కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“అపూర్వ ఇంజనీరింగ్‌ కార్యాల్లో ఇదొకటి”

“అపూర్వ ఇంజనీరింగ్‌ కార్యాల్లో ఇదొకటి”

“అపూర్వ ఇంజనీరింగ్‌ కార్యాల్లో ఇదొకటి”

దాదాపు 3,000 సంవత్సరాల క్రితం సొలొమోను రాజు పరిపాలనలో యెరూషలేములో యెహోవా ఆలయం నిర్మించబడినప్పుడు, నీళ్లు నిలువజేయడానికి ఇత్తడితో చూడ ముచ్చటైన ఓ పెద్ద బేసిన్‌ తయారుచేయబడి ఆలయ ముఖద్వారం వెలుపల ఉంచబడింది. 30 టన్నుల బరువుండే ఆ పెద్ద బేసిన్‌లో 40,000 లీటర్ల నీరు పట్టేది. ఈ పెద్ద బేసిన్‌ సముద్రమని పిలువబడేది. (1 రాజులు 7:​23-26) నేషనల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కెనడాలో మాజీ సాంకేతిక అధికారియైన ఆల్‌బర్ట్‌ జాయిడోఫ్‌, బిబ్లికల్‌ ఆర్కియాలజిస్ట్‌ అనే పుస్తకంలో ఇలా చెబుతున్నాడు: “హీబ్రూ జనాంగంలో చేపట్టబడిన అపూర్వ ఇంజనీరింగ్‌ కార్యాల్లో ఇదొకటి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.”

ఆ సముద్రం ఎలా తయారుచేయబడింది? “యొర్దాను మైదానమందు . . . జిగట భూమియందు రాజు వాటిని [ఇత్తడి పాత్రలను] పోతపోయించెను” అని బైబిలు చెబుతోంది. (1 రాజులు 7:​45, 46) ఆ పోతవిధానం పెద్దకంచు గంటలు తయారుచేయడానికి ఇప్పటికీ ఉపయోగించబడుతోన్న ‘లాస్ట్‌ వేక్స్‌’ పద్ధతికి పోలివుండవచ్చు” అని జాయిడోఫ్‌ చెబుతున్నారు. ఆయన ఇలా వివరిస్తున్నారు: “ప్రాథమికంగా దీనిలో బాగా ఆరిన మట్టిదిమ్మపై తలక్రిందులుగా ఆ సముద్రపు ఆకారంలో మైనపు అచ్చు తయారుచేయబడుతుంది. . . . ఇది పూర్తయిన తర్వాత పోతపోసేవారు ఆ మైనపు అచ్చుమీద మరో మట్టిదిమ్మను తయారుచేసి ఆరబెడతారు. అది ఆరిన తర్వాత చివరిగా లోపలి మైనపు అచ్చు కరిగి బయటకు వచ్చేలా వేడిచేసి, ఆ ఖాళీనిండేలా కరిగించిన ఇత్తడి పోస్తారు.”

విస్తారమైన పరిమాణంగల, ఎంతో బరువున్న ఆ సముద్రాన్ని తయారుచేయడానికి ఎంతో ప్రావీణ్యం కావాలి. లోపలా బయటా మట్టితోచేసిన దిమ్మలు 30 టన్నుల కరిగిన ఇత్తడి కలిగించే ఒత్తిడిని తట్టుకోవాలి, అలాగే పగుళ్లు లేదా ఇతర లోపాలు రాకుండా కరిగించిన ఆ ఇత్తడిని ధారగా పోస్తూవుండాలి. ఇలా చేయాలంటే కరిగిన లోహాన్ని ఆ అచ్చులో పోయడానికి ఒకదానికి మరొకటి కలిసివుండే బట్టీలు వరుసగా ఉండాలి. అది ఓ బృహత్తర కార్యం!

ఆలయ ప్రారంభోత్సవ ప్రార్థనలో దేవాలయ నిర్మాణంలో చేయబడిన పనంతటికీ యెహోవా దేవునికే ఘనత చెల్లిస్తూ సొలొమోను రాజు ఇలా అన్నాడు: “నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి, నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు.”​—⁠1 రాజులు 8:⁠24.