దినవృత్తాంతాలు రెండో గ్రంథం 4:1-22
4 తర్వాత అతను* రాగి బలిపీఠం+ చేయించాడు. దాని పొడవు 20 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 10 మూరలు.
2 అతను లోహంతో సముద్రం*+ పోత పోయించాడు. అది గుండ్రంగా ఉంది, అది ఒక అంచు నుండి ఇంకో అంచు వరకు 10 మూరలు ఉంది, దాని ఎత్తు 5 మూరలు, దాని చుట్టుకొలత 30 మూరలు.*+
3 దాని కింద, అలాగే చుట్టూరా గుండ్రటి అలంకారాలు+ ఉన్నాయి. మూరకు పది చొప్పున అవి సముద్రం చుట్టూరా ఉన్నాయి. ఆ అలంకారాలు రెండు వరుసల్లో ఉన్నాయి. అవి సముద్రంతో కలిపి పోత పోయబడ్డాయి.
4 ఆ సముద్రం 12 ఎద్దుల మీద ఉంది;+ 3 ఎద్దులు ఉత్తరం వైపుకు, 3 ఎద్దులు పడమటి వైపుకు, 3 ఎద్దులు దక్షిణం వైపుకు, 3 ఎద్దులు తూర్పు వైపుకు తిరిగి ఉన్నాయి; వాటిమీద సముద్రం ఉంది. ఎద్దుల వెనక భాగాలు మధ్యవైపుకు ఉన్నాయి.
5 సముద్రం బెత్తెడు* మందం ఉంది; దాని అంచు గిన్నె అంచులా, వికసించిన కలువ పువ్వులా చేయబడింది. ఆ జలాశయంలో 3,000 బాత్ కొలతల* నీళ్లు పడతాయి.
6 అంతేకాదు, అతను పది గంగాళాలు చేయించి కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు పెట్టించాడు.+ వాటిలోని నీళ్లతో దహనబలికి ఉపయోగించేవాటిని కడిగేవాళ్లు.+ సముద్రాన్ని మాత్రం యాజకులు కాళ్లూచేతులు కడుక్కోవడానికి ఉపయోగించేవాళ్లు.+
7 తర్వాత అతను, నిర్దేశించబడిన ప్రకారం+ పది బంగారు దీపస్తంభాల్ని+ చేయించి ఆలయంలో కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు పెట్టించాడు.+
8 అతను పది బల్లల్ని కూడా చేయించాడు. అతను వాటిని ఆలయంలో కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు పెట్టించాడు;+ అంతేకాదు అతను 100 బంగారు గిన్నెల్ని చేయించాడు.
9 తర్వాత అతను యాజకుల ప్రాంగణాన్ని,+ గొప్ప ప్రాంగణాన్ని,+ వాటి కోసం తలుపుల్ని చేయించి, ఆ తలుపుల్ని రాగి రేకుతో కప్పించాడు.
10 అతను సముద్రాన్ని కుడివైపున ఆగ్నేయ దిక్కులో పెట్టించాడు.+
11 హీరాము, బూడిదను ఎత్తే బాల్చీల్ని, పారల్ని, గిన్నెల్ని+ కూడా చేశాడు.
అలా హీరాము సత్యదేవుని మందిరం విషయంలో సొలొమోను రాజు చేయమన్న పనిని పూర్తిచేశాడు. అతను వీటిని చేశాడు:+
12 రెండు స్తంభాలు,+ రెండు స్తంభాల మీదున్న గుండ్రటి స్తంభ శీర్షాలు; రెండు స్తంభాల మీదున్న రెండు గుండ్రటి శీర్షాల్ని కప్పడానికి రెండు అల్లికలు;+
13 స్తంభాల మీదున్న రెండు గుండ్రటి శీర్షాల్ని కప్పే రెండు అల్లికల్లో ఒక్కో అల్లిక కోసం రెండు వరుసల దానిమ్మ పండ్ల+ చొప్పున మొత్తం 400 దానిమ్మ పండ్లు;+
14 పది బండ్లు,* బండ్ల మీదున్న పది గంగాళాలు;+
15 సముద్రం, దాని కిందవున్న 12 ఎద్దులు;+
16 బాల్చీలు, పారలు, ముళ్ల గరిటెలు,+ వాటికి సంబంధించిన పాత్రలన్నీ; యెహోవా మందిరం కోసం సొలొమోను రాజు చేయమన్నట్టు హూరామబీవు+ వీటిని మెరుగుపెట్టిన రాగితో చేశాడు.
17 రాజు వాటిని యొర్దాను ప్రాంతంలో సుక్కోతుకు,+ జెరేదాకు మధ్య బంకమట్టి అచ్చుల్లో పోత పోయించాడు.
18 సొలొమోను ఈ పాత్రలన్నిటినీ పెద్ద సంఖ్యలో చేయించాడు. రాగి ఎంత ఉపయోగించబడిందో తెలియలేదు.+
19 సత్యదేవుని మందిరం కోసం సొలొమోను వీటన్నిటినీ చేయించాడు:+ బంగారు ధూపవేదిక,+ సముఖపు రొట్టెల* కోసం బల్లలు;+
20 నియమం ప్రకారం అత్యంత లోపలి గది ఎదుట వెలిగించడానికి స్వచ్ఛమైన బంగారు దీపస్తంభాలు, వాటి దీపాలు;+
21 బంగారంతో, అంటే అత్యంత స్వచ్ఛమైన బంగారంతో చేసిన వికసించిన పువ్వులు, దీపాలు, పట్టుకార్లు;
22 స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఒత్తులు కత్తిరించే కత్తెరలు, పాత్రలు, గిన్నెలు, నిప్పు పాత్రలు; అతను అతి పవిత్ర స్థలం తలుపుల్ని,+ ఆలయ మందిరపు* తలుపుల్ని బంగారంతో చేయించాడు.+
అధస్సూచీలు
^ అంటే, సొలొమోను.
^ లేదా “జలాశయం.”
^ లేదా “దాన్ని చుట్టడానికి 30 మూరల కొలనూలు పట్టింది.”
^ దాదాపు 7.4 సెంటీమీటర్లు (2.9 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.
^ అప్పట్లో ఒక బాత్ 22 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
^ లేదా “నీటి బండ్లు.”
^ లేదా “సన్నిధి రొట్టెల.”
^ ఇది పవిత్ర స్థలాన్ని సూచిస్తోంది.