కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దేశములో సంచరించుము’

‘దేశములో సంచరించుము’

‘దేశములో సంచరించుము’

“దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము.”​—⁠ఆదికాండము 13:​17.

వారాంతంలో పల్లె ప్రాంతాల్లో కారులో షికారుకు వెళ్ళడాన్ని మీరు ఇష్టపడతారా? కొంతమంది తీరిగ్గా ఆ సుందర దృశ్యాలన్నీ చూడడంతో పాటు వ్యాయామం కూడా చేసినట్లు ఉంటుందని సైకిల్‌ మీద వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. మరికొందరు ఆ ప్రాంతంతో మంచి పరిచయం పెంచుకోవడానికి, దాని ప్రత్యేకతలను తెలుసుకోవడానికి నడిచి వెళ్ళడానికే నిర్ణయించుకుంటారు. అలాంటి విహార యాత్రలు కొద్దిరోజులకే పరిమితమవుతాయి. అయితే దేవుడు, “నీవు లేచి యీ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదను” అని అబ్రాహాముతో చెప్పినప్పుడు ఆయన ఎలా భావించి ఉంటాడో ఊహించండి.​—⁠ఆదికాండము 13:​17.

2 ఆ మాటల సందర్భాన్ని పరిశీలించండి. అబ్రాహాము తన భార్యతో, ఇతరులతో తాత్కాలికంగా ఐగుప్తులో నివసించాడు. వారు ఐగుప్తును విడిచి తమ మందలతో “నెగెబు”కు ప్రయాణం అయ్యారని ఆదికాండము 13వ అధ్యాయం మనకు చెబుతోంది. ఆ తర్వాత అబ్రాహాము అక్కడక్కడా విడిది చేస్తూ నెగెబు నుండి ‘ప్రయాణమై బేతేలుకు’ వెళ్ళాడు. తన పశువుల కాపరులకు, తన సోదరుని కుమారుడైన లోతు పశువుల కాపరులకు తగాదా వచ్చినప్పుడు, వారు వేర్వేరు పచ్చిక మైదానాలను ఎంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు, అబ్రాహాము ఉదార స్వభావంతో లోతుకే మొదటి అవకాశం ఇచ్చాడు. లోతు “యెహోవా తోటవలె” ఏపుగా పచ్చిక నిండిన “యొర్దాను ప్రాంతమంతటిని” ఎంచుకొని కొంతకాలం తర్వాత సొదొమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు: “ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము.” అబ్రాహాము బహుశా బేతేలులో ఒక ఎత్తయిన ప్రాంతం నుండి, ఆ దేశపు మిగతా ప్రాంతాలను చూసి ఉండవచ్చు. అయితే అబ్రాహాము వాటిని చూడడంతో పని అయిపోలేదు. ‘దానిలో సంచరించి’ ఆ ప్రాంతాలతో, ప్రకృతితో పరిచయం చేసుకోవాలని దేవుడు ఆయనకు చెప్పాడు.

3 అబ్రాహాము హెబ్రోనుకు చేరడానికి ముందు అలా ఎంతవరకు సంచరించినా, ఆ వాగ్దాన దేశం గురించి, మనలో చాలామంది కంటే ఆయనకే ఎక్కువ తెలుసనడంలో సందేహం లేదు. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన నెగెబు, బేతేలు, యొర్దాను ప్రాంతం, సొదొమ, హెబ్రోనులు వంటి స్థలాల గురించి ఆలోచించండి. ఆ స్థలాలు ఎక్కడెక్కడ ఉండేవో ఊహించడానికి మీకు కష్టమవుతోందా? చాలామందికి ఇది సవాలుగా ఉంటుంది, ఎందుకంటే యెహోవా ప్రజల్లో కొద్దిమంది మాత్రమే తాము బైబిల్లో చదివిన ప్రాంతాలను సందర్శిస్తూ ఆ దేశమంతటా పర్యటించారు. అయితే, బైబిలు ప్రాంతాల గురించి తెలుసుకోవాలనే మన ప్రగాఢ ఆసక్తికి ఒక కారణం ఉంది. ఏమిటా కారణం?

4 దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.” (సామెతలు 18:​15) ఒక వ్యక్తి అనేక విషయాలలో పరిజ్ఞానం సంపాదించవచ్చు, అయితే యెహోవా దేవునికి, ఆయన వ్యవహారాలకు సంబంధించిన ఖచ్చితమైన పరిజ్ఞానమే అత్యంత ప్రాముఖ్యమైనది. మనం బైబిల్లో చదివే సమాచారం ఆ పరిజ్ఞానానికి కీలకమైనది. (2 తిమోతి 3:​16) అయితే అలా చదివేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమని గమనించండి. అంటే ఒక విషయాన్ని లోతుగా పరిశీలించి, దానిలోని వివిధ అంశాల మధ్య ఉన్న సంబంధాలను, దాని మొత్తం సారాంశాన్ని అవగాహన చేసుకోవడం లేదా గ్రహించడం. బైబిల్లో పేర్కొనబడిన ప్రాంతాల విషయానికీ ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు, మనలో చాలామందికి ఐగుప్తు ఎక్కడ ఉందో తెలుసు, అయితే అబ్రాహాము ఐగుప్తు నుండి “నెగెబు”కు, ఆ తర్వాత బేతేలుకు, అటు పిమ్మట హెబ్రోనుకు వెళ్ళాడనే విషయాన్ని మనం ఎంత వరకు అర్థం చేసుకున్నాం? ఆ ప్రాంతాల మధ్య ఉన్న అనుబంధాన్ని మీరు అర్థం చేసుకున్నారా?

5 లేదా మీరు క్రమంగా బైబిలు చదివే పట్టిక ప్రకారం, జెఫన్యా 2వ అధ్యాయం చదివారే అనుకుందాం. అందులో మీరు పట్టణాలు, ప్రజలు, ప్రాంతాల పేర్లు చదువుతారు. ఆ ఒక్క అధ్యాయంలోనే గాజా, అష్కెలోను, అష్డోదు, ఎక్రోను, సొదొమ, నీనెవెలతో పాటు కనాను, మోయాబు, అమ్మోను, అష్షూరు వంటి ప్రాంతాలన్నీ పేర్కొనబడ్డాయి. ప్రజలు నివసించిన, దేవుని ప్రవచనాల నెరవేర్పులో భాగంగా ఉన్న ఆ ప్రాంతాలను ఊహించుకోవడంలో మీరెంత వరకు సఫలమయ్యారు?

6 దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసే చాలామంది విద్యార్థులు, బైబిలు ప్రాంతాల మ్యాపులను సంప్రదించడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందారు. వారు ఆ మ్యాపులను సంప్రదించింది, కేవలం వాటి మీదున్న ఆసక్తితో మాత్రమే కాదు, వాటిని ఉపయోగించడం ద్వారా దేవుని వాక్యానికి సంబంధించిన తమ పరిజ్ఞానాన్ని అధికం చేసుకోవచ్చని వారు గ్రహించారు కాబట్టే సంప్రదించారు. తమకు అదివరకే తెలిసిన వాస్తవాలకు, ఇతర సమాచారానికి ఎలాంటి సంబంధం ఉందో గ్రహించడానికి, తమ అవగాహనను వృద్ధి చేసుకోవడానికి కూడా ఈ మ్యాపులు సహాయం చేస్తాయి. మనం కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తుండగా, యెహోవా పట్ల మీ కృతజ్ఞతను అధికం చేసుకోవడంతోపాటు ఆయన వాక్యంలోని వృత్తాంతాలను మరింత బాగా అర్థం చేసుకునే అవకాశముంది.​—⁠14వ పేజీలోని బాక్సు చూడండి.

దూరాలను తెలుసుకోవడం మీ అవగాహనను పెంచుతుంది

7న్యాయాధిపతులు 16:2లో, న్యాయాధిపతియైన సమ్సోను గాజాలో ఉన్నట్లు మీరు చదివి ఉండవచ్చు. గాజా అనే పేరు నేటి వార్తా పత్రికల్లో ఎక్కువగా కనబడుతోంది, కాబట్టి మధ్యధరా కోస్తా తీరానికి దగ్గరున్న ఫిలిష్తీయుల దేశంలో సమ్సోను ఎక్కడ ఉన్నాడో మీకు దాదాపుగా తెలిసే ఉండవచ్చు. [11] ఇప్పుడు న్యాయాధిపతులు 16:3 ఏం చెబుతోందో గమనించండి: “సమ్సోను మధ్యరాత్రివరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసికొనిపోయెను.”

8 దుర్భేద్యమైన గాజా లాంటి పట్టణపు తలుపులు, వాటి ఇరువైపుల ద్వారబంధాలు భారీగా చాలా బరువుగా ఉంటాయనడంలో సందేహం లేదు. వాటిని మోసుకెళ్ళడాన్ని ఊహించండి! సమ్సోను వాటిని మోసుకెళ్ళాడు, ఎక్కడికి మోసుకెళ్ళాడు? ఆయన ఎలాంటి ప్రయాణం చేసి ఉంటాడు? గాజా కోస్తా తీరంలో సముద్ర మట్టానికి సమానంగా ఉన్న ప్రాంతం. [15] కానీ హెబ్రోను, తూర్పు వైపున 900 మీటర్ల ఎత్తులో ఉంది, నిజంగా అంత ఎత్తుకు చేరుకోవడం ఒక సవాలే! మనం “హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ” ఉన్న స్థానాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేము, అయితే ఆ పట్టణం గాజాకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది, అదీ ఎత్తయిన ప్రదేశంలో ఉంది! సమ్సోను ప్రయాణించిన దూరాన్ని తెలుసుకోవడం, ఆయన వీరోచిత కార్యాన్ని కొత్త దృక్కోణంతో చూడడానికి సహాయం చేస్తుంది, కాదంటారా? “యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చిన” కారణంగానే సమ్సోను అలాంటి కార్యాలు చేశాడని గుర్తు తెచ్చుకోండి. (న్యాయాధిపతులు 14:⁠6, 19; 15:​14) క్రైస్తవులుగా మనం ఇప్పుడు దేవుని ఆత్మ మనకు అసాధారణమైన కండ బలం ఇవ్వాలని ఆశించం. అయితే అదే బలమైన ఆత్మ, లోతైన ఆధ్యాత్మిక విషయాలపై మన అవగాహనను వృద్ధి చేసి, మన అంతరంగ పురుషుని ప్రకారం మనలను మరింత బలవంతులుగా చేస్తుంది. (1 కొరింథీయులు 2:10-16; 13:8; ఎఫెసీయులు 3:​15-16; కొలొస్సయులు 1:​9-10) అవును, సమ్సోను వృత్తాంతాన్ని అర్థం చేసుకోవడం, దేవుని ఆత్మ మనకు సహాయం చేయగలదనే వాస్తవాన్ని నొక్కి చెబుతోంది.

9 మిద్యానీయులపై గిద్యోను సాధించిన విజయానికి సంబంధించిన వృత్తాంతం కూడా దూరాన్ని తెలుసుకోవడంలోని విలువను నొక్కిచెబుతోంది. న్యాయాధిపతియైన గిద్యోను తన 300 మంది యోధులతో కలిసి, మోరే కొండ దగ్గర యెజ్రెయేలు మైదానంలో దిగిన మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతరులతో కలిసి దండెత్తి వచ్చిన 1,35,000 మందిని ఓడించినట్లు బైబిలు చదివే చాలామందికి తెలుసు. [18] గిద్యోను మనుష్యులు బూరలు ఊది, దివిటీలు కనబడేలా కుండలు పగులగొట్టి, “యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము” అని కేకలు వేశారు. అది శత్రువులను తికమక పెట్టి, భయభ్రాంతులను చేయడం వల్ల వారు ఒకరినొకరు చంపుకోవడం ఆరంభించారు. (న్యాయాధిపతులు 6:33; 7:​1-22) ఆ రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఘటన అది ఒక్కటేనా? న్యాయాధిపతులు 7, 8 అధ్యాయాలు కూడా చదవండి. అక్కడ మీరు గిద్యోను ముట్టడి చేస్తూ ముందుకు సాగినట్లు చూస్తారు. అక్కడ పేర్కొనబడిన అనేక ప్రాంతాల్లో కొన్నింటిని నేడు తెలిసిన వాటితో పాటు గుర్తించలేము, కాబట్టి అవి బైబిలు మ్యాపులలో కనిపించకపోవచ్చు. అయినప్పటికీ, గిద్యోను చర్యలను అర్థం చేసుకోగలిగేలా కావలసిన ప్రాంతాలు గుర్తించబడ్డాయి.

10 గిద్యోను మిగిలిన సంకీర్ణ దళాలను అటు బేత్షిత్తా వరకు, ఇటు దక్షిణం వైపు యొర్దానుకు సమీపంలో ఉన్న ఆబేల్మెహోలా వరకు తరిమాడు. (న్యాయాధిపతులు 7:​22-25) ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: ‘గిద్యోనును అతనితోనున్న మూడువందల మంది అలసటగానున్నప్పటికీ, శత్రువులను తరుముతూ యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.’ యొర్దాను దాటిన తర్వాత, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను దక్షిణంవైపు సుక్కోతు వరకు, అటునుండి యబ్బోకు దగ్గరున్న పెనూయేలు, ఆ తర్వాత యొగ్బెహ కొండల వరకు (ఆధునిక జోర్డాన్‌లోని అమ్మాన్‌ వరకు) తరిమారు. పోరాటం సాగిస్తూ, వెంటబడి తరిమిన ఆ దూరం దాదాపు 80 కిలోమీటర్లు. గిద్యోను, ఇద్దరు మిద్యాను రాజులను పట్టుకొని సంహరించి, ఆ తర్వాత పోరాటం ఆరంభమైన స్థలానికి సమీపంలోని తన పట్టణమైన ఒఫ్రాకు తిరిగి వచ్చాడు. (న్యాయాధిపతులు 8:​4-12, 21-27) దీన్నిబట్టి, గిద్యోను వీరోచిత కార్యం కేవలం బూరలు ఊది, దివిటీలు ఊపుతూ కేకలు వేసిన కొద్ది నిమిషాల కార్యం కాదని స్పష్టమవుతోంది. ‘గిద్యోను, [మరియు ఇతరుల] గురించి వివరించుటకు సమయము చాలదు. బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి’ అని విశ్వాస పురుషుల గురించిన వ్యాఖ్యానానికి ఇదెంత బలాన్ని చేకూరుస్తుందో ఊహించండి. (హెబ్రీయులు 11:​32-34) క్రైస్తవులు కూడా శారీరకంగా అలసిపోతారు, అయితే దేవుని చిత్తం చేస్తూ ముందుకు సాగడం అత్యంత ప్రాముఖ్యం కాదా?​—⁠2 కొరింథీయులు 4:​1, 16; గలతీయులు 6:⁠9.

ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ఎలా స్పందిస్తారు?

11 కొందరు స్థలాలను గుర్తించడానికి బైబిలు మ్యాపులను చూడవచ్చు, కానీ అవి ప్రజల ఆలోచనా సరళిని అవగాహన చేసుకోవడానికి సహాయం చేస్తాయని మీరనుకుంటున్నారా? ఉదాహరణకు, సీనాయి పర్వతం దగ్గర నుండి వాగ్దాన దేశం వైపు ప్రయాణమైన ఇశ్రాయేలీయుల విషయమే తీసుకోండి. దారిలో అక్కడక్కడ మజిలీలు చేస్తూ చివరకు వారు కాదేషుకు (లేదా కాదేషు బర్నేయకు) చేరుకున్నారు. [9] ఇది దాదాపు 270 కిలోమీటర్ల దూరంగల 11 రోజుల ప్రయాణమని ద్వితీయోపదేశకాండము 1:2 చెబుతోంది. అక్కడ నుండే మోషే 12 మంది వేగుల వారిని వాగ్దాన దేశానికి పంపించాడు. (సంఖ్యాకాండము 10:​12, 33; 11:34, 35; 12:​16; 13:​1-3, 25, 26) ఆ వేగులవారు నెగెబు గుండా ఉత్తర దిశకు, బహుశా బెయేర్షెబా, ఆ పిమ్మట హెబ్రోను దాటి వాగ్దాన దేశపు ఉత్తర సరిహద్దులకు చేరుకొని ఉంటారు. (సంఖ్యాకాండము 13:​21-24) ఇశ్రాయేలీయులు పదిమంది వేగులవారు ఇచ్చిన ప్రతికూల నివేదికలు నమ్మిన కారణంగా, అరణ్యంలోనే దాదాపు 40 సంవత్సరాలు సంచరించవలసి వచ్చింది. (సంఖ్యాకాండము 14:​1-34) ఇది వారి విశ్వాసం గురించి, యెహోవాను నమ్మే విషయంలో వారి సంసిద్ధత గురించి ఏమి వెల్లడి చేస్తోంది?​—⁠ద్వితీయోపదేశకాండము 1:​19-33; కీర్తన 78:​22, 32-43; యూదా 5.

12 భౌగోళిక వివరాలను దృష్టిలో ఉంచుకొని దీనిని ఆలోచించండి. ఇశ్రాయేలీయులు విశ్వాసం చూపించి యెహోషువ, కాలేబులు ఇచ్చిన సలహాను పాటించి ఉంటే, వారు వాగ్దాన దేశం చేరుకోవడానికి అంత దూరం ప్రయాణించవలసి వచ్చేదా? కాదేషు ప్రాంతం ఇస్సాకు, రిబ్కాలు నివసించిన బెయేర్‌ లహాయిరోయికి 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. [7] అది వాగ్దాన దేశపు దక్షిణ సరిహద్దున ఉన్న బెయేర్షెబాకు దాదాపు 95 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. (ఆదికాండము 24:​62; 25:11; 2 సమూయేలు 3:​10) ఐగుప్తు నుండి సీనాయి పర్వతం వరకు, అక్కడి నుండి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాదేషు వరకు ప్రయాణించిన ఇశ్రాయేలీయులు, వాగ్దాన దేశపు ముంగిట్లో ఉన్నట్లే ఉన్నారు. మన విషయానికొస్తే మనం కూడా వాగ్దానం చేయబడిన భూపరదైసు ముఖద్వారం దగ్గరే ఉన్నాం. దీన్నుండి మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు? అపొస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయుల పరిస్థితిని ఈ హితవుతో ముడిపెట్టాడు: “అవిధేయతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.”​—⁠హెబ్రీయులు 3:16-4:​11.

13 గిబియోనీయులకు సంబంధించిన బైబిలు వృత్తాంతంలో, మరో విభిన్నమైన దృక్పథం అంటే దేవుని చిత్తం చేయాలంటే, ఆయనపై నమ్మకముంచాలనే విషయం స్పష్టమవుతోంది. యెహోషువ ఇశ్రాయేలీయులను యొర్దాను నది దాటించి, అబ్రాహాము కుటుంబానికి దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి నడిపించిన తర్వాత, కనానీయులను వెళ్ళగొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. (ద్వితీయోపదేశకాండము 7:​1-3) అలా వెళ్ళగొట్టాల్సిన వారిలో గిబియోనీయులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీయులు యెరికోను, హాయిని జయించి గిల్గాలు దగ్గర విడిది చేశారు. గిబియోనీయులు, తాము కూడా శాపగ్రస్తులైన కనానీయుల్లాగ చనిపోకూడదని, గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరకు తమ ప్రతినిధులను పంపించారు. వారు హెబ్రీయులతో స్నేహపూర్వక నిబంధన చేసుకోవడానికి కనానీయుల ప్రాంతాల అవతల నుండి వస్తున్నట్లు నటించారు.

14 ఆ ప్రతినిధులు ఇలా అన్నారు: ‘నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి నీ దాసులమైన మేము బహుదూరమునుండి వచ్చితిమి.’ (యెహోషువ 9:​3-9) వారు నిజంగా చాలా దూరం నుండి వచ్చారన్నట్లు వారి దుస్తులు, ఆహార పదార్థాలు చూపించాయి, కానీ నిజానికి గిబియోను గిల్గాలుకు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. [19] నమ్మకం కుదిరిన యెహోషువ, ఆయనతో ఉన్న ప్రధానులు గిబియోనుతో, గిబియోను సంబంధిత సమీప పట్టణస్థులతో స్నేహపూర్వక నిబంధన చేసుకున్నారు. కేవలం నాశనం తప్పించుకోవడానికే గిబియోనీయులు కపటోపాయం పన్నారా? లేదు, ఇశ్రాయేలు దేవుని అనుగ్రహం తాము కూడా పొందాలనే కోరిక వారిలో కనబడింది. వారు “సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్ళు చేదువారుగాను” ఉండడానికి యెహోవా వారిని ఆమోదించాడు. (యెహోషువ 9:​11-27) గిబియోనీయులు యెహోవా సేవలో చిన్న చిన్న పనులు చేయడంలో కూడా ఎల్లప్పుడూ సంసిద్ధత చూపించారు. బహుశా వారిలో కొందరు బబులోను నుండి తిరిగి వచ్చి, ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి పని చేసిన నెతీనీయులు కూడా ఉండవచ్చు. (ఎజ్రా 2:​1, 2, 43-54; 8:​20) దేవునితో సమాధానం కాపాడుకోవడానికి కృషి చేయడంలో, ఆయన సేవలో చిన్న చిన్న నియామకాలు చేపట్టడానికి సైతం సంసిద్ధంగా ఉండడంలో మనం వారి నడవడిని అనుకరించవచ్చు.

స్వయం త్యాగ స్ఫూర్తిని కనబరచడం

15 యేసు మరియు అపొస్తలుడైన పౌలు చేసిన ప్రయాణాలు, పరిచర్యకు సంబంధించిన బైబిలు ప్రాంతాల భౌగోళిక వివరాలు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉన్నాయి. (మార్కు 1:​38; 7:​24, 31; 10:1; లూకా 8:⁠1; 13:22; 2 కొరింథీయులు 11:​25, 26) క్రింది వృత్తాంతాల్లో వివరించబడిన ప్రయాణాలను ఊహించడానికి ప్రయత్నించండి.

16 పౌలు తన రెండవ మిషనరీ యాత్రలో (మ్యాపులో ఊదారంగు రేఖ), ఇప్పుడు గ్రీసులో ఉన్న ఫిలిప్పీకి వచ్చాడు. [33] ఆయన అక్కడ సాక్ష్యమిచ్చాడు, బంధించబడి ఆ తర్వాత విడుదల చేయబడ్డాడు, తర్వాత థెస్సలొనీకకు వెళ్ళాడు. (అపొస్తలుల కార్యములు 16:6-17:⁠1) అక్కడ యూదులు అల్లరి రేపినప్పుడు, థెస్సలొనీకలోని సహోదరులు బెరయకు వెళ్ళమని పౌలును బ్రతిమిలాడారు, ఆ ప్రాంతం దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. పౌలు బెరయలో చేసిన పరిచర్య విజయవంతమైంది, కానీ యూదులు వచ్చి అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. అందువల్ల, ‘సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్ళమని పంపించారు . . . పౌలును సాగనంప వెళ్ళినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని పోయారు.’ (అపొస్తలుల కార్యములు 17:​5-15) కొత్తగా విశ్వాసులైన వారు, ఏజియన్‌ సముద్రం వరకు 40 కిలోమీటర్లు కాలినడకన రావడానికి, అక్కడ నుండి ఓడ ప్రయాణ ఖర్చులు పెట్టుకొని దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఇష్టపడ్డారు. అలాంటి ప్రయాణం ప్రమాదంతో కూడుకున్నది, అయినా సహోదరులు ఆ ప్రమాదాలకు భయపడక దేవుని ప్రయాణ ప్రతినిధితో ఎక్కువ సమయం గడిపారు.

17 పౌలు తన మూడవ మిషనరీ యాత్రలో (మ్యాపులో ఆకుపచ్చ రేఖ), మిలేతు రేవుకు వచ్చాడు. ఆయన అక్కడికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫెసు సంఘ పెద్దలకు కబురు పంపాడు. ఆ పెద్దలు పౌలును కలుసుకోవడానికి తమ పనులన్నీ పక్కన బెట్టి రావడాన్ని ఊహించండి. వారు త్రోవలో బహుశా ఆయనతో జరిపే సమావేశం గురించి ఉత్సాహంగా మాట్లాడుకొని ఉంటారు. పౌలును కలిసి, ఆయన చేసిన ప్రార్థన విన్న తర్వాత ‘వారందరు విశేషముగా దుఃఖించుచు, పౌలు మెడమీద పడి అతనిని ముద్దు పెట్టుకొనిరి.’ ఆ తర్వాత వారు యెరూషలేముకు వెళ్ళడానికి “ఓడవరకు అతనిని సాగనంపిరి.” (అపొస్తలుల కార్యములు 20:​14-38) వారు ఎఫెసుకు తిరిగి వెళ్ళేటప్పడు ఆలోచించవలసినవి, మాట్లాడుకోవలసినవి బహుశా చాలా విషయాలు ఉండి ఉంటాయి. తమను ప్రోత్సహించి పురికొల్పే ప్రయాణ పరిచారకునితో కలిసి మాట్లాడడానికి అంత దూరం నడిచి వెళ్ళడంలో వారు చూపిన ప్రేమ, గౌరవాలను బట్టి మీరు ముగ్ధులవడం లేదా? ఇందులో మీరు మీ జీవితానికి, ఆలోచనకు అన్వయించుకోగల దేనినైనా గ్రహిస్తున్నారా?

వాగ్దాన దేశం గురించి, భవిష్యత్తు గురించి నేర్చుకోండి

18 ఇప్పటి వరకు పరిశీలించిన ఉదాహరణలు, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశంతో పరిచయం పెంచుకోవడంలోని విలువను తెలియజేయడంతో పాటు, ఆ దేశం అనేక బైబిలు వృత్తాంతాలకు కేంద్ర బిందువని కూడా వివరించాయి. (బైబిలు వృత్తాంతాల్లో ప్రస్తావించబడే చుట్టుప్రక్కల ప్రాంతాలను గురించిన మన ఊహను విస్తృత పరచుకోవచ్చు.) అయితే ప్రత్యేకంగా వాగ్దాన దేశం గురించిన మన పరిజ్ఞానాన్ని, అవగాహనను వృద్ధి చేసుకుంటూ, ఇశ్రాయేలీయులు “పాలు తేనెలు ప్రవహించు” దేశములో ప్రవేశించి, దాన్ని ఆస్వాదించడానికి వారిలో ఉండవలసిన ప్రాథమిక యోగ్యత ఏమిటో మనం గుర్తుంచుకోవచ్చు. యెహోవాకు భయపడి ఆయన ఆజ్ఞలను పాటించడమే ఆ యోగ్యత.​—⁠ద్వితీయోపదేశకాండము 6:​1, 2; 27:⁠3.

19 అదే ప్రకారం నేడు యెహోవాకు భయపడుతూ, ఆయన మార్గాలకు హత్తుకోవడం ద్వారా మనం చేయగలిగినదంతా చేయాలి. మనం అలా చేసినప్పుడు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘంలో నెలకొన్న ఆధ్యాత్మిక పరదైసును విస్తరింపజేస్తూ, దానిని మరింత రమ్యంగా చేయడానికి దోహదపడిన వారమవుతాం. ఆ విధంగా మనం ఎల్లప్పుడూ దాని వివరాలు, ఆశీర్వాదాల గురించిన పరిజ్ఞానంలో మరింతగా ఎదుగుతాం. ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని మనకు తెలుసు. యెహోషువ ఇశ్రాయేలీయులను యొర్దాను దాటించి ఫలవంతమైన, సంతృప్తికరమైన దేశంలోకి నడిపించాడు. ఇప్పుడు మనం భవిష్యత్తులోని మంచి దేశమైన పరదైసు కోసం నమ్మకంతో వేచియుండే మంచి కారణం ఉంది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

బైబిలులో చర్చించిన ప్రాంతాలపై మన పరిజ్ఞానాన్ని, అవగాహనను వృద్ధి చేసుకోవాలని మనం ఎందుకు కోరుకోవాలి?

ఈ ఆర్టికల్‌లో పరిశీలించబడిన ఏ భౌగోళిక వివరం ప్రత్యేకంగా మీకు సహాయకరంగా ఉంది?

ఒకానొక సంఘటన జరిగిన ప్రాంతం గురించి మీరు ఎక్కువగా నేర్చుకున్నప్పుడు, ఏ విషయం మీకు మరింత స్పష్టమయ్యింది?

[అధ్యయన ప్రశ్నలు]

1. దేవుడు అబ్రాహాముకు ఎలాంటి ఆసక్తికరమైన ఆదేశమిచ్చాడు?

2. అబ్రాహాము ఐగుప్తును విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు?

3. అబ్రాహాము ప్రయాణాలను ఊహించుకోవడం ఎందుకు ఒక సవాలుగా ఉండవచ్చు?

4, 5. (ఎ) బైబిలు ప్రాంతాలను అర్థం చేసుకోవడానికి సామెతలు 18:15కు ఎలాంటి సంబంధం ఉంది? (బి) జెఫన్యా 2వ అధ్యాయం ఏమి వివరిస్తోంది?

6. కొంతమంది క్రైస్తవులు మ్యాపులను అత్యంత ప్రాముఖ్యమైనవిగా ఎందుకు పరిగణిస్తారు? (బాక్సు చూడండి.)

7, 8. (ఎ) గాజాలో సమ్సోను ఎలాంటి ఆశ్చర్యకార్యం చేశాడు? (బి) సమ్సోను వీరోచిత కార్యానికి ఎలాంటి సమాచారం అదనపు అర్థాన్ని ఇస్తోంది? (సి) సమ్సోనుకు సంబంధించిన ఈ వృత్తాంతపు పరిజ్ఞానం, దాని గురించిన అవగాహన మనకు ఎలా సహాయం చేస్తాయి?

9, 10. (ఎ) మిద్యానీయులపై గిద్యోను సాధించిన విజయంలో ఏమి ఇమిడివుంది? (బి) ఈ వృత్తాంతాన్ని మరింత అర్థం చేసుకోవడానికి, భౌగోళిక విషయాలపై పరిజ్ఞానాన్ని పొందడం మనకు ఎలా సహాయం చేస్తుంది?

11. ఇశ్రాయేలీయులు కాదేషుకు రాకముందూ, వచ్చిన తర్వాతా ఏమి జరిగింది?

12. ఇశ్రాయేలీయుల విశ్వాసం గురించి చివరకు మనమేమి చెప్పవచ్చు, మనం కూడా ఆ విషయం గురించి ఎందుకు ఆలోచించాలి?

13, 14. (ఎ) ఎలాంటి పరిస్థితిలో గిబియోనీయులు నిర్ణయాత్మక చర్య తీసుకున్నారు? (బి) గిబియోనీయుల మనోవైఖరిని ఏది వెల్లడి చేస్తోంది, దీని నుండి మనం ఏ పాఠాన్ని నేర్చుకోవాలి?

15. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని భౌగోళిక వివరాల పట్ల మనకు ఆసక్తి ఎందుకు ఉండాలి?

16. బెరయలోని క్రైస్తవులు పౌలు పట్ల తమ ప్రేమ, గౌరవాలను ఎలా ప్రదర్శించారు?

17. మిలేతుకు, ఎఫెసుకు మధ్యగల దూరాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం దేనిని ఎక్కువగా గ్రహించవచ్చు?

18. బైబిలు ప్రాంతాలకు సంబంధించి మనం ఏమి చేయడానికి తీర్మానించుకోవాలి?

19. మనం ఏ రెండు పరదైసులపై ఎల్లప్పుడూ శ్రద్ధ చూపించాలి?

[14వ పేజీలోని బాక్సు/చిత్రం]

‘మంచి దేశమును చూడండి’

యెహోవాసాక్షులు 2003-2004లో జరిగిన సమావేశాల్లో ‘మంచి దేశమును చూడండి’ అనే బ్రోషుర్‌ను ఆనందంగా అందుకున్నారు. ఈ కొత్త సాహిత్యం ఇప్పుడు దాదాపు 80 భాషల్లో లభ్యమవుతోంది, దీని నిండా రంగుల మ్యాపులు, చార్టులు ఉన్నాయి. అవి బైబిలులో చర్చించబడిన వివిధ ప్రాంతాలను ప్రత్యేకంగా వివిధ కాలాల్లోని వాగ్దాన దేశాన్ని వివరిస్తాయి.

దీనితోపాటు ఉన్న ఆర్టికల్‌లో, [15] లాంటి ముద్ద అక్షరాల్లో ఇవ్వబడిన నంబర్లు బ్రోషుర్‌లో ఆయా మ్యాపులున్న పేజీలను సూచిస్తున్నాయి. మీ దగ్గర ఈ కొత్త బ్రోషుర్‌ ఉంటే, దేవుని వాక్యంపై మీ పరిజ్ఞానాన్ని, అవగాహనను వృద్ధి చేసుకోవడానికి దోహదపడగల విశిష్ట అంశాలతో పరిచయం ఏర్పరచుకోవడానికి కొంత సమయం తీసుకోండి.

(1) సాధారణంగా మ్యాపుల్లో, వాటిలో ఉపయోగించిన ప్రత్యేక చిహ్నాలను లేదా గుర్తులను తెలిపే సూచిక లేదా బాక్సు ఉంటుంది. [18]. (2) చాలా మ్యాపుల్లో, ప్రాంత విస్తీర్ణతను లేదా దూరాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడే మైళ్ళు, కిలోమీటర్లను తెలిపే స్కేలు వంటివి ఉంటాయి. [26]. (3) సాధారణంగా ఉత్తర దిక్కును సూచించే బాణం గుర్తు, దిక్కులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. [19]. (4) మ్యాపుల్లో, ఎత్తయిన ప్రదేశాలను సూచించడానికి ఎక్కువగా రంగులే ఉపయోగించబడ్డాయి. [12]. (5) మ్యాపుల అంచుల్లో అక్షరాలు/నెంబర్లు ఉంటాయి, అవి నగరాలను లేదా పేర్లను గుర్తించడానికి మీకు సహాయం చేస్తాయి. [23]. (6)రెండు పేజీల్లో [34-5] ఇవ్వబడిన మ్యాపుల అనుక్రమణికలో పేజీ నంబరు ముద్ద అక్షరాల్లోను, దాని తర్వాత E5లాంటి చట్రపు స్థానం మీరు చూడవచ్చు. ఈ వివరాలను మీరు కొన్నిసార్లు ఉపయోగించిన తర్వాత, బైబిలుపై మీ పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడానికి, మీ అవగాహనను పెంచుకోవడానికి అవి ఎంతగా ఉపయోగపడతాయో మీరే అర్థం చేసుకుంటారు.

[16, 17వ పేజీలోని చార్టు/మ్యాపు]

సహజ ప్రాంతాల పట్టిక

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

A. మహా సముద్ర తీరము

B. యొర్దానుకు పడమటి వైపు ఉన్న మైదానాలు

1. ఆషేరు మైదానం

2. దోరు కోస్తా ప్రాంతం

3. షారోను పచ్చిక మైదానాలు

4. ఫిలిష్తియ మైదానం

5. మధ్య తూర్పు-పశ్చిమ లోయ

a. మెగిద్దో మైదానం

b. యెజ్రెయేలు లోయ

C. యొర్దానుకు పడమటివైపు ఉన్న కొండలు

1. గలిలయ కొండలు

2. కర్మెలు పర్వతాలు

3. షోమ్రోను కొండలు

4. షెఫేలా (చిన్న కొండలు)

5. యూదా కొండసీమలు

6. యూదా అరణ్యము

7. నెగెబు

8. పారాను అరణ్యము

D. అరాబా (రిఫ్ట్‌ లోయ)

1. హూలా నీటిమడుగు

2. గలిలయ సముద్ర ప్రాంతము

3. యొర్దాను లోయ

4. ఉప్పు సముద్రం (మృత సముద్రం)

5. అరాబా (ఉప్పు సముద్రానికి దక్షిణాన)

E. యొర్దానుకు తూర్పువైపు ఉన్న కొండలు/పీఠభూములు

1. బాషాను

2. గిలాదు

3. అమ్మోను, మోయాబు

4. ఎదోము కొండ పీఠభూమి

F. లెబానోను కొండలు

[మ్యాపు]

హెర్మోను కొండ

మోరే

ఆబేల్మెహోలా

సుక్కోతు

యొగ్బెహ

బేతేలు

గిల్గాలు

గిబియోను

యెరూషలేము

హెబ్రోను

గాజా

బెయేర్షెబా

సొదొమ?

కాదేషు

[15వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(For fully formatted text, see publication

కనాను

మెగిద్దో

గిలాదు

దోతాను

షెకెము

బేతేలు (లూజు)

హాయి

యెరూషలేము (షాలేము)

బేత్లెహేము (ఎఫ్రాతా)

మమ్రే

హెబ్రోను (మక్పేలా)

గెరారు

బెయేర్షెబా

సొదొమ?

నెగెబు

రహెబోతు

[పర్వతాలు]

మోరీయా

[సముద్రాలు]

ఉప్పు సముద్రం

[నదులు]

యొర్దాను

[చిత్రం]

అబ్రాహాము ఈ దేశంలో సంచరించాడు

[18వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

త్రోయ

సమొత్రాకేకు

నెయపొలి

ఫిలిప్పీ

అంఫిపొలి

థెస్సలొనీక

బెరయ

ఏథెన్సు

కొరింథు

ఎఫెసు

మిలేతు

రొదు