కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు సత్యమును అనుసరించి నడుస్తూ ఉంటారు

వారు సత్యమును అనుసరించి నడుస్తూ ఉంటారు

వారు సత్యమును అనుసరించి నడుస్తూ ఉంటారు

“నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.”​—⁠3 యోహాను 4.

1. “సువార్త సత్యము” దేనిపై దృష్టి కేంద్రీకరిస్తుంది?

యెహోవా తనను కేవలం “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించేవారిని మాత్రమే ఆమోదిస్తాడు. (యోహాను 4:​24) అలా ఆరాధించేవారు సత్యానికి లోబడతారు, దేవుని వాక్యంపై ఆధారపడిన క్రైస్తవ బోధల పూర్తి సముదాయాన్ని స్వీకరిస్తారు. ఈ “సువార్త సత్యము,” రాజ్యం ద్వారా యెహోవా సర్వాధిపత్యపు హక్కును రుజువు చేయడంపైనా యేసుక్రీస్తుపైనా దృష్టి కేంద్రీకరిస్తోంది. (గలతీయులు 2:​14) దేవుడు అబద్ధాలను ఇష్టపడేవారి దగ్గరికి “మోసముచేయు శక్తిని” పంపుతున్నాడు, కానీ రక్షణ అనేది సువార్తలో విశ్వాసం ఉంచడంపైనా సత్యములో నడుచుకోవడంపైనా ఆధారపడివుంటుంది.​—⁠2 థెస్సలొనీకయులు 2:9-12; ఎఫెసీయులు 1:​13, 14.

2. అపొస్తలుడైన యోహాను ప్రత్యేకంగా దేని నిమిత్తం కృతజ్ఞుడై ఉన్నాడు, గాయుతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉంది?

2 రాజ్య ప్రచారకులు “సత్యము” విషయంలో ఒకరికొకరు ‘సహాయకులు.’ వారు, అపొస్తలుడైన యోహాను ఆయన స్నేహితుడైన గాయుల వలె సత్యాన్ని అంటిపెట్టుకుని దానిలో నడవాలని తీర్మానించుకున్నారు. యోహాను గాయుని మనస్సులో ఉంచుకునే ఇలా వ్రాశాడు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.” (3 యోహాను 3-8) వృద్ధుడైన యోహాను గాయుకి సత్యాన్ని పరిచయం చేసివుండకపోయినప్పటికీ ఆ అపొస్తలుడి పెద్ద వయస్సు, క్రైస్తవ పరిణతి, పితృవాత్సల్యం వంటివి యౌవనస్థుడిగా కనిపిస్తున్న గాయుని యోహాను యొక్క ఆధ్యాత్మిక పిల్లల్లో ఒకరన్నట్లు దృష్టించేలా చేశాయి.

సత్యము మరియు క్రైస్తవ ఆరాధన

3. తొలి క్రైస్తవులు జరుపుకునే కూటాల సంకల్పం మరియు ప్రయోజనం ఏమిటి?

3 సత్యాన్ని నేర్చుకునేందుకు తొలి క్రైస్తవులు తరచూ వ్యక్తుల ఇళ్ళల్లో సంఘాలుగా సమకూడేవారు. (రోమీయులు 16:​3-5) వారక్కడ ప్రోత్సాహాన్ని పొందేవారు, ప్రేమ చూపడానికి సత్కార్యములు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకునేవారు. (హెబ్రీయులు 10:​24, 25) ఆ తర్వాతి కాలాలకు చెందిన క్రైస్తవులమని చెప్పుకున్న వారి గురించి టెర్టూలియన్‌ (దాదాపు సా.శ. 155-220 తర్వాతి వరకు) ఇలా వ్రాశాడు: “మేము దేవుని పుస్తకాలను చదివేందుకు సమావేశమవుతాము . . . ఆ పరిశుద్ధ వాక్యాలతో మేము మా విశ్వాసాన్ని పెంపొందించుకుంటాము, మా నిరీక్షణను ఉజ్జ్వలభరితంగా చేసుకుంటాము, మా నమ్మకాన్ని స్థిరపరచుకుంటాము.”​—⁠అపాలజీ, అధ్యాయం 39.

4. క్రైస్తవ కూటాల్లో పాటలు పాడడం ఎలాంటి పాత్రను పోషించింది?

4 పాటలు పాడడం బహుశ తొలి క్రైస్తవుల కూటాల్లో భాగమై ఉండవచ్చు. (ఎఫెసీయులు 5:​19; కొలొస్సయులు 3:​16) క్రైస్తవులమని చెప్పుకునేవారు పాడుకునే శ్రావ్యమైన పాటల విషయంలో రెండవ శతాబ్దపు విమర్శకుడైన సెల్సస్‌ అభిప్రాయాన్ని గురించి ప్రొఫెసర్‌ హెన్రీ ఛాడ్విక్‌ ఇలా వ్రాస్తున్నాడు: “అవి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, అవి తన భావోద్వేగాలపై చూపించే ప్రభావాన్ని బట్టి ఆయన నిజానికి ఎంతో నిరసన వ్యక్తం చేశాడు.” ఛాడ్విక్‌ ఇంకా ఇలా అంటున్నాడు: “క్రైస్తవులు ఎలాంటి సంగీతాన్ని ఉపయోగించడం సముచితమో చర్చించిన క్రైస్తవ రచయితల్లో అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్‌ మొట్టమొదటివాడు. లైంగిక భావాలను రేకెత్తించే నృత్య సంగీతాలతో జతచేయబడే సంగీతశైలిని ఉపయోగించకూడదని ఆయన నిర్దేశిస్తున్నాడు.” (ది ఎర్లీ చర్చ్‌, పేజీలు 274-5) తొలి క్రైస్తవులు కూటాల్లో సమావేశమైనప్పుడు పాటలు పాడినట్లే, యెహోవాసాక్షులు కూడా తరచూ దేవుణ్ణీ ఆయన రాజ్యాన్నీ స్తుతించే ప్రభావవంతమైన లేఖనాధారిత కీర్తనలను పాడతారు.

5. (ఎ) తొలి క్రైస్తవ సంఘాల్లో ఆధ్యాత్మిక నడిపింపు ఎలా అందించబడేది? (బి) నిజ క్రైస్తవులు మత్తయి 23:​8, 9 లో నమోదు చేయబడిన యేసు మాటలను ఎలా అన్వయించుకున్నారు?

5 తొలి క్రైస్తవ సంఘాల్లో పైవిచారణకర్తలు సత్యాన్ని బోధించారు, పరిచర్య సేవకులు తోటి విశ్వాసులకు అనేక రీతుల్లో సహాయపడ్డారు. (ఫిలిప్పీయులు 1:⁠1) దేవుని వాక్యంపై పరిశుద్ధాత్మపై ఆధారపడిన ఒక పరిపాలక సభ ఆధ్యాత్మిక నడిపింపును అందించింది. (అపొస్తలుల కార్యములు 15:​6, 23-31) మతపరమైన బిరుదులు ఉపయోగించబడలేదు, ఎందుకంటే యేసు తన శిష్యులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు.” (మత్తయి 23:​8, 9) ఈ విషయాల్లోను మరితర అనేక విషయాల్లోను తొలి క్రైస్తవులకు యెహోవాసాక్షులకు సమాంతరాలు ఉన్నాయి.

సత్యాన్ని ప్రకటించినందుకు హింసించబడ్డారు

6, 7. నిజ క్రైస్తవులు సమాధానకరమైన సందేశాన్నే ప్రకటిస్తున్నా వారితో ఎలా వ్యవహరించడం జరిగింది?

6 తొలి క్రైస్తవులు ప్రకటించినది సమాధానకరమైన రాజ్య సందేశమే అయినా, వారు యేసు హింసించబడినట్లే హింసించబడ్డారు. (యోహాను 15:​20; 17:​14) చరిత్రకారుడైన డాక్టర్‌ జాన్‌ ఎల్‌. ఫాన్‌ మోష్‌హైమ్‌, మొదటి శతాబ్దపు క్రైస్తవులను “అత్యంత నిరపాయకరమైన, పరులమీదికి పోరాటానికి వెళ్ళని వ్యక్తుల సమాజం, ప్రభుత్వానికి విరుద్ధంగా తమ మనస్సులలో ఒక్క కోరికయైనా ఆలోచనయైనా ఎన్నడూ పెట్టుకోని ప్రజలు” అని వర్ణించాడు. “క్రైస్తవుల్లో రోమన్లను అతిగా చిరాకుపెట్టిన విషయం ఏమిటంటే వారి ఆరాధనలోని సరళత్వం; అది వేరే ఏ ఇతర ప్రజల పవిత్ర కర్మలనూ పోలిలేదు” అని డాక్టర్‌ మోష్‌హైమ్‌ పేర్కొంటున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “వారికి బలులు లేవు, దేవాలయాలు లేవు, ప్రతిమలు, జోస్యులు, లేదా యాజక వర్గాలు లేవు; ఇది చాలు అజ్ఞానులైన ప్రజలు వారిని అవమానాల పాలుచేయడానికి; అవన్నీ లేకుండా ఏ మతమూ ఉనికిలో ఉండలేదని ఆ ప్రజలు ఊహించుకున్నారు. ఆ విధంగా వారిని నాస్తికులుగా దృష్టించారు; నాస్తికులని నిందించబడగలవారు, రోమన్ల చట్టం ప్రకారం మానవ సమాజంలో చీడవంటి వారని ప్రకటించబడేవారు.”

7 ప్రీస్టులు, హస్తకళాకారులు, విగ్రహాల తయారీతో జీవనభృతి సంపాదించుకునే వారు కలిసి, విగ్రహారాధన ఆచారాల్లో పాల్గొనని క్రైస్తవులపైకి ప్రజలను ఉసిగొల్పారు. (అపొస్తలుల కార్యములు 19:​23-40; 1 కొరింథీయులు 10:​14) టెర్టూలియన్‌ ఇలా వ్రాశాడు: “ప్రజలకు కలుగుతున్న ప్రతి విపత్తుకు, ప్రతి దురదృష్టానికి క్రైస్తవులే కారణమన్నట్టు వారు భావిస్తున్నారు. టైబర్‌ నదికి వరదలు వచ్చినా, నైలు జలాలు పొలాలకు పారలేకపోయినా, వాతావరణం మారకపోయినా, భూకంపంగానీ, కరవుగానీ, ఏ మహామారిగానీ వచ్చినా​—⁠వెంటనే ఇలాంటి కేకలు వినిపించేవి: ‘క్రైస్తవులను పట్టుకొని సింహాలకు వేయండి!’” పర్యవసానాలు ఎలా ఉన్నా నిజ క్రైస్తవులు ‘విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉన్నారు.’​—⁠1 యోహాను 5:⁠21.

సత్యము మరియు మతపర ఆచారాలు

8. సత్యములో నడుచుకునేవారు క్రిస్మస్‌ను ఎందుకు జరుపుకోరు?

8 సత్యంలో నడుచుకునేవారు లేఖన విరుద్ధమైన ఆచారాలను విసర్జిస్తారు, ఎందుకంటే ‘వెలుగునకు చీకటితో పొత్తు లేదు.’ (2 కొరింథీయులు 6:​14-18) ఉదాహరణకు, డిసెంబరు 25న ఆచరించబడే క్రిస్మస్‌ను వారు ఆచరించరు. “క్రీస్తు పుట్టినది ఏ తేదీన అనేది ఎవరికీ ఖచ్చితంగా తెలీదు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఒప్పుకుంటోంది. ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా (1956 సంపుటి) ఇలా పేర్కొంటోంది: “రోమన్లు డిసెంబరు మధ్యలో వేడుక చేసుకునే ఒక పండుగైన శాటర్నేలియా, క్రిస్మస్‌కు సంబంధించిన ఉల్లాసకరమైన అనేక ఆచారాలకు నమూనాగా మారింది.” మెక్లింటాక్‌ మరియు స్ట్రాంగ్‌ల సైక్లోపీడియా ఇలా పేర్కొంటోంది: “క్రిస్మస్‌ జరుపుకోవడం దేవుడు నియమించినదీ కాదు, అది క్రొత్త నిబంధనలోంచి పుట్టినదీ కాదు.” యేసు కాలంలోని అనుదిన జీవితం (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా అంటోంది: “గొఱ్ఱెల మందలు . . . చలికాలంలో బయట ఉండవు, లోపలే ఉంటాయి; ఈ ఒక్క వాస్తవం చాలు చలికాలంలోని క్రిస్మస్‌ కోసం నిర్ధారించబడిన సాంప్రదాయిక తేదీ సరైనది కాదని చెప్పడానికి, ఎందుకంటే గొఱ్ఱెల కాపరులు పొలములో ఉన్నారని సువార్త వృత్తాంతం చెబుతోంది.”​—⁠లూకా 2:​8-11.

9. గతంలోనూ ఇప్పుడూ యెహోవా సేవకులు ఈస్టర్‌ పండుగను ఎందుకు విసర్జించారు?

9 క్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకునేందుకని ఈస్టర్‌ జరుపుకుంటారు, కానీ నమ్మదగ్గ సమాచార మూలాలు అది అబద్ధారాధనకు సంబంధించినదని చెబుతున్నాయి. ఈస్టర్‌ “మొదట్లో ట్యూటన్లు వసంతకాలంలో వెలుగు దేవత, వసంత దేవత గౌరవార్ధం జరుపుకున్న ఒక పండుగా ఉండేది, అది ఆంగ్లో-శాక్సన్‌లలో ఈస్ట్రే [లేదా ఈయోస్టర్‌] అని పిలువబడింది” అని ద వెస్ట్‌మిన్‌స్టర్‌ డిక్షనరీ ఆఫ్‌ ద బైబిల్‌ చెబుతోంది. ఏదేమైనా, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (11వ సంపుటి) ఇలా అంటోంది: “క్రొత్త నిబంధనలో ఈస్టర్‌ పండుగ జరుపుకోవడాన్ని గురించిన దాఖలాలేవీ లేవు.” ఈస్టర్‌ను తొలి క్రైస్తవులు జరుపుకోలేదు, దాన్ని నేడు యెహోవా ప్రజలు కూడా జరుపుకోరు.

10. యేసు ఏ ఆచరణను ప్రారంభించాడు, దాన్ని సరైన రీతిలో ఎవరు మాత్రమే పాటిస్తున్నారు?

10 యేసు తన పుట్టుకను గానీ, తన పునరుత్థానాన్ని గానీ జరుపుకోమని తన శిష్యులకు ఆజ్ఞాపించలేదు, కానీ ఆయన తన బలి మరణ జ్ఞాపకార్థ ఆచరణను మాత్రం ప్రారంభించాడు. (రోమీయులు 5:⁠8) నిజానికి, ఆయన తన శిష్యులకు ఆచరించమని ఆజ్ఞాపించినది కేవలం ఈ ఒక్క సంఘటనను మాత్రమే. (లూకా 22:​19, 20) ప్రభువు రాత్రి భోజనము అని కూడా పిలువబడే ఈ వార్షిక సంఘటన నేటికీ యెహోవాసాక్షులచే ఆచరించబడుతోంది.​—⁠1 కొరింథీయులు 11:​20-26.

సత్యము భూమియందంతటా ప్రకటించబడుతోంది

11, 12. సత్యంలో నడుచుకునేవారు ఎల్లప్పుడు తమ ప్రకటనా పనికి ఎలా మద్దతునిచ్చారు?

11 సత్యము తెలుసుకున్నవారు తమ సమయాన్ని, శక్తిని, మరితర వనరులను సువార్త ప్రకటనా పనికై వెచ్చించడాన్ని ఒక ఆధిక్యతగా భావిస్తారు. (మార్కు 13:​10) తొలి క్రైస్తవ ప్రకటనా పనికి స్వచ్ఛంద విరాళాల మద్దతు లభించింది. (2 కొరింథీయులు 8:​12; 9:⁠7) టెర్టూలియన్‌ ఇలా వ్రాశాడు: “ఒక విధమైన పెట్టె అక్కడ ఉన్నా, మతం అనేది ఒక వ్యాపారం లాంటిది అన్నట్లుగా అక్కడ ప్రవేశ రుసుము చెల్లిస్తున్న రీతిలో అందులో డబ్బు వేయడం జరిగేది కాదు. ప్రతి వ్యక్తి నెలకొక్కసారి లేదా తనకిష్టమైనప్పుడు కొన్ని నాణేలు తీసుకువచ్చేవాడు, అదీ తనకు నిజంగా ఇష్టమైతేనే, తనకు సాధ్యమైతేనే; ఎందుకంటే ఎవరినీ బలవంత పెట్టడం జరిగేది కాదు; అంతా స్వచ్ఛంద విరాళాలుగానే వేయబడేవి.”​—⁠అపాలజీ, అధ్యాయం 39.

12 యెహోవాసాక్షుల భూవ్యాప్త రాజ్య ప్రకటనా పనికి కూడా స్వచ్ఛంద విరాళాల సహాయంతోనే మద్దతు లభిస్తోంది. సాక్షులు మాత్రమే గాక ఆసక్తిగల వ్యక్తులు కృతజ్ఞతాభావంతో ఈ కార్యకలాపాలకు తమ చందాల ద్వారా మద్దతునివ్వడం ఒక ఆధిక్యతగా ఎంచుతారు. ఇక్కడ కూడా తొలి క్రైస్తవులకు యెహోవాసాక్షులకు పోలిక కనిపిస్తోంది.

సత్యము మరియు వ్యక్తిగత ప్రవర్తన

13. తమ ప్రవర్తనకు సంబంధించి యెహోవాసాక్షులు పేతురు ఇచ్చిన ఏ సలహాను పాటిస్తారు?

13 సత్యంలో నడుచుకుంటున్న వ్యక్తులుగా తొలి క్రైస్తవులు అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఈ సలహాకు అనుగుణంగా వ్యవహరించారు: ‘అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండుడి.’ (1 పేతురు 2:​12) యెహోవాసాక్షులు ఆ మాటలను గంభీరంగా తీసుకుంటారు.

14. అనైతిక వినోదం విషయంలో క్రైస్తవ దృక్కోణం ఏమిటి?

14 మతభ్రష్టత్వం ప్రారంభమైన తర్వాత కూడా నామకార్థ క్రైస్తవులు అనైతిక కార్యకలాపాలను విసర్జించారు. చర్చి చరిత్ర ప్రొఫెసర్‌ అయిన డబ్ల్యు. డి. కిల్లెన్‌ ఇలా వ్రాశాడు: “రెండు, మూడు శతాబ్దాల్లో ప్రతి పెద్ద పట్టణంలోను నాటకశాల గొప్ప ఆకర్షణగా ఉండేది; నటులు సాధారణంగా చాలా దిగజారిన నైతికత గలవారైనా, వారి నాటక ప్రదర్శనలు మాత్రం ఆ కాలంలోని ప్రజల నికృష్టమైన కోరికలను తృప్తిపరిచేవిగా ఉండేవి. . . . నిజ క్రైస్తవులందరూ నాటకశాలను ఏవగింపుతో చూసేవారు. . . . వారు దాని అశ్లీలత నుండి దూరంగా జరిగిపోయేవారు; అన్యుల దేవుళ్ళు దేవతల మధ్య ఉండే అశ్లీలత కూడా వారి మతపర నమ్మకాలకు పూర్తి విరుద్ధంగా ఉండేది.” (ప్రాచీన చర్చి [ఆంగ్లం], పేజీలు 318-19) నేడు యేసు యొక్క నిజ అనుచరులు కూడా అశ్లీలతను నైతికంగా దిగజారిన వినోదకర సందర్భాలను విసర్జిస్తారు.​—⁠ఎఫెసీయులు 5:​3-5.

సత్యము మరియు ‘పై అధికారులు’

15, 16. ‘పై అధికారులు’ ఎవరు, సత్యంలో నడిచేవారు వారిని ఎలా దృష్టించేవారు?

15 తొలి క్రైస్తవులు మంచి ప్రవర్తన గలవారైనప్పటికీ రోమా చక్రవర్తులలో అత్యధికులు వారిని అపార్థం చేసుకున్నారు. చక్రవర్తులు వారిని “హేయులైన ఔత్సాహికులు”గా దృష్టించారని చరిత్రకారుడైన ఇ. జి. హార్డీ అంటున్నాడు. బితూనియకు చెందిన అధిపతియైన ప్లీనీ ది యంగర్‌కీ చక్రవర్తియైన ట్రాజన్‌కీ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను బట్టి చూస్తే, అధికార వర్గాలకు సాధారణంగా క్రైస్తవత్వపు నిజ స్వభావం తెలియదని వెల్లడవుతోంది. క్రైస్తవులు ప్రభుత్వాన్ని ఎలా దృష్టిస్తారు?

16 యేసు తొలి అనుచరుల్లానే యెహోవాసాక్షులు ప్రభుత్వపరమైన “పై అధికారులకు” పరిమిత విధేయతను కనబరుస్తారు. (రోమీయులు 13:​1-7) ఒక మనుష్యుడు వారినుండి కోరేదానికి దేవుని చిత్తానికి సంఘర్షణ ఏర్పడితే, వారు, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అన్న నిర్ణయాన్ని తీసుకుంటారు. (అపొస్తలుల కార్యములు 5:​29) యేసు తర్వాత​—⁠క్రైస్తవత్వం విజయం (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా అంటోంది: “క్రైస్తవులు చక్రవర్తి ఆరాధనలో పాల్గొనకపోయినా, వారు అల్లర్లను సృష్టించే వ్యక్తులు మాత్రం కారు, వారి మతం విభిన్నంగా కనబడినా అన్యుల వైపు నుండి చూస్తే కొన్నిసార్లు అభ్యంతరకరమైనదిగా కనిపించినా సామ్రాజ్యానికి ఎలాంటి ముప్పును వాటిల్లజేసేది కాదు.”

17. (ఎ) తొలి క్రైస్తవులు ఏ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు? (బి) క్రీస్తు యొక్క నిజ అనుచరులు యెషయా 2:4 లోని మాటలను తమ జీవితాల్లో ఎలా అన్వయించుకున్నారు?

17 పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దానం చేయబడిన, ‘దేవుడు నిర్మించిన పట్టణము’పై విశ్వాసం ఉంచారు, అలానే తొలి క్రైస్తవులు కూడా దేవుని రాజ్యమనే ఆ పట్టణానికి మద్దతుదారులుగా ఉన్నారు. (హెబ్రీయులు 11:​8-10) యేసు శిష్యులు కూడా తమ యజమానిలానే “లోకసంబంధులు కారు.” (యోహాను 17:​14-16) మానవులు తలపెట్టిన యుద్ధాలకు సంఘర్షణలకు సంబంధించి వారు “తమ ఖడ్గములను నాగటి నక్కులుగా” సాగగొట్టడం ద్వారా శాంతిసమాధానాలను వెంటాడారు. (యెషయా 2:⁠4) దీనిలో ఆసక్తికరంగా ఉన్న సమాంతరాన్ని గురించి పేర్కొంటూ చర్చి చరిత్రలో లెక్చరర్‌గా ఉన్న జెఫ్రీ ఎఫ్‌. నట్టాల్‌ ఇలా వ్యాఖ్యానించాడు: “యుద్ధం పట్ల తొలి క్రైస్తవ దృక్పథం, నేడు తమను తాము యెహోవాసాక్షులని పిలుచుకునే ప్రజల దృక్పథంలానే ఉంది, ఈ విషయాన్ని అంగీకరించడం మాత్రం మనకు మింగుడుపడడం లేదు.”

18. ఏ ప్రభుత్వమైనా యెహోవాసాక్షుల గురించి భయపడడానికి ఎలాంటి కారణమూ ఎందుకు లేదు?

18 “పై అధికారులకు” చూపించే విధేయత విషయంలో తటస్థతను చూపించే వ్యక్తులుగా తొలి క్రైస్తవులు ఏ రాజకీయ శక్తులకూ ముప్పును తీసుకువచ్చేవారిగా లేరు​—⁠యెహోవాసాక్షులూ అలా లేరు. “యెహోవాసాక్షులను ఏ రాజకీయ పార్టీ పరిపాలనలోనైనా ముప్పును తీసుకువచ్చేవారిగా దృష్టించడానికి ఎంతో దురభిమానంతో కూడిన ఎంతో అపనమ్మకంతో కూడిన ఊహలు అవసరమవుతాయి” అని ఉత్తర అమెరికాలోని ఒక సంపాదకీయుడు వ్రాశాడు. “వారు ఏ రాజ్యాన్నీ కూలద్రోయడానికి ప్రయత్నించేవారు కారు, వారిది అత్యంత శాంతికాముక మతం.” అపార్థాలు తొలగిన అధికారులు యెహోవాసాక్షుల విషయంలో భయపడేదేమీ లేదని తెలుసుకుంటారు.

19. పన్నుల సంబంధంగా తొలి క్రైస్తవుల గురించి యెహోవాసాక్షుల గురించి ఏమి చెప్పవచ్చు?

19 తొలి క్రైస్తవులు “పై అధికారులకు” గౌరవాన్ని చూపించిన ఒక విధానం, వారు తమ పన్నులను కట్టడమే. జస్టిన్‌ మార్టిర్‌ రోమా చక్రవర్తియైన ఆంటోనైనస్‌ పయస్‌కు (సా.శ. 138-161) వ్రాస్తూ క్రైస్తవులు “ఇతర ప్రజలందరి కన్నా సంసిద్ధతతో” తమ పన్నులను కట్టారని స్థిరంగా చెప్పాడు. (ఫస్ట్‌ అపాలజీ, అధ్యాయం 17) తమ పన్నులను మనస్సాక్షిపూర్వకంగా చెల్లించడం మూలంగా పన్ను వసూలుదారులు వారికి “ఎంతో ఋణపడివున్నారు” అని టెర్టూలియన్‌ రోమా పరిపాలకులకు చెప్పాడు. (అపాలజీ, అధ్యాయం 42) రోమన్లు పాక్స్‌ రోమానా (రోమా శాంతి) అనే విధానం క్రింద శాంతి భద్రతలను కాపాడడం, మంచి రోడ్లు నిర్మించడం, సురక్షితమైన సముద్రయానం వంటివి ప్రవేశపెట్టడంతో వాటినుండి క్రైస్తవులు ప్రయోజనం పొందారు. సమాజానికి తాము ఋణపడివున్నామన్న విషయాన్ని గుర్తిస్తూ వారు యేసు పలికిన ఈ మాటలకు విధేయత చూపించారు: ‘కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి.’ (మార్కు 12:​17) నేడు యెహోవా ప్రజలు ఈ సలహాను పాటిస్తారు, అందుకే పన్ను చెల్లింపు విషయంలోలాగే వారు తమ నిజాయితీని బట్టి ఎంతో కొనియాడబడ్డారు.​—⁠హెబ్రీయులు 13:⁠18.

సత్యం​—⁠ఒక్కటిగా ఉంచే శక్తి

20, 21. సమాధానకరమైన సహోదరత్వం సంబంధంగా తొలి క్రైస్తవుల విషయంలోను నేటి యెహోవా సేవకుల విషయంలోను ఏది వాస్తవం?

20 తొలి క్రైస్తవులు సత్యంలో నడుచుకున్నారు కాబట్టి వారు సమాధానకరమైన సహోదరత్వంలో ఒక్కటిగా నిలిచారు, నేడు యెహోవాసాక్షులు కూడా అలానే ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 10:​34, 35) ద మాస్కో టైమ్స్‌ పత్రికలో ముద్రితమైన ఒక ఉత్తరంలో ఇలా ఉంది: “[యెహోవాసాక్షులు] చాలా మంచివారిగా, దయగలవారిగా, సాత్వికులైనవారిగా పేరుగాంచారు, వారితో సర్దుకుపోవడం చాలా సులభం, వారెన్నడూ ఇతర ప్రజలను ఏ విధంగానూ ఒత్తిడిచేయరు, వారు ఎల్లప్పుడు ఇతరులతో తమకుగల సంబంధాల్లో శాంతిని వెంటాడతారు. . . . వారిలో లంచాలు తీసుకునేవారు లేరు, త్రాగుబోతులు లేదా మాదక ద్రవ్యాల వ్యసనపరులు లేరు, కారణం చాలా స్పష్టం: తాము చేసే లేదా మాట్లాడే ప్రతీదీ బైబిలు ఆధారిత నమ్మకాలచే నడిపించబడాలని వారు ప్రయత్నిస్తారు అంతే. ప్రపంచంలో ప్రతి ఒక్కరు యెహోవాసాక్షుల్లా బైబిలుకు అనుగుణంగా జీవించడానికి కనీసం ప్రయత్నించివుంటే, హింసాపూరితమైన మన ఈ లోకం ఖచ్చితంగా భిన్నంగా ఉండేది.”

21ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఎర్లీ క్రిస్టియానిటీ ఇలా పేర్కొంటోంది: “మునుపు శత్రు వర్గాలుగా ఉన్న యూదులు అన్యులు శాంతిసమాధానాలతో కలిసికట్టుగా జీవించగల ఒక క్రొత్త సమాజంగా తొలి చర్చి తనను తాను దృష్టించుకుంది.” యెహోవాసాక్షులు కూడా శాంతికాముక ప్రజలుగా అంతర్జాతీయ సహోదరత్వంలో ఉన్నారు​—⁠వారు నిజంగా ఒక క్రొత్త లోక సమాజమే. (ఎఫెసీయులు 2:​11-18; 1 పేతురు 5:⁠9; 2 పేతురు 3:​13) దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో ఉన్న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అన్ని జాతుల సాక్షులు సమాధానకరంగా సమావేశమవుతుండడం చూసి ఆ గ్రౌండ్స్‌ ముఖ్య భద్రతాధికారి ఇలా అన్నాడు: “ప్రతి ఒక్కరు మర్యాదపూర్వకంగా ప్రవర్తించారు, ప్రవర్తిస్తున్నారు; ఒకరితో ఒకరు ఆనందంగా సంభాషించుకుంటున్నారు, గత కొద్ది రోజులుగా వారు ప్రదర్శించిన వైఖరి మీ సమాజ సభ్యుల నైతిక లక్షణాన్ని రుజువుచేస్తోంది, మీరందరూ ఒక సంతోషభరిత కుటుంబంలా కలిసిమెలిసి జీవించగలరని రుజువుచేస్తోంది.”

సత్యాన్ని బోధిస్తున్నందుకు ఆశీర్వదించబడ్డారు

22. క్రైస్తవులు సత్యాన్ని ప్రత్యక్షపరుస్తున్న ఫలితంగా ఏమి జరుగుతోంది?

22 తమ ప్రవర్తన ద్వారా, ప్రకటనా పని ద్వారా పౌలు మరితర క్రైస్తవులు ‘సత్యమును ప్రత్యక్షపరుస్తున్నారు.’ (2 కొరింథీయులు 4:⁠2) యెహోవాసాక్షులు కూడా అలానే చేస్తున్నారని జనాంగాలన్నింటికి సత్యాన్ని బోధిస్తున్నారని మీరు అంగీకరించరా? భూమ్యంతటా ప్రజలు సత్యారాధనను హత్తుకుంటున్నారు, దినదిన ప్రవర్ధమానంగా ప్రజలు ‘యెహోవా మందిర పర్వతమునకు’ ప్రవాహంలా వస్తున్నారు. (యెషయా 2:​2, 3) ప్రతి సంవత్సరం వేలాదిమంది దేవునికి తాము చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకుంటున్నారు, తత్ఫలితంగా అనేక క్రొత్త సంఘాలు ఏర్పడుతున్నాయి.

23. జనాంగాలన్నింటికీ సత్యాన్ని బోధిస్తున్నవారిని మీరెలా దృష్టిస్తారు?

23 వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చినా యెహోవా ప్రజలు సత్యారాధనలో ఐక్యమై ఉన్నారు. వారు ప్రదర్శించే ప్రేమ వారిని యేసు శిష్యులుగా గుర్తిస్తోంది. (యోహాను 13:​35) ‘దేవుడు నిజముగా వారిలో ఉన్నాడని’ మీరు గ్రహించగలుగుతున్నారా? (1 కొరింథీయులు 14:​25) జనాంగాలన్నింటికీ సత్యాన్ని బోధిస్తున్న వారికి మీరు మద్దతునిస్తున్నారా? అలాగైతే, మీరు సత్యం నిమిత్తం నిత్యం కృతజ్ఞతా భావం కలిగివుండి, అందులోనే నిరంతరం నడుస్తూ ఉండే ఆధిక్యత కలిగివుందురుగాక!

మీరెలా జవాబిస్తారు?

• ఆరాధనా విధానంలో తొలి క్రైస్తవులకు యెహోవాసాక్షులకు ఎలాంటి సారూప్యాలున్నాయి?

• సత్యంలో నడుచుకునేవారు పాటించే ఒకే ఒక్క మతపరమైన ఆచరణ ఏది?

• ‘పై అధికారులు’ ఎవరు, క్రైస్తవులు వారిని ఎలా దృష్టిస్తారు?

• సత్యము ఎలా ఒక్కటిగా ఉంచుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని చిత్రం]

సత్యంలో నడుస్తున్నవారికి క్రైస్తవ కూటాలు ఎల్లప్పుడు ఆశీర్వాదంగా ఉన్నాయి

[23వ పేజీలోని చిత్రాలు]

యేసు తన బలి మరణాన్ని జ్ఞాపకార్థంగా ఆచరించమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు

[24వ పేజీలోని చిత్రం]

తొలి క్రైస్తవుల్లా యెహోవాసాక్షులు “పై అధికారులకు” గౌరవాన్ని చూపిస్తారు