కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుక్రీస్తు మనకెలా సహాయం చేయగలడు

యేసుక్రీస్తు మనకెలా సహాయం చేయగలడు

యేసుక్రీస్తు మనకెలా సహాయం చేయగలడు

తాను భూమిమీద ఉన్నప్పుడు ప్రజలకు సహాయం చేసేందుకు యేసు అనేకానేక అద్భుత కార్యాలు చేశాడన్నది ఎంతో నిజం కాబట్టే, ఒక ప్రత్యక్ష సాక్షి, యేసు జీవితంలోని అనేక సంఘటనలను గురించి చెప్పిన తర్వాత, “యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది” అని చెప్పాడు. (యోహాను 21:25) యేసు భూమి మీద ఉన్నప్పుడు అనేక కార్యాలను చేశాడన్నది నిజమే. అయితే, ‘ఇప్పుడు పరలోకంలో ఉంటున్న ఆయన మనకు సహాయకుడుగా ఎలా ఉండగలడు? యేసు చూపించే వాత్సల్యంతో కూడిన సానుభూతి నుండి మనం ఇప్పుడు ప్రయోజనం పొందగలమా?’ అని మనం ప్రశ్నించుకోవచ్చు.

ఈ ప్రశ్నల జవాబు, హృదయానికి ఎంతో సంతోషాన్నిస్తుంది, హామీని కూడా ఇస్తుంది. క్రీస్తు “యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను” అని బైబిలు మనకు చెబుతుంది. (హెబ్రీయులు 9:24) క్రీస్తు మన కోసం ఏమి చేశాడు? “[క్రీస్తు] తానే నిత్యమైన విమోచన సంపాదించి, . . . మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో [పరలోకంలోనే] ప్రవేశించెను” అని అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు.—హెబ్రీయులు 9:11, 12; 1 యోహాను 2:2.

అదెంత శుభవార్త! యేసు, ప్రజల కోసం పని చేయడాన్ని అంతటితో ఆపే బదులు, పరలోకానికి ఆరోహణం కావడం వల్ల, మానవజాతి కోసం ఇంకా ఎక్కువగా చేయగల్గుతున్నాడు. ‘పరలోకమందు మహామహుడు’ మానవులకు అర్హతలేని దయను చూపిస్తూ, యేసు వారి కోసం ప్రధానయాజకుడుగా సేవ చేసేందుకు యేసును తన “సింహాసనమునకు కుడిపార్శ్వమున” ప్రజా ‘పరిచారకుడు’గా నియమించాడు.—హెబ్రీయులు 8:1, 2.

ప్రజా ‘పరిచారకుడు’

మానవజాతి కోసం యేసు పరలోకంలో ప్రజా పరిచారకుడుగా ఉన్నాడు. ప్రాచీన కాలాల్లో, దేవుని ఆరాధకుల పక్షంగా ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడు చేసిన పనిని పోలిన పనిని ఆయన చేస్తున్నాడు. ఏమిటా పని? ‘ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబ[డేవాడు]. అందుచేత అర్పించుటకు ఈయనకు [ఆరోహణుడైన యేసుక్రీస్తుకు] ఏమైన ఉండుట అవశ్యము” అని పౌలు వివరించాడు.—హెబ్రీయులు 8:3.

ప్రాచీన కాలాల్లోని ప్రధాన యాజకులు అర్పించినదాని కన్నా చాలా విలువైనదే యేసు దగ్గర ఉంది. “మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తము” ప్రాచీన ఇశ్రాయేలీయులకు కొంతమేరకు ఆధ్యాత్మిక శుద్ధి కలిగేటట్లు చేయగలిగినట్లైతే, ‘క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంత యెక్కువగా శుద్ధిచేయును?’—హెబ్రీయులు 9:13, 14.

యేసుకు అమర్త్యత అనుగ్రహించబడినందువల్ల, ఆయన గమనార్హుడైన పరిచారకుడిగా కూడా ఉన్నాడు. ప్రాచీన ఇశ్రాయేలులో “యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, [యాజకులు] అనేకులైరి.” కానీ యేసు అయితే “నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనముచేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు” అని పౌలు వ్రాస్తున్నాడు. (హెబ్రీయులు 7:23-25; రోమీయులు 6:9) అవును, పరలోకంలో దేవుని కుడివైపున, ‘మన పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించు’ ప్రజా పరిచారకుడు మనకున్నాడు ! అంటే, మనకు ఇప్పుడు దాని భావమేమై ఉంటుందో ఆలోచించండి !

యేసు భూమి మీద ఉన్నప్పుడు, సహాయం కోసం ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కొందరైతే, యేసు సహాయాన్ని పొందేందుకు సుదూర ప్రాంతాలనుండి ప్రయాణం చేసి వచ్చేవారు. (మత్తయి 4:24, 25) సకల జాతుల్లోని ప్రజలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పరలోకంలో ఉన్న యేసు చెంతకు చేరవచ్చు. ఒక ప్రజా పరిచారకుడుగా పరలోకంలో తనకున్న స్థానం దృష్ట్యా, ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు.

యేసుక్రీస్తు ఎలాంటి ప్రధానయాజకుడు?

సువార్త వృత్తాంతాల్లో కనిపిస్తున్న యేసుక్రీస్తును గురించిన చిత్రీకరణను బట్టి, ఆయనకు సహాయపడే మనస్సూ, వాత్సల్యంతో కూడిన సానుభూతీ ఉన్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎంత స్వయంత్యాగపూరితుడాయన! ఒకటి కన్నా ఎక్కువ సందర్భాల్లో, ఆయనా, ఆయన శిష్యులూ విశ్రాంతిని తీసుకుందామని చూస్తుండగా, వారి ఏకాంతానికి భంగం కలిగింది. ప్రశాంతతనూ విశ్రాంతినీ అనుభవించే అమూల్యమైన క్షణాలు నష్టమయ్యాయే అని భావించే బదులు, తన సహాయం కోసం వచ్చిన ప్రజలపై ఆయనకు ‘కనికరం’ కలిగి కదిలించబడ్డాడు. ఆయన అలసిపోయి ఉన్నాడు, ఆయనకు ఆకలిగాను దాహంగాను ఉంది. అయినప్పటికి దయతో ‘వారిని చేర్చుకున్నాడు.’ నిష్కపటులైన పాపులకు సహాయం చేయగల్గేందుకు గాను భోజనం మానుకోవడానికి సహితం ఆయన సిద్ధపడ్డాడు.—మార్కు 6:31-34; లూకా 9:11-17; యోహాను 4:4-6, 31-34.

యేసు కరుణార్ధ్ర హృదయంతో కదిలించబడి, ప్రజల శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేందుకు ఆచరణాత్మక చర్యలను గైకొన్నాడు. (మత్తయి 9:35-38; మార్కు 6:35-44) అంతేగాక, శాశ్వతకాల ఉపశమనాన్నీ ఓదార్పునూ పొందడాన్ని కూడా ఆయన నేర్పించాడు. (యోహాను 4:7-30, 39-42) ఉదాహరణకు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును” అని ఆయన వ్యక్తిగతంగా ఇస్తున్న ఆహ్వానం ఎంత ఆకర్షణీయంగా ఉంది.—మత్తయి 11:28, 29.

ప్రజల మీద యేసుకున్న ప్రేమ చాలా గొప్పది కనుకే, ఆయన పాపభరితులైన మానవజాతి కోసం చివరికి తన ప్రాణాన్ని సహితం ఇచ్చాడు. (రోమీయులు 5:6-8) ఈ విషయాన్ని గురించి అపొస్తలుడైన పౌలు ఈ విధంగా తర్కించాడు: “తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు [యెహోవా దేవుడు] ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? . . . చనిపోయిన[ది] క్రీస్తుయేసే; . . . మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనముకూడ చేయువాడును ఆయనే [క్రీస్తుయేసే].”—రోమీయులు 8:32-34.

సహానుభూతిని చూపగల ప్రధానయాజకుడు

యేసు ఒక మానవుడుగా, ఆకలిదప్పులనూ, అలసటనూ, తీవ్రమైన బాధను, వేదననూ, మరణాన్నీ అనుభవించాడు. ఆయన అనుభవించిన వ్యథా, ఒత్తిళ్ళూ నేడు కష్టాలననుభవిస్తున్న మానవజాతికి ప్రధాన యాజకుడుగా సేవచేసేందుకు ఆయనను అసాధారణమైన విధంగా సంసిద్ధుడిగా చేశాయి. “కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన సహోదరులవంటివాడు కావలసివచ్చెను. తాను శోధింపబడి శ్రమపొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు” అని పౌలు వ్రాశాడు.—హెబ్రీయులు 2:17, 18; 13:8.

ప్రజలు దేవునికి దగ్గరవ్వడానికి సహాయపడేందుకు తాను యోగ్యుడననీ, తనకు సుముఖత ఉందనీ యేసు చూపించాడు. అయితే, దానర్థం, దేవుడు క్షమించడానికి ఇష్టపడని కఠినుడనా, నిర్దయుడనా, ఆయనకు నచ్చజెప్పాల్సిన పరిస్థితి ఉందనా? కానేకాదు, ‘యెహోవా దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు’ అని బైబిలు మనకు అభయాన్నిస్తుంది. “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” అని కూడా బైబిలు చెబుతుంది. (కీర్తన 86:5; 1 యోహాను 1:9) నిజానికి, ఆప్యాయతతో కూడిన యేసు మాటలూ, ప్రవర్తనా, ఆయన తండ్రి సానుభూతిగలవాడు కరుణాహృదయుడు ప్రేమామయుడు అన్న విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.—యోహాను 5:19; 8:28; 14:9, 10.

యేసు, పశ్చాత్తాపపడే పాపులకు ఉపశమనాన్ని ఎలా కలుగజేస్తాడు? దేవుడ్ని ప్రీతిపరచాలని హృదయపూర్వకంగా చేసే ప్రయత్నాల్లో వాళ్ళు ఆనందాన్నీ, సంతృప్తినీ పొందేందుకు వారికి సహాయం చేయడం ద్వారా వారికి ఉపశమనాన్ని కలుగజేస్తాడు. అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు వ్రాసిన ఉత్తరంలో, “ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు [“సానుభూతి చూపలేనివాడు” NW] కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము” అని వర్ణించాడు.—హెబ్రీయులు 4:14-16.

“సమయోచితమైన సహాయము”

తీవ్రమైన రోగము, కృంగదీసేంతటి అపరాధ భావం, అమిత నిరాశానిస్పృహలు వంటి పరిష్కరించడం మన వల్ల సాధ్యం కాదని అనిపించేటువంటి సమస్యలను ఎదుర్కున్నప్పుడు, మనం ఏమి చేయగలం? యేసు తానే క్రమంగా దేనిపై ఆధారపడ్డాడో దానిని ఉపయోగించుకోవచ్చు, అంటే ప్రార్థన చేసే అమూల్యమైన ఆధిక్యతను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన ముందు రాత్రి, “వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.” (లూకా 22:44) అవును, ఎంతో ఆతురతతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి ఉంటుందో యేసుకు తెలుసు. ఆయన “శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.”—హెబ్రీయులు 5:7.

తమ ప్రార్థనలు ‘అంగీకరింపబడడమన్నా’ తాము బలపరచబడడమన్నా మానవులకు ఎంత ప్రాముఖ్యమో యేసుకు తెలుసు. (లూకా 22:43) అంతేకాక, “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. . . . మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును” అని కూడా ఆయన వాగ్దానం చేశాడు. (యోహాను 16:23, 24) తన కుమారుడు తన అధికారాన్నీ, మన కోసం తను చెల్లించిన విమోచన క్రయధన మూల్యాన్నీ మన కోసం ఉపయోగించడానికి దేవుడు అనుమతిస్తాడనే నమ్మకం మనకుంది. మనం ఆ నమ్మకంతో దేవునికి విన్నపాలను చేసుకోవచ్చు.—మత్తయి 28:18.

యేసు పరలోకంలో తనకున్న స్థానాన్ని బట్టి, మనకు సరైన సమయోచితమైన సహాయాన్ని ఇస్తాడని మనం నమ్మకం కలిగివుండగలం. ఉదాహరణకు, మనం పాపం చేసిన తర్వాత యథార్థంగా పశ్చాత్తాపపడినట్లైతే, “నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది [“సహాయకుడు” NW] తండ్రియొద్ద మనకున్నాడు” అన్న అభయం నుండి మనం ఓదార్పును పొందవచ్చు. (1 యోహాను 2:1, 2) పరలోకంలో ఉన్న మన సహాయకుడు మన సాంత్వనకర్త మన కోసం వేడుకుంటాడు కనుక, ఆయన నామమున లేఖనాలకు అనుగుణ్యంగా మనం చేసే ప్రార్థనలకు సమాధానం ఇవ్వబడుతుంది.—యోహాను 14:13, 14; 1 యోహాను 5:14, 15.

క్రీస్తు సహాయానికి మెప్పుదల చూపించడం

దేవునికి ఆయన కుమారుని ద్వారా విజ్ఞాపన చేసుకోవడం కన్నా ఎక్కువే ఇమిడి ఉంది. తను ఇచ్చిన విమోచన క్రయధన బలి మూల్యంతో మానవజాతిని “కొనడం ద్వారా క్రీస్తు” మానవులను “కొన్న సొంతదారుడు” అయ్యాడు. (గలతీయులు 3:13; 4:5, NW; 2 పేతురు 2:1, NW) ఆయన మన సొంతదారుడు అన్న విషయాన్ని గుర్తిస్తూ, “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను [“హింసా కొయ్యను” NW] ఎత్తికొని నన్ను వెంబడింపవలెను” అన్న ఆయన ఆహ్వానానికి సంతోషంగా ప్రతిస్పందించడం ద్వారా క్రీస్తు మన కోసం చేస్తున్న వాటన్నింటికీ మెప్పుదలను చూపగలము. (లూకా 9:23) ‘తన్ను తాను ఉపేక్షించుకోవడం’ అంటే నన్ను నేను త్యజిస్తున్నాను అని నోటితో చెప్పడం మాత్రమే కాదు. “జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన [క్రీస్తు] అందరికొరకు మృతిపొందె[ను].” (2 కొరింథీయులు 5:14, 15) కనుక, విమోచన క్రయధనం గురించి మెప్పుదల ఉంటే, అది మన దృక్కోణంపై, లక్ష్యాలపై, జీవనశైలిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ‘తనను తాను మన కొరకు అర్పించుకొన్న క్రీస్తుయేసు’కు మనం అనంతకాలం ఋణపడివున్నామన్న విషయం, మనం ఆయనను గురించీ, ఆయన యొక్క ప్రేమగల తండ్రియైన యెహోవా దేవుని గురించీ మరెక్కువగా తెలుసుకునేందుకు మనలను ప్రేరేపించాలి. మనం విశ్వాసంలో ఎదగాలనీ, ప్రయోజనకరమైన దేవుని ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించాలనీ, “సత్క్రియలయందాసక్తి గల”వారమై ఉండాలనీ కోరుకుంటాం.—తీతు 2:13, 14; యోహాను 17:3.

క్రైస్తవ సంఘమనే మాధ్యమం ద్వారానే మనం ఆధ్యాత్మిక ఆహారాన్నీ ప్రోత్సాహాన్నీ మార్గదర్శనాన్నీ పొందుతాం. (మత్తయి 24:45-47; హెబ్రీయులు 10:21-25) ఉదాహరణకు, ఎవరైనా ఆధ్యాత్మికంగా అనారోగ్యంగా ఉంటే, “అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను.” “విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును” అని కూడా యాకోబు చెబుతున్నాడు.—యాకోబు 5:13-15.

ఉదాహరణకు: దక్షిణ ఆఫ్రికాలోని ఒక జైలులో పని చేస్తున్న ఒక వ్యక్తి, “యేసు క్రీస్తు మొదలు పెట్టిన పనిని, అంటే దేవుని రాజ్యం కోసం శ్రమపడేందుకు ఇతరులకు సహాయపడే మంచి పనిని కొనసాగిస్తున్న యెహోవాసాక్షులనందరినీ” ప్రశంసిస్తూ ఒక సంఘ పెద్దకు ఉత్తరం వ్రాశాడు. “మీ ఉత్తరాన్ని అందుకున్నప్పుడు నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. నా ఆధ్యాత్మిక విడుదల విషయమై మీరు చూపించిన శ్రద్ధ నా హృదయాంతరాళాన్నే స్పృశించింది. మీరు చూపించిన శ్రద్ధ, పశ్చాత్తాపపడమని యెహోవా దేవుడు ఇస్తున్న పిలుపుకు ప్రతిస్పందించడానికి మరింత కారణాన్నిస్తుంది. నేను 27 సంవత్సరాలుగా పాపం, వంచన, చట్టవిరుద్ధమైన సంబంధాలు, అనైతిక అలవాట్లు, సంశయాత్మక మతాలు వంటివాటి అంధకారంలో తొట్రుపడుతున్నాను, దారితప్పి పోయి ఉన్నాను. యెహోవాసాక్షులతో పరిచయమైన తర్వాత, చివరికి సరైన మార్గాన్ని కనుగొన్నానని భావిస్తున్నాను ! ఇక నేను దాన్ని అనుసరించడమే తరువాయి” అని ఆయన ఆ ఉత్తరంలో వ్రాశాడు.

సమీప భవిష్యత్తులో మరెక్కువ సహాయం

“మహా శ్రమల” ఆరంభానికి ముందుండే సంక్లిష్టమైన కాలంలో మనం జీవిస్తున్నామని క్షీణించిపోతున్న లోక పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడే, సమస్త జాతుల్లో నుండి, వంశాల్లో నుండి, జనాంగాల్లో నుండి, భాషల్లో నుండి వచ్చిన ఒక గొప్ప సమూహం ‘గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసు’కొంటోంది. (ప్రకటన 7:9, 13, 14; 2 తిమోతి 3:1-5) యేసు చెల్లించిన విమోచన క్రయధనముపై తమకున్న విశ్వాసానికి అనుగుణ్యంగా జీవించడం ద్వారా, వాళ్ళు తమ పాపములకు క్షమాపణలను పొందుతున్నారు, దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెట్టుకోవడానికి, వాస్తవానికి, ఆయన స్నేహితులు కావడానికి సహాయం పొందుతున్నారు.—యాకోబు 2:23.

గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు “వారికి [మహాశ్రమలను తప్పించుకునేవారికి] కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకును వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతిబాష్పబిందువును తుడిచివేయును.” (ప్రకటన 7:17) అప్పుడు, ప్రధాన యాజకుడుగా క్రీస్తు తన కర్తవ్యాలను పూర్తి చేస్తాడు. దేవుని స్నేహితులందరూ “జీవజలముల బుగ్గల” నుండి ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ప్రయోజనం పొందేందుకు ఆయన సహాయం చేస్తాడు. యేసు, సా.శ. 33 లో మొదలుపెట్టి, పరలోకంలో కొనసాగిస్తున్న పని నెమ్మదిగా పరిపూర్ణమౌతుంది.

కనుక, దేవుడూ, క్రీస్తూ మన కోసం చేసిన, ఇప్పటికీ చేస్తున్న విషయాలన్నింటికీ అత్యంత మెప్పుదలను చూపించడంలో మనం ఎన్నడూ విరమించుకోవద్దు. “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, . . . దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” అని అపొస్తలుడైన పౌలు ఉపదేశిస్తున్నాడు.—ఫిలిప్పీయులు 4:4, 6, 7.

పరలోకంలో ఉన్న మన సహాయకుడైన యేసుక్రీస్తుపై మెప్పుదలను చూపించేందుకు ఒక ప్రాముఖ్యమైన మార్గం ఉంది. 2000 ఏప్రిల్‌ 19, బుధవారం సూర్యాస్తమయం తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని జరుపుకునేందుకు కూడుకుంటారు. (లూకా 22:19) క్రీస్తు చెల్లించిన విమోచన క్రయధనం విషయమై మీకున్న మెప్పుదలను మీరు మరింత అధికం చేసుకునే అవకాశమిది. దేవుడు మన రక్షణ కోసం క్రీస్తు ద్వారా చేసిన అద్భుతమైన ఏర్పాటు నుండి సదాకాలం ఎలా ప్రయోజనం పొందవచ్చో వినేందుకు మీరు కూడా రావాలని ఆప్యాయంగా పిలుస్తున్నాం. ఈ ప్రత్యేక కూటమి ఎక్కడ ఏ సమయంలో జరుగుతుంది అన్నది స్థానిక యెహోవాసాక్షులను అడిగి కనుక్కోండి.

[7వ పేజీలోని చిత్రం]

మానవులు ఎంతో ఆతురతతో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకు ఎలాంటి అనుభూతి ఉంటుందో యేసుకు తెలుసు

[8వ పేజీలోని చిత్రాలు]

మనంతట మనం పరిష్కరించుకోలేని జటిలమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు యేసు మనకు సహాయపడతాడు

[9వ పేజీలోని చిత్రం]

ప్రేమగల పెద్దల ద్వారా క్రీస్తు మనకు సహాయం చేస్తాడు