కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని జోక్యం అదెలా ఉంటుందని మనం ఎదురుచూడవచ్చు?

దేవుని జోక్యం అదెలా ఉంటుందని మనం ఎదురుచూడవచ్చు?

దేవుని జోక్యం అదెలా ఉంటుందని మనం ఎదురుచూడవచ్చు?

సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో, యూదా రాజైన 39 ఏండ్ల హిజ్కియా తనకు ప్రాణాంతకమైన రోగముందని తెలుసుకున్నాడు. ఆ వార్తతో కృంగిపోయిన హిజ్కియా తనను నయం చేయమని కన్నీళ్ళతో దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు: “నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను; ఇంక పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను.”​—⁠యెషయా 38:​1-6.

విశిష్టంగా ఆ సందర్భంలో దేవుడు ఎందుకు జోక్యం చేసుకున్నాడు? శతాబ్దాలకు పూర్వం, నీతిమంతుడైన దావీదు రాజుకు దేవుడిలా వాగ్దానం చేశాడు: “నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును.” దావీదు వంశంలోనే మెస్సీయ జన్మిస్తాడని కూడా దేవుడు వెల్లడిచేశాడు. (2 సమూయేలు 7:​16; కీర్తన 89:​20, 26-29; యెషయా 11:⁠1) హిజ్కియా అనారోగ్యానికి గురైనప్పుడు, ఆయనకింకా కుమారుడు పుట్టలేదు. ఆ కారణంగా దావీదు రాజవంశానికి అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడింది. హిజ్కియా విషయంలో దేవుడు జోక్యం చేసుకోవడం, మెస్సీయ జన్మించాల్సిన వంశావళిని కాపాడే నిర్దిష్ట సంకల్ప నెరవేర్పుకు ఉపకరించింది.

యెహోవా తన వాగ్దానాలను నెరవేర్చడానికి, క్రీస్తుశకానికి పూర్వం తన ప్రజల తరఫున జోక్యం చేసుకోవడానికి అనేకమార్లు పురికొల్పబడ్డాడు. ఐగుప్తు దాసత్వం నుండి ఇశ్రాయేలీయుల విడుదలకు సంబంధించి, మోషే ఇలా ప్రకటించాడు: “యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించెను.”​—⁠ద్వితీయోపదేశకాండము 7:⁠8.

అదేవిధంగా మొదటి శతాబ్దంలో దేవుని సంకల్పాలు నెరవేర్చడానికి దేవుని జోక్యం ఉపకరించింది. ఉదాహరణకు, క్రీస్తు శిష్యులను హింసించకుండా సౌలు అనే యూదుణ్ణి ఆపేందుకు, దమస్కుకు వెళ్ళే మార్గంలో అతనికొక అద్భుత దర్శనం ఇవ్వబడింది. అపొస్తలుడైన పౌలుగా మారిన ఈ వ్యక్తి పరివర్తన, అన్యజనులలో సువార్తను వ్యాప్తిచేయడానికి ప్రధాన పాత్ర పోషించింది.​—⁠అపొస్తలుల కార్యములు 9:​1-16; రోమీయులు 11:​13.

జోక్యం చేసుకోవడం నియమిత ప్రమాణమా?

దేవుని జోక్యం నియమమా లేక మినహాయింపా? అది ఎంత మాత్రం నియమిత ప్రమాణం కాదని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. దేవుడు ముగ్గురు హెబ్రీ యువకులను అగ్నిగుండము నుండి, దానియేలు ప్రవక్తను సింహాల గుహ నుండి రక్షించినప్పటికీ, ఆయన ఇతర ప్రవక్తలను మరణం నుండి కాపాడే చర్యతీసుకోలేదు. (2 దినవృత్తాంతములు 24:​20, 21; దానియేలు 3:​21-27; 6:​16-22; హెబ్రీయులు 11:​37) హేరోదు అగ్రిప్ప I బంధించిన పేతురు, అద్భుతమైన రీతిలో చెరసాలనుండి విడుదల చేయబడ్డాడు. అయితే ఆ రాజే అపొస్తలుడైన యాకోబును చంపించాడు, అయినా ఈ నేరాన్ని ఆపేందుకు దేవుడు జోక్యం చేసుకోలేదు. (అపొస్తలుల కార్యములు 12:​1-11) దేవుడు రోగులను నయం చేసే శక్తినేగాక మరణించిన వారిని లేపే శక్తిని కూడా అపొస్తలులకు అనుగ్రహించాడు, అయినా అపొస్తలుడైన పౌలును పీడిస్తున్న ‘శరీరములోని ముల్లును’ తీసేందుకు ఆయన సమ్మతించలేదు, బహుశా అది శారీరక వ్యాధి కావచ్చు.​—⁠2 కొరింథీయులు 12:​7-9; అపొస్తలుల కార్యములు 9:​32-41; 1 కొరింథీయులు 12:​28.

క్రీస్తు శిష్యులకు వ్యతిరేకంగా రోమన్‌ చక్రవర్తి నీరో రేపిన దారుణమైన హింసా తరంగాన్ని ఆపేందుకు దేవుడు జోక్యం చేసుకోలేదు. క్రైస్తవులు ఘోరంగా హింసించబడ్డారు, సజీవ దహనం చేయబడ్డారు, క్రూరమృగాల ఎదుట వేయబడ్డారు. అయితే ఈ వ్యతిరేకత తొలి క్రైస్తవులను ఆశ్చర్యపరచలేదు, దేవుని ఉనికిపై వారి విశ్వాసాన్నిది ఏమాత్రం తగ్గించలేదు. ఎందుకంటే యేసు తన శిష్యులు మహాసభల ఎదుటకు తీసుకుపోబడతారని, వారు తమ విశ్వాసం నిమిత్తం హింసలకే కాదు మరణానికి కూడా సిద్ధంగా ఉండాలని వారిని ముందే హెచ్చరించాడు.​—⁠మత్తయి 10:​17-22.

దేవుడు గతంలో చేసినట్లే, నేడు కూడా తన సేవకులను ప్రమాదకరమైన పరిస్థితుల నుండి విడుదల చేయగలడనడంలో సందేహం లేదు, ఆయన రక్షణ నుండి ప్రయోజనం పొందామని భావించేవారిని విమర్శించకూడదు. అయితే అలాంటి సందర్భాల్లో దేవుడు జోక్యం చేసుకున్నాడా లేదా అని తీర్మానించి చెప్పడం కష్టం. టులూస్‌ నగరంలో జరిగిన విస్ఫోటనంలో విశ్వసనీయులైన యెహోవా సేవకులు చాలామంది గాయపడ్డారు, నాజీ మరియు కమ్యూనిస్ట్‌ క్యాంపుల్లో లేదా ఇతర విషాదకరమైన పరిస్థితుల్లో విశ్వసనీయులైన వేలాది క్రైస్తవులు మరణించారు, వీటిని ఆపడానికి దేవుడు జోక్యం చేసుకోలేదు. దేవుడు తన ఆమోదమున్న వారందరి తరఫున ఒక పద్ధతి ప్రకారం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదు?​—⁠దానియేలు 3:​17, 18.

‘అనూహ్యంగాను కాలవశము చేత సంభవించేవి’

ఒక విపత్తు జరిగినప్పుడు ఎవరైనా ప్రభావితులు కావచ్చు, దానికి దేవుని పట్ల ఉండే విశ్వసనీయతతో సంబంధముండాలనేమీ లేదు. టులూస్‌లో విస్ఫోటనం జరిగినప్పుడు, అలేన్‌ మరియు లిలియాన్‌ తప్పించుకున్నారు, అందులో 30 మంది అమాయకులు మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. నేరాలవల్ల, నిర్లక్ష్యంగా డ్రైవింగుచేసేవారివల్ల లేదా యుద్ధాలవల్ల విస్తృత స్థాయిలో వేలాదిమంది ప్రజలు బలి అవుతున్నారు. వారు గురైన ఆ దుర్ఘటనకు దేవుణ్ణి బాధ్యుడిగా ఎంచలేము. ప్రతి ఒక్కరూ ‘అనూహ్యంగాను కాలవశము చేతను సంభవించేవాటికి’ గురవుతారని బైబిలు మనకు గుర్తుచేస్తోంది.​—⁠ప్రసంగి 9:​11, NW.

అంతేగాక మానవులు అనారోగ్యానికి, వృద్ధాప్యానికి, మరణానికి కూడా బలవుతారు. దేవుడు అద్భుతమైన రీతిలో తమ ప్రాణం కాపాడాడని లేదా ఊహించని రీతిలో ఆయనే తమ వ్యాధి నయం చేశాడని భావించిన కొందరు సహితం చివరకు మరణించారు. అనారోగ్యం, మరణం లేకుండా చేసి మానవుల కన్నుల “ప్రతి బాష్పబిందువును తుడిచివే[సే]” కాలం ఇంకా ముందుంది.​—⁠ప్రకటన 21:​1-4.

అది జరగడానికి ముందు, అప్పుడప్పుడు జోక్యం చేసుకునేదానికంటే మరింత విస్తృతమైనది, సమగ్రమైనది ఏదో జరగాలి. “యెహోవా దినము” అని పిలువబడే ఓ సంఘటన గురించి బైబిలు మాట్లాడుతోంది. (జెఫన్యా 1:​14) విస్తృత రీతిలో జోక్యంచేసుకునే ఈ సమయంలో, దేవుడు దుష్టత్వాన్ని సమూలంగా తీసివేస్తాడు. మానవాళికి పరిపూర్ణమైన పరిస్థితుల్లో నిత్యం జీవించే అవకాశం ఇవ్వబడుతుంది, అప్పుడు “మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.” (యెషయా 65:​17) మృతులు కూడా తిరిగి జీవానికి తేబడతారు, ఆ విధంగా మానవ విషాదాలన్నింటిలో అత్యంత గొప్ప విషాదం పరిసమాప్తమౌతుంది. (యోహాను 5:​28, 29) దానితో దేవుడు అపారమైన తన ప్రేమతో, మంచితనంతో మానవాళి సమస్యలను సమూలంగా పరిష్కరించిన వాడౌతాడు.

ఈ కాలంలో దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడు

అయితే అప్పటివరకు సృష్టి అనుభవించే బాధను గమనిస్తూ దేవుడు ఉదాసీనంగా ఉంటాడని దీనర్థం కాదు. దేవుడు ఈ కాలంలో మానవులందరికీ, వారు ఏ జాతి లేక సామాజిక నేపథ్యం గలవారైనా, వారందరూ తన గురించి తెలుసుకొని తనతో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు. (1 తిమోతి 2:​3, 4) యేసు ఈ ప్రక్రియను ఇలా అభివర్ణించాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” (యోహాను 6:​44) దేవుడు తన సేవకుల చేత ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతున్న రాజ్యసందేశం ద్వారా యథార్థ హృదయులను ఆకర్షిస్తున్నాడు.

దానితోపాటు, తన చేత నిర్దేశించబడాలని ఇష్టపడేవారి జీవితాలను దేవుడు సూటిగా ప్రభావితం చేస్తున్నాడు. వారు తన చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, తన ఆదేశాలు పాటించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ‘వారి హృదయాలను తెరుస్తున్నాడు.’ (అపొస్తలుల కార్యములు 16:​14) అవును, దేవుడు తనను, తన వాక్యాన్ని, తన సంకల్పాలను తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వడం ద్వారా ఆయనకు మనలో ప్రతి ఒక్కరిపైనా ప్రేమపూర్వక శ్రద్ధ ఉందని రుజువుచేస్తున్నాడు.​—⁠యోహాను 17:⁠3.

చివరిగా, దేవుడు ఈ కాలంలో తన సేవకులను అద్భుతమైన రీతుల్లో విడుదల చేయడం ద్వారా కాదుగానీ, వారు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా దాన్ని తాళుకోవడానికి వారికి ‘బలాధిక్యమును’, అంటే తన పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేస్తున్నాడు. (2 కొరింథీయులు 4:⁠7) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నన్ను బలపరచువానియందే [యెహోవాయందే] నేను సమస్తమును చేయగలను.”​—⁠ఫిలిప్పీయులు 4:​13.

దీన్నిబట్టి మనం మన ప్రతిదిన జీవితానికి, మనందరికీ అనుగ్రహిస్తున్న ఎటువంటి బాధలు లేని లోకంలో నిత్యం జీవించే నిత్యజీవ నిరీక్షణకు దేవునికి కృతజ్ఞులమై ఉండడానికి మనకు అనేక కారణాలున్నాయి. “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?” అని కీర్తనకర్త అడిగాడు. “రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.” (కీర్తన 116:​12, 13) మీకు ఇప్పుడు సంతోషాన్ని తీసుకురావడమే గాక భవిష్యత్తు కోసం దృఢమైన నిరీక్షణనిచ్చేందుకు దేవుడేమి చేశాడు, ఏమి చేస్తున్నాడు, ఇంకా ఏమి చేస్తాడు అనే విషయాలు అర్థం చేసుకునేందుకు ఈ పత్రికను క్రమంగా చదవడం మీకు సహాయకరంగా ఉంటుంది.​—⁠1 తిమోతి 4:⁠8.

[6వ పేజీలోని బ్లర్బ్‌]

“మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.” ​—⁠యెషయా 65:⁠17

[5వ పేజీలోని చిత్రాలు]

బైబిలు కాలాల్లో, జెకర్యా రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు యెహోవా ఆపలేదు . . .

అమాయకులను హేరోదు సామూహిక సంహారం చేస్తున్నప్పుడూ ఆపలేదు

[7వ పేజీలోని చిత్రం]

బాధలు లేని కాలం సమీపంలోనే ఉంది; మృతులు కూడా తిరిగి జీవిస్తారు