కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సూచనల భావాన్ని గ్రహించడం గంభీరమైన విషయం!

సూచనల భావాన్ని గ్రహించడం గంభీరమైన విషయం!

సూచనల భావాన్ని గ్రహించడం గంభీరమైన విషయం!

“మొదట్లో, మా అబ్బాయి ఆండ్రెయాస్‌కి వస్తున్నది మామూలు తలనొప్పే అనుకున్నాను. కానీ వాడికి ఆకలి మందగించి, విపరీతమైన జ్వరం వచ్చింది. తలనొప్పి అంతకంతకూ ఎక్కువైపోయింది, దాంతో నేను చాలా ఆందోళన చెందాను. మా వారు ఇంటికి రాగానే మేము ఆండ్రెయాస్‌ని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయన రోగలక్షణాలు చూసి ఆండ్రెయాస్‌ని వెంటనే హాస్పిటల్‌కు పంపించాడు. మా బాబుది తలనొప్పికంటే గంభీరమైన సమస్యే. ఆండ్రెయాస్‌కి మెనిన్‌జైటిస్‌ (నాడీమండలపు పైపొరల శోథము) వచ్చింది. వాడికి చికిత్స చేయించాక త్వరలోనే కోలుకున్నాడు.”​—⁠గెర్‌ట్రుడ్‌, జర్మనీలోని ఒక తల్లి.

గెర్‌ట్రుడ్‌కు ఎదురైన అనుభవమే చాలామంది తల్లిదండ్రులకూ ఎదురై ఉండవచ్చు. తమ పిల్లవాడికి అనారోగ్యంగా ఉందని సూచించే రోగలక్షణాలను వారు గమనిస్తారు. ప్రతీ అనారోగ్యం అంత ప్రమాదకరమైనది కాకపోయినా, తల్లిదండ్రులు తమ పిల్లల అనారోగ్యాన్ని సూచించే రోగలక్షణాలను అలక్ష్యం చేస్తే దానికి బాధాకరమైన పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుంది. సూచనలను గమనించి, తగినవిధంగా చర్య తీసుకోవడంవల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అది చాలా గంభీరమైన విషయం.

ఆరోగ్యేతర విషయాల్లో కూడా ఇది వాస్తవం. దీనికి సరైన ఉదాహరణ, 2004 డిసెంబరులో హిందూ మహాసముద్రపు పరిసర ప్రాంతాల్లో వచ్చిన సునామీ వినాశనం. ఆస్ట్రేలియా, హవాయి వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ సంస్థలు ఉత్తర సుమత్రాలో పెద్ద భూకంపం రానున్నదని పసిగట్టి దానివల్ల సంభవించగల ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకున్నాయి. అయితే, ప్రమాదానికి గురికాగల ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి హెచ్చరికనైనా అందుకోవడానికిగానీ దానికి ప్రతిస్పందించడానికిగానీ తగిన మాధ్యమాలేవీ అందుబాటులో లేవు. ఫలితంగా 2,20,000 కంటే ఎక్కువమంది తమ ప్రాణాలు కోల్పోయారు.

మరింత గొప్ప ప్రాముఖ్యతగల సూచనలు

యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు తన శ్రోతలకు, సూచనలను గమనించి, తగిన చర్య తీసుకోవడంలో ఒక పాఠం బోధించాడు. ఆయన మరింత గొప్ప ప్రాముఖ్యతగల ఒక విషయం గురించి మాట్లాడాడు. బైబిలు ఇలా నివేదిస్తోంది: “పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచకక్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను​—⁠సాయంకాలమున మీరు​—⁠ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున​—⁠ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు.”​—⁠మత్తయి 16:​1-3.

యేసు ఇక్కడ “కాలముల సూచనలను” ప్రస్తావించడం ద్వారా తన మొదటి శతాబ్దపు యూదా శ్రోతలు తాము జీవిస్తున్న కాలాల అత్యవసరతను తెలుసుకొని ఉండవలసిందని సూచించాడు. అప్పట్లో యూదా విధానం అందరినీ ప్రభావితం చేసే వినాశనాన్ని ఎదుర్కోబోతోంది. యేసు తన మరణానికి కొన్ని రోజుల ముందు, తన శిష్యులతో మరో సూచన గురించి అంటే తన ప్రత్యక్షతకు సంబంధించిన సూచన గురించి మాట్లాడాడు. ఆయన ఆ సందర్భంలో చెప్పినది నేడు ప్రతీ ఒక్కరికి ఎంతో ప్రాముఖ్యమైనది.