కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రస్సెల్‌ వ్రాతలను అమూల్యమైనవిగా ఎంచిన ఇద్దరు పాస్టర్లు

రస్సెల్‌ వ్రాతలను అమూల్యమైనవిగా ఎంచిన ఇద్దరు పాస్టర్లు

రస్సెల్‌ వ్రాతలను అమూల్యమైనవిగా ఎంచిన ఇద్దరు పాస్టర్లు

యెహోవా నిజ క్రైస్తవ ఆరాధకుల మధ్యన అత్యంత విశేషమైన పనిని చేసిన ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ 1891 లో మొదటిసారి యూరప్‌ను సందర్శించాడు. రస్సెల్‌ ఇటలీలోని పీనెరోలో పట్టణంలో ఆగినప్పుడు, వాల్డెన్సులు * అని పిలువబడే ఒక మతగుంపు యొక్క మాజీ పాస్టర్‌ అయిన ప్రొఫెసర్‌ డాన్యెలా రీవార్‌ను కలిశాడని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. పరిచర్యను వదిలేసిన తర్వాత రీవార్‌ వాల్డెన్సులతో సన్నిహితంగా సహవసించినప్పటికీ విశాల హృదయంతో, సి. టి. రస్సెల్‌ వ్రాసిన అనేక ప్రచురణలను చదివాడు.

రీవార్‌ 1903 లో, రస్సెల్‌ వ్రాసిన, “యుగాలను గురించిన దైవిక ప్రణాళిక” (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఇటాలియన్‌ భాషలోకి అనువదించి, తన సొంత ఖర్చులతో దాన్ని ముద్రించాడు. ఇది, ఈ పుస్తకం యొక్క ఆధికారిక ఇటాలియన్‌ సంచిక వెలువడడానికి ఎంతోకాలం ముందే జరిగింది. ఆ పుస్తకం యొక్క ముందుమాటలో రీవార్‌ ఇలా వ్రాశాడు: “ఈ మొదటి ఇటాలియన్‌ సంచికను మేము ప్రభువు కాపుదలలో ఉంచుతున్నాము. దీనిలో దోషాలు ఉన్నప్పటికీ, ఆయన అతిపరిశుద్ధ నామము మహిమపరచబడడానికి దోహదపడి, ఇటాలియన్‌ భాష మాట్లాడే తన పిల్లలు గొప్ప భక్తిని కలిగివుండేందుకు ప్రోత్సహించేలా ఆయన దీనిని ఆశీర్వదించును గాక. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా, దేవుని ప్రణాళికలోనూ, ఆయన ప్రేమలోనూ ఉన్న సంపదల లోతును, బుద్ధి జ్ఞానముల బాహుళ్యాన్ని గ్రహించేవారందరి హృదయాలు, ఈ పుస్తక ప్రచురణ ఎవరి అనుగ్రహంతోనైతే సాధ్యమైందో ఆ దేవుని పట్ల కృతజ్ఞతతో నింపబడును గాక!”

రీవార్‌ సీయోను కావలికోట మరియు క్రీస్తు ప్రత్యక్షతా చాటింపు (ఆంగ్లం) పత్రికను కూడా ఇటాలియన్‌ భాషలోకి అనువదించడం ప్రారంభించాడు. కావలికోట యొక్క తొలి రూపమైన ఈ పత్రిక, 1903 లో త్రైమాసిక సంచికగా వెలువడింది. ప్రొఫెసర్‌ రీవార్‌ యెహోవాసాక్షులు అప్పట్లో పిలువబడుతున్నట్లు బైబిలు విద్యార్థిగా ఎన్నడూ మారకపోయినప్పటికీ, బైబిలు విద్యార్థుల ప్రచురణల్లో వివరించబడినట్లుగా బైబిలు సందేశాన్ని వ్యాప్తిచేయడంలో ఎంతో ఆసక్తిని చూపించాడు.

“నా కన్నుల నుండి పొరలు రాలినట్లుగా అనిపించింది”

రస్సెల్‌ ప్రచురణలను విలువైనవిగా ఎంచిన, వాల్డెన్సుల మరో పాస్టర్‌ జూజెప్పే బాంకెట్టీ. ముందు క్యాథలిక్‌ మతంలో ఉండి ఆ తర్వాత మతాన్ని మార్చుకున్న, జూజెప్పే తండ్రి ఆయనకు వాల్డెన్సుల విద్యను అభ్యసింపజేశాడు. జూజెప్పే 1894 లో పాస్టరై, అపూల్య, అబ్రుట్సీ, ఎల్బా మరియు సిసిలీ ద్వీపాల్లోని వివిధ వాల్డెన్సుల సమాజాల్లో సేవ చేశాడు.

రస్సెల్‌ వ్రాసిన “యుగాలను గురించిన దైవిక ప్రణాళిక” (ఆంగ్లం) అనే పుస్తకం యొక్క ఆధికారిక ఇటాలియన్‌ సంచిక 1905 లో ప్రచురించబడింది. బాంకెట్టీ ఆ పుస్తకం గురించి ఉత్సాహవంతమైన గ్రంథసమీక్షను వ్రాశాడు. అది, ప్రొటెస్టెంటుల పత్రిక అయిన లా రీవీస్టా క్రీస్ట్యానా అనే దానిలో ప్రచురించబడింది. రస్సెల్‌ వ్రాసిన పుస్తకం, “మనకు ఎంతో జ్ఞానోదయాన్ని కలిగించే పుస్తకం, పరిశుద్ధ లేఖనాల యొక్క ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన అధ్యయనాన్ని చేపట్టడానికి ఏ క్రైస్తవుడికైనా ఇది ఖచ్చితమైన మార్గదర్శకం . . . నేను దాన్ని చదివిన వెంటనే దేవుని మార్గం మరింత తిన్నగా మరింత సులభంగా కనిపించినట్లుగా, నా కన్నుల నుండి పొరలు రాలినట్లుగా అనిపించింది. పరస్పర వైరుధ్యాలుగా కనిపించినవి కూడా చాలామేరకు అంతర్ధానమయ్యాయి. ఒకప్పుడు అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించిన సిద్ధాంతాలు సరళంగా, సంపూర్ణంగా అంగీకరించదగినవిగా కనిపించాయి. మునుపు అవగాహనకు అందని విషయాలు స్పష్టమయ్యాయి. క్రీస్తు ద్వారా లోక రక్షణ అనే శ్లాఘనీయమైన ప్రణాళిక నా ఎదుట ఎంతటి అద్భుతమైన స్పష్టతతో కనిపించిందంటే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అనడంలో నేను అపొస్తలుడితో కలిసేలా నన్ను అది ప్రేరేపించింది.”​—⁠రోమీయులు 11:​33.

1925 లో రెమీజో కూమీనెటీ పేర్కొన్నట్లుగా, బాంకెట్టీ బైబిలు విద్యార్థులు చేస్తున్న పనిపట్ల “ఎంతో సహానుభూతిని” చూపించి, వారు వివరించిన సిద్ధాంతాల గురించి “పూర్తిగా ఒప్పించబడ్డాడు.” బాంకెట్టీ ఆ సిద్ధాంతాలను ఇతరులకు తెలియజేయడానికి తన సొంత విధానంలో కృషి కూడా చేశాడు.

యెహోవాసాక్షుల వలే బాంకెట్టీ కూడా లేఖనాల్లో బోధించబడినట్లుగా భూసంబంధమైన పునరుత్థానం ఉంటుందని విశ్వసించాడని ఆయన వ్రాతల నుండి స్పష్టమవుతోంది. అంతేగాక, యేసు మరణించిన సంవత్సరం దేవునిచే నిర్ణయించబడిందనీ, 70 వారాలను గురించిన దానియేలు ప్రవచనంలో దేవుడు దానిని వెల్లడి చేశాడనీ వివరించినప్పుడు ఆయన బైబిలు విద్యార్థులతో ఏకీభవించాడు. (దానియేలు 9:​24-27) ఒకటి కన్నా ఎక్కువసార్లు, తన చర్చి బోధపట్ల బహిరంగంగా అసమ్మతిని వ్యక్తపరుస్తూ, యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ “ఖచ్చితంగా ఏ తేదీన వస్తుందో” ఆ తేదీనే, అదీ సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఆచరించాలని ఆయన విశ్వసించాడు. (లూకా 22:​19, 20) ఆయన డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని నిరాకరించాడు, నిజ క్రైస్తవులు లౌకిక యుద్ధంలో పాల్గొనకూడదని స్థిరంగా చెప్పాడు.​—⁠యెషయా 2:⁠4.

బాంకెట్టీ ఒక సందర్భంలో, రస్సెల్‌ వ్రాతల గురించి జె. కాంబెల్‌ వాల్‌ అనే పేరుగల వ్యక్తితో మాట్లాడుతున్నాడు. వాల్‌ చేస్తున్న విమర్శలకు సమాధానంగా బాంకెట్టీ ఇలా అన్నాడు: “మీరు గనుక రస్సెల్‌ వ్రాసిన ఆరు సంపుటాలను చదివితే, బలమైన, ప్రగాఢమైన ఆనందానుభూతిని పొందుతారని, భావోద్వేగంతో మీరు నాకు కృతజ్ఞతలు తెలుపుతారని నాకు ఖచ్చితంగా తెలుసు. నేను వాళ్ళ సిద్ధాంతాన్ని చాటిచెప్పను; కానీ నేను ఆ పుస్తకాలను పదకొండు సంవత్సరాల క్రితం చదివాను, పరిశుద్ధ లేఖనాలపై సంపూర్ణంగా, దృఢంగా ఆధారపడి ఉన్న అలాంటి సాహితీకృతి ద్వారా నా ఎదుట అంతటి వెలుగును, అంతటి ఓదార్పును ఉంచినందుకు నేను ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాను.”

“వినండి, వినండి, వినండి”

వాల్డెన్సుల పాస్టర్లైన వీరిద్దరూ​—⁠డాన్యెలా రీవార్‌ మరియు జూజెప్పే బాంకెట్టీ​—⁠రస్సెల్‌ బైబిలును వివరించిన విధానంపట్ల మెప్పును వ్యక్తపర్చడమన్నది గమనార్హమైన విషయం. బాంకెట్టీ ఇలా వ్రాశాడు: “సువార్తికులమైన మనలో ఎవరికీ, చివరికి మన పాస్టర్లలో లేక దైవశాస్త్ర ప్రొఫెసర్లలో ఎవరికీ అంతా తెలియదు. అంతేకాదు, మనం తెలుసుకోవలసిన ఇతర విషయాలు అనేకం ఉన్నాయి. . . . [మనం] . . . మనకే అంతా తెలుసని అనుకోకుండా, పరిశీలించడానికి మనకు అందజేయబడినదాన్ని నిరాకరించకుండా, కాస్తాగి వినాలి. అవును, వినండి, వినండి, వినండి.”

ప్రతి సంవత్సరం, యెహోవాసాక్షులు తమ గృహాల వద్దకు తీసుకువచ్చే రాజ్య సందేశాన్ని వేలాదిమంది వింటున్నారు. అన్ని చోట్లా ఉన్న విశాల హృదయంగల, బైబిలు సత్యాల కోసం పరితపించే ప్రజలు, “వచ్చి నన్ను వెంబడించుమని” యేసు ఇస్తున్న ఆహ్వానానికి ప్రతిస్పందిస్తున్నారు.​—⁠మార్కు 10:​17-21; ప్రకటన 22:⁠17.

[అధస్సూచి]

^ పేరా 1 ఫ్రాన్స్‌లోని లైయన్స్‌కు చెందిన 12వ శతాబ్దపు వ్యాపారి అయిన ప్యెర్‌ వాడే లేదా పీటర్‌ వాల్డో పేరు మీదుగా ఆ పేరు వచ్చింది. వాల్డో తన నమ్మకాల మూలంగా క్యాథలిక్‌ చర్చి నుండి బహిష్కరించబడ్డాడు. వాల్డెన్సుల గురించి అదనపు సమాచారం కోసం కావలికోట 2002, మార్చి 15 సంచికలోని, “వాల్డెన్సులు​—⁠చర్చివిరోధం నుండి ప్రొటెస్టెంటిజమ్‌ వైపుకు వారి పయనం” అనే ఆర్టికల్‌ను చూడండి.

[28వ పేజీలోని చిత్రం]

ప్రొఫెసర్‌ డాన్యెలా రీవార్‌

[29వ పేజీలోని చిత్రం]

జూజెప్పే బాంకెట్టీ

[చిత్రసౌజన్యం]

బాంకెట్టీ: La Luce, April 14, 1926