దేవుని రాజ్యమంటే ఏమిటి?
దేవుని రాజ్యమంటే ఏమిటి?
మానవ చరిత్రారంభంలోనే మానవజాతికి ఎంతటి ఘోరమైన విపత్తు సంభవించిందో కదా! ఒక దేవదూత తనను సృష్టించిన దేవుని అధికారానికే వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటుదారుడు, నిషేధించబడిన పండును తినమని మొదటి స్త్రీయైన హవ్వను పురికొల్పాడు. ఆమెను, ఆమె భర్తయైన ఆదామును ఉద్దేశించి మాట్లాడుతూ ఆ దేవదూత ఇలా అన్నాడు: “మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.” (ఆదికాండము 2:16, 17; 3:1-5) తిరుగుబాటుదారుడైన ఆ దేవదూత అపవాది అని సాతాను అని పిలవబడ్డాడు.—ప్రకటన 12:9.
హవ్వ సాతాను మాటలకు అవధానం ఇచ్చిందా? బైబిలు మనకు ఇలా చెబుతోంది: “స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను.” (ఆదికాండము 3:6) అవును, ఆదిదంపతులైన ఆదాముహవ్వలు ఆ తిరుగుబాటులో సాతానుతో చేయికలిపారు. దానికి పర్యవసానంగా వారు పరదైసును కోల్పోవడమే కాక, తమ సంతానానికి కూడా దానిని లేకుండా చేశారు. నిత్యజీవపు నిరీక్షణతో పరిపూర్ణంగా పుట్టాల్సిన వారి పిల్లలు, పాపాన్ని, మరణాన్ని వారసత్వంగా పొందారు.—రోమీయులు 5:12.
విశ్వసర్వాధిపతియైన యెహోవా దేవుడు దానికి ఎలా స్పందించాడు? పాపాల క్షమాపణకు ఒక ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించాడు. (రోమీయులు 5:8) ఈ గడ్డు పరిస్థితితో వ్యవహరించేందుకు యెహోవా దేవుడు ఒక ప్రభుత్వ ఏర్పాటును కూడా చేశాడు. ఆ ఏర్పాటు “దేవుని రాజ్యము” అని పిలవబడుతోంది. (లూకా 21:31) దేవుని విశ్వ పరిపాలనకు అనుబంధంగా నెలకొల్పబడిన ఆ రాజ్యానికి ఒక నిర్దిష్ట సంకల్పం ఉంది.
దేవుని రాజ్యానికున్న సంకల్పమేమిటి? ఆ రాజ్యానికి సంబంధించిన కొన్ని విషయాలేమిటి, మానవ పరిపాలనకు దానికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటి? రాజ్య పరిపాలన ఎప్పుడు ప్రారంభమౌతుంది? ఈ ప్రశ్నలు, తర్వాతి ఆర్టికల్లో చర్చించబడతాయి.