కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోషువ గుర్తుంచుకున్నది

యెహోషువ గుర్తుంచుకున్నది

యెహోషువ గుర్తుంచుకున్నది

ఏమిటి?

“నా సేవకుడైన మోషే మృతినొందెను. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి” అని యెహోవా చెప్పాడు. (యెహోషువ 1:​1, 2) యెహోషువ ముందు ఎంతటి కష్టమైన నియామకం ఉందో కదా! ఆయన దాదాపు 40 సంవత్సరాలు మోషేకు పరిచారకునిగా ఉన్నాడు. ఇప్పుడు, తన యజమాని స్థానాన్ని తీసుకుని, వ్యవహరించడం తరచూ కష్టంగా ఉండే ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపించమని ఆయనకు చెప్పబడింది.

తన ముందున్న విషయం గురించి యెహోషువ ఆలోచించినప్పుడు, బహుశా తానిప్పటికే ఎదుర్కొని అధిగమించిన శ్రమలు వరుసగా ఆయన మనస్సులో మెదిలివుంటాయి. యెహోషువ గుర్తుంచుకున్నది ఆయనకు ఆ సమయంలో నిస్సందేహంగా విలువైన సహాయకంగా ఉండివుంటుంది, అది నేటి క్రైస్తవులకు కూడా విలువైన సహాయకంగా ఉండగలదు.

దాసుని నుండి అధిపతి వరకు

దాసునిగా ఉన్న సుదీర్ఘమైన సంవత్సరాలు కూడా యెహోషువ జ్ఞాపకాలలో ఒక భాగం. (నిర్గమకాండము 1:​13, 14; 2:​23) ఆ సమయంలో యెహోషువ ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులను అనుభవించాడన్న విషయాన్ని ఊహించడం తప్పించి మనమేమీ చేయలేము, ఎందుకంటే యెహోషువ అనుభవాలన్నింటి గురించిన వివరాలను బైబిలు నివేదించడం లేదు. ఐగుప్తులో తాను సేవచేసిన కాలంలో యెహోషువ మంచి సంస్థీకరణా సామర్థ్యాలను నేర్చుకొని ఉండవచ్చు, ఆ దేశం నుండి హెబ్రీయులతోపాటు “అనేకులైన అన్యజనుల సమూహము” బయటకు రావడాన్ని సంస్థీకరించడంలో ఆయన సహాయం చేసివుండవచ్చు.​—⁠నిర్గమకాండము 12:​38.

యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన ఒక కుటుంబానికి చెందినవాడు. ఆయన తాతయ్య ఎలీషామా ఆ గోత్రంలో ప్రధానుడు. బహుశా ఆయన ఇశ్రాయేలులోని మూడు ధ్వజములలో ఒకదానికి చెందిన 1,08,100 మంది సైనికులను నడిపించినట్లు కనిపిస్తోంది. (సంఖ్యాకాండము 1:4, 10, 16; 2:18-24; 1 దినవృత్తాంతములు 7:20, 26, 27) అయినప్పటికీ, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వెళ్ళిన వెంటనే వారిపై అమాలేకీయులు దాడిచేసినప్పుడు, ఆత్మరక్షణ కోసం సైనికులను సంస్థీకరించడానికి మోషే యెహోషువను పిలిచాడు. (నిర్గమకాండము 17:​8, 9) మోషే యెహోషువ తాతయ్యనో ఆయన తండ్రినో పిలవకుండా యెహోషువనే ఎందుకు పిలిచాడు? దానికి ఒక సమాధానం ఏమిటంటే: “ప్రాముఖ్యమైన గోత్రమైన ఎఫ్రాయిముకు అధిపతిగా, సంస్థీకరించడంలో సమర్థవంతుడని ఇప్పటికే బాగా పేరుపొందిన వ్యక్తిగా, ప్రజల ద్వారా ఎంతో విశ్వసించబడిన వ్యక్తిగా ఉన్న [యెహోషువ] వైపు మోషే చూశాడు. సైనికులను ఎన్నుకోవడానికీ వారిని ఏర్పర్చడానికీ తగిన అర్హతలుగల నాయకుడిగా మోషే ఆయనను పరిగణించాడు.”

కారణం ఏదైనప్పటికీ యెహోషువ ఎన్నుకోబడినప్పుడు, ఆయన మోషే తనకు ఎలా ఆజ్ఞాపిస్తే అలాగే చేశాడు. యుద్ధాలు చేయడంలో ఇశ్రాయేలీయులకు బొత్తిగా అనుభవం లేకపోయినప్పటికీ, దైవిక సహాయం లభిస్తుందని యెహోషువ గట్టిగా నమ్మాడు. కాబట్టి “రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెద[ను]” అని మోషే చెప్పిన వెంటనే యెహోషువకు ఆయన మీద నమ్మకం ఏర్పడింది. యెహోవా ఇంతకుముందే అప్పట్లో అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని నాశనం చేశాడని యెహోషువ గుర్తుచేసుకుని ఉంటాడు. తర్వాతి రోజు, మోషే తన చేతులను పైకెత్తి సూర్యాస్తమయం వరకూ అలాగే నిలబడివున్నప్పుడు, ఏ శత్రువూ ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా నిలువలేకపోయాడు, అమాలేకీయులు ఓడించబడ్డారు. ఆ తర్వాత యెహోవా, “నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును” అన్న దైవిక శాసనాన్ని ఒక గ్రంథములో వ్రాయమనీ, ‘యెహోషువకు వినిపించమనీ’ మోషేకు ఆజ్ఞాపించాడు. (నిర్గమకాండము 17:9-14) అవును యెహోవా తప్పకుండా ఆ శిక్షను విధిస్తాడు.

మోషే పరిచారకునిగా

అమాలేకీయులతో కలిగిన అనుభవం, మోషేను యెహోషువను మరింత సన్నిహితం చేసివుంటుంది. తన “చిన్నతనం నుండి” మోషే చనిపోయేంతవరకూ దాదాపు 40 సంవత్సరాలపాటు ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా, అంటే ‘పరిచారకుడిగా’ ఉండే ఆధిక్యత యెహోషువకు లభించింది.​—⁠సంఖ్యాకాండము 11:​27-29, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ఆ స్థానంలో ఉండడం అంటే ఆధిక్యతలూ బాధ్యతలూ ఉంటాయి. ఉదాహరణకు మోషే, అహరోను, అహరోను కుమారులు, ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది సీనాయి పర్వతాన్ని అధిరోహించి యెహోవా మహిమకు సంబంధించిన దర్శనాన్ని చూసినప్పుడు, యెహోషువ కూడా వారిలో ఉండివుండవచ్చు. యెహోషువ మోషేకు పరిచారకుడిగా ఆయనతోపాటు పర్వతంపైకి వెళ్ళాడు. అయితే యెహోవా సన్నిధిని సూచించే మేఘంలోకి మోషే వెళ్ళినప్పుడు బహుశా యెహోషువ దూరంగా నిలబడి ఉండవచ్చు. 40 పగళ్ళు, 40 రాత్రుల వరకు యెహోషువ పర్వతంపైనే ఉండివుండవచ్చన్నది గమనార్హం. ఆయన నమ్మకంగా తన యజమాని తిరిగివచ్చేంతవరకూ వేచి ఉన్నాడు, ఆజ్ఞలుగల పలకలను తీసుకుని మోషే కొండ దిగి వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవడానికి యెహోషువ అక్కడే ఉన్నాడు.​—⁠నిర్గమకాండము 24:1, 2, 9-18; 32:15-17.

ఇశ్రాయేలీయులు బంగారు దూడతో విగ్రహారాధన చేసిన సంఘటన తర్వాత, యెహోషువ పాళెము వెలుపల ప్రత్యక్షపు గుడారములో మోషేకు సేవచేయడంలో కొనసాగాడు. అక్కడ యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. అయితే మోషే పాళెముకు తిరిగి వచ్చిన తర్వాత, యెహోషువ “గుడారములోనుండి వెలుపలికి రాలేదు.” ఇశ్రాయేలీయులను అపరిశుభ్రమైన స్థితిలో గుడారము లోపలికి రానివ్వకుండా ఆపడానికి బహుశా యెహోషువ అక్కడ ఉండవలసి వచ్చింది. యెహోషువ తన బాధ్యతను ఎంత గంభీరంగా తీసుకున్నాడో కదా!​—⁠నిర్గమకాండము 33:7, 11.

చరిత్రకారుడైన జోసీఫస్‌ చెబుతున్నదాని ప్రకారం తనకన్నా 35 సంవత్సరాలు పెద్దవాడైన మోషేతో సహవసించడం యెహోషువ విశ్వాసాన్ని ఎంతగానో బలపర్చివుంటుంది. వారి సంబంధం, “పరిణతి చెందిన వ్యక్తికీ యౌవనస్థుడికీ మధ్య ఉండేదని, ఆచార్యుడికీ శిష్యుడికీ మధ్య ఉండేదని” పిలువబడింది. ఆ సంబంధం వల్ల యెహోషువ “స్థిరమైన, నమ్మకమైన వ్యక్తిగా” తయారయ్యాడు. నేడు మన మధ్య మోషేలాంటి ప్రవక్తలు లేరు, కానీ యెహోవా ప్రజల సంఘాలలో వయోధికులు కూడా ఉన్నారు. అలాంటి వారు తమ అనుభవాన్ని బట్టి ఆధ్యాత్మికతను బట్టి, బలానికీ ప్రోత్సాహానికీ నిజమైన మూలంగా ఉంటారు. మీరు వారిని విలువైనవారిగా ఎంచుతున్నారా? మీరు వారి సహవాసం నుండి ప్రయోజనం పొందుతున్నారా?

కానాను దేశంలో వేగులవాడు

ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని పొందిన తర్వాత కొద్ది కాలానికి యెహోషువ జీవితంలో ప్రాముఖ్యమైన విషయమొకటి జరిగింది. వాగ్దాన దేశాన్ని వేగు చూసిరావడంలో తన గోత్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఆయన ఎన్నుకోబడ్డాడు. ఆ కథ మనందరికీ బాగా తెలిసినదే. యెహోవా వాగ్దానం చేసినట్లుగానే ఆ దేశం నిజంగా ‘పాలు తేనెలు ప్రవహించు దేశమేనని’ 12 మంది వేగులవారూ ఒప్పుకున్నారు. అయితే వారిలో పదిమంది, ఇశ్రాయేలీయులు కనాను దేశస్థులను అక్కడనుండి వెళ్ళగొట్టలేరని విశ్వాసరహితంగా భయపడ్డారు. యెహోవా తప్పకుండా వారితో ఉంటాడు కాబట్టి భయంతో తిరుగుబాటు చేయవద్దని కేవలం యెహోషువ, కాలేబు మాత్రమే వారిని ప్రోత్సహించారు. అప్పుడు, అక్కడున్నవారంతా అభ్యంతరం చెప్పి వారిద్దరినీ రాళ్ళతో కొట్టి చంపాలని అన్నారు. యెహోవా తన మహిమ ద్వారా కలుగజేసుకునివుండకపోతే బహుశా వాళ్ళు అలా చేసివుండేవారే. వారు విశ్వాసరహితంగా ఉన్నందువల్ల, ఇశ్రాయేలులో లెక్కించబడినవారందరిలో 20 ఏళ్ళకంటే ఎక్కువ వయస్సుగలవారు కనాను దేశానికి సజీవంగా వెళ్ళరు అని దేవుడు ఆదేశించాడు. వీరిలో కేవలం యెహోషువ, కాలేబు, లేవీయులు మాత్రమే సజీవంగా బయటపడ్డారు.​—⁠సంఖ్యాకాండము 13:1-16, 25-29; 14:6-10, 26-30.

ఆ ప్రజలందరూ యెహోవా ఐగుప్తులో చేసిన శక్తివంతమైన కార్యాలను చూడలేదా? మరి వారిలో అధికశాతం సందేహించినప్పుడు, దేవుని సహాయమందు విశ్వాసముంచడానికి యెహోషువకు ఏది సహాయపడింది? యెహోవా వాగ్దానం చేసినవాటినీ, ఆయన ఇప్పటికే నెరవేర్చినవాటినీ యెహోషువ స్పష్టంగా గుర్తుంచుకొనివుంటాడు, వాటిని ఆయన ధ్యానించాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత, ‘దేవుడైన యెహోవా ఇశ్రాయేలు విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు; అవి అన్నియు కలిగెను’ అని ఆయన చెప్పగలిగాడు. (యెహోషువ 23:​14) కాబట్టి, భవిష్యత్తు గురించి యెహోవా చేసిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా నెరవేరతాయని యెహోషువ విశ్వసించాడు. (హెబ్రీయులు 11:⁠6) ఒక వ్యక్తి తనను తాను ఇలా ప్రశ్నించుకోవడానికి ఇది కదిలించాలి: ‘నా సంగతి ఏమిటి? యెహోవా వాగ్దానాలను అధ్యయనం చేయడానికీ ధ్యానించడానికీ నేను చేసిన కృషి, అవి నమ్మదగినవేనని నన్ను ఒప్పించాయా? రానైయున్న మహాశ్రమలలో దేవుడు తన ప్రజలతోపాటు నన్ను కూడా కాపాడగలడు అని నేను నమ్ముతున్నానా?’

యెహోషువ విశ్వాసాన్నే కాకుండా సరైనది చేయడానికి నైతిక ధైర్యాన్ని కూడా ప్రదర్శించాడు. కేవలం యెహోషువ, కాలేబు యెహోవా పక్షాన నిలబడ్డారు, సర్వసమాజమూ వారిని రాళ్లతో కొట్టి చంపాలని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తుంది? అది మిమ్మల్ని భయపెడుతుందా? అది యెహోషువని భయపెట్టలేదు. ఆయన, కాలేబు తాము నమ్మినదాన్నే స్థిరంగా చెప్పారు. యెహోవాకు విశ్వసనీయంగా ఉండాలంటే మనం కూడా ఏదోక రోజు అలానే చేయవలసి ఉంటుంది.

యెహోషువ పేరు మార్చబడింది అని కూడా వేగులవారికి సంబంధించిన కథ మనకు తెలియజేస్తుంది. “రక్షణ” అనే అర్థంగల హోషేయ అనే ఆయన అసలు పేరుకు దైవిక నామాన్ని సూచించే అక్షరాన్ని జోడించి మోషే ఆయనకు యెహోషువ అని పేరు పెట్టాడు. యెహోషువ అంటే “యెహోవాయే రక్షణ” అని అర్థం. సెప్టాజింట్‌ అనువాదం ఆయన పేరును “యేసు” అని అనువదించింది. (సంఖ్యాకాండము 13:​8, 16) తన పేరుకు తగినట్లుగానే యెహోషువ యెహోవాయే రక్షణ అని ధైర్యంగా ప్రకటించాడు. యెహోషువ పేరు ఏ ఉద్దేశమూ లేకుండా మార్చబడివుండదు. యెహోషువ వ్యక్తిత్వానికి మోషే ఎంత విలువిస్తున్నాడో ప్రతిబింబించబడింది, అది క్రొత్త తరాన్ని వాగ్దాన దేశములోకి నడిపించడంలో యెహోషువ పోషించే ఆధిక్యతగల పాత్రకు సరిగ్గా సరిపోయింది.

తమ తండ్రులు చనిపోతుండగా, ఇశ్రాయేలీయులు ఆయాసకరమైన 40 సంవత్సరాలు అరణ్యప్రాంతంలో సంచరించారు. ఆ సమయంలో యెహోషువ గురించి మనకు ఏమీ తెలియదు. అయితే, ఆ కాలం కూడా ఆయనకు ఎంతో నేర్పించివుంటుంది. తిరుగుబాటుదారులైన కోరహు, దాతాను, అబీరాములకు, వారి అనుచరులకు, అలాగే బయల్పెయోరుకు సంబంధించిన నీచమైన ఆరాధనలో భాగం వహించినవారికి దేవుడు తీర్చిన తీర్పును ఆయన కళ్ళారా చూసివుంటాడు. మెరీబా జలములకు సంబంధించి మోషే యెహోవాను ఘనపర్చలేకపోవడం మూలంగా మోషే కూడా వాగ్దాన దేశానికి రాలేడని యెహోషువ తెలుసుకున్నప్పుడు ఆయన చాలా బాధపడివుంటాడు.​—⁠సంఖ్యాకాండము 16:1-50; 20:9-13; 25:1-9.

మోషే తర్వాతి స్థానంలో నియమించబడ్డాడు

మోషే మరణించే సమయం దగ్గరపడినప్పుడు, ఇశ్రాయేలీయులు “కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు” తన స్థానంలో మరో వ్యక్తిని నియమించమని మోషే దేవుణ్ణి అడిగాడు. యెహోవా ప్రతిస్పందన ఏమిటి? ‘ఆత్మను పొందినవాడైన’ యెహోషువ సమాజము ఎదుటకు రమ్మని ఆదేశించబడ్డాడు. వారు ఆయన చెప్పినది వినవలసివుండింది. ఎంత గొప్ప సిఫారసు! యెహోవా, యెహోషువ విశ్వాసాన్నీ సామర్థ్యాన్నీ చూశాడు. ఇశ్రాయేలీయులపై నాయకత్వం తీసుకోవడానికి అంతకంటే అర్హుడు లభించడు. (సంఖ్యాకాండము 27:​15-20) అయితే, యెహోషువ గొప్ప సవాళ్ళను ఎదుర్కొనవలసి ఉంటుందని మోషేకు తెలుసు. కాబట్టి, తన స్థానంలో రాబోయే యెహోషువను “నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము” అని మోషే ప్రోత్సహించాడు ఎందుకంటే, యెహోవా ఆయనకు సహాయం చేయడంలో కొనసాగుతాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 31:7, 8.

దేవుడు కూడా స్వయంగా అదే ప్రోత్సాహాన్ని యెహోషువకు ఇచ్చాడు, ఆయన ఇలా అన్నాడు: “నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతిమార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.”​—⁠యెహోషువ 1:7-9.

యెహోవా చెప్పిన మాటలు తన మనస్సులో స్థిరంగా నాటుకుపోవడంవల్ల, తాను ఇప్పటికే సంపాదించుకున్న అనుభవంవల్ల యెహోషువకు ఇక సందేహించవలసిన అవసరం ఏముంటుంది? కనాను దేశాన్ని సొంతం చేసుకోవడం నిశ్చయం. అయితే కష్టాలు తప్పకుండా తలెత్తుతాయి, ఆ కష్టాల్లో ఏమాత్రం స్వల్పంకానిది వారు ఎదుర్కొన్న మొదటి సవాలే, వరదలు వచ్చేంత నిండుగా ప్రవహిస్తున్న యొర్దాను నదిని దాటడం. అయినప్పటికీ యెహోవా తానే ఇలా ఆజ్ఞాపించాడు: ‘లేచి, ఈ యొర్దానునది దాటుము.’ ఇక సమస్యేమిటి?​—⁠యెహోషువ 1:⁠2.

యెహోషువ జీవితంలో ఆ తర్వాత జరిగిన సంఘటనలు​—⁠యెరికో పట్టణాన్ని ఆక్రమించుకోవడం, శత్రువులను ఒకరి తర్వాత ఒకరిని ఓడించడం, స్థలాన్ని భాగాలుగా విభజించుకోవడం​—⁠ఆయన ఎప్పుడూ దేవుని వాగ్దానాలను మరచిపోలేదని వెల్లడిచేస్తున్నాయి. శత్రువుల నుండి ఇశ్రాయేలీయులకు విశ్రాంతిని కలుగజేసినప్పుడు, తన జీవితపు చివరి రోజుల్లో, దేవుడు తమతో వ్యవహరించిన విధానాన్ని గుర్తుచేసి దేవుణ్ణి పూర్ణహృదయంతో సేవించేందుకు వారిని ప్రోత్సహించడానికి యెహోషువ ప్రజలను సమకూర్చాడు. దాని ఫలితంగా, ఇశ్రాయేలీయులు యెహోవాతో తమకున్న నిబంధనను పునర్నవీకరించుకున్నారు. నిస్సందేహంగా తమ నాయకుని మాదిరిచే ప్రేరేపించబడి “యెహోషువ దినములన్నిటను . . . ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి.”​—⁠యెహోషువ 24:16, 31.

యెహోషువ మనకు అద్భుతమైన మాదిరిని ఉంచాడు. నేడు క్రైస్తవులు అనేక విశ్వాస పరీక్షలను ఎదుర్కొంటున్నారు. యెహోవా ఆమోదాన్ని పొందడంలో కొనసాగి, చివరికి ఆయన వాగ్దానాలను అనుభవించాలంటే వాటిని విజయవంతంగా అధిగమించడం ప్రాముఖ్యం. యెహోషువ విజయం ఆయన బలమైన విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నిజమే, యెహోషువ చూసినట్లుగా మనము దేవుని శక్తివంతమైన కార్యములను చూడలేదు, కానీ ఎవరైనా సందేహిస్తే, బైబిలులో యెహోషువ పేరున ఉన్న పుస్తకం యెహోవా చెప్పిన మాటల నమ్మకత్వానికి ప్రత్యక్షసాక్షిగా రుజువునందిస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రతీరోజు చదివి, దానిలో ఉన్న విషయాలను మన జీవితాల్లో అన్వయించుకుంటున్నామని నిశ్చయపర్చుకుంటే మనం కూడా యెహోషువలా జ్ఞానాన్ని పొంది, విజయాన్ని సాధించవచ్చు.

తోటి క్రైస్తవుల ప్రవర్తననుబట్టి మీరు కొన్నిసార్లు బాధపడతారా? తన తప్పేమీ లేకపోయినా విశ్వాసరహితమైన సహవాసులతో 40 సంవత్సరాలు అరణ్యప్రాంతంలో సంచరించవలసి వచ్చిన యెహోషువ గురించి ఆలోచించండి. మీరు నమ్ముతున్నవాటిని సమర్థించుకోవడం కష్టంగా ఉందా? యెహోషువ, కాలేబు ఏమి చేశారో గుర్తుచేసుకోండి. వారి విశ్వాసం, విధేయతల వల్ల వారు అద్భుతమైన ప్రతిఫలాన్ని పొందారు. అవును, యెహోవా తన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తాడని యెహోషువ నిజంగా విశ్వసించాడు. మనం కూడా అలాగే విశ్వసిద్దాము.​—⁠యెహోషువ 23:14.

[10వ పేజీలోని చిత్రం]

యెహోషువ, కాలేబు యెహోవా శక్తిపై నమ్మకముంచారు

[10వ పేజీలోని చిత్రం]

మోషేతో సహవాసం యెహోషువ విశ్వాసాన్ని బలపర్చింది

[10వ పేజీలోని చిత్రం]

యెహోషువ నాయకత్వం, ప్రజలు యెహోవాను హత్తుకునివుండేలా వారిని ప్రేరేపించింది