కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సువర్తమానము ప్రకటించడం’

‘సువర్తమానము ప్రకటించడం’

‘సువర్తమానము ప్రకటించడం’

‘సువర్తమానము ప్రకటించువారి పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.’​—⁠యెషయా 52:⁠7.

నేటి ప్రపంచంలోని ప్రజలు చెడు వార్తల సుడిగుండంలో ఉన్నట్లు భావిస్తున్నారు. రేడియో పెడితేచాలు, భూమ్మీద ప్రబలుతున్న మరణకరమైన వ్యాధుల గురించిన భయానకమైన నివేదికలే వినిపిస్తాయి. టీవీలో వార్తలు చూస్తే, ఆకలితో అలమటిస్తూ సహాయం కోసం ఆర్తిగా అంగలార్చే పిల్లల రూపాలే కనిపిస్తాయి. వార్తాపత్రికల్లో, భవంతుల్ని ఛిన్నాభిన్నం చేస్తూ అనేకమంది అమాయకుల్ని పొట్టనబెట్టుకుంటున్న బాంబు విస్ఫోటనాల వార్తలే ఉంటాయి.

2 అవును, ప్రతీరోజు భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ లోక పరిస్థితి మారిపోతూ, అంతకంతకూ దిగజారిపోతోంది. (1 కొరింథీయులు 7:31) కొన్నిసార్లు ఈ లోకం మొత్తం “అగ్నికి ఆహుతి కాబోతున్నట్లు” అనిపిస్తోందని పశ్చిమ యూరప్‌లోని ఒక వార్తాపత్రిక వ్యాఖ్యానించింది. ఎంతోమంది కలత చెందుతున్నారంటే అది అర్థం చేసుకోదగినదే! అమెరికాలో టీవీ వార్తలకు సంబంధించిన ఒక సర్వేలో ఒక వ్యక్తి అన్నమాటలు నిస్సందేహంగా కోట్లాదిమంది మనోభావాలను ప్రతిధ్వనిస్తున్నాయి, ఆయనిలా అన్నాడు: ‘వార్తలు చూసిన తర్వాత, నేను పూర్తిగా కృంగిపోతాను. వచ్చేవన్నీ దుర్వార్తలే. అవెంతో నిరాశకు గురిచేస్తాయి.’

ప్రతి ఒక్కరూ వినవలసిన వార్త

3 ఇలాంటి అంధకారపు లోకంలో మంచివార్త అంటూ ఏదైనా ఉండగలదా? నిస్సందేహంగా ఉండగలదు! బైబిలు ఒక సువార్తను ప్రకటిస్తోందని తెలుసుకోవడం ఓదార్పుకరంగా ఉంటుంది. అనారోగ్యం, ఆకలి, నేరం, యుద్ధమే కాక ఇతరత్రా అన్ని రకాల అణచివేతలను కూడా దేవుని రాజ్యం అంతం చేస్తుందనేదే ఆ వార్త. (కీర్తన 46:⁠9; 72:​12) అది ప్రతి ఒక్కరూ వినవలసిన వార్త కాదా? యెహోవాసాక్షులు అలాగే భావిస్తారు. ఆ కారణంగానే వారు సకల జనములతో దేవుని రాజ్య సువార్తను పంచుకోవాలని చేసే ఎడతెగని ప్రయత్నాలకు ప్రతిచోటా పేరుగాంచారు.​—⁠మత్తయి 24:⁠14.

4 అంతగా ప్రతిస్పందనలేని క్షేత్రాల్లో కూడా ఈ సువార్తను సంతృప్తికరంగా, అర్థవంతంగా ప్రకటించడంలో ఎల్లప్పుడూ భాగం వహించడానికి మనమేమి చేయవచ్చు? (లూకా 8:15) మన ప్రకటనా పనికి సంబంధించిన మూడు ప్రధానాంశాలను క్లుప్తంగా సమీక్షించడం నిస్సందేహంగా సహాయం చేస్తుంది. మనం (1) మన ఉద్దేశాన్ని లేదా ఎందుకు ప్రకటిస్తామనేదాన్ని; (2) మన సందేశాన్ని లేదా ఏమి ప్రకటిస్తామనేదాన్ని; (3) మన విధానాల్ని లేదా ఎలా ప్రకటిస్తామనేదాన్ని పరిశీలించుకోవచ్చు. మన ఉద్దేశాన్ని స్వచ్ఛంగా, మన సందేశాన్ని స్పష్టంగా, మన పద్ధతులను సమర్థవంతంగా ఉంచుకోవడం ద్వారా అనేక రకాల ప్రజలు శ్రేష్ఠమైన సువార్తను, అంటే దేవుని రాజ్య సువార్తను వినే అవకాశమిచ్చిన వాళ్ళమవుతాం. *

మనం సువార్త ప్రకటించడంలో ఎందుకు భాగం వహిస్తాం?

5 మొదటి అంశాన్ని అంటే మన ఉద్దేశాన్ని పరిశీలిద్దాం. సువార్తను మనం ఎందుకు ప్రకటిస్తాం? యేసుకున్న కారణమే మనకూ ఉంది. ఆయనిలా అన్నాడు: “నేను తండ్రిని ప్రేమించుచున్నాను.” (యోహాను 14:31; కీర్తన 40:⁠8) అన్నింటికంటే మిన్నగా, దేవునిపట్ల మనకున్న ప్రేమచేతనే మనం పురికొల్పబడతాం. (మత్తయి 22:​37, 38) బైబిలు దేవునిపట్ల ప్రేమను, పరిచర్యతో ముడిపెడుతోంది, అందుకే అదిలా చెబుతోంది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.” (1 యోహాను 5:3; యోహాను 14:​21) దేవుని ఆజ్ఞల్లో, ‘వెళ్లి శిష్యులను చేయండి’ అని ఇవ్వబడిన ఆజ్ఞ కూడా ఉందా? (మత్తయి 28:​19) ఉంది. నిజమే, ఆ మాటలు పలికింది యేసే, కానీ అవి యెహోవానుండి వచ్చిన మాటలే. అలాగని ఎందుకు అనవచ్చు? యేసు ఇలా వివరించాడు: “నా అంతట నేనే యేమియుచేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను.” (యోహాను 8:28; మత్తయి 17:⁠5) కాబట్టి, ప్రకటించమనే ఆజ్ఞకు లోబడినప్పుడు, యెహోవాను ప్రేమిస్తున్నామని మనం ఆయనకు చూపిస్తాం.

6 అంతేకాక, యెహోవాపట్ల మనకున్న ప్రేమ, ప్రకటించేలా మనలను పురికొల్పుతుంది, ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా సాతాను వ్యాపింపజేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని మనం కోరుకుంటాం. (2 కొరింథీయులు 4:⁠4) దేవుని పరిపాలనా సత్యత్వాన్ని సాతాను వివాదంలోకి లాగాడు. (ఆదికాండము 3:​1-5) యెహోవాసాక్షులుగా మనం సాతాను అపవాదులను బహిర్గతం చేసి, మానవాళి ఎదుట దేవుని నామాన్ని పరిశుద్ధపరచాలని కోరుకుంటాం. (యెషయా 43:​10-12) అంతేకాక, యెహోవా లక్షణాలను, మార్గాలను మనం తెలుసుకున్న కారణాన్నిబట్టి కూడా మనం పరిచర్యలో భాగం వహిస్తాం. మన దేవునికి సన్నిహితంగా ఉన్నామని భావిస్తూ, ఆయన గురించి ఇతరులకు చెప్పాలని మనం బలంగా కోరుకుంటాం. వాస్తవానికి, యెహోవా మంచితనం, ఆయన నీతియుక్త మార్గాలు మనకెంత ఆనందకరమంటే, మనమాయన గురించి మాట్లాడకుండా ఉండలేం. (కీర్తన 145:​7-12) ఆయనను స్తుతించడానికి, వినే వారందరికీ ఆయన “గుణాతిశయములను” ప్రచురించడానికి మనం ప్రేరణ పొందుతాం.​—⁠1 పేతురు 2:9; యెషయా 43:⁠21.

7 పరిచర్యలో నిరంతరం కొనసాగడానికి మరో ముఖ్య కారణం ఉంది. అదేమిటంటే, దుర్వార్తల సుడిగుండంలో ఉన్నవారిని, ఏదోక కారణంచేత బాధపడుతున్న వ్యక్తులను ఓదార్చాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ విషయంలో మనం యేసును అనుకరించడానికి కృషి చేస్తాం. ఉదాహరణకు, మార్కు 6వ అధ్యాయంలో వర్ణించబడిన విషయాన్ని గమనించండి.

8 అపొస్తలులు ప్రకటనా పనినుండి తిరిగివచ్చి వారు చేసినది, బోధించినది అంతా యేసుకు వివరిస్తారు. అపొస్తలులు అలసిపోయారని గమనించిన యేసు తనతోపాటు వచ్చి “కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని” వారికి చెబుతాడు. దానితో వారు ఒక పడవ ఎక్కి ఏకాంత ప్రదేశానికి బయల్దేరి వెళతారు. కానీ ప్రజలు తీరం వెంట పరుగెత్తుకుంటూ వెళ్ళి వారిని కలుసుకుంటారు. యేసు అప్పుడు ఏమి చేశాడు? ‘యేసు ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను అని ఆ నివేదిక చెబుతోంది. (మార్కు 6:​31-34) తాను అలసిపోయినప్పటికీ, మానక సువార్తను పంచుకొనేలా కనికరం యేసును పురికొల్పింది. కాబట్టి, యేసుకు ఆ ప్రజలపట్ల తదనుభూతి ఉందనేది స్పష్టం. ఆయన వారిమీద కనికరపడ్డాడు.

9 ఈ వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకుంటాం? క్రైస్తవులుగా మనకు సువార్త ప్రకటిస్తూ, శిష్యులను చేసే బాధ్యత ఉందని భావిస్తాం. ‘మనుష్యులందరు రక్షణపొందాలనేది’ దేవుని చిత్తం కాబట్టి, సువార్త ప్రకటించే బాధ్యత మనకుందని మనం గుర్తిస్తాం. (1 తిమోతి. 2:⁠4) అయితే, మన పరిచర్యను ఒక బాధ్యతగానే కాక, కనికరంతో కూడా చేస్తాం. యేసులాగే మనకు కూడా ప్రజలపట్ల కనికరముంటే, వారితో ఎల్లప్పుడూ సువార్తను పంచుకోవడానికి మనం శాయశక్తులా కృషి చేసేందుకు మన హృదయం మనల్ని ప్రేరేపిస్తుంది. (మత్తయి 22:39) పరిచర్యలో పాల్గొనేందుకు అలాంటి చక్కని ఉద్దేశాలు ఉండడం, నిర్విరామంగా సువార్త ప్రకటించడానికి మనల్ని పురికొల్పుతుంది.

మన సందేశం​—⁠దేవుని రాజ్య సువార్త

10 మన పరిచర్యలోని రెండవ అంశం అంటే మన సందేశం మాటేమిటి? మనం ఏమి ప్రకటిస్తాం? మనం ప్రకటించే సందేశాన్ని యెషయా ప్రవక్త రమ్యంగా ఇలా వర్ణిస్తున్నాడు: “సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.”​—⁠యెషయా 52:⁠7.

11 ఈ లేఖనంలో “నీ దేవుడు ఏలుచున్నాడు” అనే ముఖ్యమైన మాటలు, మనం ప్రకటించవలసిన సందేశాన్ని అంటే, దేవుని రాజ్య సువార్తను నొక్కి చెబుతున్నాయి. (మార్కు 13:10) ఈ వచనం మన సందేశానికున్న ఆశాజనక నైజాన్ని కూడా వెల్లడిస్తుందని గమనించండి. యెషయా “రక్షణ,” “సువార్త,” “సమాధానము,” “సువర్తమానము” వంటి పదాలను ఉపయోగించాడు. యెషయా చనిపోయిన అనేక శతాబ్దాల తర్వాత సా.శ. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు, రానున్న దేవుని రాజ్యం గురించిన సువర్తమానమును ప్రకటించడంలో అత్యంతాసక్తిగల మాదిరిని ఉంచడం ద్వారా ఈ ప్రవచనాన్ని విశేషమైన రీతిలో నెరవేర్చాడు. (లూకా 4:43) ఆధునిక కాలాల్లో ప్రత్యేకించి 1919 నుండి, సుస్థాపిత దేవుని రాజ్య సువార్తనూ, అది తీసుకొచ్చే ఆశీర్వాదాలనూ అభినివేశంతో ప్రకటించడం ద్వారా యెహోవాసాక్షులు యేసు మాదిరిని అనుకరించారు.

12 ఈ రాజ్య సువార్తకు స్పందించే వారిపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? యేసు కాలంలోలాగే, నేడు కూడా ఆ సువార్త నిరీక్షణను, ఓదార్పును ఇస్తుంది. (రోమీయులు 12:​12; 15:4) మంచికాలాలు ముందున్నాయని నమ్మడానికి బలమైన కారణాలున్నాయని యథార్థ హృదయులు తెలుసుకుంటారు కాబట్టి, అది వారికి నిరీక్షణనిస్తుంది. (మత్తయి 6:9, 10; 2 పేతురు 3:13) అలాంటి నిరీక్షణ, దైవభక్తిగల ప్రజలు భవిష్యత్తుపట్ల సానుకూలమైన దృక్కోణాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయం చేస్తుంది. వారు “దుర్వార్తకు జడియరు” అని కీర్తనకర్త చెబుతున్నాడు.​—⁠కీర్తన 112:​1, 7.

‘నలిగిన హృదయముగలవారిని దృఢపరిచే’ సందేశం

13 అంతేకాక, మనం ప్రకటించే సువార్త దానిని వినేవారికి తక్షణమే ఉపశమనాన్ని, ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. ఎలా? ఆ ఆశీర్వాదాలను కొన్నింటిని యెషయా ప్రవక్త సూచించాడు. “ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయముగల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును” అని ఆయన ప్రవచించాడు.​—⁠యెషయా 61:1, 2; లూకా 4:​16-21.

14 ఆ ప్రవచనం ప్రకారం, సువార్తను ప్రకటించడం ద్వారా, యేసు ‘నలిగిన హృదయంగలవారిని దృఢపరుస్తాడు.’ యెషయా ఎంత భావగర్భితంగా వర్ణించాడో కదా! ఒక బైబిలు నిఘంటువు ప్రకారం, “దృఢపరచు” అని అనువదించబడిన హీబ్రూ పదం “తరచూ వైద్య సంబంధంగా గాయం మానడానికి కట్టు ‘కట్టడం’ అనే భావంలో ఉపయోగించబడింది.” శ్రద్ధచూపే ఒక నర్సు క్షతగాత్రునికి అవసరమైన ఉపశమనం కోసం, అతని గాయానికి గట్టిగా కట్టు కడుతుంది. అదేవిధంగా శ్రద్ధచూపే ప్రచారకులు రాజ్య సందేశం ప్రకటించేటప్పుడు, ఏదోక రీతిలో బాధ అనుభవిస్తున్న వారికి, ప్రతిస్పందించే వారికి సహాయం చేస్తారు. అవసరంలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడం ద్వారా వారు యెహోవా శ్రద్ధను ప్రతిబింబిస్తారు. (యెహెజ్కేలు 34:​15, 16) దేవుని గురించి కీర్తనకర్త ఇలా చెబుతున్నాడు: “గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు.”​—⁠కీర్తన 147:⁠3.

రాజ్య సందేశం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

15 నలిగిన హృదయంగలవారికి రాజ్య సందేశం నిజంగా ఎలా మద్దతిచ్చిందో, వారిని బలపరిచిందో వివరించే నిజ జీవిత ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దక్షిణ అమెరికాలో నివసిస్తున్న ఒరెయానా అనే ఒక వృద్ధురాలి విషయమే పరిశీలించండి. ఆమెకు జీవితంపై ఆశ సన్నగిల్లింది. యెహోవాసాక్షి ఒకరు ఒరెయానాను సందర్శిస్తూ, ఆమెకు బైబిలు, నా బైబిలు కథల పుస్తకము * చదివి వినిపించడం మొదలుపెట్టింది. నిరాశతోవున్న ఆ స్త్రీ మొదట్లో పడుకునే కళ్లుమూసుకుని, అప్పుడప్పుడు నిట్టూరుస్తూ వింటుండేది. అయితే కొద్దిరోజుల్లోనే, ఆమె తన పడకమీదే లేచి కూర్చొని వినడానికి ప్రయత్నించడం ఆరంభించింది. మరికొన్ని రోజుల తర్వాత, ఆమె ముందు గదిలో కుర్చీలో కూర్చొని తన బైబిలు టీచరు కోసం వేచి చూడడం ఆరంభించింది. ఆ తర్వాత, ఆ స్త్రీ రాజ్యమందిరంలో క్రైస్తవ కూటాలకు హాజరవడం ఆరంభించింది. ఆ కూటాల్లో తాను నేర్చుకున్న విషయాల ద్వారా ప్రోత్సహించబడి, తన ఇంటివైపు వెళ్తున్న వారికి బైబిలు సాహిత్యాలు అందించడం ఆరంభించింది. ఆ పిమ్మట తన 93వ ఏట ఆమె ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకుంది. రాజ్య సందేశం ఆమెలో బ్రతకాలనే ఆశను చిగురింపజేసింది.​—⁠సామెతలు 15:​30; 16:⁠24.

16 వ్యాధి కారణంగా తాము మరణిస్తామని తెలిసిన వారికి కూడా రాజ్య సందేశం ఆసరాగా నిలుస్తుంది. ఉదాహరణకు, పశ్చిమ ఐరోపాలో నివసిస్తున్న మారీయా విషయమే తీసుకోండి. ప్రాణాంతకమైన వ్యాధి రావడంతో ఆమె ఆశలన్నీ అడుగంటాయి. ఒక యెహోవాసాక్షి ఆమెను సందర్శించే సమయానికి ఆమె మానసికంగా బాగా కృంగిన దశలో ఉంది. కానీ ఆమె దేవుని సంకల్పాల గురించి తెలుసుకున్నప్పుడు, ఆమె జీవితం మళ్లీ అర్థవంతంగా తయారైంది. ఆమె బాప్తిస్మం తీసుకొని ప్రకటనా పనిలో చాలా చురుగ్గా పాల్గొంది. ఆమె జీవితపు ఆఖరి రెండు సంవత్సరాల్లో, ఆమె కళ్లు నిరీక్షణతో, సంతోషంతో ప్రకాశించాయి. పునరుత్థానంపై దృఢమైన నిరీక్షణతో మారీయా కన్నుమూసింది.​—⁠రోమీయులు 8:38, 39.

17 బైబిలు సత్యాల కోసం పరితపించేవారి జీవితాలపై రాజ్య సందేశం చూపించే ప్రభావానికి అలాంటి నివేదికలు సాక్ష్యమిస్తున్నాయి. ప్రియమైనవారు మరణించడంవల్ల దుఃఖిస్తున్నవారు పునరుత్థాన నిరీక్షణ గురించి తెలుసుకున్నప్పుడు నూతన శక్తి పొందుతారు. (1 థెస్సలొనీకయులు 4:13) బీదరికంతోవుండి తమ కుటుంబాలను పోషించుకోవడానికి సతమతమవుతున్న ప్రజలు, యెహోవా తనపట్ల విశ్వసనీయంగా ఉన్నవారిని ఎన్నడూ ఎడబాయడని తెలుసుకున్నప్పుడు, వారిలో నూతన గౌరవం, ధైర్యం పొందామన్న భావన కలుగుతుంది. (కీర్తన 37:28) మానసికంగా తీవ్ర కృంగుదలకు గురైనవారు యెహోవా సహాయంతో తట్టుకునే శక్తిని, కొందరి విషయంలో ఆ రుగ్మతను అధిగమించే శక్తిని క్రమేణా వృద్ధి చేసుకున్నారు. (కీర్తన 40:1, 2) అవును, యెహోవా తన వాక్యంద్వారా శక్తినిస్తూ ఇప్పుడు సహితం ‘కృంగిపోయిన వారందరిని లేవనెత్తుతున్నాడు.’ (కీర్తన 145:​14) మన క్షేత్రంలో, మన సంఘంలో నలిగిన హృదయంగలవారికి దేవుని రాజ్య సువార్త తీసుకొచ్చే ఓదార్పును గమనించడం ద్వారా, నేడు మన దగ్గర ఉత్తమవార్త ఉందని మనం పదేపదే గుర్తు చేయబడుతున్నాం.​—⁠కీర్తన 51:⁠17.

‘వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన’

18 మన సందేశంలో ఉత్తమవార్త ఉన్నప్పటికీ, చాలామంది దానిని తిరస్కరిస్తారు. అది మనలను ఎలా ప్రభావితం చేయవచ్చు? అది అపొస్తలుడైన పౌలును ప్రభావితం చేసినట్లే మనల్నీ ప్రభావితం చేయవచ్చు. ఆయన తరచూ యూదులకు ప్రకటించాడు, అయితే చాలామంది ఆ రక్షణ సందేశాన్ని తిరస్కరించారు. వారి తిరస్కారం పౌలును చాలా ప్రభావితం చేసింది. ఆయన ఇలా ఒప్పుకున్నాడు: “నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.” (రోమీయులు 9:1) పౌలు తాను ప్రకటించిన యూదులపై కనికరపడ్డాడు. వారు సువార్తను తిరస్కరించడం ఆయనకు దుఃఖం కలిగించింది.

19 మనం కూడా కనికరంతోనే సువార్తను ప్రకటిస్తాం. కాబట్టి రాజ్య సందేశాన్ని అధికశాతం మంది తిరస్కరించినప్పుడు మనం నిరుత్సాహపడతామనేది అర్థం చేసుకోదగినదే. అలాంటి ప్రతిస్పందన, మనం ప్రకటించేవారి ఆధ్యాత్మిక సంక్షేమంపట్ల మనకు నిజమైన శ్రద్ధ ఉందని చూపిస్తుంది. అయితే అపొస్తలుడైన పౌలు మాదిరిని మనం గుర్తుపెట్టుకోవాలి. తన ప్రకటనా పనిలో కొనసాగడానికి ఆయనకు ఏమి సహాయం చేసింది? యూదులు సువార్తను తిరస్కరించడం పౌలును దుఃఖపరచి, ఆయనకు వేదన కలిగించినా, వారికి సహాయం చేయడం అసాధ్యమని ఆయన యూదులందరి విషయంలో ఆశవదులుకోలేదు. వారిలో కొంతమందైనా క్రీస్తును అంగీకరిస్తారని ఆయన నిరీక్షించాడు. అందువల్లే, ఆ యూదులపట్ల తన భావాలను వ్యక్తంచేస్తూ పౌలు ఇలా వ్రాశాడు: “ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి.”​—⁠రోమీయులు 10:⁠1.

20 పౌలు నొక్కిచెప్పిన రెండు విషయాలను గమనించండి. కొందరైనా రక్షణ పొందాలని ఆయన హృదయపూర్వకంగా అభిలషించాడు, ఆ మేరకు ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. నేడు మనం పౌలు మాదిరిని అనుకరిస్తాం. సువార్త విషయంలో సరైన మనోవైఖరిగల వారిని కనుగొనాలనే మన హృదయాభిలాషను కాపాడుకుంటాం. అలాంటి వారిని కనుగొని, వారి రక్షణకు నడిపించే మార్గాన్ని అనుసరించేలా వారికి సహాయం చేయగలగాలని మనం ఎల్లప్పుడూ యెహోవాకు ప్రార్థిస్తాం.​—⁠సామెతలు 11:30; యెహెజ్కేలు 33:11; యోహాను 6:⁠44.

21 అయితే రాజ్య సందేశాన్ని చాలామందికి చేరవేసేందుకు, మనం ఎందుకు ప్రకటిస్తాం, ఏమి ప్రకటిస్తాం అనే వాటికే కాక, ఎలా ప్రకటిస్తాం అనేదానికి కూడా శ్రద్ధనివ్వాలి. ఈ అంశం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 7 ఈ ఆర్టికల్‌లో మొదటి రెండు అంశాలు పరిశీలించబడతాయి. రెండవ ఆర్టికల్‌ మూడవ అంశాన్ని పరిశీలిస్తుంది.

^ పేరా 22 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరేమి నేర్చుకున్నారు?

మనం ఏ కారణాలనుబట్టి పరిచర్యలో భాగం వహిస్తాం?

మనం ప్రకటించే ముఖ్య సందేశం ఏమిటి?

రాజ్య సందేశాన్ని అంగీకరించేవారు ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తారు?

మన పరిచర్యలో కొనసాగడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) ప్రతీరోజు ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి? (బి) ఎల్లప్పుడూ దుర్వార్తలు వినడం గురించి చాలామంది ఎలా స్పందిస్తున్నారు?

3. (ఎ) బైబిలు ఎలాంటి సువార్తను ప్రకటిస్తోంది? (బి) రాజ్య సువార్తను మీరెందుకు విలువైనదిగా పరిగణిస్తారు?

4. ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో మన పరిచర్యకు సంబంధించిన ఏ అంశాలను మనం పరిశీలిస్తాం?

5. (ఎ) అన్నింటికంటే మిన్నగా, పరిచర్యలో భాగం వహించడానికి మనలను పురికొల్పేది ఏమిటి? (బి) ప్రకటించమనే బైబిలు ఆజ్ఞకు లోబడడం దేవునిపట్ల మన ప్రేమకు గుర్తు అని ఎందుకు చెప్పవచ్చు?

6. దేవునిపట్ల ప్రేమ, ప్రకటించడానికి మనల్ని ఏయే విధాలుగా ప్రేరేపిస్తుంది?

7. దేవునిపట్ల ప్రేమే కాక, మరింకే ముఖ్యమైన కారణంతో మనం ప్రకటనా పనిలో భాగం వహిస్తాం?

8. ప్రజలపట్ల యేసుకున్న భావాల గురించి మార్కు 6వ అధ్యాయంలోని వృత్తాంతం ఏమి చెబుతోంది?

9. మన ప్రకటనా పనికి సంబంధించిన సరైన ఉద్దేశం గురించి మార్కు 6వ అధ్యాయంలోని వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకుంటాం?

10, 11. (ఎ) మనం ప్రకటించే సందేశాన్ని యెషయా ఎలా వర్ణిస్తున్నాడు? (బి) యేసు సువర్తమానమును ఎలా ప్రకటించాడు, ఆధునిక కాలాల్లోని దేవుని సేవకులు యేసు మాదిరిని ఎలా అనుకరించారు?

12. రాజ్య సువార్తను అంగీకరించేవారిపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

13. సువార్తను అంగీకరించేవారికి లభించే తక్షణ ఆశీర్వాదాలను యెషయా ప్రవక్త ఎలా వర్ణిస్తున్నాడు?

14. (ఎ) ‘నలిగిన హృదయంగలవారిని దృఢపరుచుట’ అనే మాట రాజ్య సందేశం గురించి ఏమి సూచిస్తోంది? (బి) నలిగిన హృదయంగలవారిపట్ల యెహోవా శ్రద్ధను మనం ఏ విధంగా ప్రతిబింబిస్తాం?

15, 16. అవసరంలో ఉన్న వారికి రాజ్య సందేశం మద్దతిచ్చి, బలపర్చే విధాన్ని ఏ నిజ జీవిత ఉదాహరణలు వివరిస్తున్నాయి?

17. (ఎ) రాజ్య సందేశాన్ని అంగీకరించేవారి జీవితాలపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? (బి) యెహోవా ‘కృంగిపోయిన వారందరిని లేవనెత్తుతున్నాడని’ మీరు వ్యక్తిగతంగా ఏయే విధాలుగా అనుభవించారు?

18. యూదులు సువార్తను తిరస్కరించడం పౌలును ఎలా ప్రభావితం చేసింది, ఎందుకు?

19. (ఎ) మనం కొన్నిసార్లు నిరుత్సాహపడవచ్చనేది ఎందుకు అర్థం చేసుకోదగినదే? (బి) తన ప్రకటనా పనిలో కొనసాగడానికి పౌలుకు సహాయం చేసినదేమిటి?

20, 21. (ఎ) మన పరిచర్యకు సంబంధించి, మనం పౌలు మాదిరిని ఎలా అనుకరించవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మన పరిచర్యకు సంబంధించి ఏ అంశం పరిశీలించబడుతుంది?

[18వ పేజీలోని చిత్రాలు]

రాజ్య సందేశం నలిగిన హృదయంగలవారిని బలపరుస్తుంది

[20వ పేజీలోని చిత్రాలు]

పరిచర్యలో ఓపికగా కొనసాగడానికి ప్రార్థన మనకు సహాయం చేస్తుంది