కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా దీవెనలు మీకు ప్రాప్తిస్తాయా?

యెహోవా దీవెనలు మీకు ప్రాప్తిస్తాయా?

యెహోవా దీవెనలు మీకు ప్రాప్తిస్తాయా?

“నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల [“వింటూ ఉంటే,” పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం] ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.”​—⁠ద్వితీయోపదేశకాండము 28:⁠2.

1. ఇశ్రాయేలీయులకు దీవెనలు లేక శాపములు దేని ఆధారంగా ప్రాప్తిస్తాయి?

ఇశ్రాయేలీయులు అరణ్యంలో తమ 40-ఏళ్ళ ప్రయాణం ముగింపు సమయంలో, మోయాబు మైదానాల్లో గుడారాలు వేసుకున్నారు. వాగ్దాన దేశం వారి ఎదుట ఉంది. అప్పుడు మోషే ద్వితీయోపదేశకాండమును వ్రాశాడు, దానిలో దీవెనలు, శాపముల పరంపర గురించి ఉంది. ఇశ్రాయేలీయులు విధేయత చూపించడం ద్వారా “యెహోవా మాట వింటూ ఉంటే” వారికి దీవెనలు “ప్రాప్తించును.” యెహోవా వారిని తన ‘స్వకీయ జనముగా’ ప్రేమించి, వారి పక్షాన తన బలాన్ని చూపించాలనుకున్నాడు. కాని వారు ఆయన మాట వింటూ ఉండకపోతే, శాపములు కూడా వారికి అంతే ఖచ్చితంగా ప్రాప్తిస్తాయి.​—⁠ద్వితీయోపదేశకాండము 8:​10-14; 26:​18; 28:​2, 15.

2. ద్వితీయోపదేశకాండము 28:2 లో, “వింటూ ఉంటే” మరియు “ప్రాప్తించును” అని అనువదించబడిన హీబ్రూ క్రియాపదాల భావమేమిటి?

2ద్వితీయోపదేశకాండము 28:​2 లో “వింటూ ఉంటే” అని అనువదించబడిన హీబ్రూ క్రియాపదం కొనసాగే చర్యను సూచిస్తోంది. యెహోవా ప్రజలు ఆయన చెప్పేది ఎప్పుడో ఒకసారి మాత్రమే వినడంకాదు, వారు ఎల్లప్పుడూ వింటూనే ఉండాలి. అలా వింటేనే దేవుని దీవెనలు వారికి ప్రాప్తిస్తాయి. “ప్రాప్తించును” అని అనువదించబడిన హీబ్రూ క్రియాపదం, చాలా తరచుగా, “తరిమి పట్టుకొను” లేక “అందుకొను” అనే భావంగల, వేటకు సంబంధించిన పదంగా నిర్వచించబడుతోంది.

3. మనం యెహోషువ వలె ఎలా ఉండగలము, ఇదెందుకు అత్యంత ప్రాముఖ్యం?

3 ఇశ్రాయేలీయుల నాయకుడైన యెహోషువ యెహోవా మాట వినడానికి ఎంపిక చేసుకున్నాడు, కాబట్టి దీవెనలను పొందాడు. ఆయనిలా చెప్పాడు: “ఎవని సేవించెదరో ... నేడు మీరు కోరుకొనుడి ... నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.” అది విని ప్రజలు ఇలా సమాధానమిచ్చారు: “యెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక.” (యెహోషువ 24:​15,16) యెహోషువకున్న చక్కని దృక్పథం మూలంగా ఆయన, వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ఆధిక్యత లభించిన తన తరానికి చెందిన కొద్దిమందిలో తానూ ఒకడు కాగలిగాడు. నేడు, మరెంతో ఉన్నతమైన వాగ్దాన దేశపు ముంగిట్లో, అంటే దేవుని ఆమోదాన్ని పొందే వారందరి కోసం యెహోషువ కాలంనాటి దీవెనల కంటే ఎంతో గొప్పవైన దీవెనలు వేచివుండే పరదైసు భూమి ముంగిట్లో మనం నిలబడివున్నాము. అలాంటి దీవెనలు మీకు ప్రాప్తిస్తాయా? మీరు యెహోవా చెప్పేది వింటూ ఉంటే మీకు ప్రాప్తిస్తాయి. అలా వినాలనే మీనిశ్చయతను బలపర్చుకునేందుకు సహాయంగా, ప్రాచీన ఇశ్రాయేలు జనాంగపు చరిత్రను, ఉపదేశాత్మకమైన కొందరి మాదిరులను పరిశీలించండి.​—⁠రోమీయులు 15:⁠4.

దీవెనా లేక శాపమా?

4. సొలొమోను ప్రార్థనకు జవాబుగా, దేవుడు ఆయనకు ఏమి అనుగ్రహించాడు, అలాంటి దీవెనల గురించి మనం ఎలా భావించాలి?

4 సొలొమోను రాజు పరిపాలనలోని అధికభాగంలో, ఇశ్రాయేలీయులు యెహోవా నుండి అసాధారణమైన దీవెనలను పొందారు. వారు భద్రతను, మంచి వాటిని పుష్కలంగా ఆనందించారు. (1 రాజులు 4:​25) నిజమే సొలొమోను ధనసంపదలు ఎంతో పేరుప్రఖ్యాతులు పొందాయి, కానీ నిజానికి ఆయన వస్తు సంపదలిమ్మని దేవుడ్ని అడగనేలేదు. బదులుగా, ఆయన ఇంకా చిన్న వయస్సులో ఉండి, అనుభవరహితునిగా ఉన్నప్పుడే, వివేకముగల హృదయం కోసం ప్రార్థించాడు, యెహోవా ఆయనను బుద్ధివివేకములతో దీవించడం ద్వారా ఆవిన్నపాన్ని అనుగ్రహించాడు. ఇది, సొలొమోను ప్రజలకు సరైనవిధంగా తీర్పు చెప్పడానికీ, మంచిచెడ్డలను వివేచించడానికీ ఆయనకు సహాయం చేసింది. దేవుడు ఆయనకు ధనసంపదలను మహిమను ఇచ్చినప్పటికీ, యౌవనస్థునిగా సొలొమోను ఆధ్యాత్మిక సంపదల ఉత్కృష్టమైన విలువను ఎంతో అమూల్యమైనదిగా ఎంచాడు. (1 రాజులు 3:​9-13) వస్తుపరంగా మనకు ఎక్కువ ఉన్నా లేకపోయినా, మనం యెహోవా దీవెనలను పొంది ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులమై ఉంటే మనం ఎంత కృతజ్ఞులమై ఉండవచ్చో కదా!

5. ఇశ్రాయేలు, యూదా ప్రజలు యెహోవా చెప్పేది వింటూ ఉండడంలో విఫలమైనప్పుడు ఏమి జరిగింది?

5 యెహోవా దీవెనలను బట్టి కృతజ్ఞత చూపించడంలో ఇశ్రాయేలీయులు విఫలమయ్యారు. వారు ఆయన చెప్పేది వింటూ ఉండలేదు గనుక, ముందే చెప్పబడిన శాపములు వారికి ప్రాప్తించాయి. తత్ఫలితంగా వారి శత్రువులు వారిని జయించడంతో, ఇశ్రాయేలు యూదా నివాసులు చెరపట్టబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 28:36; 2 రాజులు 17:22, 23; 2 దినవృత్తాంతములు 36:​17-20) దేవుని ప్రజలు అలాంటి బాధలు అనుభవించడం మూలంగా, యెహోవా చెప్పేది వింటూ ఉండేవారికి మాత్రమే దేవుని దీవెనలు ప్రాప్తిస్తాయని నేర్చుకున్నారా? సా.శ.పూ. 537 లో తమ స్వదేశానికి తిరిగి వచ్చిన యూదుల శేషానికి, తాము “జ్ఞానహృదయము” సంపాదించుకున్నారో లేదో, దేవుడు చెప్పేది వింటూ ఉండవలసిన అవసరతను ఇప్పుడు తాము గ్రహించారో లేదో చూపించే అవకాశం లభించింది.​—⁠కీర్తన 90:12.

6. (ఎ) యెహోవా తన ప్రజలకు ప్రవచించమని హగ్గయిని, జెకర్యాను ఎందుకు పంపించాడు? (బి)దేవుడు హగ్గయి ద్వారా ఇచ్చిన సందేశం ఏసూత్రాన్ని సోదాహరణంగా తెలియజేసింది?

6 తిరిగి వచ్చిన యూదులు ఒక బలిపీఠమును కట్టి, యెరూషలేము ఆలయ నిర్మాణ పనిని ప్రారంభించారు. కానీ శక్తివంతమైన వ్యతిరేకత ఎదురు కాగానే, వారి ఆసక్తి తగ్గుముఖం పట్టింది దానితో నిర్మాణం పని ఆగిపోయింది. (ఎజ్రా 3:​1-3,10; 4:​1-4,23,24) వారు వ్యక్తిగత సౌఖ్యాలకు ప్రాధాన్యతనివ్వడం కూడా మొదలుపెట్టారు. కాబట్టి, దేవుడు సత్యారాధన పట్ల తన ప్రజల ఆసక్తిని వృద్ధిచేయడానికి హగ్గయి, జెకర్యా వంటి ప్రవక్తలను పంపించాడు. హగ్గయి ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “ఈ [ఆరాధనా] మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా? ... మీప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, ... పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.” (హగ్గయి 1:​4-6) వస్తుసంపదలను ఆర్జించడానికి ఆధ్యాత్మిక కార్యకలాపాలను త్యాగం చేయడం యెహోవా దీవెనలను తీసుకురాదు.​—⁠లూకా 12:​15-21.

7. “మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి” అని యెహోవా యూదులకు ఎందుకు చెప్పాడు?

7 యూదులు అనుదిన చింతల్లో మునిగిపోయి, వ్యతిరేకతవున్న సమయంలో సహితం దేవునికి విధేయత చూపిస్తూ సహిస్తేనే తమకు వర్షం రూపంలోనూ ఫలవంతమైన ఋతువుల రూపంలోనూ దేవుని దీవెనలు ప్రాప్తిస్తాయన్న విషయాన్ని మరచిపోయారు. (హగ్గయి 1:​9-11) కాబట్టి, “మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి” అనే ఉద్బోధ ఎంత సముచితమైనదో కదా! (హగ్గయి 1:⁠7) ఒకవిధంగా యెహోవా వాళ్ళకిలా చెబుతున్నాడు: ‘ఒకసారి ఆలోచించండి! పొలాల్లో మీవ్యర్థ ప్రయాసకు నా ఆరాధనా మందిరపు శిధిలావస్థకు మధ్యనున్న సంబంధాన్ని చూడండి.’ యెహోవా ప్రవక్తల ప్రేరేపిత మాటలు చివరికి తమ శ్రోతల హృదయాలను చేరాయి, తత్ఫలితంగా ప్రజలు ఆలయ నిర్మాణ పనిని పునఃప్రారంభించి సా.శ.పూ. 515 లో ముగించారు.

8. మలాకీ కాలంలోని యూదులకు యెహోవా ఏమని ఉద్బోధించాడు, ఎందుకు?

8 తర్వాత, మలాకీ ప్రవక్త కాలంలో, యూదులు ఆధ్యాత్మికంగా మళ్లీ డోలాయమానంగా తయారై, చివరికి దేవునికి అంగీకృతం కాని బలులను కూడా అర్పించారు. (మలాకీ 1:​6-8) తమ ఫలసాయంలో నుండి పదియవ భాగమును తన మందిరపు నిధిలోనికి తీసుకువచ్చి తనను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానో లేదో చూడమని యెహోవా వారికి ఉద్బోధించాడు. (మలాకీ 3:​10) దేవుడు చెప్పేది వింటూ ఉండుంటే ఆయన వాటిని వారికి సమృద్ధిగా ఇచ్చివుండేవాడే కదా!​—⁠2 దినవృత్తాంతములు 31:10.

9. బైబిలు వృత్తాంతంలోని ఏముగ్గురు వ్యక్తుల జీవితాలను మనం పరిశీలిస్తాము?

9 బైబిలులో, ఇశ్రాయేలు జనాంగపు చరిత్ర గురించి తెలియజేయబడడమే గాక, యెహోవా చెప్పేది వింటూ ఉన్నారా లేదా అనేదాని ఆధారంగా దేవుని దీవెనలను లేక శాపములను పొందిన అనేకమంది వ్యక్తుల జీవిత వృత్తాంతాలు కూడా నమోదు చేయబడ్డాయి. బోయజు, నాబాలు, హన్నా అనే ముగ్గురి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం. దీనికి సంబంధించి మీరు రూతు గ్రంథాన్ని, అలాగే 1 సమూయేలు 1:1–2:⁠21 మరియు 25:​2-42 చదివితే బాగుంటుంది.

బోయజు దేవుని మాట విన్నాడు

10. బోయజు, నాబాలులకు ఏసారూప్యతలు ఉన్నాయి?

10 బోయజు, నాబాలు సమకాలీనులు కాకపోయినప్పటికీ, కొన్ని విషయాల్లో వారికి కొన్ని సారూప్యతలున్నాయి. ఉదాహరణకు, వారిద్దరూ యూదాలో నివసించారు. వారు సంపన్నులైన భూస్వాములు, అవసరంలో ఉన్నవారికి కృప చూపించే ప్రత్యేకమైన అవకాశం ఇద్దరికీ లభించింది. వారిద్దరి మధ్య అంతకన్నా వేరే సారూప్యాలేమీ లేవు.

11. బోయజు తాను యెహోవా చెప్పేది వింటూ ఉన్నానని ఎలా చూపించాడు?

11 బోయజు ఇశ్రాయేలు న్యాయాధిపతుల కాలంలో జీవించాడు. ఆయన ఇతరులతో గౌరవపూర్వకంగా వ్యవహరించాడు, ఆయన చేనుకోసేవారు ఆయనను ఎంతో గౌరవించేవారు. (రూతు 2:⁠4) ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తూ బోయజు తన పొలంలో పరిగె బీదల కోసం పేదవారి కోసం విడిచిపెట్టబడేలా చూశాడు. (లేవీయకాండము 19:​9,10) రూతు నయోమిల గురించి తెలుసుకున్నప్పుడు, వృద్ధురాలైన తన అత్తపట్ల రూతుకున్న శ్రద్ధాసక్తులను చూసినప్పుడు బోయజు ఏమి చేశాడు? ఆయన రూతుపట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించి, తన పొలంలో ఆమెను పరిగె ఏరుకోనిమ్మని తన పనివారికి ఆజ్ఞాపించాడు. బోయజు తన మాటల ద్వారా, ప్రేమపూర్వకమైన చర్యల ద్వారా తాను యెహోవా చెప్పేది వినే ఆధ్యాత్మిక వ్యక్తినని బయల్పరచుకున్నాడు. అందుకే ఆయన దేవుని అనుగ్రహాన్ని, దీవెనలను పొందగలిగాడు.​—⁠లేవీయకాండము 19:18; రూతు 2:5-16.

12, 13. (ఎ) విడిపించడాన్ని గురించిన యెహోవా ఆజ్ఞ పట్ల బోయజు ప్రగాఢమైన గౌరవాన్ని ఎలా చూపించాడు? (బి)బోయజుకు దేవుని నుండి ఏదీవెనలు ప్రాప్తించాయి?

12 యెహోవా చెప్పేది బోయజు వింటూ ఉన్నాడనేదానికి అత్యంత విశేషమైన సాక్ష్యాధారం, విడిపించడాన్ని గురించిన దేవుని ఆజ్ఞానుసారంగా ప్రవర్తించడంలో ఆయన చూపించిన నిస్వార్థత. తన బంధువు అంటే నయోమి యొక్క మరణించిన భర్త అయిన ఎలీమెలెకు స్వాస్థ్యం ఆయన కుటుంబంతోనే ఉండేలా చూడడానికి బోయజు తాను చేయగలిగినదంతా చేశాడు. “దేవరధర్మము” ద్వారా ఒక విధవరాలు, మరణించిన తన భర్త యొక్క సన్నిహిత బంధువును వివాహం చేసుకోవాలి, వారికి కలిగిన జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడవుతాడు. (ద్వితీయోపదేశకాండము 25:5-10; లేవీయకాండము 25:​47-49) నయోమికి పిల్లలను కనే వయస్సు దాటిపోయింది కాబట్టి నయోమి స్థానంలో రూతు వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. ఎలీమెలెకు సన్నిహిత బంధువు నయోమికి సహాయం చేయడానికి నిరాకరించిన తర్వాత, బోయజు రూతును తన భార్యగా స్వీకరించాడు. వారి కుమారుడైన ఓబేదు నయోమి సంతానంగా, ఎలీమెలెకుకు చట్టబద్ధమైన వారసునిగా దృష్టించబడ్డాడు.​—⁠రూతు 2:​19,20; 4:1, 6, 9, 13-16.

13 దేవుని ధర్మశాస్త్రానికి నిస్వార్థంగా సంపూర్ణ విధేయత చూపించినందుకు బోయజుకు పుష్కలంగా దీవెనలు ప్రాప్తించాయి. వారి కుమారుడైన ఓబేదు ద్వారా, ఆయనా రూతూ యేసు క్రీస్తు పూర్వీకులయ్యే ఆధిక్యతను దీవెనగా పొందారు. (రూతు 2:​12; 4:13, 21, 22; మత్తయి 1:​1,5,6) ఇతరుల పట్ల ప్రేమ చూపించేవారికి, దేవుడు కోరే వాటికి అనుగుణంగా నడుచుకునేవారికి దీవెనలు ప్రాప్తిస్తాయని బోయజు యొక్క నిస్వార్థమైన కార్యాల నుండి మనం తెలుసుకోవచ్చు.

నాబాలు దేవుని మాట వినలేదు

14. నాబాలు ఎటువంటి వ్యక్తి?

14 బోయజుకు భిన్నంగా, నాబాలు యెహోవా మాట వినలేదు. “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను” అనే దేవుని ఆజ్ఞను అతడు అతిక్రమించాడు. (లేవీయకాండము 19:​18) నాబాలు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతను ఇచ్చే వ్యక్తికాదు; అతడు “చర్యలనుబట్టి చూడగా ... మోటువాడును దుర్మార్గుడునై యుండెను.” అతని సొంత పనివారు సహితం అతడిని ‘బహు పనికిమాలినవానిగా’ దృష్టించేవారు. తగిన విధంగానే ఆయన పేరు నాబాలు, దానికి “బుద్ధిహీనుడు,” లేక “మూర్ఖుడు” అని భావం. (1 సమూయేలు 25:​3,17,25, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కాబట్టి అవసరంలో ఉన్న వ్యక్తి పట్ల, అదీ యెహోవా అభిషిక్తుడైన దావీదు పట్ల దయ చూపే అవకాశం లభించినప్పుడు నాబాలు ఎలా ప్రతిస్పందిస్తాడు?​—⁠1 సమూయేలు 16:13.

15. నాబాలు దావీదుతో ఎలా వ్యవహరించాడు, ఈవిషయంలో అబీగయీలు తన భర్త నుండి ఎలా భిన్నంగా ఉంది?

15 దావీదు ఆయన మనుష్యులు, నాబాలు మందలున్న ప్రాంతంలో మకాంవేసినప్పుడు, వారు ఏప్రతిఫలాన్ని ఆశించకుండానే దోపిడీదారుల నుండి నాబాలు మందలను కాపాడారు. నాబాలు గొఱ్ఱెలకాపరులలో ఒకరు, “మేము గొఱ్ఱెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి” అని చెప్పాడు. అయితే ఆహారం కోసం దావీదు తన మనుష్యులను నాబాలు వద్దకు పంపినప్పుడు, అతను “వారితో కఠినముగా మాటలా[డి],” వారిని వట్టి చేతులతో పంపివేశాడు. (1 సమూయేలు 25:​2-16) నాబాలు భార్య అబీగయీలు వెంటనే దావీదు వద్దకు ఆహారపదార్థాలను తీసుకువెళ్ళింది. ఆగ్రహావేశాలతోనున్న దావీదు, నాబాలును అతని మనుష్యులను నిర్మూలించడానికి సిద్ధంగా ఉన్నాడు. అబీగయీలు చొరవతీసుకోవడం అనేకుల ప్రాణాలను రక్షించి, రక్తాపరాధి కావడం నుండి దావీదును తప్పించింది. కానీ నాబాలు దురాశ, కఠినత్వం మరీ హద్దులు మీరిపోయాయి. దాదాపు పది రోజుల తర్వాత, “యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను.”​—⁠1 సమూయేలు 25:18-38.

16. మనం బోయజును ఎలా అనుకరించవచ్చు, నాబాలు మార్గాలను అనుకరించకుండా ఎలా ఉండవచ్చు?

16 బోయజు, నాబాలులకు ఎంత తేడా! నాబాలు చూపించిన కఠినమైన, స్వార్థపూరితమైన మార్గాలను అనుకరించకుండా, బోయజు చూపించిన దయను నిస్వార్థాన్ని మనం అనుకరిద్దాం. (హెబ్రీయులు 13:​16) అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా మనమలా చేయవచ్చు: “మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.” (గలతీయులు 6:​10) నేడు, యెహోవా అభిషిక్తులకు అంటే పరలోకంలో అమర్త్యత అనుగ్రహించబడిన 1,44,000 మందిలోని మిగిలినవారికి మేలు చేసే ఆధిక్యత యేసు యొక్క “వేరే గొఱ్ఱెల”కు అంటే భూనిరీక్షణగల క్రైస్తవులకు ఉంది. (యోహాను 10:16; 1 కొరింథీయులు 15:50-53; ప్రకటన 14:​1,4) యేసు అలాంటి ప్రేమగల కార్యాలు వ్యక్తిగతంగా తనకే చేయబడినట్లుగా దృష్టిస్తాడు, ఈమంచి కార్యాలను చేయడం యెహోవా నుండి గొప్ప దీవెనలను పొందడానికి కారణమవుతుంది.​—⁠మత్తయి 25:34-40; 1 యోహాను 3:18.

హన్నా పరీక్షలు, దీవెనలు

17. హన్నా ఎలాంటి పరీక్షలను ఎదుర్కొంది, అప్పుడామె ఎలాంటి దృక్పథాన్ని చూపించింది?

17 దైవభక్తిగల స్త్రీ అయిన హన్నాకు కూడా యెహోవా దీవెన ప్రాప్తించింది. ఆమె లేవీయుడైన తన భర్త ఎల్కానాతో పాటు ఎఫ్రాయీము మన్యమందు నివసించింది. ధర్మశాస్త్రం అనుమతించి, క్రమబద్ధీకరించినట్లే ఆయనకు మరో భార్య కూడా ఉంది, ఆమె పెనిన్నా. హన్నా గొడ్రాలు, అది ఒక ఇశ్రాయేలు స్త్రీకి ఎంతో అవమానకరమైన విషయం, అయితే పెనిన్నాకు కొంతమంది పిల్లలున్నారు. (1 సమూయేలు 1:1-3; 1 దినవృత్తాంతములు 6:​16,33,34) పెనిన్నా హన్నాను ఓదార్చే బదులు ప్రేమరహితంగా ప్రవర్తించేది, దానితో హన్నాకు కోపం వచ్చి ఆమె భోజనము చేయక ఏడుస్తూ ఉండేది. ఇంకా ఘోరం ఏమిటంటే, “ఏటేట” అంటే, వారి కుటుంబం షిలోహునందున్న యెహోవా మందిరముకు వెళ్ళే ప్రతిసారి అలాగే జరిగేది. (1 సమూయేలు 1:​4-8) పెనిన్నా ఎంత దయలేనిది, హన్నాకు ఎంతటి పరీక్ష! అయినా హన్నా ఎన్నడూ యెహోవాను నిందించలేదు; ఆమె భర్త షిలోహుకు వెళ్ళినప్పుడు ఆమె ఎన్నడూ ఇంటివద్ద ఉండిపోలేదు. కాబట్టి, చివరికి ఆమెకు గొప్ప దీవెన తప్పక ప్రాప్తిస్తుంది.

18. హన్నా ఎలాంటి మాదిరిని ఉంచింది?

18 హన్నా నేడు యెహోవా ప్రజలకు, ప్రాముఖ్యంగా ఇతరుల కనికరంలేని వాఖ్యానాల వల్ల గాయపడిన వారికి చక్కని మాదిరిని ఉంచింది. అలాంటి పరిస్థితుల్లో, తాము అందరికీ దూరంగా ఉండడం పరిష్కారంకాదు. (సామెతలు 18:⁠1) దేవుని వాక్యం బోధించబడే స్థలంలోనూ ఆరాధన కోసం ఆయన ప్రజలు సమకూడే స్థలంలోనూ ఉండాలనే తన కోరికను తనెదుర్కొన్న పరీక్షలు ఆటంకపరిచేందుకు హన్నా అనుమతించలేదు. అందుకే ఆమె ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండగలిగింది. మొదటి సమూయేలు 2:​1-10 వచనాల్లో వ్రాయబడి ఉన్న, ఆమెచేసిన అద్భుతమైన ప్రార్థనలో, ఆమె ఆధ్యాత్మికత లోతు స్పష్టమవుతుంది. *

19. ఆధ్యాత్మిక విషయాల పట్ల మనకున్న మెప్పును మనం ఎలా చూపించవచ్చు?

19 యెహోవా ప్రస్తుత-దిన సేవకులుగా, మనం ఏదో గుడారంలో ఆరాధించము. అయినప్పటికీ, హన్నా వలె మనం ఆధ్యాత్మిక విషయాల పట్ల మనకున్న మెప్పును చూపించవచ్చు. ఉదాహరణకు, క్రైస్తవ కూటాలకు, అసెంబ్లీలకు, సమావేశాలకు క్రమంగా హాజరు కావడం ద్వారా ఆధ్యాత్మిక సంపదల పట్ల మనకున్న ప్రగాఢమైన మెప్పును మనం చూపించవచ్చు. మనం ‘నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించిన’ యెహోవా సత్యారాధనలో ఒకరినొకరం ప్రోత్సహించుకునేందుకు ఈసందర్భాలను ఉపయోగించుకుందాం.​—⁠లూకా 1:​74,75; హెబ్రీయులు 10:​24,25.

20, 21. హన్నాకున్న దైవభక్తిని బట్టి ఆమె ఎలా ప్రతిఫలాన్ని పొందింది?

20 హన్నాకున్న దైవ భక్తిని యెహోవా గుర్తించి, ఆమెకు పుష్కలంగా ప్రతిఫలమిచ్చాడు. సంవత్సరానికి ఒకసారి కుటుంబమంతా షిలోహుకు వెళ్ళే అలాంటి ఒక సందర్భంలో, హన్నా కన్నీళ్లతో దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించి, ఇలా మ్రొక్కుబడి చేసుకుంది: “సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, ... వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతు[ను].” (1 సమూయేలు 1:​9-11) దేవుడు హన్నా విన్నపాన్ని విని, ఆమెకు ఒక కుమారుడ్ని అనుగ్రహించాడు, అతనికి ఆమె సమూయేలు అని పేరుపెట్టుకుంది. ఆబాలుడు పాలువిడిచిన తర్వాత, అతడు గుడారంలో సేవ చేయగలిగేలా ఆమె అతడిని షిలోహుకు తీసుకువెళ్ళింది.​—⁠1 సమూయేలు 1:20, 24-28.

21 హన్నా దేవునిపట్ల ప్రేమ చూపించి, సమూయేలు విషయంలో తాను చేసుకున్న మ్రొక్కుబడిని నెరవేర్చింది. తమ ప్రియ కుమారుడు యెహోవా గుడారంలో సేవచేస్తున్నందుకు ఆమె, ఎల్కానా పొందిన గొప్ప దీవెన గురించి ఆలోచించండి! తమ కుమారులు, కుమార్తెలు పూర్తికాల పయినీరు పరిచారకులుగా, బేతేలు కుటుంబ సభ్యులుగా, లేక యెహోవాకు ఘనతను తెచ్చే మరితర విధాల్లో సేవచేస్తున్నందుకు చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులకు అలాంటి ఆనందాలూ ఆశీర్వాదాలే లభిస్తున్నాయి.

యెహోవా చెప్పేది వింటూ ఉండండి!

22, 23. (ఎ) మనం యెహోవా స్వరాన్ని వింటూ ఉంటే మనం దేని గురించి నిశ్చయత కలిగివుండవచ్చు? (బి)తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

22 మనం యెహోవా చెప్పేది వింటూ ఉంటే మనం దేని గురించి నిశ్చయత కలిగి ఉండవచ్చు? దేవునిపట్ల పూర్ణాత్మతో కూడిన ప్రేమను చూపించి ఆయనకు మనం చేసుకున్న సమర్పణను నెరవేరుస్తే మనం ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులమవుతాము. అలాంటి విధానాన్ని అవలంబించడానికి మనం తీవ్రమైన పరీక్షలను సహించవలసినప్పటికీ, తరచూ మనం ఊహించలేని గొప్ప రీతుల్లో, యెహోవా దీవెనలు మనకు తప్పక ప్రాప్తిస్తాయి.​—⁠కీర్తన 37:4; హెబ్రీయులు 6:10.

23 భవిష్యత్తులో దేవుని ప్రజలకు అనేక దీవెనలు లభిస్తాయి. యెహోవా చెప్పేది విధేయంగా వింటున్నందుకు, ఒక “గొప్పసమూహము” “మహాశ్రమ”ల్లో కాపాడబడి, దేవుని నూతన లోకంలో జీవపు ఆనందాలను అనుభవిస్తుంది. (ప్రకటన 7:9-14; 2 పేతురు 3:​13) అక్కడ యెహోవా తన ప్రజల నీతియుక్తమైన కోరికలను పూర్తిగా తృప్తిపరుస్తాడు. (కీర్తన 145:​16) అయితే, తర్వాతి ఆర్టికల్‌ చూపిస్తున్నట్లుగా, ఇప్పుడు కూడా యెహోవా స్వరాన్ని వింటూ ఉండేవారు ‘పరసంబంధమైన శ్రేష్ఠమైన ప్రతి యీవితో సంపూర్ణమైన ప్రతి వరముతో’ దీవించబడతారు.​—⁠యాకోబు 1:17.

[అధస్సూచి]

^ పేరా 18 హన్నా వ్యక్తీకరణలకు, కన్య మరియ తాను మెస్సీయకు తల్లిని కాబోతున్నానని తెలుసుకున్న వెంటనే ఆమె వ్యక్తపర్చిన భావాలకు కొంత సారూప్యత ఉంది.​—⁠లూకా 1:​46-55.

మీరు గుర్తుతెచ్చుకోగలరా?

• దేవుని దీవెనల గురించి ఇశ్రాయేలు చరిత్ర మనకు ఏమి బోధించగలదు?

• బోయజుకు, నాబాలుకు ఉన్న తేడా ఏమిటి?

• మనం హన్నాను ఎలా అనుకరించవచ్చు?

• యెహోవా స్వరాన్ని మనం ఎందుకు వింటూనే ఉండాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

సొలొమోను రాజు వివేకముగల హృదయం కోసం ప్రార్థించాడు, యెహోవా ఆయనకు బుద్ధిని అనుగ్రహించాడు

[12వ పేజీలోని చిత్రం]

బోయజు ఇతరులతో గౌరవపూర్వకంగా, దయాపూర్వకంగా వ్యవహరించాడు

[15వ పేజీలోని చిత్రం]

యెహోవాపై ఆధారపడినందుకు హన్నా గొప్పగా దీవించబడింది