దినవృత్తాంతాలు రెండో గ్రంథం 24:1-27

  • యెహోయాషు పరిపాలన (1-3)

  • యెహోయాషు ఆలయాన్ని బాగు ​చేయించడం (4-14)

  • యెహోయాషు మతభ్రష్టత్వం (15-22)

  • యెహోయాషు హత్య (23-27)

24  యెహోయాషు రాజైనప్పుడు అతనికి ఏడేళ్లు.+ అతను యెరూషలేములో 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి బెయేర్షెబాకు+ చెందిన జిబ్యా.  అతను యాజకుడైన యెహోయాదా బ్రతికున్నంత కాలం యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉన్నాడు.+  యెహోయాదా అతనికి ఇద్దరు స్త్రీలతో పెళ్లి చేశాడు. అతనికి కుమారులు, కూతుళ్లు పుట్టారు.  కొంతకాలం తర్వాత యెహోయాషు, యెహోవా మందిరాన్ని బాగుచేయాలని+ తన హృదయంలో కోరుకున్నాడు.  అప్పుడు అతను యాజకుల్ని, లేవీయుల్ని పిలిపించి, వాళ్లతో ఇలా అన్నాడు: “ప్రతీ సంవత్సరం మీ దేవుని మందిరాన్ని బాగుచేయడానికి, మీరు యూదా నగరాలకు వెళ్లి ఇశ్రాయేలీయులందరి దగ్గర డబ్బులు సేకరించండి;+ మీరు ఈ పనిని వెంటనే చేయండి.” కానీ లేవీయులు ఆ పనిని వెంటనే చేయలేదు.+  కాబట్టి యెహోయాషు రాజు ముఖ్య యాజకుడైన యెహోయాదాను పిలిచి అతనితో ఇలా అన్నాడు:+ “సాక్ష్యపు గుడారం+ కోసం యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన పవిత్రమైన పన్నును+ అంటే ఇశ్రాయేలు సమాజం ఇవ్వాల్సిన పవిత్రమైన పన్నును యూదా, యెరూషలేముల నుండి తీసుకురమ్మని నువ్వు లేవీయుల్ని ఎందుకు అడగలేదు?  ఆ దుష్టురాలైన అతల్యా+ కుమారులు సత్యదేవుని మందిరంలోకి చొరబడి,+ యెహోవా మందిరంలోని పవిత్రమైన వస్తువులన్నిటినీ బయలు దేవుళ్ల కోసం ఉపయోగించారు.”  రాజు ఆజ్ఞాపించినట్టు వాళ్లు ఒక పెట్టెను+ చేయించి, దాన్ని బయట యెహోవా మందిర ద్వారం దగ్గర ఉంచారు.+  తర్వాత, ఎడారిలో సత్యదేవుని సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు విధించిన పవిత్రమైన పన్నును+ యెహోవా దగ్గరికి తీసుకురమ్మని యూదా, యెరూషలేము అంతటా చాటించారు. 10  అధిపతులందరూ, ప్రజలందరూ సంతోషంగా+ విరాళాలు తెస్తూ పెట్టె నిండేంతవరకు* దానిలో వేస్తూ వచ్చారు. 11  లేవీయులకు ఆ పెట్టెలో చాలా డబ్బులు కనిపించినప్పుడల్లా వాళ్లు దాన్ని రాజు దగ్గరికి తెచ్చేవాళ్లు. అప్పుడు రాజు కార్యదర్శి, ముఖ్య యాజకుని అధికారి వచ్చి ఆ పెట్టెను ఖాళీ చేసేవాళ్లు.+ తర్వాత దాన్ని దాని స్థానంలో పెట్టేవాళ్లు. వాళ్లు ప్రతీరోజు అలా చేసేవాళ్లు. అలా వాళ్లు విస్తారంగా డబ్బు సమకూర్చారు. 12  రాజు, యెహోయాదా ఆ డబ్బును యెహోవా మందిర పనిని పర్యవేక్షిస్తున్నవాళ్లకు ఇచ్చేవాళ్లు. వాళ్లు ఆ డబ్బుతో యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి రాళ్లు చెక్కేవాళ్లను, నైపుణ్యంగల పనివాళ్లను, అలాగే యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి+ ఇనుము, రాగి పనివాళ్లను కూలికి తెచ్చేవాళ్లు. 13  పర్యవేక్షకులు పనిని ప్రారంభించారు, వాళ్ల పర్యవేక్షణలో మరమ్మతు పని కొనసాగింది. వాళ్లు సత్యదేవుని మందిరాన్ని మునుపటి స్థితికి తీసుకొచ్చి దాన్ని పటిష్ఠం చేశారు. 14  వాళ్లు ఆ పని పూర్తిచేయగానే, మిగిలిన డబ్బును రాజు దగ్గరికి, యెహోయాదా దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్లు ఆ డబ్బును యెహోవా మందిరం కోసం పాత్రల్ని, పరిచారం కోసం, అర్పణల కోసం ఉపయోగించే పాత్రల్ని, వెండి-బంగారు గిన్నెల్ని, పాత్రల్ని+ చేయించడానికి ఉపయోగించారు. యెహోయాదా బ్రతికున్నంత కాలం యెహోవా మందిరంలో ప్రతీరోజు దహనబలులు+ అర్పించబడుతూ ఉండేవి. 15  యెహోయాదా చాలాకాలం జీవించి ముసలివాడై తృప్తిగా చనిపోయాడు; చనిపోయినప్పుడు అతని వయసు 130 ఏళ్లు. 16  అతను సత్యదేవునికి, ఆయన మందిరానికి సంబంధించి ఇశ్రాయేలులో మంచిపనులు చేశాడు+ కాబట్టి అతన్ని దావీదు నగరంలో రాజులతోపాటు పాతిపెట్టారు.+ 17  యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు రాజు దగ్గరికి వచ్చి అతనికి సాష్టాంగపడ్డారు, రాజు వాళ్ల మాట విన్నాడు. 18  ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచిపెట్టి పూజా కర్రల్ని,* విగ్రహాల్ని పూజించడం మొదలుపెట్టారు. దాంతో వాళ్ల అపరాధం కారణంగా యూదా మీదికి, యెరూషలేము మీదికి దేవుని కోపం వచ్చింది. 19  యెహోవా వాళ్లను మళ్లీ తన దగ్గరికి తీసుకురావడానికి ప్రవక్తల్ని పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్తలు వాళ్లను హెచ్చరిస్తూ* ఉన్నా వాళ్లు వినడానికి ఇష్టపడలేదు.+ 20  యాజకుడైన యెహోయాదా కుమారుడు+ జెకర్యా మీదికి దేవుని పవిత్రశక్తి వచ్చింది.* అప్పుడు అతను ప్రజల కన్నా కాస్త ఎత్తులో నిలబడి వాళ్లతో ఇలా అన్నాడు: “సత్యదేవుడు చెప్తున్నదేమిటంటే, ‘మీరు యెహోవా ఆజ్ఞల్ని ఎందుకు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు! మీరు యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని విడిచిపెడతాడు.’ ”+ 21  అప్పుడు వాళ్లు అతని మీద కుట్రపన్ని,+ రాజాజ్ఞ ప్రకారం అతన్ని యెహోవా మందిరంలోని ప్రాంగణంలో రాళ్లతో కొట్టి చంపారు.+ 22  అలా యెహోయాషు రాజు, జెకర్యా తండ్రైన యెహోయాదా తనమీద చూపించిన విశ్వసనీయ ప్రేమను మర్చిపోయి, అతని కుమారుణ్ణి చంపాడు. జెకర్యా చనిపోతూ ఇలా అన్నాడు: “యెహోవా దీన్ని చూసి, నిన్ను లెక్క అడగాలి.”+ 23  సంవత్సరం ప్రారంభంలో* సిరియా సైన్యం యెహోయాషు మీదికి వచ్చింది. వాళ్లు యూదా మీద, యెరూషలేము మీద దాడిచేశారు.+ వాళ్లు ప్రజల అధిపతులందర్నీ చంపారు,+ వాళ్లు తమ దోపుడుసొమ్ము అంతటినీ దమస్కు రాజుకు పంపించారు. 24  దండెత్తిన సిరియా సైన్యంలో కొంతమందే ఉన్నా, యెహోవా వాళ్ల చేతికి చాలా పెద్ద సైన్యాన్ని అప్పగించాడు.+ ఎందుకంటే ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు; కాబట్టి వాళ్లు* యెహోయాషును శిక్షించారు. 25  వాళ్లు అతని దగ్గర నుండి వెళ్లినప్పుడు (ఎందుకంటే వాళ్లు అతన్ని తీవ్రంగా గాయపర్చారు*), అతని సేవకులు అతని మీద కుట్రపన్నారు. ఎందుకంటే అతను యాజకుడైన యెహోయాదా కుమారుల* రక్తాన్ని చిందించాడు.+ వాళ్లు అతన్ని అతని మంచం మీదే చంపారు.+ వాళ్లు అతన్ని దావీదు నగరంలో+ పాతిపెట్టారు కానీ రాజుల సమాధుల్లో పాతిపెట్టలేదు.+ 26  అతని మీద కుట్రపన్నినవాళ్లు+ ఎవరంటే: అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడు జాబాదు, మోయాబీయురాలైన షిమ్రీతు కుమారుడు యెహోజాబాదు. 27  అతని కుమారుల్ని గురించిన, అతనికి వ్యతిరేకంగా చెప్పబడిన తీర్పుల గురించిన,+ సత్యదేవుని మందిరం బాగుచేయడం+ గురించిన విషయాలన్నీ రాజుల గ్రంథంలోని రాతల్లో* నమోదు చేయబడ్డాయి. అతని స్థానంలో అతని కుమారుడు అమజ్యా రాజయ్యాడు.

అధస్సూచీలు

లేదా “వాళ్లందరూ ఇచ్చేంతవరకు” అయ్యుంటుంది.
పదకోశం చూడండి.
లేదా “వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తూ.”
అక్ష., “కమ్ముకుంది.”
అక్ష., “సంవత్సరం మారుతున్నప్పుడు.”
అంటే, సిరియన్లు.
లేదా “అతను చాలా జబ్బులతో ఉన్నాడు.”
లేదా “కుమారుడి.” గౌరవం చూపించడానికి బహువచనం ఉపయోగించి ఉండవచ్చు.
లేదా “కథనంలో; వ్యాఖ్యానంలో.”