కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యదేవుని అనుకరించడం

సత్యదేవుని అనుకరించడం

సత్యదేవుని అనుకరించడం

“మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.”​—⁠ఎఫెసీయులు 5:⁠1.

“సత్యమనగా ఏమిటి?” (యోహాను 18:​38) అని దాదాపు 2000 సంవత్సరాల క్రితం పొంతి పిలాతు హేళనగా అడిగిన ఆ ప్రశ్న, సత్యాన్ని అనుసరించి నడవడం బొత్తిగా గ్రహింప శక్యంకానిదనే భావమిస్తోంది. నేడనేకులు దానిని ఆమోదిస్తారు. సత్య స్వభావమే ముట్టడిక్రింద ఉంది. ప్రతివారు ఎవరికివారు సత్యమేదో స్వయంగా నిర్ణయించుకుంటారనో లేదా సత్యం సాపేక్షికమైనదనో లేదా సత్యం సదా మారుతుంటుందనో చెప్పడం మీరు వినే ఉంటారు. అలాంటి తర్కం లోపభూయిష్టమైనది. మనం నివసిస్తున్న ప్రపంచాన్ని గురించిన వాస్తవాలను, సత్యాన్ని నేర్చుకోవడమే పరిశోధనా విద్యల అసలు లక్ష్యం. సత్యం వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధించిన విషయంకాదు. ఉదాహరణకు, మానవ ఆత్మ మర్త్యం లేదా అమర్త్యం. సాతాను ఉనికిలో ఉన్నాడు లేదా ఉనికిలో లేడు. జీవితానికొక సంకల్పముంది లేదా సంకల్పంలేదు. వీటిలో ఏదో ఒకటి మాత్రమే సరైన జవాబుగా ఉండగలదు. ఒకటి తప్పు మరొకటి ఒప్పు; రెండూ ఒప్పులు కాలేవు.

2 ముందరి ఆర్టికల్‌లో, యెహోవా సత్యదేవుడని మనం పరిశీలించాం. సమస్త విషయాల సత్యం ఆయనకు తెలుసు. మోసపూరిత శత్రువైన అపవాదియగు సాతానుకు పూర్తి భిన్నంగా యెహోవా సదా సత్యవంతుడే. అంతకంటే ఎక్కువగా, యెహోవా ఉదారంగా సత్యాన్ని ఇతరులకు వెల్లడిచేస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకిలా ఉద్భోదించాడు: “మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 5:⁠1) మాటలో, సత్యం ప్రకారం జీవించడంలో యెహోవాసాక్షులుగా మనమెలా ఆయనను ఎలా అనుకరించవచ్చు? అలాచేయడం ఎందుకు ప్రాముఖ్యం? సత్యమార్గం వెంబడించేవారిని యెహోవా ఆమోదిస్తాడని మనకే అభయముంది? మనం పరిశీలిద్దాం.

3 అసత్యాలు పొంగిపొర్లుతున్న కాలంలో మనం జీవిస్తున్నాము. దైవావేశంతో అపొస్తలుడైన పౌలు ప్రవచించినట్లుగానే, ఈ “అంత్యదినములలో” అనేకమంది పైకి భక్తిగలవారివలే ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు. కొందరు “చెడిన మనస్సు కలిగి” సత్యాన్ని ఎదిరిస్తారు. అంతేకాకుండా, “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.” అలాంటివారు సదా నేర్చుకుంటున్నా, వారెన్నటికీ “సత్యవిషయమైన అనుభవజ్ఞానము” పొందలేరు.​—⁠2 తిమోతి 3:1, 5, 6, 8, 13.

4 అపొస్తలుడైన పేతురు కూడా అంత్యదినాలను గూర్చి వ్రాయడానికి ప్రేరేపింపబడ్డాడు. ఆయన ప్రవచించిన రీతిగానే ప్రజలు సత్యాన్ని తిరస్కరించడమేగాక, దేవుని వాక్యాన్నీ దానిలోని సత్యాన్ని ప్రకటించేవారినీ కూడా అపహాస్యం చేస్తారు. అలాంటి అపహాసకులు “తమ స్వకీయ దురాశల చొప్పున” భావి తీర్పుదినానికి నమూనాగా నోవహు కాలపు జలప్రళయంలో లోకం నాశనమైందన్న వాస్తవాన్ని పెడచెవినపెడతారు. భక్తిహీనులను నాశనంచేసేందుకు దేవుని సమయమొచ్చినప్పుడు వారి ఆశావహ ఆలోచనే వారికి ముప్పుగా పరిణమిస్తుంది.​—⁠2 పేతురు 3:3-7.

యెహోవా సేవకులకు సత్యం తెలుసు

5 “అంత్యకాలము”ను గూర్చిన ఒక వివరణలో, దేవుని ప్రజల మధ్య కలిగే విభిన్న తరహా వికాసాన్ని అంటే మతసంబంధ సత్యపు ఉజ్జీవాన్ని దానియేలు ప్రవక్త ప్రవచించాడు. ఆయనిలా వ్రాశాడు: “చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి [“నిజమైన పరిజ్ఞానం,” NW] అధికమగును.” (దానియేలు 12:⁠4) మహా మోసగానిచేత యెహోవా ప్రజలు తికమక పెట్టబడరు లేదా అంధులు చేయబడరు. బైబిలు పుటల్లో నలుదిశలు సంచరించి, వారు నిజమైన పరిజ్ఞానం సంపాదించుకున్నారు. మొదటి శతాబ్దంలో, యేసు తన శిష్యులకు జ్ఞానోదయం కలిగించాడు. “వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెర[చాడు].” (లూకా 24:​45) మనకాలంలోనూ, యెహోవా అదేవిధంగా చేశాడు. భూవ్యాప్తంగా లక్షలాదిమంది తనదగ్గరున్న సత్యాన్ని అర్థంచేసుకునేందుకు ఇప్పటికే తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, సంస్థ ద్వారా ఆయన సహాయం చేశాడు.

6 దేవుని ప్రజలుగా మనం, మరోవిధంగా అయితే తెలుసుకోలేని అనేక సంగతులను అర్థంచేసుకుంటున్నాం. లోకంలోని జ్ఞానులు జవాబులు తెలుసుకోవాలని సహస్రాబ్దాలుగా తంటాలుపడిన అనేక ప్రశ్నలకు జవాబులు మనకు తెలుసు. ఉదాహరణకు, బాధలెందుకున్నాయో, ప్రజలెందుకు చనిపోతారో, మానవులెందుకు భౌగోళిక శాంతిసమైక్యతలు సాధించలేరో మనకు తెలుసు. భవిష్యత్తులో ఏమివుందో అంటే దేవుని రాజ్యం, పరదైసు భూమి, పరిపూర్ణతగల నిరంతర జీవితం వంటివాటి భావిసూచక దృశ్యంతో కూడా మనమాశీర్వదించబడ్డాము. సర్వోన్నతుడైన యెహోవాను మనం తెలుసుకున్నాం. ఆయన ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని, దానితోపాటు ఆయన దీవెనలు అనుభవించేందుకు మనమేమి చెయ్యాలో కూడా నేర్చుకున్నాము. సత్యాన్ని తెలుసుకోవడం అసత్యాన్ని గుర్తించేందుకు మనకు సహాయంచేస్తుంది. సత్యాన్ని అన్వయించుకోవడం నిష్ఫలమైన వాటిని వెంబడించడం నుండి మనల్ని కాపాడుతుంది, శ్రేష్ఠమైన జీవితం గడిపేందుకు మనకు సహాయంచేస్తుంది, మన భవిష్యత్తుకు అద్భుతమైన నిరీక్షణనిస్తుంది.

7 మీకు బైబిలు సత్యం అర్థమౌతోందా? అలాగయితే, మీరు మెండుగా ఆశీర్వదించబడ్డట్లే. ఓ గ్రంథకర్త ఒక పుస్తకం రచించేటప్పుడు, అతను లేదా ఆమె సాధారణంగా ఒక ప్రత్యేకగుంపు ప్రజలను ఆకర్షించేలా తన రచనాశైలిని తీర్చిదిద్దుతారు. కొన్ని పుస్తకాలు విద్యాకోవిదులకు, మరికొన్ని పిల్లలకు, మరితర పుస్తకాలు ఆయా ప్రత్యేక రంగాల్లోవున్న ప్రవీణుల కొరకు వ్రాయబడతాయి. బైబిలు సులభంగా అందరికీ అందుబాటులోవున్నా, అది ఓ ప్రత్యేక గుంపు ప్రజలే అర్థంచేసుకొని ప్రశంసించడానికి ఇవ్వబడింది. యెహోవా దానిని భూమ్మీది దీనుల, సాత్వికుల కోసం తీర్చిదిద్దాడు. వారి విద్యాస్థాయి, సంస్కృతి, జీవనహోదా లేదా జాతి ఏదైనాసరే అలాంటి ప్రజలే బైబిలు భావాన్ని గ్రహించగలుగుతారు. (1 తిమోతి 2:​3, 4) దీనికి భిన్నంగా, ఎంత తెలివిగలవారైనా లేదా విద్యావంతులైనా సరే యోగ్యతలేని వారికి బైబిలు సత్య అవగాహన నిరాకరించబడింది. అహంకారులు, గర్విష్ఠులు దేవునివాక్య అమూల్య సత్యాలను గ్రహించలేరు. (మత్తయి 13:11-15; లూకా 10:21; అపొస్తలుల కార్యములు 13:​48) దేవుడు మాత్రమే అలాంటి గ్రంథం ఉత్పన్నం చేయగలడు.

యెహోవా సేవకులు సత్యవంతులు

8 యెహోవా వలెనే, నమ్మకమైన ఆయన సాక్షులూ సత్యవంతులే. యెహోవాకు అపూర్వ సాక్షియైన యేసుక్రీస్తు, తాను బోధించిన సంగతుల ద్వారా, తాను జీవించిన విధానం ద్వారా, మరణం ద్వారా సత్యాన్ని స్థిరంగా నొక్కిచెప్పాడు. ఆయన యెహోవా వాక్యసత్యాన్ని, వాగ్దానాలను సమర్థించాడు. ఆ విధంగా, యేసు స్వయంగా చెప్పుకున్నట్లు ఆయన నిజంగా సత్యస్వరూపి.​—⁠యోహాను 14:6; ప్రకటన 3:14; 19:10.

9 యేసు “కృపాసత్య సంపూర్ణుడు,” “అతని నోట ఏ కపటమును లేదు.” (యోహాను 1:14; యెషయా 53:⁠9) ఇతరులయెడల సత్యవంతంగా ఉండడంలో యేసు ఉంచిన మాదిరిని నిజ క్రైస్తవులు అనుకరిస్తారు. తోటి విశ్వాసులకు పౌలు ఇలా సలహాయిచ్చాడు: “మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక . . . ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.” (ఎఫెసీయులు 4:​25) అంతకుపూర్వం జెకర్యా ప్రవక్త ఇలా వ్రాశాడు: “ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.” (జెకర్యా 8:​16) క్రైస్తవులు సత్యశీలురుగా ఎందుకున్నారంటే వారు దేవుని ప్రీతిపరచాలని కోరుకుంటారు. యెహోవా సత్యవంతుడు, అబద్ధం ఫలితంగా ఎలాంటి హాని కలుగుతుందో ఆయనకు తెలుసు. అందువల్ల, తన సేవకులు సత్యమే మాట్లాడాలని ఆయన సరిగానే అపేక్షిస్తున్నాడు.

10 కొన్ని ప్రయోజనాలు పొందడానికి అబద్ధం చెప్పడం అనుకూలమైన సాధనమని అనేకమందికి అనిపించవచ్చు. శిక్ష తప్పించుకోవడానికి, ఏదోరీతిలో లాభం పొందడానికి లేదా ఇతరుల మెప్పు సంపాదించడానికి ప్రజలు అబద్ధాలు చెబుతారు. అయితే, అబద్ధాలుచెప్పే అలవాటు ఒక దుష్టలక్షణం. అంతకంటే ముఖ్యంగా, అబద్ధికుడు దేవుని ఆమోదం పొందలేడు. (ప్రకటన 21:8, 27; 22:​15) మనం సత్యవంతులమని అందరికి విదితమైనప్పుడు, మనం చెప్పేది ఇతరులు విశ్వసిస్తారు; మనల్ని వారు నమ్ముతారు. కానీ మనం ఒక్క అబద్ధంచెప్పి పట్టుబడినా, మనం భవిష్యత్తులో మరేదిచెప్పినా మన సత్యశీలతను ఇతరులు శంకించవచ్చు. ఒక ఆఫ్రికా సామెత ఇలా చెబుతోంది: “ఒక్క అబద్ధం వెయ్యి సత్యాలను పాడుచేస్తుంది.” మరో సామెత ఇలా అంటోంది: “అబద్ధికుడు సత్యం మాట్లాడినా దానిని ఎవ్వరూ నమ్మరు.”

11 సత్యశీలతంటే కేవలం సత్యం మాట్లాడ్డం మాత్రమే కాదు. అదొక జీవన విధానం. అది మనమెవరిమనేది నిర్వచిస్తుంది. మనమేమి చెబుతామో దానివల్ల మాత్రమేగాక మనమేమి చేస్తామో దానివల్ల కూడా మనమితరులకు సత్యం తెలియజేస్తాము. “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా?” అని అపొస్తలుడైన పౌలు ప్రశ్నించాడు. (రోమీయులు 2:​21, 22) మనమితరులకు సత్యం చెప్పాలంటే, మన మార్గాలన్నింటిలో మనం సత్యవంతంగా ఉండాలి. మన బోధకు ప్రజలెలా ప్రతిస్పందిస్తారనే దానిపై, సత్యశీలత యథార్థతల విషయంలో మనకున్న పేరు బలమైన ప్రభావం చూపుతుంది.

12 యెహోవా సేవకుల మధ్యనున్న యౌవనులు కూడా సత్యశీలతా ప్రాముఖ్యతను అర్థంచేసుకుంటారు. జెనీ తన 13వ యేట ఒక పాఠశాల వ్యాసంలో ఇలా వ్రాసింది: “నిజాయితీని నేను నిజంగా విలువైనదిగా పరిగణిస్తాను. నేడు చాలామంది పూర్తిగా నిజాయితీ చూపించకపోవడం శోచనీయం. నా జీవితంలో అన్ని సందర్భాల్లో నిజాయితీ కాపాడుకుంటానని నాకు నేను ఒట్టుపెట్టుకున్నాను. సత్యం చెప్పడం నాకు, నా స్నేహితులకు సత్వరమే ప్రయోజనమివ్వకపోయినా సరే నేను నిజాయితీగా ఉంటాను. నా స్నేహితులు కూడా సత్యం మాట్లాడేవారిగా, నిజాయితీపరులుగా ఉండేలా చూసుకుంటాను.”

13 ఆ వ్యాసం మీద వ్యాఖ్యానిస్తూ, జెనీ ఉపాధ్యాయురాలు ఇలా అంది: “నువ్వింకా చిన్నపిల్లవే అయినా బలమైన నైతిక, నీతిసూత్రావళిని వృద్ధిచేసుకున్నావు. నీకు నైతికబలముంది, కాబట్టి నువ్వు నీ సూత్రావళికి కట్టుబడివుంటావని నాకు తెలుసు.” చదువుకునే ఈ చిన్నమ్మాయి నైతిక బలానికి కారణమేమిటి? తన వ్యాస పరిచయంలో జెనీ తన మతమే “[తన] జీవిత ప్రమాణాలు నిర్ణయించిందని” తెలియజేసింది. జెనీ ఆ వ్యాసం వ్రాసి ఇప్పటికి ఏడు సంవత్సరాలయ్యింది. ఆమె ఉపాధ్యాయురాలు తలంచినట్లుగానే, జెనీ ఒక యెహోవాసాక్షిగా తన జీవితంలో ఉన్నత నైతిక ప్రమాణాన్ని కనబరుస్తూనేవుంది. యెహోవా సేవకులు సత్యం వెల్లడిచేస్తారు

14 నిజమే, యెహోవాసాక్షులే కాక మరితరులు కూడా సత్యం మాట్లాడుతూ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండవచ్చు. అయితే, దేవుని సేవకులుగా ప్రత్యేకంగా మనకు సత్యాన్ని సమర్థించే గొప్ప బాధ్యతుంది. బైబిలు సత్యాలు అంటే ఒకవ్యక్తిని నిత్యజీవానికి నడిపించగల సత్యాలు మనకప్పగింపబడ్డాయి. కాబట్టి, ఆ పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే బాధ్యత మన మీద ఉంది. “ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు” అని యేసు చెప్పాడు. (లూకా 12:​48) దేవుని అమూల్య పరిజ్ఞానంతో ఆశీర్వదింపబడిన వారినుండి నిశ్చయంగా ‘ఎక్కువగా తీయబడుతుంది.’

15 బైబిలు సత్యాలను ఇతరులకు తెలియజెప్పడంలో సంతోషముంది. యేసు మొదటి శతాబ్దపు శిష్యులవలే మనం, ‘కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్న వారికి,’ “దయ్యముల బోధ” మూలంగా తికమకపెట్టబడి అంధులుగా చేయబడిన వారికి సువార్తను అంటే హృదయానందకరమైన నిరీక్షణా సందేశాన్ని ప్రకటిస్తాం. (మత్తయి 9:36; 1 తిమోతి 4:⁠1) అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.” (3 యోహాను 4) యోహాను “పిల్లల” అంటే బహుశా ఆయన సత్యం పరిచయంచేసిన వారి విశ్వసనీయత ఆయనకెంతో సంతోషం కలిగించివుంటుంది. దేవుని వాక్యానికి ప్రజలు ప్రశంసతో ప్రతిస్పందించడం మనం చూసినప్పుడు అది మనకు ఆనందాన్నిస్తుంది.

16 నిజమే, అందరూ సత్యాన్ని అంగీకరించరు. జన సమ్మతం కాకపోయినా యేసు, దేవుని గూర్చిన సత్యం మాట్లాడాడు. యూదా వ్యతిరేకులకు ఆయనిలా చెప్పాడు: “నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు విన[రు].”​—⁠యోహాను 8:46, 47.

17 మనం కూడా యేసువలెనే యెహోవాను గూర్చిన అమూల్య సత్యాలను చెప్పడం మానుకోము. మనం చెప్పేది ప్రతి ఒక్కరు అంగీరించాలని మనం ఆశించం, ఎందుకంటే యేసు చెప్పింది అందరూ అంగీకరించలేదు. అయినప్పటికీ, మనం చేస్తున్నది సరైనదని తెలుసుకోవడంలో మనమానందిస్తాం. యెహోవా తన ప్రేమపూర్వక దయనుబట్టి మానవజాతికి సత్యం వెల్లడిచెయ్యబడాలని కోరుతున్నాడు. సత్యం స్వతంత్రించుకున్న వారిగా క్రైస్తవులు ఈ అంధకార లోకంలో వెలుగు ప్రకాశకులౌతారు. మన మాటలు, క్రియల మూలంగా సత్యవెలుగును ప్రకాశింపజేయడం ద్వారా, ఇతరులు మన పరలోక తండ్రిని మహిమపరచడానికి సహాయం చేయగలం. (మత్తయి 5:​14, 16) సత్యానికి సాతానిచ్చే నకిలీ నిర్వచనాన్ని తిరస్కరించి స్వచ్ఛమైన, నిర్మలమైన దేవుని వాక్యాన్ని సమర్థించే వారమని మనం బహిరంగంగా వెల్లడిచేస్తాము. మనకు తెలిసిన, మనం ఇతరులకు తెలియజేసే సత్యం దాన్ని అంగీకరించే వారికది నిజమైన స్వాతంత్ర్యాన్నివ్వగలదు.​—⁠యోహాను 8:32.

సత్యమార్గం వెంబడించండి

18 యేసు సత్యాన్ని ప్రేమించాడు, మాట్లాడాడు. భూమిపై తన పరిచర్యా కాలంలో, సత్యవంతులుగా ఉన్నవారిపై ఆయన అనుగ్రహం చూపాడు. నతనయేలును గురించి యేసు ఇలా అన్నాడు: “ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లే[దు].” (యోహాను 1:​47) ఆ తర్వాత, బర్తొలొమయి అని కూడా బహుశా పిలువబడిన నతనయేలు 12 మంది అపొస్తలులలో ఒకనిగా ఎంపిక చేయబడ్డాడు. (మత్తయి 10:​2-4) అదెంతటి ఘనతో గదా!

19 బైబిలు పుస్తకమగు యోహానులోని ఒక అధ్యాయమంతా యేసు ఆశీర్వదించిన మరో నిజాయితీపరుని వృత్తాంతాన్నే వివరిస్తుంది. అతని పేరు మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా అతను పుట్టుకతో గుడ్డివాడైన ఒక భిక్షగాడు. యేసు అతనికి దృష్టి పునరుద్ధరించినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ అద్భుత స్వస్థతను గురించిన వార్త సత్యద్వేషకులైన పరిసయ్యుల చెవులకు చేరింది, వీరిలోవీరు యేసుయందు విశ్వాసముంచే ఎవరినైనాసరే సమాజమందిరంనుండి బహిష్కరించాలని తీర్మానించుకున్నారు. వారి పన్నాగం ఎరిగినవారై ఒకప్పుడు పుట్టుగ్రుడ్డిగావున్న వాని తలిదండ్రులు భయపడి, ఇప్పుడు తమ కుమారుడెలా చూడగలుగుతున్నాడో లేదా అలా ఎవరు బాగుచేశారో తమకు తెలియదని పరిసయ్యులకు అబద్ధం చెప్పారు.​—⁠యోహాను 9:1-23.

20 ఆ బాగుపడిన వ్యక్తి మరలా పరిసయ్యుల వద్దకు పిలిపించబడ్డాడు. పరిణామాలను లెక్కచేయకుండా, అతడు ధైర్యంగా సత్యం చెప్పాడు. ఆ స్వస్థతపొందినవాడు ప్రముఖులు, విద్యావంతులు అయిన ఈ మనుష్యులు యేసు దేవునినుండి వచ్చినవాడని నమ్మకపోవడం గురించి ఆశ్చర్యపోయి, “ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని” స్పష్టమవుతున్న విషయాన్ని అంగీరించమని నిర్భయంగా కోరాడు. పరిసయ్యులు ఎదురు వాదించలేక, అహంకారి అని ఆ వ్యక్తిని దూషిస్తూ అతడ్ని వెలివేశారు.​—⁠యోహాను 9:​24-34.

21 ఇది తెలిసిన యేసు, ప్రేమతో సమయం తీసుకొని అతని కోసం వెదికాడు. అలా వెదికి కనుగొన్న తర్వాత, అంతకుముందు గ్రుడ్డివానిగా వున్న ఆ వ్యక్తి చూపించిన విశ్వాసాన్ని బలపరిచాడు. యేసు బాహాటంగా తానే మెస్సీయనని తెలియజేశాడు. సత్యం చెప్పినందుకు ఆ మనుష్యుడెంతగా ఆశీర్వదింపబడ్డాడో గదా! సత్యం మాట్లాడే వారికి నిశ్చయంగా దైవానుగ్రహం ఉంటుంది.​—⁠యోహాను 9:35-37.

22 సత్యం అభ్యసించాలనే లక్ష్యాన్ని మనం గంభీరంగా తీసుకోవాలి. దేవునితో, ప్రజలతో మంచి సంబంధాలు నిర్మించుకొని కాపాడుకోవడానికిది మౌలిక విషయం. సత్యవంతులుగా ఉండడమంటే విశాల దృక్పథం, స్వచ్ఛత, స్నేహశీలత, విశ్వసనీయత కలిగి ఉండడమని అర్థం, ఇది యెహోవా ఆమోదం తీసుకువస్తుంది. (కీర్తన 15:​1, 2) అసత్యశీలురుగా ఉండడమంటే మోసకరంగా, అపనమ్మకస్థులుగా, అబద్ధికులుగా ఉండడమని అర్థం, అది యెహోవా కోపాన్ని రగిలిస్తుంది. (సామెతలు 6:​16-19) అందువల్ల, సత్యశీల జీవనగమనాన్ని వెంబడించేందుకు తీర్మానించుకోండి. నిజానికి, సత్యదేవుని అనుకరించేందుకు, మనకు సత్యం తెలిసుండాలి, మనం సత్యం మాట్లాడాలి, సత్యవంతంగా జీవించాలి.

మీరెలా సమాధానమిస్తారు?

• సత్యం తెలిసినందుకు మనమెందుకు కృతజ్ఞతతో ఉండగలము?

• సత్యవంతులుగా ఉండడంలో మనమెలా యెహోవాను అనుకరించవచ్చు?

• బైబిలు సత్యాన్ని ఇతరులకు తెలియజెప్పడంలో ఎలాంటి ప్రయోజనాలున్నాయి?

• సత్యశీల విధానం వెంబడించడం ఎందుకు ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

1. సత్యం గురించి కొందరేమి నమ్ముతారు, వారి తర్కమెందుకు లోపభూయిష్టమైనది?

2. ఏయే విధాలుగా యెహోవా సత్యదేవుడు, ఇప్పుడు ఏ ప్రశ్నలు చర్చించబడతాయి?

3, 4. “అంత్యదినములలో” జరిగేవాటిని అపొస్తలులైన పౌలు, పేతురు ఎలా వర్ణించారు?

5. దానియేలు ప్రవక్తచెప్పిన ప్రకారం, ‘అంత్యకాలమున’ ఏమి జరుగుతుంది, ఈ ప్రవచనం ఎలా నెరవేరింది?

6. నేడు దేవుని ప్రజలు ఏ బైబిలు సత్యాలు అర్థంచేసుకుంటున్నారు?

7. బైబిలు సత్యాలు ఎవరికి అందుబాటులో ఉన్నాయి, ఎవరికి లేవు?

8. యేసు ఎందుకు నిజంగా సత్యస్వరూపి?

9. సత్యం మాట్లాడడం గురించి లేఖనాలేమి చెబుతున్నాయి?

10. ప్రజలెందుకు అబద్ధమాడతారు, దానివల్ల ఎలాంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి?

11. సత్యశీలతంటే కేవలం సత్యం మాట్లాడ్డం మాత్రమే ఎందుక్కాదు?

12, 13. సత్యశీలతను గురించి ఒక చిన్నమ్మాయి ఏమి వ్రాసింది, ఆమె ఉన్నత నైతిక ప్రమాణానికి కారణమేమిటి?

14. సత్యాన్ని సమర్థించే గొప్ప బాధ్యత ప్రత్యేకంగా దేవుని సేవకులకు ఎందుకుంది?

15. ఇతరులకు బైబిలు సత్యాన్ని తెలియజెప్పడంలో మీరెలాంటి సంతోషం పొందుతారు?

16, 17. (ఎ) అందరూ సత్యాన్ని ఎందుకు అంగీకరింపరు? (బి) బైబిలు సత్యం మీరు ప్రకటిస్తుండగా మీరే ఆనందాన్ని అనుభవించగలరు?

18. నతనయేలుపై యేసు ఎందుకు, ఎలా అనుగ్రహం చూపాడు?

19-21. ఒకప్పుడు గ్రుడ్డివానిగావున్న వ్యక్తి తన ధైర్యవంతమైన సత్యశీలతకు ఎలా ఆశీర్వదింపబడ్డాడు?

22. సత్యశీల విధానాన్ని మనమెందుకు వెంబడించాలి?

[17వ పేజీలోని చిత్రాలు]

బైబిలు సత్యం అప్పగింపబడిన వారిగా, క్రైస్తవులు దానిని ఆసక్తిగా ఇతరులతో పంచుకుంటారు

[18వ పేజీలోని చిత్రాలు]

యేసు స్వస్థపరచిన గ్రుడ్డివాడు సత్యం మాట్లాడినందుకు ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు