కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యాన్ని కొనుక్కోండి, దాన్ని ఎన్నడూ అమ్మకండి!

సత్యాన్ని కొనుక్కోండి, దాన్ని ఎన్నడూ అమ్మకండి!

“సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము.”సామె. 23:23

పాటలు: 94, 96

1, 2. (ఎ) మీ జీవితంలో అన్నిటికన్నా విలువైనది ఏంటి? (బి) మనం ఏ సత్యాల్ని విలువైనవిగా చూస్తాం? ఎందుకు? (ప్రారంభ చిత్రాలు చూడండి.)

మీ జీవితంలో అన్నిటికన్నా విలువైనది ఏంటి? యెహోవా ప్రజలముగా, ఆయనతో మనకున్న సంబంధమే అన్నిటికన్నా విలువైనది. మనం దాన్ని ఎన్నడూ అమ్ముకోం. బైబిలు సత్యాన్ని కూడా విలువైనదిగా చూస్తాం, ఎందుకంటే యెహోవాతో స్నేహం చేయడానికి అది మనకు సహాయం చేస్తుంది.—కొలొ. 1:9, 10.

2 మహోపదేశకుడైన యెహోవా, తన వాక్యమైన బైబిలు ద్వారా మనకు ఎన్నో విలువైన సత్యాలు నేర్పిస్తున్నాడు. తన పేరుకున్న అర్థం గురించి, తన అద్భుతమైన లక్షణాల గురించి మనకు చెప్తున్నాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, మనకోసం తన ప్రియ కుమారుని ప్రాణాల్ని ఇచ్చానని చెప్తున్నాడు. మెస్సీయ రాజ్యం గురించి కూడా యెహోవా మనకు బోధిస్తున్నాడు. అంతేకాదు అభిషిక్తులకు పరలోక నిరీక్షణ, ‘వేరే గొర్రెలకు’ భూనిరీక్షణ ఇస్తున్నాడు. (యోహా. 10:16) మనం ఎలా జీవించాలో కూడా ఆయన నేర్పిస్తున్నాడు. ఈ సత్యాలన్నీ మనకు విలువైనవి, ఎందుకంటే అవి మనల్ని సృష్టికర్తకు దగ్గర చేస్తాయి, మన జీవితానికి ఒక అర్థాన్నిస్తాయి.

3. సత్యం నేర్పిస్తున్నందుకు యెహోవా డబ్బులు అడుగుతాడా?

3 యెహోవా ఉదారతగల దేవుడు. ఆయనకు ఎంత ఉదార స్వభావం ఉందంటే, మనకోసం తన సొంత కుమారుణ్ణి బలిచ్చాడు. ఎవరైనా ఒకవ్యక్తి సత్యం కోసం వెదుకుతున్నట్లు యెహోవా చూస్తే, దాన్ని కనుగొనేలా ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు. సత్యం నేర్పిస్తున్నందుకు ఆయన ఎన్నడూ డబ్బులు అడగడు. ఒక సందర్భంలో సీమోను అనే వ్యక్తి, అపొస్తలుడైన పేతురుకు డబ్బులు ఇస్తూ, “నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్లు పవిత్రశక్తి పొందేలా, ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” అన్నాడు. కానీ పేతురు అతని ఆలోచనను సరిచేస్తూ ఇలా అన్నాడు, “నీ వెండి నీతోపాటు నాశనమైపోవాలి. ఎందుకంటే, దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమతిని నువ్వు డబ్బుతో కొనుక్కోగలనని అనుకున్నావు.” (అపొ. 8:18-20) మరి సత్యాన్ని కొనుక్కోవడం అంటే ఏంటి?

సత్యాన్ని కొనుక్కోవడం అంటే ఏంటి?

4. మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

4 సామెతలు 23:23 చదవండి. బైబిలు సత్యం నేర్చుకోవాలంటే కృషితోపాటు కొన్ని త్యాగాలు కూడా చేయాలి. అయితే సత్యాన్ని కొనుక్కున్న తర్వాత దాన్ని ఎన్నడూ అమ్మకూడదు. అంటే సత్యం నేర్చుకున్నాక, మనం దాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తపడాలి. ఇంతకీ బైబిలు సత్యాన్ని మనమెలా కొనుక్కోవచ్చు? దాని ఖరీదు ఎంత? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే, సత్యాన్ని ఇంకా విలువైనదిగా చూస్తాం, దాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుంటాం. అంతేకాదు, యెహోవా నేర్పించే సత్యమే అన్నిటికన్నా విలువైనదని అర్థంచేసుకుంటాం.

5, 6. (ఎ) డబ్బులు చెల్లించకుండా సత్యాన్ని ఎలా కొనుక్కోవచ్చు? వివరించండి. (బి) సత్యం నేర్చుకుంటే మనమెలాంటి ప్రయోజనాలు పొందుతాం?

5 ఒక వస్తువు ఉచితంగా వస్తుందంటే, దానికోసం మనం ఏమీ చేయాల్సిన అవసరంలేదని కాదు. సామెతలు 23:23⁠లో ‘కొనుక్కోవడం’ అని అనువదించబడిన హీబ్రూ పదానికి, ‘సంపాదించడం’ అనే అర్థం కూడా ఉంది. అంటే, ఒక విలువైన వస్తువు కోసం కృషి, త్యాగం చేయాల్సి ఉంటుందని ఆ రెండు పదాల్నిబట్టి అర్థమౌతుంది. అయితే, సత్యాన్ని ఎలా కొనుక్కోవచ్చో అర్థంచేసుకోవడానికి ఈ ఉదాహరణ పరిశీలించండి. మార్కెట్లో అరటిపండ్లు ఉచితంగా ఇస్తున్నారనుకుందాం. ఆ అరటిపండ్లు మన టేబుల్‌ మీదకు వాటంతటవే వచ్చేస్తాయా? లేదు. మనం మార్కెట్‌కు వెళ్లాలి, వాటిని ఇంటికి తెచ్చుకోవాలి. నిజానికి ఆ అరటిపండ్లు ఉచితంగా వస్తున్నా, వాటిని తెచ్చుకోవడానికి మన వంతు కృషి చేయాలి. అదేవిధంగా, మనం సత్యం కొనుక్కోవడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకపోయినా దాన్ని నేర్చుకోవడానికి కృషి, త్యాగం అవసరం.

6 యెషయా 55:1-3 చదవండి. సత్యాన్ని కొనుక్కోవడం అంటే ఏంటో అర్థంచేసుకోవడానికి ఈ వచనాల్లో యెహోవా చెప్పిన మాటలు సహాయం చేస్తాయి. బైబిలు సత్యాన్ని యెహోవా నీళ్లతో, పాలతో, ద్రాక్షారసంతో పోల్చాడు. చల్లని నీళ్లు దాహంతో ఉన్న వ్యక్తికి సేదదీర్పును ఇచ్చినట్లే, సత్యం కూడా మనకు సేదదీర్పునిస్తుంది. పాలు ఒక పిల్లవాడి ఎదుగుదలకు సహాయం చేసినట్లే, యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి బైబిలు సత్యం సహాయం చేస్తుంది. యెహోవా తన వాక్యంలో ఉన్న సత్యాన్ని ద్రాక్షారసంతో కూడా పోల్చాడు. ఎందుకు? ద్రాక్షారసం మనిషి హృదయాన్ని సంతోషపెడుతుందని బైబిలు చెప్తుంది. (కీర్త. 104:15) కాబట్టి ద్రాక్షారసాన్ని కొనుక్కోండి అన్నప్పుడు, తన నిర్దేశాన్ని పాటిస్తే మనం సంతోషంగా ఉంటామని యెహోవా చెప్తున్నాడు. (కీర్త. 19:8) సత్యం నేర్చుకుని, దాన్ని పాటిస్తే మనమెలాంటి ప్రయోజనాలు పొందుతామో చెప్పడానికి యెహోవా ఆ పోలికల్ని వాడాడు. అయితే, సత్యాన్ని కొనుక్కోవడానికి త్యాగం చేయాల్సి వచ్చే ఐదు విషయాల్ని ఇప్పుడు చర్చిద్దాం.

సత్యాన్ని కొనుక్కోవడానికి మీరు దేన్ని త్యాగం చేశారు?

7, 8. (ఎ) సత్యం నేర్చుకోవడానికి సమయాన్ని ఎందుకు త్యాగం చేయాల్సి ఉంటుంది? (బి) మేరీ సత్యం నేర్చుకోవడానికి దేన్ని త్యాగం చేసింది? ఫలితం ఏంటి?

7 సమయం. ఒకవ్యక్తి రాజ్య సందేశాన్ని వినడానికి; బైబిల్ని, బైబిలు ప్రచురణల్ని చదవడానికి; యెహోవాసాక్షుల దగ్గర స్టడీ తీసుకోవడానికి; మీటింగ్స్‌కు సిద్ధపడడానికి, హాజరవ్వడానికి సమయం కావాలి. వీటికోసం, అంతగా ప్రాముఖ్యంకాని పనులకు పెట్టే సమయాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. (ఎఫెసీయులు 5:15-16, అధస్సూచి చదవండి.) ప్రాథమిక బైబిలు సత్యాలు నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అది ఒక్కో వ్యక్తిని బట్టి మారుతుంది. కానీ యెహోవా తెలివి గురించి, ఆయన మార్గాల గురించి, ఆయన పనుల గురించి మనం ఎప్పటికీ తెలుసుకుంటూనే ఉండాలి. (రోమా. 11:33) మొట్టమొదటి వాచ్‌ టవర్‌ సంచిక బైబిలు సత్యాన్ని ఒక చిన్న పువ్వుతో పోల్చింది. ఆ పత్రిక ఇలా చెప్పింది, “కేవలం ఒకే పువ్వుతో తృప్తిపడకండి. అది ఒక్కటే సరిపోయేలాగైతే ఇన్ని సృష్టించబడి ఉండేవి కావు. సమకూర్చుకుంటూనే ఉండండి, వెదుకుతూనే ఉండండి.” కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘యెహోవా గురించి నేను ఎంత తెలుసుకున్నాను?’ మనం శాశ్వతకాలం జీవించినా యెహోవా గురించి తెలుసుకోవడానికి ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. అయినప్పటికీ, వీలైనంత ఎక్కువగా ఆయన గురించి తెలుసుకోవడానికి మనకున్న సమయాన్ని ఉపయోగించాలి. అలా చేసిన ఒక సహోదరి గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

8 మేరీ * ఉదాహరణ పరిశీలించండి. ఆమె చదువు నిమిత్తం జపాన్‌ నుండి న్యూయార్క్‌ వచ్చింది. ఒక పయినీరు సహోదరి ఇంటింటి పరిచర్యలో ఆమెను కలిసింది. మేరీకి అప్పటికే వేరే మత నమ్మకాలు ఉన్నా, మన సహోదరి దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకుంది. నేర్చుకుంటున్న విషయాలు ఆమెకు ఎంత నచ్చాయంటే, వారానికి రెండుసార్లు బైబిలు స్టడీ కావాలని అడిగింది. మేరీ తన చదువుతో, పార్ట్‌టైమ్‌ ఉద్యోగంతో చాలా బిజీగా ఉన్నా వెంటనే మీటింగ్స్‌కు హాజరవడం మొదలుపెట్టింది. ఆమె సత్యం నేర్చుకోవడానికి సరదాగా గడిపే సమయాన్ని కూడా త్యాగం చేసింది. ఈ త్యాగాల వల్ల ఆమె యెహోవాకు చాలా దగ్గరైంది, సంవత్సరం లోపే బాప్తిస్మం తీసుకుంది. ఆరు నెలల తర్వాత, 2006⁠లో ఆమె పయినీరు సేవ మొదలుపెట్టింది, ఇప్పటికీ ఆ సేవలో కొనసాగుతోంది.

9, 10. (ఎ) సత్యం నేర్చుకుంటే, వస్తుసంపదల పట్ల మనకున్న అభిప్రాయం ఎలా మారుతుంది? (బి) మనీషా దేన్ని త్యాగం చేసింది? దానిగురించి ఆమె ఎలా భావిస్తుంది?

9 వస్తుసంపదలు. సత్యం నేర్చుకోవడానికి, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా మనం త్యాగం చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు పేతురు, అంద్రెయ చేపల వ్యాపారం చేసేవాళ్లు. కానీ యేసు శిష్యులు అవ్వడానికి వాళ్లు దాన్ని విడిచిపెట్టారు. (మత్త. 4:18-20) అంటే, సత్యం నేర్చుకున్నాక మనం కూడా ఉద్యోగాన్ని వదిలేయాలని కాదు. ఒకవ్యక్తి తన కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం చేయాలి. (1 తిమో. 5:8) అయితే మనం సత్యం నేర్చుకున్నప్పుడు, వస్తుసంపదల పట్ల మనకున్న అభిప్రాయం మారుతుంది. జీవితంలో ఏది ప్రాముఖ్యమో గ్రహించగలుగుతాం. యేసు ఇలా చెప్పాడు, “భూమ్మీద నీ కోసం సంపదలు కూడబెట్టుకోవడం ఆపు. . . . దానికి బదులు, పరలోకంలో నీ కోసం సంపదలు కూడబెట్టుకో.” (మత్త. 6:19, 20) మనీషా అనే అమ్మాయి అదే చేసింది.

10 మనీషాకి చిన్నప్పటి నుండి గోల్ఫ్‌ ఆడడమంటే ఇష్టం. ఆమె హైస్కూల్‌కి వచ్చేసరికి ఆ క్రీడలో ఎంత ప్రావీణ్యం సాధించిందంటే, యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌ కూడా వచ్చింది. ఆ క్రీడలో రాణించి బాగా డబ్బు సంపాదించాలనేది మనీషా లక్ష్యం. కొంతకాలానికి ఆమె యెహోవాసాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంది. నేర్చుకున్న విషయాలు ఆమెకు బాగా నచ్చి, వాటిని పాటించడం మొదలుపెట్టింది. ఆమె ఇలా చెప్తుంది, “బైబిలు సూత్రాలకు తగ్గట్లుగా నా ఆలోచనల్ని, జీవన విధానాన్ని మార్చుకునేకొద్దీ ఎక్కువ సంతోషాన్ని అనుభవించాను.” ఒకే సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై, గోల్ఫ్‌ క్రీడపై మనసుపెట్టడం కష్టమని మనీషా గుర్తించింది. (మత్త. 6:24) దాంతో గోల్ఫ్‌ క్రీడాకారిణి అవ్వాలనే తన లక్ష్యాన్ని విడిచిపెట్టింది. ‘ఇప్పుడు పయినీరు సేవచేస్తూ చాలా సంతోషంగా ఉన్నాను, శ్రేష్ఠమైన జీవితం గడుపుతున్నాను’ అని ఆమె చెప్తుంది.

11. సత్యం నేర్చుకున్నప్పుడు ఇతరులతో మనకున్న సంబంధాలు ఎలా మారవచ్చు?

11 ఇతరులతో మనకున్న సంబంధాలు. బైబిలు సత్యాన్ని పాటించడం మొదలుపెట్టినప్పుడు స్నేహితులతో, బంధువులతో మనకున్న సంబంధాలు మారవచ్చు. ఎందుకంటే, యేసు తన అనుచరుల కోసం ఇలా ప్రార్థించాడు, “సత్యంతో వీళ్లను పవిత్రపర్చు, నీ వాక్యమే సత్యం.” (యోహా. 17:17, అధస్సూచి) “పవిత్రపర్చు” అనే మాటకు “వేరుగా ఉంచు” అనే అర్థం కూడా ఉంది. సత్యాన్ని పాటించడం మొదలుపెట్టినప్పుడు, మనం బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తాం కాబట్టి లోకానికి “వేరుగా” ఉంటాం. అందుకే మన స్నేహితులతో, బంధువులతో ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, వాళ్లు మనల్ని అంతకుముందులా ఇష్టపడకపోవచ్చు, మన నమ్మకాల్ని వ్యతిరేకించవచ్చు. దానికి మనం ఆశ్చర్యపోం. ఎందుకంటే యేసు ఇలా అన్నాడు, “నిజానికి, ఒక మనిషి ఇంటివాళ్లే అతనికి శత్రువులు అవుతారు.” (మత్త. 10:36) కానీ సత్యం కోసం ఎన్ని త్యాగాలు చేసినా, వాటికి మించిన దీవెనలు పొందుతామని యేసు మాటిచ్చాడు!—మార్కు 10:28-30 చదవండి.

12. ఒక యూదుడు సత్యం కోసం దేన్ని త్యాగం చేశాడు?

12 ఆండ్రూ అనే ఒక యూదుడు, దేవుని పేరును ఉచ్చరించడం తప్పని చిన్నప్పటినుండి నేర్చుకున్నాడు. కానీ దేవుని గురించిన సత్యం నేర్చుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. ఒకరోజు ఆయన్ని ఓ యెహోవాసాక్షి కలిశాడు. హీబ్రూలో నాలుగు హల్లులు ఉన్న దేవుని పేరుకు అచ్చులు చేరిస్తే, ఆ పేరును “జెహోవా” లేదా యెహోవా అని ఉచ్చరించవచ్చని చెప్పాడు. అది విని ఆండ్రూ చాలా ఆనందించాడు, వెంటనే దానిగురించి రబ్బీలకు చెప్పాలని సభామందిరానికి వెళ్లాడు! వాళ్లు దేవుని పేరుకు సంబంధించిన ఆ సత్యాన్ని తెలుసుకొని సంతోషిస్తారని అనుకున్నాడు. కానీ వాళ్లు సంతోషించకపోగా ఆండ్రూ మీద ఉమ్మేసి, సభామందిరం నుండి గెంటేశారు. కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని వ్యతిరేకించారు. అయినాసరే, ఆండ్రూ యెహోవా గురించి తెలుసుకోవడం మాత్రం ఆపలేదు. ఆయన ఒక యెహోవాసాక్షి అయ్యి, చనిపోయేవరకు నమ్మకంగా సేవచేశాడు. మనం కూడా సత్యం నేర్చుకున్నప్పుడు ఇతరులతో ఉన్న సంబంధాలు మారే అవకాశం ఉంది.

13, 14. సత్యం నేర్చుకున్నప్పుడు మన ఆలోచనల్లో, పనుల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఒక అనుభవం చెప్పండి.

13 అపవిత్ర ఆలోచనలు, పనులు. సత్యం నేర్చుకుని, బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడం మొదలుపెట్టినప్పుడు మన ఆలోచనల్ని, పనుల్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు, “మీరు దేవుని గురించి తెలియని రోజుల్లో మీ కోరికల ప్రకారం నడుచుకున్నారు. ఇప్పుడు మీరు లోబడే పిల్లలుగా ఉన్నారు కాబట్టి అలా నడుచుకోకండి. . . . మీ ప్రవర్తనంతటిలో పవిత్రులు అవ్వండి.” (1 పేతు. 1:14, 15) ప్రాచీన కొరింథు నగరంలో చాలామంది అనైతికంగా జీవించారు. వాళ్లు యెహోవా దృష్టిలో పవిత్రులు అవ్వడానికి పెద్దపెద్ద మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. (1 కొరిం. 6:9-11) నేడు కూడా, సత్యం నేర్చుకుంటున్న చాలామంది అలాంటి మార్పులు చేసుకుంటున్నారు. పేతురు దానిగురించి ఇలా రాశాడు, “గతంలో మీరు లెక్కలేనట్టు ప్రవర్తిస్తూ, అదుపులేని వాంఛలకు లోనౌతూ, మితిమీరి తాగుతూ, విచ్చలవిడి విందులు చేసుకుంటూ, తాగుబోతుల విందుల్లో పాల్గొంటూ, అసహ్యకరమైన విగ్రహపూజలు చేస్తూ లోక ప్రజల ఇష్టప్రకారం జీవించారు. అవన్నీ చేయడానికి గతంలో మీరు వెచ్చించిన సమయం చాలు.”—1 పేతు. 4:3.

14 డేవిడ్‌, జెస్లిన్‌ అనే జంట చాలా సంవత్సరాలు తాగుబోతులుగా ఉన్నారు. డేవిడ్‌ నైపుణ్యంగల అకౌంటెంట్‌ అయినప్పటికీ, తాగుడు వల్ల ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా ఉండలేకపోయాడు. జెస్లిన్‌ చాలా కోపిష్ఠి, క్రూరంగా ప్రవర్తించేది. ఒకరోజు ఆమె తాగి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, మిషనరీ దంపతులు ఆమెను కలిసి, బైబిలు స్టడీ గురించి చెప్పారు. కానీ తర్వాతి వారం ఆ మిషనరీలు జెస్లిన్‌ ఇంటికి వెళ్లేసరికి ఆమె, డేవిడ్‌ తాగివున్నారు. ఆ మిషనరీలు వస్తారని జెస్లిన్‌ ఊహించలేదు. ఆ మిషనరీలు ఇంకోసారి వెళ్లేసరికి, అంతా మారిపోయింది. డేవిడ్‌, జెస్లిన్‌లు బైబిలు సత్యం నేర్చుకోవాలనే కుతూహలంతో ఉన్నారు. వాళ్లు నేర్చుకున్న విషయాల్ని వెంటనే పాటించడం మొదలుపెట్టారు. మూడు నెలలు గడవకముందే, వాళ్లు తాగుడు మానేశారు, చట్టప్రకారం వివాహం చేసుకున్నారు. డేవిడ్‌, జెస్లిన్‌ మార్పులు చేసుకోవడం చూసి, ఆ ఊరిలో చాలామంది బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టారు.

15. సత్యం నేర్చుకున్నప్పుడు వేటిని వదిలేయడం కష్టంగా ఉండవచ్చు? ఎందుకు?

15 దేవునికి ఇష్టంలేని ఆచారాలు, పద్ధతులు. సత్యం నేర్చుకున్నప్పుడు యెహోవాకు ఇష్టంలేని ఆచారాల్ని, పద్ధతుల్ని వదిలేయడం చాలామందికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు ఏమనుకుంటారో అని వాళ్లు భయపడతారు. అంతేకాదు, చనిపోయిన తమవాళ్లను గౌరవించడం వంటి కొన్ని ఆచారాల విషయంలో ప్రజలకు బలమైన అభిప్రాయాలు ఉంటాయని వాళ్లకు తెలుసు. (ద్వితీ. 14:1) అయితే, దేవునికి ఇష్టంలేని ఆచారాల్ని వదిలేయడానికి మనకేది సహాయం చేస్తుంది? సత్యం నేర్చుకున్నప్పుడు మార్పులు చేసుకున్న ప్రాచీనకాల నమ్మకమైన సేవకుల నుండి, ముఖ్యంగా ఎఫెసులోని తొలి క్రైస్తవుల నుండి మనమెంతో నేర్చుకోవచ్చు.

16. ప్రాచీన ఎఫెసులోని కొంతమంది క్రైస్తవులు వేటిని త్యాగం చేశారు?

16 ప్రాచీన ఎఫెసు నగరంలో ప్రజలు ఎక్కువగా మంత్రతంత్రాలు చేసేవాళ్లు. అయితే, అలాంటివాళ్లు క్రైస్తవులుగా మారినప్పుడు ఏం చేశారు? బైబిలు ఇలా చెప్తుంది, “మంత్రతంత్రాలు చేసేవాళ్లలో చాలామంది తమ పుస్తకాల్ని ఒకచోటికి తీసుకొచ్చి అందరిముందు వాటిని కాల్చేశారు. వాటి ఖరీదు లెక్కేసినప్పుడు, అది 50,000 వెండి నాణేలు అని తేలింది. అలా యెహోవా వాక్యం ఎంతో గొప్ప రీతిలో వ్యాప్తిచెందుతూ, జయిస్తూ వచ్చింది.” (అపొ. 19:19, 20) ఆ నమ్మకమైన క్రైస్తవులు తమ దగ్గరున్న ఖరీదైన పుస్తకాల్ని కాల్చడానికి ముందుకొచ్చారు, ఫలితంగా యెహోవా వాళ్లను దీవించాడు.

17. (ఎ) సత్యం కోసం మనం వేటిని త్యాగం చేశాం? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

17 సత్యం నేర్చుకోవడానికి మీరు వేటిని త్యాగం చేశారు? మనందరం మన సమయాన్ని త్యాగం చేశాం. మనలో కొంతమందిమి ధనవంతులయ్యే అవకాశాల్ని వదులుకున్నాం. అంతేకాదు బంధువులతో, స్నేహితులతో మనకున్న సంబంధాలు మారి ఉండవచ్చు. చాలామందిమి మన ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పులు చేసుకున్నాం. యెహోవాకు ఇష్టంలేని ఆచారాల్ని, పద్ధతుల్ని వదిలేశాం. కానీ, మనం చేసిన ఏ త్యాగం కన్నా బైబిలు సత్యమే విలువైనదని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే, దానివల్లే మనం యెహోవాతో దగ్గరి సంబంధం కలిగివున్నాం. సత్యం నేర్చుకోవడం వల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి ఆలోచించినప్పుడు, దాన్ని ‘అమ్మాలనే’ ఆలోచన అస్సలు రాదు. ఇంతకీ వేటివల్ల సత్యాన్ని అమ్మేసే అవకాశం ఉంది? కానీ అంత పెద్ద తప్పు చేయకుండా మనమెలా జాగ్రత్తపడవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం.

^ పేరా 8 అసలు పేర్లు కావు.