దినవృత్తాంతాలు రెండో గ్రంథం 1:1-17

  • సొలొమోను తెలివి ఇవ్వమని కోరుకోవడం (1-12)

  • సొలొమోను సిరిసంపదలు (13-17)

1  దావీదు కుమారుడైన సొలొమోను రాజరికం అంతకంతకూ స్థిరపడుతూ వచ్చింది. అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉంటూ అతన్ని ఎంతో గొప్పవాణ్ణి చేశాడు.+  సొలొమోను ఇశ్రాయేలీయులందర్నీ, సహస్రాధిపతుల్ని,* శతాధిపతుల్ని,* న్యాయమూర్తుల్ని, ఇశ్రాయేలు అంతటా ఉన్న ప్రధానులందర్నీ, పూర్వీకుల కుటుంబాల పెద్దల్ని పిలిపించాడు.  అప్పుడు సొలొమోను, సమాజమంతా గిబియోనులోని ఉన్నత స్థలానికి+ వెళ్లారు, ఎందుకంటే అక్కడ సత్యదేవుని ప్రత్యక్ష గుడారం ఉంది. దాన్ని యెహోవా సేవకుడైన మోషే ఎడారిలో* చేయించాడు.  అయితే, దావీదు సత్యదేవుని మందసాన్ని* కిర్యత్యారీము నుండి తాను సిద్ధం చేసిన స్థలానికి తీసుకొచ్చాడు;+ అతను దాని కోసం యెరూషలేములో ఒక డేరా వేయించాడు.+  హూరు మనవడూ ఊరి కుమారుడూ అయిన బెసలేలు+ తయారుచేసిన రాగి బలిపీఠం+ యెహోవా గుడారం ఎదుట ఉంచబడింది; సొలొమోను, ఇశ్రాయేలు సమాజం దాని ఎదుట ప్రార్థించేవాళ్లు.*  అప్పుడు, సొలొమోను యెహోవా ఎదుట అక్కడ అర్పణలు అర్పించాడు. అతను ప్రత్యక్ష గుడారం దగ్గరున్న రాగి బలిపీఠం మీద 1,000 దహనబలులు అర్పించాడు.+  ఆ రోజు రాత్రి దేవుడు సొలొమోనుకు కలలో కనిపించి, “నేను నీకు ఏమి ఇవ్వాలో కోరుకో” అని అడిగాడు.+  అప్పుడు సొలొమోను దేవునితో ఇలా అన్నాడు: “నువ్వు నా తండ్రి దావీదు మీద ఎంతో విశ్వసనీయ ప్రేమ చూపించావు,+ నన్ను అతని స్థానంలో రాజును చేశావు.+  యెహోవా దేవా, నువ్వు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానం నెరవేరాలి.+ భూమ్మీద ధూళి అంత విస్తారంగా ఉన్న ప్రజల+ మీద నువ్వు నన్ను రాజును చేశావు. 10  ఈ ప్రజల్ని నడిపించడానికి కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని నాకు ఇవ్వు;+ లేకపోతే ఈ నీ గొప్ప జనానికి ఎవరు న్యాయం తీర్చగలరు?”+ 11  అప్పుడు దేవుడు సొలొమోనుతో ఇలా అన్నాడు: “నువ్వు ఐశ్వర్యాన్ని గానీ, సిరిసంపదల్ని గానీ, ఘనతను గానీ, నిన్ను ద్వేషిస్తున్నవాళ్ల ప్రాణాన్ని గానీ, దీర్ఘాయుష్షును గానీ అడగకుండా నేను నిన్ను రాజుగా చేసిన నా ప్రజలకు న్యాయం తీర్చడానికి తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వమని అడిగావు, నువ్వు మనస్ఫూర్తిగా ఇలా కోరుకున్నావు కాబట్టి,+ 12  తెలివిని, జ్ఞానాన్ని నీకు ఇస్తాను; అంతేకాదు నీకు ముందు గానీ, నీ తర్వాత గానీ ఏ రాజుకూ లేనంత ఐశ్వర్యాన్ని, సిరిసంపదల్ని, ఘనతను కూడా నీకు ఇస్తాను.”+ 13  తర్వాత సొలొమోను గిబియోనులోని ఉన్నత స్థలం+ నుండి, అంటే ప్రత్యక్ష గుడారం నుండి యెరూషలేముకు వచ్చాడు; అతను ఇశ్రాయేలు మీద పరిపాలన చేశాడు. 14  సొలొమోను రథాల్ని, గుర్రాల్ని* సమకూర్చుకుంటూ వచ్చాడు; అతని దగ్గర 1,400 రథాలు, 12,000 గుర్రాలు ఉండేవి,*+ అతను వాటిని రథాల నగరాల్లో,+ అలాగే యెరూషలేములో తన దగ్గర ఉంచుకున్నాడు.+ 15  రాజు, రాళ్లంత విస్తారంగా వెండిబంగారాల్ని,+ షెఫేలాలోని అత్తి చెట్లంత విస్తారంగా దేవదారు మ్రానుల్ని యెరూషలేములో ఉంచాడు.+ 16  సొలొమోను దగ్గరున్న గుర్రాలు ఐగుప్తు* నుండి దిగుమతి చేసుకున్నవి;+ రాజు వర్తకుల గుంపు గుర్రాల మందల్ని* ఒకే* ధరకు కొనేవాళ్లు.+ 17  ఐగుప్తు నుండి దిగుమతి చేసుకున్న ఒక్కో రథం ధర 600 వెండి రూకలు, ఒక్కో గుర్రం ధర 150 వెండి రూకలు; అలా దిగుమతి చేసుకున్నవాటిని హిత్తీయుల రాజులందరికీ, సిరియా రాజులకు ఎగుమతి చేసేవాళ్లు.

అధస్సూచీలు

అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అంటే, 100 మంది మీద అధిపతులు.
పదకోశం చూడండి.
లేదా “పెద్దపెట్టెను.”
లేదా “అక్కడ దేవుని దగ్గర విచారణ చేసేవాళ్లు.”
లేదా “గుర్రపురౌతుల్ని.”
లేదా “గుర్రపురౌతులు ఉండేవాళ్లు.”
లేదా “ఈజిప్టు.”
లేదా “ఐగుప్తు నుండి, కవే నుండి దిగుమతి చేసుకున్నవి; రాజు వర్తకులు వాటిని కవే నుండి” అయ్యుంటుంది. కవే అనేది బహుశా కిలికియను సూచిస్తుండవచ్చు.
లేదా “నిర్ణీత.”