కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులు నేటి మానవ సమాజము

క్రైస్తవులు నేటి మానవ సమాజము

క్రైస్తవులు నేటి మానవ సమాజము

“మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.—మత్తయి 24:9.

లోకమునుండి వేరైయుండుట తొలిక్రైస్తవులకు ఒక ప్రత్యేక గుర్తుగా ఉండెను. క్రీస్తు తన పరలోకపు తండ్రియైన యెహోవాకు ప్రార్థనచేస్తూ, ఆయన శిష్యులను గూర్చి ఇలా చెప్పెను: “వారికి నీ వాక్యమిచ్చియున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును.” (యోహాను 17:14) యేసు పొంతి పిలాతు ముందుకు తీసుకురాబడినప్పుడు ఇలా అనెను: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు.” (యోహాను 18:36) తొలికాల క్రైస్తవత్వం లోకమునకు వేరైయుండుట క్రైస్తవగ్రీకు లేఖనములవలననే కాకుండా చరిత్రకారులవలన కూడా దృఢపరచబడింది.

2 ఆ తరువాత ఎప్పుడైనా తన అనుచరులకు లోకమునకు మధ్య వుండే సంబంధం మారుతుందని, లోకమంతా క్రైస్తవత్వమును చేపట్టడం ద్వారా తన రాజ్యము రావడం జరుగుతుందని యేసు తెలియపరచాడా? లేదు. యేసు మరణము తర్వాత తన అనుచరులు ప్రేరేపింపబడి వ్రాసినదానిలో ఏది దానిని లేశమాత్రం కూడా సూచించలేదు. (యాకోబు 4:4 [సా.శ. 62కు కొంచెము ముందు వ్రాయబడింది]; 1 యోహాను 2:15-17; 5:19 [దాదాపు సా.శ. 98న వ్రాయబడినది.]) అందుకు భిన్నంగా, యేసు “ప్రత్యక్షత” తదుపరి ఆయన రాజ్యాధికారముతో “రావడాన్ని,” బైబిలు “అంతముతో” లేక నాశనముతో గతించే “యుగసమాప్తికి” ముడిపెట్తూ ఉన్నది. (మత్తయి 24:3, 14, 29, 30; దానియేలు 2:44; 7:13, 14) ఆయన పరౌసియా లేక ప్రత్యక్షతనుగూర్చి చెప్పిన సూచనలో తన నిజ అనుచరులను గూర్చి ఆయన ఇలా చెప్పెను: “అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.”—మత్తయి 24:9.

ఈనాడు నిజమైన క్రైస్తవులు

3 ఈనాడు ఏ మత సంస్థ క్రైస్తవ సూత్రములకు తగినట్లు నమ్మకంగా ప్రవర్తిస్తున్నదని, లోకమునకు వేరుగా ఉన్నదని పేరు సంపాదించుకుంది మరియు దాని సభ్యులు ద్వేషించబడుతూ, హింసించబడుతున్నారు? తొలి క్రైస్తవుల చారిత్రక వర్ణనలకు ప్రతివిషయంలో సరిపడేలా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఏ క్రైస్తవ సంస్థ దానికి సారూప్యము కలిగివుంది? ఈ విషయాలలో న్యూ కేథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా అంటుంది: “తొలి క్రైస్తవ సమాజము యూదా మతంలోనే మరో విభాగంగా పరిగణించబడినప్పటికి, దాని వేదాంత బోధల్లో అది ఎంతో ప్రత్యేకమైంది, ముఖ్యంగా యూదయ సమరయ, భూదిగంతములవరకు ఆయన సాక్షులుగా పనిచేసిన సభ్యుల ఆసక్తివిషయంలో సాటిలేనిదిగా రుజువు పరచుకొంది (అపొస్తలుల కార్యములు 1:8).”—వాల్యూమ్‌ 3, పేజి 694.

4 ఇచ్చట “మరొక మత విభాగంగా పరిగణించబడిన” “దానిబోధ . . . ఎంతో ప్రత్యేకమైంది” “సాక్షులుగా వారి ఆసక్తి” అని వాడబడిన మాటలను పరిశీలించి, తదుపరి అదే ఎన్‌సైక్లోపీడియా యెహోవాసాక్షులను ఎలా వర్ణిస్తుందో చూడండి. “ఈ మతవిభాగం . . . లోక అంతము బహు కొద్ది సంవత్సరాలలోనే వస్తుందని సాక్షులు దృఢంగా నమ్ముతారు. ఈ సవివరమైన నమ్మకం వారి అవిచ్ఛిన్నకరమైన ఆసక్తికి శక్తివంతమైన మూలంగా కనిపిస్తుంది. ఈ మత విభాగంలోనున్న ప్రతి సభ్యుని ప్రాధమిక బాధ్యత ఏమనగా, సమీపిస్తున్న ఆయన రాజ్యమును ప్రకటించడంద్వారా యెహోవాకు సాక్ష్యమివ్వడము. వారి ప్రవర్తనను నిర్దేశించేది, వారి నమ్మకాలకు మూలము బైబిలని వారు పరిగణిస్తారు. నిజమైన సాక్షిగానుండటానికి ఏదో విధంగా వారు సమర్థవంతమైన సాక్ష్యమివ్వవలసి ఉన్నారు.”—వాల్యూమ్‌ 7, పేజీలు 864-5.

5 ఏయే విధాలలో యెహోవాసాక్షుల బోధలు ఎంతో ప్రత్యేకత గలవి? న్యూ కేథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా కొన్నింటిని ప్రస్తావిస్తూ ఇలా అంటుంది: “త్రిత్వ సిద్ధాంతాన్ని వారు [యెహోవాసాక్షులు] అన్యసంబంధమైన విగ్రహారాధనగా ఖండిస్తారు. యేసు యెహోవాకు తప్ప మరి ఎవరికంటెను తక్కువవాడు కాదు. ఆయనను వారు అత్యున్నత యెహోవాసాక్షిగాను, ‘ఒక దేవునిగాను’ పరిగణిస్తారు. (వారు యోహాను 1:1ని అలాగే తర్జుమాచేశారు) ఆయన మానవునిగా మరణించి అమర్త్యమైన ఆత్మీయ కుమారునిగా లేపబడ్డాడు. ఆయన వేదన మరియు మరణము మానవజాతి భూమిపై నిత్యము జీవించే హక్కును సంపాదించుటకు చెల్లించిన విలువగా వారు పరిగణిస్తారు. నిజమైన సాక్షులగు ‘గొప్పసమూహము’ (ప్రకటన 7:9) భూపరదైసులో నిరంతరము జీవించ నిరీక్షిస్తారు. కేవలం నమ్మకస్తులైన 1,44,000 (ప్రకటన 7:4; 14:1, 4) మంది మాత్రమే క్రీస్తుతోకూడ పరలోక మహిమను అనుభవిస్తారు. దుష్టులు సంపూర్తిగా నాశనమౌతారు. . . . పూర్తిగా నీట ముంచే పద్ధతిలో సాక్షులు బాప్తిస్మమిస్తారు. యెహోవా దేవుని సేవచేయడానికి ఒకరి సమర్పణకు బహిరంగ గుర్తుగా దానిని వారు లెక్కిస్తారు. . . . యెహోవాసాక్షులు రక్తమార్పిడులను తిరస్కరించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారు. వారి సంసారజీవితము, లైంగిక నైతికత చాలా దృఢంగా ఉంటుంది.” యెహోవాసాక్షులు ఈ విషయాలన్నిటిలో నిజంగా అపురూపంగా ఉండవచ్చేమోగాని, ఈ విషయాలలోని వారి విధానం దృఢంగా మరియు పూర్తిగా బైబిలుపై ఆధారపడివుంది.—కీర్తన 37:29; మత్తయి 3:16; 6:10; అపొస్తలుల కార్యములు 15:28, 29; రోమీయులు 6:23; 1 కొరింథీయులు 6:9, 10; 8:6; ప్రకటన 1:5.

6 రోమను కాథోలిక్కుల ఇదే వృత్తాంతము 1965లో (ఆ శీర్షిక వ్రాయబడిన సంవత్సరము) “వారు నివసించే లౌకిక సమాజంలో భాగమని ఇప్పటివరకు యెహోవాసాక్షులు తమ్మును ఎంచుకొనలేదు” అని కూడా తెలియజేసింది. అంటే కాలముగడుస్తూ యెహోవాసాక్షుల సంఖ్య పెరిగేకొలది వారు “ఒక మతవిభాగము వలెగాక, చర్చికున్న లక్షణాలే వారికి అలవడతాయి.” చివరకు లోకంలో భాగస్తులౌతారు అని రచయిత తలంచినట్లు కనబడుతుంది. అయితే అది వాస్తవం కాలేదు. ఈనాడు, 1965లో ఉన్నవారికంటె నాలుగురెట్లు ఎక్కువైనను యెహోవాసాక్షులు లోకంపట్ల తమస్థానాన్ని స్థిరంగా కాపాడుకున్నారు. యేసు “లోక సంబంధికానట్టు వారును లోక సంబంధులు కారు.”—యోహాను 17:16.

వేరేగాని విరోధులు కారు

7 రెండవ శతాబ్దంలో క్రైస్తవ మత సిద్ధాంతమును నిరూపించు జస్టిన్‌ మార్‌టైర్‌ తొలిక్రైస్తవుల విశ్వాసమును ఎలా సమర్ధించాడో వ్రాస్తూ, రాబర్ట్‌ యం. గ్రాంట్‌, ఎర్లి క్రిస్టియానిటి అండ్‌ సొసైటి అనే తన పుస్తకములో ఇలా వ్రాశాడు: “క్రైస్తవులు విప్లవకారులే అయితే, వారు తమ ధ్యేయాన్ని నెరవేర్చుకొనేందుకు అజ్ఞాతంగా ఉండేవారు. అయితే అందుకు భిన్నంగా సమాధానాన్ని, మంచి క్రమమును కాపాడటంలో చక్రవర్తికి వారు మంచి స్నేహితులు.” అలాగే యెహోవాసాక్షులు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా సమాధానమును ప్రేమించేవారని క్రమమును పాటించే పౌరులని పేరెన్నికగన్నారు. ఎలాంటి ప్రభుత్వాలకైన యెహోవాసాక్షులవలన వారికే ఇబ్బంది కలగదని వారికి తెలుసు.

8 ఉత్తర అమెరికాలోని ఒక పత్రికకు సంపాదకీయము రాసేవ్యక్తి ఇలా వ్రాశాడు: “ఏ రాజకీయ ప్రభుత్వానికైనా యెహోవాసాక్షులు అపాయకరంగా పరిణమిస్తారనేది దురుద్దేశపూరితమైన అభిప్రాయమే. ఒక మత గుంపుకు తగినట్లుగా వారు విభాగాలు సృష్టించువారు కారు. సమాధానమును ప్రేమించువారు.” లబ్‌జెక్షన్‌ డి కొన్సియాన్స్‌ అనే తన పుస్తకంలో జాన్‌ప్యెర్‌ కాటలేన్‌ ఇలా రాస్తున్నాడు: “సాక్షులు అధికారులకు పూర్ణంగా లోబడేవారు, సాధారణంగా చట్టాలకు విధేయులౌతారు. సుంకము చెల్లిస్తారు. ఏ ప్రభుత్వాలనైనా ప్రశ్నించడంగాని, మార్పుచేయ ప్రయత్నించడమేగాని, నాశనము చేయడానికేగాని ప్రయత్నించరు. కారణమేమనగా, వారు ఈ లోక సంబంధమైన విషయాలపై ఏ మాత్రము శ్రద్ధచూపరు.” అయితే కాటలేన్‌ ఇంకా చెప్పేదేమంటే ప్రభుత్వం వారి జీవితాన్నేగాని వారి సమయాన్నేగాని కోరినప్పుడే వారు అందుకు తిరస్కరిస్తారు. కారణం వారి జీవితాలను వారు దేవునికి పూర్తిగా సమర్పించుకొన్నారు. ఈ విషయంలో వారు ఎంతో సన్నిహితంగా తొలి క్రైస్తవులను పోలివున్నారు.—మార్కు 12:17; అపొస్తలుల కార్యములు 5:29.

పరిపాలక తరగతి వారిని తప్పుగా అర్ధం చేసుకున్నారు

9 రోమను చక్రవర్తులలో ఎక్కువమంది తొలిక్రైస్తవులను తప్పుగా అర్ధం చేసుకొని వారిని హింసించారు. దీనికి కారణమేమిటో తెలియజేస్తూ, సా.శ. రెండవ శతాబ్దములో వ్రాయబడిందని తలంచబడే ది ఎపిజల్‌ టు డియోగ్నిటస్‌, ఇలా తెలిపింది: “క్రైస్తవులు లోకములో జీవిస్తున్నప్పటికీ వారు అందులో భాగస్తులై లేక దానికి అంటు కట్టబడినవారై లేరు.” మరోప్రక్క రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ చర్చి విషయంలో దానియొక్క రాజ్యాంగ విధిని తెలుపుతూ, ఇలా అంది. కాథోలిక్కులు “ప్రస్తుత జీవిత వ్యవహారాలల్లో పాల్గొంటూ దేవుని రాజ్యాన్ని వెదకుతుండాలి” “వారు జీవిస్తుండే లోక మహిమార్థమై వారు కృషిచేస్తూ ఉండాలి.”

10 చరిత్రకారుడైన ఇ. జి. హార్డి రోమను చక్రవర్తులు “తొలి క్రైస్తవులను హీనమైన ఉత్సాహము గలవారిగ” ఎంచారని తెలియజేస్తున్నాడు. ఫ్రెంచి చరిత్రకారుడైన ఎటియన్‌ ట్రాక్‌మా, “సంస్కృతి గల గ్రీకు, రోమను అధికారులు క్రైస్తవులను తూర్పుప్రాంతపు ఒక వింత తెగగా పరిగణిస్తూ” వీరిని హీనంగా తృణీకరించిన స్థితిని గూర్చి మాట్లాడుతున్నాడు. బిత్నియాకు రోమను గవర్నరుగానున్న ప్లైని ది యంగర్‌కు, చక్రవర్తియైన ట్రాజన్‌ మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు పరిపాలక తరగతి క్రైస్తవుల నిజస్వభావమును సాధారణంగా ఎరగలేదని చూపుతుంది. అలాగే ఈనాడు కూడా యెహోవాసాక్షులను తరచు లోకములోని పరిపాలక తరగతి తప్పుగా అర్ధం చేసుకొన్నారు. చివరకు హీనంగా పరిగణించారు. అయితే ఇది సాక్షులకు విభ్రాంతినిగాని లేక ఆశ్చర్యాన్నిగాని కలిగించదు.—అపొస్తలుల కార్యములు 4:13; 1 పేతురు 4:12, 13.

“అంతట ఆక్షేపణచేయుచున్నారు”

11 తొలి క్రైస్తవులనుగూర్చి ఇలా అన్నారు: “ఈ మతభేదమును గూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు.” (అపొస్తలుల కార్యములు 28:22) సా.శ. రెండవ శతాబ్దములో అన్యుడైన సెల్సెస్‌ క్రైస్తవత్వము కేవలము మానవ సమాజములోని హీనమైన తరగతికే ఇష్టకరమైనదని చాటించెను. యెహోవాసాక్షులను గూర్చికూడా ఈనాడు అదేరీతిలో, “యెహోవాసాక్షులలో ఎక్కువమంది సమాజములో ఏమీ లేనివారని” అనడం జరిగింది. చర్చి చరిత్రకారుడైన ఆగస్టస్‌ నియాండర్‌ ఇలా నివేదించాడు, “క్రైస్తవులు లోకములో మృతుల్లాగా లెక్కించబడుతున్నారు. జీవితపు ప్రతి వ్యవహారములోను వారు పనికిమాలినవారు. . . . నిజానికి అందరూ వారిలాగానే వుంటే జీవితంలో ఇక వేరే వ్యవహారమేముంటుంది? అని కూడ ప్రశ్నించడం జరిగింది.” యెహోవాసాక్షులు రాజకీయాలలో పాల్గొనకుండా ఉంటారు గనుకనే మానవసమాజములో వారు నిష్‌ప్రయోజకులుగా ఉన్నారు అని కూడా తరచు ఆరోపించబడ్డారు. వారు రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటూ, అదే సమయంలో దేవుని రాజ్యమే మానవజాతికి ఒకే ఒక నిరీక్షణ అని ఎలా ప్రకటించగలరు? యెహోవాసాక్షులు అపొస్తలుడైన పౌలు మాటలను హృదయపూర్తిగా అంగీకరిస్తారు: “క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.”—2 తిమోతి 2:3, 4, ఎక్యూమినికల్‌ ఎడిషన్‌ వారి రివైజ్డ్‌ స్టాన్‌డార్డ్‌ వర్ష్‌న్‌.

12 ఎ హిస్టరీ ఆఫ్‌ క్రిస్టియానిటి అనే తన పుస్తకంలో ఫ్రొఫెసరు కె. యస్‌. లాటురెట్‌ ఇలా రాస్తునాడు: “యుద్ధములో పొల్గొనే విషయం కూడా గ్రీకు రోమను లోకానికి క్రైస్తవులను వేరుచేసిన మరో వివా శవ . ఈనాటి వరకు మిగిలివున్న మొదటి మూడు శతాబ్దాల ఏ క్రైస్తవ రాతకూడ క్రైస్తవులు యుద్ధంలో పాల్గొనడాన్ని సమర్ధించడంలేదు. ఎడ్‌వర్డ్‌ గిబ్బోన్స్‌ వ్రాసిన పుస్తకమైన ది హిస్టరీ ఆఫ్‌ ది డిక్లైన్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ ది రోమన్‌ ఎంపైర్‌ ఇలా చెబుతుంది: “క్రైస్తవులు అతి పవిత్రమైన కర్తవ్యాన్ని విడిచిపెట్టి, సైనికులు, న్యాయాధిపతులు, రాజులు మొదలగు పాత్రలను పోషిస్తారనడం దుర్లభము.” అదేరీతిలో యెహోవాసాక్షులు కూడా కచ్చితంగా తటస్థవైఖరిని చేపడతారు. తొలి క్రైస్తవుల మాదిరే వారును యెషయా 2:2-4, మత్తయి 26:52లో సూచించబడిన బైబిలు సూత్రాలను అనుసరిస్తారు.

13 యెహోవాసాక్షులు కుటుంబాలను విడదీసేవారని వారి విరోధులు వారిని నిందిస్తారు. నిజమే, కుటుంబములో ఒకరూ లేక అంతకంటె ఎక్కువమంది యెహోవాసాక్షులైనప్పుడు, అలా కుటుంబాలు విభాగించబడిన నిదర్శనాలు కలవు. ఇది జరుగుతుందని కూడా యేసుక్రీస్తు ప్రవచించాడు. (లూకా 12:51-53) కానీ, గణాంకము చూపేదేమనగా ఈ కారణం నిమిత్తం విచ్చిన్నమయ్యే వివాహాలు చాలా అరుదు. ఉదాహరణకు ఫ్రాన్సులోని యెహోవాసాక్షులలోని వివాహమైన ప్రతి ముగ్గురిలో ఒకరు అవిశ్వాసియైన జీవిత భాగస్వామితో వున్నారు. అయినా ఈ వివాహములలో విడాకుల సంఖ్య వారి జాతీయ సగటు సంఖ్యకంటె ఎక్కువేమీ లేదు. ఎందుకు? అపొస్తలులైన పౌలు, పేతురు ప్రేరేపితులై అవిశ్వాసులతో వివాహమైయున్న వారికి జ్ఞానయుక్తమైన సలహానిచ్చారు. యెహోవాసాక్షులు దానిని గైకొంటున్నారు. (1 కొరింథీయులు 7:12-16; 1 పేతురు 3:1-4) ఒకవేళ ఈ విధమైన దంపతులలో విడిపోవడమంటూ జరిగితే, ఇందుకు ముందు చొరవతీసుకునేది సాక్షికానటువంటి భాగస్వామియే. మరోప్రక్క వివాహ భాగస్వాములు యెహోవాసాక్షులై బైబిలు సూత్రాలను తమ జీవితాలలో అన్వయించుకోడానికి ప్రయత్నిస్తున్నందున, వేలాది వివాహములు వేరుకాకుండా రక్షించబడ్డాయి.

క్రైస్తవులు త్రిత్వ సిద్ధాంతికులు కారు

14 వ్యతిరేకార్థము నియ్యదగిన మరో విషయమేమంటే, రోమా సామ్రాజ్యంలో తొలి క్రైస్తవులు దేవున్ని నమ్మేవారు కారనికూడా నిందించడం జరిగింది. డా. ఆగస్టస్‌ నియాండర్‌ వ్రాసేదేమంటే: “ఆ దినాలలో క్రైస్తవులు సాధారణంగా నాస్తికులనీ, దేవతలను తిరస్కరించేవారని పిలువబడటం జరిగింది.” నిజానికి బహుమంది దేవుళ్లనుగాక సజీవుడైన సృష్టికర్తను ఆరాధించు క్రైస్తవులను “నిజమైన దేవుడు కాక మనుష్యుల చేత చేయబడిన కర్ర, రాళ్లను” పూజించే అన్యులు నాస్తికులని నిందించడం ఎంత వింతైన సంగతి.—యెషయా 37:19.

15 అలాంటి వింతే మన దినాలలో మరొకటుంది. అదేమంటే క్రైస్తవ మతసామ్రాజ్యంలోని అధికారులు యెహోవాసాక్షులను క్రైస్తవులు కారని చెబుతారు. ఎందుకు? ఎందుకంటె యెహోవాసాక్షులు త్రిత్వమును అంగీకరించరు. క్రైస్తవమతసామ్రాజ్యపు పక్షపాత నిర్వచనము ఏమంటే, “క్రీస్తును దేవుడని అంగీకరించినవారే క్రైస్తవులు.” కాని అందుకు భిన్నంగా ఆధునిక నిఘంటువు ప్రకారం, “క్రైస్తవుడు” అంటే, “యేసుక్రీస్తును నమ్మి, ఆయన బోధలను అనుసరించువాడు.” “క్రైస్తవత్వము” అంటే “యేసుక్రీస్తు బోధలపైన ఆధారపడిన మతమై, ఆయన దేవుని కుమారుడని నమ్మేది.” ఈ వర్ణనకు ఏ గుంపు ఎక్కువగా సరిపోతారు?

16 యేసుక్రీస్తు ఎవరనే విషయంలో యెహోవాసాక్షులు ఆయన స్వంత సాక్ష్యాన్నే ఆధారంగా తీసుకుంటారు. “నేను దేవుని కుమారుడను” అని ఆయన అన్నాడే గాని, “నేను కుమారుడైన దేవున్ని” అని చెప్పలేదు. (యోహాను 10:36; యోహాను 20:31ని పోల్చండి) అపొస్తలుడైన పౌలు క్రీస్తునుగూర్చి పలికిన ప్రేరేపిత వాక్యమును వారు అంగీకరిస్తారు. “ఆయన దేవుని స్వరూపమును కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు.” * (ఫిలిప్పీయులు 2:6, ది న్యూ జెరూసలేము బైబిలు) ది పాగనిజమ్‌ ఇన్‌ అవర్‌ క్రిష్టియానిటి అనే పుస్తకము ఇలా తెల్పుతుంది: “యేసుక్రీస్తు ఎన్నడూ అటువంటి అభిప్రాయమును [సమానంగా ఉండే త్రిత్వము] ప్రస్తావించలేదు. క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా ‘త్రిత్వము’ అనే మాట కనిపించదు. ఈ అభిప్రాయము ఆయన మరణించిన మూడువందల సంవత్సరముల తర్వాత మాత్రమే చర్చి వలన చేపట్టబడింది; ఈ సిద్ధాంతపు మూలము పూర్తిగా అన్యసంబంధమైనది.” యెహోవాసాక్షులు క్రీస్తునుగూర్చి బైబిలు చెప్పుబోధను అంగీకరిస్తారు. వారు క్రైస్తవులేగాని త్రిత్వ సిద్ధాంతికులు కారు.

సర్వ క్రైస్తవ సమ్మిళతమును అంగీకరించరు

17 యెహోవాసాక్షులకు వ్యతిరేకంగాచేసే మరో రెండు ఫిర్యాదులేమంటే, క్రైస్తవులనబడే వారందరు సమ్మిళితమై యుండేందుకు చేపట్టే ఉద్యమంలో వారు పాల్గొనరనీ, “ఉద్రిక్తంగా మత మార్పిడిచేయించేందుకు” పనిచేస్తుంటారని. ఈ రెండు నిందలు తొలి క్రైస్తవులపైన కూడా వేశారు. కాథోలిక్కులు, ఆర్థడాక్స్‌, ప్రొటెస్టెంటులతో కూడిన క్రైస్తవ మత సామ్రాజ్యము లోకంలో భాగమైయుందనుట త్రోసిపుచ్చలేని సత్యము. కాని యెహోవాసాక్షులైతే యేసువలె “లోక సంబంధులు కారు.” (యోహాను 17:14) క్రైస్తవులకు తగని ప్రవర్తనను, నమ్మకాలను పోషిస్తూ వ్యాప్తిచేసే విశ్వాస సమ్మిళిత ఉద్యమాలతో వారెట్లు సహకరించగలరు?

18 తొలి క్రైస్తవులవలెనే తాము మాత్రమే సత్యమతమును అభ్యసిస్తున్నామను యెహోవాసాక్షుల నమ్మకాన్ని ఎవరు న్యాయంగా విమర్శించగలరు? సర్వక్రైస్తవ సమ్మిళిత ఉద్యమంతో మేము సహకరిస్తున్నామని వేషధారణతో చెప్పుకునే కాథోలిక్‌ చర్చి ఇలా ప్రకటిస్తుంది: “కాథోలిక్కు, అపొస్తలుల చర్చిలో ఒకేఒక నిజమైన మతంగా ఇది కొనసాగుతుందని మేము నమ్ముతున్నాము. యేసు తన అపొస్తలులతో ‘మీరు వెళ్లి సమస్త జనములను శిష్యులనుగా చేయండి’ అని తన శిష్యులతో చెప్పినప్పుడు, సమస్త జనములలో దీనిని వ్యాపింపజేసే పనిని మాకే అప్పగించాడు.” (వాటికన్‌ కౌన్సిల్‌ II “డిక్లరేషన్‌ ఆన్‌ రిలీజయస్‌ లిబర్టీ) అయినా కాథొలిక్కులలోని ఈ నమ్మకము వారిని చెక్కుచెదరని ఆసక్తితో బయలు వెళ్లి జనములను శిష్యులను చేసేలా పురికొల్పడంలేదు.

19 అయితే యెహోవాసాక్షులలో అలాంటి ఆసక్తి ఉన్నది. దేవుడు వారిని కోరేంతమట్టుకు వారు బయలు వెళ్లి సాక్ష్యమివ్వడానికి దృఢనిశ్చయంతో ఉన్నారు. (మత్తయి 24:14) సాక్షులు ఆసక్తిగలవారేగాని ఉద్రిక్త స్వభావంగలవారు కాదు. అది కేవలం పొరుగువారియెడల ఉన్న ప్రేమనుబట్టి కలిగేదే కాని, మానవజాతియెడల ద్వేషాన్నిబట్టి కాదు. మానవజాతిలో సాధ్యమైనంత ఎక్కువమంది రక్షించబడాలని వారి ఆశ. (1 తిమోతి 4:16) తొలి క్రైస్తవులవలెనే, వారు ‘సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండేందుకు’ ప్రయత్నిస్తారు. (రోమీయులు 12:18) వారు దీనిని ఎలా నెరవేరుస్తారనేది తర్వాతి శీర్షికలో చర్చించబడును.

[Footnotes]

^ పేరా 23 త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించి ఈ చర్చకు ది వాచ్‌టవర్‌, జూన్‌ 15, 1971 పేజిలు 355-6 చూడండి.

పునఃసమీక్ష ద్వారా

▫ తొలి క్రైస్తవులు ఏ లక్షణం ద్వారా గుర్తించబడ్డారు, యెహోవాసాక్షులు వారిని ఎలా పోలియున్నారు?

▫ యెహోవాసాక్షులు ఏయే విధాలలో తాము మంచి పౌరులమని చూపిస్తారు?

▫ పరిపాలక తరగతివారు తొలి క్రైస్తవులను ఎలా దృష్టించారు, దానిలో ఈనాడు ఏమైనా భేదముందా?

▫ వారు సత్యమును కలిగియున్నారు అనే నమ్మకము, యెహోవాసాక్షులను ఏమి చేయుటకు నడిపిస్తుంది?

[Study Questions]

1. క్రైస్తవత్వమునకు ప్రత్యేక గుర్తు ఏమైయుండవలెను?

2. (ఎ) కాలముగడిచేకొలది యేసు అనుచరులు, లోకానికి మధ్యనున్న సంబంధంలో ఏమైన మార్పులు జరగవలసియుండెనా? (బి) దేశములు మారడంద్వారా యేసు రాజ్యము ఏర్పడవలసియుండెనా?

3, 4. (ఎ) తొలి క్రైస్తవులను కాథోలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ఎలా వర్ణిస్తుంది? (బి) యెహోవాసాక్షులను అలాగే తొలి క్రైస్తవులను ఒకే మాటలతో ఒక ఎన్‌సైక్లోపీడియా ఎలా వర్ణిస్తుంది?

5. (ఎ) ఏయే రీతులలో యెహోవాసాక్షుల బోధలు అద్వితీయమైనవి? (బి) యెహోవాసాక్షుల బోధలు లేఖనములకు అనుగుణ్యమైనవని తెల్పేందుకు ఉదాహరణలివ్వండి?

6. యెహోవాసాక్షులు ఏ స్థానమును కాపాడుకున్నారు? ఎందుకు?

7, 8. తొలి క్రైస్తవుల విషయంలో వాస్తవమైనట్లే, ఈనాడు యెహోవాసాక్షుల విషయంలోను ఏది వాస్తవము?

9. లోకానికి వేరైయుండే విషయంలో తొలి క్రైస్తవులకు ఆధునిక కాథోలిక్కులకు మధ్యవున్న ఒక పెద్ద తేడా ఏమిటి?

10. (ఎ) పరిపాలక తరగతి తొలి క్రైస్తవులను ఎలా దృష్టించారు? (బి) యెహోవాసాక్షులు కూడా తరచు ఎలా దృష్టించబడుతున్నారు, వారి ప్రతిస్పందన ఏమిటి?

11. (ఎ) తొలి క్రైస్తవులనుగూర్చి ఏమి చెప్పారు, యెహోవాసాక్షులను గూర్చి ఏమి చెప్పబడింది? (బి) యెహోవాసాక్షులు ఎందుకు రాజకీయాలలో పాల్గొనరు?

12. వేరైయుండే ఏ ప్రత్యేక విషయంలో యెహోవాసాక్షులు తొలి క్రైస్తవులను పోలియున్నారు?

13. యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా ఏ నింద ఆరోపించబడింది, అయితే వాస్తవాలు ఏమి చూపుతున్నవి?

14. తొలి క్రైస్తవులకు వ్యతిరేకంగా వారిపై ఏ ఆరోపణచేయబడింది, ఇది ఎందుకు వక్రోక్తి?

15, 16. (ఎ) యెహోవాసాక్షులను గూర్చి కొందరు మతస్థులు ఏమి చెప్పారు, అయితే ఇది ఏ ప్రశ్నను లేవనెత్తుతుంది? (బి) యెహోవాసాక్షులు నిజమైన క్రైస్తవులని ఏమి చూపుతుంది?

17. సర్వక్రైస్తవ సమ్మేళన, పరవిశ్వాసంలో కలిసిపోవడం మొదలగు ఉద్యమాల విషయంలో యెహోవాసాక్షులు ఎందుకు సహకరించరు?

18. (ఎ) తాము మాత్రమే సత్యమైన మతమును అభ్యసిస్తున్నామని చెప్పుకొంటున్నందుకు యెహోవాసాక్షులను ఎందుకు విమర్శించకూడదు? (బి) తమది సత్యమైన మతమని నమ్ముతున్నను, రోమను కాథోలిక్కులలో ఏమి లేదు?

19. (ఎ) యెహోవాసాక్షులు ఏమి చేయడానికి తీర్మానించుకొనియున్నారు, ఏ ఉద్దేశ్యంతో? (బి) తదుపరి శీర్షికలో ఏవిషయం పరిశీలించబడుతుంది?

[Picture on page 12]

దేవుడు వారిని కోరేంతమట్టుకు సాక్ష్యమివ్వడానికి యెహోవాసాక్షులు తీర్మానించుకొనియున్నారు

[Picture on page 17]

పిలాతు: “ఇదిగో ఈ మనుష్యుడు”—అని లోకముతో సంబంధములేని వానిగూర్చి చెప్పెను.—యోహాను 19:5

[Credit Line]

“ఎక్‌సీ హోమో” బై ఎ. సిసేరి: ప్లారెన్స్‌, గలేరియా డి’ఆర్టే మోడెర్నా / అలినారి/ఆర్ట్‌ రిసోర్స్‌, న్యూయార్క్‌.