సుదీర్ఘ ప్రయాణంవల్ల ప్రతిఫలం లభించింది
సుదీర్ఘ ప్రయాణంవల్ల ప్రతిఫలం లభించింది
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి వచ్చిన ఒక రిపోర్టు, లీసాలాలో జరగబోయే “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశానికి వెళ్ళడానికి యుద్ధ పీడిత ప్రాంతంలో సుదీర్ఘ ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సహోదరీల గురించి తెలియజేసింది. వారు సమావేశంలో ఆధ్యాత్మిక ఉపదేశాన్ని, క్రైస్తవ సహవాసాన్ని ఆస్వాదించాలని ఆశించారు. అంతేకాకుండా కిన్షాసాలోవున్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం నుండి సమావేశానికి వస్తున్న ప్రతినిధులను కలుసుకోవాలని కూడా వారు అనుకున్నారు. దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా, వారు చాలా సంవత్సరాలుగా బ్రాంచి కార్యాలయంలోని ఎవరినీ కలవలేదు కాబట్టి వారిని కలవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్నారు.
ఆ ఇద్దరు సహోదరీలు బసాన్కుసు నుండి లీసాలాకు అడవులగుండా, రెండు నదుల మీదుగా పడవలో 300 కిలోమీటర్లు ప్రయాణించారు. వారి ప్రయాణానికి మూడు వారాలు పట్టింది. వారిలో ఒకరు 3 సంవత్సరాలుగా, మరొకరు 19 సంవత్సరాలుగా పూర్తికాల పరిచర్య చేస్తున్నారు కాబట్టి, వారు ఈ ప్రయాణాన్ని రాజ్య సువార్తను వ్యాపింపచేయడానికి సద్వినియోగం చేసుకున్నారు. దారిలో కలిసిన వాళ్ళకి ప్రకటించడంలో దాదాపు 110 గంటలు గడిపారు, వారు 200 కరపత్రాలు, 30 పత్రికలు ఇవ్వగలిగారు.
వారు నదిలో ప్రయాణిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో సాధారణంగా కనిపించే నీటిగుర్రాలు, మొసళ్ళ మధ్య నుండి వెళ్ళవలసి వచ్చింది. రాత్రిపూట వారు నదిలో ప్రయాణం చేయలేకపోయారు ఎందుకంటే అటువంటి ప్రమాదభరితమైన నదిలో చీకట్లో ప్రయాణించడం అసాధ్యం! వారు అనేక మిలిటరీ చెక్పోస్టులను కూడా దాటి వెళ్ళాల్సి వచ్చింది.
ఇది అలసటతో కూడిన సుదీర్ఘ ప్రయాణమైనప్పటికీ, ఈ కృషి చేసినందుకు ఆ సహోదరీలు సంతోషించారు. లీసాలాలోని సమావేశానికి హాజరవగలిగినందుకు వారిద్దరూ కృతజ్ఞతాభావంతో, ఆనందంతో ఉప్పొంగిపోయారు. సత్యంపట్ల వారి హృదయాలు ఉత్సాహంతో నిండిపోయాయి, అక్కడ హాజరైన 7,000 మంది సహోదర సహోదరీల సహవాసంతో వారు ఎంతో ప్రోత్సాహాన్ని పొందారు. సమావేశం ముగిసిన తర్వాత, తిరుగు ప్రయాణంలో కూడా వారు అవే సవాళ్ళను ఎదుర్కొన్నారు, వారు తిరిగి వచ్చేసరికి వారి కుటుంబమంతా క్షేమంగా సురక్షితంగా ఉంది.