కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘బహుగా ఫలించండి’

‘బహుగా ఫలించండి’

‘బహుగా ఫలించండి’

“బహుగా ఫలించుటవలన . . . మీరు నా శిష్యులగుదురు.”​—⁠యోహాను 15:⁠8.

అది యేసు మరణించడానికి ముందు సాయంకాలం. తన అపొస్తలులతో మనస్సు విప్పి మాట్లాడడం ద్వారా వారిని ప్రోత్సహించడానికి ఆయన తగినంత సమయం తీసుకున్నాడు. అప్పటికి మధ్యరాత్రి గడిచిపోయి ఉండవచ్చు, అయినా యేసు తన సన్నిహిత స్నేహితుల పట్ల ప్రేమతో పురికొల్పబడి మాట్లాడుతూనే ఉన్నాడు. తన సంభాషణ మధ్యలో, తన శిష్యులుగా ఉండాలంటే నిర్వర్తించవలసిన మరొక విధి గురించి ఆయన వారికి గుర్తు చేశాడు. ఆయనిలా అన్నాడు: “మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.” (యోహాను 15:⁠8) శిష్యులుగా ఉండడానికి అవసరమైన ఈ విధిని నేడు మనం నిర్వర్తిస్తున్నామా? “బహుగా ఫలించ[డం]” అంటే ఏమిటి? అది తెలుసుకోవడానికి, ఆ సాయంకాలం జరిగిన సంభాషణను మనం పరిశీలిద్దాం.

2 ఫలించమని ఇవ్వబడిన ఉపదేశం, యేసు తన అపొస్తలులకు చెప్పిన ఒక దృష్టాంతంలోని భాగం. ఆయనిలా అన్నాడు: “నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. . . . మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని; నా ప్రేమయందు నిలిచి యుండుడి. . . . మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచి యుందురు.”​—⁠యోహాను 15:​1-10.

3 ఈ దృష్టాంతంలో యెహోవా వ్యవసాయకుడు, యేసు ద్రాక్షావల్లి, యేసు ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో ఆ అపొస్తలులు కొమ్మలు. అపొస్తలులు యేసు యందు “నిలిచియుండ”డానికి కృషి చేస్తున్నంత వరకూ వారు ఫలిస్తారు. ఆ తర్వాత యేసు, ఈ అత్యావశ్యకమైన ఐక్యతను కాపాడుకోవడంలో అపొస్తలులు ఎలా సఫలులు కావచ్చో ఇలా వివరించాడు: ‘మీరు నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు.’ ఆ తర్వాత అపొస్తలుడైన యోహాను తోటి క్రైస్తవులకు ఇలాంటి మాటలనే వ్రాస్తాడు: “[క్రీస్తు] ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును.” * (1 యోహాను 2:24; 3:​24) కాబట్టి క్రీస్తు ఆజ్ఞలను గైకొనడం ద్వారా ఆయన అనుచరులు ఆయనయందు నిలిచివుంటారు, ఆ ఐక్యత వారు ఫలించడానికి వారికి సహాయం చేస్తుంది. మనమెలాంటి ఫలాలను ఫలించవలసిన అవసరముంది?

అభివృద్ధికి అవకాశం

4 ద్రాక్షావల్లిని గురించిన దృష్టాంతంలో, ఒక కొమ్మ ఫలించనప్పుడు యెహోవా దాన్ని ‘తీసి పారవేస్తాడు’ లేదా నరికివేస్తాడు. ఇది మనకేమి చెబుతోంది? శిష్యులందరూ ఫలించాల్సిన అవసరముందని మాత్రమే కాదు గానీ వారి పరిస్థితులు లేదా పరిమితులు ఎలాంటివైనా సరే అందరికీ ఫలించే సామర్థ్యం ఉందని ఇది మనకు చెబుతోంది. వాస్తవానికి, క్రీస్తు శిష్యుడిగావున్న ఒక వ్యక్తి తన సామర్థ్యానికి మించినదాన్ని సాధించలేకపోయినందుకు ఆయనను ‘తీసి పారవేయడం’ లేదా అనర్హుడ్ని చేయడమంటే అది యెహోవా ప్రేమపూర్వక మార్గాలకే విరుద్ధమైనదవుతుంది.​—⁠కీర్తన 103:14; కొలొస్సయులు 3:​23, 24; 1 యోహాను 5:⁠3.

5 ద్రాక్షావల్లిని గురించిన యేసు దృష్టాంతం, శిష్యులుగా మన కార్యకలాపాల్లో అభివృద్ధి సాధించడానికి మన పరిస్థితుల పరిధుల్లోనే అవకాశాల కోసం చూడాలని కూడా చెబుతోంది. యేసు దాన్ని ఎలా చెబుతున్నాడో గమనించండి: “నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.” (ఇటాలిక్కులు మావి.) (యోహాను 15:⁠2) దృష్టాంతం చివరలో, “బహుగా ఫలించు[డి] అని యేసు తన అనుచరులకు ఉద్బోధించాడు. (ఇటాలిక్కులు మావి.) (8వ వచనం) ఇదేమి సూచిస్తోంది? శిష్యులుగా మనమెన్నడూ, ఇక చాల్లే అని సంతృప్తిచెంది మిన్నకుండిపోకూడదు. (ప్రకటన 3:​14, 15, 19) బదులుగా, ఫలించడంలో అభివృద్ధి సాధించడానికి మనం మార్గాల కోసం చూడాలి. మనం ఏ విధమైన ఫలాలను మరింత సమృద్ధిగా ఫలించడానికి కృషి చేయాలి? అవి (1) ‘ఆత్మ ఫలము,’ (2) రాజ్య ఫలము.​—⁠గలతీయులు 5:22; మత్తయి 24:​14.

క్రైస్తవ లక్షణాలనే ఫలం

6 ‘ఆత్మ ఫలంలో’ మొదట పేర్కొనబడినది ప్రేమ. దేవుని పరిశుద్ధాత్మ క్రైస్తవుల్లో ప్రేమను ఉత్పన్నం చేస్తుంది, ఎందుకంటే ఫలించే ద్రాక్షావల్లిని గురించిన దృష్టాంతం గురించి మాట్లాడడానికి కొంచెం ముందు యేసు ఇచ్చిన ఆజ్ఞను వారు పాటిస్తారు. “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను” అని ఆయన తన అపొస్తలులకు చెప్పాడు. (యోహాను 13:​34) వాస్తవానికి, యేసు తన భూ జీవితంలోని చివరి రాత్రి జరిగిన ఆ సంభాషణంతటిలోనూ ప్రేమ అనే లక్షణాన్ని ప్రతిబింబించవలసిన అవసరత గురించి అపొస్తలులకు పదే పదే గుర్తు చేశాడు.​—⁠యోహాను 14:​15, 21, 23, 24; 15:​12, 13, 17.

7 ఆ రాత్రి అక్కడున్న పేతురు, క్రీస్తు నిజమైన శిష్యుల్లో క్రీస్తువంటి ప్రేమ, తత్సంబంధిత లక్షణాలు వ్యక్తం కావాలని అర్థం చేసుకున్నాడు. సంవత్సరాల తర్వాత పేతురు ఆశానిగ్రహము, సహోదర అనురాగము, ప్రేమ వంటి లక్షణాలను అలవర్చుకోవాలని క్రైస్తవులను ప్రోత్సహించాడు. అలా చేయడం, “సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ” చేస్తుందని కూడా ఆయన అన్నాడు. (2 పేతురు 1:​5-8) మన పరిస్థితులు ఏవైనప్పటికీ ఆత్మ ఫలాన్ని వ్యక్తం చేయడం మనకు సాధ్యమే. కాబట్టి మనం ప్రేమ, దయ, కనికరంతోపాటు క్రీస్తువంటి ఇతర లక్షణాలు సంపూర్ణంగా చూపించడానికి కృషి చేద్దాము, ఎందుకంటే “ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు.” (గలతీయులు 5:​23, 24) వాస్తవానికి, మనం ‘బహుగా ఫలించుదాము.’

రాజ్య ఫలాన్ని ఫలించడం

8 రంగురంగుల, రసమయమైన ఫలాలు చెట్టు అందాన్ని ఇనుమడింపజేస్తాయి. అయితే ఆ ఫలాలు అందాన్ని ఇనుమడింపజేయడం కంటే ఎంతో ఎక్కువే చేస్తాయి. విత్తనాల ద్వారా చెట్టు విస్తరించడానికి కూడా ఫలాలు ఎంతో ఆవశ్యకం. అలాగే, ఆత్మ ఫలం మన క్రైస్తవ వ్యక్తిత్వ అందాన్ని ఇనుమడింపజేయడం కంటే ఎక్కువే చేస్తుంది. ప్రేమ, విశ్వాసం వంటి లక్షణాలు దేవుని వాక్యంలో ఉన్న విత్తనాల్లాంటి రాజ్యసందేశాన్ని వ్యాపింపజేయడానికి మనల్ని పురికొల్పుతాయి. ఈ ప్రాముఖ్యమైన సంబంధాన్ని అపొస్తలుడైన పౌలు ఎలా నొక్కి చెబుతున్నాడో గమనించండి. ఆయనిలా అంటున్నాడు: “మేమును విశ్వసించుచున్నాము [ఆత్మ ఫలములో ఒక భాగం] గనుక మాటలాడుచున్నాము.” (2 కొరింథీయులు 4:​14, 15) పౌలు ఇంకా ఇలా వర్ణిస్తున్నాడు, ఈ విధంగా మనం, “దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా . . . జిహ్వాఫలము అర్పించుదము,” ఇది మనం ప్రదర్శించవలసిన రెండవ రకమైన ఫలం. (హెబ్రీయులు 13:​15) దేవుని రాజ్య ప్రచారకులుగా మరింత ఫలవంతంగా ఉండడానికి, వాస్తవానికి ‘బహుగా ఫలించడానికి’ మన జీవితంలో అవకాశాలున్నాయా?

9 సరిగ్గా సమాధానం చెప్పాలంటే, మొదట మనం రాజ్య ఫలంలో ఇమిడి ఉన్నదేమిటో అర్థం చేసుకోవాలి. ఫలించడం అంటే శిష్యులను చేయడమనే ముగింపుకు రావడం సరైనదేనా? (మత్తయి 28:​19) మనం ఫలించే ఫలం ప్రాథమికంగా, బాప్తిస్మం పొందిన యెహోవా ఆరాధకులవడానికి మనం సహాయం చేసిన వ్యక్తులను సూచిస్తోందా? కాదు. అలాగైతే, అంతగా ప్రతిస్పందన లేని ప్రాంతాల్లో రాజ్య సందేశాన్ని సంవత్సరాలుగా నమ్మకంగా ప్రకటిస్తున్న అమూల్యమైన ఆ సాక్షులందరికీ ఆ పరిస్థితి ఎంతో నిరుత్సాహం కలిగించేదిగా ఉంటుంది. నిజానికి, మనం ఫలించే రాజ్య ఫలం కేవలం కొత్త శిష్యులనే సూచిస్తే, కష్టపడి పనిచేసే అలాంటి సాక్షులు యేసు దృష్టాంతంలోని ఫలించని కొమ్మల వలే ఉంటారు! అయితే విషయం అది కాదు. మన పరిచర్య యొక్క ప్రాథమిక రాజ్య ఫలం అంటే ఏమిటి?

రాజ్య విత్తనాలను విస్తరింపచేయడం ద్వారా ఫలించడం

10 విత్తువాని గురించి, వివిధ రకాల నేలలను గురించి యేసు చెప్పిన దృష్టాంతం ఆ ప్రశ్నకు సమాధానాన్నిస్తుంది అంటే అంతగా ప్రతిస్పందన లేని ప్రాంతాల్లో సాక్ష్యమిస్తున్న వారిని ప్రోత్సహించే సమాధానాన్ని సూచిస్తుంది. విత్తనం దేవుని వాక్యంలో కనుగొనబడే రాజ్య సందేశాన్ని, నేల మానవుని సూచనార్థక హృదయాన్ని సూచిస్తాయని యేసు చెప్పాడు. కొన్ని విత్తనాలు “మంచినేలను పడెను; అవి మొలిచి . . . ఫలించె[ను].” (లూకా 8:⁠8) ఏ ఫలాన్ని? గోధుమ దంటు మొలకెత్తి ఎదిగిన తర్వాత, అది చిన్న గోధుమ దంట్లను కాదు గానీ కొత్త విత్తనాలను ఉత్పన్నం చేస్తుంది. అదే విధంగా, ఒక క్రైస్తవుడు ఉత్పన్నం చేసేది కొత్త శిష్యులను కాదు గానీ కొత్త రాజ్య విత్తనాలను.

11 కాబట్టి, ఈ విషయంలో ఫలం అంటే కొత్త శిష్యులూ కాదు చక్కని క్రైస్తవ లక్షణాలూ కాదు. విత్తబడిన విత్తనం రాజ్యమును గురించిన వాక్యము కాబట్టి దాని ఫలం ఆ రాజ్యాన్ని గురించిన మరిన్ని వ్యక్తీకరణలను సూచించాలి. ఈ విషయంలో ఫలించడం అంటే రాజ్యం గురించి ప్రకటించడం. (మత్తయి 24:​14) అలాంటి రాజ్య ఫలాన్ని ఫలించడం, అంటే రాజ్య సువార్తను ప్రకటించడం మన పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ మనకు సాధ్యమేనా? సాధ్యమే! దానికి కారణమేమిటో అదే దృష్టాంతంలో యేసు వివరిస్తున్నాడు.

దేవుని మహిమార్థం మన దగ్గరున్న శ్రేష్ఠమైనది ఇవ్వడం

12 “మంచినేలను విత్తబడినవాడు . . . యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించు[ను]” అని యేసు చెప్పాడు. (మత్తయి 13:​23) పొలంలో విత్తబడిన విత్తనాలు పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా ఫలించవచ్చు. అదే విధంగా, సువార్త ప్రకటించడంలో మనం చేసేది మన పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా ఉండవచ్చు, తాను ఈ విషయాన్ని గుర్తించానని యేసు చూపించాడు. కొంతమందికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు; మరితరులకు మంచి ఆరోగ్యం, ఎక్కువ శక్తి ఉండవచ్చు. కాబట్టి, మనం చేయగలుగుతున్నది ఇతరులు చేస్తున్నదానికి ఎక్కువో తక్కువో ఉండవచ్చు, కానీ మనం చేస్తున్నది మనకు సాధ్యమైనంతలో సర్వశ్రేష్ఠమైనదైనప్పుడు యెహోవా దాన్ని బట్టి సంతోషిస్తాడు. (గలతీయులు 6:⁠4) పైబడుతున్న వయస్సు లేదా బలహీనపరిచే అనారోగ్యం ప్రకటనా పనిలో మనం పాల్గొనడాన్ని పరిమితం చేసినప్పటికీ కరుణగల మన తండ్రియైన యెహోవా మనల్ని ‘బహుగా ఫలించు’ వారిలో ఒకరిగా దృష్టిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు? ఎందుకంటే మనం ‘మనకు కలిగినదంతా’ అంటే మన పూర్ణమనస్సుతో కూడిన సేవను ఆయనకు అర్పిస్తాము. *​—⁠మార్కు 12:43, 44; లూకా 10:27.

13 రాజ్య ఫలాన్ని మనం ఎంత మేరకు ఉత్పన్నం చేయగలిగినా​—⁠మనమెందుకు అలా చేస్తున్నామనేది మనస్సులో ఉంచుకుంటే​—⁠‘ఫలించడంలో’ కొనసాగడానికి మనం పురికొల్పబడతాము. (యోహాను 15:​16) దానికి ప్రధానమైన కారణాన్ని యేసు ఇలా తెలియజేశాడు: “మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును.” (యోహాను 15:⁠8) అవును, మన ప్రకటనా పని సర్వ మానవజాతి ఎదుట యెహోవా నామమును ఘనపరుస్తుంది. (కీర్తన 109:​30) దాదాపు 75 ఏళ్ళున్న హానర్‌ అనే నమ్మకస్థురాలైన సాక్షి ఇలా పేర్కొంటోంది: “అంతగా ప్రతిస్పందన లేని ప్రాంతాల్లో సహితం, సర్వోన్నతునికి ప్రాతినిధ్యం వహించడం ఒక ఆధిక్యత.” క్లాడియో అనే వ్యక్తి 1974 నుండి అత్యంత ఆసక్తిగల సాక్షిగా ఉన్నాడు, ఆయన సేవ చేస్తున్న ప్రాంతంలో చాలా తక్కువమంది ప్రతిస్పందిస్తున్నప్పటికీ ఆయన ప్రకటించడంలో కొనసాగడానికి కారణమేమిటని ఆయనను అడిగినప్పుడు, ఆయన యోహాను 4:34ను ఎత్తి చెప్పాడు, అక్కడ యేసు మాటలను మనమిలా చదువుతాము: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” క్లాడియో ఇంకా ఇలా అన్నాడు: “యేసు వలే నేను రాజ్య ప్రచారకుడిగా నా పనిని ప్రారంభించడమే కాదు తుదముట్టించాలని కూడా కోరుకుంటున్నాను.” (యోహాను 17:⁠4) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఆయనతో ఏకీభవిస్తారు.​—⁠21వ పేజీలో ఉన్న “‘ఓపికతో ఫలించడం’ ఎలా” అనే బాక్సును చూడండి.

ప్రకటించడానికి, బోధించడానికి

14 సువార్తల్లో ప్రస్తావించబడిన మొదటి రాజ్య ప్రచారకుడు బాప్తిస్మమిచ్చే యోహాను. (మత్తయి 3:1, 2; లూకా 3:​18) ఆయన ప్రాథమిక సంకల్పం ‘సాక్ష్యమివ్వడం,’ ఆయన దాన్ని ప్రగాఢమైన విశ్వాసంతో, ‘అందరూ విశ్వసిస్తారనే’ ఆశతో చేశాడు. (యోహాను 1:​6, 7) వాస్తవానికి, యోహాను ఎవరికైతే ప్రకటించాడో వారిలో కొందరు క్రీస్తు శిష్యులయ్యారు. (యోహాను 1:​35-37) కాబట్టి, యోహాను ప్రచారకుడే కాదు శిష్యులను చేసేవాడు కూడా. యేసు కూడా ప్రచారకుడు, అలాగే బోధకుడు. (మత్తయి 4:23; 11:⁠1) అందుకే యేసు తన అనుచరులకు, రాజ్య సందేశాన్ని ప్రకటించమనే కాదు, దాన్ని అంగీకరించే వ్యక్తులు ఆయన శిష్యులయ్యేందుకు వారికి సహాయం చేయాలని కూడా ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:​19, 20) కాబట్టి నేడు మన పని కేవలం ప్రకటించడమే కాదు బోధించడం కూడా.

15 సా.శ. మొదటి శతాబ్దంలో, పౌలు ప్రకటించినదాన్ని బోధించినదాన్ని విన్నవారిలో ‘కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు.’ (అపొస్తలుల కార్యములు 28:​24) నేడు కూడా ప్రతిస్పందన దాదాపు అలాగే ఉంది. విచారకరంగా, రాజ్య విత్తనాల్లో అనేకం ప్రతిస్పందన లేని నేలలో పడుతున్నాయి. అయితే యేసు ప్రవచించినట్లుగానే, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడి, వేళ్ళూని, మొలకెత్తుతున్నాయి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా సంవత్సరంలోని ప్రతి వారం సగటున 5,000 కంటే ఎక్కువమంది క్రీస్తు నిజమైన శిష్యులవుతున్నారు! “చెప్పిన సంగతుల[ను]” చాలామంది ఇతర ప్రజలు నమ్మకపోయినప్పటికీ ఈ కొత్త శిష్యులు వాటిని నమ్ముతున్నారు. రాజ్య సందేశానికి వారి హృదయం ప్రతిస్పందించడానికి వారికి సహాయపడినదేమిటి? సాక్షులు చూపించే వ్యక్తిగత ఆసక్తి​—⁠ఒక విధంగా చెప్పాలంటే కొత్తగా నాటిన విత్తనాలకు నీళ్ళుపెట్టడం​—⁠తరచూ ప్రయోజనకరమైన ఫలితాలను తీసుకువచ్చింది. (1 కొరింథీయులు 3:⁠6) అనేక ఉదాహరణల్లో కేవలం రెండింటిని పరిశీలించండి.

వ్యక్తిగతంగా ఆసక్తి చూపించడం ప్రయోజనం చేకూరుస్తుంది

16 బెల్జియంలో కారొలీన్‌ అనే యౌవనసాక్షి ఒక వృద్ధ స్త్రీని కలిసింది, ఆమె రాజ్య సందేశంలో ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఆ స్త్రీ చేతికి బ్యాండేజీ ఉండడంతో కారొలీన్‌, ఆమె సహచరి, ఆ స్త్రీకి సహాయం చేయడానికి వెళ్ళారు గానీ ఆ స్త్రీ తిరస్కరించింది. రెండు రోజుల తర్వాత ఈ సాక్షులు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆమెకెలా ఉందని అడిగారు. “అలా అడగడం ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చింది. మేము ఆమె పట్ల నిజంగా ఆసక్తి చూపిస్తున్నామని తెలుసుకొని ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె మమ్మల్ని తన ఇంట్లోకి ఆహ్వానించింది, దానితో బైబిలు అధ్యయనం ప్రారంభమైంది” అని కారొలీన్‌ చెప్పింది.

17 అమెరికాలో సాక్షిగా ఉన్న సాండీ కూడా తాను ఎవరికైతే ప్రకటిస్తుందో వారి పట్ల వ్యక్తిగత ఆసక్తి చూపిస్తుంది. ఆమె స్థానిక వార్తాపత్రికలో జనన ప్రకటనలను చూసి, కొత్తగా తల్లిదండ్రులైన వారిని సందర్శించి, నా బైబిలు కథల పుస్తకము వారికిస్తుంది. * సాధారణంగా తల్లి ఇంట్లోనే ఉండి, తనను చూడడానికి వచ్చినవారికి తన బిడ్డను సగర్వంగా చూపిస్తుంది కాబట్టి, తరచూ సంభాషణ ప్రారంభమవుతుంది. “పుట్టిన పసి బిడ్డకు చదివి వినిపించడం ద్వారా ఆ బిడ్డతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి నేను తల్లిదండ్రులతో మాట్లాడతాను. ఆ తర్వాత, నేటి సమాజంలో బిడ్డను పెంచడంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడతాను” అని సాండీ వివరిస్తోంది. ఇటీవలనే, అలా సందర్శించడం వల్ల ఒక తల్లి, ఆరుగురు పిల్లలు యెహోవా సేవ చేయడం ప్రారంభించారు. చొరవతీసుకొని, వ్యక్తిగతంగా ఆసక్తి చూపిస్తే మన పరిచర్యలో కూడా అలాంటి ఆనందకరమైన ఫలితాలే లభించవచ్చు.

18 ‘బహుగా ఫలించడం’ అనే విధిని నిర్వర్తించడం మనకు సాధ్యమేనని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరమో కదా! మనం యౌవనులమైనా వృద్ధులమైనా, మనం ఆరోగ్యవంతులమైనా అనారోగ్యంతో బాధపడుతున్నా, మనం బాగా ప్రతిస్పందించే ప్రాంతంలో ప్రకటిస్తున్నా అంతగా ప్రతిస్పందన లేని ప్రాంతాల్లో ప్రకటిస్తున్నా మనమందరం ఫలించగలుగుతున్నాము. ఎలా? ఆత్మ ఫలాన్ని సంపూర్ణ స్థాయిలో వ్యక్తం చేయడం ద్వారా, మనకు సాధ్యమైనంత మేరకు దేవుని రాజ్య సందేశాన్ని విస్తరింప చేయడం ద్వారా. అదే సమయంలో, మనం ‘యేసును గూర్చిన వాక్యములో నిలిచి ఉండడానికి,’ ‘ఒకరి యెడల ఒకరం ప్రేమ కలిగివుండడానికి’ కృషి చేస్తున్నాము. అవును, యోహాను సువార్తలో పేర్కొనబడిన, శిష్యులుగా ఉండడానికి అవసరమైన ఈ మూడు ముఖ్యమైన విధులను నెరవేర్చడం ద్వారా, మనం ‘నిజముగా క్రీస్తు శిష్యులమై’ ఉన్నామని నిరూపించుకుంటాము.​—⁠యోహాను 8:31; 13:​35.

[అధస్సూచీలు]

^ పేరా 5 దృష్టాంతంలోని ద్రాక్ష కొమ్మలు యేసు అపొస్తలులను, దేవుని పరలోక రాజ్యంలో భాగం కాబోయే ఇతర క్రైస్తవులను సూచిస్తున్నప్పటికీ నేటి క్రీస్తు అనుచరులందరూ ప్రయోజనం పొందగల సత్యాలు ఆ దృష్టాంతంలో ఉన్నాయి.​—⁠యోహాను 3:16; 10:​16.

^ పేరా 19 వృద్ధాప్యం లేదా అనారోగ్యం మూలంగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేని వారు ఉత్తరాల ద్వారా, అనుమతించబడిన చోట టెలిఫోన్‌ ద్వారా సాక్ష్యమివ్వవచ్చు లేదా తమను పరామర్శించడానికి వచ్చిన వారితో సువార్త పంచుకోవచ్చు.

^ పేరా 26 యెహోవాసాక్షులు ప్రచురించినది.

పునఃసమీక్షకు ప్రశ్నలు

• మనం ఏ విధమైన ఫలాన్ని బహుగా ఫలించవలసిన అవసరముంది?

• ‘బహుగా ఫలించడం’ అనే లక్ష్యం ఎలా మనం చేరుకోగల లక్ష్యమైవుంది?

• శిష్యులుగా ఉండడానికి అవసరమైన, యోహాను సువార్తలో పేర్కొనబడిన ఏ మూడు ముఖ్యమైన విధులను మనం పరిశీలించాము?

[అధ్యయన ప్రశ్నలు]

1. (ఎ) యేసు తన అపొస్తలులతో, శిష్యులుగా ఉండడానికి అవసరమైన ఏ విధి గురించి చెప్పాడు? (బి) మనల్ని మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

2. యేసు తన మరణానికి ముందు సాయంకాలం ఫలాలను గురించిన ఏ దృష్టాంతాన్ని చెప్పాడు?

3. యేసు అనుచరులు ఫలించాలంటే ఏమి చేయాలి?

4. ఫలించని ప్రతి కొమ్మను యెహోవా ‘తీసి పారవేస్తాడు’ అనే వాస్తవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

5. (ఎ) ఫలించడంలో మనం అభివృద్ధి సాధించవచ్చని యేసు దృష్టాంతం ఎలా సూచిస్తోంది? (బి) మనం ఏ రెండు రకాల ఫలాలను పరిశీలిస్తాము?

6. ఆత్మ ఫలంలో మొదట పేర్కొన్నదాని విలువను యేసుక్రీస్తు ఎలా నొక్కిచెప్పాడు?

7. ఫలించడానికి, క్రీస్తువంటి లక్షణాలు వ్యక్తం కావడానికి సంబంధం ఉందని అపొస్తలుడైన పేతురు ఎలా చూపించాడు?

8. (ఎ) ఆత్మ ఫలానికి, రాజ్య ఫలానికి మధ్యనున్న సంబంధమేమిటి? (బి) మనం ఏ ప్రశ్నను పరిశీలించడం మంచిది?

9. ఫలించడం, శిష్యులను చేయడం ఒకటేనా? వివరించండి.

10. రాజ్య ఫలం అంటే ఏమిటో, ఏమి కాదో, విత్తువాని గురించి వివిధ రకాలైన నేలల గురించి యేసు చెప్పిన దృష్టాంతం ఎలా చూపిస్తుంది?

11. రాజ్య ఫలాన్ని ఎలా నిర్వచించవచ్చు?

12. రాజ్య ఫలాన్ని ఫలించడం క్రైస్తవులందరికీ సాధ్యమేనా? వివరించండి.

13. (ఎ) రాజ్య ఫలాన్ని ‘ఫలించడంలో’ కొనసాగడానికి మనకు గల ప్రధాన కారణమేమిటి? (బి) ప్రతిస్పందన అంతగా లేని ప్రాంతాల్లో సహితం ఫలిస్తూ ఉండడానికి మనకేమి సహాయం చేస్తుంది? (21వ పేజీలో ఉన్న బాక్సును చూడండి.)

14. (ఎ) బాప్తిస్మమిచ్చు యోహాను, యేసు ఏ రెండు విధాల పనిని చేశారు? (బి) నేడు జరుగుతున్న క్రైస్తవ పనిని మీరెలా వర్ణిస్తారు?

15. సా.శ. మొదటి శతాబ్దంలో జరిగిన ప్రకటనా పనికి వచ్చిన ప్రతిస్పందనకూ నేడు జరుగుతున్న ప్రకటనా పనికి వస్తున్న ప్రతిస్పందనకూ ఏ సారూప్యత ఉంది?

16, 17. మన పరిచర్యలో మనం కలిసేవారి పట్ల వ్యక్తిగత ఆసక్తి చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

18. (ఎ) ‘బహుగా ఫలించడం’ అనే విధిని నిర్వర్తించడం మనకందరికీ సాధ్యమేనని ఎందుకు చెప్పవచ్చు? (బి) యోహాను సువార్తలో పేర్కొనబడిన, శిష్యులుగా ఉండడానికి అవసరమైన ఏ మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తించడానికి మీరు కృత నిశ్చయం చేసుకున్నారు?

[21వ పేజీలోని బాక్సు/చిత్రం]

‘ఓపికతో ఫలించడం’ ఎలా?

ప్రతిస్పందన అంతగా లేని ప్రాంతాల్లో రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో నమ్మకంగా కొనసాగడానికి మీకేది సహాయపడుతుంది? ఈ ప్రశ్నకు సహాయకరమైన కొన్ని సమాధానాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

“క్షేత్రంలో ఎలాంటి ప్రతిస్పందన ఉన్నప్పటికీ మనకు యేసు పూర్తి మద్దతు ఉందని తెలుసుకోవడం ఆశాభావాన్ని, పట్టుదలను పురికొల్పుతుంది.”​—⁠హారీ, వయస్సు 72 సంవత్సరాలు; 1946లో బాప్తిస్మం తీసుకున్నాడు.

2 కొరింథీయులు 2:⁠17 నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. మనం ‘క్రీస్తునందు దేవునియెదుట,’ పరిచర్యలో పాల్గొంటున్నామని ఆ వచనం చెబుతోంది. నేను పరిచర్య చేస్తున్నప్పుడు, నా ప్రియ స్నేహితుల సహచర్యాన్ని అనుభవిస్తాను.”​—⁠క్లాడియో, వయస్సు 43 సంవత్సరాలు; 1974లో బాప్తిస్మం తీసుకున్నాడు.

“నిర్మొహమాటంగా చెప్పాలంటే, ప్రకటనా పని నాకొక వ్యక్తిగత పోరాటం. అయినా, నేను కీర్తన 18:29లోని మాటల సత్యాన్ని అనుభవిస్తున్నాను, అక్కడిలా ఉంది: ‘నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.’”​—⁠గెరార్ట్‌, వయస్సు 79 సంవత్సరాలు; 1955లో బాప్తిస్మం తీసుకున్నాడు.

“నేను పరిచర్యలో ఒక్క లేఖనం చదవగలిగినా, ఎవరో ఒకరు బైబిలు ద్వారా తన హృదయాన్ని పరీక్షించుకున్నారన్న సంతృప్తిని అది నాకిస్తుంది.”​—⁠ఎల్నార్‌, వయస్సు 26 సంవత్సరాలు; 1989లో బాప్తిస్మం తీసుకుంది.

“నేను వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంటాను. నా జీవితంలోని మిగిలిన సంవత్సరాలన్నిటిలో నేను ఉపయోగించలేనన్ని ఎక్కువ పద్ధతులున్నాయి.”​—⁠పౌల్‌, వయస్సు 79 సంవత్సరాలు; 1940లో బాప్తిస్మం తీసుకున్నాడు.

“నేను ప్రతికూల ప్రతిస్పందనలను వ్యక్తిగతంగా తీసుకోను. ప్రజలతో సంభాషిస్తూ వారి దృక్కోణాన్ని వింటూ నేను వారితో స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నిస్తాను.”​—⁠డాన్యెల్‌, వయస్సు 75 సంవత్సరాలు; 1946లో బాప్తిస్మం తీసుకున్నాడు.

“తాము సాక్షులు కావడానికి నా ప్రకటనా పని ఒక పాత్ర నిర్వహించిందని నాతో చెప్పిన కొత్తగా బాప్తిస్మం పొందిన వారిని నేను కలుసుకున్నాను. నాకు తెలియకుండానే, మరెవరో వారితో ఆ తర్వాత బైబిలు అధ్యయనం చేసి వారు అభివృద్ధి సాధించడానికి సహాయం చేశారు. మన పరిచర్య జట్టుగా కలిసి చేసే పని అని తెలుసుకోవడం నాకు ఆనందాన్నిస్తుంది.”​—⁠జోన్‌, వయస్సు 66 సంవత్సరాలు; 1954లో బాప్తిస్మం తీసుకుంది.

‘ఓపికతో ఫలించడానికి’ మీకేమి సహాయం చేస్తుంది?​—⁠లూకా 8:⁠15.

[20వ పేజీలోని చిత్రాలు]

ఆత్మ ఫలాన్ని ప్రదర్శించడం ద్వారా, రాజ్య సందేశాన్ని ప్రకటించడం ద్వారా, మనం బహుగా ఫలిస్తాము

[23వ పేజీలోని చిత్రం]

‘బహుగా ఫలించమని’ యేసు తన అపొస్తలులకు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశమేమిటి?