చనిపోయినవాళ్లను మళ్లీ ఎప్పటికైనా చూస్తామా?
మరణంవల్ల మనందరం బాధపడతాం. కానీ చనిపోతే ఇక అంతా అయిపోయినట్లేనా? చనిపోయినవాళ్లను దేవుడు పూర్తిగా మర్చిపోయాడా? వాళ్లను మళ్లీ ఎప్పటికైనా చూస్తామా?
బైబిలు ఇలా చెప్తుంది:
చనిపోయినవాళ్లను దేవుడు మర్చిపోడు
“సమాధుల్లో ఉన్న వాళ్లందరూ . . . బయటికి వస్తారు.” —యోహాను 5:28, 29.
చనిపోయినవాళ్లను దేవుడు గుర్తు చేసుకుంటాడు; ఆయన జ్ఞాపకంలో ఉన్నవాళ్లు మళ్లీ బ్రతుకుతారు.
చనిపోయినవాళ్లు మళ్లీ భూమ్మీద బ్రతుకుతారు
“నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు పునరుత్థానం చేస్తాడు.” —అపొస్తలుల కార్యాలు 24:15.
కోట్లాదిమంది మళ్లీ బ్రతికి, శాంతిసమాధానాల మధ్య ఎప్పటికీ జీవించే అవకాశం పొందుతారు.
పునరుత్థానం జరుగుతుందని ఖచ్చితంగా నమ్మవచ్చు
“నక్షత్రాల సంఖ్యను [దేవుడు] లెక్కపెడుతున్నాడు; వాటన్నిటినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు.”—కీర్తన 147:4, NW.
దేవుడు నక్షత్రాలన్నిటినీ పేరు పెట్టి పిలుస్తున్నాడంటే, పునరుత్థానం చేయాలనుకునే వాళ్లను కూడా తేలిగ్గా గుర్తుపెట్టుకోగలడు.