దినవృత్తాంతాలు రెండో గ్రంథం 9:1-31

  • సొలొమోను దగ్గరికి షేబ దేశపు రాణి రావడం (1-12)

  • సొలొమోను ఐశ్వర్యం (13-28)

  • సొలొమోను మరణం (29-31)

9  షేబ దేశపు రాణి+ సొలొమోను పేరుప్రఖ్యాతుల గురించి విన్నది. కాబట్టి ఆమె చిక్కు ప్రశ్నలతో* సొలొమోనును పరీక్షించడానికి యెరూషలేముకు వచ్చింది. ఆమె గొప్ప పరివారంతో ఒంటెల మీద సాంబ్రాణి తైలం, పెద్ద మొత్తంలో బంగారం,+ రత్నాలు తీసుకొచ్చింది. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి తన మనసులో ఉన్న వాటన్నిటి గురించి అతనితో మాట్లాడింది.  సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడు. వాటిలో సొలొమోను వివరించలేనిదంటూ ఏదీ లేదు.  షేబ దేశపు రాణి సొలొమోను తెలివిని,+ అతను కట్టించిన రాజభవనాన్ని,+  అతని బల్ల మీది ఆహారాన్ని,+ అతని అధికారులు బల్ల దగ్గర కూర్చోవడానికి చేసిన ఏర్పాట్లను, అతని సేవకులు ఆహారం వడ్డించే తీరును, వాళ్ల బట్టల్ని, గిన్నెలు అందించేవాళ్లను, వాళ్ల బట్టల్ని, యెహోవా మందిరంలో అతను క్రమంగా అర్పించే దహనబలుల్ని+ చూసినప్పుడు ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయింది.*  ఆమె రాజుతో ఇలా అంది: “నువ్వు సాధించినవాటి* గురించి, నీ తెలివి గురించి నేను నా దేశంలో విన్న విషయాలు నిజం.  అయితే నేను ఇక్కడికి వచ్చి కళ్లారా చూసేవరకు వాటిని నమ్మలేదు.+ నిజానికి, నీ గొప్ప తెలివితేటల గురించి సగం కూడా నాకు చెప్పబడలేదు.+ నేను విన్నదాని కన్నా నువ్వు చాలా గొప్పవాడివి.+  నీ మనుషులు ధన్యులు,* నీతో ఎప్పుడూ ఉంటూ తెలివిగల నీ మాటలు వినే నీ సేవకులు ధన్యులు!  నీ దేవుడైన యెహోవా స్తుతించబడాలి, నీ దేవుడైన యెహోవా నీ విషయంలో సంతోషించి నిన్ను తన ప్రతినిధిగా తన సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడు. నీ దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు+ కాబట్టి ఇశ్రాయేలు శాశ్వతంగా కొనసాగేలా నీతిన్యాయాలు జరిగించడానికి ఆయన నిన్ను దాని మీద రాజుగా నియమించాడు.”  ఆమె రాజుకు 120 తలాంతుల* బంగారం,+ పెద్ద మొత్తంలో సాంబ్రాణి తైలం, రత్నాలు ఇచ్చింది. షేబ దేశపు రాణి సొలొమోనుకు ఇచ్చినంత పెద్ద మొత్తంలో సాంబ్రాణి తైలం దేశంలోకి మళ్లీ ఎప్పుడూ రాలేదు.+ 10  అంతేకాదు, ఓఫీరు నుండి బంగారం తీసుకొచ్చిన హీరాము సేవకులు, సొలొమోను సేవకులు+ చందనపు మ్రానుల్ని, అమూల్యమైన రాళ్లను కూడా తీసుకొచ్చారు.+ 11  రాజు ఆ చందనపు మ్రానులతో యెహోవా మందిరం కోసం, రాజభవనం+ కోసం మెట్లను,+ గాయకుల కోసం వీణల్ని,* తంతివాద్యాల్ని+ చేయించాడు. అలాంటి చందనపు మ్రానులు యూదా దేశంలో అంతకుముందు ఎప్పుడూ కనబడలేదు. 12  సొలొమోను రాజు షేబ దేశపు రాణి కోరుకున్న, అడిగిన ప్రతీదీ ఇచ్చాడు. ఆమె రాజు కోసం తీసుకొచ్చిన వాటికన్నా ఎక్కువ* ఇచ్చాడు. తర్వాత ఆమె తన సేవకులతో తన దేశానికి తిరిగెళ్లింది.+ 13  ప్రతీ సంవత్సరం, సొలొమోను దగ్గరికి 666 తలాంతుల బంగారం వచ్చేది,+ 14  అదీకాక వ్యాపారస్థులు, వర్తకులు అతని దగ్గరికి వస్తువులు తెచ్చేవాళ్లు; అరబీయుల రాజులందరూ, దేశ అధిపతులందరూ సొలొమోను దగ్గరికి బంగారం, వెండి తీసుకొచ్చేవాళ్లు.+ 15  సొలొమోను రాజు మిశ్రిత బంగారంతో 200 పెద్ద డాళ్లను చేయించాడు+ (ఒక్కో డాలుకు 600 షెకెల్‌ల* మిశ్రిత బంగారం పట్టింది)+ 16  అలాగే మిశ్రిత బంగారంతో 300 చిన్న డాళ్లను* చేయించాడు (ఒక్కో చిన్న డాలుకు మూడు మినాల* బంగారం పట్టింది). రాజు వాటిని లెబానోను అడవి గృహంలో+ పెట్టించాడు. 17  రాజు ఒక గొప్ప దంతపు సింహాసనాన్ని కూడా చేయించి, దాన్ని స్వచ్ఛమైన బంగారు రేకుతో కప్పించాడు.+ 18  ఆ సింహాసనానికి ఆరు మెట్లు ఉన్నాయి, దానికి ఒక బంగారు పాదపీఠం జతచేయబడివుంది. సింహాసనానికి రెండువైపులా చేతులు పెట్టుకోవడానికి ఊతలున్నాయి. ఆ ఊతల పక్కన రెండు సింహాలు+ నిలబడి ఉన్నాయి. 19  ఆరు మెట్ల మీద ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి చొప్పున మొత్తం 12 సింహాలు+ ఉన్నాయి. వేరే ఏ రాజ్యంలో అలాంటిది తయారు చేయబడలేదు. 20  సొలొమోను రాజు తాగే పాత్రలన్నీ బంగారువి, లెబానోను అడవి గృహంలో ఉన్న పాత్రలన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేసినవి. వెండితో చేసినవేవీ లేవు, సొలొమోను రోజుల్లో వెండికి అసలు విలువే లేదు.+ 21  ఎందుకంటే, రాజు నౌకలు హీరాము సేవకులతోపాటు+ తర్షీషుకు+ వెళ్లేవి. మూడు సంవత్సరాలకు ఒకసారి తర్షీషు నౌకలు బంగారాన్ని, వెండిని, దంతాల్ని,+ కోతుల్ని, నెమళ్లను తీసుకొచ్చేవి. 22  ఆ విధంగా, సొలొమోను రాజు సిరిసంపదల్లో, తెలివిలో భూరాజులందర్నీ మించిపోయాడు.+ 23  సత్యదేవుడు సొలొమోనుకు తెలివి అనుగ్రహించాడు, అతని తెలివిగల మాటల్ని వినాలనే ఉద్దేశంతో భూరాజులందరూ అతన్ని చూడడానికి వచ్చేవాళ్లు.+ 24  వాళ్లలో ప్రతీ ఒక్కరు వెండి వస్తువులు, బంగారు వస్తువులు, బట్టలు,+ ఆయుధాలు, సాంబ్రాణి తైలం, గుర్రాలు, కంచర గాడిదలు కానుకగా తీసుకొచ్చేవాళ్లు; ఇలా ప్రతీ సంవత్సరం జరిగేది. 25  సొలొమోను గుర్రాల కోసం, రథాల కోసం 4,000 గుర్రపు శాలలు అలాగే 12,000 గుర్రాలు ఉండేవి,*+ అతను వాటిని రథాల నగరాల్లో, అలాగే యెరూషలేములో తన దగ్గర ఉంచుకున్నాడు.+ 26  నది* దగ్గర నుండి ఫిలిష్తీయుల దేశం వరకు, ఐగుప్తు సరిహద్దు వరకు ఉన్న రాజులందరి మీద సొలొమోను పరిపాలన చేశాడు.+ 27  రాజు, రాళ్లంత విస్తారంగా వెండిని, షెఫేలాలోని అత్తి చెట్లంత విస్తారంగా దేవదారు మ్రానుల్ని యెరూషలేములో ఉంచాడు.+ 28  ఐగుప్తు నుండి, ఇతర దేశాలన్నిటి నుండి సొలొమోను దగ్గరికి గుర్రాలు తెచ్చేవాళ్లు.+ 29  సొలొమోను మిగతా చరిత్ర+ మొదటి నుండి చివరి వరకు నాతాను+ ప్రవక్త రాసిన పుస్తకంలో, షిలోనీయుడైన అహీయా+ ప్రవచన పుస్తకంలో, దర్శనాలు చూసే ఇద్దో నెబాతు కుమారుడైన యరొబాము+ గురించి రాసిన దర్శనాల గ్రంథంలో+ రాయబడివుంది. 30  సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలు అంతటి మీద 40 సంవత్సరాలు పరిపాలించాడు. 31  తర్వాత సొలొమోను చనిపోయాడు.* అతన్ని తన తండ్రైన దావీదు నగరంలో+ పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు.+

అధస్సూచీలు

లేదా “పొడుపు కథలతో.”
లేదా “ఆమెకు ఊపిరి ఆగినంత పనైంది.”
లేదా “నీ మాటల.”
లేదా “సంతోషంగా ఉంటారు.”
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “వాటి విలువకు సమానమైన కానుకలు కూడా” అయ్యుంటుంది.
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “కేడెములను.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.
హీబ్రూ లేఖనాల్లో ఒక మినా 570 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “గుర్రపురౌతులు ఉండేవాళ్లు.”
అంటే, యూఫ్రటీసు.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”