కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు వృద్ధులపట్ల శ్రద్ధ చూపిస్తాడు

దేవుడు వృద్ధులపట్ల శ్రద్ధ చూపిస్తాడు

దేవుడు వృద్ధులపట్ల శ్రద్ధ చూపిస్తాడు

వృద్ధుల నిరాదరణ నేడు విస్తృతంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఈ భక్తిహీన విధానపు “అంత్యదినములలో” ప్రజలు ‘స్వార్థప్రియులుగా, అనురాగరహితులుగా’ ఉంటారని బైబిలు చాలాకాలం క్రితం ప్రవచించింది. (2 తిమోతి 3:​1-3) “అనురాగం” అని అనువదించబడిన గ్రీకు పదం, కుటుంబ సభ్యులమధ్య సహజంగా ఉండే ప్రేమను కూడా సూచించవచ్చు. బైబిలు ప్రవచనం చెబుతున్నట్లుగానే నేటి లోకంలో అటువంటి అనురాగరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

వృద్ధుల్ని నిరాదరించేవారికి పూర్తి భిన్నంగా, యెహోవా దేవుడు వయసు పైబడినవారిని విలువైనవారిగా పరిగణిస్తాడు, అలాగే వారిపట్ల శ్రద్ధ చూపిస్తాడు. బైబిల్లో ఆ విషయం ఎలా స్పష్టం చేయబడిందో గమనించండి.

“విధవరాండ్రకు న్యాయకర్త”

యెహోవా దేవునికి వృద్ధులపట్ల ఉన్న చింత హెబ్రీ లేఖనాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, కీర్తన 68:5లో దావీదు, దేవుణ్ణి “విధవరాండ్రకు న్యాయకర్త” అని సంబోధిస్తున్నాడు, ఆ విధవరాండ్రలో చాలామంది వృద్ధులే ఉండేవారు. * వేరే బైబిలు అనువాదాలు “న్యాయకర్త” అనే పదాన్ని “సహాయకుడు,” “కాపాడేవాడు,” “రక్షించేవాడు” అని అనువదించాయి. యెహోవా విధవరాండ్రపట్ల శ్రద్ధ చూపిస్తాడనేది స్పష్టం. నిజానికి, వారిని నిరాదరణకు గురిచేస్తే ఆయన కోపాగ్ని రగులుతుందని బైబిలు చెబుతోంది. (నిర్గమకాండము 22:​22-24) విధవరాండ్రను, విశ్వాసులైన వృద్ధులందరినీ దేవుడు, ఆయన సేవకులు ఎంతో విలువైనవారిగా పరిగణిస్తారు. యెహోవా దేవునికీ, ఆయన ప్రజలకూ ఉన్న అభిప్రాయాన్ని సామెతలు 16:⁠31 ఇలా వ్యక్తం చేస్తోంది: “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును.”

యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రంలో, వృద్ధులపట్ల గౌరవం చూపించడమనేది ఎంతో ప్రాముఖ్యమైన అంశంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఇశ్రాయేలీయులు ఇలా ఆజ్ఞాపించబడ్డారు: “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.” (లేవీయకాండము 19:​32) కాబట్టి, ఇశ్రాయేలీయులు యెహోవా దేవునితో మంచి సంబంధాన్ని కలిగివుండాలంటే వారు వృద్ధులకు గౌరవం చూపించడం చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి వృద్ధుల్ని నిరాదరణకు గురిచేస్తే అతడు తాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పలేడు.

క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేరు. కానీ, వారు “క్రీస్తు నియమము” క్రింద ఉన్నారు, అది వారి ప్రవర్తనపై, వైఖరిపై, చివరికి వారు తమ తల్లిదండ్రులకు, వృద్ధులకు చూపే ప్రేమపై కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. (గలతీయులు 6:2; ఎఫెసీయులు 6:1-3; 1 తిమోతి 5:​1-3) క్రైస్తవులు, ఆజ్ఞాపించబడినందుకు ప్రేమను ప్రదర్శించరు, బదులుగా అలా చేయడానికి వారి హృదయాలు వారిని పురికొల్పుతాయి. “యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి” అని అపొస్తలుడైన పేతురు ప్రోత్సహించాడు.​—⁠1 పేతురు 1:​22.

మనం వృద్ధులపట్ల శ్రద్ధ చూపించడానికి శిష్యుడైన యాకోబు మరో కారణాన్ని తెలియజేస్తున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా—దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయునే.” (యాకోబు 1:​27) యాకోబు ఆలోచన రేకెత్తించే ఒక విషయాన్ని వెల్లడిచేస్తున్నాడు. ఈ ప్రియమైనవారు యెహోవాకు ఎంత ప్రాముఖ్యమో ఆ లేఖనం మనకు చూపిస్తోంది.

కాబట్టి, వృద్ధుల్ని ఆదరించడం మాత్రమే సరిపోదు. మనం సత్క్రియలు చేస్తూ వారిపట్ల మనకున్న యథార్థమైన శ్రద్ధను ప్రదర్శించాలి. (6-7 పేజీల్లోని, “ప్రేమను క్రియల్లో చూపించడం” అనే బాక్సు చూడండి.) యాకోబు ఇలా వ్రాశాడు: ‘క్రియలు లేని విశ్వాసము మృతము.’​—⁠యాకోబు 2:​26.

“వారి ఇబ్బందిలో” ఓదార్పునివ్వండి

యాకోబు మాటలనుండి మనం మరో విషయం నేర్చుకోవాలి. క్రైస్తవులు, విధవరాండ్రను “వారి యిబ్బందిలో” పరామర్శించాలని యాకోబు చెప్పిన మాటల్ని గుర్తుతెచ్చుకోండి. ‘ఇబ్బంది’ అని అనువదించబడిన గ్రీకు పదానికి, ఒత్తిళ్లవల్ల లేదా జీవితంలోని పరిస్థితులవల్ల కలిగే ఆందోళన, బాధ, కష్టం అని అర్థం. వృద్ధుల్లో చాలామంది అలాంటి ఆందోళనల్ని ఎదుర్కొంటారనడంలో సందేహం లేదు. కొందరు ఒంటరిగా ఉన్నారు. మరికొందరు, వయసువల్లవచ్చే పరిమితుల్నిబట్టి కృంగిపోతున్నారు. దేవుని సేవలో చురుగ్గా ఉన్నవారు కూడా నిరుత్సాహానికి గురికావచ్చు. నాలుగు దశాబ్దాలకన్నా ఎక్కువకాలం దేవుని రాజ్య ప్రచారకునిగా విశ్వాసంగా సేవ చేసిన జాన్‌ * ఉదాహరణను గమనించండి. ఆయన ఈ నాలుగు దశాబ్దాల్లో చివరి మూడు దశాబ్దాలు ప్రత్యేక పూర్తికాల సేవలో గడిపాడు. జాన్‌ ఇప్పుడు 80వ పడిలో ఉన్నాడు, కొన్నిసార్లు తాను నిరుత్సాహపడతానని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నేను గతంలో చేసిన తప్పుల్ని తరచూ గుర్తుచేసుకుంటుంటాను, ఎన్ని తప్పులు చేశానో! ఆ తప్పులు చేయకుండా ఉండగలిగేవాడినే అని నాకు పదేపదే అనిపిస్తుంది.”

యెహోవా పరిపూర్ణుడే అయినప్పటికీ ఆయన మననుండి పరిపూర్ణతను ఆశించడని తెలుసుకోవడం ద్వారా అలాంటివారు ఓదార్పు పొందవచ్చు. ఆయనకు మనం చేసిన తప్పుల గురించి తెలుసు, అయినా బైబిలు ఆయన గురించి ఇలా అంటోంది: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్తన 130:⁠3) అవును, యెహోవా మనం చేసిన తప్పుల మీద దృష్టి కేంద్రీకరించడు గానీ మన హృదయంలో ఏముందో గ్రహిస్తాడు. అది మనకెలా తెలుసు?

ఎన్నో తప్పులు చేసిన, అపరిపూర్ణుడైన దావీదు రాజు కీర్తన 139:1-3లో వ్రాయబడిన క్రింది మాటల్ని కూర్చడానికి దేవునిచేత ప్రేరేపించబడ్డాడు: “యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.” ఇక్కడ “పరిశీలన చేసియున్నావు” అనే పదబంధానికి అక్షరార్థంగా, ధాన్యంనుండి పొట్టును వేరు చేయడానికి ఎలాగైతే రైతు తూర్పారబడతాడో అలా, “వేరుచేయడం” అనే అర్థం ఉంది. మనం చేసే కార్యాల్లో నుండి మంచివాటిని మాత్రమే ఎలా వేరుచేసి గుర్తుంచుకోవాలో యెహోవాకు తెలుసని దైవ ప్రేరేపణతో దావీదు మనకు హామీ ఇస్తున్నాడు.

మనం దయగల మన పరలోక తండ్రిపట్ల విశ్వాసంగా ఉన్నంతకాలం, ఆయన మన సత్క్రియలను గుర్తుంచుకొని వాటిని విలువైనవిగా పరిగణిస్తాడు. నిజానికి, మనం చేసిన కార్యాలను, ఆయన నామమునుబట్టి చూపిన ప్రేమను మరవడాన్ని ఆయన అన్యాయమైన చర్యగా దృష్టిస్తాడని బైబిలు చెబుతోంది.​—⁠హెబ్రీయులు 6:​10.

“మొదటి సంగతులు గతించిపోయెను”

మానవజాతి వృద్ధాప్య సమస్యలను ఎదుర్కోవాలని దేవుడు సంకల్పించలేదని బైబిలు చూపిస్తోంది. ఆదిమ స్త్రీపురుషులైన మన మొదటి తల్లిదండ్రులు తమ సృష్టికర్తకు ఎదురుతిరిగిన తర్వాతే హానికరమైన వృద్ధాప్య పరిణామాలు మానవ జీవితంలో భాగమయ్యాయి. (ఆదికాండము 3:​17-​19; రోమీయులు 5:​12) కానీ పరిస్థితులు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగవు.

ముందే పేర్కొనబడినట్లుగా, వృద్ధుల నిరాదరణతోసహా నేడు మనం అనుభవిస్తున్న అనేక చెడు పరిస్థితులు, మనం ఈ విధాన “అంత్యదినములలో” జీవిస్తున్నామని రుజువుచేస్తున్నాయి. (2 తిమోతి 3:⁠1) వృద్ధాప్య, మరణాల హానికరమైన ప్రభావాలతోసహా పాపంవల్ల కలిగే ఫలితాలన్నిటినీ తీసివేయాలన్నది దేవుని సంకల్పం. బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన [దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను].”​—⁠ప్రకటన 21:⁠4.

వృద్ధాప్యంవల్ల కలిగే నొప్పులు, బాధలు దేవుని నూతనలోకంలో గతించిన విషయాలౌతాయి. వృద్ధుల నిరాదరణ సహితం గతించిపోతుంది. (మీకా 4:⁠4) మరణించి, దేవుని జ్ఞాపకంలో ఉన్నవారికికూడా పరదైసు భూమిపై జీవించే అవకాశం దొరికేలా, వారు తిరిగి జీవానికి తేబడతారు. (యోహాను 5:​28, 29) ఆ సమయంలో, యెహోవా దేవుడు వృద్ధులపట్లేకాక, ఆయనకు విధేయులుగా ఉన్నవారందరిపట్ల శ్రద్ధ చూపిస్తాడనే విషయం ఎన్నడూ లేనంతగా రుజువు చేయబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 5 కొందరు విధవరాండ్రు వృద్ధులు కాకపోవచ్చు. ఉదాహరణకు, దేవుడు యౌవనులైన విధవరాండ్రపట్ల కూడా శ్రద్ధ చూపిస్తాడనే విషయం లేవీయకాండము 22:⁠13లో చూపించబడింది.

^ పేరా 11 ఇది ఆయన అసలు పేరు కాదు.

[6, 7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ప్రేమను క్రియల్లో చూపించడం

యెహోవాసాక్షుల మధ్య వృద్ధులకు గౌరవం చూపించడంలో సంఘ పెద్దలు మాదిరినుంచుతారు. అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని వారు ప్రాముఖ్యమైనదానిగా పరిగణిస్తారు: “మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.” (1 పేతురు 5:2) వృద్ధుల అవసరాలపట్ల శ్రద్ధ చూపించడం దేవుని మందను కాయడంలో భాగం. కానీ, అలా శ్రద్ధ చూపించడంలో ఏమి ఇమిడివుంది?

వృద్ధులకు నిజంగా ఎటువంటి అవసరాలున్నాయో తెలుసుకోవడానికి వారిని అనేకసార్లు సందర్శించి, స్నేహపూర్వకంగా మాట్లాడవలసి ఉంటుంది, అంతేగాక దానికి చాలా ఓర్పు అవసరం. బహుశా వారికి కొనుగోలుచేయడంలో, శుభ్రంచేయడంలో, క్రైస్తవ కూటాలకు వెళ్ళిరావడంలో, బైబిలు, క్రైస్తవ సాహిత్యాలు చదవడంలో ఇంకా మరెన్నో విషయాల్లో సహాయం అవసరంకావచ్చు. సాధ్యమైనప్పుడు ఆచరించదగిన, ఆధారపడదగిన ఏర్పాట్లు చేసి, వాటిని అమలు చేయాలి. *

కానీ, సంఘంలోని ఒక వృద్ధ సహోదరుడు లేక సహోదరి ఆర్థిక సంక్షోభంలో ఉండి, సహాయం అవసరమైతే అప్పుడేమి చేయాలి? వారికి సహాయం చేయడానికి వారి పిల్లలు లేదా బంధువులు ఉన్నారేమో ముందు కనుక్కోవడం మంచిది. అలా చేయడం 1 తిమోతి 5:4లోని నిర్దేశానికి అనుగుణంగా ఉంటుంది. అక్కడ ఇలా చెబుతోంది: “అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.”

ఆ వృద్ధులు బహుశా ప్రభుత్వ సహాయం పొందడానికి అర్హులో కాదో తెలుసుకొనేందుకు సహాయం అవసరం కావచ్చు. బహుశా సంఘంలోని కొందరు ఆ పనిలో వారికి సహాయం చేయవచ్చు. వేరే ఏ మార్గం లేనప్పుడు, సంఘ సహకారం పొందేందుకు వారు అర్హులో కాదో పెద్దలు నిర్ణయిస్తారు. మొదటి శతాబ్దపు సంఘంలో, కొన్ని సందర్భాల్లో అలా చేయడం అనుమతించబడింది, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు తన తోటిసేవకుడైన తిమోతికి ఇలా వ్రాశాడు: “అరువది ఏండ్లకంటె తక్కువవయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై, సత్‌ క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు ఆతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.”​—⁠1 తిమోతి 5:​9, 10.

[అధస్సూచి]

^ పేరా 25 మరింత సమాచారం కోసం కావలికోట ఆగస్టు 1, 1994 సంచికలోని “వృద్ధులకు క్రైస్తవ ప్రేమను కనబర్చుట” అనే శీర్షిక చూడండి.

[5వ పేజీలోని చిత్రం]

అవసరంలో ఉన్న విధవరాండ్రపట్ల దొర్కా శ్రద్ధ చూపించింది.​—⁠అపొస్తలుల కార్యములు 9:​36-​39