కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ లోకం ఎటు వెళ్తోంది?

ఈ లోకం ఎటు వెళ్తోంది?

ఈ లోకం ఎటు వెళ్తోంది?

నేటి నైతిక పతనం గురించి బైబిలు ఎంతోకాలం ముందే తెలియజేస్తూ దాన్నిలా వర్ణించింది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు . . . తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు . . . క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.”​—2 తిమోతి 3:​1-5.

ఆ బైబిలు ప్రవచనం నేటి లోకాన్ని సరిగ్గా వర్ణిస్తుందని మీరు ఒప్పుకోవచ్చు. అయితే ఇది దాదాపు 2000 సంవత్సరాల క్రితమే వ్రాయబడింది! ఆ ప్రవచనం “అంత్యదినములలో” అనే పదంతో మొదలవుతుంది. “అంత్యదినములు” అనే ఈ పదానికి అర్థమేమిటి?

దేనికి “అంత్యదినములు”?

“అంత్యదినములు” అనే పదం సాధారణ వాడుకలోకి వచ్చింది. కేవలం ఇంగ్లీషు భాషలోనే అది కొన్ని వందల పుస్తకాల పేర్లలో భాగంగా ఉపయోగించబడింది. ఉదాహరణకు ఇటీవల విడుదలైన ద లాస్ట్‌ డేస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌​—అమెరికా ఎట్‌ వార్‌, 1917-1918 అనే పుస్తకాన్ని గమనించండి. ఆ పుస్తకంలో “అంత్యదినములు” అనే పదాన్ని ఉపయోగించినప్పుడల్లా, అది నైతిక విలువలు ఎంతో దిగజారిపోయిన నిర్దిష్ట కాలాన్ని సూచిస్తూ ఉపయోగించబడిందని దాని ముందుమాట స్పష్టం చేస్తోంది.

దాని ముందుమాట ఇలా వివరిస్తోంది: “అమెరికా 1914 నుండి చరిత్రలో ముందెప్పుడూ లేనంత వేగంగా మారిపోవడం ప్రారంభించింది.” నిజంగానే లోకమంతా 1914లో మునుపెన్నడూ లేనంతగా యుద్ధంలో మునిగిపోయింది. ఆ పుస్తకం ఇంకా ఇలా చెబుతోంది: “అది సంపూర్ణ యుద్ధం, అది సైన్యాలకు మధ్య జరిగిన యుద్ధం కాదుగానీ దేశాలకు మధ్య జరిగిన యుద్ధం.” ఆ యుద్ధం, బైబిల్లో “అంత్యదినములు” అని పిలవబడిన కాలం ప్రారంభంలో జరిగింది, ఆ విషయాన్ని మనమిప్పుడు పరిశీలిస్తాం.

ఈ లోకం అంతమయ్యే ముందు “అంత్యదినములు” అని పిలవబడే నిర్దిష్ట కాలం వస్తుందని బైబిలు బోధిస్తోంది. నిజానికి ఒకప్పుడున్న లోకం గతించిపోయిందని లేదా నాశనమైపోయిందని చెబుతూ, దాని గురించి బైబిలు ఇలా వివరిస్తోంది: “నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.” అది ఏ కాలం, అప్పుడు ఏ లోకం నాశనమయ్యింది? అది నోవహు అనే ఒక వ్యక్తి జీవించిన కాలంలో ఉన్న “భక్తిహీనుల” ప్రాచీన లోకం. అదే విధంగా నేడున్న లోకం కూడా నాశనమౌతుంది. అయితే, నోవహు, ఆయన కుటుంబం రక్షించబడినట్లే దేవుణ్ణి సేవించేవారు కూడా లోకాంతాన్ని తప్పించుకుంటారు.​—2 పేతురు 2:5; 3:6; ఆదికాండము 7:​21-24; 1 యోహాను 2:​17.

అంతం గురించి యేసు ఏమి చెప్పాడు?

యేసుక్రీస్తు కూడా “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొని” పోయిన “నోవహు దినముల” గురించి మాట్లాడాడు. జలప్రళయానికి ముందున్న పరిస్థితులను, అంటే అప్పటి లోకం అంతం కావడానికి కాస్త ముందున్న పరిస్థితులను, ఆయన “యుగసమాప్తి” అని తాను గుర్తించిన కాలంలో ఉండే పరిస్థితులతో పోల్చాడు. (మత్తయి 24:​3, 37-39) ఇతర బైబిలు అనువాదాలు “యుగం అంతమవడం” “లోకాంతము” అనే పదాలను ఉపయోగిస్తున్నాయి.​—ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌, పరిశుద్ధ గ్రంథము​—క్యాతలిక్‌ అనువాదము.

ఈ లోకం నాశనం కావడానికి ముందు భూమ్మీద జీవితం ఎలా ఉంటుందో యేసు ముందే తెలియజేశాడు. యుద్ధాల గురించి ఆయనిలా చెప్పాడు: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.” అది 1914 మొదలుకొని నెరవేరిందని చరిత్రకారులు పేర్కొన్నారు. అందుకే, పైన పేర్కొనబడిన పుస్తకపు ముందుమాట, 1914 ‘సంపూర్ణ యుద్ధం . . . సైన్యాలకు మధ్య యుద్ధం కాదుగానీ దేశాలకు మధ్య యుద్ధం’ ప్రారంభమవడాన్ని సూచిస్తుందని తెలియజేసింది.

యేసు తన ప్రవచనంలో ఇంకా ఇలా చెప్పాడు: “అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును. ఇవన్నియు వేదనలకు ప్రారంభము.” వాటన్నిటితోపాటు ‘అక్రమము విస్తరిస్తుందని’ కూడా ఆయన చెప్పాడు. (మత్తయి 24:​7-14) అది మన కాలంలో జరగడం మనం కళ్లారా చూస్తున్నాం. నేడు నైతిక పతనం ఎంత తీవ్రంగా ఉందంటే అది బైబిలు ప్రవచనాన్ని నెరవేరుస్తోంది!

ఇలాంటి అనైతిక కాలంలో మన జీవితాలు ఎలా ఉండాలి? నైతిక పతనం గురించి అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులకు ఏమి వ్రాశాడో గమనించండి. ఆయన ప్రజల్లో ఉన్న “తుచ్ఛమైన అభిలాషల” గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు: “స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి.”​—రోమీయులు 1:​26, 27.

మొదటి శతాబ్దంలో మానవ సమాజం నైతికంగా అంతకంతకూ పడిపోతుండగా, “చిన్నచిన్న క్రైస్తవ సమాజాలు తమ దైవభక్తితో, మంచి ప్రవర్తనతో, లైంగిక సుఖాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే అన్య లోకానికి ఇబ్బందికరంగా తయారయ్యాయి” అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది మనం కాస్తాగి, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకునేలా చేయాలి: ‘ఈ విషయంలో నేనెలా ఉన్నాను, నేను సహవాసులుగా ఎంచుకున్నవారు ఎలా ఉన్నారు? మేము అనైతికంగా ప్రవర్తించేవారికి భిన్నంగా ఉన్నామా, నైతికంగా పవిత్రంగా ఉంటున్నామా?’​—1 పేతురు 4:​3, 4.

మన పోరాటం

మన చుట్టూ అనైతికత ఉన్నా, మనం “మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారుల” వలె ఉండాలని బైబిలు మనకు బోధిస్తోంది. అలా చేయడానికి, మనం ‘జీవవాక్యమును గట్టిగా చేత పట్టుకోవాలి.’ (ఫిలిప్పీయులు 2:​14-16) ఆ బైబిలు వచనం, క్రైస్తవులు నైతిక భ్రష్టత్వంతో కలుషితం కాకుండా ఎలా ఉండవచ్చనేదానికి కీలకాన్ని తెలియజేస్తుంది. ఆ కీలకమేమిటంటే, వారు దేవుని వాక్యంలోని బోధలను అనుసరించాలి, దానిలోని నైతిక ప్రమాణాలు శ్రేష్ఠమైన జీవితానికి పునాది అని గుర్తించాలి.

“ఈ యుగ సంబంధమైన దేవత” అయిన అపవాదియగు సాతాను ప్రజలను తనవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. (2 కొరింథీయులు 4:4) అతడు “వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు” అని బైబిలు చెబుతోంది. అతడిలాగే ప్రవర్తించడం ద్వారా అతణ్ణి సేవించే అతడి సేవకులు కూడా అలాగే చేస్తారు. (2 కొరింథీయులు 11:​14, 15) వారు స్వేచ్ఛను, వినోదాన్ని వాగ్దానం చేస్తారు కానీ, బైబిలు చెబుతున్నట్లుగా, ‘వారే భ్రష్టత్వమునకు దాసులైయున్నారు.’​—2 పేతురు 2:​19.

ఈ విషయంలో మీరు మోసపోకండి. దేవుని నైతిక ప్రమాణాలను నిర్లక్ష్యం చేసేవారు తీవ్రమైన పర్యవసానాల్ని ఎదుర్కొంటారు. బైబిలు కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “భక్తిహీనులు [దేవుని] కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.” (కీర్తన 119:​155; సామెతలు 5:​22, 23) ఆ విషయాన్ని మనం నమ్ముతున్నామా? అలాగైతే, అనైతిక విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే వాటినుండి మన మనసులను, హృదయాలను కాపాడుకుందాం.

చాలామంది మూర్ఖంగా ఇలా తర్కిస్తారు, ‘నేను చేస్తున్నది చట్టవిరుద్ధమైనది కానప్పుడు, అందులో తప్పేమీ లేదు.’ కానీ అది సరి కాదు. మన పరలోక తండ్రి మీ జీవితాన్ని నిస్తేజపరిచేందుకు, కట్టుదిట్టం చేసేందుకు కాదుగానీ మిమ్మల్ని కాపాడేందుకు ప్రేమపూర్వకంగా నైతిక నిర్దేశాన్నిస్తున్నాడు. ఆయన మీకు ‘ప్రయోజనము కలుగునట్లు ఉపదేశము చేస్తున్నాడు.’ మీరు ఆపదలో చిక్కుకోకూడదనీ, జీవితాన్ని సంతోషంగా గడపాలనీ ఆయన కోరుకుంటున్నాడు. నిజానికి, బైబిలు బోధిస్తున్నట్లుగా, దేవుణ్ణి సేవించడం “యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో” కూడినది. అదే “వాస్తవమైన జీవము” అంటే ఆయన వాగ్దానం చేసిన నూతనలోకంలో నిత్యజీవం.​—యెషయా 48:​17, 18; 1 తిమోతి 4:8; 6:​18, 19.

కాబట్టి, బైబిలు బోధలను అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాలను, వాటిని అనుసరించని వారికి చివరకు మిగిలే గుండెకోతతో పోల్చి చూడండి. దేవుడు చెప్పేది వినడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందగలగడం, నిజంగా అత్యంత శ్రేష్ఠమైన జీవన విధానం! “నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును; వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును” అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.​—సామెతలు 1:​33.

నైతికంగా ఉన్నతమైన సమాజం

ఈ లోకం గతించిపోయినప్పుడు ‘భక్తిహీనులు ఇక ఉండరు’ అని బైబిలు చెబుతోంది. “యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపములేనివారు దానిలో నిలిచియుందురు” అని కూడా అది చెబుతోంది. (కీర్తన 37:​10, 11; సామెతలు 2:​20-22) అప్పుడు ఈ భూమ్మీద సమస్త అనైతికత తీసివేయబడుతుంది, అంతేకాక సృష్టికర్త యొక్క ప్రయోజనకరమైన బోధలకు కట్టుబడి ఉండడానికి నిరాకరించేవారు కూడా నాశనం చేయబడతారు. దేవుణ్ణి ప్రేమించేవారు భూమంతటినీ క్రమేణా పరదైసుగా మారుస్తారు, అంటే ఆయన మొదటి మానవ జంటను ఉంచిన తోటలా చేస్తారు.​—ఆదికాండము 2:​7-9.

అందమైన పరదైసులా ఉండే శుభ్రపర్చబడిన భూమిపై జీవించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి! మృతులలో నుండి పునరుత్థానం చేయబడే కోట్లాదిమంది కూడా దానిలో నివసించే ఆధిక్యత పొందుతారు. దేవుడు చేసిన ఈ వాగ్దానాలనుబట్టి ఆనందించండి, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.” “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”​—కీర్తన 37:​29; ప్రకటన 21:​3, 4. (g 4/07)

[9వ పేజీలోని బ్లర్బ్‌]

ప్రాచీన లోకం నాశనమైనప్పుడు, దైవభక్తిగల ప్రజలు రక్షించబడ్డారు

[10వ పేజీలోని చిత్రం]

ఈ లోకం గతించిపోయాక, భూమి పరదైసుగా మారుతుంది