కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనందభరితులైన కోత పనివారిగా ఉండండి!

ఆనందభరితులైన కోత పనివారిగా ఉండండి!

ఆనందభరితులైన కోత పనివారిగా ఉండండి!

“కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొను[డి].”​—⁠మత్తయి 9:37,38.

1. దేవుని చిత్తాన్ని చేస్తూ కొనసాగడానికి మనకు ఏమి సహాయం చేస్తుంది?

యెహోవాకు సేవకులుగా బాప్తిస్మం పొందిన రోజును మనం జ్ఞాపకం చేసుకుంటే, అది నిన్న మొన్న జరిగినట్లుగా అనిపిస్తుంది. నిజానికి అది కొన్ని సంవత్సరాల క్రితం లేదా కొన్ని దశాబ్దాల క్రితం జరిగివుండవచ్చు. అప్పటి నుండి, మన సమర్పిత జీవితంలో యెహోవాను స్తుతించడం అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. మనం మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఇతరులు రాజ్య సందేశాన్ని విని స్వీకరించడంలో వారికి సహాయం చేస్తుండగా యెహోవాకు ఆనందభరిత హృదయంతో సేవ చేయడమే మన ప్రధాన లక్ష్యంగా మారింది. (ఎఫెసీయులు 5:​15,16) నేటికీ, మనం “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై” ఉంటూ ఉండగా సమయం చాలా త్వరగా గడిచిపోతున్నట్లు అనిపిస్తుంది. (1 కొరింథీయులు 15:​58) సమస్యలు ఎదురౌతున్నా, యెహోవా చిత్తాన్ని జరిగించడంలో మనకు లభించే ఆనందం మనలో చైతన్యాన్ని కలిగిస్తుంది.​—⁠నెహెమ్యా 8:⁠10.

2. సూచనార్థక కోతపనిలో మనం అనుభవించే ఆనందానికి ఏమి దోహదపడుతుంది?

2 క్రైస్తవులుగా మనం సూచనార్థక కోతపనిలో ఉన్నాము. నిత్య జీవం ఇవ్వడానికి వ్యక్తులను సమకూర్చే పనిని యేసుక్రీస్తు కోతపనితో పోల్చాడు. (యోహాను 4:​35-38) మనం అలాంటి కోతపనిలో పాల్గొంటున్నాము గనుక, కోతపనివారిగా తొలి క్రైస్తవులు అనుభవించినటువంటి ఆనందాన్ని పరిశీలించడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేటి కోతపనిలో మనం ఆనందించడానికి దోహదపడే మూడు కారకాలను పరిశీలిద్దాం. అవి, (1)మన నిరీక్షణా సందేశం, (2)మన అన్వేషణా విజయం, (3)కోతపనివారిగా శాంతిని నెలకొల్పే మన ప్రయత్నాలు.

కోతపనివారిగా మనం పంపించబడ్డాం

3. యేసు యొక్క తొలి అనుచరులు ఏ విధంగా ఆనందాన్ని అనుభవించారు?

3 తొలికాలాల్లోని కోతపనివారి జీవితాలు​—⁠ప్రత్యేకంగా యేసు యొక్క విశ్వసనీయులైన 11 మంది అపొస్తలుల జీవితాలు​—⁠సా.శ. 33వ సంవత్సరంలోని ఒక రోజు, పునరుత్థానుడైన క్రీస్తును చూడడానికి గలిలయలో వారొక కొండమీదికి వెళ్ళినప్పుడు ఎంతగా మారిపోయాయో కదా! (మత్తయి 28:​16) ఆసందర్భంలో బహుశ “ఐదు వందలకు ఎక్కువైన సహోదరు[లు]” హాజరైవుంటారు. (1 కొరింథీయులు 15:⁠6) యేసు ఇచ్చిన ఆదేశం వారి చెవుల్లో మారుమ్రోగింది. ఆయన వారికిలా చెప్పాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:​19,20) విపరీతమైన హింసలు వచ్చినప్పటికీ క్రీస్తు అనుచరుల సంఘాలు ఒక్కొక్క ప్రాంతంలో స్థాపించబడుతుండగా వారు కోతపనిలో ఎంతో ఆనందాన్ని అనుభవించారు. కొద్దికాలానికి ‘ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి సువార్త ప్రకటింపబడుతూ ఉంది.’​—⁠కొలొస్సయులు 1:​23; అపొస్తలుల కార్యములు 1:⁠8; 16:⁠5.

4. క్రీస్తు శిష్యులు ఎటువంటి పరిస్థితుల్లో కోత నిమిత్తం పంపించబడ్డారు?

4 గలిలయలోని తన పరిచర్యలో యేసు మునుపు ఒకసారి, 12 మంది అపొస్తలులను పిలిచి ప్రత్యేకంగా, “పరలోకరాజ్యము సమీపించి యున్నదని” ప్రకటించేందుకు వారిని పంపించాడు. (మత్తయి 10:​1-7) ఆయన తానుగా “వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుచు, [గలిలయలోని] సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారముచే[శాడు].” జనసమూహాలు “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున” యేసు వారిపై కనికరపడ్డాడు. (మత్తయి 9:​35,36) అప్పుడాయన విచలితుడై తన శిష్యులతో ఇలా అన్నాడు: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని [యెహోవా దేవుణ్ణి] వేడుకొను[డి].” (మత్తయి 9:​37,38) తన భూపరిచర్య ముగియడానికి ఇంకా ఆరు నెలలు మాత్రమే ఉన్నప్పుడు కూడా, యూదయలోని కోతపనివారి అవసరం విషయమై యేసు మళ్ళీ అదే వ్యాఖ్యానాన్ని చేశాడు. (లూకా 10:⁠2) పై రెండు సందర్భాల్లోను ఆయన తన శిష్యులను కోతపనివారిగా పంపించాడు.​—⁠మత్తయి 10:⁠5; లూకా 10:⁠3.

మన నిరీక్షణా సందేశం

5. మనం ఎటువంటి సందేశాన్ని ప్రకటిస్తాము?

5 యెహోవా యొక్క ఈనాటి సేవకులుగా మనం కోతపనివారి కోసమైన పిలుపుకు ఆనందంగా ప్రతిస్పందిస్తాము. మన ఆనందానికి ఎంతగానో దోహదపడే ఒక కారకం ఏమిటంటే, మనం ఖిన్నహృదయులకూ, క్రుంగినవారి దగ్గరికీ ఒక నిరీక్షణా సందేశాన్ని తీసుకువెళ్తాం. మొదటి శతాబ్దంలోని యేసు శిష్యుల్లానే మనమూ “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్న” ప్రజలకు ఒక సువార్తను​—⁠ఒక నిజమైన నిరీక్షణా సందేశాన్ని ప్రకటించే ఆధిక్యతను కలిగివుండడం ఎంత గొప్పదో కదా!

6. మొదటి శతాబ్దంలో అపొస్తలులు ఏపనిలో నిమగ్నమైవున్నారు?

6 మొదటి శతాబ్దం మధ్య భాగానికల్లా అపొస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఆయన చేసే కోత పని తప్పకుండా ప్రభావవంతంగా ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే దాదాపు సా.శ.55వ సంవత్సరంలో కొరింథులోని క్రైస్తవులకు వ్రాస్తూ ఆయనిలా అన్నాడు: “సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు.” (1 కొరింథీయులు 15:​1,2) అపొస్తలులు, మరితర తొలి క్రైస్తవులు ఎంతో శ్రమించే కోతపనివారిగా ఉన్నారు. యెరూషలేము నాశనానికి ముందటి సంవత్సరాల్లోని ఉత్తేజభరితమైన సంఘటనల కాలంలోనూ, చివరికి సా.శ. 70 లో అది నాశనమైనప్పుడూ ఎంతమంది అపొస్తలులు సజీవంగా ఉన్నారో బైబిలు మనకు చెప్పకపోయినా, అపొస్తలుడైన యోహాను అటుతర్వాత 25 సంవత్సరాల తర్వాత కూడా సజీవంగా ఉన్నాడని మాత్రం మనకు తెలుసు.​—⁠ప్రకటన 1:⁠9.

7, 8. మునుపటికన్నా ఎక్కువ అత్యవసర భావంతో యెహోవా సేవకులు ఏనిరీక్షణా సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నారు?

7 అప్పుడు వచ్చింది, శతాబ్దాలపాటు నిలిచిన క్రైస్తవమత సామ్రాజ్యపు పాదిరీల వర్గం; అదే మతభ్రష్టమైన “పాపపురుషుడు” అని పిలువబడింది. (2 థెస్సలొనీకయులు 2:⁠3) అయితే, 19వ శతాబ్దం చివర్లో ప్రాథమిక క్రైస్తవత్వానికి అనుగుణంగా తమ జీవితాలను మలచుకోవడానికి కృషి చేసినవారు నిరీక్షణా సందేశాన్ని చేపట్టి రాజ్యం గురించి ప్రకటించడం ప్రారంభించారు. చెప్పాలంటే, ఈపత్రిక తొలి సంచిక (1879 జూలై) నుండి దీని పేరులో “క్రీస్తు ప్రత్యక్షతను ప్రకటిస్తోంది,” “క్రీస్తు రాజ్యాన్ని ప్రకటిస్తోంది,” లేక “యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది” అనే మాటలు కూడా భాగమైవున్నాయి.

8 యేసుక్రీస్తు రాజుగా దేవుని పరలోక రాజ్యం 1914 లో స్థాపించబడింది, మనమిప్పుడు నిరీక్షణా సందేశాన్ని మునుపటికంటె ఎక్కువ అత్యవసర భావంతో ప్రకటిస్తున్నాం. ఎందుకని? ఎందుకంటే, రాజ్య పరిపాలన సాధించే మంచి విషయాల్లో ఎంతో సమీపంలో ఉన్న ప్రస్తుత దుష్ట విధానాంతము కూడా ఉంది. (దానియేలు 2:​44) అంతకన్నా మంచి సందేశం ఏముంటుంది? “మహా శ్రమ” విరుచుకుపడడానికి ముందే మనం రాజ్యాన్ని ప్రకటించడంలో భాగం వహించడం కన్నా గొప్ప ఆనందం ఏముంటుంది?​—⁠మత్తయి 24:​20,21; మార్కు 13:⁠10.

విజయవంతమైన అన్వేషణ

9. యేసు తన శిష్యులకు ఏ ఆదేశాన్నిచ్చాడు, రాజ్య సందేశానికి ప్రజలు ఎలా ప్రతిస్పందించారు?

9 కోతపనివారిగా మన ఆనందానికి దోహదపడే మరో కారకం, శిష్యులుగా తయారై, మనతోపాటు కోతపనిలో పాల్గొనబోయేవారి కోసం చేసే అన్వేషణలో విజయం సాధించడమే. వెనుకటికి సా.శ. 31-32 సంవత్సరాల్లో యేసు తన శిష్యులకు ఇలా ఆదేశించాడు: “మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచే[యండి].” (మత్తయి 10:​11) రాజ్య సందేశం పట్ల ఆయా వ్యక్తుల ప్రతిస్పందనే చూపిస్తున్నట్లుగా అందరూ యోగ్యులు కారు. అయినప్పటికీ, యేసు శిష్యులు అత్యంతాసక్తితో ప్రజలెక్కడ కన్పించినా వారికి సువార్తను ప్రకటించారు.

10. పౌలు యోగ్యులైన వారికోసం తన అన్వేషణను ఎలా కొనసాగించాడు?

10 యేసు మరణ పునరుత్థానాల తరువాత యోగ్యులైన వారి కోసం అన్వేషణ మరింత తీవ్రతతో కొనసాగింది. పౌలు యూదుల సమాజమందిరాల్లో యూదులతోను, ఏథెన్సులోని సంతవీధిలో తనను కలుసుకునే వారితోను తర్కించాడు. పౌలు ఆగ్రీకు పట్టణంలోని అరియొపగు వద్ద సాక్ష్యమిచ్చినప్పుడు “కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.” పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆయన “బహిరంగముగాను ఇంటింటను” ప్రకటించడంలో మాదిరికరంగా కూడా ఉన్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 17:​17,34; 20:⁠20.

11. చాలా సంవత్సరాల క్రితం పరిచర్యను నిర్వర్తించడానికి ఎటువంటి పద్ధతులు ఉపయోగించబడ్డాయి?

11 అభిషిక్త క్రైస్తవులు 19వ శతాబ్దపు చివరి దశకాల్లో యోగ్యులైన వారికోసం చాలా ధైర్యంగా అన్వేషించడం కొనసాగించారు. “ప్రకటించడానికి అభిషిక్తం” అనే పేరుగల శీర్షికతో వెలువడిన ఒక ఆర్టికల్‌లో జాయిన్స్‌ వాచ్‌ టవర్‌ యొక్క జూలై/ఆగస్టు 1881 సంచిక ఇలా అన్నది: “సువార్త ప్రకటన ... ‘సాత్వికులను’ చేరుతోంది​—⁠వారిలో నుండి క్రీస్తు శరీరంగా రూపొందే వారిని, తోటి వారసులయ్యే వారిని వృద్ధి చేయడానికి వినగల వారిని, వినడానికి సుముఖత చూపే వారిని సువార్త ప్రకటన చేరుతోంది.” ప్రజలు చర్చికి హాజరై బయటికి వస్తుండగా దేవుని కోతపనివారు తరచు వారిని కలిసి, యోగ్యులైన వారిలో అనుకూల ప్రతిస్పందనను రేకెత్తించడానికి తయారు చేయబడిన లేఖనాధారిత సందేశాలున్న కరపత్రాలను వారికిచ్చారు. ఈపద్ధతి తీసుకువచ్చే ఫలితాలను నిశితంగా పరిశీలించిన పిమ్మట కోతపనివారు “ఆదివారం ఉదయాల్లో ఇంటింటికి వెళ్తూ” కరపత్రాలను ఇవ్వాలని 1903, మే15 వాచ్‌ టవర్‌ సంచిక ప్రోత్సహించింది.

12. మనం మన ప్రకటనా పనిలో ప్రభావవంతంగా ఉండడాన్ని ఎలా మెరుగుపర్చుకున్నాము? ఉదాహరణ ఇవ్వండి.

12 ఇటీవలి సంవత్సరాల్లో, మనం ప్రజల ఇండ్లలో మాత్రమే కాక వేరే చోట్ల కూడా వారితో మాట్లాడుతూ మన పరిచర్యను విస్తృతం చేసుకున్నాము. ఆయా ప్రాంతాల్లోని ఆర్థిక పరిస్థితుల మూలంగా, ప్రజలు కాలక్షేప కార్యకలాపాల్లో పాల్గొంటుండడం మూలంగా, సాధారణంగా మనం ఇంటింటికి వెళ్ళే సమయాల్లో వారు ఇళ్ళల్లో ఉండడం లేదు. అలాంటి పరిస్థితులున్న దేశాల్లో పరిచర్యను విస్తృతం చేయడం చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు తేలింది. ఇంగ్లాండులోని ఒక ప్రాంతంలోని సముద్రతీరానికి వచ్చి ప్రజలు ఆహ్లాదకరంగా సమయం గడపి, తిరిగి బస్సుల్లో క్రమంగా వెళ్తుండడం ఒక సాక్షి ఆమె సహచరి గమనించారు. అప్పుడు వారు ఆసందర్శకులకు కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందించేందుకు ఆబస్సుల్లోకి ప్రవేశించడానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. తత్ఫలితంగా ఒక్క నెలలో వారు 229 కాపీలను పంపిణీ చేశారు. ఇదీ వారి నివేదిక: “సముద్రతీర సాక్ష్యం ఇవ్వడంలో మాకు భయం లేదు. బిజినెస్‌ ప్రాంతమైనా, మాకెదురయ్యే మరే ఇతర సవాలైనా మాకు భయం లేదు, ఎందుకంటే యెహోవా ఎల్లప్పుడు మాతో ఉన్నాడని మాకు తెలుసు.” వారు ఒక పత్రికా మార్గాన్ని స్థాపించారు, ఒక బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించారు, అంతేగాక వారిద్దరూ సహాయ పయినీరు సేవలో పాల్గొన్నారు.

13. కొన్ని ప్రాంతాల్లో మన పరిచర్య సంబంధంగా ఎటువంటి సర్దుబాట్లు అవసరమయ్యాయి?

13 యోగ్యులైన వారికోసం అన్వేషణ కొనసాగుతూ ఉండగా, కొన్ని ప్రాంతాల్లో మన పరిచర్యా విధానాన్ని జాగ్రత్తగా పునఃపరిశీలించవలసిన అవసరం ఉండవచ్చు. చాలామంది సాక్షులు వాడుక ప్రకారం ఆదివారం ఉదయాల్లో ప్రకటనా పనిలో పాల్గొంటున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వారు అలా పెందలకడనే సందర్శించినప్పుడు ప్రజలు నిద్రపోతూ ఉండడం మూలంగా తమ పని అంత ప్రభావవంతంగా ఉండడం లేదని కనుగొన్నారు. తమ సమయ పట్టికలో సర్దుబాట్లు చేసుకోవడం మూలంగా చాలామంది సాక్షులు ఇప్పుడు తమ అన్వేషణను కాస్త పొద్దెక్కాక కొనసాగిస్తున్నారు, కొన్నిచోట్ల క్రైస్తవ కూటాల తర్వాత కొనసాగిస్తున్నారు. ఈఅన్వేషణ నిజంగానే ఫలితాలను ఉత్పత్తి చేసింది. గత సంవత్సరం ప్రపంచవ్వాప్తంగా రాజ్యాన్ని ప్రకటించేవారి సంఖ్యలో 2.3 శాతం పెరుగుదల కన్పించింది. ఇది కోత యజమానికి ఘనతను తీసుకువస్తుంది, మన హృదయాలను ఆనందింపజేస్తుంది.

కోతపనిలో శాంతిని కాపాడండి

14. మనం మన సందేశాన్ని ఎటువంటి మనోభావంతో ప్రజలకు అందిస్తాము, ఎందుకు?

14 మన ఆనందానికి మరో కారణం మనం కోతపనిలో శాంతిని నెలకొల్పాలనుకుంటున్నామన్న వైఖరిని ప్రదర్శించడానికి సంబంధించినది. యేసు ఇలా అన్నాడు: “ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆయిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును.” (మత్తయి 10:​12,13) హీబ్రూ భాషలోని పలకరింపు, దానికి తత్సమానమైన బైబిలు-గ్రీకు భాషలోని పలకరింపు ‘మీకు మంచి జరుగుగాక’ అన్న భావాన్ని ఇస్తాయి. ప్రజలను మనం సమీపించడాన్ని అలాంటి మనోభావం నిర్దేశిస్తుంది. వారు రాజ్య సందేశానికి అనుకూలంగా ప్రతిస్పందిస్తారని మనం ఆశిస్తాము. అలా అనుకూలంగా ప్రతిస్పందించే వారు, తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపం చెంది, వెనక్కు మరలి, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండగా దేవునితో సమాధానం కలిగివుండవచ్చని ఎదురుచూడవచ్చు. ఫలితంగా లభించే దేవునితో సమాధానం నిత్యజీవానికి నడిపిస్తుంది.​—⁠యోహాను 17:⁠3; అపొస్తలుల కార్యములు 3:​19; 13:​38,48; 2 కొరింథీయులు 5:​18-20.

15. మనం మన ప్రకటనా పనిలో ప్రతికూల ప్రతిస్పందనను ఎదుర్కొన్నప్పుడు మన శాంతిని ఎలా కాపాడుకోగలము?

15 మనకు ప్రతికూల ప్రతిస్పందన ఎదురైతే మనలోని శాంతిని ఎలా కాపాడుకోగలము? యేసు ఇలా నిర్దేశించాడు: “[ఆ యిల్లు] అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.” (మత్తయి 10:​13) యేసు 70 మంది శిష్యులను పంపించడాన్ని గురించిన లూకా వృత్తాంతంలో ఆయన చెప్పిన ఈమాటలు మనకు కనబడతాయి: “సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.” (లూకా 10:⁠6) మనం ప్రజలను సమీపించేటప్పుడు ఆప్యాయంగా, సమాధానకరంగా ఉండండి, అది మంచిది. మనం ప్రకటించినప్పుడు ఇంటి యజమాని నిర్లిప్తంగా ఉండో, ఫిర్యాదు చేస్తూనో లేక కర్కశంగా మాట్లాడుతూనో ఉన్నప్పుడు శాంతికరమైన మన సందేశం ‘మనకు తిరిగి వస్తుంది’ అంతే. కానీ అవేమీ మన శాంతిని మననుండి తీసివేయవు, అది యెహోవా పరిశుద్ధాత్మ ఫలం.​—⁠గలతీయులు 5:​22,23.

కోతపనివారికిగల ఒక చక్కని లక్ష్యం

16, 17. (ఎ) పునర్దర్శనాలు చేసేటప్పుడు మన లక్ష్యం ఏమిటి? (బి)బైబిలు ప్రశ్నలున్నవారికి మనం ఎలా సహాయం చేయగలము?

16 కోతపనివారముగా మనం నిత్యజీవం నిమిత్తం ప్రజలను సమీకరించే పనిలో పాలుపంచుకోవడంలో ఎంతో ఆనందిస్తున్నాము. మనం ప్రకటించిన తరువాత ఒక వ్యక్తి అనుకూలంగా ప్రతిస్పందించినప్పుడూ, ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలని ఇష్టపడుతున్నప్పుడూ, తనను తాను “సమాధానపాత్రు”నిగా నిరూపించుకున్నప్పుడూ మనమెంత ఆనందభరితులం అవుతామో కదా! కొన్నిసార్లు ఆయనకు ఎన్నెన్నో బైబిలు ప్రశ్నలు ఉండవచ్చు, వాటన్నింటికీ జవాబు చెప్పడం మనకు ఒక్క సందర్శనంలోనే సాధ్యం కాకపోతుండవచ్చు. మొదటిసారి సందర్శించినప్పుడే చాలాసేపు ఉండిపోవడం యుక్తం కాకపోతుండవచ్చు. కాబట్టి ఏమి చెయ్యగలం? దాదాపు 60 సంవత్సరాల క్రితం సిఫారసు చేయబడిన లక్ష్యాన్ని మనం కలిగివుండగలం.

17 “యెహోవాసాక్షులందరూ మాదిరి బైబిలు అధ్యయనాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి.” ఆవ్యాఖ్యానం 1937 నుండి 1941 వరకు మాదిరి అధ్యయనం (ఆంగ్లం) అనే పేరుతో ప్రచురించబడిన చిన్న పుస్తకాల పరంపరలోని మూడవ దానిలో వచ్చింది. అదింకా ఇలా కొనసాగుతోంది: “[రాజ్య] ప్రచారకులందరూ రాజ్య సందేశంలో ఆసక్తిని ప్రదర్శించే సజ్జనులకు సాధ్యమైనన్ని మార్గాల్లో సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. ఆవ్యక్తులను మళ్ళీ కలవాలి [పునర్దర్శనాలు చేయాలి], వారి ప్రశ్నలకు జవాబులివ్వాలి ..., తర్వాత మీకు సాధ్యమైనంత త్వరలో ఒక మాదిరి అధ్యయనాన్ని ప్రారంభించాలి.” అవును పునర్దర్శనాల్లో మన లక్ష్యం వారితో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడమే కాక, దాన్ని క్రమంగా కూడా చేయాలి. * ఆసక్తి చూపిస్తున్న వ్యక్తి పట్ల స్నేహపూర్వకమైన స్వభావాన్ని, ప్రేమపూర్వకమైన చింతను కలిగివుంటే మనం చక్కగా సిద్ధపడి ఆఅధ్యయనాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాము.

18. క్రొత్తవారు యేసుక్రీస్తు శిష్యులు అయ్యేందుకు మనం ఎలా సహాయపడగలం?

18నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం, దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? వంటి బ్రోషూర్ల సహాయంతో మనం గృహ బైబిలు అధ్యయనాలను సమర్థవంతంగా నిర్వహించగలం, అలా క్రొత్తగా ఆసక్తిని చూపిస్తున్నవారు శిష్యులయ్యేందుకు సహాయం చేయగలం. మనం గొప్ప బోధకుడైన యేసుక్రీస్తును అనుకరించడానికి ప్రయత్నిస్తుండగా, అలాంటి బైబిలు విద్యార్థులు మన శాంతిపూర్ణమైన, ఆనందకరమైన, నిజాయితీతోకూడిన ప్రవర్తన నుండీ, యెహోవా ప్రమాణాలు, నిర్దేశకసూత్రాల పట్ల మనకున్న గౌరవం నుండీ కూడా నేర్చుకుంటారు. క్రొత్తవారి ప్రశ్నలకు జవాబులు చెబుతూ మనం వారికి సహాయం చేస్తుండగా, వారిని ప్రశ్నించేవారికి వారెలా సమాధానం చెప్పగలరో కూడా మనం నేర్పించడానికి సాధ్యమైనంతా చేద్దాం. (2 తిమోతి 2:​1,2; 1 పేతురు 2:​21) సూచనార్థకమైన కోతపనివారిగా మనం, గత సేవా సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సగటున 47,66,631 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించబడినందుకు తప్పకుండా ఎంతో ఆనందించవచ్చు. ఈగృహ బైబిలు అధ్యయన కార్యకలాపాల్లో కోతపనివారిగా మనమూ వ్యక్తిగతంగా భాగం వహించినట్లైతే మరింతగా ఆనందించవచ్చు.

కోతపనిలో ఎడతెగక ఆనందిస్తూ ఉండండి

19. యేసు పరిచర్య కాలంలోను అటు తర్వాత కొంత కాలం వరకూ జరిగిన కోతపనిలో ఆనందించడానికి ఎందుకు గట్టి కారణాలు ఉన్నాయి?

19 యేసు పరిచర్య కాలంలోను అటు తర్వాత కొంత కాలం వరకూ జరిగిన కోతపనిలో ఆనందించడానికి గట్టి కారణాలు ఉన్నాయి. అప్పట్లో చాలామంది సువార్తకు అనుకూలంగా ప్రతిస్పందించారు. సా.శ.33 పెంతెకొస్తు రోజున అత్యానందం వెల్లివిరిసింది, ఎందుకంటే అప్పుడు దాదాపు 3,000 మంది పేతురు నిర్దేశాన్ని స్వీకరించారు, యెహోవా పరిశుద్ధాత్మను స్వీకరించి, దేవుని ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో భాగమయ్యారు. వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది, “ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుం[డగా]” వారి ఆనందం హద్దులు దాటింది.​—⁠అపొస్తలుల కార్యములు 2:​37-41,46,47; గలతీయులు 6:​16; 1 పేతురు 2:⁠9.

20. మన కోతపనిలో మనకు అత్యంతానందాన్ని ఏమి తీసుకువస్తుంది?

20 అప్పట్లో, యెషయా ప్రవచనం నెరవేరుతూ ఉంది: “నీవు [యెహోవా] జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.” (యెషయా 9:⁠3) అభిషిక్తుల ‘విస్తరించిన జనము’ ఇప్పుడు దాదాపు సంపూర్ణమైనట్లుగా మనం చూస్తున్నప్పటికీ, ఇతర కోతపనివారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నందున మన ఆనందం అవధులు దాటుతోంది.​—⁠కీర్తన 4:7; జెకర్యా 8:23; యోహాను 10:⁠16.

21. తర్వాత ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

21 కోతపనిలో ఆనందిస్తూ ఉండడానికి మనకు గట్టి కారణాలు ఉన్నాయి. మన నిరీక్షణా సందేశం, యోగ్యులైన వారికోసం మన అన్వేషణ, శాంతిని నెలకొల్పే మన వైఖరి​—⁠ఈ కారకాలన్నీ కోతపనివారముగా మనకు ఆనందాన్ని తీసుకువస్తాయి. అయితే అవి చాలామంది విరోధులయ్యేందుకు కూడా నడిపిస్తాయి. అపొస్తలుడైన యోహాను దీన్ని అనుభవించాడు. ఆయన “దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును” పత్మాసు ద్వీపంలో ఖైదు చేయబడ్డాడు. (ప్రకటన 1:⁠9) మరైతే మనకు హింసలు వ్యతిరేకతలు ఎదురైనప్పుడు మన ఆనందాన్ని మనమెలా కాపాడుకోగలం? మనం ప్రకటించేవారిలో చాలామంది హృదయాలు కాఠిన్యంగా ఉన్నప్పటికీ మనమెలా కొనసాగగలం? మన తర్వాతి ఆర్టికల్‌ ఈప్రశ్నలకు లేఖనాధారిత జవాబులను అందిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 17 అధ్యయనాలు మొదట్లో ఆసక్తిని చూపిస్తున్న ప్రజలు సమూహంగా సమకూడే స్థలాల్లో నిర్వహించబడేవి. అయితే అటుతర్వాత కొద్ది కాలానికే వ్యక్తులతో వ్యక్తిగతంగాను, కుటుంబాలతోను అధ్యయనాలు నిర్వహించడం ప్రారంభమైంది.​—⁠యెహోవాసాక్షులు ప్రచురించిన, యెహోవాసాక్షులు​—⁠దేవుని రాజ్య ప్రచారకులు, 574 పేజీ చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• సూచనార్థక కోతపని ఏమిటి?

• మనం ఎటువంటి సందేశాన్ని ప్రకటిస్తాము?

• శిష్యుల కోసం చేసే మన అన్వేషణ ఎందుకు విజయవంతమవుతోంది?

• కోతపనిలో మన శాంతిని ఎలా కాపాడుకుంటాం?

• కోతపనిలో మనమెందుకు ఆనందిస్తూనే ఉంటాం?

[అధ్యయన ప్రశ్నలు]

[12, 13వ పేజీలోని చిత్రాలు]

మొదటి శతాబ్దంలోను, 20వ శతాబ్దంలోను ప్రకటనా పని

[13వ పేజీలోని చిత్రాలు]

పౌలులానే నేటి కోతపనివారు అన్ని చోట్లా ఉన్న ప్రజలను సమీపించడానికి ప్రయత్నిస్తారు

[13వ పేజీలోని చిత్రం]

ఆహ్లాదకరమైన విధంగా సువార్తను ప్రకటించండి