ సురక్షితత్వంలో భవిష్యత్తు కొరకైన ఒకరి అపేక్షలు కూడా ఇమిడి ఉన్నాయి. నిజంగా, యావత్‌ మానవజాతి భవిష్యత్తు అనేది యెహోవా మీదే ఆధారపడి ఉంది. ఎందుకని? ఎందుకంటే భూమి ఆయన సృష్టి, దానిపై నివసించే వారందరూ తమ జీవితాలను నిలబెట్టుకునేందుకు ఆయన ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలపై ఆధారపడవలసిందే. తన ప్రజలకు భద్రమైన సంతోషకరమైన జీవన పరిస్థితులను ఇవ్వాలన్న తన ఉద్దేశాన్ని ఆయన బైబిలులో పేర్కొన్నాడు. సర్వశక్తిగల దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో పరలోకంలోనిదైననూ భూమిమీదిదైననూ ఏదీ కూడా ఆయనను అడ్డగించలేదు. అయితే, ఆ ఉద్దేశం మన స్వేచ్ఛా చిత్తాన్ని అపహరించదు. ఒక విషయాన్ని గూర్చి మనమేమి చెప్పకముందే మనలో ప్రతి ఒక్కరి విధిని అది నిర్ణయించదు. అది మన ముందుంచే ఒక గంభీరమైన తీర్మానం: అయితే, యెహోవా మన కొరకు చేసిన వాటన్నింటి ఎడలా, భవిష్యత్తులో చేయబోతున్నవాటి ఎడలా గల మెప్పుదల ఆయన చిత్తానికి అనుగుణ్యంగా మన జీవితాలను మలచుకునేందుకు మనలను పురికొల్పుతుందా? ఒకరు నమ్మలేకపోవడం అనేది యెహోవా సత్య దేవుడన్న వాస్తవాన్ని గానీ, ఆయన ఉద్దేశాన్ని గానీ మార్చడం లేదు. అయితే, ఆ ప్రేమపూర్వకమైన సంకల్పం నుండి ఒకరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందగలరా లేదా అని అది నిర్ణయించగలదు. ఎంపిక చేసుకోవలసింది వాస్తవానికి జీవన్మరణాలనే నుండే.

ఎందుకు భద్రతలేమి మానవ జీవితాన్ని పాడుచేస్తుంది

16. నేడు జీవితాన్ని భద్రత లేనిదిగా చేసే కొన్ని విషయాలేవి?

16 యెహోవా ఉద్దేశాలు నిజమైన భద్రతకు ఎలా నడిపిస్తాయో గ్రహించేందుకు, నేటి జీవితాన్ని భద్రతలేనిదిగా చేసే విషయాల్లో కొన్నింటిని మన ప్రయోజనార్థమై మనకు మనమే మొదట గుర్తు చేసుకోవచ్చు. ప్రేమరాహిత్యం, చట్టం ఎడల అగౌరవం, ఇతరుల ఆస్తి ఎడల గౌరవం చూపించలేకపోవడం, ఒకరు తన లక్ష్యాలను సాధించుకునేందుకు అబద్ధాలు చెప్పడం, దౌర్జన్యం చేయడం అనేవి వాటిలో కొన్ని విషయాలు. అంతేకాక, రోగాన్నీ, త్వరగానే లేక ఆ తర్వాతనో ప్రజలు మరణిస్తారనే విషయాన్ని నిర్లక్ష్యం చేయలేము. ఈ విషయాలు మానవుని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వ్యక్తిగత అనుభవం ద్వారా, అలాగే పరిశీలన ద్వారా మనకు తెలుసు. కాని ఇవన్నీ ఎలా సంభవిస్తున్నాయి? జవాబు బైబిలులో కనుగొనబడుతుంది.

17. ఆరంభంలో ఆదాము హవ్వలు భద్రతను అనుభవించేందుకు ఏది తోడ్పడింది? (ఆదికాండము 1:31; 2:8, 15)

17 యెహోవా మన మొదటి మానవ తలిదండ్రులైన ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఆయన చేసిన పని చాలా మంచిదిగా ఉండినదని బైబిలులోని మొదటి పుస్తకం మనకు తెలియజేస్తుంది. రోగానికి కారణమయ్యే ఏ లోపమూ వారి నిర్మాణంలో లేదు; నిరంతరమూ జీవించే ఉత్తరాపేక్ష వారి ముందు ఉంది. దేవుడు వారికి ప్రేమపూర్వకంగా ఉద్యానవనాన్ని అంటే, ఏదెనులోని ఒక పరదైసును వారి గృహంగా ఇచ్చాడు. ఔదార్యంగా, వారి గృహమైన తోటలో భాగంగా, వారిని పోషించేందుకు విత్తనాలనిచ్చే మొక్కలను ఫలాలనిచ్చే వృక్షాలను ఆయన సమృద్ధిగా ఇచ్చాడు. చేపలను పక్షులను అన్ని జంతువులను లోబరచుకోమని, భూమిని సేద్యం చేసి, భూగోళమంతా తాము ఉంచబడిన పరదైసులా అయ్యేంత వరకు తమ సంతానముతో భూమిని నింపాలని ఆదేశమిస్తూ వారి జీవితాలకు ఒక సంకల్పముండేలా చేశాడు. అలాంటి పరిసరాల్లో భద్రతా భావం కలిగి ఉండడం సహజమే. వారు ఆ భద్రతను అనుభవించడంలో కొనసాగాలంటే వారి వైపు నుండి ఒకటి అవసరమై ఉండింది.

18. (ఎ) ఆదాము హవ్వలు భద్రతను అనుభవిస్తూ కొనసాగేందుకు వారు ఏమి చేయవలసిన అవసరం ఉండింది? (బి) యెహోవా వారి విధేయతను ఎలా పరీక్షించాడు, మరి అది ఎందుకు ప్రాముఖ్యమైన విషయమైంది? (లూకా 16:10)

18 దేవునితో గల సంబంధంలో తమ స్థానాన్ని వారు గుర్తించవలసిన అవసరం ఉండింది. భూమీ, అందులో ఉన్నవి అన్నీ వారి సృష్టికర్తకు చెందినవే, కనుక అవి ఎలా ఉపయోగించబడాలి అని తీర్మానించే హక్కు ఆయనకు ఉంది. జీవితం అన్నది కూడా షరతుతో కూడిన కానుక; అంటే, తమ పరలోక తండ్రికి ప్రేమపూర్వక విధేయతను చూపాలనే బాధ్యతను నెరవేర్చడంలో కొనసాగాలనే షరతుపై ఆదాము హవ్వలు దానిని అనుభవిస్తూనే ఉండగలిగేవారు. ఈ ఆవశ్యకతను నెరవేర్చడంలోని గంభీరతను నొక్కిచెప్పేందుకు, “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని” యెహోవా మానవునికి ఆజ్ఞనిచ్చాడు. (ఆదికాండము 2:16, 17) విధేయత దేవుడు పరిపాలకుడని మానవుడు అంగీకరించడాన్ని తెలియజేస్తుంది; అవిధేయత అంటే దేవుని పరిపూర్ణ చిత్తాన్ని తిరస్కరించడమని భావం. ఈ నియమంలో ఏ కష్టమూ లేదు; ఇది మానవునికి అవసరమైన దేనినీ అపహరించలేదు కానీ, అది సరళమైన, అయితే, ఫలకరమైన పరీక్షను పెట్టింది. అది అతడు జీవించిన పరిస్థితులకు తగిన పరీక్ష. తమ పరలోక తండ్రి ఎడల ప్రేమను కనబరచే అవకాశాన్ని ఆదాముకు అతని భార్యయైన హవ్వకు అది ఇచ్చింది.

19. (ఎ) ఆదాము హవ్వలు పాపం చేయడం వల్ల భద్రత లేని స్థితికి కారణమయ్యే ఏ సంగతులు మొదట సంభవించాయి, ఆ తర్వాత ఏవి సంభవించాయి? (బి) రోమీయులు 5:12లో వివరించబడినట్లు ఆదాము సంతతివారందరూ ఎలా బాధించబడుతున్నారు?

19 వాళ్ళు ఓడిపోయారు అని ఆదికాండము మూడవ అధ్యాయంలోని బైబిలు వృత్తాంతం చూపిస్తుంది. దేవుడు “నిషేధించిన” వృక్ష ఫలాన్ని వారు మనఃపూర్వకంగా తిన్నారు. దాంతో మానవ దంపతులు ముందు అనుభవించిన భద్రత లేకుండా పోయింది. నేటి భద్రత లేమికి కారణమయ్యే విషయాలు అప్పుడు మొదటిసారిగా ఉనికిలోకి వచ్చాయి. దేవుని ఎడల ప్రేమ లేకుండా పోయింది, ఆయన నియమాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది, ఆయన ఆస్తి ఎడల గౌరవం చూపకుండా తప్పిపోవడం జరిగింది. దేవునిచేత నిరాకరించబడిన ఆదాము హవ్వలు ఏదెను నుండి వెళ్ళగొట్టబడ్డారు. పరదైసుకు వెలుపల వారి సొంత కుమారుడైన కయీనుతో సహా వారి సంతానంలోని చాలామంది దౌర్జన్యానికి పాల్పడి మరింత దిగజారిపోయారు. దేవుని నియమాన్ని మనఃపూర్వకంగా ఉల్లంఘించని వారు కూడా తమ సొంత శరీరాల్లో వారసత్వంగా పొందిన పాప ఫలితాలను అనుభవించారు. రోమీయులు 5:12 వివరిస్తున్నట్లుగానే, “ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”

20. (ఎ) ఏదెనులో తిరుగుబాటు ఎవరితో ఆరంభమయ్యింది? (ప్రకటన 12:9) (బి) అతడు అపవాదియైన సాతానుగా ఎలా మారాడు? (యాకోబు 1:14, 15)

20 అయితే, తిరుగుబాటు అనేది ఆదాముతో లేదా అతని భార్యతో ఆరంభంకాలేదు. ఒక “సర్పం” దేవుని నియమాన్ని ఉల్లంఘించేందుకు హవ్వను కుయుక్తితో ప్రలోభపెడుతూ ఆమెతో మాట్లాడుతున్నట్లు బైబిలు పేర్కొంటోంది. నిజమే, అక్షరార్థ సర్పం మాట్లాడలేదు; ఆ సర్పం వెనుకవున్న శక్తి ఒక అదృశ్య ఆత్మ వ్యక్తి అని బైబిలు తరువాత తెలియజేస్తుంది. ఈ ఆత్మ వ్యక్తి దుష్టునిగా ఉండేందుకు సృష్టించబడలేదు. అయితే, మానవుల విషయంలోలాగే, దేవుని ఈ ఆత్మ కుమారునికి కూడా స్వేచ్ఛా చిత్తం ఉండింది, అంటే తన నైపుణ్యాలను ఎలా ఉపయోగించుకోవాలో ఎంపిక చేసుకునే సామర్థ్యం ఉండింది. అతడు తప్పుడు కోరికలను మనస్సులో పెట్టుకుని, అహంభావాన్ని పెంచుకున్నాడు; మిగతా ప్రాణులు తనను దేవునిగా ఆరాధించాలని అతడు కోరుకున్నాడు. అతడు తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తూ తనను తాను సాతానుగాను, అంటే దేవుని వ్యతిరేకిగాను, తను తాను అపవాదిగాను అంటే కొండెములు చెప్పేవాడిగాను చేసుకున్నాడు.

21. (ఎ) హవ్వతో మాట్లాడేటప్పుడు సాతాను ఏ వాదనలను చేశాడు? (బి) సాతాను చెప్పినదాని ప్రకారం చర్య తీసుకోవడం ద్వారా ఆమె తన పరిస్థితిని ఎందుకు మెరుగుపరచుకోలేదు?

21 అతడు మొదట ప్రశ్నలడుగుతూ హవ్వను సమీపించి, ఆ తర్వాత, “[నిషేధించబడిన వృక్షఫలాన్ని మీరు తిన్నట్లైతే] మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని” హవ్వతో చెబుతూ దేవునిని నేరుగా వ్యతిరేకించాడు. (ఆదికాండము 3:1-5) తనకున్న దానికన్నా అది శ్రేష్ఠమైనదిగా స్త్రీకి అనిపించింది. కాని దానిని నమ్మడం ద్వారా ఇంకా గొప్ప భద్రతను ఆమె నిజంగా పొందిందా? ఉల్లంఘించడంలో ఆమె భర్త ఆమెతో చేరడం ద్వారా తన పరిస్థితిని మెరుగుపరచుకున్నాడా? లేదు; అది శుద్ధ అబద్ధం. అది అబద్ధమని వారు చనిపోయినప్పుడు చివరికి నిరూపించబడింది. మరి నేటి వరకు మానవులు చనిపోతూనే ఉన్నారు.

22. (ఎ) ఏదెనులో ఏ ప్రాముఖ్యమైన వివాదాలు లేవదీయబడ్డాయి, మరి ఇవి యావత్‌ సృష్టి భద్రతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? (బి) యోబు కాలంలో మరే ఆరోపణ జరిగింది, మరది దేనిని సూచించింది? (యోబు 1:7-12; 2:1-5)

22 ఏదెనులో ప్రాముఖ్యమైన వివాదాలు లేవదీయబడ్డాయి, మరి ఇవి యావత్‌ సృష్టి భద్రతపై ప్రభావం చూపుతాయి. దేవుని సత్యసంధత సవాలు చేయబడింది. పరిపాలించే ఆయన హక్కును, ఆయన ఆధిపత్యంలోని నీతిని గూర్చిన ప్రశ్నను అవి లేవదీశాయి. ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి మానవుడే సొంత తీర్మానాలను తీసుకోవడమే మంచిదనీ, తన సొంత ప్రమాణాలను ఏర్పరచుకోవడమూ, తానే తన పరిపాలకునిగా ప్రవర్తించడమే మిన్నయని సలహా ఇవ్వబడింది. సాతాను తిరుగుబాటూ, దేవునికి తాము యథార్థవంతులని నిరూపించుకోవడంలో మొదటి మానవజాతి విఫలులవ్వడమూ దేవుని సృష్టిలోని బుద్ధిగల మిగతా ప్రాణులు ఏమి చేస్తారనే ప్రశ్నను లేవదీశాయి. ఎవరైనా దేవునికి యథార్థవంతులుగా కొనసాగుతారా? తర్వాత, దేవుని సేవించేవారు స్వార్థ చింతలవలననే సేవిస్తున్నారు గానీ ప్రేమ ఉన్నందువల్ల కాదనీ యోబు అనే వ్యక్తి కాలంలో సాతాను ఆరోపించాడు. “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?” అని సాతాను వాదించాడు. (యోబు 1:9) ఎవరినైనా సరే శోధనకు గురి చేయడానికి దేవుని శత్రువైన తనను అనుమతిస్తే ఏ ఒక్కరు కూడా యెహోవా ఆధిపత్యం ఎడల తమ యథార్థతను కాపాడుకోబోరని అతడు సూచించాడు. ఈ వివాదాలు పరిష్కరించబడనంత వరకు మానవజాతి పరిపూర్ణ భద్రతను మళ్ళీ అనుభవించదు. అయితే, నీతిని ప్రేమించేవారందరికీ పూర్తి సంతృప్తి కలిగే విధంగా ఆ వివాదాలు పరిష్కరించబడతాయని యెహోవాకు తెలుసు, ఆయన దానిని దృష్టిలో పెట్టుకుని కావలసిన ఏర్పాట్లను చేశాడు.

భద్రమైన భవిష్యత్తును సాధ్యపరచే ఏర్పాట్లు

23. (ఎ) మన మొదటి తలిదండ్రులకు తీర్పు తీర్చినప్పుడు, యెహోవా మనకు దేన్ని సాధ్యం చేశాడు? (2 పేతురు 3:9) (బి) మానవజాతి భవిష్యత్తు కొరకైన యెహోవా ఏర్పాటు ఎవరిపై కేంద్రీకరించబడి ఉంది?

23 దేవునికి వ్యతిరేకంగా మన మొదటి తలిదండ్రులు తిరుగుబాటు చేసినందుకు వారికి తీర్పు తీర్చినప్పుడు, అప్పటికీ జన్మించని వారి సంతానాన్ని యెహోవా మర్చిపోలేదు. మనలో ప్రతి ఒక్కరం ఆయన దైవిక ఆధిపత్యం క్రింద జీవించాలనుకుంటున్నామా లేదాయని ఎంపిక చేసుకునేందుకు సాధ్యం చేసే ఒక సంకల్పాన్ని ఆయన ప్రేమపూర్వకంగా రూపొందించాడు. ఆ సంకల్పం దేవుని కుమారుడైన యేసు క్రీస్తుపై కేంద్రీకరించబడుతుంది.

24. (ఎ) యేసు మానవునిగా భూమిమీదికి రాకముందు ఆయనకు ఎలాంటి జీవితం ఉండింది? (బి) మనమాయన గురించి దేవుడనీ లేక దేవునితో సమానుడనీ ఎందుకు చెప్పకూడదు? (యోహాను 17:3)

24 ఈ కుమారుడు పరలోక మండలంలో యెహోవా సృష్టిలోని మొట్ట మొదటివాడు. “ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, . . . సర్వమును ఆయనద్వారా . . . సృజింపబడెను” అని బైబిలు మనకు తెలియజేస్తుంది. (కొలొస్సయులు 1:15-17) అయితే, దేవుని నియమిత సమయంలో ఆయన కుమారుడు తన పరలోక మహిమను వదిలిపెట్టి, భూమిపై మానవునిగా అద్భుతరీతిలో జన్మించాడు. ఆ బిడ్డ జననాన్ని గూర్చి చెప్పడానికి ముందుగా పంపబడిన గబ్రియేలు దూత పుట్టనున్న ఆ బిడ్డ దేవుడౌతాడని చెప్పలేదు. బదులుగా, అది ‘దేవుని కుమారుని’ జననం అని ఆయన ప్రకటించాడు. (లూకా 1:35) యేసు తానే దేవుడనని చెప్పుకోలేదు. ఆరాధన తనకే చెందాలని ప్రయత్నించిన సాతానులా ప్రవర్తించనూలేదు. “తండ్రి నాకంటె గొప్పవాడు” అని సత్యసంధంగా చెప్పుకున్నాడు. (యోహాను 14:28) కనుక, సత్యదేవునితో మనం సరైన సంబంధం కలిగివుండాలంటే, దేవుడనీ లేదా దేవునికి సమానమైనవాడనీ చెబుతూ ఆయన కుమారునికి విభిన్నమైన స్థానాన్ని ఆపాదించకూడదు.

25. గొప్ప ఒత్తిడిలోను భూమిపై ఒక మానవునిగా యేసు తన యథార్థతను నిరూపించుకోవడం ద్వారా ఏమి సాధించబడింది?

25 యేసు క్రితమెన్నడూ అనుభవించని వాటిని భూమిమీద ఉన్నప్పుడు అనుభవించాడు. పరలోకంలో తన తండ్రి చిత్తం చేయడంలో ఆయన ఎన్నడూ తప్పిపోలేదు. భూమిపై మానవునిగా, ముఖ్యంగా బాధకు, తనకు తగని అవమానానికి గురైనప్పుడు కూడా తాను నమ్మకస్థుడని నిరూపించుకోవడంలో కొనసాగి ఉంటాడా? ఏ ఒక్కరూ, దేవుని ఈ మొట్ట మొదటి కుమారుడైనా కూడా పరీక్షించబడినప్పుడు నమ్మకస్థునిగా ఉండడని నిరూపించాలని సాతాను నిర్ణయించుకున్నాడు. అయితే, యేసు ప్రలోభాలను త్రిప్పికొట్టడానికి దేవుని వాక్యాన్ని ఉదాహరిస్తూ దానిని తన మార్గదర్శిగా ఆశ్రయించి, దానికి నమ్మకంగా హత్తుకున్నాడు. “సాతానా, పొమ్ము—ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్న”దని అంటూ తప్పు చేసేందుకు కలిగిని ఒత్తిడిని ఆయన దృఢంగా తిరస్కరించాడు. (మత్తయి 4:10) యేసు తన మరణం వరకూ పరిపాలకునిగా యెహోవా ఎడల తన యథార్థతను కాపాడుకున్నాడు. ఆదాము ఎదుర్కున్న ఏ పరీక్షలకన్నా తీవ్రమైన పరీక్షల్లోను తన యథార్థతను కాపాడుకున్నాడు. ఈ విధంగా సాతాను చేస్తూ వచ్చిన అబద్ధ ఆరోపణల నుండి తన తండ్రి నామాన్ని యేసు పవిత్రంగా చేశాడు. ప్రలోభాలను ఎలా అధిగమించాలో, మనం కూడా యెహోవా ఆధిపత్యాన్ని నమ్మకంగా ఉన్నతపరుస్తామని ఎలా చూపించాలో యేసు తన మాదిరిద్వారా మనకు చూపించాడు.

26. ఒక పరిపూర్ణ మానవునిగా యేసు మరణించినప్పుడు మరే ఫలితం కలిగింది, అది మనకు దేనిని సాధ్యం చేస్తుంది? (1 తిమోతి 2:3-6)

26 అయితే, దేవుని కుమారుని ద్వారా మాదిరి కన్నా ఎక్కువే మనకు అందించబడింది. “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు” వచ్చానని యేసు తానే వివరించి చెప్పాడు. (మార్కు 10:45) మానవజాతి ఎన్నడైనా పాపం నుండీ, పాప ఫలితంగా వచ్చే రోగం నుండీ మరణం నుండీ విడుదల చేయబడాలంటే ఇది అవసరం. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, ఆదాము చేత కోల్పోబడిన పరిపూర్ణ మానవ జీవితానికి బదులు విమోచన క్రయధనం పరిపూర్ణ మానవ జీవితమే అయ్యుండాలి. ఆదాము యొక్క అపరిపూర్ణ సంతతిలో ఎవరూ కూడా దానిని ఇవ్వగల్గేవారు కాదు. యెహోవాయే ప్రేమపూర్వకంగా ఆ ఏర్పాటు చేశాడు. ఆయన తన సొంత కుమారుడ్ని భూమిమీదికి పంపాడు. యేసు మరణం తర్వాత, దేవుడు ఆయనను ఆత్మ వ్యక్తిగా తిరిగి జీవానికి లేపి, మానవజాతి కొరకు ఆయన అర్పించిన మానవ జీవిత విలువను మానవజాతి కొరకైన బలిగా అంగీకరించాడు. ఆదాము కోల్పోయిన దానిని తిరిగి పొందేందుకు ఇది మనకు అవకాశాన్ని తెరిచింది. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని బైబిలు వివరిస్తుంది. (యోహాను 3:16) మనం దేవుని కుమారుడు బోధించినవాటిని నేర్చుకుంటూ, దానికి అనుగుణ్యంగా జీవిస్తూ ఆయనయందు విశ్వాసముంచినంత మాత్రాన మనకు సాధ్యమయ్యేది ఎంత అద్భుతకరమైన ఉత్తరాపేక్షలో!

27. (ఎ) యేసు రాజకీయ విషయాల్లో ఎందుకు భాగం వహించలేదు? (యోహాను 18:36) (బి) ప్రభుత్వాల ఎడల ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలని యేసు తన అనుచరులకు నేర్పించాడు? (మత్తయి 22:17-21)

27 యెహోవా ప్రభుత్వంలో తన కుమారునికిచ్చిన పాత్రను గ్రహించడం కూడా అలాంటి విశ్వాసంలో ఇమిడి ఉంది. యేసు తన కాలంనాటి రాజకీయ విషయాల్లో భాగం వహించలేదు; ఏ మానవ ప్రభుత్వమూ యెహోవా ఆధిపత్యాన్ని ఉన్నతపర్చలేదని ఆయనకు తెలుసు. దేవునిమీది విశ్వాసాన్ని గూర్చి ప్రభుత్వాధికారులు ఏమి చెప్పినప్పటికీ, మంచి చెడుల విషయమై వారు సొంత ప్రమాణాలను ఏర్పరచుకుంటున్నారు. అలా, వారు గుర్తించినా లేకపోయినా “ఈ లోకాధికారి” అని బైబిలు తెలియజేస్తున్న దేవుని శత్రువైన అపవాదియైన సాతాను నాయకత్వాన్ని వాళ్ళందరూ అనుసరిస్తున్నారు. (యోహాను 14:30) మానవ ప్రభుత్వాలు ఉనికిలో ఉండేందుకు దేవుడు అనుమతించినంత కాలం వారి పన్నులను చెల్లించాలని, చట్టాన్ని అనుసరించేవారిగా ఉండాలని యేసు తన శిష్యులుకు బోధించాడు. అయితే, భద్రమైన భవిష్యత్తు కొరకైన ఏకైక నిరీక్షణ దేవుని రాజ్యం మూలంగానే కలుగుతుందనీ, ఆ రాజ్యం పరలోకం నుండే ఏలుబడి చేసే మానవజాతి అంతటిపై అధికారాన్ని చెలాయించే నిజమైన నీతియుక్త ప్రభుత్వమనీ ఆయన స్పష్టం చేశాడు. కనుకనే, “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని దేవునికి ప్రార్థన చేయాలని ఆయన వారికి నేర్పించాడు. బైబిలులో ఇవ్వబడిన ఆ రాజ్య నియమాలకు అనుగుణ్యంగా జీవించాలని యేసు వారికి ఉద్బోధించాడు. మరి అన్నిచోట్ల ఉన్న ప్రజలకు “ఈ రాజ్య సువార్త”ను ప్రకటించాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు.—మత్తయి 6:10; 24:14.

28. దేవుని రాజ్యం అంటే ఏమిటి, దాని ఎడల మన మెప్పుదలను మనమెలా చూపించగలం? (మత్తయి 6:33)

28 ఆ రాజ్యమనేది యెహోవా చిత్తాన్ని నెరవేర్చే ఆయన ఉపకరణం. అది బుద్ధిగల జీవులన్నింటినీ మళ్ళీ యెహోవా రాజత్వం క్రింద ఐక్యపరుస్తుంది. యెహోవా సర్వాధిపత్యానికి, ఆయన రాజ్యాధిపత్యానికి నమ్మకంగా మద్దతునిచ్చేవారని నిరూపించిన ఈ భూమిమీది నుండి తీసుకోబడిన వ్యక్తులే ఆ పరలోక ప్రభుత్వ సభ్యత్వంలో చేర్చబడతారు. ‘చిన్న మంద’ అని వారిని గూర్చి చెప్పబడింది. (లూకా 12:32) వారు “భూలోకములోనుండి కొనబడిన” “నూట నలువది నాలుగువేలమంది” మాత్రమేనని బైబిలులోని చివరి పుస్తకం చెబుతుంది. (ప్రకటన 14:1, 3) అయినప్పటికీ, రాజ్యాధికారం అప్పజెప్పబడిన ముఖ్యుడు దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తే. దైవిక ప్రవచన నెరవేర్పులో, “సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” యెహోవా ఇచ్చినది ఆయనకే. (దానియేలు 7:13, 14) మనలో ప్రతి ఒక్కరం ఆ దైవిక ఏర్పాటుకు పూర్తిగా అనుగుణ్యంగా జీవించడం ప్రాముఖ్యం. అలా చేయడానికి నిరాకరించేవారూ ఇతరుల భద్రతకు భంగం కలిగించేందుకు సదాకాలం అనుమతించబడరు.

29. (ఎ) ఎంతకాలంగా మానవ ఆధిపత్యం ఉంటోంది, అది ఇప్పుడు ఇంకా ఎక్కువ కాలం ఎందుకు కొనసాగదు? (యిర్మీయా 17:5) (బి) సాతాను విషయంలో దీని భావమేమిటి? (సి) మానవ ప్రభుత్వాలకు ఏమి జరుగుతుంది? (డి) దుష్టులకు ఏమి జరుగనున్నది? (ఇ) యెహోవా ఆధిపత్యం ఎడల ఉదాసీనంగా ఉన్నవారికి ఏమి జరుగుతుంది? (2 థెస్సలొనీకయులు 1:6-9)

29 ఏదెనులో తిరుగుబాటు మొదలుకొని, దాదాపు ఆరు వేల సంవత్సరాలు మానవులు మానవ ఆధిపత్య ఫలితాన్ని చవిచూశారు. అది విపత్తుగా ఉంటోంది. సముచితంగానే, దేవుడు తన తీర్పును అమలు చేసే తరం ఈ తరమేనని బైబిలు సూచిస్తుంది. మానవజాతి యొక్క ముఖ్య శత్రువైన అపవాదియైన సాతానుకు దీని భావమేమిటి? అతడు, అతని దయ్యాలు పూర్తిగా నిష్క్రియులుగా చేయబడి, మానవున్ని తప్పుదోవ పట్టించలేని విధంగా ‘అగాధములో పడవేయబడుదురు.’ (ప్రకటన 20:1-3) దేవుని తీర్పు అమలుపరచబడడమంటే, మానవ ప్రభుత్వాలకు దాని భావమేమిటి? “ఆ రాజ్యము . . . ముందు చెప్పిన [మానవ] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయునుగాని అది యుగముల వరకు నిలుచును” అని బైబిలు ప్రవచిస్తుంది. (దానియేలు 2:44) అబద్ధికులకు, దొంగలకు, దౌర్జన్యం చేసేవారికి దీని భావమేమిటి? “భక్తిహీనులు [దుష్టులు] లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.” (కీర్తన 37:10) యెహోవా ఆధిపత్యాన్ని ఉదాసీనతతో అలక్ష్యంచేసే వారికి దీని భావమేమిటి? నోవహు దినాల్లోని ‘వారు జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగకపోయిరి.’ న్యాయాన్ని అమలుపరచేందుకు దేవుడు తన కుమారున్ని ఉపయోగిస్తుండగా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది.—మత్తయి 24:39.

30. యెహోవా ఆధిపత్యానికి నమ్మకంగా మద్దతునిచ్చేవారి విషయంలో వీటన్నింటి భావమేమిటి? (ప్రకటన 7:9, 10, 13, 14)

30 అయితే, యెహోవా ఆధిపత్యానికి నమ్మకంగా మద్దతునిచ్చేవారని నిరూపించుకున్నవారికి వీటన్నింటి భావమేమిటి? దేవుని నీతియుక్తమైన క్రొత్త విధానంలోకి విడుదలన్నదే దాని భావం. ఇది జీవితంపై చూపే ప్రభావానికి ఒక ఉదాహరణ ప్రాచీన ఇశ్రాయేలు జనాంగంతో దేవునికి గల వ్యవహారాల్లో ఇవ్వబడింది. ‘మీరు . . . మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువులందరు లేకుండ మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందుదురు’ అని చెప్పమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లే జరిగింది. (ద్వితీయోపదేశకాండము 12:10) సొలొమోను రాజు ఏలుబడి కాలంలోని పరిస్థితిని గూర్చి ఇలా వ్రాయబడింది: “ఇశ్రాయేలువారేమి యూదావారేమి [సుదూర ఉత్తరాన] దాను మొదలుకొని [దక్షిణాన] బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.” (1 రాజులు 4:25) దేవుని ధర్మశాస్త్రం ప్రకారం, వ్యవసాయం చేసుకునేందుకు, నివసించేందుకు ప్రతి కుటుంబానికి సొంతంగా భూమి ఉండేది. దేవునికి విధేయత చూపడం వల్ల ఆశీర్వాదం ఉండేది. ఆయన వాగ్దానం చేసినట్లే, ‘భూమిపై వర్షము దాని కాలమున కురవడం కూడా’ ఆ ఆశీర్వాదంలో ఇమిడి ఉంది. (ద్వితీయోపదేశకాండము 11:13-15) అక్కడ ఆర్థిక భద్రత ఉండేది.

31. కీర్తన 72లో వర్ణించబడినట్లు, దేవుని రాజ్యం క్రింద భూమ్యంతటా భద్రత ఉండేందుకు తోడ్పడే ఏ పరిస్థితులు ప్రబలి ఉంటాయి?

31 బైబిలులో వ్రాయబడినది కేవలం చారిత్రాత్మక వృత్తాంతంగా కాక, మనకు ప్రోత్సాహం కోసమే వ్రాయబడింది. ‘సొలొమోనుకంటె గొప్పవాడు’ అని భూమ్యంతటిపైన రాజుగా ఉండేందుకు యెహోవాచే నియమించబడిన ప్రభువైన యేసుక్రీస్తు గురించి అని లేఖనాలు చెబుతున్నాయి. (లూకా 11:31) సొలొమోను కాలంలో యూదాలోను ఇశ్రాయేలులోను ఉండిన పరిస్థితుల కన్నా శ్రేష్ఠమైన పరిస్థితులు క్రీస్తు పరిపాలన క్రింద భూమ్యంతటా వ్యాపిస్తాయి. “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును” అని 72వ కీర్తన రానున్న ఆశీర్వాదాలను చక్కగా వర్ణిస్తుంది. (కీర్తన 72:7, 8, 14, 16) అప్పటి పరిస్థితి యేసు తన రాజ్యములో ప్రవేశించిన తరువాత తనను గుర్తు చేసుకోమని అడిగిన ఒక మనిషితో జవాబిస్తూ యేసుక్రీస్తు వర్ణించిన పరిస్థితిలా ఉంటుంది. “నీవు నాతోకూడ పరదైసులో ఉందువని” యేసు అతనితో చెప్పాడు.—లూకా 23:43.

32. (ఎ) మృతులు కూడా ఆ మహత్తరమైన ఏర్పాట్ల నుండి ప్రయోజనం పొందడం ఎలా సాధ్యమౌతుంది? (బి) పునరుత్థానం పొందేవారు ఎక్కడ నుండి తిరిగి వస్తారు? (యెహెజ్కేలు 18:4; యోబు 14:13)

32 ఆదాము నుండి తాము వారసత్వంగా పొందిన పాపంవల్ల మరణించినవారు అప్పుడు మరువబడరు. వారు కూడా దేవుని కుమారుని విమోచన క్రయధన బలివలన ప్రయోజనం పొందుతారు. “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని” బైబిలు ప్రోత్సాహకరంగా ముందే చెబుతుంది. (అపొస్తలుల కార్యములు 24:15) దీని భావమేమిటి? “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు” అని బైబిలు చెబుతుంది. (ప్రసంగి 9:5) వారు సమాధిలో నిర్జీవంగా ఉన్నారు. పునరుత్థానం అంటే తిరిగి జీవములోనికి రావడమని భావం. యేసుక్రీస్తుతో పాటు పరలోక జీవితాన్ని పంచుకునే ‘చిన్న మంద’కు చెందినవారుగాక, పునరుత్థానం పొందే మిగిలిన వాళ్ళందరూ ఈ భూమిపై మానవులుగా నిరంతరం జీవించే ఉత్తరాపేక్ష కలిగి ఉంటారు.

33. (ఎ) రోగమూ మరణమూ దేని ద్వారా తీసివేయబడతాయి? (మార్కు 2:1-12) (బి) భద్రమైన భవిష్యత్తు కొరకు యెహోవా చేసిన ఏర్పాట్ల నుండి మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందాలనుకుంటున్నారా?

33 ఇది మానవ కుటుంబానికి పునర్నవీకరణ సమయమై ఉంటుంది. పరలోక రాజ్యపు నడిపింపు క్రింద, విశ్వసించేవారందరికి యేసు బలి మూల్యాన్ని వర్తింపజేసి, ప్రతి విధమైన పాపాన్ని, పాపపు ఫలితాలను తీసివేయడం జరుగుతుంది. మానవజాతికి ఇది ఏ భావాన్ని కలిగి ఉంటుందో యేసు భూమిమీద ఉన్నప్పుడు చూపించాడు. ఆయన గ్రుడ్డివారికి చూపునిచ్చి, కుంటివారిని కూడా బాగు చేసి, ప్రతివిధమైన రోగాన్ని స్వస్థపరచాడు. దేవుని క్రొత్త విధానంలో, అలాంటి దీవెనలను పొందే వ్యక్తులతో భూమి నిండుతుంది. “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె”ను అన్నదే దైవిక వాగ్దానమై ఉన్నది. (ప్రకటన 21:4) అవును, జీవితాన్ని భద్రత లేనిదిగా చేసిన అన్ని విషయాలు గతించిపోతాయి. ఎంత మహత్తరమైన ఉత్తరాపేక్షయది!

34. ఇప్పుడే అనుభవించగల నిజమైన భద్రత ఏమైనా ఉందా?

34 భద్రతకు కారణమయ్యే ప్రతిదీ భవిష్యత్తు కొరకు మాత్రమే దాచి ఉంచబడలేదు. ఇప్పుడూ ఎంతో అనుభవించవచ్చు.

ఇప్పుడు అనుభవించగల భద్రత

35. ఇక్కడ పేర్కొనబడిన ఏ విషయాలు చెప్పుకోదగినంత వ్యక్తిగత భద్రతకు కారణమౌతాయి?

35 ఒకరు జీవితంలో మరే పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, అనుదిన ఆహారమూ, కావలసినన్ని వస్త్రాలూ లభించే హామీ ఉంటే, ఆ వ్యక్తికి ఉచ్చ స్థాయిలోనే భద్రత ఉన్నట్లేనని చాలా మంది ప్రజలు ఒప్పుకుంటారు. అంతేకాక, అతడు ముఖ్యంగా ఎవరితో సహవసిస్తాడో ఆ వ్యక్తుల మధ్య ఒకరి ఎడల మరొకరికి నిజమైన ప్రేమ ఉన్నట్లైతే భద్రత మరింత అధికమౌతుంది. భవిష్యత్తులో ఏముందో అతనికి తెలిస్తే ఏ అనిశ్చిత భావమైనా చాలా తక్కువగా ఉండేందుకు కూడా అది సహాయపడుతుంది. కానీ అధిక సంఖ్యాక ప్రజలు అలాంటి భద్రతా భావాన్ని అనుభవించడం లేదు. దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడిన భద్రత అనేది భవిష్యత్తులో మాత్రమే నిజమౌతుందని దాని భావమా? లేక వ్యక్తులు ఇప్పుడే ఆ వాగ్దానాల్లో నమ్మకముంచి, ఆ వాగ్దానాలకు అనుగుణ్యంగా ప్రవర్తించడం ద్వారా ఇప్పుడు కూడా భద్రతను అనుభవించగలరా? అలా అన్యోన్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు ఇప్పుడున్నారా?

36. (ఎ) అనుదినాహారాన్ని, వస్త్రాలను ఇప్పుడే ఇస్తానని దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో చెబుతున్నాడు? (బి) అలాంటి భద్రతను ఎవరు అనుభవిస్తారు, వారు ఈ ఏర్పాట్లను ఎలా పొందుతారు? (ఎఫెసీయులు 4:28)

36 యెహోవాసాక్షులు అని పిలువబడే ఆ క్రైస్తవులు దేవుని వాక్యం నిజమైనదని కనుగొన్నారు. దానిని తమ జీవితంలో ఆచరణలో పెడితే ఇప్పుడే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని అనుభవం ద్వారా తెలుసుకున్నారు. ఒకరి దైనందిన జీవితంలో ఆత్మీయ విషయాలకు కావలసినంత ప్రాముఖ్యతనివ్వడం వల్ల ఆ ప్రయోజనాలు లభిస్తాయి. భూమిమీద ఉన్న ప్రతి ఒక్కరు, ఆత్మీయ విషయాల్లో ఆసక్తిగలవారైనా కాకపోయినా భూమి మీద పండే ప్రతి దాని నుండి ప్రయోజనం పొందవచ్చు. అయితే, తన సేవను మొదటి స్థానంలో ఉంచేవారి క్షేమం కొరకు దేవుడు ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటాడని బైబిలు చూపిస్తుంది. యేసు తన శిష్యుల విశ్వాసాన్ని బలపరచేందుకు, “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని అన్నాడు. (మత్తయి 6:31-33) ఒకరిని శారీరకంగా పోషించేందుకు అవసరమైన “ఇవన్నియు” వారికెలా లభిస్తాయి? దానర్థం క్రైస్తవ సంఘం వారికి ఆర్థికంగా మద్దతునిస్తుందని కాదు. అలాకాక, వాళ్ళందరూ సిద్ధమనస్సుగల పనివారు. మరి ప్రజలు యెహోవా రాజ్యాన్ని మరియు ఆయన నీతిని తమ జీవితాల్లో నిజంగా ముఖ్యమైన విషయాలుగా చేసుకున్నప్పుడు, జీవితంలోని అత్యవసర వస్తువులను సంపాదించుకునేందుకు వారు చేసే ప్రయత్నాలను యెహోవా దీవిస్తాడు. “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము” అనే వారి ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. (మత్తయి 6:11) ప్రస్తుత లోకం ఉనికిలో ఉండగా తన సేవకులకు భౌతిక సమృద్ధిని ఇస్తానని యెహోవా వాగ్దానం చేయడం లేదు, కానీ వారికి నిజంగా అవసరమైన దానిని వారు కలిగి ఉంటారని ఆయన హామీ ఇస్తున్నాడు. మరి వారికి అవసరమైనది లభ్యమయ్యేలా చూసేందుకు ఆయనను మించినవారెవ్వరూ లేరు.

37. (ఎ) ఎలాంటి ప్రవర్తనా, దృక్పథమూ భద్రత లేమిని కలిగిస్తాయి? (బి) అలాంటి ప్రజల్లో ముఖ్యంగా ఏ గుణం లేకుండా పోయింది? (సి) అలాంటి ప్రేమ ఎక్కడ కనుగొనబడుతుందని యేసు చెప్పాడు?

37 వస్తు సంబంధమైన అవసరాలను తీర్చే గొప్ప దాత ఇప్పుడు భద్రతకు ప్రాముఖ్యమైన మరొక దాన్ని కూడా లభ్యం చేస్తున్నాడు. మీరు చక్కగా గ్రహించగలిగినట్లే, ఒక వ్యక్తి ఎడల అతని సహచరులకు నిజమైన ఆసక్తి లేనట్లైతే నిత్యావసర వస్తువులు ఉన్నా అతనికి సంతుష్టిగానీ, భద్రతా భావంగానీ ఉండదు. ప్రజలు అబద్ధాలు చెప్పినప్పుడు, మోసం చేసినప్పుడు; ఇతరుల భావోద్వేగాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా తమ నాలుకను ఉపయోగించినప్పుడు; ఇతరులను వారి వస్తు సంపదనుబట్టి, శరీరఛాయను బట్టి, లేదా ఏ దేశస్థులనే దాన్ని బట్టి తీర్పు చెప్పినప్పుడు; తరచూ దాగివున్న స్వార్థ ఉద్దేశంతో “దయ” చూపడం జరుగుతున్నప్పుడు భద్రతా భావం లేకుండా పోతుంది. అలాంటివారిలో ఎక్కువగా కొరవడుతున్నది ప్రేమ—ఇతరుల ఎడల యథార్థమైన నిస్వార్థమైన శ్రద్ధ. అలాంటి నిజమైన ప్రేమను కనుగొనవచ్చా, కేవలం కొందరు ప్రజల మధ్య కాదు గాని, సమాజంలోని ప్రజలందరి విశిష్టమైన లక్షణంగా అలాంటి ప్రేమను కనుగొనవచ్చా? అలా కనుగొనవచ్చని యేసుక్రీస్తు మనకు హామీ ఇస్తున్నాడు. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసి”కొందురని ఆయన చెప్పాడు. మన కాలంలో అలాంటి ప్రజలుంటారని ఆయనకు తెలుసు కనుకనే, “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని” ఆయన తన శిష్యులకు చెప్పాడు.—యోహాను 13:35; మత్తయి 28:20.

38. అలాంటి ప్రేమగల ప్రజలను గుర్తించేందుకు బైబిలు మనకెలా సహాయపడుతుంది? (1 యోహాను 4:20, 21)

38 మీ సహవాసుల మధ్య ఈ ప్రేమ లేదని మీరు కనుగొన్నట్లైతే మీరు మరొకచోట వెదకవలసిన అవసరముంది. 1 యోహాను 4:8 నందు “దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు” అని చెబుతూ అవసరమైన నడిపింపును బైబిలు ఇస్తుంది. కనుక, ‘దేవునిని ఎరిగే’ ప్రజల మధ్య అలాంటి ప్రేమ కనిపిస్తుంది. కచ్చితంగా దాని భావం మతవిశ్వాసులైన ప్రజలందరి మధ్య అది కనబడుతుందని కాదు; అలా కాదని మీకు తెలుసు. అద్వితీయ సత్య దేవుడైన యెహోవాను ఎరిగే ప్రజల మధ్య, ఆయన నామాన్ని గౌరవ పూర్వకంగా ఎంచే ప్రజల మధ్య, ఆయన చిత్తానికి అనుగుణ్యంగా తమ జీవితాలను మార్చుకోవాలని యథార్థంగా ప్రయత్నించేవారి మధ్య మీరు దానిని కనుగొంటారు. అలాంటి సహవాసం నుండి కలిగే ప్రయోజనాలు స్పష్టమే.

39. అలాంటి ప్రజల మధ్య ఉండడమే కాక, తన భద్రతకు, జీవితంలో తన ఆనందానికి తోడ్పడే వేటిని కూడా ఒక వ్యక్తి చేయగలడు?

39 నిజమే, లోకంలోని మిగిలినవారి అనైతిక ప్రవర్తన వల్ల కలిగే ఫలితాల నుండి ఒక వ్యక్తి ఈ విధంగా కాపాడబడడం లేదు. అయినప్పటికీ, వ్యక్తిగతంగా తన ఆశ్రయం దేవుడేనని గుర్తించినప్పుడు, బైబిలులో చెప్పబడినట్లు మంచి చెడులను గూర్చిన దేవుని ప్రమాణాలను పూర్తిగా అంగీకరించినప్పుడు అతడు ఎంతో ప్రయోజనం పొందుతాడు. హృదయవేదనకు, బాధకు మాత్రమే కారణమయ్యే కార్యకలాపాల్లో పాల్పంచుకోకుండా అతడు కాపాడబడతాడు. “నా ఉపదేశము [అంటే దైవిక జ్ఞానము] నంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును” అని సామెతలు 1:33 చెబుతుంది. అతడు తన జీవితాన్ని సృష్టికర్త చిత్తానికి అనుగుణ్యంగా ఉపయోగిస్తే అతని జీవితం అర్థవంతమైనదౌతుంది. చాలామంది ప్రజలు అనుభవిస్తున్నటువంటి నిరాశకు గురయ్యే బదులు, మానవజాతి సమస్యలకు ఒకే ఒక నిజమైన పరిష్కారమైన దేవుని రాజ్యాన్ని గూర్చి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే ఆనందాన్ని అతడు పంచుకోగలడు. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని అంటూ యేసుక్రీస్తు అలాంటి పనిని గురించి ముందే చెప్పాడు.—మత్తయి 24:14.

40. యెహోవాసాక్షులు భవిష్యత్తును గూర్చి ఎలా భావిస్తారు, ఎందుకని?

40 ఈ ప్రకటన పనిలో పాల్గొనేవారు భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తారు, వారికి భయము లేదు. బైబిలును పఠించి, అది చెబుతున్న దానిని నమ్ముతారు కనుక భవిష్యత్తులో ఏముందో వారికి తెలుసు. ప్రపంచ కార్యాల్లోని అసంతోషకరమైన పరిస్థితులు ఏర్పడడం వల్ల నిరాశచెందే బదులు, ఈ విధానాంతాన్ని గూర్చిన బైబిలు ప్రవచనాల నెరవేర్పును వారు వాటిలో చూస్తారు. దేవుని న్యాయసమ్మతమైన ఆధిపత్యాన్ని ధిక్కరించడంలో కొనసాగుతున్నవారిని, తోటిమనుష్యుల జీవితానందాన్ని విధ్వంసం చేసేందుకు పట్టుపట్టేవారిని త్వరలో ఇప్పుడే ఈ తరంలో ఆయన నాశనం చేయబోతున్నాడని వారికి తెలుసు. “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును” అని 2 పేతురు 3:13లో ఇవ్వబడిన నిరీక్షణ యొక్క నెరవేర్పు కొరకు వారు నమ్మకంతో ఎదురు చూస్తారు.

41, 42. (ఎ) యెహోవాసాక్షులు సమస్యలున్న లోకంలో జీవిస్తున్నప్పటికీ అంత గొప్ప భద్రతను ఇప్పుడే ఎలా పొందగలుగుతున్నారు? (బి) యెహోవాసాక్షులు అనుభవిస్తున్న అలాంటి భద్రతనేనా మీరు కోరుకుంటున్నది?

41 యెహోవా దేవుని క్రైస్తవ ఆరాధికులు, “తండ్రిని ఆత్మతోను సత్యముతోను” ఆరాధించే వారు ఇప్పుడే అనుభవిస్తున్నది అటువంటి భద్రతనే. వారు యెహోవా యొక్క నీతియుక్తమైన ప్రమాణాలకు లోబడడం ద్వారా, వాటిని తమ జీవితాల్లో ఆచరణలో పెట్టడం ద్వారా ఆ భద్రత అనుభవంలోకి వస్తుంది. యెషయా 32:17లో ముందుగా చెప్పబడినట్లు “నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.” వారు యెహోవా సర్వాధిపత్యానికి నమ్మకంగా మద్దతునిచ్చే వ్యక్తులు. వారు మంచి చెడుల విషయమై తమ సొంత ప్రమాణాలను పెట్టుకోరు. వారు ప్రపంచ సమస్యలను తమంతట తామే పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం లేదు. యెహోవా చేసిన ప్రేమపూర్వక ఏర్పాటును, అంటే, యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న ఆయన రాజ్యాన్ని వారు కృతజ్ఞతాపూర్వకంగా అంగీకరించి దానికి మద్దతునిస్తారు.

42 వారు అనుభవించే భద్రతను మీరు కూడా పంచుకోవాలని ఇష్టపడుతున్నారా? మీరు పంచుకోగలరు.

దానిని గూర్చి మీరు ఏమి చేయగలరు

43. యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వెళ్లి మీ అంతట మీరే ఏమి చూడగలరు?

43 అలాంటి భద్రతను అనుభవిస్తున్నవారితో సహవసించడమే మొదటి మెట్లలో ఒకటి. ఈ విధంగా మీరు వెదుకుతున్నది ఇలాంటి భద్రత కోసమేనా అని మీ అంతట మీరే చూడగలరు. మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు రాజ్యమందిరంలో జరిగే తమ కూటాలకు రమ్మని మిమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. వారి కూటాలు మతాచార కర్మలతో కూడినవి కావని, చందా సేకరణలు లేవని మీరు కనుగొంటారు. బదులుగా, దేవుని వాక్యాన్ని గూర్చి, అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిని గూర్చిన అర్థవంతమైన చర్చ అక్కడ జరుగుతుంది. “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని బైబిలు ఉపదేశిస్తుంది. (హెబ్రీయులు 10:24, 25) రాజ్యమందిరంలో మీరు కనుగొనేది ఇలాంటి స్ఫూర్తినే.

44. (ఎ) రాజ్యమందిరంలో ఇతరుల జీవితాల్లో కనిపించే భద్రతను మీరు వ్యక్తిగతంగా అనుభవించాలంటే మీకు ఏమి అవసరముంది? (బి) అలాంటి బంధాన్ని మనమెవరమూ కూడా తేలికగా తీసుకోలేమెందుకని, అయితే దానిని ఎలా సాధించవచ్చు?

44 అలాంటి కూటాలకు హాజరు కావడం వల్ల ఇతరులు అనుభవించే భద్రతను మీరు చూడగల్గుతారు. నిస్సందేహంగా మీరు ఆ సహవాసంలో ఆనందాన్ని పొందుతారు. అయితే, అలాంటి భద్రత మీకు వ్యక్తిగతంగా కావాలంటే మరంతకన్నా ఎక్కువే అవసరముంది. మీ అత్యంత గొప్ప అవసరమేమిటంటే యెహోవా దేవునితో అంగీకృత సంబంధమే. ఇప్పటి మీ క్షేమమూ, మీ భవిష్యత్తు కొరకైన ఉత్తరాపేక్షలన్నీ ఆధారపడి ఉన్నది ఆయన పైనే. అలాంటి సంబంధం మనమెవరమూ తేలికగా తీసుకోగలిగింది కాదు. మనం అలాంటి సంబంధంతో పుట్టలేదు. మనమందరం పాపియైన ఆదాము వారసులం. అలా మనం దేవుని నుండి వేరైపోయిన మానవ కుటుంబంలో జన్మించినవారమే. యెహోవా అనుగ్రహాన్ని పొందాలంటే మనమాయనతో సమాధానపడవలసి ఉంది. ఆయన తన కుమారుని బలిద్వారా చేసిన ప్రేమపూర్వక ఏర్పాటులో ఉంచే విశ్వాసం ఆధారంగా మాత్రమే ఇది సాధ్యమౌతుంది. “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని యేసు తానే చెప్పాడు.—యోహాను 14:6.

45. (ఎ) మన జీవితాన్ని గూర్చి మొదట మనమేమి గ్రహించవలసిన అవసరం ఉంది, మన జీవితాలను ఎలా ఉపయోగించుకోవాలి? (ప్రకటన 4:11) (బి) యెహోవాను ప్రీతిపరచేందుకు మనం ఆయన గురించి వ్యక్తిగతంగా ఎలా భావించాలి? (సి) నీటిలో మునగడం ఎందుకంత ప్రాముఖ్యం, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడే ముందు ఏమి చేయవలసి ఉంది? (మత్తయి 28:19, 20)

45 మనం మన జీవితాలను యెహోవాకు ఋణపడి ఉన్నామని, దేవునికి విధేయత చూపడంలో మన జీవితాలను ఉపయోగించడంలో ఏ విధంగానైనా తప్పిపోవడం తప్పు అని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. గతంలో దేవుని చిత్తానికి అనుగుణ్యంగా మన జీవితాలను ఉపయోగించనందుకు మనం యథార్థంగా పశ్చాత్తాపపడుతున్నట్లయితే, మన జీవితాలను దేవుని చిత్తానికి అనుగుణ్యంగా మలచుకుంటూ మన ఆ తప్పుడు జీవన రీతిని తిరస్కరించి, మన జీవన రీతిని మార్చుకుంటాము. తప్పనిసరిగా చేయాలని యేసు తన శిష్యులకు చెప్పినవాటిని చేయడం ఇందులో ఇమిడి ఉంది. అంటే, ‘తన్నుతాను ఉపేక్షించుకోవాలి.’ (మత్తయి 16:24) ఇలా చేసే వ్యక్తి దేవుని చిత్తాన్ని గురించిన చింత లేకుండా, కేవలం తన స్వార్థ కోరికలను నెరవేర్చుకునేందుకు జీవించే “హక్కు” తనకు ఉందని ఇక ఎన్నడూ చెప్పుకోడు. బదులుగా, దేవుని కుమారుని నడిపింపు ప్రకారం దేవుని చిత్తాన్ని చేయడానికి తనను తాను పూర్తిగా లోబరచుకుంటాడు. అది సరైనది కనుక, యెహోవా చేసే ప్రతిదానికి మంచిదైన సరైన ఉద్దేశం ఉందనీ, మనం నీతిని ప్రేమించినట్లైతే దేవుడు చేసే దాని వలన మనకు ఆశీర్వాదాలు వస్తాయనీ అతడు ఒప్పించబడ్డాడు కనుక అతడు అలా చేస్తాడు. అతడు ‘తన పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ ప్రాణముతోను, పూర్ణ శక్తితోను’ యెహోవాను నిజంగా ప్రేమిస్తాడు. (మార్కు 12:29, 30) తన సొంత హృదయంలో తనను తాను అలా బద్ధున్ని చేసుకోవడం ద్వారా, యేసును అనుకరించడంలో, ఆయన తన శిష్యులకిచ్చిన ఆజ్ఞకు లోబడడంలో అతడు బహిరంగంగా నీటిలో మునిగేందుకు సిద్ధపడతాడు. దేవుని వాక్యంలో చెప్పబడినట్లు, ఈ విధంగా మాత్రమే ఒకరు సత్యదేవునితో అంగీకృతమైన బంధంలోనికి వచ్చి, ఆయన సేవకులు అనుభవించే భద్రతను పంచుకోగలరు.

46. మనం నిజంగా యెహోవాను మన పరిపాలకునిగా కోరుకుంటున్నామని ఎలా రుజువు చేస్తాం?

46 ఆ తర్వాత, సాతాను చెప్పిన స్వతంత్ర జీవన రీతిని మీరు నిజంగా తిరస్కరించారని; మీరు మంచి చెడుల విషయమై మీ స్వంత ప్రమాణాలను పెట్టుకోరని; యెహోవా మీ పరిపాలకుడుగా ఉండాలని మీరు నిజంగా కోరుకుంటున్నారని మీరు రుజువు చేస్తూ ఉండడం ప్రాముఖ్యం. “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని సామెతలు 3:5, 6లో చెప్పబడినట్లు మీరు చేయవలసిన అవసరముంది. అవును, ఆయన మీ త్రోవలను నిజమైన శాశ్వతమైన భద్రతా మార్గంలోకి నడిపిస్తాడు.

47. యెహోవా ప్రేమపూర్వక ఏర్పాట్లను నిజంగా అంగీకరించేవారికి ఎలాంటి భద్రత కలుగుతుంది?

47 మానవజాతి కొరకు యెహోవా చేసిన ప్రేమపూర్వక ఏర్పాట్లను నిజంగా అంగీకరించే వారందరికీ ఎంత గొప్ప ఆశీర్వాదాలు వస్తాయో! ఆయన ఆధిపత్యం క్రింద స్థిరమైన స్థానాన్ని కలిగి ఉండడం ద్వారా, వారు ఇప్పుడు కాపాడబడతారు, అలాగే భవిష్యత్తు కొరకు వారు దృఢమైన నిరీక్షణలను కలిగి ఉన్నారు. యెహోవా యొక్క ప్రేమపూర్వక దయా, సత్యవర్తనాలను బట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేతుల్లోని దేవుని రాజ్యం క్రింద మానవజాతికి రానున్న పూర్తి సంతృప్తికరమైన భద్రతలో వారు పాలుపొందుతారు.

[అధస్సూచీలు]

^ పేరా 2 ప్రత్యేకంగా సూచించబడని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి ఎత్తివ్రాయబడినవి, లేఖనము ఎత్తివ్రాయబడినచోట NW అని ఉంటే, అది ఆంగ్ల భాషలోని పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము—రిఫరెన్సులతో కూడినది నుండి తర్జుమా చేయబడినదని సూచిస్తుంది.

[అధ్యయన ప్రశ్నలు]

[5వ పేజీలోని చిత్రం]

ఇప్పుడు జీవిస్తున్న ప్రజలు ఇక ఆకలి ఉండని రోజును చూస్తారు

[8వ పేజీలోని చిత్రం]

మన భవిష్యత్తు కొరకైన ఉత్తరాపేక్షలు ఆకాశములను భూమిని సృష్టించినవానిపై ఆధారపడి ఉన్నాయి

[24వ పేజీలోని చిత్రం]

భద్రత లేమి నేటి మానవ జీవితాన్ని ఎందుకు పాడుచేస్తుందో మన మొదటి తలిదండ్రులను గూర్చిన బైబిలు వృత్తాంతం చూపిస్తుంది

[33వ పేజీలోని చిత్రం]

దేవుని రాజ్యం క్రింద నేరం అంతమౌతుంది, ఒకరి ఆస్తికీ, ప్రాణానికీ కలిగే ప్రమాదం అంతమౌతుంది

[35వ పేజీలోని చిత్రం]

రోగమూ, మరణమూ తీసివేయబడతాయని—అవును, చనిపోయిన ప్రియమైనవారు కూడా మళ్ళీ జీవించేందుకు తిరిగి లేపబడతారనీ దేవుని వాక్యం వాగ్దానం చేస్తుంది