కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తనకోసం కనిపెట్టుకొని ఉండేవారిని కాపాడతాడు

యెహోవా తనకోసం కనిపెట్టుకొని ఉండేవారిని కాపాడతాడు

యెహోవా తనకోసం కనిపెట్టుకొని ఉండేవారిని కాపాడతాడు

“నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక.”​—⁠కీర్తన 40:11.

ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు ‘యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకొని ఉండడమే’ కాక, యెహోవా “నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను” అని చెప్పడానికి పురికొల్పబడ్డాడు. (కీర్తన 40:1) యెహోవా తనను ప్రేమించేవారిని ఎలా కాపాడతాడో ఆయన ఎన్నోసార్లు స్వయంగా చూశాడు. అందుకే దావీదు తనను ఎల్లవేళలా కాపాడమని యెహోవాను అడగగలిగాడు. (కీర్తన 40:11) “శ్రేష్ఠమైన పునరుత్థానం” గురించి వాగ్దానం చేయబడిన స్త్రీపురుషుల కోవలోకి వచ్చే దావీదు ఆ ప్రతిఫలం పొందగల వ్యక్తిగా ప్రస్తుతం యెహోవా జ్ఞాపకంలో భద్రంగా ఉన్నాడు. (హెబ్రీయులు 11:32-35) ఆ విధంగా ఆయన భవిష్యత్తుకు తిరుగులేని హామీ ఉంది. యెహోవా ‘జ్ఞాపకార్థ గ్రంథములో’ ఆయన పేరు నమోదైంది.​—⁠మలాకీ 3:​16.

2 హెబ్రీయులు 11వ అధ్యాయంలో పేర్కొనబడిన విశ్వాసులు యేసుక్రీస్తు భూమ్మీదకు రాకముందే జీవించినప్పటికీ, “తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును; ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనును” అని యేసు బోధించిన దానికి అనుగుణంగా జీవించారు. (యోహాను 12:​25) కాబట్టి యెహోవా కాపాడతాడంటే స్పష్టంగా దానర్థం బాధ లేదా హింస నుండి విడుదల చేస్తాడని కాదు. బదులుగా, దేవుని దృష్టిలో మంచిస్థానం కాపాడుకునేలా ఆధ్యాత్మిక రీతిలో ఆ వ్యక్తికి కాపుదల ఇస్తాడని మాత్రమే దానర్థం.

3 స్వయంగా యేసే క్రూరమైన హింసకూ, నిందకూ గురయ్యాడు, చివరకు ఆయన శత్రువులు ఆయనను అత్యంత అవమానకరమైన, బాధాకరమైన రీతిలో చంపడంలో కృతకృత్యులయ్యారు. అయినప్పటికీ, మెస్సీయను కాపాడతాననే దేవుని వాగ్దానానికి ఇది ఎంతమాత్రం విరుద్ధం కాదు. (యెషయా 42:1-6) యేసు అత్యంత అవమానకరమైన, బాధాకరమైన రీతిలో మరణించిన తర్వాత ఆయన పునరుత్థానం చేయబడడం, యెహోవా దావీదు విన్నపాన్ని ఆలకించినట్లే, సహాయం కోసం యేసు చేసిన విన్నపాన్ని కూడా విన్నాడని రుజువుచేస్తోంది. దానికి జవాబుగా యెహోవా, యథార్థతను కాపాడుకొనేందుకు కావలసిన బలాన్ని యేసుకు ఇచ్చాడు. (మత్తయి 26:39) ఆ విధంగా కాపాడబడిన యేసు పరలోకంలో అమర్త్యతను పొందాడు అంతేకాక, విమోచన క్రయధనంలో విశ్వాసముంచే లక్షలాదిమందికి నిత్యజీవం పొందే ఉత్తరాపేక్ష కూడా లభించింది.

4 దావీదు, యేసుల కాలంలోలాగే ఇప్పుడు కూడా యెహోవాకు తన సేవకులను కాపాడాలనే కోరికా, కాపాడే శక్తీ ఉన్నాయనే నమ్మకంతో మనం ఉండవచ్చు. (యాకోబు 1:17) యేసు అభిషిక్త సహోదరుల్లో ఈ భూమ్మీద ఇంకా మిగిలివున్న కొద్దిమంది యెహోవా చేసిన ఈ వాగ్దానంపై తమ నమ్మకాన్ని ఉంచవచ్చు: “కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీ కొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.” (1 పేతురు 1:​4-5) వారిలాగే భూనిరీక్షణగల “వేరేగొఱ్ఱెలు” కూడా దేవునిపై, కీర్తనకర్త ద్వారా ఆయనిచ్చిన ఈ వాగ్దానంపై నమ్మకం ఉంచవచ్చు: “యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును.”​—⁠యోహాను 10:​16; కీర్తన 31:​23.

ఆధ్యాత్మికంగా కాపాడబడడం

5 ఆధునిక కాలాల్లో, యెహోవా తన ప్రజలను ఆధ్యాత్మికంగా కాపాడే ఏర్పాట్లు చేశాడు. జీవితంలో సాధారణంగా ఎదురయ్యే కష్టాలు, విషాదాల నుండి లేక హింస నుండి విముక్తి కలిగించకపోయినా, తనతో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకోవడానికి అవసరమైన బలాన్ని, సహాయాన్ని ఆయన వారికి నమ్మకంగా అందించాడు. వారు ఈ సంబంధాన్ని, దేవుడు ప్రేమతో చేసిన విమోచన క్రయధన ఏర్పాటుపై తమకున్న విశ్వాసం అనే పునాది మీదే నిర్మించుకున్నారు. ఈ నమ్మకమైన క్రైస్తవుల్లో కొందరు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి పరలోకంలో క్రీస్తు సహపాలకులయ్యారు. వారు దేవుని ఆధ్యాత్మిక కుమారులుగా నీతిమంతులుగా ప్రకటించబడ్డారు, వారికి ఈ మాటలు వర్తిస్తాయి: “ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.”​—⁠కొలొస్సయులు 1:​13, 14.

6 దేవుడు నెలకొల్పిన విమోచన క్రయధన ఏర్పాటు నుండి తాము కూడా ప్రయోజనం పొందవచ్చని లక్షలాదిమంది ఇతర క్రైస్తవులకు హామీ ఇవ్వబడింది. మనం ఇలా చదువుతాం: “మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను.” (మార్కు 10:​45) తగినకాలంలో ఆ క్రైస్తవులు “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” అనుభవించే కాలం కోసం ఎదురుచూస్తున్నారు. (రోమీయులు 8:​20-21) ఆ సమయం వచ్చేవరకు, వారు దేవునితో తమకున్న స్నేహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఆ బంధాన్ని బలపరచుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారు.

7 యెహోవా తన ప్రజల ఆధ్యాత్మిక సంక్షేమాన్ని కాపాడే ఒక మార్గం, వారికి ప్రగతిశీల శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దీనివల్ల వారు సత్యానికి సంబంధించిన మరింత ప్రామాణిక జ్ఞానం సంపాదించుకోగలుగుతారు. అలాగే యెహోవా తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నిరంతర నిర్దేశాన్ని అనుగ్రహిస్తున్నాడు. “నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని” నిర్దేశం క్రింద ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రజలు ఒక అంతర్జాతీయ కుటుంబంగా ఉన్నారు. ఆ దాసుని తరగతి, యెహోవా సేవకుల కుటుంబంలోని సభ్యులు ఏ దేశస్థులైనప్పటికీ, వారి సామాజిక స్థితి ఏదైనప్పటికీ వారి ఆధ్యాత్మిక అవసరాలపట్ల, అవసరమైతే భౌతిక అవసరాలపట్ల కూడా శ్రద్ధ చూపిస్తోంది.​—⁠మత్తయి 24:​45.

8 యెహోవా, యేసును ఆయన శత్రువుల దాడుల నుండి భౌతికంగా కాపాడనట్లే, నేడుకూడా క్రైస్తవులను ఆయన ఆ విధంగా కాపాడడు. అంతమాత్రాన అది దేవుని అయిష్టతను ఏ మాత్రం సూచించదు. దాని భావం అది కానేకాదు. బదులుగా, అది విశ్వ వివాదంలో వారు తన పక్షం వహిస్తారనే ఆయన నమ్మకాన్ని నొక్కి చెబుతోంది. (యోబు 1:8-12; సామెతలు 27:11) యెహోవా తన భక్తులను ఎన్నటికీ ఎడబాయడు “ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికి కాపాడబడుదురు.”​—⁠కీర్తన 37:​28.

కృపాసత్యములచేత కాపాడబడడం

9 దావీదు, కీర్తన 40లో వ్రాయబడివున్న తన ప్రార్థనలో, యెహోవా తనను కృపాసత్యములచేత కాపాడాలని వేడుకున్నాడు. యెహోవా యొక్క సత్యత్వాన్నిబట్టి, నీతి విషయంలో ఆయనకున్న ప్రేమనుబట్టి ఆయన తన ప్రమాణాలు ఏమిటో స్పష్టంగా తెలియజేయడం అవసరం. ఈ ప్రమాణాలకు అనుగుణంగా జీవించేవారు బాధలనుండి, భయాలనుండి, ఆ ప్రమాణాలను నిర్లక్ష్యం చేసేవారు అనుభవించే సమస్యలనుండి చాలామట్టుకు రక్షణ పొందుతారు. ఉదాహరణకు, మాదక ద్రవ్యాలను ఉపయోగించడానికి, మద్యపాన దుర్వినియోగానికి, విచ్చలవిడి లైంగిక కృత్యాలకు, ఆవేశపూరిత జీవన శైలికి దూరంగా ఉన్నప్పుడు అత్యంత విషాదకరమైన సమస్యల నుండి మనలను, మన ప్రియమైనవారిని కాపాడుకోగలుగుతాం. కొన్ని సందర్భాల్లో దావీదులాగే, యెహోవా సత్యత్వానికి దూరమైన వారికి సహితం, దేవుడు పశ్చాత్తాపం చూపే తప్పిదస్థులకు “దాగు చోటు[గా]” ఉంటాడనే హామీ ఉంది. అలాంటి వారు ఆనందంతో బిగ్గరగా “శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు” అని చెప్పగలరు. (కీర్తన 32:7) దేవుని కృపకు అదెంత గొప్ప వ్యక్తీకరణో కదా!

10 దేవుని కృపకు మరో ఉదాహరణ ఏమిటంటే, తాను త్వరలో నాశనం చేయబోయే దుష్ట లోకానికి దూరంగా ఉండమని ఆయన తన సేవకులను హెచ్చరిస్తున్నాడు. మనమిలా చదువుతాం: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.” ఈ హెచ్చరికను లక్ష్యపెట్టడం ద్వారా, దానికి అనుగుణంగా చర్య తీసుకోవడం ద్వారా మనం అక్షరార్థంగా మన జీవితాన్ని శాశ్వతంగా కాపాడుకోవచ్చు, ఎందుకంటే ఆ వచనం ఇంకా ఇలా చెబుతోంది: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”​—⁠1 యోహాను 2:​15-17.

బుద్ధి, వివేచన, జ్ఞానముచేత కాపాడబడడం

11 దేవుని ఆమోదం పొందాలని ఆశించేవారి కోసం దావీదు కుమారుడైన సొలొమోను ఇలా వ్రాసేలా ప్రేరేపించబడ్డాడు: “బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును.” ఆయన ఇంకా ఇలా ఉద్బోధించాడు: “జ్ఞానము సంపాదించుకొనుము . . . జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును. దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.”​—⁠సామెతలు 2:​11; 4:⁠5, 6.

12 మనం దేవుని వాక్యం నుండి నేర్చుకున్నవాటిని ధ్యానించినప్పుడు, మనం మన బుద్ధిని లేదా ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగిస్తాం. అలా ధ్యానించడం మనం సరైన ప్రాధాన్యతలు ఏర్పరచుకునేలా మన వివేచనను వృద్ధి చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఇది ఆవశ్యకం, ఎందుకంటే ప్రజలు ఉద్దేశపూర్వకంగా లేదా ఉద్దేశరహితంగా జ్ఞానయుక్తం కాని ప్రాధాన్యతలు ఏర్పరచుకున్నప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతాయని బహుశా వ్యక్తిగత అనుభవాన్నిబట్టి మనలో చాలామందికి తెలుసు. ఎంతో ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విలువలను యెహోవా నొక్కి చెబుతుండగా, సాతాను ప్రపంచం మన ఎదుట ఐశ్వర్యాన్ని, అంతస్తును, అధికారాన్ని లక్ష్యాలుగా ఉంచుతోంది. ముందు ప్రస్తావించబడిన వాటికి బదులు సాతాను ప్రపంచం మన ఎదుట ఉంచుతున్న వాటికి ప్రథమస్థానం ఇవ్వడం కుటుంబ విచ్ఛిన్నతకు, స్నేహం పాడైపోవడానికి, ఆధ్యాత్మిక లక్ష్యాలు మరుగున పడిపోవడానికి కారణం కాగలదు. ఫలితంగా, ఒక వ్యక్తి యేసు చెప్పిన ఈ విషాదకరమైన పరిస్థితిని ఎదుర్కోక తప్పదు: “ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?” (మార్కు 8:36) మనం యేసు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం జ్ఞానయుక్తం: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”​—⁠మత్తయి 6:​33.

స్వార్థపరునిగా మారడంలో ఉన్న ప్రమాదం

13 మానవులకు సహజంగానే తమమీద తమకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే వ్యక్తిగత కోరికలు, ప్రయోజనాలు జీవితంలో అతి ప్రాముఖ్యమైనవైనప్పుడు, సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి యెహోవాతో మన స్నేహాన్ని కాపాడుకోవాలంటే స్వార్థానికి దూరంగా ఉండమని ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు. స్వార్థపరుడు అనే మాటకు “తన కోరికలు, అవసరాలు లేదా ప్రయోజనాలు మాత్రమే చూసుకొనేవాడు” అని అర్థం. అది నేడు చాలామంది చూపించే స్వభావాన్ని సరిగా సూచించడంలేదా? సాతాను దుష్ట విధానానికి “అంత్యదినములలో . . . మనుష్యులు స్వార్థప్రియులు[గా]” ఉంటారని బైబిలు ముందే చెప్పడం గమనార్హం.​—⁠2 తిమోతి 3:1, 2.

14 తమను తాము ప్రేమించుకున్నట్లే ఇతరులను ప్రేమిస్తూ వారిపట్ల శ్రద్ధ చూపించాలని చెబుతున్న బైబిలు ఆజ్ఞను పాటించడంలోని విజ్ఞతను క్రైస్తవులు అర్థం చేసుకుంటారు. (లూకా 10:27; ఫిలిప్పీయులు 2:4) సాధారణ ప్రజానీకం ఈ ఆజ్ఞను ఆచరణీయమైనది కాదన్నట్లు దృష్టించవచ్చు, అయితే విజయవంతమైన వివాహాలకు, సంతోషభరితమైన కుటుంబ బాంధవ్యాలకు, సంతృప్తికరమైన స్నేహానికీ ఇది చాలా అవసరం. కాబట్టి, యెహోవా నిజమైన సేవకుడు తన జీవితంలో ప్రాముఖ్యమైన వాటికి స్థానం లేకుండా పోయేంతగా, సహజంగానే ఉండే స్వార్థానికి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే ఆయన ఆరాధించే దేవుడైన యెహోవాకు సంబంధించిన విషయాలకు మొట్టమొదటి స్థానం ఇవ్వాలని దీని భావం.

15 స్వార్థపూరిత దృక్పథం ఒక వ్యక్తి స్వనీతిపరునిగా మారేందుకు దారితీసి, చివరకు అతనిని సంకుచిత స్వభావిగా, అహంకారిగా మార్చగలదు. బైబిలు సరిగ్గానే ఇలా చెబుతోంది: “తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు.” (రోమీయులు 2:⁠1; 14:4, 10) యేసు కాలంనాటి మతనాయకులు తమ స్వనీతిలో ఎంతగా పాతుకుపోయారంటే, యేసును ఆయన అనుచరులను ఆక్షేపించే అర్హత తమకున్నట్లు భావించారు. అలా చేయడం ద్వారా, వారు తమను తాము న్యాయాధిపతులుగా చేసుకున్నారు. తమ సొంత తప్పులను తెలుసుకోనందుకు వారు తమకు తామే తీర్పు విధించుకున్నారు.

16 యేసును అప్పగించిన ఆయన అనుచరుడైన యూదా తనను తాను ఇతరులకు తీర్పుతీర్చే వ్యక్తిగా చేసుకున్నాడు. బేతనియలో, లాజరు సహోదరి మరియ యేసును సుగంధ తైలముతో అభిషేకించిన సందర్భంలో యూదా ఆమె చర్యను తీవ్రంగా ఆక్షేపించాడు. అతను కోపంతో ఇలా వాదించాడు: ‘ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు?’ అయితే ఆ నివేదిక ఇంకా ఇలా చెబుతోంది: “వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.” (యోహాను 12:1-6) త్వరపడి ఇతరులకు తీర్పుతీరుస్తూ, స్వయంగా తమ మీదికే తీర్పు తెచ్చుకున్న యూదాలా లేదా ఆ మతనాయకుల్లా మనం ఎన్నడూ తయారవకూడదు.

17 తొలి క్రైస్తవుల్లో కొందరు యూదాలా దొంగలు కాకపోయినా, విషాదకరంగా అహంకారానికి, డాంబికత్వానికి బలయ్యారు. వారి గురించి యాకోబు ఇలా వ్రాశాడు: “మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు.” ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఇట్టి అతిశయమంతయు చెడ్డది.” (యాకోబు 4:16) యెహోవా సేవలో మనం సాధించిన దాని గురించి లేదా మన ఆధిక్యతల గురించి ప్రగల్భాలు పలకడం స్వీయ ఓటమే అవుతుంది. (సామెతలు 14:16) ఒక సందర్భంలో అపొస్తలుడైన పేతురు ప్రగల్భాలు పలుకుతూ “నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడను. . . . నేను నీతో చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పను” అన్నప్పుడు ఆయనకు ఏమి జరిగిందో మనం గుర్తుతెచ్చుకోవచ్చు. నిజానికి మనం గొప్పలు చెప్పుకోదగినదేదీ మనలో లేదు. మనం అనుభవిస్తున్న ప్రతీదీ మనకు యెహోవా కృపవల్లనే లభించింది. దీనిని గుర్తుపెట్టుకోవడం మనల్ని అతిశయపడకుండా చేస్తుంది.​—⁠మత్తయి 26:33-35, 69-75.

18 “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును” అని మనకు చెప్పబడింది. ఎందుకు? ఎందుకో యెహోవా ఇలా జవాబిస్తున్నాడు: “గర్వము అహంకారము . . . నాకు అసహ్యములు.” (సామెతలు 8:13; 16:18) కాబట్టి యెహోవా “అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు” ఆగ్రహించడంలో ఆశ్చర్యం లేదు. (యెషయా 10:​12) యెహోవా అతణ్ణి శిక్షించాడు. త్వరలోనే సాతాను ప్రపంచంతోపాటు దానిలోని గర్విష్ఠులు, అహంకారులైన దృశ్య, అదృశ్య నాయకులందరూ శిక్షింపబడతారు. మనం యెహోవా విరోధుల మూర్ఖపు దృక్పథాన్ని ఎన్నటికీ అనుకరించకుండా ఉందము గాక!

19 నిజ క్రైస్తవులు తాము యెహోవా సేవకులై ఉన్నందుకు అతిశయించడం సహేతుకమే. (యిర్మీయా 9:24) అయితే అదే సమయంలో వారు వినయస్థులుగా కూడా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమీయులు 3:​23) కాబట్టి యెహోవా సేవకులుగా మనం మన స్థానాన్ని కాపాడుకోవాలంటే అపొస్తలుడైన పౌలుకున్నటువంటి దృక్పథమే మనకూ ఉండాలి. “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను” అని చెబుతూ “అట్టివారిలో నేను ప్రధానుడను” అని ఆయన అన్నాడు.​—⁠1 తిమోతి 1:​15.

20 యెహోవా ప్రజలు దేవుని విషయాలకు ప్రథమస్థానం ఇచ్చేలా తమ వ్యక్తిగత విషయాలను రెండవ స్థానంలోకి నెట్టడానికి ఆనందిస్తారు కాబట్టి, యెహోవా వారిని ఆధ్యాత్మికంగా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. మహాశ్రమలు సంభవించినప్పుడు, యెహోవా తన ప్రజలను ఆధ్యాత్మికంగానే కాక, భౌతికంగా కూడా కాపాడతాడని కూడా మనం ధైర్యంగా ఉండవచ్చు. దేవుని నూతనలోకంలో ప్రవేశిస్తూనే వారు, “ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము” అని ఆనందంతో కేకలు వేయగలుగుతారు.​—⁠యెషయా 25:⁠9.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

రాజైన దావీదు, యేసుక్రీస్తు ఎలా కాపాడబడ్డారు?

యెహోవా ప్రజలు నేడు ఎలా కాపాడబడుతున్నారు?

మనం స్వార్థపూరితంగా ఎందుకు ఉండకూడదు?

మనం అతిశయించేందుకు కారణం ఉన్నప్పటికీ వినయస్థులుగా ఎందుకు ఉండాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. రాజైన దావీదు యెహోవాను ఏమని వేడుకున్నాడు, ఆ విన్నపం ప్రస్తుతం ఎలాంటి అంగీకారం పొందింది?

2. యెహోవా కాపాడతాడనే మాటను అర్థం చేసుకోవడానికి లేఖనాలు మనకు ఎలా సహాయం చేస్తున్నాయి?

3. క్రీస్తుయేసును యెహోవా కాపాడాడు అనేందుకు మనకు ఎలాంటి రుజువు ఉంది, దాని ఫలితం ఏమిటి?

4. అభిషిక్త క్రైస్తవులకూ, ‘వేరేగొఱ్ఱెలకూ’ ఎలాంటి హామీ ఇవ్వబడింది?

5, 6. (ఎ) ఆధునిక కాలాల్లో దేవుని ప్రజలు ఎలా కాపాడబడుతున్నారు? (బి) అభిషిక్తులకు యెహోవాతో ఎలాంటి సంబంధం ఉంది, మరి భూ నిరీక్షణగల వారి విషయం ఏమిటి?

7. యెహోవా నేడు తన ప్రజల ఆధ్యాత్మిక సంక్షేమాన్ని దేని మూలంగా కాపాడుతున్నాడు?

8. యెహోవాకు తన భక్తుల విషయంలో ఎలాంటి నమ్మకం ఉంది, వారికి ఎలాంటి హామీ ఉంది?

9, 10. (ఎ) యెహోవా సత్యత్వం తన ప్రజలను ఎలా కాపాడుతుంది? (బి) యెహోవా తన కృపచేత తన భక్తులను కాపాడతాడని బైబిలు ఎలా చూపిస్తోంది?

11, 12. బుద్ధి, వివేచన, జ్ఞానము మనలను ఎలా కాపాడతాయో వివరించండి.

13, 14. స్వార్థపరునిగా ఉండడం అంటే అర్థమేమిటి, అలా కావడం ఎందుకు జ్ఞానయుక్తం కాదు?

15, 16. (ఎ) స్వార్థపూరిత దృక్పథం దేనికి నడిపించగలదు, దానికి ఎవరు ఉదాహరణగా ఉన్నారు? (బి) త్వరపడి ఇతరులకు తీర్పుతీర్చేటప్పుడు నిజానికి ఒక వ్యక్తి ఏమి చేస్తున్నాడు?

17. అతిశయించడంలో లేదా అతిగా ప్రగల్భాలు పలకడంలో ఉన్న ప్రమాదాన్ని సోదాహరణంగా చెప్పండి.

18. అహంకారం విషయంలో యెహోవా మనోభావం ఎలా ఉంది?

19. దేవుని ప్రజలు ఏ విధంగా అతిశయించేవారిగా ఉన్నప్పటికీ వినయస్థులుగా ఉన్నారు?

20. యెహోవా తన ప్రజలను ఇప్పుడు ఎలా కాపాడుతున్నాడు, భవిష్యత్తులో ఆయన వారిని ఎలా కాపాడతాడు?

[9వ పేజీలోని చిత్రాలు]

దావీదును, యేసును యెహోవా ఎలా కాపాడాడు?

[10, 11వ పేజీలోని చిత్రాలు]

దేవుని ప్రజలు నేడు ఏయే విధాలుగా ఆధ్యాత్మికంగా కాపాడబడుతున్నారు?

[12వ పేజీలోని చిత్రాలు]

యెహోవా సేవ చేయగలుగుతున్నందుకు మనం అతిశయించినా, మనం అన్ని సమయాల్లో వినయస్థులుగా ఉండాలి