రాజులు మొదటి గ్రంథం 22:1-53

  • యెహోషాపాతు అహాబుతో పొత్తు పెట్టుకోవడం (1-12)

  • ఓటమి గురించి మీకాయా ప్రవచనం (13-28)

    • దేవదూత అహాబును వెర్రివాణ్ణి చేయడం (21, 22)

  • రామోత్గిలాదు దగ్గర అహాబు చనిపోవడం (29-40)

  • యెహోషాపాతు యూదాను పరిపాలించడం (41-50)

  • అహజ్యా, ఇశ్రాయేలు రాజు (51-53)

22  మూడు సంవత్సరాల పాటు ఇశ్రాయేలుకు, సిరియాకు మధ్య యుద్ధం జరగలేదు.  మూడో సంవత్సరంలో యూదా రాజైన యెహోషాపాతు+ ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్లాడు.+  అప్పుడు ఇశ్రాయేలు రాజు తన సేవకులతో, “రామోత్గిలాదు+ మనదని మీకు తెలుసా? అయినా మనం దాన్ని సిరియా రాజు చేతి నుండి వెనక్కి తీసుకోవడానికి సంకోచిస్తున్నాం” అన్నాడు.  అతను యెహోషాపాతును, “రామోత్గిలాదు దగ్గర యుద్ధం చేయడానికి నువ్వు నాతో వస్తావా?” అని అడిగాడు. దానికి యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “నువ్వూ నేనూ ఒక్కటే. నా ప్రజలు నీ ప్రజలే, నా గుర్రాలు నీ గుర్రాలే” అన్నాడు.+  అయితే యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “దయచేసి ముందు యెహోవా మాట కోసం విచారణ చేయి”+ అన్నాడు.+  దాంతో ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తల్ని సమకూర్చి, “నేను రామోత్గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? వద్దా?” అని వాళ్లను అడిగాడు. వాళ్లు, “వెళ్లు, యెహోవా దాన్ని రాజు చేతికి అప్పగిస్తాడు” అని చెప్పారు.  అప్పుడు యెహోషాపాతు, “ఇక్కడ యెహోవా ప్రవక్త ఒక్కరు కూడా లేరా? ఉంటే, మనం అతని ద్వారా కూడా దేవుని దగ్గర విచారణ చేద్దాం” అన్నాడు.+  దానికి ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఒకతను ఉన్నాడు, మనం అతని ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయవచ్చు.+ కానీ అతనంటే నాకు అసహ్యం,+ ఎందుకంటే అతను నా విషయంలో చెడునే తప్ప మంచిని ఎప్పుడూ ప్రవచించడు.+ అతను ఇమ్లా కుమారుడైన మీకాయా” అని అన్నాడు. అయితే యెహోషాపాతు, “రాజా, నువ్వు అలా మాట్లాడకూడదు” అన్నాడు.  కాబట్టి ఇశ్రాయేలు రాజు ఒక ఆస్థాన అధికారిని పిలిచి, “ఇమ్లా కుమారుడైన మీకాయాను వెంటనే తీసుకురా” అని చెప్పాడు.+ 10  ఆ సమయంలో ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజ వస్త్రాలు ధరించుకుని, సమరయ ప్రవేశ ద్వారం దగ్గరున్న ఖాళీ స్థలంలో తమ సింహాసనాల మీద కూర్చొనివున్నారు; ప్రవక్తలందరూ వాళ్ల ముందు ప్రవచిస్తూ ఉన్నారు.+ 11  అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని ఇలా అన్నాడు: “యెహోవా ఏం చెప్తున్నాడంటే, ‘నువ్వు సిరియన్లను పూర్తిగా నిర్మూలించే వరకు వీటితో వాళ్లను పొడుస్తావు.’ ”* 12  మిగతా ప్రవక్తలందరూ అదేవిధంగా ప్రవచిస్తూ, “నువ్వు రామోత్గిలాదుకు వెళ్లు, నువ్వు విజయం సాధిస్తావు; యెహోవా దాన్ని రాజు చేతికి అప్పగిస్తాడు” అని అంటూ ఉన్నారు. 13  కాబట్టి మీకాయాను పిలవడానికి వెళ్లిన వ్యక్తి మీకాయాతో, “ప్రవక్తలందరూ ఒక్కటిగా రాజుకు అనుకూలమైన మాటే చెప్పారు. దయచేసి నువ్వు కూడా వాళ్లలా అనుకూలంగా మాట్లాడు” అని చెప్పాడు.+ 14  కానీ మీకాయా, “యెహోవా జీవం తోడు, యెహోవా నాకు ఏది చెప్తే అదే చెప్తాను” అన్నాడు. 15  మీకాయా రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? వద్దా?” అని అడిగాడు. మీకాయా వెంటనే, “వెళ్లు, నువ్వు విజయం సాధిస్తావు; యెహోవా దాన్ని రాజు చేతికి అప్పగిస్తాడు” అని చెప్పాడు. 16  అప్పుడు రాజు అతనితో, “నాతో నిజం మాత్రమే మాట్లాడాలని నేను యెహోవా పేరున నీతో ఎన్నిసార్లు ఒట్టు వేయించాలి?” అన్నాడు. 17  కాబట్టి మీకాయా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులందరూ కాపరిలేని గొర్రెల్లా పర్వతాల మీద చెదిరిపోయి ఉండడం+ నేను చూస్తున్నాను. ‘వీళ్లకు యజమాని లేడు. ప్రతీ ఒక్కర్ని తమ ఇళ్లకు ప్రశాంతంగా తిరిగెళ్లనీ’ అని యెహోవా అన్నాడు.” 18  అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఇతను నా విషయంలో చెడునే తప్ప మంచిని ప్రవచించడని నీకు చెప్పానుగా?” అన్నాడు.+ 19  అప్పుడు మీకాయా ఇలా అన్నాడు: “యెహోవా చెప్పే మాట వినండి: యెహోవా తన సింహాసనం మీద కూర్చొనివుండడం,+ పరలోక సైన్యమంతా ఆయన కుడిపక్కన, ఎడమపక్కన నిలబడివుండడం నేను చూశాను.+ 20  అప్పుడు యెహోవా, ‘అహాబు రామోత్గిలాదు మీదికి వెళ్లి అక్కడ చనిపోయేలా అతన్ని ఎవరు వెర్రివాణ్ణి చేస్తారు?’ అని అడిగాడు. ఒక దేవదూత ఒక మాట చెప్తుంటే, ఇంకో దేవదూత ఇంకో మాట చెప్తున్నాడు. 21  తర్వాత ఒక దేవదూత*+ యెహోవా ముందుకు వచ్చి నిలబడి, ‘నేను అతన్ని వెర్రివాణ్ణి చేస్తాను’ అన్నాడు. ‘నువ్వు ఆ పని ఎలా చేస్తావు?’ అని యెహోవా అడిగాడు. 22  దానికి ఆ దేవదూత, ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరూ అబద్ధం చెప్పేలా చేస్తాను’+ అన్నాడు. అప్పుడు ఆయన, ‘నువ్వు అతన్ని వెర్రివాణ్ణి చేస్తావు, తప్పకుండా విజయం సాధిస్తావు. వెళ్లి ఆ పని చేయి’ అన్నాడు. 23  ఈ ప్రవక్తలందరి చేత నీకు అబద్ధం చెప్పించేలా యెహోవా ఒక దేవదూతను అనుమతించాడు,+ కానీ యెహోవా నీ మీదికి విపత్తు వస్తుందని ప్రకటించాడు.”+ 24  అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా వచ్చి మీకాయాను చెంపమీద కొట్టి, “నీతో మాట్లాడడానికి యెహోవా పవిత్రశక్తి* నా దగ్గర నుండి ఏ దారిలో వెళ్లింది?” అన్నాడు.+ 25  అందుకు మీకాయా, “నువ్వు దాక్కోవడానికి లోపలి గదిలోకి వెళ్లే రోజున, అది ఏ దారిలో వెళ్లిందో నీకే తెలుస్తుంది” అని చెప్పాడు. 26  అప్పుడు ఇశ్రాయేలు రాజు ఇలా ఆజ్ఞాపించాడు: “మీకాయాను తీసుకెళ్లి, నగర అధిపతైన ఆమోనుకు, రాజు కుమారుడైన యోవాషుకు అప్పగించండి. 27  ‘ “ఇతన్ని చెరసాలలో పెట్టి,+ నేను క్షేమంగా తిరిగొచ్చేవరకు కొంచెం ఆహారం, నీళ్లు మాత్రమే ఇవ్వండి” అని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు’ అని వాళ్లకు చెప్పండి.” 28  అయితే మీకాయా, “నువ్వు ఒకవేళ నిజంగా క్షేమంగా తిరిగొస్తే యెహోవా నాతో మాట్లాడనట్టే”+ అన్నాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: “ప్రజలారా, మీరందరూ దీన్ని గుర్తుంచుకోండి.” 29  తర్వాత ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్గిలాదు దగ్గరికి వెళ్లారు.+ 30  ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో ఇలా చెప్పాడు: “నేను మారువేషం వేసుకుని యుద్ధంలోకి వెళ్తాను, కానీ నువ్వు నీ రాజవస్త్రాలు వేసుకోవాలి.” కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకుని+ యుద్ధంలోకి వెళ్లాడు. 31  అయితే సిరియా రాజు తన 32 మంది రథాధిపతులకు+ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు: “మీరు ఇశ్రాయేలు రాజుతోనే తప్ప చిన్నవాళ్లతో గానీ గొప్పవాళ్లతో గానీ ఎవ్వరితో పోరాడకండి.” 32  ఆ రథాధిపతులు యెహోషాపాతును చూడగానే, “ఇశ్రాయేలు రాజు ఖచ్చితంగా ఇతనే” అని అనుకున్నారు. కాబట్టి వాళ్లు అతనితో యుద్ధం చేయడానికి అతని వైపు వెళ్లారు; దాంతో యెహోషాపాతు సహాయం కోసం కేకలు వేయడం మొదలుపెట్టాడు. 33  అతను ఇశ్రాయేలు రాజు కాదని రథాధిపతులు గమనించినప్పుడు వాళ్లు వెంటనే అతన్ని తరమడం ఆపేశారు. 34  అయితే ఒకతను ఊరికే గురిచూడకుండా ఒక బాణం వేసినప్పుడు, అది ఇశ్రాయేలు రాజు కవచంలోని భాగాల మధ్యలోకి దిగింది. దాంతో రాజు తన రథసారథితో, “నాకు తీవ్రంగా గాయమైంది, రథం వెనక్కి తిప్పి యుద్ధంలో* నుండి నన్ను బయటికి తీసుకెళ్లు” అని చెప్పాడు.+ 35  ఆ రోజంతా తీవ్రంగా యుద్ధం జరిగింది; రాజును సిరియన్లకు ఎదురుగా రథంలో నిలబెట్టాల్సి వచ్చింది. అతని గాయం నుండి వచ్చే రక్తం రథం లోపలి భాగంలోకి కారింది, అతను సాయంత్రం వేళ చనిపోయాడు.+ 36  దాదాపు సూర్యాస్తమయం వేళ, “అందరూ తమతమ నగరాలకు, ప్రాంతాలకు వెళ్లిపోండి!” అని సైనికులకు చాటించారు.+ 37  ఆ విధంగా రాజు చనిపోయాడు, అతన్ని సమరయకు తీసుకొచ్చి పాతిపెట్టారు. 38  వాళ్లు అతని యుద్ధ రథాన్ని సమరయ కోనేరులో కడుగుతుండగా కుక్కలు అతని రక్తాన్ని నాకాయి, వేశ్యలు అక్కడ స్నానం చేశారు.* ఇది యెహోవా చెప్పిన మాట ప్రకారం జరిగింది.+ 39  అహాబు మిగతా చరిత్ర గురించి, అంటే అతను చేసిన పనులన్నిటి గురించి, అతను కట్టించిన దంతపు రాజభవనం+ గురించి, అతను కట్టించిన నగరాలన్నిటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 40  తర్వాత అహాబు చనిపోయాడు;*+ అతని స్థానంలో అతని కుమారుడు అహజ్యా+ రాజయ్యాడు. 41  ఇశ్రాయేలు రాజైన అహాబు పరిపాలనలోని నాలుగో సంవత్సరంలో, ఆసా కుమారుడైన యెహోషాపాతు+ యూదా మీద రాజయ్యాడు. 42  రాజైనప్పుడు యెహోషాపాతుకు 35 ఏళ్లు, అతను యెరూషలేములో 25 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కూతురు. 43  అతను తన తండ్రి ఆసా మార్గమంతటిలో+ నడుస్తూ ఉన్నాడు. అతను దాని నుండి పక్కకు మళ్లలేదు, అతను యెహోవా దృష్టికి సరైనది చేశాడు.+ అయితే ఉన్నత స్థలాలు మాత్రం తీసేయబడలేదు, ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల మీద బలులు అర్పిస్తూ, వాటి పొగ పైకిలేచేలా చేస్తూనే ఉన్నారు.+ 44  యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో శాంతియుత సంబంధాలు నెలకొల్పుకున్నాడు.+ 45  యెహోషాపాతు మిగతా చరిత్ర గురించి, అంటే అతని పరాక్రమ కార్యాల గురించి, అతను యుద్ధం చేసిన విధానం గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 46  అతని తండ్రి ఆసా రోజుల్లో, ఆలయ వేశ్యలు*+ కొంతమంది ఇంకా మిగిలారు, యెహోషాపాతు వాళ్లను కూడా దేశంలో లేకుండా చేశాడు.+ 47  ఆ రోజుల్లో ఎదోములో+ రాజు లేడు; ఒక అధికారి రాజుగా పరిపాలన చేసేవాడు.+ 48  ఓఫీరు నుండి బంగారం తీసుకురావడం కోసం యెహోషాపాతు తర్షీషు ఓడల్ని* కూడా చేయించాడు; కానీ అవి వెళ్లలేదు, అవి ఎసోన్గెబెరు దగ్గర బద్దలైపోయాయి.+ 49  అప్పుడు అహాబు కుమారుడైన అహజ్యా యెహోషాపాతుతో, “నా సేవకుల్ని నీ సేవకులతో పాటు ఓడల్లో వెళ్లనివ్వు” అన్నాడు, కానీ యెహోషాపాతు ఒప్పుకోలేదు. 50  తర్వాత యెహోషాపాతు చనిపోయాడు,* అతన్ని అతని పూర్వీకులతో పాటు అతని పూర్వీకుడైన దావీదు నగరంలో పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కుమారుడు యెహోరాము+ రాజయ్యాడు. 51  యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని 17వ సంవత్సరంలో, అహాబు కుమారుడైన అహజ్యా+ సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. అతను ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పరిపాలించాడు. 52  అతను యెహోవా దృష్టిలో చెడ్డపనులు చేస్తూ, తన తల్లిదండ్రుల మార్గంలో,+ ఇశ్రాయేలీయులతో పాపం చేయించిన నెబాతు కుమారుడైన యరొబాము మార్గంలో నడిచాడు.+ 53  అతను బయలును సేవిస్తూ,+ దానికి మొక్కుతూ, తన తండ్రిలాగే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం తెప్పిస్తూ ఉన్నాడు.+

అధస్సూచీలు

లేదా “నెడతావు.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అక్ష., “శిబిరంలో.”
లేదా “వేశ్యలు స్నానం చేసే చోట కడుగుతుండగా కుక్కలు అతని రక్తాన్ని నాకాయి” అయ్యుంటుంది.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
లేదా “మగవేశ్యలు.”
పదకోశం చూడండి.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”