కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు మాదిరిని అనుసరించి పేదవారిపట్ల శ్రద్ధ చూపించండి

యేసు మాదిరిని అనుసరించి పేదవారిపట్ల శ్రద్ధ చూపించండి

యేసు మాదిరిని అనుసరించి పేదవారిపట్ల శ్రద్ధ చూపించండి

పేదరికం, అణచివేత అనేవి దాదాపు మానవజాతి ఉనికిలోకి వచ్చినప్పటి నుండీ ఉన్నవే. దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రం పేదలను కాపాడి వారి బాధను తగ్గించడానికి ప్రయత్నించినా, తరచూ ఆ ధర్మశాస్త్రం అలక్ష్యం చేయబడింది. (ఆమోసు 2:⁠6) పేదలతో వ్యవహరిస్తున్న విధానాన్ని యెహెజ్కేలు ప్రవక్త ఖండించాడు. ఆయనిలా అన్నాడు: “సామాన్య జనులు బలాత్కారముచేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.”​—⁠యెహెజ్కేలు 22:​29.

యేసు భూమ్మీద ఉన్నప్పుడు కూడా పరిస్థితి భిన్నంగా ఏమీలేదు. మతనాయకులు పేదలను, అవసరంలోవున్నవారిని పూర్తిగా అలక్ష్యం చేశారు. మతనాయకులు, ‘విధవరాండ్ర యిండ్లను దిగమ్రింగిన’ ‘ధనాపేక్షులుగా,’ వృద్ధులపట్ల, అవసరంలో ఉన్నవారిపట్ల శ్రద్ధ తీసుకోవడం కన్నా సాంప్రదాయాలను పాటించడంలో అమితాసక్తి గలవారిగా వర్ణించబడ్డారు. (లూకా 16:14; 20:47; మత్తయి 15:​5, 6) మంచి సమరయుని గురించిన యేసు ఉపమానంలో, ఒక యాజకుడు, ఒక లేవీయుడు గాయపడిన ఒక వ్యక్తిని చూసినప్పుడు, అతనికి సహాయం చేయడానికి దగ్గరికి వెళ్లే బదులు రోడ్డుకు మరో ప్రక్కనుండి వెళ్ళిపోవడం గమనించదగిన విషయం.​—⁠లూకా 10:​30-37.

యేసు పేదవారిపట్ల శ్రద్ధ చూపించాడు

యేసు జీవితానికి సంబంధించిన సువార్త వృత్తాంతాలు, ఆయన పేదవారి కష్టాలను పూర్తిగా అర్థం చేసుకున్నాడనీ, వారి అవసరాలను బాగా గమనించి వారిపట్ల సానుభూతి చూపించాడనీ తెలియజేస్తున్నాయి. యేసు పరలోకంలో జీవించినప్పటికీ, ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని, మానవునిగా జన్మించి, ‘మన నిమిత్తము దరిద్రుడాయెను.’ (2 కొరింథీయులు 8:⁠9) సమూహములను చూసినప్పుడు, యేసు “వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరప[డ్డాడు].” (మత్తయి 9:​36) యేసు, ధనికులు “తమకు కలిగిన సమృద్ధిలోనుండి” ఇస్తున్న పెద్ద బహుమానాలనుబట్టి కాదుగానీ పేద విధవరాలు ఇచ్చిన చిన్న కానుకనుబట్టి గాఢంగా ప్రభావితుడయ్యాడని అవసరంలోవున్న విధవరాలి వృత్తాంతం చూపిస్తోంది. ఆమె చేసినది ఆయన హృదయాన్ని స్పృశించింది, ఎందుకంటే ఆమె “తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసె[ను].”​—⁠లూకా 21:⁠4.

యేసు పేదలపట్ల కనికరం చూపించడమే కాదుగానీ వారి అవసరాల విషయంలో వ్యక్తిగత ఆసక్తి కూడా చూపించాడు. ఆయనకూ, ఆయన అపొస్తలులకూ ఉమ్మడి నిధి ఉండేది, దానిలో నుండి వాళ్ళు అవసరంలోవున్న ఇశ్రాయేలీయులకు సహాయం చేసేవారు. (మత్తయి 26:6-9; యోహాను 12:5-8; 13:​29) తన అనుచరులుగా ఉండాలని కోరుకునేవారు, అవసరంలోవున్న వారికి సహాయం చేయవలసిన తమ బాధ్యతను గుర్తించాలని యేసు ప్రోత్సహించాడు. ధనికుడైన ఒక యౌవన అధికారితో ఆయనిలా చెప్పాడు: “నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుము.” ఆ వ్యక్తి తనకున్న సంపదను వదులుకోవడానికి ఇష్టపడకపోవడం, ఆయనకు దేవునిపట్ల తోటిమానవులపట్ల ఉన్న ప్రేమ కంటే సంపదపట్లే ఎక్కువ ప్రేమ ఉందని చూపించింది. కాబట్టి, యేసు శిష్యునిగా ఉండడానికి కావలసిన లక్షణాలు అతనిలో లేవు.​—⁠లూకా 18:​22, 23.

క్రీస్తు అనుచరులకు పేదవారిపట్ల శ్రద్ధవుంది

యేసు మరణించిన తర్వాత అపొస్తలులు, క్రీస్తు ఇతర అనుచరులు తమ మధ్యవున్న పేదవారిపట్ల శ్రద్ధ చూపించడం కొనసాగించారు. దాదాపు సా.శ. 49లో అపొస్తలుడైన పౌలు యాకోబును, పేతురును, యోహానును కలిసి, సువార్త ప్రకటించమని ప్రభువైన యేసుక్రీస్తు తనకిచ్చిన ఆజ్ఞ గురించి చర్చించాడు. పౌలు, బర్నబా తమ ప్రకటనా పనిలో అన్యులపై కేంద్రీకరిస్తూ “అన్యజనుల” దగ్గరికి వెళ్ళాలని వారు నిర్ణయించారు. అయితే, యాకోబు ఆయన సహచరులు, “బీదలను జ్ఞాపకము చేసికొనవలెను” అని పౌలును, బర్బబాను కోరారు. పౌలు అది చేయడానికే ‘ఆసక్తి కలిగి యుండెను.’​—⁠గలతీయులు 2:7-10.

క్లౌదియ చక్రవర్తి పాలనలో, రోమా సామ్రాజ్యంలోని వివిధ భాగాల్లో తీవ్ర కరవు వచ్చింది. దానికి ప్రతిస్పందనగా, అంతియొకయలోని క్రైస్తవులు, “ప్రతివాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దల యొద్దకు దానిని పంపిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 11:​28-30.

యేసు అనుచరులు పేదవారిపట్ల, అవసరంలో ఉన్నవారిపట్ల శ్రద్ధ చూపించాలని, ముఖ్యంగా తోటి విశ్వాసుల మధ్యనున్న పేదవారిపట్ల, అవసరంలో ఉన్నవారిపట్ల శ్రద్ధ చూపించాలని కూడా నేడు నిజక్రైస్తవులు గుర్తిస్తారు. (గలతీయులు 6:​10) కాబట్టి వారు పేదవారి భౌతిక అవసరాలపట్ల నిజమైన శ్రద్ధ చూపిస్తారు. ఉదాహరణకు 1998లో, ఈశాన్య బ్రెజిల్‌లోని అధికభాగం తీవ్ర అనావృష్టికి గురైంది. దాని మూలంగా చిక్కుడు, వరి, జొన్న పంటలు నాశనమవడంతో తీవ్రమైన కరవు వచ్చింది, 15 సంవత్సరాల్లో అంత ఘోరమైన కరవు ఎప్పుడూ రాలేదు. కొన్ని స్థలాల్లో, త్రాగునీటి కొరత కూడా ఏర్పడింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోవున్న యెహోవాసాక్షులు వెంటనే సహాయ కమిటీలు ఏర్పాటుచేసి, కొద్దికాలంలోనే టన్నులకొద్దీ ఆహారాన్ని సేకరించి, వాటిని రవాణా చేయడానికయ్యే ఖర్చు కూడా భరించారు.

సహాయక చర్యలకు మద్దతిచ్చిన సాక్షులు ఇలా వ్రాశారు: “మేము మా సహోదరులకు సహాయం చేయగలుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము, ప్రాముఖ్యంగా యెహోవా హృదయాన్ని సంతోషపరిచామనే నమ్మకం మాకుంది కాబట్టి మేము సంతోషిస్తున్నాం. మేము యాకోబు 2:15, 16లోని మాటలను ఎన్నడూ మరచిపోము.” ఆ బైబిలు వచనాలిలా చెబుతున్నాయి: “సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు, మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక​—⁠సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?”

సావోపౌలో నగరంలోవున్న యెహోవాసాక్షుల సంఘాల్లోని ఒకదానిలో, వినయం, ఉత్సాహంగల ఒక పేద సాక్షి ఎంతో కష్టపడి జీవనం సాగిస్తోంది. ఆమె ఇలా చెబుతోంది: “నేను పేదరికంలో ఉన్నా, బైబిలు సందేశం నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చింది. నేను నా తోటి సాక్షుల నుండి సహాయమందుకుని ఉండకపోతే నాకేమయ్యేదో నాకు తెలియదు.” కొంతకాలం క్రితం, కష్టపడి పనిచేసే ఈ క్రైస్తవ స్త్రీకి శస్త్రచికిత్స చేయించుకోవలసిన అవసరం ఏర్పడింది, గానీ అందుకు తగిన ఆర్థిక స్తోమత ఆమెకు లేదు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో, సంఘంలోని క్రైస్తవ సహోదరసహోదరీలు శస్త్రచికిత్సకయ్యే ఖర్చు భరించగలిగారు. ప్రపంచవ్యాప్తంగా నిజ క్రైస్తవులు, అవసరంలోవున్న తోటి విశ్వాసులకు సహాయం అందజేస్తున్నారు.

అయితే, అలాంటి అనుభవాలు ఎంత ఉత్తేజకరమైనవిగా ఉన్నా, అలాంటి యథార్థమైన ప్రయత్నాలు పేదరికాన్ని నిర్మూలించలేవన్నది స్పష్టం. శక్తివంతమైన ప్రభుత్వాలు, పెద్ద అంతర్జాతీయ సహాయ సంస్థలు కొంతమేరకు విజయం సాధించినా, పేదరికమనే అతిప్రాచీన సమస్యను నిర్మూలించలేకపోయాయి. కాబట్టి, ఉత్పన్నమయ్యే ప్రశ్నేమిటంటే, పేదరికానికీ, మానవజాతిని పట్టిపీడిస్తున్న ఇతర సమస్యలకూ ఖచ్చితమైన పరిష్కారం ఏమిటి?

బైబిలు బోధలు శాశ్వత సహాయాన్నందిస్తాయి

పేదవారి కోసం లేదా ఇతర అవసరాలున్నవారి కోసం యేసుక్రీస్తు తరచూ మంచి కార్యాలు చేశాడని సువార్త వృత్తాంతాలు చెబుతున్నాయి. (మత్తయి 14:​14-21) అయితే, ఆయన ఏ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇచ్చాడు? ఒక సందర్భంలో, అవసరంలోవున్నవారికి సహాయం చేస్తూ కొంతసమయం గడిపిన తర్వాత, యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి.” యేసు తన ప్రకటనా కార్యకలాపాలను కొనసాగించడానికి, రోగుల కోసం, అవసరంలో ఉన్నవారి కోసం తాను చేస్తున్న పనిని మధ్యలో ఎందుకు ఆపేశాడు? దానికిగల కారణాన్ని ఆయనిలా వివరించాడు: “యిందునిమిత్తమే [అంటే, ప్రకటించడానికే] గదా నేను బయలుదేరి వచ్చితిని.” (మార్కు 1:38, 39; లూకా 4:​43) అవసరంలోవున్న ప్రజల కోసం మంచి కార్యాలు చేయడం యేసుకు ప్రాముఖ్యమైనదే అయినా, దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ఆయన ప్రధాన కర్తవ్యం.​—⁠మార్కు 1:​14, 15.

“[యేసు] అడుగుజాడలయందు నడుచుకొన[మని]” బైబిలు క్రైస్తవులను పురికొల్పుతోంది కాబట్టి, ఇతరులకు సహాయం చేయడానికి తాము చేసే ప్రయత్నాల్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేదాని గురించి నేడు క్రైస్తవులకు స్పష్టమైన నిర్దేశం ఇవ్వబడింది. (1 పేతురు 2:​21) యేసులాగే వారూ అవసరంలోవున్న ప్రజలకు సహాయం చేస్తారు. అయితే, యేసులాగే వారు దేవుని రాజ్య సువార్తను గురించిన బైబిలు సందేశాన్ని బోధించడమనే పనికి అధిక ప్రాధాన్యతనిస్తారు. (మత్తయి 5:14-16; 24:14; 28:​19, 20) ఇతరులకు వేరే విధాలుగా సహాయం చేయడానికన్నా, దేవుని వాక్యంలోవున్న సందేశాన్ని ప్రకటించడానికే అధిక ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి?

ప్రపంచమంతటి నుండి వస్తున్న నిజజీవిత అనుభవాలు, ప్రజలు బైబిల్లోని ఆచరణసాధ్యమైన ఉపదేశాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరిస్తే, పేదరికంతోసహా అనుదిన జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి సన్నద్ధులై ఉంటారని చూపిస్తున్నాయి. అంతేగాక, నేడు యెహోవాసాక్షులు ప్రకటిస్తున్న బైబిల్లోని దేవుని రాజ్య సందేశం, ప్రజలకు భవిష్యత్తుపట్ల నిరీక్షణనిస్తుంది, ఆ నిరీక్షణ ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో సహితం జీవించడాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది. (1 తిమోతి 4:⁠8) ఏమిటా నిరీక్షణ?

మన భవిష్యత్తు గురించి దేవుని వాక్యం మనకిలా హామీ ఇస్తోంది: “[దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:​13) బైబిలు “భూమి” గురించి మాట్లాడినప్పుడు, కొన్నిసార్లు అది భూమిపై నివసించే ప్రజలను సూచిస్తుంది. (ఆదికాండము 11:⁠1) కాబట్టి వస్తుందని వాగ్దానం చేయబడిన నీతియుక్తమైన “క్రొత్త భూమి” అంటే, దేవుని అనుగ్రహం ఉన్న ప్రజల సమాజం. దేవుని అనుగ్రహం ఉన్న ప్రజలు క్రీస్తు పరిపాలన క్రింద నిత్యజీవ బహుమానాన్ని పొందుతారనీ, భూపరదైసులో సంతృప్తికరమైన జీవితం గడుపుతారనీ కూడా దేవుని వాక్యం వాగ్దానం చేస్తోంది. (మార్కు 10:​30) ఆ అద్భుతమైన భవిష్యత్తు పేదవారితోసహా అందరికీ అందుబాటులో ఉంది. ఆ “క్రొత్త భూమి”లో, పేదరికమనే సమస్య శాశ్వతంగా పరిష్కరించబడుతుంది.

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

యేసు ‘దరిద్రులను’ ఎలా ‘విడిపిస్తాడు’?​—కీర్తన 72:⁠12

న్యాయం: “ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును.” (కీర్తన 72:⁠4) భూమిపై క్రీస్తు పరిపాలనా సమయంలో, అందరికీ న్యాయం జరుగుతుంది. ధనిక దేశాలుగా మారగల దేశాలు, అవినీతి కారణంగా పేదరికాన్ని చవిచూస్తున్నాయి, ఆయన పరిపాలనలో ఆ అవినీతికి చోటు ఉండదు.

శాంతి: “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.” (కీర్తన 72:⁠7) ప్రపంచంలోని అధికశాతం పేదరికానికి కారణం మానవ పోరాటాలు, యుద్ధాలే. క్రీస్తు భూమిపై సంపూర్ణ శాంతి తీసుకురావడం ద్వారా, పేదరికానికి ముఖ్యకారణాల్లో ఒకదాన్ని నిర్మూలిస్తాడు.

కనికరం: “నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.” (కీర్తన 72:​12-14) నిరుపేదలు, బీదవారు, అణచివేయబడినవారు సంతోషభరితమైన ఒకే మానవ కుటుంబంలో భాగమై, రాజైన యేసుక్రీస్తు నాయకత్వం క్రింద ఐక్యమవుతారు.

సమృద్ధి: ‘దేశములో సస్యసమృద్ధి కలుగును.’ (కీర్తన 72:​16) క్రీస్తు పరిపాలనలో, భౌతిక సమృద్ధి ఉంటుంది. నేడు పేదరికానికి తరచుగా కారణమవుతున్న ఆహారకొరతలు, కరవులు ప్రజలను బాధించవు.

[4, 5వ పేజీలోని చిత్రం]

యేసు పేదవారి అవసరాలపట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించాడు

[6వ పేజీలోని చిత్రం]

బైబిలు సందేశం నిజమైన నిరీక్షణనిస్తుంది