కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

“ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాను” అని అపొస్తలుడైన పౌలు అన్న మాటలకు అర్థమేంటి?—గల. 2:19.

పౌలు ఇలా రాశాడు: “నేను ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాను, కానీ అలా చనిపోవడం వల్ల దేవుని విషయంలో బ్రతికాను.”—గల. 2:19.

రోమా ప్రాంతమైన గలతీయలో ఉన్న సంఘాలకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నప్పుడు, పౌలు ఆ లేఖనంలోని మాటల్ని రాశాడు. అక్కడున్న కొంతమంది క్రైస్తవుల మీద అబద్ధ బోధకుల ప్రభావం పడింది. ఆ బోధకులు, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే మోషే ధర్మశాస్త్రంలోని నియమాల్ని పాటించాలని, ముఖ్యంగా సున్నతి చేయించుకోవాలని బోధించేవాళ్లు. దేవుడు తన సేవకులను ఇక సున్నతి చేయించుకోమని కోరట్లేదని పౌలుకు తెలుసు. పౌలు ఒప్పించే విధంగా తర్కిస్తూ వాళ్ల బోధలు అబద్ధమని నిరూపించాడు. అలాగే యేసుక్రీస్తు విమోచనా క్రయధనం మీద సహోదరుల విశ్వాసాన్ని బలపర్చాడు.—గల. 2:4; 5:2.

ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతనికి ఏమీ తెలీదని, తన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోలేడని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (ప్రస. 9:5) “నేను ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాను” అని పౌలు అన్నప్పుడు, ఆయన మోషే ధర్మశాస్త్రం కింద ఇక లేడని దానర్థం. బదులుగా, విమోచనా క్రయధనం మీద తనకున్న విశ్వాసం వల్ల పౌలు ‘దేవుని విషయంలో బ్రతికాడు’ అని నమ్మాడు.

ధర్మశాస్త్రం వల్ల పౌలు పరిస్థితిలో మార్పు వచ్చింది. అదెలా? “ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కాదు గానీ, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్పు పొందుతాడని” ఆయన అంతకుముందే వివరించాడు. (గల. 2:16) నిజమే, ధర్మశాస్త్రం ఒక ముఖ్యమైన పనిని నెరవేర్చింది. పౌలు గలతీయులకు ఇలా వివరించాడు: “దేవుడు ఎవరి గురించైతే వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చేవరకు, మనుషుల పాపాల్ని వెల్లడిచేయడానికి ధర్మశాస్త్రం ఆ తర్వాత ఇవ్వబడింది.” (గల. 3:19) అపరిపూర్ణత, పాపం ఉన్న మనుషులు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేరని, చివరికి ఒక పరిపూర్ణ బలి అవసరమని ధర్మశాస్త్రం స్పష్టం చేసింది. కాబట్టి ధర్మశాస్త్రం ప్రజల్ని “ఆ సంతానం” వైపుకు అంటే క్రీస్తు వైపుకు నడిపించింది. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఒక వ్యక్తి దేవుని చేత నీతిమంతునిగా తీర్పు తీర్చబడతాడు. (గల. 3:24) పౌలు ధర్మశాస్త్రం వల్ల యేసును అంగీకరించి, ఆయన మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి నీతిమంతునిగా తీర్పు తీర్చబడ్డాడు. ఆ విధంగా పౌలు “ధర్మశాస్త్రం విషయంలో చనిపోయి,” ‘దేవుని విషయంలో బ్రతికాడు’. ఇక అప్పటినుండి పౌలు విషయంలో ధర్మశాస్త్రానికి ఏ అధికారం లేదు గానీ దేవునికే ఉంది.

అలాంటి విషయాన్నే రోమీయులకు రాసిన ఉత్తరంలో పౌలు రాశాడు. “కాబట్టి సహోదరులారా, మీరు క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయంలో చనిపోయారు . . . మనల్ని అడ్డుకున్న ధర్మశాస్త్రం విషయంలో మనం చనిపోయాం కాబట్టి ఇప్పుడు దాని నుండి విడుదల పొందాం.” (రోమా. 7:4, 6) ఈ లేఖనంలో అలాగే గలతీయులు 2:19 లో, పౌలు ధర్మశాస్త్రం చేత తీర్పుతీర్చబడి చనిపోవడం గురించి మాట్లాడట్లేదు. బదులుగా ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడం గురించి మాట్లాడుతున్నాడు. పౌలు అలాగే ఆయనలాంటి ఇతర క్రైస్తవుల మీద ధర్మశాస్త్రానికి ఇక ఏ అధికారం లేదు. వాళ్లు క్రీస్తు బలి మీద విశ్వాసం ఉంచడం వల్ల విడుదల పొందారు.