కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నేను కైసరు ఎదుటనే చెప్పుకొందును!’

‘నేను కైసరు ఎదుటనే చెప్పుకొందును!’

‘నేను కైసరు ఎదుటనే చెప్పుకొందును!’

నిస్సహాయుడైన ఒక వ్యక్తిపై కొంతమంది దాడిచేసి కొట్టడం ప్రారంభించారు. అతడు మరణార్హుడేనని వాళ్ళు భావించారు. ఇక అతని మరణం ఖాయం అనుకునేంతలో అక్కడ సైనికులు ప్రత్యక్షమై, ఆవేశంగా ఉన్న ఆగుంపు చేతుల్లోంచి అతి కష్టమ్మీద ఆవ్యక్తిని బయటకు లాగారు. ఆవ్యక్తి అపొస్తలుడైన పౌలు. అతనిపై దాడి చేసింది, పౌలు చేస్తున్న ప్రకటనా పనిని చాలా తీవ్రంగా నిరోధిస్తూ, ఆయన మందిరమును అపవిత్రపరుస్తున్నాడని నింద మోపిన యూదులు. ఆయనను రక్షించింది, సైన్యాధికారియైన క్లౌదియ లూసియ ఆదేశం ప్రకారం వచ్చిన రోమాసైనికులు. అలాంటి అయోమయ పరిస్థితిలో పౌలు నేరస్థుడనే అనుమానంతో నిర్బంధించబడ్డాడు.

ఈసంఘటనతో, అపొస్తలుల కార్యముల పుస్తకంలోని చివరి ఏడు అధ్యాయాల్లోని వృత్తాంతం ఆరంభమవుతుంది. పౌలుకున్న చట్టసంబంధ నేపథ్యాన్ని, ఆయనమీద మోపిన ఆరోపణలను, ఆయన ప్రతివాదాలను, రోమన్ల శిక్షాస్మృతిని అర్థం చేసుకోవడం ద్వారా ఈఅధ్యాయాలను గురించి మనకు మరింత అవగాహన లభిస్తుంది.

క్లౌదియ లూసియ ఆధీనంలో

క్లౌదియ లూసియ నిర్వహించాల్సిన విధుల్లో యెరూషలేములో శాంతిభద్రతలను కాపాడడం ఒకటి. అతని పైయధికారియైన, యూదయ యొక్క రోమా అధిపతి కైసరయలో ఉంటున్నాడు. పౌలు విషయంలో లూసియ తీసుకున్న చర్య, ఒక వ్యక్తిపై దౌర్జన్యం జరగకుండా చూడడానికి, శాంతికి భంగం వాటిల్లజేసే వ్యక్తిని నిర్బంధించడానికి తీసుకున్న చర్యగా అవగతమవుతుంది. యూదుల ప్రతిచర్య లూసియ తన ఖైదీని అంటోనియా కోటలోకి తీసుకువెళ్ళేలా చేసింది.​—⁠అపొస్తలుల కార్యములు 21:27–22:24.

పౌలు ఏమి చేశాడో లూసియ తెలుసుకోవాల్సి ఉంది. ఆగందరగోళంలో ఆయనకు ఏమీ అర్థం కాలేదు. ఆయన మరింత అల్లరి జరగకుండా ఉండాలని, “వారతనికి విరోధముగా ఈలాగు కేకలువేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెను” అని ఆజ్ఞాపించాడు. (అపొస్తలుల కార్యములు 22:​24) నేరస్థులనుండి, బానిసలనుండి, ఇతర బడుగు స్థాయిలోని వారినుండి రుజువులను రాబట్టడానికి మామూలుగా ఉపయోగించే పద్ధతి అది. దాన్ని సాధించడానికి కొరడా (ఫ్లాగ్రమ్‌) సమర్థమైనదే కావచ్చు, కానీ అది భయంకరమైన సాధనం. కొన్ని కొరడాలకు లోహపు గోళీలు వేలాడే గొలుసులు కూడా ఉంటాయి. మరి కొన్ని కొరడాలను పదునైన ఎముకలు, లోహపు ముక్కలతో కలిపి అల్లేవారు. అవి చాలా దారుణంగా గాయపరచి, చర్మాన్ని పీలికలుగా చీల్చి చెండాడేవి.

ఆ సందర్భంలో పౌలు తనకు రోమా పౌరసత్వముందని తెలియజేశాడు. శిక్ష విధించబడని ఒక రోమీయునికి కొరడా దెబ్బలు పడకూడదు, అందుకే పౌలు తన హక్కును ప్రకటించిన వెంటనే తగిన చర్యలు తీసుకోబడ్డాయి. ఒక రోమా పౌరుడు దూషించబడినా శిక్షించబడినా అక్కడి రోమా అధికారి ఉద్యోగం ఊడే అవకాశం ఉంది. అప్పటినుండి పౌలు ఒక ప్రత్యేక ఖైదీగా పరిగణించబడ్డాడని అర్థమవుతుంది, అంటే ఆయనను చూడడానికి వచ్చేవారిని ఆయన కలుసుకోవచ్చన్నమాట.​—⁠అపొస్తలుల కార్యములు 22:​25-29; 23:16,17.

నేరారోపణలు సందిగ్ధంగా ఉండడడం వలన లూసియ, యూదుల కోపానికి కారణమేమిటో తెలుసుకొమ్మని పౌలును యూదుల మహా సభ ముందు హాజరు పరుస్తాడు. కాని పౌలు తాను పునరుత్థానం గురించి మాట్లాడినందుకు విమర్శించబడుతున్నానని అనగానే అక్కడ వివాదం చెలరేగింది. ఆవివాదం ఎంత ఎక్కువగా అయ్యిందంటే, పౌలును వాళ్ళు ముక్కలుముక్కలుగా చీల్చివేస్తారేమోనని లూసియ భయపడి, కోపోద్రేకులై ఉన్న ఆయూదులనుండి ఆయనను మళ్ళీ బయటకు లాగాల్సివచ్చింది.​—⁠అపొస్తలుల కార్యములు 22:⁠30-23:​10.

ఒక రోమా పౌరుని మరణానికి తను బాధ్యుడవడం లూసియకు ఇష్టం లేదు. పౌలును చంపడానికి కుట్ర పన్నుతున్నారని తెలియగానే, ఆయన తన ఖైదీని కైసరయకు పంపిస్తాడు. ఒక ఖైదీని పై న్యాయాధికారుల దగ్గరకు పంపించాలంటే ఆనేరానికి సంబంధించిన వివరాల నివేదికను ఆఖైదీతోపాటు పంపించాలి. ఆనివేదికల్లో మొదటి విచారణలు, చర్య తీసుకోవడానికి గల కారణాలు, ఆదావాను పరిశోధించినవారి అభిప్రాయము ఉండాలి. లూసియ, పౌలు గురించి, “ధర్మశాస్త్ర వాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు” అని పేర్కొన్నాడు. పౌలు మీద నేరము మోపినవారు కూడ తమ అభియోగాలను అధిపతియైన ఫేలిక్సు ఎదుట చెప్పుకొమ్మని ఆయన ఆజ్ఞాపించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 23:29,30.

అధిపతియైన ఫేలిక్సు తీర్పు తీర్చలేకపోయాడు

ప్రాంతీయ న్యాయపరిపాలన ఫేలిక్సు అధికారంపైనే ఆధారపడివుంది. ఆయన కావాలనుకుంటే సమాజంలోని ప్రముఖులకు, ప్రభుత్వాధికారులకు వర్తించే స్థానిక ఆచారాన్ని లేదా నేరానికి సంబంధించిన న్యాయశాస్త్ర శాసనాన్ని పాటించేవాడే. నేరానికి సంబంధించిన ఆన్యాయశాస్త్రం ఓర్డో లేక పట్టిక అని పిలువబడేది. ఎలాంటి నేరాన్నైనా పరిశీలించే ఎక్స్‌ట్రా ఓర్డీనమ్‌ అనబడే న్యాయశాస్త్రం కావాలన్నా తీసుకునుండేవాడు. ప్రాంతీయ అధిపతి ‘రోములో ఏమి జరిగిందన్నది పరిగణలోకి తీసుకోకూడదు, సాధారణంగా ఏది ఔచిత్యమో అదే చేయాలి.’ అందుకే ఎక్కువగా ఆయన వివేచనకే వదిలేయబడింది.

ప్రాచీన రోమా న్యాయశాస్త్ర వివరాలు అన్నీ గర్తించబడలేదు, కానీ పౌలు దావాను “ఎక్స్‌ట్రా ఓర్డీనమ్‌ ప్రకారం ప్రాంతీయ శిక్షాస్మృతి జరిపే తీరుకు ఒక మాదిరి వృత్తాంతం”గా పరిగణించారు. సలహాదార్ల సహాయంతో, అధిపతి బయటివారు చేసే నిందారోపణలు వింటాడు. ఫిర్యాదిని ఎదుర్కోవడానికి ప్రతివాది పిలువబడేవాడు, ఆయన తనను తాను సమర్థించుకోవచ్చు, కానీ రుజువు చేసే భారం దావా వేసిన వ్యకిపైనే ఆధారపడివుంటుంది. మేజిస్ట్రేట్‌కు సరైనదిగా తోచిన శిక్షను విధిస్తాడు. ఆయన వెంటనే తీర్పు తీర్చవచ్చు లేక నిరవధికంగా వాయిదా వేయవచ్చు, అలాంటి సందర్భంలో ప్రతివాదిని నిర్బంధించే ఉంచాలి. హెన్రీ కాడ్‌బరీ అనే పండితుడు, “అలాంటి ఇష్టానుసార అధికారమున్న వ్యవహర్త ‘అనుచిత ప్రభావానికి’ లోనయ్యే స్థానంలో ఉండేవాడు, విడుదల చేయడానికి, దండించడానికి, లేక వాయిదా వేయడానికి అవినీతికి పాల్పడేవాడు అనడంలో సందేహం లేదు” అని అన్నాడు.

ప్రధానయాజకుడైన అననీయ, యూదుల పెద్దలు, తెర్తుల్లు కలిసి పౌలు “పీడవంటివాడును, ... యూదులను కలహమునకు రేపువాడును” అని ఫేలిక్సుతో విస్పష్టంగా ఫిర్యాదు చేశారు. పౌలు “నజరేయుల మతభేదమునకు” నాయకుడు, దేవాలయమును అపవిత్రము చేయడానికి ప్రయత్నించాడని వాళ్ళు ఆరోపించారు.​—⁠అపొస్తలుల కార్యములు 24:1-6.

యూదులకు మాత్రమే పరిమితమైన దేవాలయ ఆవరణలోకి యూదుడుకాని త్రోఫిము అనే వ్యక్తిని పౌలు తీసికొని వచ్చాడని ఆయనపై మొదట దాడి చేసినవారు అనుకున్నారు. * (అపొస్తలుల కార్యములు 21:​28,29) నిజం చెప్పాలంటే, అక్రమంగా ప్రవేశించాడని ఆరోపించాల్సింది త్రోఫిముపైన, పౌలుపైన కాదు. అయినా యూదులు గనుక పౌలు చేసిన చర్యను అక్రమంగా ప్రవేశించడానికి దుష్ప్రేరణ చేశాడని స్పష్టం చేస్తే, అది మరణశిక్షార్హమైన నేరంగా కూడా పరిగణించబడుతుంది. అలాంటి నేరానికి మరణ శిక్ష విధించే అనుమతిని రోము కల్పించినట్లు అనిపిస్తుంది. పౌలు లూసియ ద్వారా బంధింపబడడానికి బదులు, యూదుల దేవాలయ రక్షక భటులచేత బంధించబడితే, ఆమహాసభ ఎటువంటి సమస్య లేకుండా విచారించి ఆయనకు శిక్ష విధించి ఉండేది.

పౌలు బోధించింది యూదామతం కాదని లేక న్యాయవంతమైన మతం (రిలిజియో లిఖిటా) కాదని యూదులు తర్కించారు. అది చట్టవిరుద్ధమైనదనే కాకుండా దేశద్రోహమని కూడా పరిగణించబడుతుంది.

పౌలు “భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడు” అని కూడా వాళ్ళు ఆరోపించారు. (అపొస్తలుల కార్యములు 24:⁠5) “లోకమంతా సార్వత్రిక ఉపద్రవం రేపిన” కారణంగా క్లౌదియ (క్లాడియస్‌) చక్రవర్తి కొంతకాలం క్రితమే అలెగ్జాండ్రియాలోని యూదులను నిందించాడు. ఇక్కడున్న సారూప్యత గమనార్హం. “ఆఅభియోగం ఎటువంటిదంటే, క్లాడియస్‌ పరిపాలన కాలంలో లేక నీరో పాలించిన తొలి సంవత్సరాల్లో ఒక యూదుడిని దేశద్రోహిగా నిలపడానికి ఖచ్చితమైన విధంగా ఉంది.” అని ఎ.ఎన్‌. షెర్విన్‌ వైట్‌ అనే చరిత్రకారుడు చెబుతున్నాడు. “పౌలు ప్రకటిస్తున్నది తన సామ్రాజ్యంలోని యూదా జనులందరిలో ఆందోళనను కలిగించేలాంటిదని అధిపతి అనుమానించేలా యూదులు ఆయనను ప్రేరేపించారు. పూర్తిగా మతసంబంధ ఆరోపణలున్న దావాలను విచారించడానికి అధిపతులు ఇష్టపడడంలేదని వాళ్ళకు తెలుసు, అందుకే మత ఆరోపణతోపాటు రాజకీయ కుట్ర ఉందనిపించడానికి ప్రయత్నించారు.”

పౌలు ఒక్కొక్క అంశం ప్రకారం తనను తాను సమర్థించుకున్నాడు. ‘నేను ఎటువంటి అలజడి కలగజేయలేదు. వారు ‘మతభేదము’ అని పేరుపెట్టిన మార్గములో నేను నడచునది నిజమే, కానీ అలా నడుచుకోవడం యూదా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని సూచిస్తుంది. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు అల్లరి పుట్టించారు. నామీద వారికేమైనా ఫిర్యాదు ఉంటే మీసన్నిధికి వచ్చి ఆపని చెయ్యాలి.’ పౌలు ముఖ్యంగా రోముకు న్యాయాధికారం ఎక్కువగా లేని యూదుల మధ్యనున్న ఒక తగాదాకు ఆరోపణలను కుదించాడు. అప్పటికే మొండిగా ఉన్న యూదుల కోపం గురించి తెలిసిన ఫేలిక్సు సరైన న్యాయవిచారణ జరగాలని చాలా తీవ్రంగా కోరుతూ వాయిదా వేశాడు. పౌలు అటు న్యాయాధికారముందని చెప్పుకున్న యూదులకు అప్పగించబడలేదు, ఇటు రోమా న్యాయశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చబడలేదు, విడుదలా చేయబడలేదు. ఫేలిక్సు తీర్పు ఇచ్చేలా బలవంతం చేయడం వీలుకాదు, ఆయన వాయిదా వేయడంలో, యూదుల అనుగ్రహం పొందాలనేకాక, పౌలు తనకేమైనా లంచం ఇస్తాడేమోననే మరో ఆశ కూడా ఉంది.​—⁠అపొస్తలుల కార్యములు 24:10-19, 26. *

పోర్కియు ఫేస్తు దగ్గర కీలకమైన మలుపు

రెండు సంవత్సరాల తర్వాత కొత్త అధికారి పోర్కియు ఫేస్తు యెరూషలేముకు వచ్చినప్పుడు, పౌలును తమ అధికారపరిధికి అప్పగించుమని కోరుతూ యూదులు తమ ఫిర్యాదుకు మళ్ళీ జీవం పోశారు. కాని ఫేస్తు చాలా కఠినంగా ప్రతిస్పందించాడు: “నేరము మోపబడినవాడు నేరము మోపినవారికి ముఖాముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదు.” హారీ డబ్ల్యు తాజ్రా అనే చరిత్రకారుడు ఇలా పేర్కొన్నాడు: “రోమా పౌరునికి అన్యాయంగా మరణశిక్ష విధింపజేయాలని కుట్ర పన్నబడిందని ఫేస్తు సులభంగానే గ్రహించాడు.” ఆకారణంగా ఆయన తమ దావాను కైసరయకు తీసుకువెళ్ళమని యూదులతో చెప్పాడు.​—⁠అపొస్తలుల కార్యములు 25:1-6,16.

అక్కడ, పౌలు “ఇక బ్రదుక తగడు” అని యూదులు కంఠోక్తిగా ప్రకటించారు, అయినా వాళ్ళు రుజువు చేయలేకపోయారు, మరణార్హమైనదేదీ పౌలు చేయలేదని ఫేస్తు గ్రహించాడు. “తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను; ఆయేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను” అని ఫేస్తు మరో అధికారికి తెలియజేశాడు.​—⁠అపొస్తలుల కార్యములు 25:7, 18-20, 24,25.

స్పష్టంగా పౌలు ఎటువంటి రాజకీయ ఆరోపణలు లేని నిర్దోషి, కానీ మత సంబంధ వివాదముంది, యూదులు ఈదావాను పరిష్కరించడానికి తమ న్యాయ సభ మాత్రమే సమర్థవంతమైనదన్నట్లు వాదించారు. ఈవిషయాల్లో తీర్పు పొందడానికి పౌలు యెరూషలేముకు వెళ్తాడా? నిజంగా అది సరైన ప్రతిపాదన కాకపోయినా, యెరూషలేముకు వెళతావా అని ఫేస్తు పౌలును అడిగాడు. నేరారోపణ చేసినవారు న్యాయాధిపతులయ్యే యెరూషలేము నిర్బంధంలోకి పంపించడమంటే, పౌలును యూదులకు అప్పగించడమన్నట్లే. “కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి యున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదు. ... నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందును” అని పౌలు అన్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 25:10, 11,20.

ఒక రోమీయుని నోటినుండి వచ్చిన ఈమాటలు ప్రాంతీయ అధికారపరిధి మొత్తాన్ని నిలిపివేశాయి. ఆయన అప్పీలు (ప్రొవొకాత్యొ) చేసుకునే హక్కు “సరైనది, సమగ్రమైనది, సమర్థమైనది.” తన సలహాదారులతో సాంకేతికంగా సంప్రదించిన తర్వాత ఫేస్తు ఇలా ప్రకటించాడు: “కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదువు.”​—⁠అపొస్తలుల కార్యములు 25:⁠12.

పౌలును వదిలించుకున్నందుకు ఫేస్తు సంతోషించాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన హేరోదు అగ్రిప్ప II దగ్గర ఒప్పుకున్న ప్రకారం ఆదావా ఆయనను అయోమయంలో పడవేసింది. ఫేస్తు ఆదావా గురించిన ఒక నివేదికను చక్రవర్తి కోసం తయారు చేయాల్సివచ్చింది, కానీ ఫేస్తుకు ఆరోపణల్లో ఇమిడివున్న యూదుల న్యాయ సంశ్లిష్టత అర్థం కాలేదు. అయితే అగ్రిప్ప అలాంటి విషయాల్లో ప్రావీణ్యుడు, అప్పుడు ఆయన ఆసక్తిని కనబరచగానే వెంటనే ఆఉత్తరం వ్రాయడానికి సహాయం చేయమని ఆయనను ఫేస్తు అడిగాడు. అగ్రిప్ప ముందు పౌలు మాట్లాడినదేమీ గ్రహించలేకపోయిన ఫేస్తు “పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినది” అని గట్టిగా అరిచాడు. కానీ అగ్రిప్ప బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే, “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే” అని ఆయన అన్నాడు. పౌలు వాదనల గురించి వాళ్ళేమి అనుకున్నా, పౌలు నిర్దోషి అని ఫేస్తు మరియు అగ్రిప్ప ఒప్పుకున్నారు, ఆయన కైసరుకు అప్పీలు చేసుకునుండకపోతే వారాయనను విడుదల చేసేవారు.​—⁠అపొస్తలుల కార్యములు 25:13-27; 26:24-32.

న్యాయవిచారణ ప్రయాణం ముగింపు

పౌలు రోముకు చేరుకున్న తర్వాత, యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించుకున్నాడు. వారికి సాక్ష్యమివ్వడానికే కాకుండా తన గురించి వారికేమి తెలుసో కనుగొందామని అలా పిలిపించుకున్నాడు. అభియోగం నడిపే న్యాయవాది ఉద్దేశాలు ఏమైనా అది వెల్లడి చేస్తుండవచ్చు. యెరూషలేములోని అధికారులు ఒక దావా విచారణలో సహాయం కోసం రోమా యూదులను పిలవడం మామూలే. కాని తమకు పౌలు గురించి ఆదేశాలు ఏమీ రాలేదు అని వాళ్ళు చెప్పారు. విచారణ వాయిదాలో ఉన్నప్పుడు, పౌలు ఒక ఇంటిని కిరాయికి తీసుకుని, స్వేచ్ఛగా ప్రకటించడానికి అనుమతించబడ్డాడు. అలాంటి సౌమ్యత చూపించడం వలన, రోమన్లు పౌలును నిర్దోషిగా భావించారని అర్థమవుతోంది.​—⁠అపొస్తలుల కార్యములు 28:17-31.

పౌలు మరో రెండు సంవత్సరాలు నిర్బంధంలోనే ఉన్నాడు. ఎందుకు? బైబిలు వివరాలు తెలియజేయడంలేదు. మామూలుగా ఒక అప్పీలుదారు, తనపై అభియోగం చేసినవారు తమ ఆరోపణలతో హాజరయ్యేంతవరకు ఉండాలి, కాని బహుశా యెరూషలేములోని యూదులు తమ దావాకు బలమైన ఆధారాలు లేవని గుర్తించారేమో వాళ్ళు హాజరు కానేలేదు. పౌలును నోరు మెదపకుండా ఉంచేందుకు అతి శ్రేష్ఠమైన మార్గం బహుశా సాధ్యమైనంత వరకు హాజరవకుండా ఉండడమే కావచ్చు. కారణమేదైనప్పటికీ పౌలు అలా రెండు సంవత్సరాలు ఉండాల్సివచ్చింది. పౌలు నీరో ముందు హాజరైనట్లు అనిపిస్తుంది, అక్కడ ఆయన నిర్దోషిగా ప్రకటించబడి చివరికి తన మిషనరీ కార్యాల్లో తిరిగి పాల్గొనడానికి​—⁠నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత అయిదు సంవత్సరాలకు విడుదల పొందాడు.​—⁠అపొస్తలుల కార్యములు 27:⁠24.

సత్య విరోధులు, ‘కీడు కలిగించే కట్టడలతో’ క్రైస్తవ ప్రకటనా పనిని నిరోధించడానికి చాలా కాలం ప్రయత్నించారు. ఇది మనల్ని ఏ మాత్రం ఆశ్చర్యపరచకూడదు. యేసు ఇలా అన్నాడు: “లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు.” (కీర్తన 94:​20; యోహాను 15:​20) అయినప్పటికీ, సువార్త లోకమందంతటా ప్రకటించబడే స్వేచ్ఛ ఉందని కూడా యేసు హామీ ఇస్తున్నాడు. (మత్తయి 24:​14) అందుకే, అపొస్తలుడైన పౌలు ‘సువార్తపక్షమున వాదించుటకు, దానిని స్థిరపరచుటకు’ హింసను, వ్యతిరేకతను విజయవంతంగా ఎలాగైతే ఎదుర్కొన్నాడో నేడు యెహోవాసాక్షులు కూడా అలాగే ఎదుర్కొంటారు.​—⁠ఫిలిప్పీయులు 1:⁠7.

[అధస్సూచీలు]

^ పేరా 14 లోపలి ఆవరణమునుండి అన్యుల ఆవరణమును విడదీస్తూ మూడు మూరల ఎత్తుతో నిర్మించబడిన ఒక రాళ్ళగోడ ఉంటుంది. ఆగోడమీద వరుసగా అక్కడక్కడ, కొన్ని గ్రీకు భాషలో కొన్ని లాటిన్‌ భాషలో హెచ్చరికలుండేవి: “అన్యులెవరూ ఈఅడ్డుగోడను, ఆలయం చుట్టూ ఉన్న కంచెను దాటి లోపలికి రాకూడదు. అలా వచ్చేటప్పుడు ఎవరైనా పట్టుబడితే పరిణామం మరణం.”

^ పేరా 17 అది నిజానికి చట్టవిరుద్ధమే. ఒక గ్రంథం ఇలా పేర్కొంది: “బలవంతంగా తీసుకొనేవాటికి సంబంధించిన చట్ట నిబంధన విభాగం, లెక్స్‌ రెపెట్యుండారమ్‌ క్రింద, ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తి లేక వ్యవహార నిర్వహణలో ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తిని బంధించడానికిగానీ విడిపించడానికిగానీ లేక తీర్పు తీర్చడానికి లేక తీర్చకపోవడానికి లేక ఖైదీని విడుదల చేయడానికిగానీ అభ్యర్థనలను లేక లంచాలను తీసుకోకూడదు.”