కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటి దినవృత్తాంతముల గ్రంథములోని ముఖ్యాంశాలు

మొదటి దినవృత్తాంతముల గ్రంథములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

మొదటి దినవృత్తాంతముల గ్రంథములోని ముఖ్యాంశాలు

యూదులు బబులోను చెరనుండి స్వదేశానికి తిరిగివచ్చి అప్పటికి దాదాపు 77 సంవత్సరాలు గడిచాయి. అధిపతియైన జెరుబ్బాబెలు తిరిగి నిర్మించిన ఆలయం 55 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. యూదులు తిరిగి రావడానికి ప్రధాన కారణం యెరూషలేములో సత్యారాధనను పునరుద్ధరించడమే. కానీ ప్రజల్లో యెహోవా ఆరాధనపట్ల ఆసక్తి లేదు. వారిని ప్రోత్సహించడం అత్యవసరం, మొదటి దినవృత్తాంతముల పుస్తకం సరిగ్గా దానినే అందిస్తోంది.

వంశావళుల వృత్తాంతాలతోపాటు మొదటి దినవృత్తాంతములు సౌలు రాజు మరణం మొదలుకొని రాజైన దావీదు మరణంవరకుగల దాదాపు 40 సంవత్సరాల చరిత్రను వివరిస్తోంది. యాజకుడైన ఎజ్రా సా.శ.పూ. 460లో ఈ పుస్తకాన్ని వ్రాసినట్లు విశ్వసించబడుతోంది. మొదటి దినవృత్తాంతముల పుస్తకం మనకు ఆసక్తి కలిగించాలి, ఎందుకంటే అది ఆలయంలో జరిగే ఆరాధనకు సంబంధించిన అవగాహనను వృద్ధి చేయడమే కాక, మెస్సీయ వంశావళి వివరాలను కూడా అందిస్తోంది. ప్రేరేపిత దేవుని వాక్యంలో భాగంగా, దానిలోని సందేశం మన విశ్వాసాన్ని బలపరిచి బైబిలుకు సంబంధించిన మన అవగాహనను పెంచుతుంది.​—⁠హెబ్రీయులు 4:12.

పేర్లకు సంబంధించిన ప్రాముఖ్యమైన చరిత్ర

(1 దినవృత్తాంతములు 1:1-9:⁠44)

ఎజ్రా సమకూర్చిన వివరణాత్మక వంశావళి పట్టిక కనీసం మూడు కారణాలనుబట్టి అవసరం: కేవలం అధికారం ఇవ్వబడినవారు మాత్రమే యాజకత్వం నిర్వహించడానికి, గోత్రాల వారసత్వ సంపదను నిర్ధారించేందుకు దోహదపడడానికి, మెస్సీయను గుర్తించే వంశావళి చరిత్రను కాపాడడానికి. యూదులు ఎలా మొదటి మానవుని సంబంధీకులో ఆ చరిత్ర తెలియజేస్తుంది. ఆదాము నుండి నోవహు వరకు పది తరములు, అబ్రాహాము వరకు మరో పది తరములు. ఇష్మాయేలు కుమారులను, అబ్రాహాము ఉపపత్ని కెతూరా కుమారులను, ఏశావు కుమారులను పేర్కొన్న తర్వాత ఆ వృత్తాంతం ఇశ్రాయేలు 12 మంది కుమారుల వంశక్రమం మీద దృష్టి సారిస్తోంది.​—⁠1 దినవృత్తాంతములు 2:1.

యూదా కుమారుల వివరాలు విపులంగా ఇవ్వబడ్డాయి, ఎందుకంటే అవి రాజైన దావీదు రాజవంశ క్రమాన్ని తెలియజేస్తున్నాయి. అబ్రాహాము నుండి దావీదు వరకు 14 తరాలు, బబులోనుకు చెరగా కొనిపోబడే వరకు మరో 14 తరాలు ఉన్నాయి. (1 దినవృత్తాంతములు 1:​27, 34; 2:1-15; 3:1-17; మత్తయి 1:17) ఎజ్రా ఆ తర్వాత యొర్దాను నదికి తూర్పున ఉన్న గోత్రాల సంతానాన్ని, వారి తర్వాత లేవీ కుమారుల వంశక్రమాన్ని వివరిస్తున్నాడు. (1 దినవృత్తాంతములు 5:​1-24; 6:1) ఎజ్రా ఆ తర్వాత యొర్దాను నదికి పశ్చిమవైపున ఉన్న కొన్ని గోత్రాల క్లుప్త వివరాలను, బెన్యామీను గోత్రపు వంశక్రమాన్ని విపులంగానూ పేర్కొన్నాడు. (1 దినవృత్తాంతములు 8:1) బబులోను చెరనుండి యెరూషలేముకు వచ్చిన తొలి నివాసుల పేర్లు కూడా అందులో ఉన్నాయి.​—⁠1 దినవృత్తాంతములు 9:1-16.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:18​—⁠షేలహు తండ్రి ఎవరు​—⁠కేయినానా, అర్పక్షదా? (లూకా 3:35, 36) అర్పక్షదు షేలహు తండ్రి. (ఆదికాండము 10:​24; 11:12) లూకా 3:36లో కనబడే “కేయినాను” అనే పేరు, బహుశా “కల్దీయులు” అనే మాటను తప్పుగా ప్రయోగించడమై ఉండవచ్చు. అదే నిజమైతే, మూలగ్రంథంలో ఆ వచనం “కల్దీయుడైన అర్పక్షదు కుమారుడు” అని ఉండేది. లేదా కేయినాను, అర్పక్షదు అనే పేర్లు ఒకే వ్యక్తిని సూచిస్తుండవచ్చు. “కేయినానుకు . . . కుమారుడు” అనే మాటలు కొన్ని వ్రాత ప్రతుల్లో లేవనే వాస్తవాన్ని మనం అలక్ష్యం చేయకూడదు.​—⁠లూకా 3:​36, 38.

2:15​—⁠దావీదు యెష్షయి ఏడవ కుమారుడా? కాదు. యెష్షయికి ఎనిమిదిమంది కుమారులు, దావీదు అందరికన్నా చిన్నవాడు. (1 సమూయేలు 16:​10, 11; 17:12) యెష్షయి కుమారుల్లో ఒకరు పిల్లలు లేకుండానే చనిపోయి ఉంటాడనేది స్పష్టం. వంశావళుల పట్టికలో ఆ కుమారుని పేరు ఎలాంటి ప్రభావమూ చూపించదు కాబట్టి, ఎజ్రా ఆయన పేరును చేర్చలేదు.

3:17​—లూకా 3:⁠27 యెకొన్యా కుమారుడైన షయల్తీయేలును నేరి కుమారునిగా ఎందుకు పేర్కొంటోంది? యెకొన్యా షయల్తీయేలుకు తండ్రి. అయితే నేరి తన కుమార్తెను షయల్తీయేలుకు పెళ్లి చేశాడని స్పష్టమవుతోంది. యోసేపు మరియ తండ్రియైన హేలీ కుమారుడని లూకా పేర్కొన్నట్లే, నేరి అల్లుణ్ణి నేరి కుమారునిగా పేర్కొన్నాడు.​—⁠లూకా 3:24.

3:​17-19​—⁠జెరుబ్బాబెలు, పెదాయా, షయల్తీయేలు ఎలా బంధువులు? షయల్తీయేలు సోదరుడైన పెదాయా కుమారుడు జెరుబ్బాబెలు. అయితే, బైబిలు కొన్నిసార్లు జెరుబ్బాబెలును షయల్తీయేలు కుమారుడని పిలుస్తోంది. (మత్తయి 1:12; లూకా 3:27) దీనికి కారణం పెదాయా చనిపోగా షయల్తీయేలు జెరుబ్బాబెలును పెంచి ఉండవచ్చు. లేదా షయల్తీయేలు పిల్లలు లేకుండా చనిపోతే, పెదాయా మరిది ధర్మము జరిగించగా జెరుబ్బాబెలు వారి జ్యేష్ఠ కుమారునిగా జన్మించి ఉండవచ్చు.​—⁠ద్వితీయోపదేశకాండము 25:5-10.

5:​1, 2.​—⁠యోసేపు జ్యేష్ఠకుమారుని హక్కు పొందడం ఆయనకు ఎలాంటి ప్రయోజనమిచ్చింది? అందువల్ల యోసేపు తన వారసత్వ సంపదను రెండింతలు పొందాడు. (ద్వితీయోపదేశకాండము 21:17) ఆ విధంగా ఆయన రెండు గోత్రాలకు అంటే ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలకు తండ్రి అయ్యాడు. ఇశ్రాయేలు ఇతర కుమారులు కేవలం ఒక్కొక్క గోత్రానికే తండ్రి అయ్యారు.

మనకు పాఠాలు:

1:​1-9:⁠44. నిజమైన ప్రజల వంశావళులు, సత్యారాధన ఏర్పాటు మొత్తం పుక్కిటి పురాణాలపై ఆధారపడిలేదు గానీ వాస్తవాలపై ఆధారపడి ఉందని నిరూపిస్తున్నాయి.

4:​9, 10. మరింత ఎక్కువమంది దైవభక్తిగల ప్రజలకు నివాసం లభించేలా శాంతియుతంగా తన ప్రాంతాన్ని విస్తరింపజేయమని యబ్బేజు పట్టుదలతో చేసిన ప్రార్థనకు యెహోవా జవాబిచ్చాడు. శిష్యులను చేసే పనిలో ఆసక్తిగా భాగం వహిస్తూ మనం కూడా దేవుని ఆరాధకులు అధికమవ్వాలని హృదయపూర్వకంగా ప్రార్థించాలి.

5:​10, 18-22. రాజైన సౌలు కాలంలో యొర్దానుకు తూర్పున ఉన్న గోత్రాలు, హగ్రీయీల గోత్రాలవారు తమకన్నా రెండింతలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వారిని ఓడించారు. ఎందుకంటే ఈ గోత్రాల్లోని శూరులు యెహోవాను విశ్వసించి ఆయన సహాయం కోసం చూశారు. మనకన్నా భీకరులైన శత్రువులపై సాగిస్తున్న ఆధ్యాత్మిక యుద్ధంలో మనం యెహోవాపై మన పూర్తి నమ్మకముంచుదాం.​—⁠ఎఫెసీయులు 6:10-17.

9:​26, 27. లేవీ గోత్రానికి చెందిన ద్వారపాలకులకు బరువైన బాధ్యతలు అప్పగించబడ్డాయి. దేవాలయ పరిశుద్ధ ప్రాంగణాల్లోకి దారితీసే ప్రవేశ ద్వారపు తాళపుచెవులు వారికివ్వబడ్డాయి. ప్రతీరోజు తలుపులు తెరిచే పనిని వారు నమ్మకంగా చేశారు. మన ప్రాంతంలోని ప్రజల దగ్గరకు వెళ్లి, యెహోవాను ఆరాధించేలా వారికి సహాయం చేసే బాధ్యత మనకు అప్పగించబడింది. ఆ లేవీ గోత్రానికి చెందిన ద్వారపాలకుల్లాగే మనం కూడా ఆధారపడదగిన వారమనీ, నమ్మకస్థులమనీ నిరూపించుకోవద్దా?

రాజైన దావీదు పరిపాలన

(1 దినవృత్తాంతములు 10:1-29:30)

గిల్బోవ పర్వతం దగ్గర రాజైన సౌలు, అతని ముగ్గురు కుమారులు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ హతమైన సంఘటనతో వృత్తాంతం ఆరంభమవుతుంది. యెష్షయి కుమారుడైన దావీదు యూదా గోత్రంపై రాజుగా నియమించబడతాడు. అన్ని గోత్రాల పురుషులు హెబ్రోనుకు వచ్చి ఆయనను ఇశ్రాయేలంతటిపై రాజుగా నియమిస్తారు. (1 దినవృత్తాంతములు 11:​1-3) ఆ పిమ్మట ఆయన యెరూషలేమును ఆక్రమిస్తాడు. ఆ తర్వాత, ఇశ్రాయేలీయులు “ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు . . . స్వరమండలములు సితారాలు వాయించుచు” నిబంధనా మందసాన్ని యెరూషలేముకు తీసుకువస్తారు.​—⁠1 దినవృత్తాంతములు 15:28.

దావీదు సత్య దేవునికి ఒక మందిరం నిర్మించాలనే కోరికను వ్యక్తపరుస్తాడు. ఆ ఆధిక్యతను సొలొమోనుకు కేటాయిస్తూ యెహోవా దావీదుతో ఒక రాజ్య నిబంధన చేస్తాడు. ఇశ్రాయేలు శత్రువులపై దావీదు యుద్ధం సాగిస్తుండగా యెహోవా ఆయనకు వరుసగా విజయం చేకూరుస్తాడు. చట్టవిరుద్ధంగా ప్రజాసంఖ్య సేకరించడం కారణంగా 70,000 మంది చనిపోతారు. యెహోవాకు ఒక బలిపీఠం కట్టించాలనే నిర్దేశాన్ని దేవదూత ద్వారా పొందిన తర్వాత, యోబూసీయుడైన ఒర్నాను దగ్గర దావీదు స్థలం కొంటాడు. ఆ స్థలంలో యెహోవాకు ‘ఘనమైన’ ఆలయం నిర్మించేందుకు దావీదు ‘విస్తారముగా వస్తువులను సమకూర్చడం’ ఆరంభిస్తాడు. (1 దినవృత్తాంతములు 22:5) దావీదు లేవీయుల సేవలను వ్యవస్థీకరిస్తాడు, వాటి గురించి లేఖనాల్లో మరెక్కడా వివరించబడనంతగా ఇక్కడ వివరించబడింది. ఆలయం కోసం రాజు, ప్రజలు విస్తారంగా విరాళాలు ఇస్తారు. నలభై సంవత్సరాలు పరిపాలించిన తర్వాత దావీదు ‘వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణించగా, అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజవుతాడు.’​—⁠1 దినవృత్తాంతములు 29:28.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

11:11​—రెండవ సమూయేలు 23:8లో ఉన్న ఇదే వృత్తాంతం, హతులైనవారు 800 మంది అని చెబుతుంటే ఈ వచనం హతులైనవారు 300 మంది అని ఎందుకు చెబుతోంది? దావీదు దగ్గరున్న ముగ్గురు బలాఢ్యుల ముఖ్యుడు యాషాబాము లేదా యోషేబెష్షెబెతు. మిగతా ఇద్దరూ ఎలియాజరు, షమ్మా అనేవారు. (2 సమూయేలు 23:8-11) ఈ రెండు వృత్తాంతాల్లో తేడాకు కారణం అవి ఒకే వ్యక్తి జరిగించిన రెండు వేర్వేరు కార్యాలను సూచిస్తుండవచ్చు.

11:​20, 21​—⁠దావీదు దగ్గరున్న ముగ్గురు ముఖ్య బలాఢ్యులతో పోలిస్తే అబీషై స్థానమేమిటి? అబీషై దావీదు సేవకులైన ఆ ముగ్గురు బలాఢ్యుల్లో ఒకడు కాదు. కానీ 2 సమూయేలు 23:18, 19లో చెప్పబడినట్లుగా, ఆయన 30 మంది శూరులపై అధిపతిగా ఉండి, వారందరిలో ఘనుడిగా ఉన్నాడు. అబీషై యాషాబాము చేసినలాంటి కార్యమే చేసిన కారణాన్నిబట్టి అతని ఖ్యాతి ఆ ముగ్గురు బలాఢ్యులకు పోటీగా తయారైంది.

12:8​—⁠గాదీయుల పరాక్రమశాలుల ముఖాలు ఏ భావంలో “సింహముఖమువంటి” ముఖాలుగా ఉన్నాయి? ఈ పరాక్రమశాలులు అరణ్యములో దావీదు ప్రక్కన నిలిచారు. వారి జుట్టు పొడవుగా పెరిగింది. జూలులాంటి జుట్టువల్ల వారు భీకరంగా, సింహాల్లా కనబడ్డారు.

13:5​—⁠“ఐగుప్తుయొక్క షీహోరునది” అంటే ఏది? ఈ వచనంలోని షీహోరునదికి ఐగుప్తు దేశానికి దగ్గరి సంబంధం ఉన్నందువల్ల అది నైలుయొక్క తూర్పు ఉపనదిని సూచిస్తుందనే సాధారణ అభిప్రాయం ఉంది. (యెహోషువ 13:2; యెషయా 23:3; యిర్మీయా 2:18) అయితే, ఇది వాగ్దాన దేశపు నైరృతి సరిహద్దును గుర్తించే పొడవైన “ఐగుప్తు సెలయేటి లోయను” సూచిస్తుందని చాలామంది వ్యాఖ్యాతలు అర్థం చేసుకుంటున్నారు.​—⁠సంఖ్యాకాండము 34:2, 5, NW; ఆదికాండము 15:18.

16:30​—⁠యెహోవా సన్నిధిని “వణకుడి” అనే మాటకు అర్థమేమిటి? ఇక్కడ “వణకుడి” అనే మాట యెహోవాపట్ల పూజ్యభయాన్ని, ప్రగాఢ గౌరవాన్ని సూచించడానికి సూచనార్థకంగా ఉపయోగించబడింది.

16:​37-40; 21:​29, 30; 22:19​—⁠మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చిన దగ్గరనుండి ఆలయ నిర్మాణ సమయం వరకు ఇశ్రాయేలులో ఎలాంటి ఆరాధనా ఏర్పాటు అమల్లోవుంది? దావీదు మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చి తాను నిర్మించిన గుడారంలో ఉంచే సమయానికి మందసం అనేక సంవత్సరాలుగా దేవాలయ గుడారంలో లేదు. అది యెరూషలేముకు తరలించబడిన తర్వాత, యెరూషలేములోని గుడారంలో ఉంది. ఆ దేవాలయ గుడారం గిబియోనులో ఉండేది, అక్కడే ప్రధాన యాజకుడైన సాదోకు ఆయన సహోదరులు ధర్మశాస్త్రంలో వివరించబడిన బలులు అర్పిస్తూవచ్చారు. యెరూషలేములో దేవాలయం పూర్తయ్యేవరకు ఈ ఏర్పాటు కొనసాగింది. దేవాలయం పూర్తయినప్పుడు ఆ దేవాలయ గుడారాన్ని గిబియోను నుండి యెరూషలేముకు తీసుకొచ్చినప్పుడు, ఆ మందసం దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడింది.​—⁠1 రాజులు 8:4, 6.

మనకు పాఠాలు:

13:​11. మన ప్రయత్నాలు విఫలమైనప్పుడు కోపగించుకొని యెహోవాను నిందించే బదులు, మనం పరిస్థితిని విశ్లేషించి ఆ వైఫల్యానికి కారణమేమిటో చూసేందుకు ప్రయత్నించాలి. దావీదు నిస్సందేహంగా అలాచేశాడు. ఆయన తన తప్పు తెలుసుకొని ఆ తర్వాత సరైన పద్ధతిలో మందసాన్ని విజయవంతంగా యెరూషలేముకు తెచ్చాడు. *

14:​10, 13-16; 22:​17-19. మనం అన్ని సమయాల్లో ప్రార్థన ద్వారా యెహోవాను సమీపించి, ఆధ్యాత్మికంగా మనపై ప్రభావం చూపగల ఏ పనికైనా, ప్రయత్నానికైనా పూనుకునే ముందు ఆయన నిర్దేశాన్ని వెదకాలి.

16:​23-29. యెహోవా ఆరాధనకే మన జీవితంలో ప్రథమస్థానం ఇవ్వాలి.

18:⁠3. యెహోవా తన వాగ్దానాలు నెరవేర్చేవాడు. అబ్రాహాము సంతానానికి “ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు” ఉన్న కనాను దేశమంతటిని ఇస్తాననే తన వాగ్దానాన్ని ఆయన దావీదు ద్వారా నెరవేర్చాడు.​—⁠ఆదికాండము 15:18; 1 దినవృత్తాంతములు 13:5.

21:​13-15. యెహోవాకు తన ప్రజల బాధలపట్ల శ్రద్ధవుంది కాబట్టే తెగులును ఆపమని ఆయన దేవదూతకు ఆజ్ఞాపించాడు. నిజానికి ఆయన “మహా కృపగలవాడు.” *

22:​5, 9; 29:​3-5, 14-16. యెహోవా దేవాలయం నిర్మించే ఆజ్ఞ తనకు ఇవ్వబడకపోయినా దావీదు ఉదార స్వభావం కనబరిచాడు. ఎందుకు? ఎందుకంటే, తాను సంపాదించినదంతా యెహోవా మంచితనం కారణంగానే కలిగిందని ఆయన గ్రహించాడు. అలాంటి కృతజ్ఞతాభావాలు, ఉదార స్వభావం కలిగివుండేలా మనల్ని ప్రేరేపించాలి.

24:​7-18. దావీదు నెలకొల్పిన 24 భాగాలుగా విభజించబడిన యాజక ఏర్పాటు, బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రియైన జెకర్యాకు యెహోవా దూత కనబడి యోహాను పుట్టుకను ప్రకటించిన సమయానికి అమల్లోవుంది. ‘అబీయా తరగతిలోని’ సభ్యునిగా జెకర్యా అప్పుడు తన తరగతి క్రమముచొప్పున దేవాలయంలో సేవచేస్తున్నాడు. (లూకా 1:5, 8, 9) సత్యారాధన చారిత్రక వ్యక్తులకు సంబంధించినదే గానీ పుక్కిటి పురాణాలకు సంబంధించినది కాదు. నేటి చక్కని వ్యవస్థీకృత యెహోవా ఆరాధనకు సంబంధించి ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ మనం యథార్థంగా సహకరించడం ఆశీర్వాదాలను తెస్తుంది.​—⁠మత్తయి 24:45.

“మనఃపూర్వకముగా” యెహోవాను సేవించండి

మొదటి దినవృత్తాంతములలో కేవలం వంశావళుల వివరాలు మాత్రమే లేవు. అందులో దావీదు నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చిన వృత్తాంతం, ఆయన గొప్ప విజయాలు, దేవాలయ నిర్మాణపు ఏర్పాట్లు, లేవీ యాజకుల సేవా విధుల విభజనను నెలకొల్పడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఎజ్రా వివరించినదంతా దేవాలయంలో యెహోవా ఆరాధనపట్ల ఇశ్రాయేలీయుల ఆసక్తికి నూతనోత్తేజమివ్వడానికి సహాయం చేస్తూ వారికి తప్పక ప్రయోజనమిచ్చి ఉంటుంది.

దావీదు తన జీవితంలో యెహోవా ఆరాధనకు ప్రథమస్థానమివ్వడంలో ఎంత చక్కని మాదిరి ఉంచాడో కదా! దావీదు తనకంటూ ప్రత్యేక ఆధిక్యతలను వెదకే బదులు దేవుని చిత్తం చేయడానికే ప్రయత్నించాడు. యెహోవాను “హృదయపూర్వకముగాను, మనఃపూర్వకముగాను” సేవించమని ఆయన ఇచ్చిన సలహాను అన్వయించుకోవడానికి మనం ప్రోత్సహించబడుతున్నాం.​—⁠1 దినవృత్తాంతములు 28:9.

[అధస్సూచీలు]

^ పేరా 32 మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలన్న దావీదు ప్రయత్నానికి సంబంధించిన ఇతర పాఠాల కోసం కావలికోట మే 15, 2005 16-19 పేజీలు చూడండి.

^ పేరా 36 దావీదు సేకరించిన చట్టవిరుద్ధ ప్రజాసంఖ్యకు సంబంధించిన ఇతర పాఠాల కోసం కావలికోట మే 15, 2005 16-19 పేజీలు చూడండి.

[8-11వ పేజీలోని చార్టు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

సా.శ.పూ. 4026 ఆదాము ఆదాము నుండి నోవహు వరకుగల

తరాలు (1,056 సంవత్సరాలు)

130 సంవత్సరాలు ⇩

 

షేతు

 

105 ⇩

 

ఎనోషు

 

90 ⇩

 

కేయినాను

 

70 ⇩

 

మహలలేలు

 

65 ⇩

 

యెరెదు

 

162 ⇩

 

హనోకు

 

65 ⇩

 

మెతూషెల

 

187 ⇩

 

లెమెకు

 

182 ⇩

 

సా.శ.పూ. 2970 నోవహు సా.శ.పూ. 2970 నోవహు జన్మించాడు

నోవహు నుండి అబ్రాహాము వరకుగల

502 సంవత్సరాలు ⇩ తరాలు (952 సంవత్సరాలు)

 

షేము

జలప్రళయం సా.శ.పూ. 2370

 

100 ⇩

 

అర్పక్షదు

 

35 ⇩

 

షేలహు

 

30 ⇩

 

హెబెరు

 

34 ⇩

 

పెలెగు

 

30 ⇩

 

రయూ

 

32 ⇩

 

సెరూగు

 

30 ⇩

 

నాహోరు

 

29 ⇩

 

తెరహు

 

130 ⇩

 

సా.శ.పూ. 2018 అబ్రాహాము సా.శ.పూ. 2018 అబ్రాహాము జన్మించాడు

అబ్రాహాము నుండి దావీదు వరకు:

100 సం. 14 తరాలు (911 సంవత్సరాలు)

 

ఇస్సాకు

 

60 ⇩

యాకోబు

 

దాదాపు 88 ⇩

 

యూదా

 

 

పెరెసు

 

 

హెస్రోను

 

 

రాము

 

 

అమ్మీనాదాబు

 

 

నయస్సోను

 

 

శల్మాను

 

 

బోయజు

 

 

ఓబేదు

 

 

యెష్షయి

 

 

సా.శ.పూ. 1107 దావీదు జన్మించాడు