మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే ఈక్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
• జర్మనీ ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు, మతానికి సంబంధించి ఏ చట్టపరమైన విజయానికి తోడ్పడింది?
యెహోవాసాక్షులు చట్టబద్ధమైన గుర్తింపు పొందకుండా వేరే కోర్టు ఇచ్చిన ప్రతికూలమైన తీర్పును ఈ కోర్టు కొట్టివేసింది. ఒక వ్యక్తి మతస్వాతంత్ర్య పరిమితుల్లో, చట్టానికన్నా ఎక్కువగా ‘తన విశ్వాస సిద్ధాంతాలకు లోబడవచ్చు’ అని విజయానికి దోహదపడే నిర్ణయాన్ని తెలియజేసింది.—8/15,8వ పేజీ.
• యోబు ఎంత కాలం బాధలను అనుభవించాడు?
యోబు పుస్తకము ఆయన అనేక సంవత్సరాలు బాధపడ్డాడని సూచించడంలేదు. యోబు బాధలను సహించడమూ, పరిష్కారం పొందడమూ కొన్ని నెలల్లో, బహుశా ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలంలోనే జరిగివుండవచ్చు.—8/15,31వ పేజీ.
• సాతాను ఉనికి మూఢనమ్మకం కాదని మనం ఖచ్చితంగా ఎలా నమ్మవచ్చు?
సాతాను వాస్తవమైనవాడని యేసు క్రీస్తుకు తెలుసు. యేసు ఒక నిజమైన వ్యక్తిచేత శోధించబడ్డాడు, తనలోనే ఉన్న ఏదో దుర్గుణం చేత కాదు. (మత్తయి 4:1-11; యోహాను 8:44; 14:30)—9/1, 5-6 పేజీలు.
• “ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము” అని సామెతలు 10:15 చెబుతోంది. ఇది నిజమని ఎలా నిరూపించవచ్చు?
అభివృద్ధిచెందిన పట్టణంలో నివసించేవారికి ఆపట్టణం కొంతమేరకు రక్షణనిచ్చినట్లే, సిరిసంపదలు కూడా జీవితంలో ఎదురయ్యే కొన్ని అనిశ్చితమైన పరిస్థితుల నుండి రక్షణనిస్తాయి. ఎదురుచూడని పరిణామాలు ఏర్పడినప్పుడు మాత్రము పేదరికం వినాశకరంగా ఉంటుంది.—9/15,24వ పేజీ.
• ఎనోషు కాలంలో “యెహోవా నామమున ప్రార్థన చేయుట” అన్నది ఏఅర్థంతో ఆరంభమైనది? (ఆదికాండము 4:26)
మానవ చరిత్రారంభము నుండే దైవిక నామము ఉపయోగించబడుతోంది. కాబట్టి ఎనోషు కాలంలో ఆరంభమైనది, యెహోవాను విశ్వాసంతో స్వచ్ఛారాధనలో ప్రార్థించడం కాదు. మానవులు తమకో లేక తాము ఎవరి ద్వారానైతే దేవుడ్ని ఆరాధిస్తున్నామని నటించారో వారికో, దేవుని నామమును దూషణకరంగా అన్వయించి ఉంటారు.—9/15,29వ పేజీ.
• బైబిల్లో ఉపయోగించిన ప్రకారం, “శిక్ష” అనే పదానికి అర్థమేమిటి?
ఆ పదం ఎలాంటి దుష్ప్రవర్తననూ లేదా క్రూరత్వమునూ సూచించడం లేదు. (సామెతలు 4:13; 22:15) “శిక్ష” అని అనువదించబడిన గ్రీకు పదం ప్రాథమికంగా ఉపదేశించడం, నేర్పించడం, సరిదిద్దడం, కొన్నిసార్లు దృఢంగా అదే సమయంలో ప్రేమపూర్వకంగా మందలించడానికి కూడా వర్తిస్తుంది. తల్లిదండ్రులు యెహోవాను అనుకరించడానికి ఒక ప్రాముఖ్యమైన మార్గమేమిటంటే, తమ పిల్లలు తమతో నిస్సంకోచంగా సంభాషించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండేలా కృషిచేయడమే. (హెబ్రీయులు 12:7-10)—10/1, 8,10 పేజీలు.
• నేడు నిజ క్రైస్తవులు దేవుని చేత పరిపాలించబడాలని కోరుకుంటున్నారనడానికి నిదర్శనమేమిటి?
దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్న యెహోవాసాక్షులు, చివరికి నిషేధించబడిన దేశాల్లోనైనా సరే, రాజకీయాలకు దూరంగా ఉంటారు లేక తిరుగుబాటును లేవదీయరు. (తీతు 3:1) బదులుగా, వారు యేసు మరియు మొదటి శతాబ్దపు క్రైస్తవుల వలె నిజాయితి, నైతిక పవిత్రత, ఉద్యోగాల్లో నీతి నియమాలు పాటించడం వంటి ఆరోగ్యకరమైన బైబిలు విలువలను తమ సొంతం చేసుకునేందుకు ప్రజలకు తోడ్పడడానికి శ్రమిస్తారు.—10/15,6వ పేజీ.
• ఆండీస్లో జీవాన్నిచ్చే జలాలు ఎలా ప్రవహిస్తున్నాయి?
అక్కడి యెహోవాసాక్షులు ప్రజలకు క్వెచూవా అయ్మారా వంటి స్థానిక భాషల్లో కూడా బైబిలు సత్యాలను చేరవేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. సాక్షులు టిటికాకా సరస్సులోని ద్వీపాల్లో ఉండే ప్రజలనేకాక, ఆసరస్సులో పెరిగే జమ్ముతో చేయబడ్డ “తేలుతున్న” ద్వీపాల్లోని ప్రజలను కూడా సందర్శిస్తున్నారు.—10/15, 8-10 పేజీలు.
• ఆధునిక విమానాలకు ఉన్నటువంటి కంప్యూటర్ గైడెన్స్ సిస్టమ్లా ఉండే ఏసిస్టమ్ను దేవుడు మన నడిపింపు కోసం ఇచ్చాడు?
దేవుడు మానవులకు నైతిక నడిపింపునిచ్చే సామర్థ్యమున్న, అంతర్గత ఇంద్రియాన్ని ఇచ్చాడు, అదే మనకు జన్మతః ఉన్న మనస్సాక్షి. (రోమీయులు 2:14, 15)—11/1,3-4 పేజీలు.
• యేసు మరణానికి ఎందుకంత విశిష్టమైన విలువ ఉంది?
పరిపూర్ణ మానవుడైన ఆదాము పాపము చేసినప్పుడు, అతను తన మానవ జీవమే కాక తన సంతానం కూడా జీవం కోల్పోయేలా చేశాడు. (రోమీయులు 5:12) పరిపూర్ణుడైన యేసు, తన మానవ జీవితాన్ని బలి ఇచ్చాడు, ఆవిధంగా యథార్థ మానవులకు నిరంతర జీవితం సాధ్యమయ్యేలా విమోచన క్రయధనాన్ని ఇచ్చాడు.—11/15, 5-6 పేజీలు.
• కొలొస్సయులు 3:11 లో పేర్కొన్న సిథియన్లు ఎవరు?
సిథియన్లు సా.శ.పూ. 700 నుండి 300 వరకు యురేషియాలోని స్టెప్పీ మైదానాల్లో స్వైరవిహారం చేసిన సంచార జనం. వారు అద్భుతమైన అశ్వారోహులు, యోధులు. కొలొస్సయులు 3:11 నిర్దిష్టమైన జనాంగాన్ని కాదుగాని అతి ఘోరమైన అనాగరిక ప్రజల్ని సూచించి ఉండవచ్చు.—11/15, 24-25 పేజీలు.
• బంగారు సూత్రం, మనం ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాల్సినంత విలువైన బోధ అని ఎందుకు అనవచ్చు?
ఈ నీతి సూత్రం యూదామతంలో, బౌద్ధమతంలో, గ్రీకు తత్త్వంలో, కన్ఫ్యూషియనిజమ్లో కూడా వ్యాపించింది. అయినప్పటికీ, యేసు కొండమీది ప్రసంగంలో ఏదైతే పేర్కొన్నాడో అది ప్రజలందరి జీవితాలను అన్ని కాలాల్లోను ప్రభావితంచేసే అనుకూలమైన చర్యలను చేయమంటుంది. (మత్తయి 7:12)—12/1,3వ పేజీ.