కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అంతిమ విజయం వైపుకు ముందుకు సాగడం!

అంతిమ విజయం వైపుకు ముందుకు సాగడం!

అంతిమ విజయం వైపుకు ముందుకు సాగడం!

“ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలువెళ్లెను.” ​—⁠ప్రకటన 6:⁠2.

1. యోహాను తాను చూసిన దర్శనంలో, భవిష్యత్తులో జరుగనున్న ఏ సంఘటనలను చూశాడు?

అపొస్తలుడైన యోహాను దైవిక ప్రేరేపణ ద్వారా, దాదాపు 1,800 సంవత్సరాల తర్వాతి భవిష్యత్తును చూసి, క్రీస్తు రాజుగా సింహాసనాసీనుడవ్వడాన్ని వర్ణించగల్గాడు. తాను దర్శనంలో చూసిన విషయాలను నమ్మేందుకు ఆయనకు విశ్వాసం అవసరమయ్యింది. అయితే, ఆనాడు ప్రవచించబడినట్లుగా, 1914 లో క్రీస్తు సింహాసనాసీనుడయ్యాడనేందుకు నేడు మనకు స్పష్టమైన రుజువులున్నాయి. యేసుక్రీస్తు “జయించుచు, జయించుటకు బయలు”దేరడాన్ని విశ్వాస నేత్రాలతో మనం చూడగల్గుతాం.

2. రాజ్యం స్థాపించబడినప్పుడు అపవాది ఎలా ప్రతిస్పందించాడు, అది దేనికి రుజువుగా ఉంది?

2 రాజ్యం స్థాపించబడిన తర్వాత, సాతాను పరలోకం నుండి గెంటివేయబడ్డాడు. దాంతో, ఆయన మరింత తీవ్రంగా, మరింత క్రోధంతో పోరాడనారంభించాడు, కానీ ఆయన విజయమొందే అవకాశాలు ఏ మాత్రం వృద్ధికాలేదు. (ప్రకటన 12:​7-12) ఆయన క్రోధం లోక పరిస్థితులను మరింత క్లిష్టంగా చేసింది. మానవ సమాజం విచ్ఛిన్నమవుతున్నట్లు కనిపిస్తోంది. తమ రాజు ‘జయిస్తూ’ ముందుకు సాగుతున్నాడన్నదానికి ఇది యెహోవాసాక్షులకు స్పష్టమైన రుజువుగా ఉంది.

నూతన లోక సమాజం రూపొందించబడుతోంది

3, 4. (ఎ) రాజ్య స్థాపన మొదలుకొని క్రైస్తవ సంఘంలో, సంస్థాగతమైన ఏ మార్పులు జరిగాయి, అవి ఎందుకు అవసరమయ్యాయి? (బి) యెషయా ప్రవచించినట్లు, ఈ మార్పుల వల్ల ఏ ప్రయోజనాలు కలుగుతున్నాయి?

3 పునఃస్థాపించబడి ఇప్పుడు మరిన్ని రాజ్య బాధ్యతలతోవున్న క్రైస్తవ సంఘాన్ని మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంతో దగ్గరి పోలిక కలిగివుండేలా చేయవలసిన సమయం రాజ్యం స్థాపించబడినప్పుడు వచ్చింది. అందుకే, జూన్‌ 1 మరియు 15, 1938 (ఆంగ్లం) కావలికోట సంచికలు క్రైస్తవ సంస్థ ఎలా పనిచేయాలన్న విషయాన్ని చర్చించాయి. తర్వాత, డిసెంబరు 15, 1971 సంచిక, “చట్టబద్ధమైన కార్పొరేషన్‌కి భిన్నమైన పరిపాలక సభ” అనే ఆర్టికల్‌, ఆధునిక పరిపాలక సభ గురించి మరింత స్పష్టంగా తెలియజేసింది. 1972 లో, స్థానిక సంఘాలకు సహాయాన్నీ నిర్దేశాన్నీ ఇచ్చేందుకు పెద్దల సభలు నియమించబడ్డాయి.

4 సరైన పైవిచారణను పునఃస్థాపించడంతో క్రైస్తవ సంఘం చాలా బలపరచబడింది. పెద్దలకు న్యాయనిర్ణయ విషయాల్లో తర్ఫీదునివ్వడంతో సహా, వారి కర్తవ్యాలను గురించి ఉపదేశించేందుకు పరిపాలక సభ చేసిన ఏర్పాట్లు కూడా క్రైస్తవ సంఘం బలం పుంజుకునేందుకు తోడ్పడ్డాయి. దేవుని భూ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన క్రమానుగతమైన అభివృద్ధుల గురించి, వాటి వల్ల కలిగిన మంచి ఫలితాల గురించి యెషయా 60:17 లో, “నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను” అని ప్రవచించబడింది. ఈ మంచి మార్పులు దైవిక ఆశీర్వాదాన్ని ప్రతిబింబించి, దేవుని రాజ్యానికి బహిరంగంగా అత్యంతాసక్తితో మద్దతునిచ్చినవారికి దేవుని ఆమోదముందనే దానికి రుజువునిచ్చాయి.

5. (ఎ) తన ప్రజలను యెహోవా ఆశీర్వదిస్తున్నందుకు సాతాను ఎలా ప్రతిస్పందించాడు? (బి) ఫిలిప్పీయులు 1:7కు అనుగుణంగా, సాతాను క్రోధానికి యెహోవా ప్రజలు ఎలా ప్రతిస్పందించారు?

5 రాజ్య స్థాపన తర్వాత, దేవుడు తన ప్రజలపై చూపిన ప్రేమపూర్వకమైన శ్రద్ధా, ఇచ్చిన నడిపింపూ సాతాను దృష్టిలో పడకుండా పోలేదు. ఉదాహరణకు, 1931 లో క్రైస్తవుల ఒక చిన్న గుంపు, తాము కేవలం బైబిలు విద్యార్థులం మాత్రమే కాదని బహిరంగంగా ప్రకటించారు. యెషయా 43:​10 చెబుతున్నదాని ప్రకారం వాళ్ళు యెహోవాసాక్షులు! యాదృచ్చికంగా అయితేనేమి, మరే విధంగా అయితేనేమి, అపవాది, భూగోళవ్యాప్తంగా మునుపెన్నడూ జరగనంత హింసాకాండను చెలరేగించాడు. మత స్వాతంత్ర్యానికి పేరుగాంచిన, అమెరికా, కెనడా, జర్మనీ వంటి దేశాల్లో సహితం, యెహోవాసాక్షులు తమ ఆరాధనా స్వాతంత్ర్యాన్ని కాపాడుకునేందుకు మళ్ళీ మళ్ళీ చట్టపరంగా పోరాడవలసి వచ్చింది. 1988వ సంవత్సరానికల్లా, అమెరికా సుప్రీం కోర్టు, యెహోవాసాక్షులు ఇమిడివున్న 71 కేసులను పునర్విచారించి, మూడింట రెండువంతులకు అనుకూలమైన తీర్పు విధించింది. మొదటి శతాబ్దంలోలాగే, నేడూ, ‘సువార్తపక్షమున వాదించి, దానిని చట్టబద్ధంగా స్థిరపరచడం’ సాధ్యమయ్యేలా ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైన పోరాటాలు జరుగుతునే ఉంటాయి.​—⁠ఫిలిప్పీయులు 1:⁠7, NW.

6. యెహోవా ప్రజలు ముందుకు సాగకుండా నిషేధాలుగానీ ఆంక్షలుగానీ ఆపాయా? వివరించండి.

6 రెండవ ప్రపంచ యుద్ధానికి ముందటి సంవత్సరాల్లో అంటే 1930లలో, నిరంకుశ ప్రభుత్వాలు, యెహోవాసాక్షుల పనిపై నిషేధాలనూ ఆంక్షలనూ విధించాయి. జర్మనీ, స్పెయిన్‌, జపాన్‌ దేశాల్లో కూడా అలాగే జరిగింది. 2000వ సంవత్సరంలో, దేవుని రాజ్యాన్ని చురుగ్గా ప్రకటించే ప్రచారకులు ఈ మూడు దేశాల్లోనే మొత్తం దాదాపు 5,00,000 మంది ఉన్నారు. ఆ సంఖ్య 1936 లో, మొత్తం ప్రపంచంలో ఉన్న సాక్షుల సంఖ్య కన్నా పదిరెట్లు ఎక్కువ! అజేయుడైన తమ నాయకుడైన యేసుక్రీస్తు నేతృత్వంలో ముందుకు సాగుతున్న యెహోవా ప్రజలను నిషేధాలుగానీ ఆంక్షలు గానీ ఆపలేవన్నది స్పష్టం.

7. గమనార్హమైన ఏ సంఘటన 1958 లో జరిగింది, అప్పటి నుండి ఎటువంటి గొప్ప మార్పు కనిపించింది?

7 యెహోవాసాక్షులు అంతకు ముందెన్నడూ జరుపుకోనంత పెద్ద సమావేశంలో, అంటే 1958 లో, న్యూయార్క్‌ నగరంలో జరిగిన దైవిక చిత్తం అనే అంతర్జాతీయ సమావేశం వారు ముందుకు సాగుతున్నారనడానికి గొప్ప రుజువుగా ఉంది. ఆ సమావేశానికి మొత్తం 2,53,922 మంది హాజరయ్యారు. 1970వ సంవత్సరం వచ్చేసరికి, తూర్పు జర్మనీ అని పిలువబడిన ప్రాంతంలో తప్ప, పైన పేర్కొన్న మూడు దేశాల్లో వాళ్ళ పని ప్రారంభమైంది. కానీ విస్తారమైన సోవియట్‌ యూనియన్‌లోను, వార్సా సంధిలోని దాని మిత్ర దేశాల్లోను ఉన్న సాక్షులు అప్పటికీ నిషేధం క్రిందే ఉన్నారు. ఈ మాజీ కమ్యూనిస్ట్‌ దేశాల్లో నేడు, ఐదు లక్షల కన్నా ఎక్కువ మంది చురుకైన సాక్షులున్నారు.

8. తన ప్రజలపై యెహోవా ఆశీర్వాదమున్నందువల్ల ఏ ఫలితం కనిపిస్తోంది, 1950 లోని కావలికోట దాని గురించి ఏమని చెప్పింది?

8 యెహోవాసాక్షులు “రాజ్యమును [దేవుని] నీతిని మొదట వెదక”డంలో కొనసాగారు కనుక, సంఖ్యలో పెరుగుతూ ఆశీర్వదించబడ్డారు. (మత్తయి 6:​33) “ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును” అని చెబుతున్న యెషయా ప్రవచనం ఇప్పటికే అక్షరార్థంగా నెరవేరింది. (యెషయా 60:​22) ఆ పెరుగుదల అంతటితో ఆగిపోలేదు. కేవలం గత దశాబ్దంలోనే, క్రొత్తగా 17,50,000 మంది దేవుని రాజ్య పరిపాలనను గురించి ప్రకటించనారంభించారు. 1950 లోని (ఆంగ్లం) కావలికోట వ్యాఖ్యానించిన గుంపులో వీరు స్వచ్ఛందంగా భాగమయ్యారు. “దేవుడు, ఇప్పుడు నూతన లోక సమాజాన్ని సిద్ధం చేస్తున్నాడు. . . . కేంద్రకంగా ఉండే ఈ సమాజం అర్మగిద్దోనును దాటుతుంది, . . . ‘క్రొత్త భూమి’ మీద చురుగ్గా మొదట ఇదే కనిపిస్తుంది . . . ఇది దైవపరిపాలనా పద్ధతిలో సంఘటితపర్చబడి ఉంది, ఇది సంస్థీకరించే పద్ధతులు ఎరిగివుంది” అని ఆ కావలికోట వర్ణించింది. “కాబట్టి పదండి, మనమందరమూ నూతన లోక సమాజంగా స్థిరంగా కలిసి ముందుకు వెళ్దాం!” అంటూ ఆ ఆర్టికల్‌ ముగిసింది.

9. అనేక సంవత్సరాలుగా యెహోవాసాక్షులు నేర్చుకున్న విషయాలు ప్రయోజనకరమైనవని ఎలా నిరూపించబడ్డాయి?

9 ఈ మధ్యకాలంలో, అంతకంతకూ పెరుగుతున్న ఈ నూతన లోక సమాజం, కార్యాలను చక్కగా ఫలప్రదంగా నిర్వహించే నైపుణ్యాన్ని సంపాదించుకుంది, ఆ నైపుణ్యం నేడు ఎంతో విలువైనదని నిరూపించబడుతోంది, అది అర్మగిద్దోను తర్వాతి పునఃస్థాపనలో కూడా ఉపకరిస్తుండవచ్చు. ఉదాహరణకు, వారు పెద్ద పెద్ద సమావేశాలను ఏర్పాటు చేయడము, అత్యవసర పరిస్థితుల్లో కావలసిన సహాయాన్ని అందించడము, కట్టడాలను వేగంగా నిర్మించడము నేర్చుకున్నారు. యెహోవాసాక్షుల్లోని ఈ చురుకుతనం అనేకులు వారిని ప్రశంసా భావంతో, గౌరవ భావంతో దృష్టించేందుకు కారణమైంది.

తప్పుడు అభిప్రాయాలను సరిచేయడం

10, 11. యెహోవాసాక్షులను గురించిన తప్పుడు అభిప్రాయాలు ఎలా సరిచేయబడ్డాయో సోదాహరణంగా చెప్పండి.

10 అయినప్పటికీ, యెహోవాసాక్షులు మానవ సమాజానికి భిన్నంగా ఉన్నారని ఆరోపించే ప్రజలు కూడా ఉన్నారు. దీనికి ముఖ్య కారణం- రక్తమార్పిడులు, తటస్థ వైఖరి, పొగత్రాగడం, నైతిక విలువలు మొదలైన విషయాల్లో సాక్షులు బైబిలు ఆధారిత దృక్కోణాన్ని కలిగివుండడమే. కానీ సాక్షుల దృక్పథాలు ఆలోచించదగినవేనని ఒప్పుకునేవారి సంఖ్య నానాటికి పెరగడం మొదలైంది. ఉదాహరణకు, పోలాండ్‌లోని ఒక డాక్టరు యెహోవాసాక్షుల నిర్వహణా కార్యాలయానికి ఫోన్‌ చేసి, తాను, ఆసుపత్రిలోని తన తోటి ఉద్యోగులూ రక్త మార్పిడులను గురించి అనేక గంటలు చర్చించుకున్నామని చెప్పింది. ఆ రోజు జాన్నీక్‌ జాహోడ్నీ అనే పోలాండ్‌ దినపత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్‌ని చూసినప్పుడు వాళ్ళ మధ్య చర్చ మొదలైంది. “వైద్య రంగంలో, రక్తం అవసరానికి మించి ఉపయోగించబడుతున్నందుకు నేను విచారిస్తున్నాను” అని ఆ వైద్యురాలు ఒప్పుకుంది. “ఈ ధోరణి మారాలి. ఎవరో ఒకరు ఈ విషయాన్ని చర్చించనారంభించినందుకు సంతోషిస్తున్నాను. మరింత సమాచారం కావాలని కోరుకుంటున్నాను” అని కూడా ఆమె అంది.

11 రక్తం ఉపయోగించకుండానే రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులకు సహాయపడేలా రూపొందించబడిన సమాచారాన్ని, గత సంవత్సరం స్విట్జర్లాండ్‌లో జరిగిన ఒక సదస్సులో, అమెరికా, ఇజ్రాయేల్‌, కెనడా, యూరప్‌ల నుండి వచ్చిన వైద్య అధికారులు చర్చించారు. చాలామంది అనుకుంటున్నదానికి భిన్నంగా, వాస్తవానికి, మరణ రేటు రక్తం ఎక్కించుకోని రోగుల్లో కన్నా ఎక్కించుకున్న రోగుల్లో ఎక్కువగా ఉందని ఆ సదస్సులో సూచించబడింది. సాధారణంగా సాక్షులైన రోగులు, రక్తం ఎక్కించుకున్న రోగుల కన్నా చాలా ముందే ఆసుపత్రి నుండి వెళ్ళిపోగల్గుతున్నారు. ఆ విధంగా చికిత్సకయ్యే ఖర్చు సాధారణంగా తగ్గుతుంది.

12. రాజకీయాల్లో యెహోవాసాక్షులు చూపించిన తటస్థ వైఖరిని ప్రముఖులు ఎలా మెచ్చుకున్నారన్నదానికి ఉదాహరణ ఇవ్వండి.

12 యెహోవాసాక్షులు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందూ, అది జరుగుతున్నప్పుడూ నాజీల దాడిని తట్టుకుని నిలిచి చూపిన తటస్థ వైఖరి గురించి కూడ అనేకమైన మెచ్చుకోలు వ్యాఖ్యానాలు వచ్చాయి. యెహోవాసాక్షులు నాజీ దాడికి వ్యతిరేకంగా దృఢంగా నిలిచారు (ఆంగ్లం) అనే వీడియోను యెహోవాసాక్షులు తయారు చేసి, సముచితంగానే 1996, నవంబరు 6న జర్మనీలోని రావెన్స్‌బ్రూక్‌ కాన్సంట్రేషన్‌ క్యాంపులో మొదటిసారి ప్రదర్శించినప్పుడు, అనేకులు ప్రశంసా వ్యాఖ్యలను చేశారు. 1998, ఏప్రిల్‌ 18న బెర్గన్‌-బెల్జన్‌లోని అపఖ్యాతిగాంచిన ఒక కాన్సంట్రేషన్‌ క్యాంపులో కూడా దానిని ప్రదర్శించినప్పుడు, “నేషనల్‌ సోషలిజంని క్రైస్తవ చర్చీల కన్నా, చాలా దృఢ నిశ్చయంతో, యెహోవాసాక్షులే తిరస్కరించారన్నది చరిత్రలోని కలతపరచే వాస్తవాల్లో ఒకటి . . . యెహోవాసాక్షుల బోధల గురించి మతాసక్తిని గురించి మనమెలా భావించినా, నాజీ పరిపాలనా కాలంలో వాళ్ళు చూపిన స్థైర్యానికి వాళ్ళను గౌరవించవలసిందే” అని లోవర్‌ సాక్సనీలోని సెంటర్‌ ఫర్‌ పొలిటికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరైన డా. వూల్ఫ్‌గ్యాంగ్‌ షీల్‌ ఒప్పుకున్నాడు.

13, 14. (ఎ) ఎదురుచూడని ఎవరినుండి తొలిక్రైస్తవుల పక్షాన న్యాయబద్ధమైన అభిప్రాయం వెలువడింది? (బి) నేడు దేవుని ప్రజల పక్షంగా అనుకూలమైన వ్యాఖ్యలు వచ్చిన ఉదాహరణలను ఇవ్వండి.

13 వివాదాస్పద విషయాల్లో యెహోవాసాక్షులకు అనుకూలంగా ప్రముఖులు మాట్లాడడం, లేదా కోర్టు తీర్పులు రావడం, సాక్షుల మీదున్న అకారణమైన దురభిప్రాయాలను తొలగించి, వారిని మరింత అనుకూల దృక్పథంతో దృష్టించేలా చేస్తుంది. ఇది మునుపెన్నడూ సువార్తను వినడానికి ఇష్టపడని వారితో మాట్లాడే అవకాశాన్నిస్తుంది. కనుక, ప్రముఖులు అలా మాట్లాడడం లేదా అనుకూలమైన తీర్పులు రావడం ప్రోత్సాహకరమైన విషయాలే, యెహోవాసాక్షులు వాటికి నిజంగానే విలువిస్తారు. యెరూషలేములో మొదటి శతాబ్దంలో జరిగిన విషయాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. క్రైస్తవులు ఆసక్తిగా ప్రకటిస్తున్నందువల్ల యూదుల ఉన్నత న్యాయస్థానమైన మహా సభ, వారిని చంపాలనుకున్నప్పుడు, “ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్త సుమండి. . . . ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ” అని “సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన” గమలీయేలు హెచ్చరించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 5:33-39.

14 గమలీయేలులాగే, కొందరు ప్రముఖులు ఇటీవల యెహోవాసాక్షుల మతస్వాతంత్ర్యాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఉదాహరణకు, “ఒక మతం నమ్మకాలు అంగీకరించరానివని, సాంప్రదాయకం కానివని సమాజం దృష్టించినంత మాత్రాన, ఆ మతానికున్న మతపరమైన హక్కులను నిషేధించకూడదు” అని ఇంటర్నేషనల్‌ అకాడమీ ఫర్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ రిలీజియన్‌ అండ్‌ బిలీఫ్‌ ఛైర్మన్‌ వాదించాడు. మత తెగలు అని పిలువబడుతున్నవాటి గురించి పరిశోధించేందుకు రూపొందిన ఒక జర్మన్‌ ప్రభుత్వ కమిషన్‌ను గురించి లైప్‌జిగ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రీయ మత అధ్యయన ప్రొఫెసర్‌ ప్రాముఖ్యమైన ఒక ప్రశ్నను లేవదీస్తూ, “అల్పసంఖ్యాక మతాలు మాత్రమే ఎందుకు పరిశీలించబడాలి, పెద్ద చర్చీలను [రోమన్‌ క్యాథలిక్‌ చర్చి, లూథరన్‌ చర్చి] ఎందుకు పరిశీలించనక్కర్లేదు?” అని అడిగాడు. దానికి జవాబు ఒక మాజీ జర్మన్‌ అధికారి వ్రాసిన మాటల్లో లభిస్తుంది. “ప్రభుత్వం ఈ కమిషన్‌ జారీ చేసేందుకు తెర వెనుక రాజకీయ వ్యవస్థపై చర్చి ప్రభావం చూపి ఉంటుందనడంలో సందేహం లేదు” అని ఆయన వ్రాశాడు.

ఉపశమనం కోసం మనం ఎవరి వైపుకు చూస్తాము?

15, 16. (ఎ) గమలీయేలు చర్య చాలా పరిమితమైన ప్రభావాన్నే ఎందుకు చూపింది? (బి) పలుకుబడివున్న మరో ముగ్గురు వ్యక్తులు యేసుకు చాలా పరిమితమైన మేలునే ఎందుకు చేయగల్గారు?

15 దైవిక మద్దతుగల పని విఫలమయ్యే సాధ్యతలేదన్న వాస్తవాన్ని గమలీయేలు చెప్పిన మాటలు నొక్కిచెబుతున్నాయి. ఆయన మహా సభకు చెప్పిన మాటల నుండి తొలి క్రైస్తవులు నిస్సందేహంగా ప్రయోజనం పొందారు. అయితే, తన అనుచరులు హింసించబడతారని యేసు చెప్పిన మాటలు కూడా నిజమని వాళ్ళు మరవలేదు. గమలీయేలు చర్య, వాళ్ళను చంపాలన్న మతనాయకుల తలంపులకు కళ్ళెం వేసినప్పటికీ, వాళ్ళు హింసకు గురికాకుండా ఆపలేకపోయింది. కాబట్టే, “వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి​—⁠యేసు నామమునుబట్టి బోధింప కూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి” అని మనం చదువుతాం.​—⁠అపొస్తలుల కార్యములు 5:⁠40.

16 యేసు విచారణలో ఉన్నప్పుడు, ఆయనలో ఏ తప్పిదమూ కనిపించక ఆయనను విడుదల చేయాలని పొంతి పిలాతు ప్రయత్నించాడు. కానీ ఆయన విఫలుడయ్యాడు. (యోహాను 18:​37-39; 19:​4, 6, 12-16) మహా సభలోని సభ్యులైన నీకొదేము, అరిమతయియ యోసేపులు యేసుకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆ సభ యేసుకు వ్యతిరేకంగా తీర్పు విధించడాన్ని నివారించే స్థితిలో వాళ్ళు లేరు. (లూకా 23:​50-52; యోహాను 7:​45-52; 19:​38-40) మానవులు యెహోవా ప్రజలను ఏ ఉద్దేశంతో సమర్థించినా, వారు ఇవ్వగల ఉపశమనానికి పరిమితి ఉంది. లోకం క్రీస్తును ద్వేషించినట్లే, క్రీస్తు యొక్క నిజమైన అనుచరులను కూడా ద్వేషిస్తూనే ఉంటుంది. సంపూర్ణమైన ఉపశమనం యెహోవా నుండి మాత్రమే రాగలదు.​—⁠అపొస్తలుల కార్యములు 2:⁠24.

17. యెహోవాసాక్షులకు వాస్తవికమైన ఏ దృక్కోణముంది, అయినప్పటికీ, సువార్తను ప్రకటించడంలో కొనసాగాలన్న తమ దృఢ నిశ్చయం ఎందుకు సడలిపోదు?

17 హింస కొనసాగుతుందనే వాస్తవిక దృష్టితో యెహోవాసాక్షులు భవిష్యత్తువైపు చూస్తారు. సాతాను విధానం చివరికి ఓటమి పాలైనప్పుడు మాత్రమే వ్యతిరేకత ఆగుతుంది. హింస అసంతోషకరమైనదే అయినప్పటికీ, రాజ్యాన్ని ప్రకటించమని తమకివ్వబడిన ఆదేశాన్ని సాక్షులు శిరసావహించకుండా అది ఆపదు. వాళ్ళకు దైవిక మద్దతుండగా అది వాళ్ళనెందుకు ఆపాలి? వాళ్ళు తమ సరైన మాదిరిగా ధైర్యవంతుడైన తమ నాయకుడైన యేసుక్రీస్తు వైపుకు చూస్తారు.​—⁠అపొస్తలుల కార్యములు 5:​17-21, 27-32.

18. యెహోవా ప్రజలకు ఇంకా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వేచివుంది, కానీ చివరికి ఏమి జరుగుతుందన్న నమ్మకం వాళ్ళకుంది?

18 నిజమైన మతం మొదటి నుండీ బలమైన వ్యతిరేకతను ఎదుర్కుంటోంది. తాను పరలోకం నుండి గెంటివేయబడినది మొదలుకొని అతి నీచస్థాయిలో ఉన్న సాతాను అయిన గోగు త్వరలోనే నిజమైన మతంపై శాయశక్తులా దాడి చేస్తాడు. కానీ నిజమైన మతం దాన్ని తాళుకుని నిలుస్తుంది. (యెహెజ్కేలు 38:14-16) “లోకమంతట ఉన్న రాజు[లు]” సాతాను నడిపింపు క్రింద, “గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందున . . . ఆయన ఆ రాజులను జయించును.” (ప్రకటన 16:​14; 17:​14) అవును, మన రాజు అంతిమ విజయం వైపుగా ముందుకు సాగుతున్నాడు, ఆయన త్వరలో ‘జయిస్తాడు.’ ‘దేవుడు మన పక్షమున ఉన్నాడు’ అని యెహోవా ఆరాధకులు చెప్పినప్పుడు ఎవరూ ఎన్నడూ ఎదురుచెప్పని కాలం త్వరలో వస్తుందని తెలుసుకుని, ఆయనతోపాటు ముందుకు సాగిపోవడం ఎంతటి ఆధిక్యత!​—⁠రోమీయులు 8:31; ఫిలిప్పీయులు 1:27, 28.

మీరు వివరించగలరా?

• రాజ్యం స్థాపించబడినది మొదలుకొని, క్రైస్తవ సంఘాన్ని బలపరచేందుకు యెహోవా ఏమి చేశాడు?

• క్రీస్తు జయించకుండా అడ్డగించాలనే ప్రయత్నంలో సాతాను ఏమి చేశాడు, దాని వల్ల కలిగిన ఫలితాలేమిటి?

• సాక్షేతరులు అనుకూలంగా ప్రవర్తించినప్పటికీ మనం ఎలాంటి సమతుల్యమైన దృక్పథాన్ని కలిగివుండాలి?

• త్వరలోనే సాతాను ఏమి చేస్తాడు, దాని పర్యవసానం ఏమై ఉంటుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రం]

యెహోవా ప్రజలు ముందుకు సాగిపోతున్నారన్నదాన్ని సమావేశాలు వెల్లడి చేస్తున్నాయి

[20వ పేజీలోని చిత్రాలు]

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సాక్షులు ప్రదర్శించిన తటస్థ వైఖరి ఇప్పటికీ యెహోవాకు స్తుతులను తీసుకువస్తుంది.