కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పునరుత్థానం—మీ మీద ప్రభావం చూపించే బోధ

పునరుత్థానం—మీ మీద ప్రభావం చూపించే బోధ

పునరుత్థానం​—⁠మీ మీద ప్రభావం చూపించే బోధ

‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని నేను దేవునియందు నిరీక్షించుచున్నాను.’​—⁠అపొస్తలుల కార్యములు 24:14-15.

అపొస్తలుడైన పౌలు సా.శ. 56లో తన మూడవ మిషనరీ యాత్ర ముగింపులో యెరూషలేములో ఉన్నాడు. రోమన్లు ఆయనను బంధించిన తర్వాత, యూదుల మహాసభ ఎదుటకు వెళ్లడానికి ఆయనకు అనుమతి లభించింది. (అపొస్తలుల కార్యములు 22:​29, 30) పౌలు ఆ సభలోని వారిని కలియజూసినప్పుడు, అందులో కొందరు సద్దూకయ్యులూ, కొందరు పరిసయ్యులూ ఉండడం ఆయన గమనించాడు. ఆ రెండు గుంపులవారు ఒక విషయంలో చాలా విభేదించుకుంటారు. సద్దూకయ్యులు పునరుత్థానం లేదంటారు, పరిసయ్యులు ఉందంటారు. ఆ వివాదంలో తన స్థానమేమిటో వివరిస్తూ పౌలు ఇలా అన్నాడు: “సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణగూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నాను.” అలా ఆయన ఆ సభను గందరగోళంలోకి నెట్టాడు.​—⁠అపొస్తలుల కార్యములు 23:6-9.

2 చాలా సంవత్సరాల పూర్వం పౌలు దమస్కుకు వెళ్లే దారిలో, ఒక దర్శనంలో యేసు మాట్లాడడం విన్నాడు. “ప్రభువా, నేనేమి చేయవలెను” అని కూడా పౌలు యేసును అడిగాడు. దానికి యేసు ఇలా సమాధానమిచ్చాడు: “నీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడును.” పౌలు దమస్కుకు వెళ్లినప్పుడు అననీయ అనే దయగల క్రైస్తవ శిష్యుడు ఆయనను కలుసుకొని ఇలా వివరించాడు: “మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని [పునరుత్థానుడైన యేసును] చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు.” (అపొస్తలుల కార్యములు 22:6-16) కాబట్టి పునరుత్థానంలో తనకున్న విశ్వాసం గురించి పౌలు స్వయంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.​—⁠1 పేతురు 3:15.

పునరుత్థాన నిరీక్షణను బహిరంగంగా ప్రకటించడం

3 పౌలు ఆ తర్వాత అధిపతి అయిన ఫేలిక్సు ఎదుట హాజరయ్యాడు. ఆ సందర్భంలో, యూదుల తరఫున పౌలుకు వ్యతిరేకంగా ఫిర్యాదు సమర్పించిన తెర్తుల్లు అనే “న్యాయవాది,” పౌలు మతభేదానికి నాయకుడని, రాజద్రోహానికి పాల్పడుతున్నాడని ఆరోపించాడు. దానికి జవాబుగా పౌలు ఏ మాత్రం వెనుతీయకుండా ఇలా ప్రకటించాడు: “వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.” ఆ తర్వాత ఆయన అసలు వివాదాన్ని ఇలా ప్రస్తావించాడు: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షిస్తున్నాను.’​—⁠అపొస్తలుల కార్యములు 23:​23, 24; 24:1-8, 14-15.

4 దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఫేలిక్సుకు వారసునిగా వచ్చిన పోర్కియు ఫేస్తు, ఖైదీగా ఉన్న పౌలును విచారించేందుకు తనతోపాటు ఉండమని రాజైన హేరోదు అగ్రిప్పను ఆహ్వానించాడు. ‘చనిపోయిన యేసు అను ఒకడు బ్రదికియున్నాడని’ పౌలు చెబుతున్న మాటలతో ఆరోపకులు విభేదిస్తున్నారని ఫేస్తు వివరించాడు. పౌలు తన పక్షాన తానే వాదించుకుంటూ ఇలా అడిగాడు: “దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు?” ఆ తర్వాత ఆయన ఇలా ప్రకటించాడు: “అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.” (అపొస్తలుల కార్యములు 24:​27; 25:​13-22; 26:​8, 22, 23) పునరుత్థానం గురించి పౌలు ఎంత దృఢనమ్మకంతో ప్రకటించాడో కదా! పౌలులాగే మనం కూడా పునరుత్థానం జరుగుతుందని నమ్మకంగా ప్రకటించవచ్చు. అయితే ఎలాంటి ప్రతిస్పందనను మనం ఎదురుచూడవచ్చు? పౌలుకు ఎదురైన ప్రతిస్పందనే బహుశా మనకూ ఎదురుకావచ్చు.

5 పౌలు తన రెండవ మిషనరీ యాత్రలో (దాదాపు సా.శ. 49-52) ఏథెన్సును సందర్శించినప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. ఆయన అనేక దేవతలను విశ్వసించిన ప్రజలతో తర్కిస్తూ, దేవుడు తాను నియమించిన మనిషి ద్వారా, నీతిని అనుసరించి భూలోకానికి తీర్పుతీర్చే తన సంకల్పాన్ని గమనించమని వారిని కోరాడు. ఆ మనుష్యుడు మరెవరో కాదు యేసే. యేసును పునరుత్థానం చేయడం ద్వారా దేవుడు ఈ హామీ ఇచ్చాడని పౌలు వివరించాడు. దానికి ప్రజలు ఎలా ప్రతిస్పందించారు? మనం ఇలా చదువుతాం: “మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి; మరికొందరు​—⁠దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 17:​29-32.

6 సా.శ. 33 తర్వాత కొద్దికాలానికే పేతురు, యోహానులకు ఎదురైన అనుభవానికి వారి ప్రతిస్పందన అద్దం పట్టింది. వివాదంలో సద్దూకయ్యులే మళ్లీ ప్రముఖ పాత్ర వహించారు. జరిగిన దానిని అపొస్తలుల కార్యములు 4:1-4 ఇలా వివరిస్తోంది: “వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి[రి].” అయితే ఇతరులు అనుకూలంగా ప్రతిస్పందించారు. “వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదు వేలు ఆయెను.” కాబట్టి మనం పునరుత్థాన నిరీక్షణ గురించి మాట్లాడినప్పుడు ప్రతిస్పందనలు వివిధరకాలుగా ఉంటాయని మనం ఎదురుచూడవచ్చు. ఈ విషయం దృష్ట్యా ఈ బోధలో మన విశ్వాసాన్ని బలపరచుకోవడం ఆవశ్యకం.

విశ్వాసం మరియు పునరుత్థానం

7 సా.శ. మొదటి శతాబ్దంలో క్రైస్తవులైన వారందరికీ పునరుత్థాన నిరీక్షణను అంగీకరించడం సులభం కాలేదు. అలా అంగీకరించడం కష్టంగా తోచినవారిలో కొందరు కొరింథు సంఘంలో ఉన్నారు. వారికి పౌలు ఇలా వ్రాశాడు: “నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.” పునరుత్థానుడైన క్రీస్తు “ఐదువందలకు ఎక్కువైన సహోదరులకు” కనిపించాడనీ, వారిలో చాలామంది ఇంకా బ్రతికే ఉన్నారని చెబుతూ పౌలు ఈ సత్యాన్ని ధృవీకరించాడు. (1 కొరింథీయులు 15:3-8) ఆయన ఇంకా వారితో ఇలా తర్కించాడు: “క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు​—⁠మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడియుండలేదు. మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ [మన] విశ్వాసమును వ్యర్థమే.”​—⁠1 కొరింథీయులు 15:12-14.

8 అవును, పునరుత్థానం గురించిన బోధ ఎంత ప్రధానమైనదంటే, పునరుత్థానాన్ని ఒక వాస్తవంగా అంగీకరించకపోతే క్రైస్తవ విశ్వాసమే వ్యర్థం. నిజానికి, పునరుత్థానం గురించిన సరైన అవగాహన నిజ క్రైస్తవులను అబద్ధ క్రైస్తవుల నుండి వేరుగా ఉంచుతుంది. (ఆదికాండము 3:4; యెహెజ్కేలు 18:⁠4) అందుకే పౌలు పునరుత్థాన బోధను క్రైస్తవ “మూలోపదేశము[లో]” చేర్చాడు. కాబట్టి ‘సంపూర్ణులగుటకు ముందుకు సాగిపోవడమే’ మన తీర్మానంగా ఉండాలి. “దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము” అని పౌలు బోధిస్తున్నాడు.​—⁠హెబ్రీయులు 6:​1-3.

పునరుత్థాన నిరీక్షణ

9 పునరుత్థానంలో మన విశ్వాసాన్ని మరింత బలపరచుకోవడానికి మనం ఇలాంటి ప్రశ్నలను పునఃసమీక్షిద్దాం: బైబిలు పునరుత్థానాన్ని సూచిస్తున్నప్పుడు దాని భావం ఏమిటి? పునరుత్థాన బోధ యెహోవా ప్రేమను ఎలా మహిమపరుస్తుంది? ఈ ప్రశ్నలకు లభించే జవాబులు మనలను దేవునికి సన్నిహితులను చేస్తాయి, అదే సమయంలో మనం ఇతరులకు బోధించేందుకు కూడా సహాయం చేస్తాయి.​—⁠2 తిమోతి 2:2; యాకోబు 4:⁠8.

10 “తిరిగి లేచినిలబడుట” అనే అక్షరార్థ భావంగల గ్రీకు పదంయొక్క అనువాదమే “పునరుత్థానం.” ఆ మాటకు అర్థం ఏమిటి? బైబిలు ప్రకారం, చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి జీవించగలడనే నమ్మకమే పునరుత్థాన నిరీక్షణ. అంతేకాక, ఒక వ్యక్తికి ఉన్న భూసంబంధ లేదా పరలోకసంబంధ నిరీక్షణ ఆధారంగా ఆయన మానవ సంబంధ శరీరానికి లేదా ఆత్మ సంబంధ శరీరానికి పునరుద్ధరించబడతాడని బైబిలు చూపిస్తోంది. ఈ అద్భుతమైన పునరుత్థాన నిరీక్షణలో కనబడే యెహోవా ప్రేమ, జ్ఞానం, శక్తినిబట్టి మనం ఆశ్చర్యపోతాం.

11 యేసు ఆయన అభిషిక్త సహోదరులు ఆత్మ సంబంధ శరీరంతో పునరుత్థానం చేయబడడం ద్వారా వారు పరలోకంలో సేవ చేయగలుగుతారు. (1 కొరింథీయులు 15:35-38, 42-53) ఈ భూమ్మీదికి పరదైసు పరిస్థితులు తీసుకొచ్చే మెస్సీయ రాజ్యంలో వారు కలిసి పరిపాలన చేస్తారు. ప్రధాన యాజకుడైన యేసు ఆధ్వర్యంలో అభిషిక్తులు రాజులైన ఒక యాజక సమూహంగా రూపొందుతారు. నీతియుక్తమైన నూతనలోకంలో వారు క్రీస్తు విమోచనా బలి ప్రయోజనాలు మానవాళికి అందేలా చేస్తారు. (హెబ్రీయులు 7:​25, 26; 9:24; 1 పేతురు 2:9; ప్రకటన 22:1, 2) అంతవరకు, ఈ భూమ్మీద ఇంకా సజీవులుగా ఉన్న అభిషిక్తులు దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. మరణించినప్పుడు వారు పరలోక జీవితానికి అమర్త్యమైన ఆత్మ ప్రాణులుగా పునరుత్థానం చేయబడడం ద్వారా తమ “ఫలమును” అందుకుంటారు. (2 కొరింథీయులు 5:1-3, 6-8, 10; 1 కొరింథీయులు 15:51, 52; ప్రకటన 14:​13) “ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము” అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 6:5) ఈ భూమ్మీద తిరిగి మానవులుగా జీవించడానికి పునరుత్థానం చేయబడే వారి విషయమేమిటి? పునరుత్థాన నిరీక్షణ వారిని దేవునికి ఎలా సన్నిహితులను చేస్తుంది? అబ్రాహాము ఉదాహరణ నుండి మనమెన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

పునరుత్థానం, యెహోవాతో స్నేహం

12 ‘యెహోవా స్నేహితుడు’ అని వర్ణించబడిన అబ్రాహాము అసాధారణ విశ్వాసం ప్రదర్శించిన వ్యక్తి. (యాకోబు 2:23) పౌలు హెబ్రీయులు 11వ అధ్యాయంలో ప్రస్తావించిన విశ్వాసులైన స్త్రీపురుషుల జాబితాలో అబ్రాహాము విశ్వాసాన్ని మూడుసార్లు పేర్కొన్నాడు. (హెబ్రీయులు 11:8, 9, 17) ఆ మూడవ ప్రస్తావన, అబ్రాహాము విధేయతతో తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడినప్పుడు ఆయన కనబరచిన విశ్వాసంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇస్సాకు ద్వారా సంతానం కలుగుతుందనే వాగ్దానానికి యెహోవా హామీ ఉందని అబ్రాహాము నమ్మాడు. ఇస్సాకు బలిగా చనిపోవలసివచ్చినప్పటికీ, “మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని” అబ్రాహాము పరిగణించాడు.

13 చివరకు అబ్రాహాముకున్న బలమైన విశ్వాసాన్ని యెహోవా చూశాక, ప్రత్యామ్నాయంగా ఒక జంతువును బలి ఇచ్చే ఏర్పాటు చేశాడు. అయితే ఇస్సాకు అనుభవం పునరుత్థానానికి ఒక దృష్టాంతంగా పనిచేసింది. పౌలు ఇలా వివరించాడు: “[అబ్రాహాము] తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని [ఇస్సాకును] మృతులలోనుండి మరల పొందెను.” (హెబ్రీయులు 11:​17-19) అంతకంటే ఎక్కువగా, అబ్రాహాముకు అంతకుముందే పునరుత్థానంలో తన నమ్మకానికి బలమైన ఆధారం ఉంది. అబ్రాహాము ఆయన భార్య వృద్ధులైనప్పటికీ యెహోవా వారికి మళ్లీ పునరుత్పాదక శక్తిని ఇచ్చి తమ కుమారుడైన ఇస్సాకును కనేటట్లు చేయలేదా?​—⁠ఆదికాండము 18:​10-14; 21:1-3; రోమీయులు 4:19-21.

14 అబ్రాహాము ఒక పరదేశిలా గుడారాల్లో నివసిస్తూ “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు” ఎదురుచూశాడు అని పౌలు వర్ణించాడు. (హెబ్రీయులు 11:9, 10) ఆ పట్టణం దేవుని ఆలయ స్థానంగా ఉన్న యెరూషలేము వంటి నిజమైన పట్టణం కాదు, అదొక సూచనార్థక పట్టణం. అది క్రీస్తుయేసు ఆయన సహపరిపాలకులైన 1,44,000 మందితో తయారైన దేవుని పరలోక రాజ్యం. పరలోక మహిమలో ఉన్న ఆ 1,44,000 మందికి “పరిశుద్ధపట్టణము,” “నూతనమైన యెరూషలేము,” క్రీస్తు “పెండ్లికుమార్తె” అనే పేర్లు కూడా ఉన్నాయి. (ప్రకటన 21:2) 1914లో యెహోవా యేసును పరలోక రాజ్యపు మెస్సీయ రాజుగా సింహాసనం ఎక్కించి, శత్రువుల మధ్యన పరిపాలన చేయమని ఆజ్ఞాపించాడు. (కీర్తన 110:1, 2; ప్రకటన 11:15) ఆ రాజ్య పరిపాలనా ఆశీర్వాదాలు పొందాలంటే ‘యెహోవా స్నేహితుడైన’ అబ్రాహాము తిరిగి బ్రతకాలి. అదే విధంగా, మనం కూడా ఆ రాజ్యాశీర్వాదాలు పొందాలంటే, అర్మగిద్దోను తప్పించుకున్న గొప్పసమూహ సభ్యులుగా లేదా మృతుల్లోనుండి పునరుత్థానం చేయబడిన వారిగా మనం దేవుని నూతనలోకంలో సజీవులుగా ఉండాలి. (ప్రకటన 7:9, 14) అయితే పునరుత్థాన నిరీక్షణకు ఆధారమేమిటి?

దేవుని ప్రేమ​—⁠పునరుత్థాన నిరీక్షణకు ఆధారం

15 మన ప్రేమగల పరలోకపు తండ్రితో సన్నిహితంగా ఉంటూ, అబ్రాహాముకు ఉన్నటువంటి బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడితే, యెహోవా మనలను నీతిమంతులుగా ప్రకటించి తన స్నేహితులుగా దృష్టిస్తాడు. ఇది మనకు రాజ్యపరిపాలన నుండి ప్రయోజనం పొందే అవకాశాన్ని ఇస్తుంది. నిజానికి, దేవుని వాక్యంలో ఆదికాండము 3:15లో వ్రాయబడిన మొట్టమొదటి ప్రవచనం పునరుత్థాన నిరీక్షణకు, దేవునితో స్నేహానికి పునాది వేస్తోంది. అది సాతాను తలను చితకకొట్టడాన్ని గురించే కాక, దేవుని స్త్రీ సంతానపు మడిమె మీద కొట్టడాన్ని కూడా ప్రవచించింది. యేసు హింసాకొయ్యపై మరణించడం అలంకారార్థంగా మడిమె మీద కొట్టడాన్ని సూచిస్తోంది. ఆయన మూడవ రోజున పునరుత్థానం చేయబడడంతో ఆ గాయం మానిపోవడమే కాక, “మరణము యొక్క బలము గలవానికి” అంటే అపవాదికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్య తీసుకునేందుకు మార్గం సుగమమయ్యింది.​—⁠హెబ్రీయులు 2:​14.

16 “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు. (రోమీయులు 5:8) ఈ అపారమైన కృపపట్ల కృతజ్ఞతతో ఉండడం మనలను నిజంగా యేసుకు, మన ప్రేమగల పరలోకపు తండ్రికి సన్నిహితులను చేస్తుంది.​—⁠2 కొరింథీయులు 5:14, 15.

17 క్రైస్తవ కాలాలకు పూర్వం జీవించిన విశ్వాస పురుషుడైన యోబు కూడా పునరుత్థానం కోసం ఎదురుచూశాడు. సాతాను చేతుల్లో ఆయన చాలా కష్టాలు అనుభవించాడు. పునరుత్థానం గురించి ఏ మాత్రం ప్రస్తావించని ఆయన కపట స్నేహితులకు భిన్నంగా, యోబు ఈ నిరీక్షణ నుండి ఓదార్పు పొంది ఇలా అడిగాడు: “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?” దానికి జవాబుగా ఆయనే ఇలా ప్రకటించాడు: “నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును.” ఆ తర్వాత తన దేవుడైన యెహోవాను సంబోధిస్తూ ఆయన ఇలా ఒప్పుకున్నాడు: “నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను.” మన ప్రేమగల సృష్టికర్త భావాల గురించి యోబు ఇలా అన్నాడు: “నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.” (యోబు 14:14, 15) అవును, యెహోవా తన నమ్మకస్థులందరూ పునరుత్థానం ద్వారా తిరిగి బ్రతికే సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. మనం అపరిపూర్ణులమైనప్పటికీ మనపట్ల ఆయన చూపిస్తున్న ప్రేమను, అపారమైన కృపను ధ్యానిస్తుండగా మనమాయనకు ఎంత సన్నిహితులమవుతామో కదా!​—⁠రోమీయులు 5:21; యాకోబు 4:8.

18 “బహు ప్రియుడు” అని దేవదూత వర్ణించిన దానియేలు ప్రవక్త నమ్మకంగా సేవ చేస్తూ దీర్ఘకాలం జీవించాడు. (దానియేలు 10:11, 19) సా.శ.పూ. 617 నుండి పర్షియా రాజైన కోరెషు పరిపాలనలో మూడవ సంవత్సరమైన సా.శ.పూ. 536లో పరవాసంలో ఉండి ఒక దర్శనం పొందిన తర్వాత కొద్దికాలానికి మరణించేంత వరకు యెహోవాపట్ల ఆయన యథార్థత చెక్కుచెదరలేదు. (దానియేలు 1:⁠1; 10:1) కోరెషు పరిపాలనా మూడవ సంవత్సరంలో దానియేలు రాబోయే మహాశ్రమలతో ముగింపుకొచ్చే ప్రపంచ ఆధిపత్యాల పరంపరకు సంబంధించిన దర్శనం చూశాడు. (దానియేలు 11:1-12:13) ఆ దర్శనాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన దానియేలు తనకు ఆ దర్శన సందేశం ప్రకటించిన దేవదూతను ఇలా అడిగాడు: “నా యేలినవాడా, వీటికి అంతమేమిటి?” ఆ దేవదూత దానికి జవాబిస్తూ విషయాన్ని “బుద్ధిమంతులు గ్రహించే” “అంత్యకాలము”వైపు దృష్టి మళ్లించాడు. మరి దానియేలుకు ఎలాంటి ఉత్తరాపేక్ష ఉంది? ఆ దేవదూత ఇలా అన్నాడు: “నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతినొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.” (దానియేలు 12:8-10, 13) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో జరిగే “నీతిమంతుల పునరుత్థానమందు” దానియేలు తిరిగి జీవిస్తాడు.​—⁠లూకా 14:​14.

19 మనం విశ్వాసులుగా మారినప్పటికన్నా ఇప్పుడు అంత్యకాలపు చివరిదశలో, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనకు మరింత చేరువలో జీవిస్తున్నాం. కాబట్టి మనల్ని మనం ‘అబ్రాహాము, యోబు, దానియేలు, ఇతర విశ్వాసులైన స్త్రీపురుషులతో సహవసించేందుకు నేను నూతనలోకంలో ఉంటానా’ అని ప్రశ్నించుకోవాలి. మనం యెహోవాకు సన్నిహితంగా ఉంటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనమక్కడ తప్పక ఉంటాం. తర్వాతి ఆర్టికల్‌లో, పునరుత్థానం పొందేవారిని గుర్తించేలా పునరుత్థాన నిరీక్షణకు సంబంధించిన మరిన్ని విషయాలను సమీక్షిస్తాం.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

పౌలు పునరుత్థానంలో తనకున్న నమ్మకాన్ని ప్రకటించినప్పుడు ఆయనకు ఎలాంటి ప్రతిస్పందన ఎదురైంది?

పునరుత్థాన నిరీక్షణ నిజ క్రైస్తవులను ఎందుకు నామకార్థ క్రైస్తవులకు వేరుగా ఉంచుతుంది?

అబ్రాహాము, యోబు, దానియేలులకు పునరుత్థానంలో విశ్వాసం ఉందని మనకు ఎలా తెలుసు?

[అధ్యయన ప్రశ్నలు]

1. పునరుత్థానం మహాసభ ఎదుట ఒక వివాదాంశంగా ఎలా మారింది?

2. పునరుత్థానంలో తనకున్న విశ్వాసం గురించి స్వయంగా మాట్లాడేందుకు పౌలు ఎందుకు సిద్ధంగా ఉన్నాడు?

3, 4. పౌలు పునరుత్థానం గురించి దృఢనమ్మకంతో ప్రకటించేవాడిగా ఎలా నిరూపించుకున్నాడు, ఆయన మాదిరినుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

5, 6. (ఎ) అపొస్తలులు పునరుత్థానాన్ని ప్రకటించినప్పుడు, వారికి ఎలాంటి ప్రతిస్పందనలు ఎదురయ్యాయి? (బి) మనం మన పునరుత్థాన నిరీక్షణను వ్యక్తపరుస్తుండగా మనకు ఏమి ఆవశ్యకం?

7, 8. (ఎ) మొదటి శతాబ్దపు కొరింథు సంఘానికి వ్రాసిన ఉత్తరంలో చూపబడిన విధంగా, మన విశ్వాసం ఎలా వ్యర్థం కాగలదు? (బి) పునరుత్థాన నిరీక్షణకు సంబంధించిన సరైన అవగాహన నిజ క్రైస్తవులను ఎలా వేరుగా ఉంచుతుంది?

9, 10. బైబిలు పునరుత్థానాన్ని సూచిస్తున్నప్పుడు దాని భావం ఏమిటి?

11. దేవుని అభిషిక్త సేవకులకు ఎలాంటి పునరుత్థాన నిరీక్షణ ఉంది?

12, 13. పునరుత్థానంలో నమ్మకానికి అబ్రాహాముకు ఎలాంటి బలమైన ఆధారం ఉంది?

14. హెబ్రీయులు 11:​9, 10 ప్రకారం అబ్రాహాము దేనికోసం ఎదురుచూశాడు? (బి) నూతనలోకంలో రాజ్యాశీర్వాదాలు పొందాలంటే, అబ్రాహాముకు ఏమి సంభవించాలి? (సి) రాజ్యాశీర్వాదాలను మనమెలా పొందవచ్చు?

15, 16. (ఎ) మన పునరుత్థాన నిరీక్షణకు బైబిల్లోని మొదటి ప్రవచనం ఎలా పునాది వేస్తోంది? (బి) పునరుత్థానపు నమ్మకం మనలను యెహోవాకు ఎలా సన్నిహితులను చేస్తుంది?

17. (ఎ) యోబు ఎలాంటి నిరీక్షణను వ్యక్తం చేశాడు? (బి) యెహోవా గురించి యోబు 14:⁠15 ఏమి వెల్లడిస్తోంది, అది మీరెలా భావించేలా చేస్తోంది?

18, 19. (ఎ) దానియేలుకు తిరిగి జీవించే విషయంలో ఎలాంటి నిరీక్షణ ఉంది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏ విషయాన్ని సమీక్షిస్తాం?

[8వ పేజీలోని చిత్రం]

అధిపతి అయిన ఫేలిక్సు ఎదుట హాజరైన పౌలు పునరుత్థాన నిరీక్షణను నమ్మకంగా ప్రకటించాడు

[10వ పేజీలోని చిత్రం]

అబ్రాహాముకు పునరుత్థానంలో ఎందుకు విశ్వాసం ఉంది?

[12వ పేజీలోని చిత్రం]

పునరుత్థాన నిరీక్షణ నుండి యోబు ఓదార్పు పొందాడు

[12వ పేజీలోని చిత్రం]

నీతిమంతుల పునరుత్థానంలో దానియేలు మళ్లీ బ్రతుకుతాడు